ఖమ్మం కాంగ్రెస్.. ఏంటి ఈ పరేషాన్.!!

  కాంగ్రెస్ కి మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉండేది.. విభజన అనంతరం కూడా ఖమ్మంలో కాంగ్రెస్ బలం తగ్గలేదు.. 2014 ఎన్నికల్లో ఖమ్మం, మధిర, పాలేరు లాంటి అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి జిల్లా వ్యాప్తంగా పార్టీ కి బలముందని కాంగ్రెస్ రుజువు చేసింది.. తరువాత మారిన అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొందరు నేతలు కాంగ్రెస్ ని వీడి  అధికార పార్టీ తెరాసలో చేరారు.. ఆ నేతలైతే కాంగ్రెస్ ని వీడారు కానీ కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఇంకా బలంగానే ఉంది.. ఇది ఖమ్మం కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశమే.. అయితే ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.. కార్యకర్తలను ఇప్పుడు అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి.. ఖమ్మం కాంగ్రెస్ లో రేణుకా చౌదరి వర్సెస్ భట్టి పోరు నడుస్తుందా?.. రేణుక రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి భట్టి పోస్ట్ కి ఎసరు పెట్టబోతున్నారా?.. జలగం ప్రసాద్ తిరిగి కాంగ్రెస్ లోకి వస్తానంటే భట్టి అడ్డుపడుతున్నారా?.. ఇవే ఖమ్మం కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్నలు.. ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ రాజకీయం అంతా ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది.   రేణుకా చౌదరి గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసారు.. ఆమెకి జిల్లాలో మంచి పట్టుంది.. జాతీయ రాజకీయాల్లో సుపరిచితురాలు.. కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మంచి బంధం ఉంది.. అందుకే ఆమెని జాతీయ స్థాయి నేతగానే అందరూ భావిస్తారు.. అయితే ఇప్పుడు రేణుక దృష్టి రాష్ట్ర రాజకీయాలమీద పడినట్టు తెలుస్తోంది.. ఇకనుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆమె భావిస్తున్నారట.. అధిష్టానం కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న భట్టి స్థానంలో రేణుకను తీసుకోవాలని చూస్తున్నారట.. భట్టి రాష్ట్ర స్థాయిలోనే మరోపదవిని కట్టబెట్టాలని చూస్తున్నారట.. అయితే ఈ విషయంపై భట్టి మరియు ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెల్సుతుంది.. రాష్ట్ర కాంగ్రెస్ కూడా రేణుక జాతీయ రాజకీయాల్లో ఉండటమే కరెక్ట్ అని భావిస్తోందట.. రేణుక రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే సీఎం అభ్యర్థి అనే అవకాశం కూడా ఉందని రాష్ట్ర నాయకత్వం భయపెడుతుందట.. అందుకే రేణుకను జాతీయ రాజకీయాల్లోనే ఉంచాలని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావాలి చూస్తున్నట్టు తెలుస్తోంది.   మరోవైపు మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు జలగం ప్రసాద్ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని చూస్తుంటే భట్టి అడ్డుకుంటున్నారని వార్తలు వినిపించాయి.. కానీ భట్టి వర్గీయులు మాత్రం ఖమ్మంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మా నేతపై ఇలాంటి ఆరోపణలు చేయటం తగదు అంటున్నారు.. మరోవైపు రాష్ట్ర నాయకత్వం కూడా భట్టి మీద ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతుంది.. కాంగ్రెస్ పార్టీ బలం చూసి ఓర్వలేకే ప్రత్యర్థులు ఇలా వర్గాల పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. కార్యకర్తలను ఇంతగా వేధిస్తున్న ఖమ్మం రాజకీయంపై అధిష్టానం ఎప్పుడు దృష్టి పెడుతుందో?.. వీటికి పరిస్కారం ఎప్పుడు చూపుతుందో వేచి చూడాలి మరి.

మహిళ జీవితంలో నిప్పులు పోసిన తెలంగాణ సర్కార్

కంపెనీలు తమ ప్రొడక్ట్ క్వాలిటీ మీద కంటే ప్రకటనల మీదే ఎక్కువ శ్రద్ద చూపుతాయి.. అప్పుడే కదా వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ నలుగురు కొని నాలుగు డబ్బులు వచ్చేది.. అయితే ఈ ప్రకటనల పిచ్చి వ్యాపార రంగంలోనే కాదు, రాజకీయరంగంలో కూడా ఉంటుంది.. నాయకులు ఎన్నికల దగ్గర పడుతుంటే తమని తాము ప్రమోట్ చేసుకుంటూ ప్రకటనలు విడుదల చేసుకుంటారు.. అయితే అధికార పార్టీలు మాత్రం ప్రతి ప్రభుత్వ పథకానికి భారీగా ప్రకటనలు ఇస్తున్నాయి.. కొన్ని సార్లు ఈ ప్రకటనలు ప్రభుత్వాన్ని విమర్శలు పాలు చేస్తున్నాయి.. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.     రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం ప్రకటనలు ఇచ్చింది.. ఆ ప్రకటనల్లో ఓ ఫొటోలో ఒక మహిళ బాబుని ఎత్తుకొని ఉండగా పక్కన భర్త ఉన్నాడు.. మరో ఫొటోలో అదే మహిళ పక్కన మరో వ్యక్తి భర్త అన్నట్టుగా ఇంకో ప్రకటన ఇచ్చారు.. దీంతో ఈ ప్రకటనల పై బాగా ఛలోక్తులు వినిపించాయి.. ఒక మోడల్ ఫొటోతో ఇలా రెండు ప్రకటనలు చేసారుగా అంటూ నవ్వుకున్నారు.. కానీ నిజానికి ఆమె మోడల్ కాదు ఓ సాధారణ మహిళ.. ఈ ప్రకటనల మూలంగా నవ్వులు పాలైంది ప్రభుత్వం కాదు, ఓ మహిళ జీవితం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన పద్మ తన భర్త ఫొటోను మార్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.. ప్రస్తుతం యాదగిరి సమీపంలోని కొంగవల్లిలో ఉంటున్న తమ వద్దకు మూడు సంవత్సరాల క్రితం కొందరు వచ్చి కుట్టు మిషన్ లకి లోనులు ఇప్పిస్తామని ఫొటోలు తీసుకున్నారని ఆమె చెబుతోంది.     అయితే ఆ ఫోటోలు తీసుకున్నప్పటి నుండి తమకు రోజూ ఎదో ఒక అవమానం ఎదురవుతూనే ఉందని అసలు పొలమే లేని తమకు రైతుబందు పధకం కింద డబ్బులోచ్చాయని రూ. 4 వేలు ప్రభుత్వం నుంచి అందుకుని ఆనందంగా ఉన్నామని , ఆపై తాము కాపుసారా కాచుకుని, దాన్ని తాగేవాళ్లమని, ఇప్పుడు సారా కాయడం లేదని, ఆనందంగా ఉన్నామని చెబుతూ పేపర్లో ప్రకటన ఇచ్చారని తెలిపింది.. కంటివెలుగు ప్రారంభం సమయంలో తన భర్త ఫొటో బదులు వేరొకరి ఫొటో పెట్టారని ఆమె ఆరోపించింది. దాన్ని చూసిన తమ ఇంటిలో రోజూ గొడవలు అవుతున్నాయని రోడ్డు మీద అయితే అసలు తాను తలెత్తుకు తిరగలేకపోతున్నానని వాపోయింది.. ఈ విషయంలో అసలు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆ మహిళ వ్యక్తం చేసింది.. ప్రకటనల కోసం మహిళను ఇంత క్షోభకు గురిచేసిన ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా ఆమె గోడుని ఆలకిస్తారో లేదో. 

కేరళకు మోదీ సాయం సరిపోతుందా?

  వరద నీరు కేరళ ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.. భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రంలో ప్రాణ నష్టంతో పాటు, భారీ ఆస్తి నష్టం జరిగింది.. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. కేరళ ప్రజల బాధ చూసి దేశం మొత్తం చలించిపోతుంది.. కేరళకు అండగా మేమున్నాం అంటూ ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు.. సామాన్యుల నుండి సినిమావారి వరకు వారికి చేతనైనంత ఆర్ధిక సాయం వారు అందిస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేరళ రాష్ట్రానికి అండగా ఉంటాం అంటూ ముందుకి వస్తున్నాయి.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయిల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.. అయితే ఇలా ఎంతమంది సాయం చేసినా, కేరళ కన్నీటిని తుడవగలరు కానీ.. గుండెల్లో ఉన్న బాధని పూర్తిగా తొలగించలేరనేది వాస్తవం.. కేరళ బాధ, భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం చేసే సాయం మీదే ఆధారపడి ఉన్నాయి.. కానీ కేంద్రం మాత్రం కేరళకు సరైన సాయం చేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం మోదీ, కేరళ రాష్ట్రానికి 500 కోట్ల రూపాయిల తాత్కాలిక సాయాన్ని ప్రకటించారు.. ఇంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం తరఫున ప్రకటించిన సాయం100 కోట్లు రూపాయిలు దీనికి అదనం.. అయితే కేంద్రం ప్రకటించిన ఈ సాయంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.. కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల తాత్కాలిక సాయం ప్రకటించగానే కేరళ సీఎం పినరయి విజయన్ ట్వీట్‌లో స్పందించారు.. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 19,512 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని, వరద తగ్గుముఖం పట్టగానే అసలు నష్టం ఎంతనేది అంచనా వేస్తామని చెప్పారు.. తక్షణ సాయంగా 2,000 కోట్లు కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు.. మరోవైపు కేరళ ప్రజల్లో కూడా మోదీ ప్రకటించిన సాయంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.. 20 వేల కోట్లు ఆస్తి నష్టం జరిగితే, కనీసం 2 వేల కోట్ల తక్షణ సాయం అడిగితే, 500 కోట్లు ప్రకటించటం ఏంటంటూ మండిపడుతున్నారు.. గతంలో కాశ్మీర్, అస్సాం, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో వరదలు వచ్చి ఈ స్థాయిలో నష్టం జరగకున్నా వేల కోట్లు ప్రకటించి, దక్షిణ రాష్ట్రంపై మాత్రం ఇలా వివక్ష చూపటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.. మరి కేంద్రం మనస్సు మార్చుకొని సాయం పెంచుతుందేమో చూడాలి.

గ్వాలియర్ నుంచీ గాల్లో కలిసేదాకా… వాజ్ పేయ్ మహాప్రస్థానం!

