జీఎస్టీ బిల్లుపై బీజేపీ వెనక్కి తగ్గిందా..?

ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జీఎస్టీ బిల్లును ఆమోదింపచేయాలని చూసింది. కానీ ఊహించని విధంగా నేషనల్ హెరాల్డ్ కేసు బయటకు రావడంతో  ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బిల్లుకు సంబంధించి మోడీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లకు తేనీటి విందు ఇచ్చి బిల్లును గురించి కూడా మాట్లాడారు. సోనియా, రాహుల్ కూడా తమ డిమాండ్ లు ఒప్పుకుంటే బిల్లును ఆమోదింపజేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ తో సోనియా.. రాహుల్ మోడీ సర్కార్ పై మండిపడుతున్నారు.. ఈనేపథ్యంలో బిల్లు ఆమోదం అతి కష్టమని తేలిపోయింది. మరో వైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గి.. బిల్లును ప్రవేశ పెట్టి భంగపడే కన్నా.. ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారట. 2016 ఏప్రిల్ తర్వాత అంటే బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రవేశ పెట్టి ఆమోదం పొందేలా చూస్తున్నారట. మరి అప్పుడైనా ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో చూడాలి.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హోర్డింగులు.. మెట్రో ఎక్కడా..?

  హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల జోరు బాగానే సాగుతుంది. ఏ పార్టీ వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇక అధికార పార్టీ అయితే ఇప్పటికే హైదరాబాద్ లో సగం హోర్డింగులతో నింపేసింది. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరాలు హోర్డింగులలో వేసి ప్రకటనలతో పాటు.. హోర్డింగులతో నగరమంతా గులాబీ మయం చేసేసింది. అయితే అన్నీ తమ ఖాతాలో వేసుకున్న అధికార పార్టీ మాత్రం మెట్రో రైలును మాత్రం తమ ఖాతాలో వేసుకోలేదు.. సరికదా దీనికి సంబంధించిన ఒక్క యాడ్ ను తమ హోర్డింగుల్లో ఎక్కడా వేసుకోలేదు. ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మెట్రో రైలు విషయంపై టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోయినా..రాష్ట్ర విభజన తరువాత మాత్రం అలైన్ మైంట్ మార్పు విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పింది. అంతేకాదు కేసీఆర్ కూడా అలైన్ మైంట్లో మార్పు పక్కా అని చెప్పారు. కానీ పాత అలైన్ మెంట్ ను కొనసాగించాలని నిర్ణయించటంపై సుల్తాన్ బజార్ వ్యాపారులు.. పాతబస్తీకి చెందిన వారు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దీంతో అధికార పార్టీ లేనిపోని తలనొప్పులు ఎందుకని మెట్రో రైలును తమ ఖాతాలో వేసుకోకుండా జాగ్రత్త పడుతోంది.

రెండోరోజూ గందరగోళం

  కాల్‌మనీ వ్యవహారం మీద రెండోరోజు కూడా ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. కాల్‌మనీ వ్యవహారం మీద ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, ఆ తర్వాత ఎంతసేపైనా చర్చించవచ్చని స్పీకర్ సూచించారు. చర్చ తర్వాత సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలువైన సభా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని స్పీకర్ పలు పర్యాయాలు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు పట్టు వదల్లేదు. అయితే వైసీపీ నాయకులు సభను అడ్డుకోవడం న్యాయం కాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రమం వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించిన ఎజెండా ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడు సభా నిబంధనలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. సభ జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం సహించదని ఆయన స్పష్టం చేశారు.

హరీశ్ టార్గెట్ మిస్సయిందే..!

  తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాటలకు ఎవరైనా ఫిదా అయిపోతారు. హరీశ్ రావు స్పెషల్ గా ఫోకస్ చేసి ఇతర పార్టీ  నేతలను తమ పార్టీలోకి తీసుకురావాలని ఫిక్స్ అయితే అది అయ్యేంతవరకూ వదిలిపెట్టరు. ఆయన మాటలకు ఎంత పెద్ద నేత అయినా కన్విన్స్ అవ్వాల్సిందే. మరి అలాంటి హరీశ్ రావుకు ఒక నేత ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే ఎంతో మందిని కారెక్కించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హరీశ్ రావు కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన వివేక్ పైనా ఫోకస్ చేశారు. ఆయన్ను కారెక్కించడానికి చాలా కన్విన్స్ చేశారంట హరీశ్ రావు. కానీ వివేక్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుతూ తాను కారు ఎక్కలేనని చెప్పారంట. దీంతో హరీశ్ రావుకు మొదటిసారి భిన్నమైన అనుభవం ఎదురైంది. అయితే హరీశ్ రావు మాత్రం తాను సిట్టింగ్ వేసిన తర్వాత టార్గెట్ పూర్తి కాకపోవటం అన్నది ఉండదని వివేక్ ను ఉద్దేశించి హరీశ్ వ్యాఖ్యానిస్తే.. దానికి బదులుగా వివేక్ తనకు వ్యక్తిగతంగా హరీశ్ అంటే ఎంతో అభిమానమని.. కాకుంటే పార్టీ మారే విషయంలో తాను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని తేల్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి హరీశ్ రావు ఆకర్ష్ మంత్రం వికర్ష్ అయింది. మరి వివేక్ ను కారు ఎక్కిండానికి ఇంకా ట్రై చేస్తారో లేక.. టార్గెట్ వదిలిపెడతారో చూడాలి.

చాట్ల శ్రీరాములు కన్నుమూత

  నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు (85) కన్నుమూశారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చాట్ల శ్రీరాములు 1931లో విజయవాడలో జన్మించారు. ఆయన నాటక రంగంలో విశేష కృషి చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్ పురస్కారంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. చాట్ల శ్రీరాములు రైల్వే ఉద్యోగిగానే పనిచేస్తూ 1976 నుంచి నాటకరంగంలో కృషి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మొట్టమొదటి అనౌన్సర్‌గా చాట్ల శ్రీరాములు పనిచేశారు. చాట్ల శ్రీరాములు కొన్ని సినిమాలలో కూడా నటించారు.

చంద్రబాబు నాయుడుకి అరుదయిన పురస్కారం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి చాలా అరుదయిన పురస్కారం దక్కింది. అమెరికాలో ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో గల షికాగో విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అరుదయిన పురస్కారానికి తన పేరును ఎంపిక చేయడంపై స్పందిస్తూ “నేను రాష్ట్రాభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మనసులలో శాస్విత స్థానం దక్కించుకోగలిగితే నా జన్మ ధన్యమయినట్లు భావిస్తాను. అంతకంటే గొప్ప డాక్టరేట్ మరొకటి ఉండదు. ఇదివరకు కూడా నాకు కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలనుకొన్నాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించాను. షికాగో విశ్వవిద్యాలయం అందిస్తున్న ఈ డాక్టరేట్ స్వీకరించడం చాలా గౌరవంగానే భావిస్తున్నాను కనుకనే స్వీకరించేందుకు అంగీకరించాను,” అని తెలిపారు. ఈ విషయం తెలియగానే తెదేపా నేతలు, మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. యాదృచ్చికంగానే సరిగ్గా ఇవ్వాళ్ళే ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించబడింది. ఒకే రోజున తెలుగు రాష్ట్రానికి రెండు అపురూపమయిన పురస్కారాలు లభించడం విశేషమే.

ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

  ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా 2015సం.కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె వ్రాసిన ‘విముక్త’ కధా సంపుటికి గాను ఈ అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఆమె కలం పేరు ఓల్గా. కానీ ప్రజలకు ఆమె ఓల్గా గానే తెలుసు. ఆమె 1950సం.లో గుంటూరులో జన్మించారు. తెలుగు సాహిత్యం మీద అభిరుచితో ఆమె ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. 1973 నుంచి 86 వరకు తెనాలి వీఎస్‌ఆర్‌-ఎన్‌వీఆర్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు.   ఆమె స్త్రీవాద రచయితగా అందరికీ సుపరిచితులు. అదే విధంగా స్త్రీల సమస్యలపై పోరాడిన వ్యక్తిగా సుపరిచితురాలు. ఆమె రచించిన ఆకాశంలో సగం, కుటుంబ వ్యవస్థ, విముక్త వంటి కధలు, స్వేచ్ఛ, ఓల్గా వంటి కవితలు అనేక నాటికల ద్వారా తెలుగు సాహితీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యక స్థానం, గుర్తింపు సంపాదించుకొన్నారు. ఆమె 1986 నుంచి 95 వరకు సుమారు 15 సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు సాహితీ రంగంలో ఈ అత్యున్నత పురస్కారానికి ఆమె కధా సంపుటి ఎంపిక కావడం తెలుగు సాహిత్యానికి జరిగిన పట్టాభిషేకమేనని చెప్పవచ్చును.

వెంకయ్యకు కేసీఆర్ లేఖ.. సాయం చేయండి..

హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రమంత్రి వెంకయ్యకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. కేవలం రూ.100 కోట్లతో హైదరాబాద్ లో అభివృద్ధి అసాధ్యమని.. ఇప్పుడు హైదరాబాద్ ను మళ్లీ స్మార్ట్ సిటీ పథకంలో చేర్చారు.. ఈ నేపథ్యంలో కేవలం 100 కోట్లతో ఏం చేయలేం అని స్పష్టం చేశారు. రూ.5,500 కోట్లు వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్‌ఎంసీ..  625 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి హైదరాబాద్ ఏ-1 కేటగిరి నగరంగా ఉన్న హైదరాబాద్ కు రూ.100 కోట్లు మాత్రమే ఇస్తే ఎటువంటి పనులు చేపట్టలేమన్నారు. హైదరాబాద్ స్థానంలో స్మార్ట్ సిటీగా కరీంనగర్‌ను ఎంపిక చేయాలని.. దీంతో కరీంనగర్‌లో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి సాధ్యమవుతోందని అందులో పేర్కొన్నారు.

ఆశా వర్కర్ల ఆశ నెరవేరెనా..?

తమ కనీస వేతనాలు రూ. 15 వేలు చెల్లించాలని ఆశా వర్కర్లు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ వారి సమస్యకు మాత్రం ఇంతవరకూ పరిష్కారం దొరకలేదు. పోనీ వాళ్లు కోరేది ఎమన్నా ప్రభుత్వాలు ఇవ్వడానికి కష్టతరమైనదా అంటే కాదు..  విద్యార్హతలు కలిగి అర్హులు అయిన వారిని రెండో ఏఎన్ ఎంగా తీసుకోవాలని - పింఛను - గ్రాట్యుటీ - ప్రసూతి సెలవులను కేటాయించాలని..ఇక గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లడం తీసుకు రావడం చేస్తుంటారు. ఇందుకు టీఏ - డీఏ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా కల్పించాలని ప్రసూతి సేవల పారితోషికం పెంచాలని కోరుతున్నారు. నిజానికి ఇవన్నీ పెద్ద ప్రతిపాదనలు కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుకు నెలకు వేలకు వేలు చెల్లించే వారికి ఇది పెద్ద విషయమే కాదు. కానీ వీరి సమస్యను పరిష్కరించేవారు లేరు. ఇక ఈవిషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత అప్పట్లో తమ సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తామని చెప్పింది కానీ అప్పటినుండి ఇప్పటి వరకూ దాని గురించి మాట్లాడింది లేదు. పోనీ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా అంటే లేదు.. కేంద్రం కూడా పట్టించుకోవడంలేదు. ఎవరో ఒకరు పరిష్కరిస్తారులే అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేతులు కట్టుకొని చూడటం వల్ల ఈ సమస్యకు అలాగే కొనసాగుతుంది. వారు ఇంకా ఆందోళనలు చేస్తున్నారు. మరి వారి సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

నేషనల్ హెరాల్డ్.. సోనియా, రాహుల్ ఏం చేస్తారో..?

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ  అధినేత్రి సోనియాగాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 19వ తేది అంటే శనివారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో కోర్టుకు హాజరైన తరువాత సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ ఇంటికి వెళతారా? లేక జైలుకు వెళతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటారు.. కానీ రాహుల్ గాంధీ మాత్రం జైలుకు వెళ్లడానికి రెడీ కానీ బెయిల్ కు దరఖాస్తు చేసేది లేదని గతంలోనే డిసైడ్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏన్డీఏ ప్రభుత్వం విధి విధానాలను ఎండగట్టే దిశగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని సోనియా, రాహుల్ పార్టీ వర్గాలతో అన్నట్టు సమాచారం. అంతేకాదు అలా జైలుకి వెళ్లి ప్రజల సానుభూతిని మరింతగా కొట్టేయాలనే భావనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాహుల్, సోనియాల కేసు వాదించనున్నారు. ఈ నేపథ్యంలో లాయర్లు ఏం చెబితే సోనియా, రాహుల్ అది చేస్తారని పార్టీ నేతలు తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో శనివారం వరకూ ఆగాల్సిందే.

