శాసనసభ చిట్టచివరి సమావేశాలు

  సోమవారం నుండి నాలుగు రోజులపాటు రాష్ట్ర శాసనసభ ఓట్-ఆన్-అకౌవుంట్ బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ సమావేశాలకు ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. ఆ తరువాత ఆర్ధిక మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ఓట్-ఆన్-అకౌవుంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. మధ్యలో ఒకరోజు విరామం తరువాత 12,13 తేదీలలో సభ మళ్ళీ సమావేశమయ్యి బడ్జెట్ పై చర్చించి, ఆమోదిస్తారు. ఇవే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో నిర్వహించబోయే ఆఖరు సమావేశాలు. ఒకవేళ పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినట్లయితే ఇవే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే చిట్ట చివరి సమావేశాలవుతాయి. మామూలు పరిస్థితుల్లో ఇటువంటప్పుడు శాసనసభ్యులలో, మంత్రులలో చాలా భావోద్వేగం నెలకొని ఉంటుంది. కానీ, రాష్ట్ర విభజన నేపద్యంలో కాంగ్రెస్ నేతలందరూ రెండుగా చీలిపోయిన కారణంగా ఒకరినొకరు ద్వేషించుకొంటూ ఈ తంతు ముగించనున్నారు.   ఇంతకాలం ఒకే కుటుంబంగా మెలిగిన కాంగ్రెస్ వాదులు ఈవిధంగా విడిపోవలసిరావడం నిజమయిన ఏ కాంగ్రెస్ వాదికయినా చాలా బాధ కలిగించక మానదు. అయితే అందుకు వేరేవరినో కాక తమ అధిష్టాన దేవతనే తప్పుపట్టవలసి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం పుణ్యమాని ప్రజలే కాదు ఆ పార్టీ నేతలు కూడా రెండుగా విడిపోయారు. కనీసం చివరిసారిగా జరిగే ఈ సమావేశాలలోనయినా సజావుగా సాగుతాయనే నమ్మకం లేదు. సాగితే సంతోషమే.

తెదేపా-బీజేపీ పొత్తుల ప్రకటన ఇక లాంఛనమే

  చంద్రబాబు రాజకీయ దక్షత, జాతీయ స్థాయిలో ఆయనకున్న రాజకీయ పరిచయాలు పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందనే బలమయిన నమ్మకం బీజేపీ అధిష్టానానికి ఉన్నందునే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి తెలంగాణా నేతల అభ్యంతరాలు పట్టించుకోకుండా తెదేపాతో పొత్తుకి మొగ్గుచూపుతోంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ఓడించేందుకు అన్నిపార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.   తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నందున, తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ వైఖరిలో చాలా స్పష్టమయిన మార్పు కనబడుతోంది. నిన్న దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ఇరువురూ కలిసి బీజేపీ కార్యాలయానికి వెళ్లి ఆపార్టీ నేత వెంకయ్య నాయుడు కలిసి తెలంగాణా బిల్లుకి మద్దతు కోరినప్పుడు, కాంగ్రెస్ పార్టీ సీమంద్రా ప్రాంతానికి ఏవిధంగా న్యాయం చేయబోతోందని ప్రశ్నించారు. ఈరోజు ఆపార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తేనే టీ-బిల్లుకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారిరువురి మాటలు మారిన బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి. ఇక చంద్రబాబు కూడా ఈ రోజు తన పార్టీ నేతలతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు దాదాపు ఖరారయిందనట్లు చెప్పారు.అందువల్ల ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల ప్రకటన ఇక లాంచనప్రాయమేనని చెప్పవచ్చును.