డిసెంబర్ 25, 1924 – ఆగస్ట్ 16, 2018… ఒక శకం ముగిసింది! ఒక శకటం ఆగిపోయింది! కాలమనే కురుక్షేత్రంలో తనకు తానే కృష్ణుడై, తానే అర్జునుడై ఒక వీరుడు చేసిన యుద్ధం అంతమైంది! అటల్ బిహారీ వాజ్ పేయ్ మరణించారు! దిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన 93 వయస్సులో తుదిశ్వాస విడిచారు! ఎక్కడో గ్వాలియర్లో పుట్టిన ఒకానొక సాదాసీదా భారతీయుడు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టించారు! ఇంకేం కావాలి? హిందూ శాస్త్రాలు చెప్పిన సంపూర్ణ, పరిపూర్ణ జీవితం… ఈ హిందూత్వవాద కర్మ యోగి స్వంతం! రండి, ఒక సారి గ్వాలియర్ నుంచీ గాల్లో కలిసేదాకా ఈ కమలదళ భీష్మపితామహుని మహప్రస్థానం పరికిద్దాం…     1.    డిసెంబర్ 25, 1924న అవతరించారు అటల్ బిహారీ వాజ్ పేయ్! గ్వాలియర్ నగరంలోని ఓ సాదాసీదా భారతీయ కుటుంబం ఆయనది! 2.    మామూలుగా టీనేజ్ లో అందరూ ప్రేమలో పడతారు! కానీ, తన జీవిత కాలం భీష్మ పితామహుడిలా బ్రహ్మచారిగా మిగిలిన వాజ్ పేయ్ దేశంతో ప్రేమలో మునిగిపోయారు! టీనేజ్ లోనే ఆయన మొదట కమ్యూనిజం వైపు ఆకర్షితులై స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. తరువాత అది సరిపడదని గ్రహించి ఆరెస్సెస్ తో లీనమయ్యారు! అదే అటల్ బీహారీ వాజ్ పేయ్ అనే చరిత్రకు శ్రీకారం! 3.    1950లలో వాజ్ పేయ్ ఆరెస్సెస్ వారి పత్రిక ఒకటి నడిపారు. అందుకోసం తన న్యాయవాద విద్యని కూడా వదిలేశారు. లా కాలేజ్ నుంచీ బయటకు వచ్చి సంఘం సేవలో మునిగారు. మెల్లమెల్లగా ఆరెస్సెస్ లోని మితవాద బృందానికి ఆయన ముఖ్యగొంతుక అయ్యారు!       4.    కమ్యూనిజాన్ని వదిలి ఆరెస్సెస్ ను ఎంచుకున్న వాజ్ పేయ్ క్విట్ ఇండియా ఉద్యమంతోనే తన పోరాటాలు మొదలు పెట్టారు. అయితే, ఆయన జీవితంలో కీలక మలుపు మరో జాతీయ వాద నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పరిచయం వల్ల ఏర్పడింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపించారు. అదే తరువాతి కాలంలో భారతీయ జనతా పార్టీ అయింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రధాన అనుచరుడుగా వాజ్ పేయ్ కొనసాగారు… 5.    1953లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు! కాశ్మీర్లో ప్రవేశించటానికి భారతీయులకి ప్రత్యేక అనుమతి పత్రం అవసరమని నెహ్రు ప్రభుత్వం రూల్ పెట్టింది. ఈ ఐడెంటిటి కార్డు రాజకీయాల్ని నిరసిస్తూ ముఖర్జీ నిరాహార దీక్ష చేశారు. వాజ్ పేయ్ ఆయన పక్కనే వున్నారు! అదే ఆయనలో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. తరువాత శ్యామా ప్రసాద్ ముఖర్జీ డిమాండ్ చేసినట్టు కాశ్మీర్ లోకి అనుమతి పత్రాలు వుంటేనే ప్రవేశం అనే నిబంధన తొలిగింది. కానీ, ఆ మహానేత తరువాత కొన్నాళ్లకే మరణించారు. ఇది కూడా వాజ్ పేయ్ ని తాను నమ్మిన జాతీయ వాద, హిందూత్వ సిద్దాంతానికి మరింత దగ్గర చేసింది. ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్ పేయ్ ముందుకు సాగుతూ వచ్చారు… 6.   1957లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రేరణతోనే వాజ్ పేయ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కాలు పెట్టారు! ఎంపీగా గెలిచి పార్లమెంట్లో ప్రవేశించారు!1 7.   1957 నుంచీ 2009 వరకూ అటల్ ఏకబిగిన పదిసార్లు గెలుస్తూనే వచ్చారు ప్రజాప్రతినిధిగా! అర్థ శతాబ్దం పాటూ ఆయన లేకుండా మన పార్లమెంట్ వుండేదే కాదు! అంతగా స్వతంత్ర భారతంలో ఆయన అంతర్భాగం అయ్యారు! 8.   నెహ్రు కాలంలోనే కాంగ్రెస్ ను ఢీకొట్టి హిందూత్వ రాజకీయాలు నెరిపిన జాతీయ వాది వాజ్ పేయ్! చివరకు ఆయనే అయిదేళ్లు దిగ్విజయంగా భారతదేశాన్ని ఏలిన తొలి కాంగ్రేసేతర ప్రధాని అయ్యారు! 9.   వాజ్ పేయ్ ప్రధాని ప్రస్థానం అంత తేలిగ్గా జరగలేదు. సెక్యులర్ పార్టీల అవకాశవాద రాజకీయాలు బీజేపీని అప్పట్లో అంటరాని పార్టీగా చూసేవి! అందువల్ల సరైన సంఖ్యాబలం లేక తొలిసారి 1996లో 13 రోజులకే పదవి నుంచీ దిగిపోవాల్సి వచ్చింది వాజ్ పేయ్!     10.  1998లో మరోసారి ప్రధాని అయినా… 13 నెలల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జయలలిత మద్దతు ఉపసంహరణతో కేవలం ఒకే ఒక్క ఎంపీ ఓటు లోటుగా వుండి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయినా ధర్మం వైపే నిలిచారు కానీ… వాజ్ పేయ్ ఇతర పార్టీల ఎంపీలతో బేరసారాలు చేయలేదు! 11.    ఆయన సహనానికి, ధర్మ నిరతకి దైవం కూడా మెచ్చింది! ఎట్టకేలకు 1999లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది! ఈసారి వాజ్ పేయ్ ప్రధాని అయ్యారు! చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ కు చెందని నాయకుడు అయిదేళ్లు విజయవంతంగా దేశాన్ని పరిపాలించాడు! కొత్త శతాబ్దంలో కొత్త చరిత్ర రచన జరిగింది! 12.   వాజ్ పేయ్ ప్రధానిగా ప్రోక్రన్ అణు పరీక్షలు జరిపి ప్రపంచానికి సరికొత్త భారతదేశాన్ని ఆవిష్కరించారు! పాకిస్తాన్ కు గుణపాఠాలు, చైనాకు పాఠాలు నేర్పారు! వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని సాహసం వాజ్ పేయ్ తన అయిదేళ్ల పాలనలో చేసి చూపారు! అంతర్జాతీయంగా ఇండియా ధీటైన శక్తిగా మారింది! 13.   అతివాద హిందూ శక్తుల నుంచీ ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గని వాజ్ పేయ్ లాహోర్ బస్సు యాత్ర చేసి పాకిస్తాన్ కు స్నేహ హస్తం చాచారు. కానీ, దాన్ని దుర్వినియోగం చేసిన ఉగ్రవాద దేశానికి కార్గిల్ సమయంలో గట్టిగా బుద్ది చెప్పారు! పాక్ పై యుద్ధంలో దేశాన్ని గెలిపించిన తొలి కాంగ్రేసేతర ప్రధాని కూడా వాజ్ పేయే! 14.  చిరకాల మిత్రుడు అద్వాణీతో కలిసి రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ వాజ్ పేయ్ ముస్లిమ్ లకు , ఇతర మైనార్టీలకు, సెక్యులర్ పార్టీలు, నాయకులకి… అభ్యంతరం లేని నేతగా ఎదుగుతూ వచ్చారు! ఆయనని చాలా మంది రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనటమే ఇందుకు నిదర్శనం! ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన హిందూత్వవాదులకి , కానీ వారికి కూడా మిత్రుడైన ఆజాతశత్రువు! 15.   మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలోనే విదేశాంగ శాఖా మంత్రిగా వున్న ఆయన ఐక్య రాజ్య సమితి సమావేశంలో తన చారిత్రాత్మక హిందీ ప్రసంగం చేశారు! ఆ తరువాత కూడా ఆయన ఎన్నో చరిత్రాత్మక ఉపన్యాసాలు సభ లోపల, వెలుపల చేశారు! అద్భుత ఉపన్యాసకుడైన వాజ్ పేయ్ కవి కూడా! ఆయన కవితల్లో , మాటల్లో అవలీలగా జీవిత తాత్వికత, భారతీయత పొంగిపొర్లుతుంటాయి!

వాజ్ పేయ్ విషయంలో బీజేపీ నేతల వివాదాస్పద ట్వీట్లు!

వాజ్ పేయ్ ఎయిమ్స్ లో వున్నారు! అశేష భారత ప్రజానీకం బాధలో వున్నారు! ఆయన కమలదళానికి చెందిన కాషాయనేతే అయినా… అజాతశత్రువు. అందుకే, ఆయనంటే పడని వారంటూ ఎవరూ లేరు. ఆయన వాదనలు, సిద్ధాంతాలు నచ్చనివారు వుంటారేమో కానీ ఆయనని వ్యక్తిగతంగా ద్వేషించే వారు అస్సలు వుండరు. ఆ వ్యక్తిత్వం కారణంగానే వాజ్ పేయ్ తన సుదీర్ఘమైన ప్రస్థానం తరువాత కూడా మచ్చలేకుండా మిగిలారు. కానీ, ఇప్పుడు స్వయంగా బీజేపీ నేతల ట్వీట్లే జనాల బాధని మరింత పెంచుతున్నాయి. వాళ్లది తొందరపాటా లేక నిర్లక్ష్యమా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పోనీ తప్పులు చేస్తోంది ఏ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారా అంటే అదీ కాదు. వాజ్ పేయ్ స్వంత పార్టీ వారైన బీజేపీ సీనియర్ నేతలే!     వాజ్ పేయ్ మరణించారు. నేను తీవ్రంగా విషాదాన్ని వ్యక్తం చేస్తున్నా అనేశారు తథాగత రాయ్! ఎవరీయనా అంటారా? బీజేపీకే చెందిన నేత. పైగా త్రిపుర గవర్నర్ కూడా! రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్న ఆయనకు అంత తొందర ఎందుకు? వాజ్ పేయ్ ఇంకా ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారనే మీడియా చెబుతోంది. ఏ ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ వాజ్ పేయ్ మరణించారని బ్రేకింగ్ వేయలేదు. అయినా ఒక గవర్నర్ అయి వుండి దేశానికి ఎంతో సేవ చేసిన స్వంత పార్టీ అత్యున్నత నేతని పట్టుకుని నిర్లక్ష్యపు ట్వీట్లు ఎందుకు? తథాగత రాయ్ కే తెలియాలి!     బీజేపీ నియమించిన గవర్నర్ గా వున్న తథాగత రాయ్ చేసిన తప్పును త్వరగానే తెలుసుకున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పారు. అయినా కొందరు నెటిజన్లు మండిపడ్డారు. సరిగ్గా తెలుసుకోకుండా తొందరపాట్లు ఎందుకంటూ! అయితే, అంతలోనే మరో బీజేపీ నేత షాకిచ్చారు దేశానికి! ఈసారి వాజ్ పేయ్ మరణం నన్ను తీవ్రంగా బాధించిందంటూ వాపోయిన వ్యక్తి యడ్యూరప్ప! దక్షిణాదికి చెందిన ఏకైక బీజేపీ మాజీ చీఫ్ మినిస్టర్ ఈయన! యెడ్డీ కూడా ట్విట్టర్ లో నోరు జారారు! వాజ్ పేయ్ ఇంకా తుది శ్వాస వదలక ముందే ఆయన లేని నష్టం పూడ్చలేనిదంటూ మొదలెట్టేశారు! అసలు ఏంటి ఈ గోల? పొరపాటున ఏదో ట్వీట్ చేయటం ఎవరికైనా జరిగేదే. కానీ, వాజ్ పేయ్ లాంటి మహోన్నతమైన నేత మృత్యువుతో పోరాడుతుంటే ఆయన అభిమానులు, శ్రేయోబిలాషులపై క్రూరమైన ప్రయోగాలు అవసరమా? తప్పు చేసి ట్వీట్ డిలీట్ చేసి సారీ అంటే సరిపోతుందా? ఏదో అనివార్య పరిస్థితిలో తప్పుడు ట్వీట్ చేయటం వేరు! బీజేపీ వాళ్లు తమ స్వంత నాయకుడి మరణ వార్త చెప్పటానికి అంత తొందరపడిపోవటం ఎందుకు? వార్తని బ్రేక్ చేసి జనానికి అందించటానికి మీడియా ఛానల్స్ వున్నాయి  కదా? ట్విట్టర్లో బతికి వున్న వారికే నివాళులు అర్పిస్తూ జనాల మనోభావాలతో ఆడుకోవటం దేనికి?   తథాగత రాయ్, యడ్యూరప్ప చేసిన పొరపాట్లు మరెవరూ ఇప్పుడే కాక ఇక ముందు కూడా చేయకపోతే ఎంతో మంచిది! ఒక తొందరపాటుతో చేసే నిర్లక్ష్యపు ట్వీట్ ఎందరికో మనస్తాపం కలిగిస్తుంది!

లోకేష్ ఒక కోడిగుడ్డు అందించారు! విజయసాయి ఈకలు పీకారు!

కోడి గుడ్డు మీద ఈకలు పీకటం… ఈ సామెతకు తగిన న్యాయం చేయటం కోసం మన దేశంలో చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అందులో ముందు వరసలో వుంటారు ఏపీ ప్రతిపక్ష నేతలు! మరీ ముఖ్యంగా, జగన్ తరువాత పార్టీలో నెంబర్ టూ అంటూ చెప్పుకునే మన A2 విజయసాయి రెడ్డివారు! ఆయన వృత్తి రిత్యా ఉన్నతమైన చదువుతో చార్టెడ్ అకౌంటెంట్ అయినా పాలిటిక్స్ లో మాత్రం ఊర మాస్ అన్నట్టుగా వ్యవహరిస్తారు. పెద్దల సభలో సభ్యుడుగా వుండి కూడా విమర్శల దగ్గరికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నారో తెలియనంత పూనకంతో ఊగిపోతారు! ఇందుకు ఇంత కాలం చంద్రబాబు టార్గెట్ గా వుండే వారు. తాజాగా విజయసాయి రెడ్డి హిట్ లిస్ట్ కొత్త వారొచ్చి చేరుతున్నారు. యధావిధిగా చంద్రబాబు తనయుడు లోకేష్ ఎలాగూ బాధితుడు అయ్యారు!       విజయసాయి రెడ్డి తొందరపాటు మాటలు ఎలా వుంటాయో తెలియాలంటే ఆయన ఈ మధ్య రాజ్యసభలో చేసిన హంగామా గుర్తు చేసుకోవాలి! ఆయన నేరుగా రాజ్యసభ చైర్మన్నే టార్గెట్ చేశారు. మన తెలుగు వాడు, దశాబ్దాలుగా వివాద రహిత రాజకీయం చేస్తోన్న కాషాయ నేత … వెంకయ్య నాయుడుని ఆడిపోసుకున్నారు. ఆయన సభాపతిగా తనకు అన్యాయం చేశారట. తగినంత సమయం మాట్లాడేందుకు ఇవ్వటం లేదని నిండు సభలో ముఖం మీదే చెప్పేశారు! అసలు అలాంటి పదవిలో వున్న వారిపై అలా మాట్లాడవచ్చా? నిజంగా అలా దిగజారి ప్రవర్తించే వ్యక్తేనా వెంకయ్య? ఇవేవీ విజయసాయి పట్టించుకోలేదు!   వెంకయ్య నాయుడ్ని నానా మాటలు అందరి ముందూ అనేశాక … తీరిగ్గా ఆయన కార్యాలయంలోకి వెళ్లి సారీ చెప్పేశారు విజయసాయి! కానీ, వ్యవహారం సద్దుమణగకపోవటంతో తెల్లారి మళ్లీ సభలో విజయసాయి తన పరుషమైన మాటలకి వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పటం లేదని గ్రహించిన వెంకయ్య అతడ్ని అలా వదిలేసి తరువాతి కార్యక్రమంలోకి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. సభాపతికి మరింత ఆగ్రహం కలిగిందని గ్రహించిన విజయసాయి ఇక చేసేది లేక బేషరతుగా సారీ చెప్పి కూర్చున్నారు! అసలు ఇంత రచ్చ ఎందుకు జరిగింది? విజయసాయి వారికి నోటిపై అదుపు లేక! ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాక మరోసారి ఆయన తన నైజం బయటపెట్టుకున్నారు! ఇంకా సరైన రాజధాని లేని నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు ఒక్క యేడు ఒక్కో ప్రాంతంలో జెండా వందనం చేస్తున్నారు. ఈసారి శ్రీకాకుళంలో బాబు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు కూడా ఎవరికి వీలైన చోట వారు జాతీయ జెండా ఆవిష్కరించారు. పాపం విజయసాయి రెడ్డి ఆయన ఎక్కడ జెండా వందనం చేశారోగానీ టీవీల్లో టీడీపీ నాయకుల కార్యక్రమాలన్నీ తీరిగ్గా లైవ్ చూసి వుంటారు! చంద్రబాబు మొదలు ఏ చిన్న నాయకుడి కార్యక్రమంలోనూ ఆయనకు కోడిగుడ్డుగానీ, ఈకలు దొరకలేదు! సో… లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. ట్విట్టర్ లో తాను సేకరించిన ఈకల్ని జనం ముందు ఉంచారు!     లోకేష్ తన ఇంటిపైనే జెండా వందనం చేశారు. పోలీసు వందనం కూడా అక్కడే స్వీకరించారు. ఇది అధికార దుర్వినియోగం అంటూ సెలవిచ్చారు విజయసాయి రెడ్డి! దీంట్లో లాజిక్ ఏంటో ఆయనకే తెలియాలి. అసలు జెండా వందనం చేయకపోతే తప్పుగానీ గౌరవంగా ఏదో ఒక చోట చేస్తే తప్పేంటి? పోనీ ఆయన ముఖ్యమంత్రి కాదు కదా? మరి ఆయన ప్రత్యేకంగా ఎక్కడ జెండా వందనం చేయాలి అని రాజ్యాంగం చెప్పిందా? అలాంటిదేం లేదే! మరెందుకు విజయసాయి రెడ్డి వారికి ఆవేశం? రాష్ట్ర విభజన జరిగాక ఒక్కసారి మనం అటు తెలంగాణలోకి తొంగి చూస్తే… సీఎం కేసీఆర్ ప్రతీ ఏటా గోల్కొండ కోటపై నుంచీ జెండా వందనం చేస్తున్నారు! అలాంటి శాశ్వత సౌకర్యం ఏపీకి లేదు! ఇదీ విజయసాయి బాధపడాల్సిన విషయం! అమరావతి ఎంత త్వరగా పూర్తవుతే అంత ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఆయన చెబితే , సూచిస్తే బావుండేది. అలా కాకుండా లోకేష్ అనుకోకుండా అందించిన ఓ కోడిగుడ్డు పట్టుకుని దానిపై ఈకలు పీకటం… ఆయనకే చెల్లింది! 