జగన్ గాలి తీసిన చంద్రబాబు..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా మొదలయ్యాయి. ప్రారంభమైన తొలి రోజే అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసేశారు విపక్ష నేతలు. కాల్ మనీ పై రేపు మాట్లాడదాం అంటూ అధికార పక్ష నేతలు ఒకటికి రెండు సార్లు చెప్పిన వినకుండా.. ఈరోజే మాట్లాడదాం అంటూ వైసీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో సజావుగా సాగాల్సిన సభ కాస్త రసాభాసగా తయారైంది. ఇక లాభం లేక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సందర్బంగా చంద్రబాబు వైసీపీ నేతల గాలి తీసేసినట్టు తెలస్తోంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో చాలామంది నేతలు కొత్తవారే కావడం.. అందునా సభకు అడ్డుపడింది కూడా తొలిసారి ఎన్నికైనా వారే కావడంతో..చంద్రబాబు వైకాపాలో జగన్ తో సహా అందరూ సభకు కొత్తవారే కావడం వల్ల ఇబ్బంది తలెత్తుతోందని అన్నారు. అంటే జగన్ తో పాటు జగన్ బ్యాచ్ కు రాజకీయాల్లో అనుభవం లేదని.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఎటకారం చేస్తున్నట్టు చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది.

నిర్భయ పేరు చెప్పడానికి సిగ్గుగాలేదు.. తన పేరు జ్యోతిసింగ్..

నిర్భయ ఉదంతం అందరికి గుర్తుండే ఉంటుంది.  ఈ విషాదకరమైన ఘటన జరిగి నిన్నటితో మూడు సంవత్సరాలు పూర్తయిన  సందర్బంగా నిర్భయ తల్లిదండ్రులు  ఆశాదేవీ, బద్రీనాథ్‌లు మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ కూతురి పేరు  చెప్పుకోవడానికి తమకి సిగ్గుగా లేదని.. తమ కూతురి పేరు జ్యోతి సింగ్ అని ఆశాదేవీ చెప్పారు. కాగా నిర్భయపై అత్యాచారం చేసిన వారిలో ఒకరు జైలులోనే మరణించగా.. నలుగురికి ఉరిశిక్ష పడింది. ఇక మిగిలిన ఒకడు మైనర్ కారణంగా మూడు సంవత్సరాలు శిక్షపడి ఈనెల 20 తేదీన విడుదల కాబోతున్నాడు. దీంతో తమ కూతురిపై అతి కిరాతకంగా అత్యాచారం చేసిన దోషులందరికీ శిక్ష పడింది కానీ.. అందరి కంటే ఎక్కువ హింసించిన వాడిని మాత్రం తక్కువ వయసు అనే కారణం చెప్పి విడుదల చేస్తున్నారని ఆరోపించారు. అపరాది వయసు 16 ఏళ్లా లేక 18 ఏళ్లా అనేది నాకు తెలియదు.. అతను అత్యంత కిరతకానికి పాల్పడ్డాడు.. నా కూతురు కూడా వాంగ్మూలం ఇచ్చిందని.. వయస్సు కారణంగా చూపి వదిలేయడం సరికాదు. వయస్సు కారణంగా దోషులు శిక్ష నుంచి తప్పించుకోవద్దు అని అన్నారు. నిర్భయ తండ్రి మాట్లాడుతూ బాల నేరస్తుడిని విడుదల చేయోద్దని.. అతను సమాజానికి ముప్పుగా మారతాడని అన్నారు. దీనికి సంబంధించి మహిళా కార్యకర్తలు, విద్యార్ధులు, ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, అంబేద్కర్‌ యూనివర్శిటీలకు చెందిన ఫ్యాకల్టీలు, ప్రగతిశీల నేతలు మొత్తంగా 108మంది సంతకాలతో కూడిన ఒక ప్రకటన జారీ కూడా చేశారు.

మంత్రిగారిపై చంద్రబాబు సీరియస్.. ఇక్కడుండి ఏం చేస్తున్నారు..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే అస్సలు ఊరుకోరన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈయన అంతగా పట్టించుకోకపోయిన ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం అస్సలు ఊరుకోవడంలేదు. పని చేయని వారికి స్పాట్ లో క్లాస్ లు తీసుకుంటున్నారు. అది ప్రభుత్వ అధికారులు కాని, మంత్రులు కాని, పార్టీ నేతలు కాని ఎవరైనా వారిని ఉపేక్షించడంలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ మంత్రిగారు పై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. రాష్ట్రంలో కల్తీ మందు, కల్తీ నెయ్యి, ఇప్పుడు తాజాగా కాల్ మనీ వ్యవహారం బయటకు రావడంతో..  వీటిని ముందుగా పసిగట్టి చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని.. హోం మంత్రిగా ఉన్న చినరాజప్ప  ఈవిషయాలను ముందుగా గుర్తించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి నేను దేశాలు తిరుగుతుంటే మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు.. మీరెప్పుడు ఇలాంటి అంశాలపై దృష్టి పెడతారని ప్రశ్నించారట. ఇకపై ఏ చిన్న పొరపాటు జరిగినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని… అంతవరకు రాకముందే మీ శాఖ వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని రాష్ట్ర హోంమంత్రిని ఆదేశించారంట. దీంతో క్యాబినెట్ మార్పు చేయాలని చంద్రబాబు చూస్తున్న నేపథ్యంలో చినరాజప్ప మంత్రిగారి పదవి కూడా డౌట్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది.

