కాంగ్రెస్ కపట నాటకాలకు అంతే లేదా?

  నిన్న మొన్నటి వరకు తమను తమ అధిష్టానం అసలు ఖాతరు చేయడం లేదని, తమ మాటకు అసలు విలువే ఈయడం లేదని వాపోయిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు అదే అధిష్టానానికి వీరభజనలు చేసేస్తూ, రాష్ట్రాన్ని విడదీసిందని తిట్టిపోసిన అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తీరుతామని శపధాలు కూడా చేస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా కనికరం చూపుతూ అనేక వరాలు ప్రకటించినందున వారిరువురికీ సీమాంధ్ర ప్రజలు ఎంతో ఋణపడి ఉండాలని, అందువలన కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించుకొని కృతజ్ఞత ప్రకటించుకోవాలని కాంగ్రెస్ నేతలు కొందరు ఊరూరు తిరుగుతూ ప్రజలకు నూరిపోస్తున్నారు. పనిలోపనిగా, పార్టీని వీడిపోయిన వారందరూ ద్రోహులని, వారి వలననే రాష్ట్ర విభజన జరిగిందని అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు.   రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ, ఒకసారి తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల వలననే విభజించవలసి వచ్చిందని, అన్ని పార్టీలు ఒత్తిడి చేయడం వలననే విభజించవలసి వచ్చిందని మరోసారి, కిరణ్ కుమార్ రెడ్డి సహకరించడం వలననే విభజన జరిగిందని మరొకసారి చెప్పడం గమనిస్తే కాంగ్రెస్ నాలికకి నరం లేదని అర్ధమవుతుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన అధిష్టానానికి పూర్తిగా సహకరించారని చిరంజీవే స్వయంగా చెపుతున్నారు. అంటే ఆ విషయం ఆయనకీ చాలా స్పష్టంగా తెలుసనీ ఆయనే దృవీకరిస్తున్నారు.   అదేవిధంగా పార్టీకి అత్యంత విదేయుడయిన కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా విభజన ప్రక్రియను చివరి వరకు పర్యవేక్షిస్తారని దిగ్విజయ్ సింగ్ కూడా మొదటే ప్రకటించారు. ఆయన చెప్పినట్లే విభజన ప్రక్రియకి రాష్ట్రంలో ఎక్కడా ఆటంకం ఏర్పడకుండా టీ-బిల్లుని కిరణ్ కుమార్ రెడ్డి సజావుగా కేంద్రానికి త్రిప్పిపంపారు. అంటే కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా నాటకమాడుతూ ప్రజలను మభ్యపెడుతూనే ఈ తంతు పూర్తి చేసారని స్పష్టమవుతోంది.   కానీ, ఇప్పుడు చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డి తమను, పార్టీని మోసం చేసారని ఆరోపించడం చాలా విడ్డూరంగా కనిపిస్తున్నపటికీ, ఇదంతా కూడా కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా ఆడుతున్న నాటకంలో భాగమేనని, ఎన్నికల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడో లేక దానికి మద్దతు ఇచ్చినపుడో నిరూపించబడుతుంది.   అదేవిధంగా సీమాంధ్రలో ప్రతిపక్షాల మీద, పార్టీని వదిలిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి మీద నెపం వేసి చేతులు దులుపు కొంటున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో మాత్రం సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణా ఏర్పడిందని అందువలన కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కోరడం దీనిలో మరో కొత్త కోణం. అదేవిధంగా తెలంగాణా ఇచ్చినందుకు తెలంగాణాలో, సీమాంధ్రకు వరాలు ఇస్తున్నందుకు సీమాంద్రాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ఇరు ప్రాంతాల ప్రజలకు కాంగ్రెస్ నేతలు ప్రభోదిస్తున్నారు. కానీ, రాష్ట్ర విభజన చేసి అటు తెలంగాణా ప్రజలకు కానీ, ఇటు సీమాంద్రా ప్రజలకు గానీ సంతోషం కలిగించలేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో వారే చెప్పవలసి ఉంది.   సువిశాలమయిన భారతదేశాన్ని చిరకాలంగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ దృక్పధం కనబరచకపోగా, ఒక ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా వ్యవహరించింది. వ్యవహరిస్తోంది. అటువంటప్పుడు దానికి ఓటేసి, దాని ముందు చేతులు జాచే దుస్థితి తెచ్చుకొనే బదులు ప్రజాభిప్రాయానికి విలువనిస్తున్న ప్రాంతీయ పార్టీలకే ఓటు వేసి గెలిపించుకొన్నట్లయితే కనీసం ఉభయ రాష్ట్రాలలో పరిస్థితులు స్థానిక ప్రభుత్వాల నియంత్రణలో సాగే అవకాశం ఉంటుంది.