మంత్రాలకు చింతకాయల్లాగే… పంచులకు ఓట్లు రాలవు!

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావచ్చా? ఖచ్చితంగా రావచ్చు! కాకపోతే , సినిమాల్లో వున్నప్పుడు వాళ్లు అటెండ్ అయ్యే ఆడియో రిలీజ్ వేడుకలు వేరు… రాజకీయ బహిరంగ సభలు వేరు! ఈ తేడా అర్థం చేసుకుని కాస్త పరిణతితో మాట్లాడాలి. సినిమాల్లో వున్నప్పుడు సినిమా హీరోలు వేదిక మీద నుంచీ ఏం మాట్లాడినా ఈలలు వేస్తారు. కాకపోతే వాళ్లెవరూ ఓటర్లు కారు. ఫ్యాన్స్! అభిమానులకి హీరో తుమ్మినా, దగ్గినా నచ్చుతుంది. ఇక పంచ్ డైలాగ్ లు చెబితే వార్ని ఆపగలమా? అదే ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుకల్లో హుషారుకి కారణం! రాజకీయ బహిరంగ సభలు, పాదయాత్రల్లో సినిమా హీరోలు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే అప్పటికప్పుడు ఈలలు రావచ్చు కానీ… తరువాత మాత్రం గోలలే మిగులుతాయి. ఈ సత్యం గతంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు తెలుసుకోలేదు. తాజాగా జనసేనాని పవన్ కూడా గ్రహించటం లేదు!     పవన్ పబ్లిక్ లో మాట్లాడితే ఎలా వుంటుందో ప్రజారాజ్యం కాలంలోనే తెలిసిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ నేతల పంచెలూడగొట్టాలంటూ పంచ్ డైలాగ్ లు వేశాడు. తరువాత ఆ మధ్య కేసీఆర్ తాట తీస్తానన్నాడు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి పొలిటీషన్ అవతారం ఎత్తాక మరిన్ని బాంబులు పేలుస్తున్నాడు ఈ ఆరు అడుగుల బుల్లెట్! కానీ, వాటి వల్ల ఎంత వరకూ ఓట్లు రాలుతాయి? ఇదీ జనసేనాని వేసుకోవాల్సిన ప్రశ్న! బహుశా ఆయన జాతీయ స్థాయిలో రాహుల్, రాష్ట్ర స్థాయిలో జగన్ని ఆరద్శంగా తీసుకుంటున్నారేమో! అందుకే, ఎవరి మీదంటే వారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. అదీ తన ఇష్టానుసారమైన భాషలో! వాటికి ఎలాంటి ఆధారాలు కూడా వుండవు. అందుకే, చివరకు టీడీపీ నేత ఒకాయన విసిగిపోయి పవన్ అంటే గాలి అని… ఆయనవన్నీ గాలి మాటలనీ తేల్చేశారు! ఇదే ఫీలింగ్ ఓటర్లకు కలిగితే… ఇప్పుడు వినిపించే విజిల్సే మిగులుతాయి తప్ప విజయాలు కాదు!     చంద్రబాబును, లోకేష్ ను తిడుతూ జగన్ తో బాటూ ప్రతీ రోజూ రోడ్డు మీదే వుంటోన్న పవన్ ఎప్పటికప్పుడు అసందర్భపు విమర్శలు చేస్తూనే వున్నారు. జనసేన అధ్యక్షుడిగా ఆయన సీఎంను, మినిస్టర్ అయిన లోకేష్ ను విమర్శించవచ్చు. కానీ, దానికి ఓ పద్ధతంటూ వుంటుంది కదా? అదేం లేకుండా తనకు ఆ రోజు ఏది గుర్తుకు వస్తే అది ప్రయోగిస్తుంటాడు పవన్! తాజాగా వున్నట్టుండీ… లోకేష్ కు హితబోధ చేశాడు. ఆయన కెనడీ, అబ్రహం లింకన్, గాంధీ జీ వంటి వార్ని ఆదర్శంగా తీసుకోవాలట! చంద్రబాబును కాదట. చంద్రబాబు వెన్నుపోటుదారుడని పరమ రోటీన్ గా ఓ విమర్శ విసిరేశాడు. అసలు లోకేష్ చేసిన తప్పేంటి? చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆయన ఏపీ ప్రజలకు చేసిన హాని ఏంటి? పవన్ వద్ద దేనికీ సరైన సమాధానం వుండదు. లోకేష్ అవినీతి అంటూ ఊగిపోతుంటాడు. అది నిజమే అయితే ఒక్కటంటే ఒక్క కేసులోనైనా కోర్టుకి వెళ్లొచ్చు కదా? పోనీ మీడియా ముందు నీ దగ్గరున్న ఆధారాలు పెట్టొచ్చు కదా? లోకేష్ అవినీతి చేశాడని చెప్పటమే తప్ప ఏనాడూ దానికి ఆధారం చూపిన పాపాన పోవటం లేదు మన గబ్బర్ సింగ్! ఇలా చేస్తే రేపు ఓటు వేయటానికి బయలుదేరిన జనం ఎలా నమ్ముతారు?     గతంలో ఓ సారి కాకినాడలో సభ పెట్టిన పవన్ తెలంగాణ చరిత్ర మొత్తం చెప్పాడు! కాకినాడ జనానికి తెలంగాణ చరిత్రకి ఏంటి సంబంధం? ఇప్పటికే అలాగే మాట్లాడుతుంటాడు! జగన్ తన మూడు పెళ్లిల్ల గురించి ఓ సారి మాట్లాడాడు. తరువాత ఆయన సైలెంట్ అయిపోయాడు. పవన్ మాత్రం మళ్లీ మళ్లీ దాన్ని గుర్తు చేసుకుని స్పందిస్తున్నాడు. తనతో వుండటం కష్టమని తానే చెప్పుకున్నాడు. అందుకే, తనని వదిలేసి వెళ్లిపోయారనీ, మూడు పెళ్లిల్లు చేసుకోవటం తన ఖర్మ అని అంటున్నాడు. ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం. ఆయన పెళ్లిల్లపై ఎవరూ కామెంట్ చేయక్కర్లేదు. కానీ, అదే సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు పవనే స్వయంగా తన ట్రిపుల్ మ్యారేజ్ వ్యవహారం డిస్కస్ చేస్తుంటే … అది చివరకు హాస్యంగా మారిపోతుంది! అసలు ఒక పార్టీకి అధినేతగా వుండి ఎలా మాట్లాడాలో పవర్ స్టార్ ఎవరి వద్దైనా ట్యూషన్ పెట్టించుకుంటే మంచిది! జనాన్ని ఆకర్షించే ప్రయత్నంలో వున్నప్పుడు పీఆర్ చాలా ముఖ్యం. మోదీ లాంటి వారే తగిన శిక్షణ, జాగ్రత్తలు తీసుకుంటారంటారు. పవన్ కూడా ఆ పని చేయాలి! లేదంటే పసలేని ఆరోపణలు చేసిన ఈ యాత్రలు, బహిరంగ సభలన్నీ … ఫ్లాప్ సినిమాకు ముందు అట్టహాసంగా జరిగే ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల్లా యూట్యూబ్ లో మిగిలిపోతాయి!

ఆంధ్రులారా మీరెటు వైపు... !?

తెలంగాణలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాకతో ఎన్నికల కాక మరింత వేడిక్కింది. అటు అధికార తెలంగాణ రాష్ర్ట సమితి కూడా మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు, వ్యూహాలు రచిస్తోంది. రాహుల్ గాంధీ ఇలా హైదరాబాద్ రాగానే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన రాష్ట్ర కార్యవర్గాన్ని పిలిపించాలరు. రెండు గంటలకు పైగా వారితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోకముందే ఎన్నికలకు వెళ్లాలని తీర్మానించారు. అలాగే అభ్యర్ధులను కూడా వచ్చే నెలలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇంతే కాదు.... ఎన్నికల సమరంలో ఒంటరి పోరే అన్నారు. ఇదంతా చూస్తుంటే ఆయనకు ఈ ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని అర్ధం అయినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ హడావుడి సమావేశాలు.... బహిరంగ సభలకు సన్నాహలు అని పరిశీలకులు అంటున్నారు.      తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల కన్ను సెటిలర్లపైనే పడింది. అది కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్లపైనే ఉంది. వారి మద్దతు ఎవరికి ఉంటే వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలింది. హైదరాబాద్‌లో పాతబస్తీ మినహా సిటీలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రుల ఓట్లు ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగానే ఉన్నారు. వారి ఓట్లు అన్ని పార్టీలకు కీలకం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఒకింత ముందుగానే ఇక్కడి సెటిలర్లను ఆకట్టుకునే పని ప్రారంభించింది. అంతే కాదు... కొన్ని స్ధానాల్లో సెటిలర్లకు టిక్కట్లు కేటాయిస్తామని కూడా ప్రకటించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశం. ఆ పార్టీ వారు ప్రకటించినట్లుగా హైదరాబాద్‌లో కొన్ని స్ధానాల్లో ఆంధ్రులను ఎన్నికల బరిలో నిలిపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది పరిశీలకుల అంచనా. తెలంగాణలో దాదాపు 50 నుంచి 70 లక్షల మంది వరకూ సెటిలర్లు ఉన్నారు. వారి ఓట్లే ఇప్పుడు కీలకంగా మారాయి.     కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ ఓటు ఉండనే ఉంది. ఆ ఓట్లు కాంగ్రెస్‌వే అని వారి నమ్మకం. ఇక సెటిలర్లు తమకు ఓట్లు వేస్తే అధికారం ఖాయమనే ధీమాలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకలు. అందుకే వారి ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అక్కడ స్విచ్ వేసి తెలంగాణలో అధికార దీపాన్ని వెలిగించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కన్నేసింది. ఇక్కడున్న ఆంధ్రుల ఓట్లను కొల్లగొట్టి తిరిగి అధికారంలోకి రావాలన్నది వారి ఆశ. ఇంతకు ముందు హైదరాబాద్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రుల మద్దతు ఊహించని విధంగా టిఆర్ఎస్ వచ్చింది. దీంతో వారు అనుకున్న, ఆశించిన స్ధానాల కంటే ఎక్కువ స్ధానాల్లోనే విజయం వరించింది. అయితే ఇప్పుడు పరిస్ధితులు మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఆంధ్రులలో సానుకూలత వ్యక్తం కావడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మంత్రులు, ఎంపీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇక్కడి సెటిలర్లలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఈసారి ఆంధ్రులు దూరంగా ఉంటారనే వార్తలూ వస్తున్నాయి. ఈ కీలక సమయంలో ఆంధ్రులు ఎటువైపు ఉంటారో వారినే విజయం వరించే అవకాశం ఉంది. అందుకే ఆంధ్రులారా మీరెటు వైపు అని అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూపులు చూస్తున్నాయి. ఈసారి మాత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గెలుపు అంత సులువేం కాదని ఆయన ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం... అనంతర విలేకరుల సమావేశం చెప్పకనే చెబుతున్నాయి.  