రాహుల్ కోసం ప్రత్యర్ధి మద్దతు కోరుతున్న కాంగ్రెస్

  తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడే బీజేపీ అసలు రంగు బయటపడుతుందని దిగ్విజయ్ సింగ్ వ్యాక్యానించారు. అయితే, బిల్లులో ఏముందో కూడా తెలుసుకోకుండా బిల్లుకి మద్దతు ఇస్తామని ఏవిధంగా హామీ ఈయగలమనే బీజేపీ ప్రశ్నకూడా సమంజసమే.   అత్యంత పారదర్శకంగా జరుగవలసిన రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా తన వైఖరి, తన ఆలోచనలు, తన నిర్ణయాలు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూ ప్రతిపక్షాల వైఖరి చెప్పమని కోరుతూ వాటిని ఇరుకున బెట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే దేశంలో నేడు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని మెచ్చుకోలేకపోతున్నాయి. అందుకే నేడు ఆ పార్టీ తన రాజకీయ ప్రత్యర్ధుల గుమ్మం ముందు నిలబడి వారి సాయం అర్ధించవలసి వస్తోంది. స్వంత పార్టీ వారే బిల్లుకి మద్దతు ఈయబోమని చెపుతున్నపుడు తన రాజకీయ ప్రత్యర్దులను కాంగ్రెస్ అధిష్టానం ఏమొహం పెట్టుకొని మద్దతు అడగ గలుగుతోందో దానికే తెలియాలి. రాహుల్ గాంధీని ప్రధానికుర్చీలో కూర్చోబెట్టేందుకు, రాష్ట్రం నుండి అవసరమయిన యంపీ సీట్లు పొందేందుకే రాష్ట్ర విభజనకు పూనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకు తన రాజకీయ ప్రత్యర్ధి బీజేపీ మద్దతు కోరడం మరీ సిగ్గు చేటు.   చివరికి తన స్వంత పార్టీ నేతలచేతే చ్చీ కొటించుకొంటున్నా దాని వైఖరిలో మార్పు కలగలేదు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో సహా పార్టీ నేతలందరూ డిల్లీలో తన కంటెదురుగా ధర్నా చేసినా దానిని అవమానంగా భావించకపోగా నిర్లజ్జగా సమర్ధించుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికే చెల్లు. తన ఈ ఆశయం నెరవేర్చుకోవడం కోసం స్వంత పార్టీ నేతలని, వారి రాజకీయ భవిష్యత్తుని కూడా బలిపెట్టేందుకు సిద్దపడిన కాంగ్రెస్ అధిష్టానం, అసలేమీ జరగనట్లుగా సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు బిల్లుకి మద్దతు ఇస్తారని భావిస్తున్నానని దిగ్విజయ్ సింగ్ పలకడం సిగ్గుచేటు.   కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వలన నేడు ఆ పార్టీ నేతలు ప్రజల ముందు తలెత్తుకొని తిరుగలేకపోతున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సాహసించడం లేదు. చెట్టుకొకరు, పుట్టకొకరు చొప్పున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెల్లాచెదురయిపోతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం తన ఆశయం మరువలేదు. తన పంతం వీడలేదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లుగా మొండిగా ముందుకు పోతోంది. వినాశకాలే విపరీత బుద్ది అన్నారు పెద్దలు. అందుకే కాంగ్రెస్ తన స్వంత పార్టీనే పణంగాపెట్టి ఈ విభజన జూదం ఆడుతోంది. తను ఏ అంశంతో కేంద్రంలో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని భావిస్తోందో, అదే అంశం ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారబోతోంది.

రేణుకా చౌదరి గోబ్యాక్

      ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద ఎంపీ రేణుకా చౌదరికి చేదు అనుభవనం ఎదురైంది. భద్రాచలం డివిజన్, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపకూడదంటూ ఏపీభవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ ధర్నాకు దిగారు. వీరికి ఎంపీ రేణుకాచౌదరి మద్దతు తెలిపేందుకు అక్కడి వెళ్లగా, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు అభ్యంతరం తెలిపారు. రేణుకాచౌదరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులపై రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తర్వాత ఇరువురు శాంతిచడంతో రేణుకాచౌదరి ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ తెలంగాణదే అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క గ్రామాన్ని ఒదులుకోబోమని రేణుకాచౌదరి తెలిపారు.ఖమ్మం జిల్లాలో భద్రచలానికి ప్రత్యేక స్థానం ఉందని, భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవడం తమ లక్ష్యమని రేణుకా చౌదరి చెప్పారు. రామాలయం ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె స్పష్టం చేశారు.

దేశభద్రతో ఆటలాడుకుంటున్న యూపీఏ

      యూపీఏ, మణీపూర్ ప్రభుత్వాలు దేశ భద్రతో ఆటలాడుకుంటూన్నాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం దేశమంతటా పర్యటిస్తున్న నరేంద్ర మోదీ..ఈరోజు మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఢిల్లీలో అరుణాచల్ విద్యార్థి హత్య దేశానికే సిగ్గు చేటు అని మోదీ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని ప్రాతినిత్యం వహిస్తున్నా ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. భారత భూభాగం పొరుగుదేశాలకు ధారాదత్తమైందని మోదీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి కోసం ఏన్డీయే ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చిందని తెలిపారు. ఇతర ప్రాంతాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పర్యాటకరంగ అభివృద్దితోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. మోదీ బహిరంగ సభకు అభిమానులు, బిజెపి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ముఖ్యమంత్రి చాలా మంచోడు: దిగ్విజయ్ సింగ్