పవన్ మోదీని కలవడం ఆశ్చర్యం: చిరు

      పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీని కలిసి మద్దతు తెలపడంపై ఆయన సోదరుడు, కాంగ్రెస్ కేంద్రమంత్రి చిరంజీవి తప్పుపట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జన పార్టీ ఆవిర్భావ సభలో తాను లౌకిక వాదిని అని చెప్పిన పవన్ కళ్యాణ్, మతత్వ పార్టీ నాయకుడైన మోదీని కలవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో గోద్రా నరమేధంలో ఇప్పటికీ మోడీ పాత్రపై ఆరోపణలున్నాయని చిరంజీవి చెప్పారు. ఈ విషయంపై పవన్ కు అవగాహన ఉందో లేదో తెలియదని ఆయన తెలిపారు. మరోవైపు విభజనకు అనుకూలమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని పార్టీలు మాట మార్చాయని ఆరోపించారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళతామని చిరంజీవి చెప్పారు. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ఇతర పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. నాయకులు పార్టీని వీడినా..కార్యకర్తలు తమ వెంటే వున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు 13 జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.

బీజేపీతో పొత్తుకు లోక్ సత్తా రెడీ

  రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు లోక్‌ సత్తా సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల దృష్ట్యా పొత్తులకు సానుకూలమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేర్కొంటూ.. రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయడానికి బీజేపీని మెరుగైన భాగస్వామిగా పేర్కొన్నారు. ‘ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా కండబలం, ఉచిత తాయిలాల రాజకీయం చేయకుండా వ్యవహరిస్తుందో.. ఎన్నికల విజయాలమార్గం ముళ్లబాటగా మారుతుంది’అని పేర్కొన్నారు.ఓటర్లకు డబ్బు పంపిణీ వంటి వ్యవహారాల్లో బీజేపీ వైఖరి ఇతర పార్టీలకంటే మెరుగైనదని పేర్కొంటూ ఆ పార్టీతో పొత్తుకు సానుకూల వైఖరి వ్యక్తంచేశారు. పార్టీ సభ్యులు లోతుగా ఆలోచించి.. కొత్త రాజకీయాన్ని కొనసాగిస్తూ ప్రజాప్రయోజనాల్ని పెంపొందించేందుకు ఆచరణాత్మక వ్యూహాన్ని వెలువరించాలని విజ్ఞప్తి చేశారు.

జానా - కోమటిరెడ్డి భాయీ భాయీ

  ఇన్నాళ్లూ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌లో ఉప్పు-నిప్పులా ఉన్న మాజీ మంత్రులు కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గాలు ఒక్కటయ్యాయి. వర్గ విభేదాలు, ఆధిపత్య పోరును తాత్కాలికంగా పక్కనపెట్టి ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. పార్టీ వర్గాల సమాచారం మేరకు కోమటిరెడ్డి నివాసంలో విందు సమావేశాన్ని నిర్వహించారు. జానారెడ్డితోపాటు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దీనికి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని భావించి చివరి నిమిషంలో భంగపడిన కుందూరు జానారెడ్డి, తెలంగాణ సాధనలో మంత్రి పదవిని త్యాగం చేసి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నా రాజకీయంగా కలిసి రావడం లేదని భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలో వర్గపోరుకు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయానికి వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి నల్లగొండ జిల్లాలో మొత్తం నాలుగు గ్రూపులున్నాయి. కోమటిరెడ్డి, జానారెడ్డి ఒక్కటి కావడంతో టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వర్గాలు కూడా ఒక్కటైనట్లు తెలుస్తోంది.

మోదీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్

      పవర్ పవన్ కళ్యాణ్ ఈరోజు అహ్మదాబాద్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ కార్యాలయంలో నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. మోదీతో 40 నిముషాల పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...మోదీకి మద్దతు తెలపడం కోసమే అహ్మదాబాద్ వచ్చానని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్న విబేధాలను గుర్తించలేకపోయారని, ఇదే విషయాన్ని మోదీ కూడా చెప్పారని పవన్ పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయితే రాష్ట్రానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో కూడా చెప్పానని అన్నారు. తెలుగు ప్రజల్లో ఐక్యత లేకపోతే దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని మోదీ చెప్పినట్లు ఆయన తెలిపారు. సూరత్‌లో ఉన్న తెలుగువారంతా ఐక్యతగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని, ఎందుకు ఐక్యంగా ఉంచలేకపోయారని మోదీ ప్రశ్నించారని పవన్ తెలిపారు. పదవులు కంటే రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ బాగుండాలని కోరుతూ మోదీని కలవడం జరిగిందని పవన్ స్పష్టం చేశారు.

ఒక్క ఓటరు.. ఐదుగురు సిబ్బంది

      అది కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ దట్టమైన అడవిలో 20 కిలో మీటర్లు ప్రయాణం వెళ్తే బనేజ్ అనే ప్రాంతంలో అక్కడో గుడి ఉంది. ఆ గుడికి ఒక పూజారి ఉన్నారు. ఆయన పేరు మహంత్ దర్శన్ దాస్. ఆయన ఉండేది సప్నేశ్ బిల్లియత్ అనే ఊళ్లో. ఆ ఊరు గుజరాత్ లో ఉంది. ఆ ఊరికి ఆయనొక్కడే నివాసి, ఆ పోలింగ్ బూత్ కి ఆయనొక్కడే ఓటరు.   ఈ ఒక్కరి కోసం ఒక పోలింగ్ బూత్ ఏర్పాటవుతుంది. ఈ ఒక్క ఓటు వేయించడం కోసం ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు, ఒక ప్యూన్, ఒక పోలీసు అడవిలో ప్రయాణించి వస్తారు. దర్శన్ దాస్ ఓటు వేస్తే అధికారుల డ్యూటీ పూర్తయినట్టే. నిజానికి ఒకప్పుడు బనేజ్ లో 85మంది ఓటర్లు ఉండేవారు. వారంతా అడవిని వదిలిపెట్టి వేరే చోట్లకి వెళ్లిపోయారు. కానీ దర్శన్ దాస్ మాత్రం గుడిని, ఊరిని వదిలిపెట్టలేదు.ఈ బూత్ గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలోని ఉనా నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇలాంటి బూత్ లు అరుణాచల్ లో కూడా ఉన్నాయి. అక్కడున్న 8 పోలింగ్ బూత్ లలో 3-8 మంది ఓటర్ల చొప్పున ఉంటారు. మరాంబో, అప్పర్ ముడోయిదీప్ పోలింగ్ బూత్ లలో మూడేసి మంది చొప్పున ఓటర్లు ఉంటారు. మాలోగామ్, సికారిడోంగ్ పోలింగ్ బూత్ లలో నలుగురు చొప్పున ఓటర్లుంటారు. లామ్టా అనే బూత్ లో అయిదుగురు, మటక్రాంగ్, ధర్మపూర్ బూత్ లలో ఏడుగురు చొప్పున, పున్లి బూత్ లో తొమ్మిది మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. ఇక్కడకు వెళ్లాలంటే రోడ్లేమీ ఉండవు. వాహనాలు వెళ్లలేవు. కాబట్టి పోలింగ్ సిబ్బంది రెండేసి రోజులు కాలి నడకన ప్రయాణించి పోలింగ్ బూత్ లకు చేరుకుంటారు. పోలింగ్ పూర్తయ్యాక రెండు రోజులు తిరుగుప్రయాణం చేస్తారు. ఈ పోలింగ్ బూత్ లన్నీ చైనా , మయన్మార్ సరిహద్దుల్లో ఉంటాయి.