అన్నాడీఎంకే అయిపోయింది... ఇప్పుడిక డీఎంకే వంతు… బీజేపీ తంతు!

ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోన్న రాష్ట్రం దేశంలో ఏదైనా వుందంటే… అది తమిళనాడే! చాలా రాష్ట్రాలకు చాలా చాలా సమస్యలుండవచ్చు. కానీ, తమిళనాడుకు మాత్రం అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు జయలలితని వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కరుణ, జయల మధ్య దోబూచులాడే అక్కడ సీఎం పీఠం తొలిసారి సంప్రదాయం తప్పింది. ఓ సారి డీఎంకేకి, మరోసారి అన్నాడీఎంకేకి అధికారం ఇచ్చేవారు ఎందుకోగాని జయలలితకు రెండోసారి మారు వెంటవెంటనే పవర్ ఇచ్చేశారు. కానీ, బ్యాడ్ లక్ … ఆమె కొన్ని నెలలకే మంచం పట్టారు. అక్కడ్నుంచీ తమిళనాడు అభివృద్ధి కూడా మంచం పట్టింది. నానా రచ్చైపోతోంది రాష్ట్రం…     జయలలిత లాంటి స్ట్రాంగ్ లీడర్ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చాలా మేలు జరిగేది. కానీ, ఆమె హఠాత్తుగా ఆనారోగ్యం పాలై చనిపోవటంతో దిశా, దశా లేకుండా పోయాయి. మధ్యలో అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపట్టాలన్న వివాదం చాలా కాలం పెద్ద సంక్షోభంగా మారింది. కొన్నాళ్లు పన్నీర్ చుట్టూ, మరికొంత కాలం పళని చుట్టూ, తరువాత శశికళ చుట్టూ, ఆ తరువాత దినకరన్ చుట్టూ లైమ్ లైట్ కొనసాగింది. అందరి దృష్టి ఎవరి మీద వున్నా జనం మాత్రం నష్టపోతూనే వున్నారు. ఓ సారి తమిళ రైతులు దిల్లీ వీధుల్లో నిరసనలకు దిగితే మరో సారి ఏకంగా కాల్పులే జరిగాయి. అమాయకులు మరణించారు. ఇలా రోజుకో గొడవతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇక అంతలోనే… ఇప్పుడు కరుణానిధి మృతి మరో రాజకీయ గందరగోళానికి తెర తీసేలా కనిపిస్తోంది!     తమిళనాడు అంటే డీఎంకే, అన్నాడీఎంకేలే! గత కొన్ని దశాబ్దాలుగా ఇదే తంతు నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సహా పెద్ద పార్టీలు, చిన్న పార్టీలు ఏవీ చెన్నై పాలిటిక్స్ లో నిలవలేకపోయాయి. అంతలా జయ, కరుణా చక్రం తిప్పారు. కానీ, ఇప్పుడు వారిద్దరూ లేకపోవటంతో రాష్ట్రం బిక్క మొఖం వేసుకుని నిలబడిపోయింది. అంతకంటే దారుణం జయ పార్టీ, కరుణ పార్టీ రెండూ చీలికలు , పీలికలు అయ్యేలా వున్నాయి. ఇదే ఇప్పుడు తమిళనాడు భవిష్యత్ ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. జయ మరణం తరువాత పార్టీని హైజాక్ చేయాలనుకన్న శశికళ వర్గం సక్సెస్ కాలేకపోయింది. అందుకు ప్రధాన కారణం దిల్లీ నుంచీ మోదీ, అమిత్ షా తమదైన స్టైల్లో రాజకీయం చేయటమే! ఇప్పుడు పన్నీర్, పళని నేతృత్వంలో కొనసాగుతున్న అన్నాడీఎంకే గత జయలలిత తాలూకూ పార్టీ కాదన్నది సుస్పష్టం. ఎన్నికలు వస్తే ఇంతకు ముందు జయలలితను చూసి ఓటు వేసిన వారెవరూ అన్నాడీఎంకేకు వేయరు. కాబట్టి రానున్న కాలంలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. పన్నీర్, పళని లాంటి నాయకులెవరూ జనంలో భారీ ఫాలోయింగ్ వున్న వారు కాదు…     డీఎంకే పరిస్థితి అన్నాడీఎంకే అంత దారుణం కాకపోయినా అందులోనూ ముసలం పుట్టే ఛాన్స్ వుంది. కరుణ పెద్ద కుమారుడు అళగిరి అప్పుడే పరోక్ష వ్యాఖ్యానాలు మొదలు పెట్టాడు. తన వెంట బోలెడంత మంది వున్నారంటూ వివాదానికి సై అంటున్నాడు. కానీ, స్టాలిన్ తండ్రి బతికి వుండగానే పార్టీపై పట్టు సాధించేశాడు. అంటే, అళగిరి, స్టాలిన్ గొడవకు దిగితే డీఎంకే రెండుగా చీలే ఛాన్స్ ఖచ్చితంగా వుంటుంది. ఇద్దరిలో అంతిమ విజయం ఎవరిదన్నది పక్కన పెడితే అమిత్ షా నేతృత్వంలోని బీజేపీకి కావాల్సిందే ఇది! అన్నాడీఎంకేలో మాదిరిగా డీఎంకేలోనూ ముసలం పుడితే కమలనాథులు అమాంతం పావులు కదుపుతారు. అళగిరి , స్టాలిన్ ల నడుమ తమకు వీలైనంత ఆజ్యంపోస్తారు! అప్పుడిక డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ బలహీనం అవ్వటం గ్యారెంటీ!     శశికళ వల్ల అన్నాడీఎంకేకి జరిగిందే అళగిరి వల్ల డీఎంకేకూ జరిగితే… బీజేపీ పండుగ చేసుకోవటం ఖాయం. ఎందుకంటే, తమకు స్వంతంగా సీట్లు రాకున్నా రజినీ చేత పార్టీ పెట్టించి ఆయన్ని సీఎంను చేసి చక్రం తిప్పాలనుకుంటున్నారు మోదీ, షా. కరుణానిధి మృతి వారికి కలిసొచ్చిన అవకాశంగా మారింది. ఇప్పుడు అళగిరి తాజా వ్యాఖ్యలు మరింత సంక్షోభాన్నే సూచిస్తున్నాయి. బహుశా రజినీకాంత్ సీఎం అయ్యేదాకా ఈ గందరగోళం తమిళ తంబీలకు తప్పదేమో! లేదంటే స్టాలిన్ తన రాజకీయ చాతుర్యాన్ని, సత్తాని వచ్చే పార్లెమంట్ ఎన్నికల్లో చాటాలి. అప్పటిదాకా అయితే మాత్రం … ఈ తమిళ పడం ( తమిళ సినిమా ) ఇలాగే కొనసాగుతూ వుంటుంది!

చంద్రబాబు.. లోకేష్ అయిపోయారు… ఇప్పుడిక వైసీపీ టార్గెట్ బ్రాహ్మణి!

ఎన్నికలకి ఇంకా ఎంత టైముంది? ఏపీ అసెంబ్లీ ఎన్నికలకైతే చాలా నెలలే వుంది. వచ్చే వేసవిలోగానీ ఆంధ్రలో ఎలక్షన్ హీట్ రాజుకోదు. కానీ, వైసీపీ నేతల జోరు చూస్తుంటే రేపే ఓటింగ్ అన్నట్టు వుంది! మరీ ముఖ్యంగా, ఈడీ వారి ఛార్జీషీట్ లో భారతీ పేరు అంటూ సాగుతోన్న తాజా వివాదంలో వాళ్ల తొందర మరీ తీవ్రంగా వుంది. వైసీపీ నేతలు రోజుకొకరు చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. వారు రోజూ చేసేది అదే కదా అంటారా! అదీ నిజమే! కానీ, ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే… జగన్ పార్టీ వారు చంద్రబాబు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారు. పాలిటిక్స్ తో పెద్దగా సంబంధాలు లేని జగన్ భార్య భారతి పేరు వివాదంలోకి రావటంతో ప్రతి దాడితో భాగంగా చంద్రబాబు ఇంటిలోని వార్ని రచ్చకీడుస్తున్నారు.     జగన్ తరుఫున రోజుకో సారి టీడీపీపై విరుచుకుపడే వారి గురించి కొత్తగా చెప్పేదేం లేదు. అలాగే, కేబినేట్ లో మంత్రిగా కూడా వున్నారు కాబట్టి లోకేష్ గురించి కూడా ఇటు జగన్, అటు పవన్ వీలున్నప్పుడల్లా తలాతోకాలేని విమర్శలు చేస్తూనే వుంటారు. ఇక రోజా లాంటి వారి నోటి గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు! కాగా ఈ కోవలో మరో వైఎస్ కుటుంబ వీరాభిమాని వచ్చి చేరారు. అతనే… భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన జగన్ కు ఎంత దగ్గరి వాడో ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు వారికి చెప్పక్కర్లేదు కదా…   భూమన తాజా ఆరోపణల ప్రకారం నారా బ్రాహ్మణి జీతం 9కోట్లు! ఏంటి ఈ ఆరోపణకి ఆధారం? ఏమో దేవుడికే తెలియాలి! అసలు వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి… బాలకృష్ణ కూతురు, చంద్రబాబు కోడలైన బ్రాహ్మణికి ఏంటి సంబంధం? సూటిగా చెప్పుకుంటే ఏమీ లేదు! కానీ, భూమన ఆమెను కూడా గొడవలోకి లాగారు. ఎందుకంటే, టీడీపీ వారు జగన్ భార్య భారతి పేరు చార్జీషీట్లో వుందని వ్యాఖ్యానించారు కాబట్టి. కానీ, వైఎస్ భారతి పేరు ఈడీ ఛార్జీషీట్లో చేర్చిందని మొదట చెప్పింది ఎవరు? మీడియా! దానికి టీడీపీ నేతలుగానీ, చంద్రబాబుగానీ ఎలా బాధ్యులు అవుతారు? వైసీపీ ఇవేవీ పట్టించుకోవటం లేదు. భారతి అవినీతికి పాల్పడలేదని గట్టిగా చెప్పకుండా మీడియాని, టీడీపీని టార్గెట్ చేస్తోంది. తన కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారని జగన్ వాపోతున్నారు. కానీ, ఆయన అలా మాట్లాడుతూ లేఖ రాసిన రెండు రోజుల్లోనే భూమన బ్రాహ్మణిని వివాదంలోకి తెచ్చారు! ఇదేం న్యాయం?     భూమన కరుణాకర్ రెడ్డి ఈడీ అధికారుల్ని కూడా వదల్లేదు. ఎవరో ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనేవారు చంద్రబాబు మనుషులు అన్నారు. వారే కోర్టుకు కూడా వెళ్లక ముందే పత్రాల్ని చంద్రబాబుకు అందించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు ఇదంతా ఎందుకు? ఒకవైపు నారా బ్రాహ్మణిని, మరోవైపు ఈడీ అధికారుల్ని రచ్చలోకి లాగటం ఎందుకు? బ్రాహ్మణికి హెరిటేజ్ లో 9కోట్లు జీతం వుంటే అదేమైనా నేరమా? ఈడీ అధికారులు తప్పు చేస్తే నిరూపించి వారిపై చర్యలు తీసుకునేలా చేయవచ్చు కదా? వైఎస్ కాలంలో ఎంత మంది అధికారుల్ని ఒత్తిడి తెచ్చి రకరకాల పనులకి వాడుకున్నారు! మీకు తెలియని విద్యలంటూ ఏం లేవు కదా! ఇప్పుడు భూమన చెబుతోన్న ఈడీ ఆఫీసర్స్ అలాగే తమకున్న పవర్ ని దుర్వినియోగం చేస్తుంటే వార్ని చట్టబద్ధంగా బోనులో నిలపవచ్చు కదా! అవేవీ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు బ్రేకింగ్ న్యూస్ లు అందించటం ఎందుకు?   చంద్రబాబు కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగటం కేవలం దృష్టి మరల్చే వ్యూహంగానే భావించవచ్చు. అసలే ఆ మధ్య చేసిన కాపు రిజర్వేషన్ కామెంట్స్ తో జగన్ ఇబ్బందికర స్థితిలో వున్నారు. అంతలోనే ఎదురైన భారతి పేరు వివాదం దాన్ని కాస్త పక్కకు తోసింది. ఇప్పుడు చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి టీడీపీని రెచ్చగొట్టడం వల్ల కాపు రిజర్వేషన్ గొడవ పూర్తిగా సమసిపోవచ్చు. పనిలో పనిగా భారతి పేరు రచ్చకొచ్చినందుకు బ్రాహ్మణి పేరు కూడా ప్రచారంలోకి వస్తే … దానికి ఇది చెల్లు అన్నట్టుగా వుంటుంది! ఇదీ వైసీపీ మైండ్ గేమ్! ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇలాంటివి ఇంకా బోలెడు చూడొచ్చు మనం… 

రాజా సింగ్ ఔట్! తెలంగాణ బీజేపీ క్లీన్ బౌల్డ్!