  కాంగ్రెస్ చరిత్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాగ ఇంతవరకు మరే ముఖ్యమంత్రి కూడా తన అధిష్టానం మీద ఇంతగా తిరుగుబాటు చేసి ఉండరు. అదేవిధంగా అధిష్టానం కూడా మరే ముఖ్యమంత్రిని ఇంతగా వెనకేసుకొచ్చిన దాఖలాలు లేవు. పార్టీని వ్యతిరేఖించడం, పార్టీ నిర్ణయాన్నివ్యతిరేఖించడం రెండూ వేర్వేరు అంశాలనే సరికొత్త సిద్దాంతాన్నికాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి కలిసి కనిపెట్టారు. ఆ సిద్ధాంతం ప్రకారం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించడం, దానిని తప్పుపట్టడం, తీర్మానాలు చేయడం, డిల్లీలో ధర్నాలు చేయడం అన్నీ కూడా అభిప్రాయ వ్యక్తీకరణ పద్ధులోనే రాసుకోబడుతాయి తప్ప పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఖాతాలో నమోదు చేయబడవని ఆ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇవ్వాళ మరోమారు స్పష్టం చేసారు. అయితే ఈ సిద్ధాంతం టీ-కాంగ్రెస్ నేతలకి బొత్తిగా అర్ధం కాలేదో లేక అర్ధమయినప్పటికీ అర్ధంకానట్లు నటిస్తూ కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతున్నారో తెలియదు.   దిగ్విజయ్ సింగ్ ఈరోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం పార్టీ తీసుకొన్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేఖిస్తున్నారు. ఆయన మొదట నుండి సమైక్యవాది గనుకనే తన నిరసనను తెలియజేసేందుకు మొన్న డిల్లీలో ధర్నా చేసారు. మేమే మా పార్టీ సభ్యులందరికీ రాష్ట్ర విభజన అంశంపై నిస్సంకోచంగా మాట్లాడమని, తమ తమ అభిప్రాయాలను చెప్పమని కోరాము. అటువంటప్పుడు తన అభిప్రాయం చెపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి, క్రమశిక్షణ ఉల్లంఘించారని భావించలేము. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కానీ, సోనియాగాంధీని గానీ ఎన్నడూ వ్యతిరేఖించలేదు” అని అన్నారు.   దిగ్విజయ్ సింగ్ చెపుతున్న ప్రకారం చూసినట్లయితే, అధిష్టానం ఆదేశాల ప్రకారమే ముఖ్యమంత్రి నడుచుకొంటున్నారని స్పష్టమవుతోంది. ఆయన అధిష్టానానికి వ్యతిరేఖంగా చేస్తున్నసమైక్య ప్రసంగాలు, విమర్శలు, తీర్మానాలు, ధర్నాలు అన్నీ కూడా అధిష్టానం అనుమతితోనే జరుగుతున్నాయని దిగ్విజయ్ సింగ్ చెప్పకనే చెప్పారు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎటువంటి డోకా లేదని కూడా అర్ధమవుతోంది.   ఆయన డిల్లీలో ధర్నా చేసి పార్టీ పరువు మంట గలిపినందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై చాలా ఆగ్రహంతో ఉందని, అందువల్ల రాజ్యసభ ఎన్నికల తరువాత ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుండి తప్పిస్తారని మీడియాలో వచ్చిన వార్తలు కూడా నిజం కావని దిగ్విజయ్ తాజాగా ఇచ్చిన సర్టిఫికేట్ దృవీకరిస్తోంది. అందువల్ల కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి తనంతట తాను ఆట డిక్లేర్ చేసేసి తప్పుకొంటే తప్ప ఆయనకి ఇంకా చాలా లాస్ట్ బాల్స్ ఆడుకోవచ్చని థర్డ్ ఎంపైర్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేసారు.   ఇక ఇంతకాలం సమైక్యమంటూ ఊగిపోయిన మంత్రి గంటా శ్రీనివాసరావు కొత్త పార్టీ గురించి ఇప్పుడేమీ ఆలోచన చేయడం లేదని చెప్పడం చూస్తే,కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ నిరాశపరుస్తూ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయిపోతారా అనే అనుమానం కలుగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి విశాఖ ఎమ్మెల్యే ఝలక్

  వైజాగ్ కాంగ్రెస్ యంయల్యే తైనాల విజయకుమార్ పార్టీకి ‘గుడ్ బై’ చెప్పేసి రేపు వై.కాంగ్రెస్ లో చేరిపోతున్నట్లు తాజా సమాచారం. వైకాపాలో చేరేందుకు ఇంతకాలంగా తటపటాయించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరియు ఆయన అనుచరులు రేపు శ్రీకాకుళంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైకాపా తీర్ధం స్వీకరించనున్నారు. వారితోబాటే తైనాల కూడా వైకాపా తీర్ధం పుచ్చుకోబోతున్నారని తాజా సమాచారం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మసలిన తైనాల, ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తరువాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ యం.యల్యేలతో బాటు ఆయన కూడా సంతకాలు సేకరణ చేశారు. కానీ, ఆ తరువాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వెళ్లిపోయి వైకాపా స్థాపించినపుడు, వైయస్సార్ అభిమానులు చాలా మంది వైకాపాలోకి వెళ్ళినప్పటికీ తైనాల మాత్రం ఎందుకో ఆ పార్టీలో చేరలేదు. కానీ, నిన్న కేంద్రం రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన తరువాత, ఇంకా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటే, ఆ పార్టీతో బాటు తను కూడా మునగడం ఖాయమని భయపడ్డారో ఏమో, వెంటనే తను కాంగ్రెస్ వీడి వైకాపాలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ధర్మాన, తైనాల వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ వైకాపాలో చేరుతున్నట్లు చెప్పుకోవడం వినడానికి బాగానే ఉంది. కానీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమికి మద్దతు ఇస్తామని చెపుతున్న వైకాపాలోకి చేరడం చూస్తే, వారు రానున్నఎన్నికలలో గెలవడం కోసమే పార్టీ మారుతున్నారు తప్ప, పార్టీని, దాని నిర్ణయాన్ని వ్యతిరేఖించి కాదని అర్ధమవుతోంది.

