మాజీ లవరు ముంచేసింది దేవుడో!

  మాజీ లవరు నిలువునా ముంచేసింది దేవుడో అని అతగాడు లబోదిబో అంటున్నాడు. ఇంతకీ అతనెవరో ఆషామాషీ వ్యక్తి కాదు. అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు డిగో మారడోనా. సీజనుకో లవర్ని మార్చే ఈయనగారు ఆమధ్య రోకియో గెరాల్డైనా అనే ఫుట్‌బాల్ క్రీడాకారిణిని లవ్ చేశాడు. ఆమెని పెళ్ళి కూడా చేసుకోవాలని ఫిక్సయ్యాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందోగానీ ఇద్దరికీ చెడింది. ఆ అమ్మడు తన దారిన తాను వెళ్ళిపోయింది. అయితే సదరు మాజీ ప్రేయసి తనను నిలువునా దోచుకుందని మారడోనా దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన దగ్గర్నుంచి రోకియో కొట్టేసిన వస్తువుల జాబితా కూడా దుబాయ్ పోలీసులకు ఇచ్చాడు. దాంతో ఎలర్ట్ అయిపోయిన దుబాయి పోలీసులు రోకియో అరెస్టుకు వారెంటు కూడా జారీ చేసేశారు. ప్రస్తుతం మారడోనా దుబాయ్ స్పో్ర్ట్స్ కౌన్సిల్‌కి గ్లోబల్అంబాసిడర్ కూడా కావడంతో పోలీసులు చాలా చురుకుగా రోకియో కోసం వెతుకుతున్నారు. రోకియో భామని పట్టుకోవడానికి దుబాయ్ పోలీసులు ఇంటర్‌పోల్ సహాయం కూడా తీసుకుంటారట.

అనుమానపు పతీ.. నీకు విడాకులే గతి!

  భార్యని అనవసరంగా, ఆధారాల్లేకుండా అనుమానిస్తే సదరు భర్త గారికి ఆమె నిరభ్యంతరంగా విడాకులు ఇచ్చేయొచ్చు. ఈ విషయాన్ని ముంబై హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. ఈ రకంగా తన భార్యకి ఎవరితోనే సంబంధం వుందని ఎలాంటి ఆధారాలూ లేకుండా అనుమానిస్తున్న ఓ భర్త గారి నుంచి ఆయన భార్యకి విడాకులు మంజూరు చేసేసింది. ముంబైకి చెందిన ఒక మగ పురుషుడు తన భార్య మీద అనవసరంగా అనుమానం పెంచుకున్నాడు. తన భార్యకి ఎవరితోనో సంబంధం వుందని ఆయనగారి అనుమానం. ఆ అనుమానంతోనే ఆమెని ఎంతోకాలంగా వేధిస్తున్నాడు. ఈయనగారి వేధింపులు తట్టుకోలేక ఆ భార్యామణి ఈ శాడిస్టుతో నాకు విడాకులు ఇప్పించండి మొర్రో అని ముంబై హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ భర్త తన భార్య మీద అనుమానం వుందని చెబుతూనే విడాకులు ఇవ్వనని మొండికేశాడు. అయితే హైకోర్టు ఈ కేసును బాగా స్టడీ చేసి, అనవసరంగా అనుమానిస్తున్న భర్తకి నిరభ్యంతరంగా విడాకులు ఇచ్చేయొచ్చంటూ తీర్పు ఇచ్చింది.

భూగర్భంలో మెట్రో చాలా డేంజర్! హైదరాబాద్ పరిస్థితేంటి?

  హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు నిర్మాణం చకచకా జరుగుతోంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలును భూగర్భ మార్గంగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి కంపెనీకి షరతు విధించారు. అయితే ఆ సంస్థ కేసీఆర్ షరతులను అంగీకరించే పరిస్థితిలో లేదు. భూ గర్భంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఆ సంస్థ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మెట్రో మార్గం నిర్మాణం విషయంలో స్తబ్ధత ఏర్పడింది. అయితే తాజా పరిణామాలను చూస్తుంటే, మెట్రో రైలు మార్గాన్ని భూగర్భంలో నిర్మించడం అంత శ్రేయస్కరం కాదని తెలుస్తోంది. ఎందుకంటే, రష్యాలో తాజాగా జరిగిన మెట్రో రైలు ప్రమాదం భూగర్భ మార్గంలోనే జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు. దాదాపు యాభై మంది భూ గర్భంలో ఇరుక్కుపోయి వున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు భూగర్భ రైలు మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా వుంటాయని అంటున్నారు. రష్యాలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌ మెట్రో మార్గాన్ని భూగర్భంలో నిర్మించాలన్న పట్టుదలను సడలించాలని పలువురు కోరుతున్నారు.

