కరీంనగర్లో సైకో వీరంగం

  కరీంనగర్ నగరంలో ఒక సైకో వీరంగం సృష్టించాడు. లక్ష్మీనగర్‌కి చెందిన బబ్లు మంగళవారం ఉదయం తల్వార్‌తో ఇంటి నుంచి బయటకి వచ్చిన బబ్లు స్థానికుల మీద దాడికి దిగాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ అలీ పోలీసు సిబ్బందితో కలసి వచ్చి సైకోను అదుపు చేయడానికి ప్రయత్నించారు. బబ్లు వాళ్ళమీద కూడా దాడి చేశాడు. అలీ మీద దాడి చేసిన సైకో తల్వార్‌తో ఆయన వేలు నరికేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ ఎస్.ఐ. విజయ సారథి సైకో కాళ్ళ మీద కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సైకో దాడిలో హెడ్ కానిస్టేబుల్ అలీతోపాటు 20 మందికి గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయుత చండీయాగానికి అంకురార్పణ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం అంకురార్పణ కార్యక్రమం సోమవారం జరిగింది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో అయుత మహా చండీయాగానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ అంకురార్పణ, ఆరంభపూజ చేశారు. చండీయాగం ముందస్తు కార్యక్రమాలలో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉదయం గురుప్రార్థనతో పూజలు ప్రారంభించారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన రుత్విజులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణశర్మ, హరినాథ్ శర్మ ఆధ్వర్యంలో గురు ప్రార్థన, గణపతి పూజ, దేవనాంది, అంకురార్పణ, పంచగవ్య మేళనం, ప్రాశనం, గోపూజ, యాగశాల ప్రవేశం, సంస్కారం, అఖండ దీపారాధన, మహా సంకల్పం, సహస్ర మోదక మహా గణపతి హోమం, మంగళహారతి, ప్రార్థన, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, గోమాతకు పూజలు చేశారు. సోమవారం సాయంత్రం వాస్తు రాక్షోఘ్న హోమం, అఘోరాస్త్ర హోమం జరిగాయి.

ఒకేసారి చచ్చిపోతాం...

  పోలీసుల వేధింపులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే అందరం సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని దాదాపు 50 మంది మహిళలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బెదిరింపులకు దిగిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. పొలాచి సమీపంలోని అంగలకురిచి ప్రాంతంలో నివసించే 25 కుటుంబాలకు చెందిన దళిత మహిళలు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు తమ ప్రాంతానికి వచ్చి, తమ కులానికి చెందిన వారిని వేధిస్తున్నారని, ఇప్పటికైనా తమ మీద వేధింపులు ఆపకపోతే అందరం కలసి కలెక్టరేట్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని ఆ మహిళలు బెదిరించారు.  

నర్సుల డాన్సు అదరహో

  చైనాలోని టియాంజిన్‌లో వున్న వైద్య కళాశాలలో నర్సింగ్ కోర్సు చేస్తున్న అమ్మాయిలందరూ సోమవారం ఉదయం సడెన్‌గా కళాశాల మైదానంలోకి వచ్చారు. ఒకరు ఇద్దరు కాదు... వెయ్యి మందికి పైగా నర్సింగ్ విద్యార్థినులు మైదానంలోకి వచ్చేసి డాన్స్ చేయడం ప్రారంభించారు. ఆకుపచ్చని మైదానంలో మల్లెపువ్వు లాంటి తెల్లటి యూనీఫామ్‌లో వున్న నర్సులు లయబద్ధంగా డాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళకి రెండు కళ్ళు చాలవేమోనని అనిపించిందట. ఇంతకీ ఈ నర్సమ్మలు ఎందుకిలా డాన్స్ చేశారంటే... దానివెనుక ఒక మంచి కారణం కూడా వుంది. ఒక సమాజ సేవా కార్యక్రమం కోసం నిధులు సేకరించడం కోసం వీరంతా ఇలా నృత్యం చేశారు.  

అక్కడేం జరుగుతోంది?.. నాకు తెలియాలి!

అయోధ్యలో ఏం జరుగుతోందో తనకు తెలియాలని యు.పి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్.ను ఆదేశించింది. ఈ మేరకు రహస్య నివేదికను తనకు సమర్పించాలని కోరింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఇటుకలు సేకరించాలని వీహెచ్‌పీ పిలుపు ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఇటుకలతో కూడిన రెండు ట్రక్కులు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోందో తమకు నివేదించాలని యు.పి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్‌ను కోరింది. అయోధ్యకు సమీపంలో వున్న రామ్‌సేవక్‌పురంలోని విశ్వహిందూ పరిషత్‌కి చెందిన స్థలంలో దించిన ఇటుకలకు రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ ఆధ్వర్యంలో పూజ నిర్వహించినట్టు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ ఆదివారం నాడు ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం నృష్టించింది. రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ నుంచి సంకేతాలు కూడా అందినట్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ చెప్పడం విశేషం.