రాజ్యసభ ఫలితాలు...అందరూ అనుకున్నట్టే

      రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అందరూ అనుకున్నట్టే వచ్చాయి. ఎలాంటి ట్విస్ట్ లు లేవు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో ఆరుగురి ఎంపీల ఎంపిక  లాంఛనప్రాయమేనని భావించారు. ఈరోజు జరిగిన ఎన్నికలో  కేవీపీ రామచంద్రరావుకు 46 తొలి ప్రాధాన్యతా ఓట్లు పోలయ్యాయి. అలాగే ఎంఏ ఖాన్ కు 49, తిక్కవరపు సుబ్బరామిరెడ్డికి 46 లెక్కన వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థుల్లో గరికపాటికి 36 ఓట్లు రాగా, సీతా రామలక్ష్మికి 38 ఓట్లు వచ్చాయి. తెరాస అభ్యర్థి కె. కేశవ రావు 26 ఓట్లు వచ్చాయి. తెరాసకు 17 మంది శాసనసభ్యులు ఉండగా, తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనకు ఓటేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 248 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైకాపా, బిజెపి, సీపీఎం సభ్యులు ఓటింగ్ కు దూరంగా వున్నారు.

విభజన బిల్లుకు కేబినెట్ ఆమోదం

      రాష్ట్ర విభజనపై ఢిల్లీలో పనులన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. ప్రధాని నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ౦ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. పోలవరం ముంపు ప్రాంతాలన్ని సీమా౦ధ్రలో కలపాలని కేబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు కోరగా అందుకు కేబినెట్ అంగీకరించలేదు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును వీలైతే ఈ రాత్రికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపి౦చనున్నారు. సోమవారానికి బిల్లు రాజ్యసభకు చేరేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

చివరి దశకు చేరుకొన్న విభజన బిల్లు

  సుప్రీంకోర్టు రాష్ట్ర విభజన అంశంలో ఇక జోక్యం చేసుకోదని స్పష్టమయింది గనుక ఇక కేంద్రం కూడా దైర్యంగా ముందుకు సాగవచ్చును. ఈరోజు సాయంత్రం జరగనున్న కేంద్రమంత్రి మండలి సమావేశంలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టబడుతుంది. సీమాంధ్ర మంత్రుల ఒత్తిడి మేరకు జీ.ఓ.యం. ఆ బిల్లులో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం వంటి సవరణలు ఏమయినా చేసి ఉంటే, వాటిపై ఈ సమావేశంలో మరోమారు చర్చించిన తరువాత, బిల్లుని ఆమోదించి రాష్ట్రపతికి పంపుతారు.   ముఖ్యమంత్రితో సహా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు అనేకమంది ఇచ్చిన విజ్ఞప్తులను, చేసిన అభ్యర్ధనలను ఆయన పరిగణనలోకి తీసుకోనేమాటయితే బిల్లుకి మళ్ళీ ఆటంకం ఏర్పడవచ్చును. కానీ, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోబోదని తేల్చిచెప్పినందున, బహుశః ఆయన కూడా తన వద్దకు వచ్చిన బిల్లుని యధాతధంగా ఆమోదించి పంపే అవకాశం ఉంది.   ఆ దశ దాటిపోయినట్లయితే, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి తగిన మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. ఒకవేళ బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ వ్యవహారంలో తమ చేతికి మసి అంటకుండా తప్పుకోదలిస్తే, ఓటింగ్ సమయంలో సభ సజావుగా నడవడం లేదనే వంకతోనో లేకపోతే మరొక కుంటి సాకు చెప్పో వాకవుట్ చేసి సభనుండి బయటపడినట్లయితే, కాంగ్రెస్ అధిష్టానం ఉభయ సభలలో తనకున్న బలంతో ఆ గందరగోళం నడుమే రాష్ట్ర విభజన బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేయవచ్చును.   కానీ, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే మాత్రం తెలంగాణావాదులు కూడా సభలో బిల్లుని తీవ్రంగా వ్యతిరేఖించవచ్చును. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేసేందుకు సిద్దపడినట్లయితే, ఎలాగు సీమాంధ్రలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొంది గనుక, హైదరాబాద్-కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదనను కూడా బుట్ట దాఖలు చేయడం వలన పార్టీకి సీమాంధ్రలో కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదు గనుక అలా చేసినా ఆశ్చర్యం లేదు.

సమైక్యవాదులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

  రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేఖంగా పయ్యావుల కేశవ్ తదితరులు తొమ్మిది మంది వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు నారిమన్ మరియు మోహన్ లాల్ శర్మల వాదనలు విన్న తరువాత తీర్పు వెలువరిస్తూ “ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అంశంలో కోర్టు కలుగజేసుకోలేదని తేల్చి చెప్పారు.పిటిషనర్లు తరపున వాదించిన న్యాయవాదులు, కేంద్రం ఆర్టికల్ మూడుని దుర్వినియోగం చేస్తోందని అందువల్ల విభజన ప్రక్రియను వెంటనే నిలిపివేయమని ఆదేశించాలని కోరినప్పటికీ కోర్టు వారి అభ్యర్ధనను మన్నించలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఇదివరకు వారు చేసిన వాదనలకు, ఇప్పుడు వారు చేస్తున్న వాదనలకు పెద్ద తేడా లేదని, అందువల్ల ఈవిషయంలో కోర్టు కలుగజేసుకోలేదని తేల్చి చెప్పింది. అంతేగాక వారు లేవనెత్తిన మరో అంశం-కేంద్రం పంపిన విభజన బిల్లుని రాష్ట్ర శాసనసభ తిరస్కరించింది గనుక దానిపై కోర్టు తన అభిప్రాయం తెలిపి స్పష్టత ఇవ్వాలని వారి అభ్యర్ధనను కూడా కోర్టు పట్టించుకోలేదు.