మెట్రో రైలు ప్రమాదం: 10 మంది మ‌‌ృతి

  మామూలు రైళ్ళకు మాత్రమే కాదు... మెట్రో రైళ్ళకూ ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం కూడా భారీగా వుంటుంది. రష్యా రాజధాని మాస్కో నగరంలో మెట్రో రైలుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మరణించారు. మెట్రో రైల్ ట్రాక్ మీద వెళ్తున్న మెట్రో రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘోరం జరిగింది. మెట్రో రైళ్ళకు ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ అనే అభిప్రాయం చాలామందిలో వున్న నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదం ఈ విషయంలో పునరాలోచించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఈ ప్రమాదం నుంచి మన హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు కూడా పాఠాలు నేర్చుకుని మాస్కో మెట్రో రైలు తరహా ప్రమాదాలు మన హైదరాబాద్‌లో కూడా జరగకుండా చూడాలి.

కాళ్ళు మొక్కినా చేరనన్న రేవంత్ రెడ్డి

  గత కొంతకాలంగా తెలంగాణ టిడిపి ముఖ్యనేతలు కొందరు తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి స్పందించారు. తాము టిడిపిని వీడుతున్నట్లు వస్తున్న వార్తలన్ని సాక్షి పత్రికలోని ఓ విలేకరి కల్పిస్తున్న కట్టు కథలని అన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరితే తనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అని గట్టిగా ప్రశ్నించారు. ఆ పార్టీ వాళ్ళంతా వచ్చి తన కాళ్ళు మొక్కినా నేను ఆ పార్టీలో చేరానని ఘాటుగా సమాధానమిచ్చారు. కొత్త ప్రభత్వం వచ్చింది కాదా అని ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో, ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఈవిషయం పై రేవంత్ రెడ్డి కొంచెం ఘాటుగా స్పదించారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కు అదనపు విద్యుత్ కేటాయింపు

  రాష్ట్ర విభజన సందర్భంగా రెండు రాష్ట్రాలకు వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేయడం పొరపాటనే ఆంధ్రప్రదేశ్ వాదనతో ఏకీభవించిన నీరజా మాధుర్ కమిటీ, ఆ పొరపాటును సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ కోరుతున్న విధంగా ఆ రాష్ట్రానికి కేంద్ర విద్యుత్ కోటా నుండి 1.77 శాతం అదనపు విద్యుత్ కేటాయించేందుకు అంగీకరించింది. అందువలన రాష్ట్రానికి అదనంగా మరో 65మెగావాట్ల విద్యుత్ లభిస్తుంది. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు 46.11:53.89 శాతం నిష్పత్తిలో జరిగిన పంపకాలను సవరిస్తూ ఆంధ్రాకు 47.88 శాతంగా నిర్ణయించారు. అయితే కీలకమయిన ఈ సమావేశానికి రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ప్రతినిధులు ఎవరూ హాజరు కాకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. తెలంగాణా ప్రభుత్వం కోరుతున్న పీలేరు విద్యుత్ ప్రాజెక్టులో వాటా, ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలు చేసుకొన్న విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాల కొనసాగింపు తదితర వివాదాలను కేంద్ర న్యాయ శాఖకు, కేంద్ర అటార్నీ జనరల్‌కు పంపించాలని నీరజా మాథుర్‌ కమిటీ నిర్ణయించుకోవడంతో ఈ సమావేశంలో ప్రధాన సమస్యలేవీ పరిష్కారం కాలేదు.   ఆంద్ర, తెలంగాణా తరపున ఈ సమావేశానికి హాజరయిన ఇంధన శాఖ కార్యదర్శులు అజయ్ జైన్, సురేష్ చందాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పీపీఏలను అమలు చేయదానికి నిరాకరించడం ద్వారా ఆంద్ర ప్రభుత్వం విభజన ఒప్పందాలను, విద్యుత్ చట్టాలను కూడా ఉల్లంఘించిందని తెలంగాణా ఇంధన శాఖా కార్యదర్శి సురేష్ చందా వాదించగా, పవర్ రెగ్యులేటరీ కమీషన్ (పీ.ఆర్.సి.) ఆమోదం పొందని పీపీఏలను అమలుచేయమని తమపై ఏవిధంగా ఒత్తిడి తెస్తారని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖా కార్యదర్శి అజయ్ జైన్ వాదించారు. ఆంధ్ర, తెలంగాణా విద్యుత్ డిస్కంల మధ్య పీపీఏలు జరిగినప్పటికీ అవి గత నాలుగేళ్ళుగా వాటిని ఆమోదించకుండా పెండింగులో పెట్టినట్లు కమిటీ చైర్మన్ నీరజా మాధుర్ గుర్తించారు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ పీపీఏల అమలుకు నిరాకరిస్తున్నట్లు గుర్తించారు.   అందువల్ల ఈ వివాదాన్ని కేంద్ర న్యాయ శాఖకు, కేంద్ర అటార్నీ జనరల్‌ ముందుంచి వారి సలహాల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మళ్ళీ ఈ నెల 24న మరో మారు సమావేశమయ్యే సమయానికి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొంటామని కమిటీ చైర్మన్ నీరజా మాధుర్ రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు.