మాగంటి బాబు గన్‌మన్ ఆత్మహత్య

  ఏలూరు ఎంపీ మాగంటి బాబు వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఎం.ఆదాం (44) సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జె.వి.ఆర్. నగర్‌లో నివాసం వుంటున్న ఆదాం పురుగుల మందు తాగడం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికత్స పొందుతూ ఆదాం మరణించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదాం ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆదాం ఆత్మహత్య పట్ల ఎంపీ మాగంటి బాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఢిల్లీలో వున్న ఆయన ఆదాం కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆదాంకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఆదాం భార్య మార్తమ్మ ఏలూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది.  

డబుల్ బెడ్ రూమ్ తో అసంతృప్తి మాయం

డబుల్ బెడ్ రూం ఫ్లాట్లను తెలంగాణలోని పేదలకు అందించాలన్న భారీ పథకాన్ని చేపట్టి.. కేంద్ర సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ సర్కారు డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొన్ని రాష్ట్రాలకు ఇళ్లను కేటాయించిన కేంద్రం.. అప్పట్లో తెలంగాణకు కేవలం 10వేల ఇళ్లను మాత్రమే కేటాయించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. పక్కనున్న ఏపీకి భారీగా ఇళ్లను కేటాయించి.. తెలంగాణకు మరీ తక్కువగా కేటాయిస్తారా? అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. తమకు మరిన్ని ఇళ్లు కేటాయించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రం కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ సర్కారు తాజాగా 45217 ఇళ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కేటాయించిన దానికి అదనంగా కేటాయింపులు జరిపిన కేంద్రం.. తెలంగాణ సర్కారు కోరినన్ని ఇళ్లు కేటాయించినట్లుగా పేర్కొంది.

రేవంత్ రెడ్డి కుమార్తె వివాహం.. టీఆర్ఎస్ నేతలు ఎక్కడ?

టీడీపీ నేత రేవంత్ రెడ్డి కుమార్తె నైమిష రెడ్డి వివాహం నిన్న అంగరంగవైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి ఎంతోమంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇంత మంది ప్రముఖులు హాజరైన టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఒక్కరు కూడా ఈ పెళ్లి వేడుకలో కనిపించలేదు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివాహ పత్రిక అందిచాలని.. తన కూతురు వివాహానికి కేసీఆర్ కుటుంబాన్ని ఆహ్వానించాలని అనుకుంటున్నట్టు వార్తలు కూడా జోరుగానే వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి ఎటువంటి ఆహ్వానం అందించలేదు. అంతేకాదు దీనికి ఓటు నోటు కేసు కూడా ఒక కారణం కావచ్చు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేత అయిన జగన్ ను కూడా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను ఆహ్వానించకపోవడంతో ఇదే కారణమై ఉండచ్చు అని అనుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ పెళ్లి పిలుపుల్లో విభజన స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రోజా సస్పెన్షన్ పై జగన్ పట్టు.. సస్పెన్షన్ ఎత్తేసేది లేదు.. యనమల

అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఒకవైపు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పట్టుబట్టి.. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే సభలో ఉండమని.. ఈ సమావేశాలకు బాయ్ కట్ చెబుతామని అంటుంటే.. మరోవైపు తెలుగు దేశం పార్టీ నేత యనమల మాత్రం రోజాపై సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదని.. సస్పెన్షన్ పై కోర్టుకు వెళ్లినా మాకు అభ్యంతరం లేదని.. రోజా సస్పెన్షన్ పై ఏడాది నుండి తగ్గించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీ ఎల్పీలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేపు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మళ్ళీ అర్ధరాత్రి తెరుచుకొన్న సుప్రీం కోర్టు తలుపులు