మూలిగే నక్కపై తాటిపండు సామెత మనకైతే బాగా తెలుసు! మరి తెలంగాణ బీజేపీకి? వారికి కూడా బాగానే అనుభవమై వుండాలి! అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పార్టీ మరీ దారుణంగా దశా-దిశ లేకుండా ప్రయాణిస్తోంది అంటే… అది తెలంగాణ కమలదళమే! ఎందుకంటే, ఇక్కడ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, మరోవైపు ముస్లిమ్ ఓటర్లనే నమ్ముకుని రాజకీయం చేసే ఓవైసీలు వున్న ఎంఐఎం… ఈ రెండూ బీజేపీకి కలిసి వచ్చే అంశాలే! అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా… కాదంటే, రోజు రోజుకి మరింత తీసికట్టుగా సాగుతోంది కాషాయ నేతల ప్రయాణం! ఇందుకు తాజా ఉదాహరణ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా! దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరణ గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా వుంటుందో అక్కడికి కమలదళం ఈజీగా జొరబడుతుంది. దిల్లీలో కూర్చున్న రాహుల్ తేరుకుని ఇటు వచ్చేలోపు అమిత్ షా వలసలు ప్రొత్సహించి కాంగ్రెస్ ను ఖాళీ చేస్తుంటారు. అసోమ్ నుంచీ గోవా దాకా అంతటా ఇదే ఫార్ములా. కానీ, తెలంగాణలో మాత్రం టీ కాంగ్రెస్ ను అమిత్ షా ఒక్కసారి కూడా దెబ్బకొట్టలేదు. ఇక టీఆర్ఎస్ ను ఢీకొట్టడం ఎలా సాద్యం? అయినా కూడా తెలంగాణ కాషాయ నేతలు భారీగా చేరికలుంటాయని అప్పుడప్పుడూ రొటీన్ గా చెబుతూనే వుంటారు! చేరికల మాట అటుంచితే అసలు వున్న అయిదుగురిలో ఓ ఎమ్మెల్యే చేజారిపోయాడు టీ బీజేపీకి! అతనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్!     రాజా సింగ్ ఓవైసీల ఇలాఖా లాంటి ఓల్డ్ సిటీలో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. అయితే, ఆయనకు ఓవైసీల ఎంఐఎంతో వున్న విభేదాల కంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో వున్న మనస్పర్థలే ఎక్కువ! కారణాలు ఏంటో బయటకి పెద్దగా తెలియకపోయినా ఆయనని గతంలో కిషన్ రెడ్డిగానీ, ఇప్పుడు లక్ష్మణ్ గానీ పెద్దగా ప్రొత్సహించింది లేదు. అమిత్ షా సైతం అయనని గమనించారా అంటే అనుమానమే! ఇటువంటి పరిస్థితిలో రాజా సింగ్ బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేశారు. పూర్తి స్థాయిలో గో సంరక్షణ ఉద్యమం చేస్తానంటూ ప్రకటించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దని రాజీనామాలు చేశానని కూడా చెప్పారు! ఇంతకీ ఇందులోని పొలిటికల్ మెసేజ్ ఏంటి?     పాతబస్తీలో ముస్లిమ్ ఓట్లపై ఆధారపడే ఎంఐఎం చాలా బలమైన పార్టీ. దాంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఎవ్వరూ పెట్టుకోరు. రాజకీయంగా మచ్చిక చేసుకునే ప్రయత్నాలే చేస్తారు. కానీ, రాజా సింగ్ లోకల్ కాబట్టి అక్కడే వుంటూ ఎంఐఎంని ప్రత్యక్షంగా ఎదుర్కుంటూ వస్తున్నారు. నిజానికి హిందూత్వ పార్టీ అయిన బీజేపీ ఆయనని అద్భుతంగా వాడుకోవచ్చు. ఉత్తరాదిలో ఇలాంటి ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ లు బోలెడు మంది వుంటారు కమలదళానికి! కానీ, ఇక్కడ వున్న ఒక్కర్నీ కూడా పట్టించుకోకుండా జారవిడుచుకుంది! దీనికి కారణాలు ఏమైనా నష్టం మాత్రం తప్పకుండా పార్టీకే వుంటుంది. ఎందుకంటే, కొందరు చెబుతన్న దాని ప్రకారం రాజాసింగ్ నెక్ట్స్ టార్గెట్ ఎంపీ పదవట!   రాజా సింగ్ ఇప్పుడు గో సంరక్షణ అని చెబుతోన్నా రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశాడంటున్నారు! బీజేపీలో వుంటే ఆయనకి హైద్రాబాద్ గానీ, సికింద్రాబాద్ గానీ ఎంపీ సీటుకి టికెట్ దొరకటం అసాధ్యం. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన్ని అంతగా ఎంకరేజ్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. మరిక మిగిలింది ఆయన స్వంతంగానో, మరేదైనా పార్టీ టికెట్ తోనే పోటీ చేయటం. అందుకే, ఇప్పట్నుంచే ప్రిపేర్ అవుతున్నారు రాజాసింగ్. కాకపోతే, హిందూత్వ ఓట్లు భారీగా పోగేసుకునే అవకాశం వున్న ఆయన ఎక్కడ్నుంచీ పోటీ చేసినా మొదట నష్టపోయేది కమలదళమే! గత ఎన్నికల్లో దత్తాత్రేయ గెలిచిన సికింద్రాబాద్ నియోజక వర్గంలో రాజాసింగ్ బరిలో నిలిస్తే … ఆయన గెలిచినా, ఓడినా… బీజేపీ ఓటమి మాత్రం ఖాయం! ఇక హైద్రాబాద్ ఎంపీగా అసదుద్దీన్ పై పోటీ చేసినా బీజేపీ నిలపబోయే అభ్యర్థికి గడ్డు కాలమే! ఇలా ఎటు చూసినా బీజేపీకి తెలంగాణలో దక్కబోయే ఒకటి అరా ఎంపీ సీటు కూడా రాజా సింగ్ వల్ల కొట్టుకుపోయే పరిస్థితి దాపురించింది! దీనికి టీ బీజేపీ, అమిత్ షాల వద్ద ఏం విరుగుడు వుందో… ప్రస్తుతానికైతే సస్పెన్సే!    

చంద్రబాబు వ్యూహం… బీజేపీకి దూరంగా... మైనార్టీలకు దగ్గరగా!

మైనార్టీలు… భారతదేశంలో ఈ పదం చాలా పవర్ ఫుల్! ప్రజాస్వామ్య రాజకీయాల్లో మైనార్టీల ఓట్లు అత్యంత కీలకం. ఇక మన దేశంలో అయితే మరింత ముఖ్యం. ఎందుకంటే, మన దగ్గర చాలా నియోజక వర్గాల్లో మైనార్టీ ఓట్లు గెలుపోటముల్ని నిర్ణయించేస్తుంటాయి. అందుకే, అన్ని పార్టీలు ముస్లిమ్ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూనే వుంటాయి. అవసరం అనుకున్న చోట్ల క్రిస్టయన్ మైనార్టీ ఓట్లను కూడా తమ స్వంతం చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటాయి. అయితే, కేవలం బీజేపీకి మాత్రం మైనార్టీలతో రివర్స్ రిలేషన్ షిప్ నడుస్తుంటుంది. ఆ పార్టీ హిందూత్వ ఎజెండాతో నడవటం వల్ల మైనార్టీలు సహజంగానే కాషాయానికి కాస్త దూరంగా వుంటూ వుంటారు. దక్షిణాదిలో అయితే అసలే బలహీనమైన బీజేపీకి మైనార్టీల మద్దతు మరీ కరువు. అయితే, బీజేపీ పట్ల వుండే వ్యతిరేక భావం అప్పుడప్పుడూ దానితో దగ్గరగా వుండే పార్టీల పట్ల కూడా మైనార్టీలు చూపుతుంటారు. అదే పెద్ద ప్రమాదంగా భావిస్తుంటారు తమని తాము సెక్యులర్ నేతలుగా చెప్పుకునే పార్టీల వారు!     గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారికంగా కమలంతో పొత్తు పెట్టుకున్నారు. అయినా మైనార్టీలు విపరీతంగా ఏం రియాక్ట్ కాలేదు. జగన్ కు బదులు బాబునే నవ్యాంధ్ర సీఎంగా ఎంచుకున్నారు. అందుక్కారణాలు అనేకం. చంద్రబాబు గతంలోనూ ఎన్డీఏలో కీలక నేతగా వ్యవహరించారు. మోదీ లాంటి హిందూత్వవాదిని ఆయన సమర్థించినా… వ్యక్తిగతంగా బాబులోని సెక్యులర్ విలువలు గత నలబై ఏళ్లుగా ఏపీ మైనార్టీలకు తెలుసు. ఇలాంటి కారణాల వల్ల ముస్లిమ్ ఓటర్లు టీడీపీని బాగానే ఆదరించారు. అయితే, ఇప్పుడు టీడీపీ పూర్తిగా ఎన్డీఏ నుంచీ బయటకు వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో స్వంతంగా పోటీ చేయబోతోంది. అదే సమయంలో జగన్ అంతకంతకూ కాషాయ శక్తులకు దగ్గరవుతున్నారు. అధికారికంగా పొత్తు లేకున్నా మోదీ చెప్పినట్లు జగన్ చేస్తున్నాడని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దాన్ని గట్టిగా స్పందించే స్థితిలో కూడా వైసీపీ లేదు!     సుదర్ఘీమైన రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి సరికొత్తగా ముస్లిమ్ ఓటర్ల వర్గంలో భరోసా నింపే ప్రయత్నంలో వున్నట్టు కనిపిస్తోంది. మైనార్టీలు జగన్ ను పూర్తిగా నమ్మే స్థితిలో లేరు. ఆయన బీజేపీతో రహస్య అనుబంధం కొనసాగిస్తుండటమే అందుకు కారణం. మరోవైపు, పవన్ పట్ల కూడా వారికి ప్రత్యేక ప్రేమగానీ, అయిష్టంగానీ లేవు. అలాగని … అనుభవంలో జగన్ కంటే కూడా తక్కువ స్థాయిలో వున్న జనసేనానికి ఎలా ఓటు వేస్తారు? మొత్తంగా చూస్తే తెలంగాణలో వున్నట్టు ఎంఐఎం పార్టీ లాంటి ప్రత్యేక మైనార్టీ నాయకత్వపు పార్టీ ఇక్కడ లేదు కాబట్టి… వారు టీడీపీనే ఎంచుకోవాల్సి వచ్చేలా వుంది. అందుకు తగ్గట్టే గత నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు ముస్లిమ్ మైనార్టీలకు వీలైనన్ని వరాలు కురిపిస్తున్న చంద్రబాబు మరో ముందడుగు వేయబోతున్నారట!     ఈ నెల 28న గుంటూరులో మైనార్టీలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. నారా హమారా నినాదాలు మిన్నంటనున్నాయి! అయితే, సభకు ప్రత్యేకంగా హాజరు కానున్న చంద్రబాబు అంతలోపే వారికి చక్కటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. త్వరలో మంత్రి వర్గ విస్తరణ వుంటుందని చెబుతోన్న టీడీపీ వర్గాలు ఒక టీడీపీ ముస్లిమ్ నేత మినిస్టర్ అవుతారని చెబుతున్నారు. ఆ నాయకుడు ఎవరు? చాంద్ పాషానా, షరీఫా, మరొకరా, ఇంకొకరా… ఇప్పుడే మనకు తెలియదు. కానీ, బీజేపీతో పొత్తు ఇప్పుడు లేదు కనక ఆ పార్టీ నాయకులు కామినేని, మాణిక్యాల రావులు ఖాళీ చేసిన శాఖలు చంద్రబాబు పూరించనున్నారు. ఆ రెండిట్లో ఒకటిగానీ, మరేదైనా శాఖగానీ మైనార్టీ నేతకు కట్టబెట్టవచ్చట. మంత్రి వర్గ విస్తరణలో మార్పులు భారీగా వుంటాయా, లేదా కేవలం చిన్న చిన్న మార్పులే చేస్తారా ఇంకా తెలియదు. కానీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలబడతామని అంటోన్న మైనార్టీలకు మాత్రం చంద్రబాబు కేబినేట్లో సముచిత స్థానం కల్పించనున్నారట!     పాదయాత్రల పేరుతో కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతోన్న జగన్, పవన్ ఈ తాజా పరిణామంతో కాస్త ఆందోళన చెందుతారనటంలో సందేహం లేదు. ఒకవైపు వైసీపీని, జనసేనని బీజేపీ అనుబంధ పార్టీలుగా ప్రచారం చేస్తోన్న టీడీపీ… ఇప్పుడు మైనార్టీల్ని దగ్గర చేసుకునే విధంగా మినిస్టర్ పోస్ట్ ఇస్తే మాత్రం… అది ఖచ్చితంగా ఎన్నికల సమయంలో నష్టమే. మైనార్టీలుగా గంప గుత్తగా జగన్, పవన్ లను కాదని చంద్రబాబు వెంట నిలిస్తే చాలా సీట్లలో విజయాలు తారుమారు అయిపోవచ్చు! చూడాలి మరి … అపార అనుభవం వున్న చంద్రబాబును ఢీకొడుతోన్న యువ నేతలు జగన్, పవన్ మైనార్టీ ఓటు బ్యాంక్ వ్యూహాన్ని ఎలా ఛేదిస్తారో!  

2019లో షా బెంగాల్‌ని కొడితే… మోదీకి ఏ బెంగా లేనట్టే!