పోలవరం బిల్లు ఆమోదం...చిరు హ్యాపీ

పోలవరం బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీంతో బిల్లును పాస్ చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉప సభపతికి సూచించగా ఆయన బిల్లును పాస్ చేస్తూ ప్రకటన చేశారు. అంతకముందు పోలవరం బిల్లు రాజ్యసభకు రావడం ఆనందంగా వుందని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 25.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. నదుల అనుసంధానం అవుతున్న తొలి ప్రాజెక్టు పోలవరం అని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం వల్ల 7.2లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. మరో 5 టీఎంసీల నీరు ఒడిశా వాడుకోవచ్చని స్పష్టం చేశారు. భద్రాచలం డివిజన్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో భాగమని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారమే 7 మండలాలు ఆంధ్రలో విలీనం అయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, 23.4 టిఎంసీల నీరు పరిశ్రమలకు అందుతుందని పేర్కొన్నారు. గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సూచించారు.

రాజ్యసభలో పోలవరంపై రగడ

  రాజ్యసభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు మీద వాడిగా వేడిగా చర్చ జరుగుతోంది. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ లతో పాటు సీపీఐ, జేడీయూ నేతలు బిల్లు మీద స్పందించారు. 1956 కు ముందు ఈ ఆంధ్రప్రదేశ్ లో కలుపుతున్న గ్రామాలు ఆంధ్రలోనే ఉండేవని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ బిల్లును ప్రవేశపెట్టి చర్చను మొదలుపెట్టారు. ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపాలని యూపీఏ ప్రభుత్వంలో నిర్ణయించామని, ఎన్నికల నేపథ్యంలో అది ఆగిపోయిందని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. ముంపు ప్రభావాన్ని తగ్గించేందుకు రూ.600 కోట్లతో రక్షణ చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు.   జైరాం రమేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ విభేదించారు. తెలంగాణకు ఈ రోజు దుర్ధినం అని, కేంద్ర హోంమంత్రి నాలుగు లక్షల మంది గిరిజనుల ఆవేదనను అర్ధం చేసుకోవాలని, వారు నిరంతర ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. పోలవరం మూలంగా భద్రాచలం మునుగుతుందని, దీనివల్ల లాభాలకన్నా నష్టమే ఎక్కువని పలు నివేదికలు పేర్కొన్న విషయం పక్కన పెడుతున్నారని విమర్శించారు. మరో ఎంపీ నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నాలుగు రాష్ట్రాల సమస్య అని,  గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను అమలు చేయొద్దని ఆయన సభను కోరారు. రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించారని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలవరం బిల్లు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని సీపీఎం ఎంపీ రాజీవ్ అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చట్ట సవరణ బిల్లుపై  ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనగా ఉన్నారని ఒడిశా ఎంపీ మహాపాత్ర తెలిపారు.  అనంతరం ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ పోలవరంపై గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఇది 1.89 లక్షల మంది జీవితాలకు సంబంధించిన సమస్య అని ఆమె అన్నారు.  