  సుమారు ఐదు నెలల క్రితం, ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ కేసులో నిందితుడు యాకూబ్ మీమన్ ఉరి శిక్షని నిలిపివేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు జూలై 30వ తేదీన అర్ధరాత్రి సమావేశమయింది. నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే కోరుతూ డిల్లీ మహిళా కమీషన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌ల సుప్రీం ధర్మాసనం మళ్ళీ నిన్న అర్ధరాత్రి 1.30 గంటలకు జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నివాసంలో సమావేశమయింది.   న్యాయవాదులు గురు కృష్ణ కుమార్‌, దేవ్‌దత్‌ కామత్‌ తదితరులు ఈ విచారణలో వాదించారు. వారి వాదోపవాదాలు విన్న తరువాత సుప్రీం త్రిసభ్య ధర్మాసనం బాలనేరస్తుడి విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కానీ ఇదే కేసుపై దాఖలయిన మరొక పిటిషన్ పై సోమవారం విచారణ చేపడుతున్నందున అప్పుడు తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.   బాల నేరస్థుడిని విడుదల చేసిన తరువాత పోలీసులు అతనిని డిల్లీలోనే ఒక స్వచ్చంద సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ అతని భద్రత ద్రష్ట్యా అతని పేరుతో సహా పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని మార్చివేయబోతున్నట్లు సమాచారం. కొన్ని రోజులపాటు అతని చేత సమాజసేవ కార్యక్రమాలలో చేయించిన తరువాత అతనిని విడిచిపెడతారని సమాచారం. కానీ ఒకవేళ సుప్రీం కోర్టు అతని నిర్బంధం పొడిగించాలని నిర్ణయించినట్లయితే, అతను మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు. కానీ ఈరోజు తెల్లవారు జామున సుప్రీం ధర్మాసనం అభిప్రాయాన్ని బట్టి చూసినట్లయితే అతని విడుదలపై స్టే మంజూరు చేయకపోవచ్చునని భావించవచ్చును.

తిరుమలలో లక్షమంది భక్తులు

  శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడం కోసం లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్.లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. అంతే కాకుండా నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కంపార్ట్.మెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. అన్ని కంపార్టుమెంట్లూ నిండి రోడ్డు మీద రెండు కిలోమీటర్ల మేరకు భక్తులు క్యూ కట్టారు. అలాగే కాలి నడక మార్గం ద్వారా భారీ సంఖ్యలో గోవిందమాల భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసింది.

అజహర్... ముచ్చటగా మూడో పెళ్ళి

  మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజహరుద్దీన్ ముచ్చటగా మూడో పెళ్ళి చేసుకున్నాడు. అజహర్ వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. ఆయన అమెరికాకు చెందిన షానన్ మేరీని వివాహం చేసుకున్నట్టు సమాచారం. 2013 నుంచీ వీరిద్దరూ స్నేహితులట. వీరిద్దరూ పెళ్ళి చేసుకుని ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీలో హనీమూన్ కోసం వచ్చారని మహారాష్ట్రకు చెందిన ఒక పత్రిక కథనాన్ని ఇచ్చింది. అజహర్ గతంలో మొదట నౌరీన్‌ అనే యువతిని పెళ్ళాడాడు. ఆమెకు తలాక్ చెప్పేసి సంగీతా బిజిలానీని పెళ్ళాడాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు షానన్ మేరీని వివాహం చేసుకున్నాడు. ముస్లిం, హిందూ, క్రైస్తవ... ఈ మూడు మతాలకూ చెందిన వారిని పెళ్ళి చేసుకుని తనకు ‘మత అసహనం’ లేదని నిరూపించిన అజహర్‌కి మూడోపెళ్ళి శుభాకాంక్షలు.

సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య

  ప్రముఖ సినీనటుడు రంగనాథ్ (66) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ 1949లో చెన్నైలో జన్మించారు. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్‌. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రైల్వే టీసీగా పనిచేస్తూ, ఉద్యోగాన్ని విడిచిపెట్టి సినిమారంగంలోకి ప్రవేశించారు. బుధ్దిమంతుడు సినిమాతో సినిమా రంగానికి వచ్చిన ఆయన 1973లో 'చందన' అనే సినిమాలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 'పంతులమ్మ' సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. రంగనాథ్ సుమారు 300 చిత్రాలకు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీసీరియల్లోనూ నటించారు. మొగుడ్స్‌-పెళ్లామ్స్‌ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు ఆయన. 50 చిత్రాల్లో హీరోగా, 50 చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించిన రంగనాథ్ ప్రేక్షకుల నుంచి మంచి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. రంగనాథ్ ఆత్మహత్య పట్ల తెలుగు సినిమా రంగం, తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. రంగనాథ్ సున్నితమైన హృదయం కలిగిన వ్యక్తి. దశాబ్దాల క్రితం ఆయన భార్య మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్ల కాళ్ళు పడిపోయాయి. మంచానికే పరిమితమైన ఆమెకు రంగనాథ్ ఎంతో సేవ చేశారు. ఒక మంచి భర్తగా రంగనాథ్ పేరు పొందారు. అయితే ఆమె కొద్దికాలం క్రితం మరణించారు. తనతో ఎంతో అనుబంధం పెనవేసుకున్న భార్య మరణాన్ని రంగనాథ్ జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి మనిషిలో ఎంతో మార్పు వచ్చింది. ఇటీవల ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ, తనకు జీవితంలో ఇంకేమీ కోరికలు లేవని... మరణం కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యాన్నించారు.