ఇప్పుడు దేశంలో మోదీ తరువాత అందరి దృష్టి ఆకర్షించేది అమిత్ షానే! మనకు ఉప ప్రధాని ప్రస్తుతం లేకపోవచ్చుగానీ… అమిత్ షా హడావిడి డిప్యూటీ పీఎం రేంజ్లోనే వుంది! ఆయన కేవలం రాజ్యసభ సభ్యుడు, అధికార పక్షం జాతీయ అధ్యక్షుడు. కానీ, ఏ రాష్ట్రానికి షా వచ్చినా కోలాహలం మామూలుగా వుండటం లేదు. మోదీ ప్రధాని హోదాలో వస్తే ఎంత జాగ్రత్తగా వుంటారో… ఆయా రాష్ట్రాల నేతలు, పోలీసులు… అమిత్ షాకు అదే స్థాయిలో ప్రాముఖ్యతనిస్తున్నారు. పొగిడేవారు పొగిడినా, తిట్టే వారు తిట్టినా ఇప్పుడు అమిత్ షాను మాత్రం పట్టించుకోకుండా వుండే స్థితి లేదు. అలా ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలోకి బీజేపీ యాగాశ్వాన్ని ముందుండి నడిపిస్తున్నారు షా!     అమిత్ షా తన చాణక్యంతో గోవా మొదలు త్రిపుర దాకా కాషాయ కమలాన్ని వికసింపజేయటం మెచ్చుకోదగ్గదే అయినా ఆయన ఎంచుకుంటున్న మార్గాలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పార్టీ విస్తరణ కోసం షా ఎంతకైనా దిగజారతారని తిట్టిపోస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ నేతలు తమ నేతని విపరీతంగా పొగిడేస్తూ మురిసిపోతున్నారు. ఇక బీజేపీకి రెబెల్స్ గా వుంటోన్న యశ్వంత్ సిన్హా, అరూణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా లాంటి వారు కూడా షా మీద గుర్రుగానే వున్నారు. ఎందుకంటే, మోదీ అసలు బలమంతా అమిత్ షానే కాబట్టి…     జమ్మూ కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ మొదలు యూపీలో మాయవతి వరకూ చాలా మంది తిరుగులేని నాయకురాళ్లని అమిత్ షా ముప్పతిప్పలు పెడుతున్నారు. అతి పెద్ద పార్టీగా బీజేపికి వున్న వెసులుబాటు, కేంద్రంలో అధికారం తమ చేతిలో వుండటం వంటి అనుకూల అంశాల కారణంగా ఆయన ఆడింది ఆటగా నడుస్తోంది. అయితే, కేవలం బెంగాలీ దీదీ మమత మాత్రం టఫ్ ఫైట్ ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోదీ, షాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న అతి కొద్ది మందిలో ఆమె ఒకరు!   మమతా బెనర్జీ తరువాత ప్రాంతీయ నేతల్లో ఆమెలా కేంద్రానికి వ్యతిరేకంగా నిలుస్తున్నది మన చంద్రబాబు లాంటి బాగా అనుభవం వున్న వారు మాత్రమే! మోదీ, షా కుట్రల్ని అర్థం చేసుకుని పావులు కదపటం సీబీఎన్ లాంటి వారికైతేనే చెల్లుతుంది. జగన్, పవన్, కేసీఆర్ లాగా చాలా రాష్ట్రాల్లో ఆయా పార్టీల అధినేతలు అయిష్టాంగానైనా బీజేపీతో వివాదాలకి దూరంగా వుంటున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్, ఒడిషాలో నవీన్ పట్నాయక్, బీహార్లో నితీష్, తమిళనాడులో పళని, పన్నీర్ సెల్వం… వీళ్లంతా కమలానికి అవసరమైనప్పుడు సాయం చేయటం ఇష్టపూర్వకంగా కాదని ఎవరైనా చెప్పేయగలరు! దేశం మొత్తంలో తమని మొండిగా ఎదుర్కొంటోన్న శక్తుల్లో మమతా బెనర్జీపై తీవ్రంగా దృష్టి సారించారు మోదీ, అమిత్ షా. కారణం ఆమె రాష్ట్రంలో బీజేపీకి కాస్త అనుకూల వాతావరణం వుండటమే. గత సంవత్సర కాలంలో అయిదుసార్లు బెంగాల్ లో పర్యటించిన అమిత్ షా అక్కడి స్థానిక నేతలకి పెద్ద టార్గెట్టే ముందు పెట్టారు. 42 ఎంపీ సీట్లలో మనకు 22 తప్పకుండా రావాలని అంటున్నారట. తాజాగా ఇవాళ్ల కూడా యువ సమ్మేళనం అనే పేర భారీ ర్యాలీ ఏర్పాటు చేసి అందులో ప్రసంగించేందుకు కోల్ కతా చేరుకున్నారు షా. అసోమ్ లో వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర రిజిస్టర్ బెంగాల్లో కూడా అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు హామీ ఇవ్వచ్చంటున్నారు. అదే జరిగితే మమత మరింత ఆగ్రహంతో ఊగిపోవచ్చు. ఎందుకంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ పౌరులు చాలా మంది ఆమె పార్టీకి ఓటు బ్యాంక్ గా మారారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అంతే కాదు, ముస్లిమ్ ఓటర్లలో తన ఇమేజ్ పెంచుకునే వ్యూహంతో కూడా మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర దాడి చేస్తున్నారు. ఎన్ఆర్సీ వ్యవహారాన్ని సుప్రీమ్ కోర్టు పర్యవేక్షిస్తున్నా మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేస్తూ కమలదళం మైనార్టీల్ని టార్గెట్ చేస్తోందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఆమె తన పుట్టలో వేలు పెడుతున్న కాషాయదళంపై అసహనంతోనే చేస్తున్నారు…     మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక బెంగాల్ కమ్యూనిస్టులు చాలా బలహీనమయ్యారు. వాళ్లు కనుచూపు మేరలో తిరిగి అధికారం చేపట్టే సూచనలు కనిపించటం లేదు. జనం కూడా దశాబ్దాల తరబడి వారికి అధికారం కట్టబెట్టి నిరాశకి లోనయ్యారు. అందుకే, బెంగాల్ లో తృణమూల్ అంటే గిట్టని వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు. కొన్ని వర్గాల ఓటర్లు, అనేక మంది నేతలు ఇప్పుడు అమిత్ షా నేతృత్వంలో దీదీని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారు. ఇలాంటి అనుకూల వాతావరణం కారణంగానే అమిత్ షా బెంగాల్ సీఎంతో ప్రత్యక్ష యుద్ధానికి సై అంటున్నారు. ఆయన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తనని అరెస్ట్ చేసినా కోల్ కతా వచ్చి తీరుతానని హెచ్చరించి పర్మిషన్ సంపాదించుకున్నారు. ఇంతలా అమిత్ షా టార్గెట్ చేసిన రాష్ట్రం మరేదీ లేదనే చెప్పాలి… మమతని బెంగాల్లో దెబ్బతీయటం ద్వారా కేవలం స్థానికంగానే కాదు… బీజేపీకి జాతీయంగా కూడా లాభం వుంది. మోదీకి ధీటైన ప్రధాని అభ్యర్థిగా ఇప్పుడు ఎవరూ లేరు. రాహుల్ అంటూ ప్రచారం జరుగుతున్నా ఆయన ఇంకా చాలా దూరం పరుగెత్తాల్సి వుంది. ఇక రాహుల్ తరువాత మోదీ, షా తమకు ప్రమాదకరంగా భావిస్తోంది మమతా బెనర్జీనే! అందుకే, ఆమెను ఆమె స్వంత రాష్ట్రంలోనే తక్కువ ఎంపీ సీట్లకు పరిమితం చేసి దిల్లీలో విలువ తగ్గించాలని వ్యూహం పన్నారు. ఒకవేళ అమిత్ షా ప్రయత్నాలు ఫలించి మమతా బెనర్జీ ఇరవై మంది ఎంపీలకే పరిమితం అయితే… అది ప్రతిపక్షానికి పెద్ద దెబ్బే! కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్ని ఏకతాటి పైకి తేగల నాయకత్వం దాదాపుగా ఇంకెవరి వద్ద వుండదు.అప్పుడు 2019లోనూ అనివార్యంగా సాధ్యమైనన్నీ ఎక్కువ పార్టీలు మోదీ నాయకత్వంలో పని చేయటానికి సిద్ధపడతాయి. ఇంత ఎఫెక్ట్ వుంటుంది కాబట్టే మమతా బెనర్జీ కోటలో కత్తి దూయటానికి షా సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు!  

కేసీఆర్ ‘ముందస్తు’వ్యూహంలోని ‘ముందుచూపు’ ఇదేనట!

దేశంలో ముందస్తు ఎన్నికల కోసం తహతహలాడుతున్న నేతలెవరు? ఇంతకాలం మీడియా మోదీ పేరే చెబుతూ వచ్చింది. ఈ సంవత్సరం చివర్లో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలతో పాటూ దేశ పార్లమెంట్ కు కూడా ఎన్నికలు తీసుకురావలని ప్రధాని ఆలోచిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు అలాంటి ఆలోచనలో వున్నట్టుగా మోదీ కనిపించటం లేదు. 2019 వేసవిలోనే ఎలక్షన్స్ వచ్చేలా వున్నాయి. అయితే, అదే జరిగితే గత ఎన్నికల మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా అప్పుడే ఓటింగ్ జరుగుతుంది. కానీ, అందుకు సిఎం కేసీఆర్ సిద్ధంగా లేరని తాజా టాక్!     పార్లెమెంట్ ఎన్నికలతో పాటూ తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరిగితే కేసీఆర్ కి ఏంటి నష్టం? పైకి సూటిగా కనిపించకపోయినా ఓ పెద్ద సమస్యే వుంది. మోదీ తీసుకున్న జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను కలుగజేశాయి. జనం మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పెద్ద సంఖ్యలోనే ఎదురుచూస్తున్నారు. కానీ, పోయిన ఎన్నికల వేళ మోదీ హవా పూర్తిగా వీస్తుంటే కూడా తెలంగాణలో కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు వచ్చింది కమలానికి. అటువంటిది ఇప్పుడు అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో 2019లో ఎన్నికలకు వెళితే తెలంగాణలో కాషాయానికి దక్కేది ఎంత? సున్నా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్లీ ఒక్క ఎంపీ సీటు నిలబెట్టుకుంటే అంతకంటే ఆనందం మరొకటి వుండదు. ఇటువంటి పరిస్థితిలో అమిత్ షా తెలంగాణపై పెద్దగా ఆశలు పెట్టుకోరన్నది స్పష్టం!     ఎంపీ సీట్ల విషయానికి వచ్చే సరికి జనం అసెంబ్లీ కంటే భిన్నంగా ఆలోచిస్తారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా… బీజేపీ మీద వ్యతిరేకతతో వున్న జనం ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కు ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా వుంటుంది. ఇప్పుడు ఇదే కేసీఆర్ ను ముందస్తుకు సిద్ధం చేస్తోన్న అంశంగా కనిపిస్తోంది. మోదీ నిర్ణయాలు నచ్చని వర్గాలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎన్నుకుంటే టీఆర్ఎస్ ఇంతకు ముందు వచ్చినన్ని ఎంపీ సీట్లు రాకపోవచ్చు. అదే సమయంలో ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుకూల గాలి వీస్తే ఎమ్మెల్యే స్థానాల గెలపు ఓటములపై కూడా దాని ప్రభావం వుంటుంది. మొత్తంగా మోదీ, బీజేపీ మీద వ్యతిరేకత వచ్చే ఎండాకాలం నాటికి పాకాన పడితే అది కాంగ్రెస్ కు మేలవుతుంది తప్ప టీఆర్ఎస్ కు ఏమంత కలిసొచ్చే అవకాశాలు లేవు. తన స్వంత ఓటు బ్యాంకు మీదే కేసీఆర్ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే, ఆయన దిల్లీ టూర్లు వేస్తూ ముందస్తుకు ప్రధాని నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పొందారని గుసగుసలు వినిపిస్తున్నాయి!     నిజానికి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ఈ అక్టోబర్ లో ఎన్నికలకు రెడీ అయితే… నవంబర్, డిసంబర్లలో ఈసీ ఎన్నికల తేదీలు ప్రకటించవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో తెలంగాణ కూడా ఎన్నికలకు వెళ్లవచ్చు. దీనికి మోదీ, అమిత్ షాల పర్మిషన్ ఏం అక్కర్లేదు కేసీఆర్ కి. కానీ, మోదీ చేత ఓకే చేయించుకోవటం ఎందుకంటే… కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తరువాత బాహాటంగా బీజేపికి మద్దతు ఇచ్చే అవకాశం వస్తుంది! తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ కి శత్రువు, దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ హస్తం గుర్తు బీజేపీకి టార్గెట్. ఇలా ఇద్దరికీ కాంగ్రెస్సే కామన్ ఎనిమీ కాబట్టి టీఆర్ఎ, బీజేపీ చేతులు కలపటం ఈజీ అవుతుంది. పైగా దిల్లీలో కేసీఆర్ కి మోదీ కావాలి, మోదీకి తెలంగాణలో కేసీఆర్ కావాలి. ఇలా ఇద్దరికి లాభసాటిగా వుంటుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ, కమలం కలిసి వికసించిన ఆశ్చర్యపోనక్కర్లేదు!     పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయటానికి ముందుగానే అసెంబ్లీ యుద్ధం ముగించటం ఎందుకంటే… బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకి వెళితే ముస్లిమ్ ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. డ్యామేజ్ ఏదైనా జరిగితే అసలుకే ఎసరు వస్తుంది. అలా కాకుండా రెండోసారి కూడా తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాక దిల్లీపై దృష్టి పెడితే… మోదీ తిరిగి ఎన్నికైనా కాకున్నా తెలంగాణ వరకూ మాత్రం కార్ కు వచ్చే ఢోకా వుండదు. ఇదే కేసీఆర్ ముందస్తు గేమ్ ప్లాన్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్! ఇందులో నిజం ఎంతో త్వరలోనే తేలిపోతుంది. కానీ, తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు నగారా మోగితే మాత్రం… అది ఖచ్చితంగా టీకాంగ్రెస్ కు టెన్షన్ పెట్టించే పరిణామమే!