పోలవరం బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్

  రాజ్యసభలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు(పోలవరం ముంపు గ్రామాలు ఏపీలో విలీనం)పై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ ఎంపీ జైరాంరమేశ్‌ సభలో ప్రసంగిస్తున్నారు. పోలవరం సవరణ బిల్లుకు ఆయన పూర్తిగా మద్దతు తెలిపారు. తాను స్వయంగా పలుమార్లు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని చూసినట్టు ఆయన తెలిపారు. 45 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే పునరావాసం కల్పిస్తుందని ఆయన అన్నారు. జైరాంరమేశ్‌ ప్రసంగాన్ని తెలంగాణ ఎంపీ వి.హన్మంతరావు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇతర సభ్యులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయగా, డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ వారికి సర్దిచెప్పి చర్చను కొనసాగిస్తున్నారు.

కేసిఆర్ తో నాగార్జున కాంప్రమైజ్!

ప్రముఖనటుడు నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. నాగార్జునకు చెందిన యన్ కన్వెన్షన్ సెంటర్ కోసం 3 ఎకరాల 12 గుంటల ప్రభుత్వభూమిని ఆక్రమించినట్లు నిర్దారిస్తూ జీ.హెచ్.యం.సి. అధికారులు మార్కింగ్స్ వేసారు. దానిపై నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషను వేసారు కూడా. ఆ కేసు అలా వుండగానే ఆయనే స్వయంగా అధికారులు గుర్తించి మార్క్ చేసిన కట్టడాలను తొలగిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే నాగార్జున తనకు తానే జాగ్రత్తపడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంతో తెగేదాకా లాగితే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించి తెలంగాణ సర్కార్ తో రాజీకివచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజ్యసభలో పోలవరం బిల్లు మరికొద్ది సేపటిలో

    ఈరోజు రాజ్యసభలో పోలవరం బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇంతవరకు ప్రవేశపెట్టకపోవడంతో దానిపై తెలంగాణాలో, డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు చూసి ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉండవచ్చని అందరూ భావించారు. కానీ ఈరోజు మధ్యాహ్నం 2.15గంటలకు ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నట్లు సభ్యులందరికీ సమాచారం పంపించారు. అయితే ఈ రోజు కేవలం బిల్లును ప్రవేశపెట్టి రేపు దానిపై చర్చ, ఓటింగు చెప్పట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న తెరాస, టీ-కాంగ్రెస్, ఒడిష, ఛత్తీస్ ఘర్ యంపీలు ఎట్టిపరిస్థితుల్లో ఈ బిల్లును అడ్డుకోవాలని ధృడ నిశ్చయంతో ఉన్నందున ఇంతవరకు ప్రశాంతంగా సాగుతున్న రాజ్యసభ సమావేశాలు బిల్లు ప్రవేశపెట్టగానే రసాభాసగా మారే అవకాశం ఉంది.   ఈ బిల్లును తమ పార్టీయే స్వయంగా రూపొందించినందున దానిని సభలో అడ్డుకోరాదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నభీ ఆజాద్ ద్వారా పార్టీ యంపీలకు కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. కానీ వారు ఇప్పుడు అధిష్టానం ఆదేశాలను ఖాతరు చేస్తారా లేక తెలంగాణాలో తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తెరాస యంపీలతో కలిసి బిల్లును అడ్డుకొంటారా అనేది మరి కొద్ది సేపటిలో తేలిపోతుంది.

జర్మనీదే ఫుట్ బాల్ కప్

ఫుట్ బాల్ (పిఫా) ప్రపంచకప్ పోటీలలో జర్మనీ దేశం విజయం సాధించింది. ఫేవరేట్ జట్టు అర్జెంటినా ఫైనల్ మ్యాచ్ లో చివరి నిమిషంలో బోల్తాపడింది. జర్మనీ జట్టు అర్జెంటినా మీద 1 – 0 తేడాతో గెలుపు సాధించడం విశేషం. అదీ ఎక్స్ ట్రా సమయంలో ఈ గోల్ చేసి జర్మనీ జట్టు విజయం సాధించింది. కప్ ను గెలుపొందిన జర్మనీకి రూ.210 కోట్ల నగదు బహుమతి, రన్నర్ జట్టు రూ.150 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన నెదర్లాండ్స్ జట్టుకు రూ.132 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న బ్రెజిల్ కు రూ.120 కోట్లు పారితోషికాలు లభిస్తాయి. అతిథ్య జట్టు బ్రెజిల్ కు కప్ లభిస్తుందని మొదట్లో అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆ దేశం నాలుగోస్థానానికి పడిపోయింది.