నీకు హెల్ప్ చేశానుగా.. ప్లీజ్

      జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తమ గెలుపునకు విశ్వప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే కీలకమైన సర్పంచ్‌లను ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.   ‘పంచాయతీ ఎన్నికల్లో నేను మద్దతిచ్చాను. ఇప్పుడు నేను గెలిచేందుకు మద్దతివ్వు. ఓట్లేసి నిన్ను గెలిపించినోళ్లు.. మీమాట వింటారు. వాళ్లతో మాట్లాడి.. నన్ను గెలిపించు’ అంటూ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లను కోరుతున్నారు. వారి మద్దతు కోసం అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్యాకేజీలు కూడాఇస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది జులైలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది నెలల వ్యవధిలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎం పీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారై, ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. వేలం పాటల జోలికి వెళ్లినట్లు తెలిస్తే శిక్ష తప్పదని భయపడుతున్నవారు వేరే మార్గాలు వెతికారు. సర్పంచ్‌ల మద్దతు ఉంటే గెలుపు సులభతరం అవుతుందని భావిస్తున్న వారు వారి మద్దతు కోసం నానాపాట్లు పడుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి ముందునుంచే సర్పంచ్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో అభ్యర్థుల నుంచి అధికమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఆర్థికస్థోమత ఎక్కువగా ఉన్న నేతలు తాము గెలిచేందుకు ఎంతైనా వెచ్చించడానికైనా సిద్ధంగా ఉండటంతో పలువురు సర్పంచ్‌ల పంట పండుతోంది. గ్రామాన్ని బట్టి లక్ష రూపాయల నుంచి ఐదులక్షల వరకు ప్యాకేజీ ఇస్తున్నట్లు తెలిసింది.

యాచక కోటీశ్వరురాలు మృతి

      సౌదీ అరేబియాలో వందేళ్ల వయసున్న ఈషా అనే యాచకురాలు కన్నుమూసింది. పేరుకు యాచకురాలే అయినా ఆమె కోట్ల సంపదను కూడబెట్టింది. ఆమె వద్ద ఉన్న బంగారు నాణేలు, ఆభరణాలు, భవనాలు, భూముల విలువ సుమారు రూ.6 కోట్లపైనే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జెడ్డాలో సుమారు 50 ఏళ్లపాటు ఆమె భిక్షాటన చేసినట్టు ఈషాకు పరిచయస్తుడైన అహ్మద్ అల్ సయీది తెలిపారు. అల్ బలాద్ జిల్లాలో ఈషాకు నాలుగు భవనాలు ఉన్నాయి. ఆమెకు ప్రస్తుతం నా అన్నవాళ్లెవరూ లేరని, తల్లి, ఓ సోదరి ఉంటే గతంలోనే మృతిచెందారని సయీది తెలిపారు. వారి ఆస్తి కూడా ఈషాకే వచ్చిందని, ఆమె వీలునామా గురించి ప్రభుత్వ అధికారులకు తెలపగా ఎలాంటి స్పందన లేదని ఆయన చెప్పారు. తన సంపదను పేదలకు పంచాల్సిందిగా ఈషా వీలునామాలో రాసిందని వెల్లడించారు. ఈషా తమనుంచి ఎప్పుడూ అద్దె వసూలు చేయలేదని ఆమె భవనాల్లో నివసిస్తున్నవారు ఈ సందర్భంగా చెప్పారు.

వైకాపా ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి అరెస్ట్

      రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టారనే ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపర్చేందుకు బెంగుళూరు నుంచి బళ్లారికి తరలిస్తున్న జగన్, కాపు ఫోటోలున్న గోడగడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.36 లక్షల విలువ చేసే చెక్కులు, చీరలు, రైస్‌కుక్కర్లు, క్రికెట్ సామాగ్రిని పోలీసులు బళ్లారి చెక్ పోస్ట్ వద్ద సీజ్ చేశారు. ఈ ఉదయం కర్నాటక బళ్లారి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో రామచంద్రారెడ్డి నివాసంలో పోలీసులు ఏకకాలంలో సోదాలు చేసి ఓట్లర్లకు పంచేందుకు సిద్దం చేసిన సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రామచంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు.