వీళ్లు ‘తమిళులు’కారంటే తమిళియన్సే ఒప్పుకోరు! కానీ…

కరుణానిధి మరణంతో తమిళనాడులో మరో శకం ముగిసింది! కానీ, ఈ మధ్య కాలంలో ఇది రెండో షాక్! జయలలిత అనూహ్య మరణం తమిళులపై ఎలాంటి ప్రభావం చూపిందో మనం చూస్తూనే వున్నాం! ఇంకా చెన్నై రాజకీయాలు ఎంత మాత్రం సద్దుకోలేదు. సద్దుమణగలేదు. పళని, పన్నీర్, శశికళ, దినకరన్, రజినీ, కమల్… ఇలా అనేక దిక్కుల్లో రాజకీయం రంగులు మారుతోంది! ఇంతలోనే తమిళ కురుక్షేత్ర కురువృద్ధుడు కరుణానిధి కూడా మరణించారు! ఇప్పుడిక ఒక తరం దాదాపుగా ముగిసిపోయినట్టే! జయ, కరుణా నిష్క్రమణంతో కొత్త నాయకత్వం రావాల్సిందే! మరి భవిష్యత్ తమిళనాడుని ఎవరు శాసిస్తారు? స్టాలిన్, రజినీకాంత్ లకి అందరికంటే ఎక్కువ అవకాశాలున్నాయి. కమల్, దినకరన్ లాంటి వారికి మొత్తం రాష్ట్రాన్ని ఏలటం కష్టమే! అయితే ఇక్కడే ఒక చారిత్రక విచిత్రం దాగుంది! రజినీకాంత్ ఒకవేళ తమిళనాడు తరువాతి ముఖ్యమంత్రి అయితే మరోసారి తమిళ నేల పరాయి భాషా వ్యక్తికి అధికారం కట్టబెట్టినట్టు అవుతుంది!     దేశంలోనే భాష పేరుతో అత్యంత ఆత్మాభిమానం కలిగి వుండటం తమిళులకే చెల్లింది. హిందీకి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం చాలా పెద్దది. ఇప్పటికీ తమిళ అభిమానం అక్కడి ప్రజలకి చాలా మెండు. అయితే, అంతగా భాషాభిమానం, ప్రాంతీయత వున్నా వారు ఎప్పుడూ ఇతర భాషల్లో మూలాలున్న వారికే ప్రభావితం అవుతూ వస్తున్నారు! ఇది చాలా మంది తమిళులకి కూడా తెలియని విషయం! కరుణానిధిని తమిళులు అయిదు సార్లు తమ ముఖ్యమంత్రిని చేశారు! కానీ, ఆయనెవరో తెలుసా? తమిళనాడులో పుట్టిన తెలుగు బిడ్డ! ఆయన తల్లిదండ్రులు ఆంధ్రా ప్రాంతం వారే! ఇక్కడ్నుంచీ వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వారికి పుట్టిన వారే కరుణానిధి! కరుణ చక్కగా తెలుగులో మాట్లాడేవారు కూడా!     కరుణానిధి తెలుగు వారైతే ఆయనను బద్ధ శత్రువుగా చూసిన జయలలిత? ఆమె కూడా తమిళ స్త్రీ కాదు! ఆమెది కర్ణాటక! మైసూర్ ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులకి పుట్టిన కన్నడ అమ్మాయే జయ! పుట్టుకతో కోమలవల్లి అనే పేరున్నా జయా విలాస్, లలితా విలాస్ అనే పేర్లున్న రాజగృహాల మీదుగా ఆమెకు జయలలిత పేరు వచ్చింది! ఆ రెండు రాజగృహాలు మైసూర్ రాజువి! ఆయన వద్ద జయలలిత తాతగారు వైద్యుడిగా పని చేసేవారు! ఇతర భాషల నుంచీ వచ్చి తమిళులపై తీవ్ర ప్రభావం చూపిన వ్యక్తుల లిస్టు ఇంకా చాలా వుంది! జన్మతః శివాజీ రావు గైక్వాడ్ అయిన మరాఠీ కళాకారుడే తమిళులే సూపర్ స్టార్ అయ్యాడు! రజినీకాంత్ గా చరిత్ర సృష్టించాడు! త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్న ఆయన దైవం శాసిస్తే తరువాతి ముఖ్యమంత్రి కూడా కావచ్చు! కర్ణాటకలో పుట్టి పెరిగిన మరాఠీ మన శివాజీ!     జయలలిత, కరుణానిధి లాంటి ముఖ్యమంత్రులే కాదు గతంలోనూ ఇతర భాషలతో సంబంధం వున్న ముఖ్యమంత్రులు తమిళనాడుని ఏలారు! తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ అలాంటి వారే! ఆయనను డీఎంకే నుంచి బహిష్కరించిన కరుణానిధి ఎంజీఆర్ బ్రతికి వున్నంత కాలం అధికారానికి దగ్గరవ్వలేకపోయారు! వరుసగా ముఖ్యమంత్రి అవుతూ వచ్చిన ఎంజీఆర్ శ్రీలంకలో పుట్టిన మలయాళీ! అయినా తమిళనాడు సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని తిరుగులేకుండా పరిపాలించారు!     తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కొద్దోగొప్పో ప్రభావం చూపుతున్న మరో సినిమా హీరో విజయ్ కాంత్. ఆయన పార్టీ డీఎండీకే. ఈయన కూడా తెలుగు వాడే! తెలుగు తల్లిదండ్రులకి తమిళనాడులో పుట్టారు! ఆయనలాగే తమిళ పాలిటిక్స్ లో రెబెల్ గా ముద్ర పడ్డ వైగో కూడా తెలుగు వారే! ఈయన అసలు పేరు వాయుపురి గోపాలస్వామి! షార్ట్ వైగో అయ్యారు. కరుడుగట్టిన తమిళ జాతీయ వాదిగా పేరున్న ఈయనకు ఒక వర్గం ప్రజల్లో మంచి ఫాలోయింగ్ వుంది! కానీ, వైగో మూలాలు కూడా తెలుగు నేలపైనే వున్నాయి! ఇక తెలుగు లింక్ వున్న మరో తమిళ పొలిటికల్ హీరో నెపోలియన్. డీఎంకేలో వుండీ మంత్రి కూడా అయిన ఆయన అళగిరి వర్గంలో వుండటంతో స్టాలిన్, కరుణానిధి పక్కన పెట్టారు. 2014లో బీజేపీలో చేరారు. నెపోలియన్ ఆంధ్రా నుంచి వలస వెళ్లిన రెడ్డియార్ కుటుంబంలో జిన్మించారు! అయితే, నెపోలియన్ లా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు కానీ… పందెం కోడి విశాల్ కూడా తెలుగు వాడే! లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా… తమిళనాడులో ద్రవిడ ఉద్యమం లేవనెత్తిన ఈవీ రామస్వామి నాయికర్ ఎవరో తెలుసా? కొంత మంది పరిశోధకుల మాట ప్రకారం మన తెలుగు వాడే! అయితే, మరికొందరు మాత్రం ఆయనని కన్నడ బలిజ సామాజిక వర్గానికి చెందిన కుటుంబీకుడు అంటుంటారు! మా భాషా, మా ప్రాంతం అంటూ అభిమానం చాటుకోవటంలో దేశంలో తమిళుల తరువాతే ఎవరైనా! కానీ, వారి మీదే ఇంత మంది తమిళులు కాని వారి ప్రభావం వుండటం… నిజంగా ఆశ్చర్యమే! కాకపోతే, ఈ లిస్టు మొత్తం చూశాక… ఒక పంజాబీ ముస్లిమ్ యువతి అయిన ఖుష్బూకీ గుడికట్టిన వారి అభిమానం ఈజీగా అర్థం చేసుకోవచ్చు! నచ్చకపోతే ఎంత ద్వేషమో… నచ్చితే అంత ప్రేమ అనేది తమిళ ఫార్ములా! 

చరిత్రలో తొలిసారి కాంగ్రెస్, టీడీపీ కలిసి బీజేపీకి షాకిస్తాయా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు! ఇది ఎంత పాత సామెతైనా ఖచ్చితంగా నిజమే! చాలా సందర్భాల్లో రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం శత్రువుల్ని మిత్రులుగా అక్కున చేర్చుకుంటూ వుంటారు. మిత్రుల్ని నిర్ధాక్షిణ్యంగా తొక్కేసి ముందుకు వెళ్లిపోతుంటారు. కానీ, కొన్ని సందర్బాల్లో రాజకీయ నేతలు స్వంత ప్రయోజనాలు ఏం లేకున్నా బద్ధ శత్రువులతో చేతులు కలపాల్సి వస్తుంది! అందుకు కారణం ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్దే! ఇప్పుడు అలాంటి స్థితిలోనే చంద్రబాబు చారిత్రక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది…     టీడీపీ స్థాపించినప్పటి నుంచీ ఏదన్నా పార్టీకి వ్యతిరేకంగా ముందుకు కదులుతోంది అంటే… అది కాంగ్రెస్సే! గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ చేతులు కలపటం ఎప్పుడైనా చూశారా? లేదు కదా! కానీ, మోదీ చలువ వల్ల బద్ధ శత్రువులు కూడా ఏకం కావాల్సి వస్తోంది. ఆంధ్రా హక్కులు, సంక్షేమం కోసం చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు పలకాల్సి వస్తోంది. ఇది ఆనందదాయకం కాకపోయినా జనం మేలు కంటే మరేదీ పెద్దది కాదు అన్న సత్యానికి మాత్రం నిదర్శనం!     రేపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవం సాధ్యం కాకపోవటంతో ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ బరిలో నిల్చారు. ఆయనకు బీజేపీ, ఇతర ఎన్డీఏ పార్టీలతో సహా టీఆర్ఎస్, బీజూ జనతాదళ్ వంటి పార్టీలు ఓటు వేసే అవకాశం వుంది. ఇంకా స్పష్టంగా ఎవరు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తారో తెలియటం లేదు! ఇక బీజేపీ మద్దతిస్తోన్న ఎన్డీఏ అభ్యర్థిపై కాంగ్రెస్ పోటీకి సై అంటోంది. తన స్వంత పార్టీ నుంచీ హరిప్రసాద్ అనే రాజ్యసభ సభుడ్ని బరిలో నిలుపుతోంది! అయితే, కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ కి తృణమూల్, బీఎస్పీలు ఇప్పటికే మద్దతు పలికాయి.     కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఆశ్చర్యకరంగా టీడీపీ కూడా హరిప్రసాద్ కి మద్దతు తెలపాలని నిర్ణయించింది. చంద్రబాబు నిర్ణయం మేరకే తాము బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తామని టీడీపీ రాజ్యసభ ఎంపీలు ప్రకటించారు! దీంతో కాంగ్రెస్, టీడీపీల చెలిమి వార్తల్లోకి వచ్చింది. ఇది కేవలం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకే పరిమితం అయినప్పటికీ మోదీ, అమిత్ షాలకు పెద్ద సందేశమే అవనుంది! ఇప్పటికే ప్రజాల పద్దుల కమిటీ సభ్యుడిగా టీడీపీ నేత సీఎం రమేష్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఎంపీలు మద్దతిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ అండగా నిలుస్తోంది! ఒకవేళ ఇదే సహకారం పూర్తి స్థాయి సార్వత్రిక ఎన్నికల పొత్తుగా పరిణమిస్తే? మోదీకి, బీజేపీకి, ఎన్డీఏకి పెద్ద ప్రమాదమే! ఎందుకంటే, కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్, బీఎస్పీ వంటి పార్టీలతో వున్న యూపీఏకు టీడీపీ చేరిక బోలెడు బలాన్నిస్తుంది!     ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీతో టీడీపీ ఇప్పుడు చేతులు కలుపుతోంది అంటూ బీజేపీ నేతలు రేపట్నుంచీ కూనిరాగాలు తీయవచ్చు. అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ, చంద్రబాబు ఇలాంటి చారిత్రక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మోదీ హోదా , పోలవరం లాంటి విషయాల్లో చేస్తున్న అమానుష నిర్లక్ష్యమే కారణం! రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ కు మద్దతు పలకటం ద్వారా బీజేపీపై ఒత్తిడి తేవటంతో సాధ్యమైతే … అందులో తప్పేముంది? ఇప్పుడు బాబు అదే చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పక్షాన నిలివటం ద్వారా మోదీకి , అమిత్ షాకి చంద్రబాబు హెచ్చరిక పంపిస్తున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే కూడా ఇదే బాటలో నడిచే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంచన వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నియంత చర్యలు ఎలాంటి ప్రతి వ్యూహాలకు తెర తీస్తాయో… ఈ తాజా రాజ్యసభ ఎన్నికే నిదర్శనం! దీని తరువాతైన మోదీ, షా ద్వయం పాఠాలో, గుణఫాఠాలో నేర్చుకుంటారో… లేదో చూడాలి! 

కలైంగర్‌గా ఎదిగిన కరుణానిధి సక్సెస్ సీక్రెట్ ఇదే!