దగ్గుబాటి ఓటేందుకు వేయలేదు

  కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఈరోజు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో పార్టీ నిలబెట్టిన అభ్యర్దులెవరికీ ఓటేయకుండా తిరస్కరించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా తమ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్నందుకు నిరసనగానే తాను పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులకు ఓటు వేయకుండా తిరస్కరించి తన నిరసన వ్యక్తం చేసానని తెలిపారు. ఆయన ఈవిధంగా ప్రజాస్వామ్యబద్దంగా తనకున్న హక్కుని వినియోగించుకొని నిరసన తెలపడం అభినందనీయం.   రాష్ట్రాన్నిసమైఖ్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర నేతలందరూ పార్టీపై పోరాటం చేస్తూనే, రాజ్యసభ టికెట్స్ కోసం అర్రులు చాచడం, తిరుగుబాటు అభ్యర్ధుల కారణంగా ఎన్నికలలో ఓడిపోతామేనని విలపించడం, ఆ తరువాత ముఖ్యమంత్రితో సహా అందరూ కలిసి తాము ఏ అధిష్టానానికి వ్యతిరేఖంగా పోరాడుతున్నారో ఆ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్ధులని గెలిపించుకోవడం కోసమే, సమైక్యవాదుల తరపున పోటీలో నిలబడిన తిరుగుబాటు అభ్యర్ధి చైతన్యరాజుని అప్రదిష్ట పాలుచేసి, చివరికి పోటీలో నుండి బలవంతంగా విరమింపజేయడం అందరం కళ్ళారా చూసాము. కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాత్రం, నిర్భీతిగా, నిర్ద్వందంగా పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులను తిరస్కరించగలిగారు.   అయితే, ఆయన భార్య మరియు కేంద్రమంత్రి అయిన దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర విభజన అనివార్యమని భావిస్తూ సీమాంధ్ర కోసం కేంద్రాన్ని ప్యాకేజీలు కోరుతున్నారు. కానీ, ఆయన ఆమెను ఎందుకు వారించడం లేదో తెలియదు. రాష్ట్ర విభజనపై వారిరువురు ఏనాడు తమ ఉమ్మడి నిర్ణయం లేదా అభిప్రాయం ప్రకటించిన దాఖలాలు లేవు గనుక, ఆమె తన భార్య అయినప్పటికీ, ఆమె అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ విషయాన్ని ఆమె విజ్ఞతకే వదిలిపెట్టారనుకోవలసి ఉంటుంది.   ఇక ఆయన సుబ్బిరామి రెడ్డిని తిరస్కరించడానికి కారణం అందరికీ తెలిసిందే. వైజాగ్ లోక్ సభ సీటు కోసం సుబ్బిరామి రెడ్డి, పురందేశ్వరికి పొగబెట్టే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా ఆయనకీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు మధ్య జరిగిన గొడవ కోర్టులో పరువు నష్టం దావా వేసుకొనే వరకు వెళ్ళింది. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు దగ్గుబాటి ఆయనకే ఓటువేస్తారని ఆశించలేరు. ఇక యం.ఏ.ఖాన్, కేవీపీలకి ఓటు వేయపోవడానికి కారణం మాత్రం ఆయన చెప్పిన కారణమే అయి ఉండవచ్చును.

రాజ్యసభ ఎన్నికలు...దగ్గుబాటి తిరస్కరణ ఓటు

      రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదట శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తమ ఓటును వేశారు. టిడిపి పార్టీ తమ ఇద్దరూ అభ్యర్ధులకు 37 ఓట్లు కేటాయించింది. లోక్ సత్తా అధినేత జేపీ కూడా తన ఓటును టిడిపికి వేయనున్నట్లు ప్రకటించారు. వైకాపా,బిజెపిలు ఓటింగ్ కు దూరంగా వున్నాయి. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తొలిసారిగా తిరస్కరణ ఓటు వినియోగించుకున్నారు. ఆయన ఏ అభ్యర్ధికి ఓటు వేయలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పే తిరస్కరణ ఓటు వేసినట్లు తెలిపారు. విభజన బిల్లు సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసేలా లేదని విమర్శించారు. సీమాంధ్రుల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని, అందుకే తిరస్కరణ ఓటు వేసినట్లు తెలిపారు.