పవన్ లెఫ్ట్ భావాలు.. రైట్ చూపులు

  పవన్ కళ్యాణ్ . ఇప్పుడు ఓ పవర్ సెంటర్. పవనిజం.. యూత్ ను ఊపేస్తున్న మానియా. ఎన్నికల్లో దిగుతానని పవన్ ప్రకటించగానే స్నేహహస్తం అందిస్తూ అనేక పార్టీలు ముందుకు వచ్చాయి. ఆయితే పవన్ ఆలోచనలు, మానసిక సంఘర్షణ అంతా లెఫ్ట్ భావాలతో తొణికిసలాడుతుంది. ఒక్క కాంగ్రెస్ ను ఓడించేందుకు తానూ ఏ పార్టీతోనైనా కలుస్తానని ప్రకటించిన పవన్, తన ఆలోచనలకు దగ్గరగా ఉండే కామ్రేడ్లు వైపు కన్నెత్తి చూడడం లేదు. పైగా తన భావాలకు పూర్తి విరుద్ధమైన బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నాడు. నోవాటెల్ నుంచి ప్రసంగించిన పవర్ స్టార్, కులం, మతం, ప్రాంతం అన్నింటికీ తాను వ్యతిరేకమని ప్రకటించాడు. కానీ ఇప్పుడు మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో జట్టు కట్టేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇక్కడే క్లారిటీ లోపించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీజేపీలోకి దినేష్ రెడ్డి?

      ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. బీజేపీ వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆయన కమలం పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ నేతలతో దినేష్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల్లో బీజేపీ తరుపున ఒంగోలు లోక్‌సభ స్ధానం నుంచి బరిలోకి దిగేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తనకు మద్దతివ్వాలంటూ ముందే టీడీపీ నేతలను కలిసి వచ్చి, ఆ తర్వాతే ఆయన బీజేపీ నాయకులను సంప్రదించారని దినేష్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే పార్టీలో చేరికపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో కూడా దినేష్‌రెడ్డి ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఇల్లు కాలుతుంటే.. చుట్టకు నిప్పా?

      ఒకవైపు ఇల్లు కాలిపోతుంటే మరోవైపు చుట్టకు నిప్పు దొరికిందని సంబర పడ్డాడట వెనకటికెవడో. మన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల) తీరు అలాగే ఉందని గవర్నర్ నరసింహన్ మండిపడ్డారు. వాళ్ల విదేశీ పర్యటనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలకు అనుమతించాలని ఫైళ్లు రావటంతో ఆయన మండిపడ్డారు. ఒకపక్క విభజన ప్రక్రియ, మరోపక్క ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఎవ్వరికీ విదేశీ పర్యటనలకు అనుమతితో పాటు సెలవులు కూడా మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. ఇక నుంచి విభజన ప్రక్రియ ముగిసే వరకూ ప్రభుత్వఉద్యోగులు ఎవ్వరికీ గవర్నర్ అనుమతి లేకుండా సెలవులూ మంజూరు చేయరు. దీనికి సంబంధించి సీఎస్ మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

జైరామ్ దృష్టిలో వీరంతా ఎవరు?

  కేంద్రమంత్రి జైరామ్ రమేష్ అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు అత్యంత ప్రముఖుడు. మన రాష్రం కోటా నుంచే రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపిక చేసిన ఈ మేధావి కలహ ప్రియుడు. అంటే నారదుడి టైపు అన్నమాట. ఒకే నోరు.. కర్నూలులో ఒక మాట, కరీంనగర్ లో ఒక మాట ఇదీ జైరాం రమేష్ తీరు. తాజాగా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణా ఇవ్వడం కోసం కాంగ్రెస్ 14 ఏళ్ళుగా రాముడిలా వన వాసం, పాండవులా అజ్ఞాత వాసం చేసిందన్నాడు. అయితే సీమాంధ్రులు కౌరవులా, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీతో పాటు ఇతర పార్టీలు రావణుడి టైపా? మరి ఈ విషయాలు కూడా చెబితే కదా ఎవరు రాముడో, ఎవరు రావణుడో తేలిపోయేది. తమరు పాండవులైతే .. కౌరవులెవరో చెప్పకుండా ఎలా తెలుస్తుంది సారూ..?

బొత్స పొమ్మన్నారు .. రఘువీరా రమ్మంటున్నారు..

  కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఎలా స్పందిస్తారో వారికే తెలియదు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముగియక ముందు పీసీసీ చీఫ్ గా ఉన్న బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు కొందరు ఇతర పార్టీల్లో కర్చీఫ్ లు వేసుకున్నారని ఆరోపించారు. వాళ్ళు ఎప్పుడో ఎందుకు.. ఇప్పుడే వెళ్లిపోవచ్చని ఆగ్రహోదగ్రుడైపోయాడు. సత్తిబాబు కమిట్మెంట్ చూసి కాంగ్రెస్ ను ఎవరూ కదిలించలేరనుకున్నారు. విభజన పూర్తయ్యేసరికి సత్తిబాబు చేతులెత్తేశారు. బొత్స బంధువులు, నమ్మిన బంట్లు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు వేసేవారు కూడా లేకపోవడంతో సీమాంధ్ర పీసీసీ చీఫ్ భాద్యతలు స్వీకరించిన రఘువీరా ఖాళీ అయిన కాంగ్రెస్ దుకాణంలో కొత్త షావుకారులా కూర్చున్నారు. వార్డు మెంబర్ గా కాంగ్రెస్ టికెట్ పొందాలంటే ఢిల్లీ స్థాయి పైరవీలు చేయాల్సి ఉండేది. ఇప్పుడేమో కార్యకర్తలైనా ఫర్వాలేదు. టికెట్కు దరఖాస్తు చేసుకొండంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు రఘువీరా. మరో అడుగు ముందుకేసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఇంతలో ఎంత మార్పు అని ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు.

పవన్ నా రాజకీయ శత్రువు: చిరంజీవి

  ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఉలిక్కిపడ్డాయి. కానీ ఆయన తాను కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే రాజకీలలో ప్రవేశించానని విస్పష్టంగా ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుదుటపడింది. అయితే, సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత భుజానికెత్తుకొన్న చిరంజీవి మాత్రం షాక్ అయ్యారనే చెప్పవచ్చును. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపన సమావేశానికి తన అభిమానులను వెళ్ళవద్దని కోరారు. తన సోదరుడు నాగబాబు ద్వారా అభిమానులను తన వెంట నడవాలని పిలుపునిచ్చారు. బీవీ రాఘవులు వంటి కొందరు రాజకీయ నేతలు, విశ్లేషకులు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా చివరికి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం అయిపోతుందని , జనసేన కేవలం ఓట్లు చీల్చడానికి తప్ప మరి దేనికీ పనికిరాదని అభిప్రాయపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు, మ్యానిఫెస్టో, ‘సవినయంగా మనవి చేసుకొంటున్నాను’ వగైరా పడికట్టు పదాలతో ఊకదంపుడు ఉపన్యాసం చేయకుండా అభిమానులతో తన మనసులో భావాలను పంచుకొన్నట్లుగా సాగడంతో రాజకీయ విశ్లేషకులు, మీడియా కూడా పెదవి విరిచింది. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఉపన్యాసానికి ఆయన అభిమానుల నుండే కాక ప్రజల నుండి కూడా చాలా సానుకూల స్పందన వచ్చింది. కారణం ఆయన ఊకదంపుడు ఉపన్యాసం చేయకుండా సాధారణ ప్రజల మనోభావనలను తన ప్రసంగంలో చక్కగా ప్రతిబింబింపజేయడమే.   ఇప్పటికే సీమాంద్రాలో ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించే బాధ్యత తీసుకొన్న చిరంజీవికి ఇది ఊహించని పెను సవాలుగా మారింది. అందుకే ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక తప్పలేదు. ఒకవేళ ఇప్పటికీ ఆయన మాట్లాడకపోయినట్లయితే, ఆయనను కాంగ్రెస్ పార్టీ శంఖిస్తుంది గనుకనే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడారు.   “తమ్ముడు పవన్ కళ్యాణ్ వేరే పార్టీ పెట్టుకొన్నాడు గనుక ఇకపై నేను కూడా అతనిని మా రాజకీయ ప్రత్యర్దిగానే భావించి ఎదుర్కొంటాను. కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలను ఏవిధంగా ఎదుర్కొంటుందో తమ్ముడి జనసేనను కూడా అదేవిధంగా ఎదుర్కొంటుంది. నేటికీ నా అభిమానులు, ప్రజలు అందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని నమ్ముతున్నాను. అందువల్ల అతను పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానని చెప్పినంత మాత్రాన్న మేమేమి భయపడటం లేదు. సమాజసేవ చేయాలనే తలపుతో అతను రాజకీయాలలో ప్రవేశించి పార్టీ స్థాపించాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం పూర్తిగా అతని వ్యక్తిగత విషయం గనుక నేనేమి ఆ విషయంలో కలుగజేసుకోను.కానీ, తమ్ముడికి ఎల్లపుడూ నా ఆశీస్సులు ఉంటాయి,” అని అన్నారు. అయితే, పవన్ పార్టీ స్థాపిస్తున్నపుడు అన్ని విధాలా అడ్డంకులు సృష్టించి, ఇప్పుడు ఈ నీతి కబుర్లు చెప్పడం చిరంజీవి నైజానికి అద్దంపడుతోంది.