రంగం ఏదైనా, విజయం సాధించింది ఎవరైనా… గెలవాలంటే ఏవో కొన్ని ప్రత్యేకతలు తప్పకుండా అవసరం! అలాంటిది కొన్ని కోట్ల మంది తలరాతలు మార్చే సీఎం పదవి ఆషామాషీగా వచ్చేయదు. వచ్చినా నిలవదు. అందుకే, సినిమా, క్రికెట్, వ్యాపారం కంటే వేయింతలు ఎక్కువ పోటీ, ఎక్కువ ఒత్తిడి వుండే రంగం రాజకీయ రంగం. అందులోనూ రాష్ట్ర రాజకీయాలకు తలమానికమైన ముఖ్యమంత్రి పదవి అంటే అది మరింత కష్టతరం! మరి అటువంటి ముఖ్యమంత్రి కుర్చీని కరుణానిధి ఎన్నిసార్లు అలంకరించారు? అచ్చంగా అయిదుసార్లు! అంటే… స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ సాగిన ప్రజాస్వామ్య తమిళ చరిత్రలో…. దాదాపు ఇరవై ఏళ్లు ఆయన పాలనే అన్నమాట! అంతటి సక్సెస్ కరుణకు ఎలా దక్కింది?     కరుణానిధి వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. అలాగని పుట్టుకతోనే మహాశ్రీమంతుడు కూడా కాదు. ఆయనది వెనుకబడిన వర్గానికి చెందిన నాయి బ్రాహ్మణ కులం. కానీ, దక్షిణా మూర్తిగా పుట్టి కరుణానిధిగా ఎదిగారు. స్వయంకృషితో తమిళ సినిమా రంగంపై ముద్ర వేశారు. అదే పెట్టుబడిగా డీఎంకేలోకి వచ్చి … తానే డీఎంకేగా మారిపోయి… తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. వీటన్నిటి వెనుక ఆయనకు వంశ వారసత్వం, కోట్లాది రూపాయల డబ్బు, అగ్ర కులం వల్ల వచ్చే సామాజిక పరపతి… ఇవేవీ లేకున్నా… ఎన్ని ఒడిదుడుకుల్ని అయినా మనో నిబ్బరంతో ఎదుర్కొనే వ్యక్తిత్వం వుంది! అదే మామూలు కరుణానిధిని… కలైంగర్ ని చేసింది!     కరుణానిధి ఎలాంటి వాడు? ఈ విషయం తెలియాలంటే ఈ ఒక్క విషయం చాలు! కరుణ 1944లో ఒక యువతిని ప్రేమించారట. ఆమె కుటుంబం వారు కూడా వీరి పెళ్లికి అంగీకరించారట. కానీ, హిందూ సంప్రదాయం ప్రకారం తాళిబొట్టు కట్టాలని కోరారట. కరుణానిధి అందరికీ తెలిసినట్టుగానే పరమ నాస్తికుడు! మరి ఎలా ఒప్పుకుంటారు? అందుకే, తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమను, ప్రియురాలిని వద్దనుకున్నారు. కరుణానిధిని ప్రేమించిన సదరు యువతి కూడా జీవితాంతం అవివాహితగానే వుండిపోయింది! ఆ ఇద్దరి ప్రేమ నిజంగా గొప్పదే. అంతే కాదు, హిందూ సంప్రదాయాల కోసం ఆమె అంకిత భావం, తన నాస్తిక విశ్వాసం కోసం కరుణ పట్టుదల రెండూ మెచ్చుకోదగ్గవే!     కరుణానిధి తన ప్రేమను వదులుకోవటం, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగటం రెండూ వేరు వేరు కావచ్చు. కానీ, వాటి మధ్య లోతైన సంబంధం కూడా వుంది. తాను నమ్మిన దాని కోసం ఎంతదాకా అయినా వెళ్లటం కరుణ సక్సెస్ సీక్రెట్. ఆయన ఎన్ని దశాబ్దాలు తమిళనాడును ఏలారో అంతకంటే ఎక్కువ కాలం ప్రతిపక్షంలో వున్నారు. అయినా అధికారంలో వున్నా లేకున్నా… ఏ ఒక్క క్షణం కూడా తాను నమ్మిన సిద్ధాంతానికి దూరంగా జరగకపోవటం అందరూ నేర్చుకోవాల్సిన విషయం! ఆయనంటే నచ్చే వారు ఆయన మొండితనాన్ని పట్టుదల అంటారు! ఆయనంటే పడని వారు ఆయన పట్టుదలని మొండితనం అంటారు! 

మోదీ టూ పవన్ … కరుణానిధి మృతిపై ఇలా రియాక్టయ్యారు!

తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన తన ట్వీట్ లో … ఈ విషాద సమయంలో నా ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయన అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయి. భారత దేశం … ముఖ్యంగా తమిళనాడు గొప్ప నేతని కోల్పోయింది. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు! మోదీ చెన్నై చేరుకుని కరుణానిధి భౌతికకాయానికి స్వయంగా నివాళులర్పించనున్నారు…     ఇక మన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు. వారు వేర్వేరు ప్రకటనల్లో తమ భావాలు పంచుకున్నారు. కరుణానిధి మరణ వార్త యావత్తు దేశానికే తీరని లోటని జన్మతః తమిళుడైన నరసింహన్ అన్నారు…     ఆంధ్రా సీఎం చంద్రబాబు తమ సందేశంలో… దేశం రాజకీయ యోధుడిని కోల్పోయిందన్నారు. సాహిత్య, సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో కలైంగర్ విశేష కృషి చేశారని కొనియాడారు. సేవాభావం, పాలనా అనుభవంతో ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారని కీర్తించారు. నిరుపేదలు, బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పరితపించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు…     తమిళ దిగ్గజ నేత మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పందించారు. చెన్నైలో జరగబోయే కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొనబోతున్న ఆయన… కరుణ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి అని శ్లాఘించారు. దేశ రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ పేర్కొన్నారు….     కరుణానిధి బాటలోనే సినిమాల నుంచీ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తుదిశ్వాస విడవడం తనని విషాదంలో ముంచిందన్నారు. ద్రవిడ ఉద్యమ తపోపుత్రుడంటూ ‘కలైంగర్’ ను కీర్తించిన ఆయన…  కరుణానిధి అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారని ఆశించినట్లు చెప్పారు. వారి అస్తమయం కేవలం తమిళనాడుకే కాదు యావత్ దేశానికీ తీరనిలోటన్నారు. ముఖ్యంగా, దక్షిణ భారతదేశానికి కరుణానిధి లేని లోటు తీరేది కాదన్నారు. కరుణానిధి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన పవన్ ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు…

టీడీపీ ‘ప్రెషర్’కి తలొగ్గిన వైసీపీ! మోదీకి వ్యతిరేకంగా ఓటు!

భారతదేశం లాంటి పెద్ద దేశంలో ప్రతీ నెలా ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే వుంటుంది. అయిదేళ్లకోసారి పార్లమెంట్ ఎన్నికల జాతర వస్తే, ఆరు నెలలకి ఒకసారి రాష్ట్రాల ఎన్నికల తిరనాళ్లు! ఇక అసెంబ్లీ, పార్లమెంట్ లు కాక ఉప ఎన్నికల హడావిడి కూడా పార్టీలకు, నేతలకు టెన్షన్ పుట్టిస్తూ వుంటుంది. ఇలా ప్రధాని పదవి మొదలు సర్పంచ్ ల ఎన్నిక దాకా మనకు బోలెడు ఎలక్షన్స్! ఇవన్నీ సరిపోవన్నట్టు అడపాదడపా పరోక్ష ఎన్నికల కోలాహలం కూడా వచ్చేస్తుంటుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి మొదలు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల ఎంపిక దాకా మీడియాలో అదో రకం గడబిడ సాగుతుంటుంది. ఇప్పుడు అలాంటిదే మరోటి వచ్చిపడింది! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక!     మోదీ స్వంత మెజార్టీతో ప్రధాని అయ్యాక ఏ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానివ్వవద్దని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయి. అలాగైతేనే జనం ముందు తమ పట్టుదల కనిపిస్తుందని కాంగ్రెస్ సహా అన్ని మోదీ వ్యతిరేక పార్టీలు డిసైడ్ అయ్యాయి. రాను రాను అదే కోవలోకి వెళ్లిపోతున్నాయి టీడీపీ, శివసేన లాంటి 2014 నాటి మిత్ర పక్షాలు కూడా! మొత్తంగా ఏ చిన్న ఎన్నిక వచ్చినా ఇప్పుడు మోదీ వర్సెస్ రెస్ట్ అన్నట్టు తయారవుతోంది సంగ్రామం!     ఆ మధ్య జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు అనుకూలంగానే ఓటు వేసింది. అయితే అప్పటి పరిస్థితులు వేరు. చంద్రబాబు, మోదీ మధ్య దూరం ఇంతగా లేకుండింది. అలాగే, వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడైతే తెలుగు వాడిగా ఆయనకే ఓటు వేసేశారు మన టీడీపీ ఎంపీలు. విచిత్రంగా జగన్ నేతృత్వంలోని వైసీపీ కూడా బీజేపీ నిలిపిన రామ్ నాథ్ కోవింద్ కే మద్దతు తెలిపింది. రాష్ట్రంలో తమ ప్రత్యర్థి అయిన టీడీపీ రామ్ నాథ్ ను సమర్థిస్తే వైసీపీ వ్యతిరేకించాలి. కానీ, విజయసాయి రెడ్డి మార్కు పాలిటిక్స్ పుణ్యామాని జగన్ బీజేపీ అభ్యర్థికే సై అన్నారు. ఇక వెంకయ్యను ఇంతకు ముందే చెప్పుకున్నట్టు తెలుగు పార్టీలు సమర్థించటం ఆశ్చర్యమేం కాదు!     కీలకమైన పరోక్ష ఎన్నికల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎలక్షన్స్ తరువాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా వుంటుంది. చెయిర్లో వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు పెద్దల సభని నడిపేది ఈ డిప్యూటీ చైర్మనే. అందుకే, కురియన్ పదవి కాలం ముగిసి నెలలు గడిచిపోయాక ఈ నెల 9న ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. బీజేపీకి రాజ్యసభలో తగిన బలం లేదు కాబట్టి ఏకగ్రీవం ప్రయత్నాలు చేసింది. కానీ, అందుకు ఒప్పుకోని కాంగ్రెస్, తృణముల్ లాంటి పార్టీలు పోటీకే రెడీ అయ్యాయి. ఇక చేసేది లేక బీజేపీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే, ఎన్డీఏ తాజా మిత్రపక్షం జేడీయూ నుంచీ క్యాండిడేట్ ని నిలిపారు. నితీష్ కుమార్ పార్టీ తమ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను బరిలో నిలిపింది. ఈయన గెలుస్తారా అంటే అనుమానమే! గెలిపించుకునే పూర్తి సంఖ్యా బలం బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలకి లేదు. కానీ, తటస్థ పార్టీలు అధికారంలో వున్న తమవైపే మొగ్గు చూపుతాయని మోదీ క్యాంప్ ధైర్యంగా వుంది. మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో టీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీజు జనతాదళ్ లాంటి పార్టీలు రకరకాల మార్గాల్లో మోదీకి సాయమే చేశాయి. కాకపోతే, చిక్కంతా వైసీపీకే వచ్చిపడింది!     అవిశ్వాసం టైంలో జగన్ ఎంపీలు లోక్ సభలో వుండకుండా రాజీనామాలు చేసి ఇంటికొచ్చేశారు. దాంతో ఓటింగ్ తలనొప్పి వారికి లేకుండా పోయింది. కానీ, రాజ్యసభలో విజయసాయి రెడ్డితో సహా వైసీపీ ఎంపీలందరూ ఇంకా వున్నారు. మరి వీరు బీజేపీ, జేడీయూ అభ్యర్థిగా మద్దతుగా ఓటు వేయాలా వద్దా?  వేస్తే మరోసారి బీజేపీకి సాయం చేశారని టీడీపీ ప్రచారం చేస్తుంది. మీడియాలో పరువు పోతుంది. జనంలోకి తప్పుడు సంకేతాలు పోతాయి. అలాగని ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయక వ్యతిరేకంగా వేస్తే టీడీపీతో సహా కాంగ్రెస్, ఇతర పక్షాలు నిలిపిన మోదీ వ్యతిరేక అభ్యర్థికి సాయం చేసినట్టు అవుతుంది. ఎలా చూసినా వైసీపీకి డ్యామేజే తప్ప లాభం ఏం లేదు! విజయసాయి రెడ్డి తాజా కామెంట్స్ ప్రకారం బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఓటు వేయరట! వ్యతిరేకంగానే ఓటు వేస్తామంటున్నారు! ఇది ఖచ్చితంగా టీడీపీ ప్రెషర్ పాలిటిక్స్ ప్రభావమే. మోదీకి దగ్గరగా వుంటూ ఏ క్షణాన్నైనా ఎన్డీఏలో చేరిపోదామని, వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మంత్రులు కూడా అవుదామని చూస్తున్న వైసీపీ బ్యాచ్ కి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కూడా కమలానికే మద్దతు పలకాలని అనిపించటం సహజం! కానీ, టీడీపీ లోక్ సభ, రాజ్యసభల్లో హోదా పోరు ఉధృతంగా చేస్తోంది. వైసీపీ అన్ని విధాల వెనుకబడింది. ఇక ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ ఎన్నికలో కూడా చేతులు కాల్చుకుంటే ఆకులు పట్టుకోటం కూడా వృథాయే అని తత్వం బోధపడినట్టుంది. అందుకే, విజయసాయి నిర్ద్వంద్వంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు!     ఈ తాజా రాజ్యసభ ఎన్నికలో తెలుగు పార్టీలైన టీడీపీ, వైసీపీలు పోను టీఆర్ఎస్ మిగిలింది. కేసీఆర్ కి ఇప్పటికే నితీష్ కుమార్ ఫోన్ చేసి తమ పార్టీ అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్ గా గెలిపించమని రిక్వెస్ట్ చేశారట. ఈ మధ్యే మోదీ చేత పొగడ్తలు పొందిన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వరు. కాబట్టి బీజేపీ అభ్యర్థికే ఆయన పార్టీ ఓటుగా భావించవచ్చు! అదే జరిగితే ఎన్డీఏ దిశగా కేసీఆర్ గారి కారు మరింత దగ్గరగా జరిగినట్టే!