లగడపాటిది కాంగ్రెస్ డీ.యన్.ఏ. కాదా?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి తనదయిన శైలిలో ‘సమైక్య చాంపియన్ షిప్’ పోటీలో దూసుకుపోతున్నపటికీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు వేస్తున్నఎత్తులతో పోటీలో వెనుకబడిపోతున్నారు. ఇక వీరిరువురు కాక ఈ పోటీలో విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్ తదితరులున్నపటికీ, వారందరూ పక్క వాయిద్యాలకే పరిమితమవడం వలన వారు మీడియా ముందుకు వచ్చి ఎంతగా గొంతు చించుకొన్నపటికీ ముఖ్యమంత్రికి వస్తున్నంత మీడియా కవరేజ్, ప్రాధాన్యం దక్కడం లేదు, బహుశః ఆశించడం లేదేమో కూడా. మిగిలినవారి సంగతి ఎలా ఉన్నపటికీ లగడపాటి రాజగోపాల్ మాత్రం ఈవిషయంలో ఎన్నడూ రాజీపడలేదు. మీడియా దృష్టిలో పడాలనే తాపత్రయంతో ఆయన రాజీనామా చేయడం, దానిని స్పీకర్ ఆమోదించలేదని కోర్టుకి వెళ్ళడం, స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టడం వంటివి చాలానే చేస్తున్నారు. కానీ, చేసేపనిలో చిత్తశుద్ది లోపించడంతో అవి విఫలమయి నవ్వులపాలవుతున్నారు.   ఇంతకు ముందు తమ అధిష్టానం దత్తపుత్రుడు (జగన్మోహన్ రెడ్డి) కోసం స్వంత కొడుకులవంటి తమనే బలిపెడుతోందని, ఆయనతో తమ అధిష్టానం తెరవెనుక రహస్య ఒప్పందాలు చేసుకొందని ఆరోపించారు. మళ్ళీ ఆయన మొన్నమీడియాతో మాట్లాడుతూ విభజనవాది అయిన తెరాస రాజ్యసభ అభ్యర్ధి కేశవ్ రావుకి ఓటేయమని తమ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పిందని సరికొత్త ఆరోపణలు చేసారు. కానీ, వైకాపా తన శాసనసభ్యులెవరూ రాజ్యసభ ఎన్నికలలో పాల్గొనరాదని విప్ జారీ చేయడంతో లగడపాటి మరోమారు కంగుతిన్నారు.   ముఖ్యమంత్రితో సీమాంధ్ర నేతలందరూ కూడా విభజన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నారు తప్ప ఎవరూ అధిష్టానాన్ని వ్యతిరేఖించాలని అనుకోవడం లేదు. పార్టీ సూచించిన రాజ్యసభ అభ్యర్ధులకు మద్దతుగా ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కృషి చేసినప్పుడే ఆ విషయం మరోమారు స్పష్టమయింది. కానీ, లగడపాటి మరి ఆ సంగతి గ్రహించలేదో లేక ఎలాగు కొత్తపార్టీ పెట్టుకొని బయటకు వెళ్లిపోతున్నపుడు, అధిష్టానాన్ని ఆ మాత్రం ఆడిపోసుకొంటే తప్ప పూర్తి మైలేజీ రాదని భావిస్తున్నారో తెలియదు కానీ నిత్యం కాంగ్రెస్ అధిష్టానాన్ని దుమ్మెత్తి పోస్తూ హిరణ్యకశిపుడిలా వైరం పాటిస్తున్నారు. పనిలోపనిగా అధిష్టానానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సాటి సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులను కూడా ఆయన ఏదో రూపంలో గట్టిగా ‘టచ్చ్’ చేస్తూనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, కావూరి సాంభశివరావు తదితరులతో ఆయన చాలాసార్లే కత్తులు దూశారు.   మూడు రోజుల క్రితం కేవీపీ రామచంద్ర రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నేతలందరికీ డిల్లీలో తన నివాసంలో విందు భోజనం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా లగడపాటి రాజగోపాల్, కేంద్రమంత్రి కావూరి సాంభశివరావు పార్లమెంటులో గట్టిగా సమైక్యవాదం వినిపించకుండా మిన్నకుండి పోతున్నారని తీవ్ర విమర్శలు చేసినప్పుడు, సీమాంధ్ర నేతలందరూ లగడపాటినే తప్పుపట్టారు.   పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించడం ఎంత ముఖ్యమో పార్టీని బ్రతికించుకోవడమూ తమకు అంతే ముఖ్యమని, అప్పుడే రాజకీయ నేతలుగా తమకు మనుగడ ఉంటుందనే సంగతిని గ్రహించాలని కేవీపీతో సహా అందరూ ఆయనకు క్లాసు పీకినట్లు సమాచారం. కానీ, లగడపాటి మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకు సర్ది చెప్పినట్లు సమాచారం.   పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ కేంద్ర ప్రభుత్వం పంపిన బిల్లుకి వ్యతిరేఖంగా శాసనసభలో తీర్మానం కూడా చేయించి, డిల్లీలో దీక్షలు చేస్తూనే పార్టీని ఎలాగయినా బ్రతికించుకోవాలని ఆత్రుతపడుతున్నకేవీపీ, చిరంజీవి, కావూరి, కిరణ్, బొత్స, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు తదితరులు, మరోవైపు స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానాలు చేస్తున్నకాంగ్రెస్ పార్టీకి స్వంత కొడుకు వంటి లగడపాటి రాజగోపాల్ లలో ఎవరిది అసలు సిసలయిన కాంగ్రెస్ డీ.యన్.ఏ. యో ప్రజలే తేల్చవలసి ఉంది.

గీతారెడ్డి రాజీనామా చేస్తారా?