నేడే మోడీ - పవన్ భేటీ

  జనసేన పేరుతో పార్టీ పెట్టినట్లు ప్రకటించి, ఇటు టీడీపీ.. అటు బీజేపీ రెండింటితోనూ పొత్తు పెట్టుకుంటున్నపవన్ కల్యాణ్.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుస్తున్నారు. శుక్రవారం నాడు మోడీని కలిసేందుకు ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకుని గురువారం సాయంత్రమే అహ్మదాబాద్ వెళ్లారు. శుక్రవారం సాయంత్రం పవన్ - మోడీల భేటీ జరిగే అవకాశం ఉంది.   వాస్తవానికి వీళ్లిద్దరి సమావేశం గురించి ముందు ఉంటుందని, తర్వాత ఉండదని, మళ్లీ ఉంటుందని రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూడా మోడీని పవన్ కలవట్లేదని అన్నారు. మళ్లీ చివరకు కలుస్తున్నట్లు జనసేన వర్గాలు చెప్పాయి.   మోడీతో భేటీ సందర్భంగా రాజకీయాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల అభివృద్ధిపై తనకున్న ఆలోచలను పవన్ పంచుకోనున్నారు. ఆయన మద్దతు కోరనున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 'తెలుగు జాతి' అభివృద్ధికి ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి? తదితర అంశాలపై తన ఆలోచనలు చెప్పడంతోపాటు, మోడీ అభిప్రాయాలు కూడా పవన్ కల్యాణ్ తెలుసుకుంటారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై బీజేపీ వ్యూహాలు తెలుసుకోవాలని చూస్తున్నారు. రైతు ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు గుజరాత్‌లో చాలా తక్కువ. ఇందుకు మోడీ అనుసరిస్తున్న విధానాలను కూడా పవన్ తెలుసుకునే అవకాశముంది. మోడీతో సమావేశం తర్వాత పవన్ తన పర్యటన వివరాలు బహిరంగ పరిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

యువత చేతిలోనే నేతల తలరాతలు

  చిత్తూరు జిల్లాలో యువతీ యువకులే రాజకీయాలను నిర్దేశించబోతున్నారు. వీళ్లు నూటికి నూరుశాతం ఓట్లు వేస్తే.. పార్టీల జాతకాలు తారుమారు కావడం ఖాయం. యువతరం మనస్సు దోచుకున్న నేతలు తాము ఆశించిన స్థానం దక్కించుకోవడమూ ఖాయం. ఈ ఏడాది జనవరి నాటికి చిత్తూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 29,00,500 కాగా అందులో 18 నుంచి 39 సంవత్సరాల వారు 16,15,860 మంది. అంటే సగానికి పైగా ఓటర్లు యువతేనని స్పష్టం అవుతోంది. వీరిలో 18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు 71,156 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో యువత తీసుకునే నిర్ణయం అభ్యర్థులతో పాటు ఆయా రాజకీయపార్టీల తలరాతలను నిర్దేశించబోతోంది.

టీఆర్‌ఎస్‌ లోకి బాబూమోహన్!

  టీడీపీ నేత, మాజీమంత్రి బాబూమోహన్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు! ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈనెల 26 తర్వాత ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో బాబూమోహన్ ఆంధోల్ నుంచి పోటీచేసి 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. 2004, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు. ఇటీవలి కాలంలో ఆయనకు టీడీపీలోని కొంతమంది నేతలతో సంబంధాలు చెడిపోయాయని, అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. పార్టీలో కూడా తనకు పెద్దగా ప్రాధాన్యం కనిపించకపోవడం, తెలంగాణాలో టీఆర్ఎస్ అయితేనే ఈసారికి కాస్త ఉపయోగం ఉంటుందని భావించడంతో గులాబీ కండువా కప్పుకోడానికి బాబూమోహన్ సిద్ధపడుతున్నారు.