డిల్లీలో నేడు ఆంధ్ర, తెలంగాణా విద్యుత్ పంచాయితీ

  ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల, విద్యుత్ వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యే అవకాశాలు బొత్తిగా కనబడటం లేదు. రెండు ప్రభుత్వాలు తమ హక్కులను కాపాడుకోవాలని ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించే బదులు ఘర్షణ వైఖరి అవలంభిస్తుండటంతో కేంద్రం జోక్యం చేసుకోవలసివస్తోంది. నాలుగు రోజుల క్రితం కృష్ణా జలాల పంచుకోవడంపై కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ పాండ్యా ముందు పంచాయితీ జరిగిన తరువాత ఇరు రాష్ట్రాలకు 13టీ.యం.సి.ల నీళ్ళు కేటాయింపు జరగడంతో సమస్య తాత్కాలికంగా వాయిదా పడింది. ఈసారి వర్షాలు కురవకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య నీళ్ళ కోసం పేచీలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదని చెప్పవచ్చును.   ఇక ఈరోజు విద్యుత్ పంపకాలపై కూడా కేంద్రం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిటీ ముందు పంచాయితీ జరగనుంది. దానిలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులు డిల్లీ వెళ్ళారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలతో చేసుకొన్న విద్యుత్ పంపిణీ అమ్మకపు ఒప్పందాలను (పీ.పీ.ఏ.) రద్దు చేయాలనే నిర్ణయం, సీలేరు, హిందుజా ప్రాజెక్టులలో తెలంగాణాకు వాటాల సంగతి తేల్చడం వగైరా అంశాలు నేటి సమావేశంలో చర్చించి, ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయనున్నారు. కానీ ఈ గొడవలు ఇలా ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? వీటికి ఎప్పటికయినా శాశ్విత పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రజల ప్రశ్నలకు అటు ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు కానీ, కేంద్రం గానీ జవాబు ఇచ్చేస్థితిలో లేదు.

పోలవరం సవరణ బిల్లు చెల్లదు: జైపాల్ రెడ్డి

  కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పోలవరం సవరణ బిల్లు చెల్లదని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఆర్టికల్ 3 ప్రకారం వెళ్లకుండా పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడం దారుణమని ఆయన విమర్శించారు. ‘‘ఆర్టికల్ 3, 4 కింద చేపట్టిన బిల్లు ప్రక్రియ పూర్తయ్యింది. మళ్లీ సవరణ చేసే శక్తి ప్రభుత్వానికి, పార్లమెంటుకు లేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తరువాత సవరణలు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. సుప్రీం కోర్టులో ఈ బిల్లు నిలబడదు’’ అని జైపాల్ రెడ్డి అన్నారు.

బీజేపీ కార్యాలయంలపై తెలంగాణ జాగృతి దాడి!

  తెలంగాణ బంద్ సందర్భంగా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ జాగృతి కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడానికి నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై రాళ్ళు విసిరారు. దీంతో కార్యాలయ అద్దాలు ద్వంసమయ్యాయి. బీజేపీ కార్యాలయంలోనికి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు-కార్యాకర్తల మధ్య భారీ స్థాయిలో తోపులాట జరిగింది. తెలంగాణ జాగృతి ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ బంద్ సంపూర్ణం

  పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ రాజకీయ పక్షాలు చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. పోలవరం బిల్లును పార్లమెంటు ఆమోదించడాన్ని నిరసిస్తూ.. టీఆర్ఎస్, టీజేఏసీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, పాఠశాలలు మూతబడ్డాయి. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇమ్లీబన్ నుంచి తెలంగాణ జిల్లాలలో పాటు సీమాంధ్ర జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులు ఆగిపోయాయి. హైదరాబాద్‌లోని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. జంటనగరాల్లోని స్కూళ్లకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. తెలంగాణ జిల్లాలన్నిటిలో బంద్ సంపూర్ణంగా జరిగింది.