      ఢిల్లీలో ఏపీభవన్ వద్ద మహిళా మంత్రులపై భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల రాష్ట్ర మంత్రి గీతారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో వున్నట్లు రాజకీయవర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ బుధవారం తన దీక్ష కోసం ఏపీభవన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనను నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సంధర్బంగా అక్కడ వున్న భద్రతా సిబ్బంది మహిళా మంత్రులపై దూరుసుగా ప్రవర్తించారట. దీంతో మంత్రి గీతారెడ్డి నొచ్చుకున్నారు. అయితే ఈ ఘటనపై ప్రధాని, రాష్ట్రపతిలు విచారణ వ్యక్తం చేయగా...రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ మహిళా మంత్రులను సంప్రదించి విచారణ వ్యక్తం చేయకపోవడంపై ఆమె మండిపడుతున్నారు. మరోవైపు గీతారెడ్డికి జరిగిన అవమానానికి సొంత నియోజకవర్గమైన జహీరాబాద్ లో తెలంగాణ వాసులు కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి బంద్ నిర్వహించారు.

మూజువాణి ఓటుతో టీ-బిల్లుని ఆమోదం పొందనుందా

  ఈనెల 10న టీ-బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెడతామని హోంమంత్రి షిండే ప్రకటించారు. ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలన్నీకూడా రాష్ట్రపతిని కలిసి బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, దానిని ఆమోదించవద్దని కోరుతున్నపుడు, రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో తెలియదు. కానీ, హోంమంత్రి షిండే బిల్లుని 10వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెడతామని ముందే ప్రకటించడం చూస్తే, బిల్లుపై ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా అవేవి పట్టించుకోకుండా రాష్ట్రపతి బిల్లుని ఆమోదిస్తారని ఆయన నుండి హామీ లేదా గుడ్డి నమ్మకం కలిగి ఉన్నందునే ఆయన అంత ధీమాగా ప్రకటించారేమో! ఈరోజు సుప్రీంకోర్టు బిల్లుకి వ్యతిరేఖంగా దాఖలయిన 8 పిటిషన్లపై విచారణ మొదలుపెట్టబోతోంది. కోర్టు బిల్లుపై తన అభిప్రాయాలు తెలిపినట్లయితే దానిని బట్టి రాష్ట్రపతి కూడా తగు నిర్ణయం తీసుకోవచ్చును. ఒకవేళ సుప్రీం కోర్టు విచారణ మొదలుపెట్టి, విభజన ప్రక్రియపై ‘స్టే’ విదిస్తూ ప్రతివాదులుగా పేర్కొనబడిన కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లయితే ఇక రాష్ట్ర విభజన అధ్యాయం ముగిసిపోయినట్లే. అలా కాకుండా విచారణను మరో వారం పదిరోజులకి వాయిదా వేసినట్లయితే, సుప్రీంకోర్టు నుండి కూడా బిల్లుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే భావించవచ్చును.   గనుక ఇక రాష్ట్రపతి కూడా బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదముద్ర వేసినట్లయితే, షిండే ప్రకటించినట్లు బిల్లుని 10వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టడం సాధ్యమవుతుంది. కానీ, బీజేపీతో సహా అనేక ప్రతిపక్షపార్టీలు, యూపీఏకి బయట నుండి మద్దతు ఇస్తున్నసమాజ్ వాదీ పార్టీ, సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు బిల్లుని వ్యతిరేఖిస్తామని చెపుతున్నపుడు పార్లమెంటులో బిల్లు అమోదం పొందడం కష్టమవుతుంది.   అయితే ఈ గండం గట్టేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక విజయవంతమయిన ఫార్ములాను దిగ్విజయంగా ఉభయసభలలో తన సభ్యుల ద్వారా అమలుచేస్తోంది. సీమాంధ్ర,తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సభ్యులు, రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల సభ్యులు అందరూ కలిసి గత రెండు రోజులుగా ఉభయ సభలలో ఆందోళన చేస్తూ సభాకార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతుండటంతో ఉభయసభలు వాయిదాలు పడుతున్నాయి. బహుశః సమావేశాలు ముగిసే వరకు కూడా ఇదే తంతు కొనసాగే అవకాశం ఉంది.   రాష్ట్ర శాసనసభకు టీ-బిల్లు వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే విధంగా జరిగింది. కానీ, ముఖ్యమంత్రి టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ప్రవేశపెట్టిన తీర్మానం తీవ్ర గందరగోళం నడుమ మూజువాణి ఓటుతో ఆమోదింపబడింది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణా బిల్లుని అదే పద్దతిలో ఆమోదింపజేసే ఆలోచనలో ఉన్నట్లు కనబడుతోంది. ఇంతకాలంగా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తానని చెపుతూ వచ్చిన బీజేపీ ఇప్పుడు వ్యతిరేఖంగా ఓటువేసి అప్రదిష్టపాలవడం కంటే, కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ వ్యూహానికి చాలా సంతోషంగా సహకరిస్తూ, ఓటింగ్ సమయానికి సభలో జరుగుతున్నరాద్ధాంతాన్ని నిరసిస్తూ సభ నుండి వాకవుట్ చేసి బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందేలా చేయవచ్చును. ఈవిధంగా కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఈ గండం నుండి గట్టెక్కగలవు.   కానీ, అంతకంటే ముందు మూడు సమస్యలు బిల్లుకి అవరోధంగా నిలిచే అవకాశం ఉంది. 1. సుప్రీంకోర్టు బిల్లుపై వెలువరించబోయే నిర్ణయం. 2. రాష్ట్రపతి బిల్లుకి ఆమోదం3. ఒకవేళ కేంద్రం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే టీ-కాంగ్రెస్, తెరాస నేతలు బిల్లుని వ్యతిరేఖిస్తే ఏమి చేయాలి? ముందుకు సాగాలా? వెనక్కి తగ్గాలా?   ముందుకు వెళితే దానివలన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో ఎటువంటి రాజకీయ లబ్ది కలుగకపోగా, అక్కడ కూడా పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చును. వెనక్కి తగ్గితే సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేస్తారు. కానీ మూజువాణి ఓటుతో బిల్లుని పార్లమెంటులో ఆమోదింపజేయాలని కాంగ్రెస్ భావిస్తే, హైదరాబాద్-కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదనను కేంద్రం చెత్తబుట్టలో పడేసి నిర్భయంగా ముందుకు సాగవచ్చును.

మళ్ళీ మొదటికొచ్చిన హైదరాబాద్ సమస్య

  ఈ రోజు మారు సమావేశమయిన కేంద్రమంత్రుల బృందం (జీ.ఓ.యం.) హైదరాబాద్ ను పదేళ్ళ పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా చేసి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పూనుకొంటే ఈసారి తెలంగాణా నేతలు, పార్టీలు కేంద్రంపై కత్తులు దూయడం తధ్యం. హైదరాబాదును పదేళ్ళపాటు ఉమ్మడిరాజధానిగా ఉంచేందుకే అంగీకరించని తెలంగాణా నేతలు, ఇప్పుడు హైదరాబాద్ ను ఏకంగా పదేళ్ళపాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తానంటే చూస్తూ ఊరుకొంటారని భావించలేము. మరో రెండు మూడు రోజుల్లో పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుని ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఈ సమయానికి కూడా కేంద్రానికి దానిపై ఎటువంటి స్పష్టత లేదని ఇది నిరూపిస్తోంది. కోట్లాది తెలుగు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఇటువంటి కీలకమయిన, సున్నితమయిన అంశాన్ని క్రికెట్ ఆటలో టాస్ వేసి నిర్ణయించినట్లు రెండు మూడు గంటల జీ.ఓ.యం. సమావేశంలో అవలీలగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తే కాంగ్రెస్ అధిష్టానం ఈవిషయానికి ఎంత తేలికగా తీసుకోన్నదీ స్పష్టమవుతోంది. రాష్ట్రవిభజన చేసి, హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయడం వలన అక్కడ స్థిరపడిన ఆంద్ర ప్రజలకు భద్రత కల్పించవచ్చునేమో కానీ దానివలన అటు తెలంగాణాకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గానీ ఎటువంటి లాభము ఉండబోదు. రాష్ట్ర విభజన చేసిన కారణంగా సీమాంధ్రలో ప్రజలు, హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినందుకు తెలంగాణా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికలలో తరిమితరిమి కొడతారు.   ఇంతవరకు సీమాంధ్ర ప్రజలకు మాత్రమే రాష్ట్ర విభజన ఆమోదయోగ్యం కాదని అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం హైదరాబాద్ ను పదేళ్ళ పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తమకు ఆమోదయోగ్యం కాదని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టక మునుపే వారు కూడా తేల్చి చెప్పవచ్చును. అటువంటప్పుడు ఇరుప్రాంతాల ప్రజలకి, పార్టీలకి ఆమోదయోగ్యం కాని రాష్ట్ర విభజన బిల్లుని కేంద్రం ఏవిధంగా పార్లమెంటు చేత ఆమోదింపజేయగలుగుతుంది? చేసినా దానివల్ల కాంగ్రెస్ ఏమి బావుకొంటుంది? ఇంతకీ ఇదంతా చేస్తున్నది ప్రజల సంక్షేమ కోసమా? లేక కాంగ్రెస్ సంక్షేమం కోసమా? అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ కూడా జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంది.

రాజ్యసభ ఎన్నికల తరువాత కిరణ్ ఔట్!

      రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం తప్పించనుందని రాజకీయవర్గాలలో జోరుగా ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సీఎం కిరణ్ ఢిల్లీలో దీక్ష చేయడంతో ఆయనపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి తో వున్నట్లు సమాచారం. దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ నేతలకి ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. అయితే ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న గేమ్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అధిష్టానం వేసిన స్కెచ్ ప్రకారమే కిరణ్ ముందుకు వెళ్తున్నాడని, రాజ్యసభ ఎన్నికల్లో రెబెల్స్ ను ఆయన తప్పించడమే దానికి నిదర్శనం అని..బయటకు కనిపిస్తున్నది వేరు ..లోపల జరుగుతున్నది వేరు అని మరి కొంతమంది అంటున్నారు.

లోక్ సభలో రచ్చ రచ్చ

      పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నినాదాలు, నిరసనలతో లోక్ సభ రెండు సార్లు వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. వీరికి ప్రతిగా తెలంగాణ ఎంపీలు నిరసనలకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి ఇరు ప్రాంతాల ఎంపీలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ సజావుగా సాగడానికి సహకరిచాలని స్పీకర్ విజ్ఞప్తి చేసిన సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. టిడిపి ఎంపీ మోదుగుల, కాంగ్రెస్ ఎంపీ సబ్బంహరి ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు అందాయని, సభలో గందరగోళ పరిస్థితుల వల్ల నోటీసులను చేపట్టలేకపోతున్నానని స్పీకర్ తెలిపారు.