వైసీపీ నేతల హడావుడి.. సీసీ కెమేరాల్లో రికార్డు..

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చేసిన హంగామా అందరికి తెలిసిందే. ఎయిర్ ఇండియా మేనేజర్ పై మిధున్ రెడ్డి చేయి చేసుకొని ఎయిర్ పోర్ట్ లో నానా హడావుడి చేశారు. ఈ విషయంలో వీరిద్దరిపై విమర్శలు తలెత్తాయి. కేసు కూడా నమోదైంది. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఇద్దరూ ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. మొదట చెవిరెడ్డి కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించినా తరువాత.. తానే లొంగిపోయాడు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ ఈ వివాదంలో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఉద్యోగి మీద చేయి చేసుకోవటంతో పాటు.. పార్టీ కార్యకర్తల హడావుడి ఎయిర్ పోర్ట్ లోని సీసీ కెమేరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వీరిద్దరికి చిక్కులు తప్పవని అందరూ అనుకుంటున్నారు.

వైసీపీ పై చంద్రబాబు ఫైర్.. ఇద్దరు వైసీపీ నేతలు సస్పెన్షన్..!

వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కాల్ మనీపై రేపు చర్చిద్దామని.. దీనిపై రేపు ప్రకటన చేస్తాం.. కాల్ మనీ వ్యవహారంలో ఎవరిని వదలం..నా ప్రకటన తర్వాత చర్చించి సాక్ష్యాలివ్వండి.. దోషులను శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని..దోషులు ఏపార్టీవారైనా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు సభలో ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి..అంబేద్కర్ పై చర్చించాల్సిన అవసరం ఉంది..నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకునేనా వైసీపీ నేతల వ్యవహారం ఉందని అన్నారు. సభ సజావుగా సాగేందుకు వైసీపీ నేతలు సహకరించాలని సూచించారు. అయినా వైసీపీ నేతలు వినకపోవడంతో స్పీకర్ ఆపార్టీకి చెందిన ఇద్దరు నేతలు శివప్రసాద్ రెడ్డిని, రామలింగేశ్వరరావుని రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు.

కటారి దంపతుల హత్య కేసులో షాక్..కార్పోరేటర్ ఆత్మహత్య..!

చిత్తూరు జిల్లా కటారి దంపతుల హత్య కేసులో మరో షాక్ తగిలింది. చిత్తూరు నగర 38వ డివిజన్ కార్పోరేటర్ శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఎంతోమందిని విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్న పోలీసులు శివప్రసాద్ రెడ్డిని విచారించారు. అయితే విచారణ అనంతరం ఇంటికి వచ్చిన కార్పోరేటర్ శివప్రసాద్ రెడ్డి రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా పోలీసులు అసలు శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని విచారణ జరుపుతున్నారు. శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సికె రెడ్డి అనుచరుడు.

టీఆర్ఎస్ లోకి గడ్డం ప్రసాద్ కుమార్? కాంగ్రెస్ పట్టించుకోవడంలేదు..!

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాదకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ నన్ను ఆహ్వానించిన మాట వాస్తవమే అని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించుకోవడంలేదు.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై కూడా నన్ను సంప్రదించలేదు అని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ నాకు మంచి మిత్రుడు అని.. టీఆర్ఎస్ లో చేరే విషయంపై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. తన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపుకు గాను మెజార్జీ తక్కువగా ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్‌కు సంఖ్యాబలం అవసరం ఉంది. దీంతో కావాలనే గడ్డం ప్రసాద్ కుమార్ టీఆర్ఎస్ గాలం వేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ప్రసాద్ కుమార్ పార్టీలోకి వస్తే టిఆర్ఎస్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి, అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించడానికి కూడా టిఆర్ఎస్ నాయకత్వం రెడీగా ఉందంట. కాగా ప్రసాద్ కుమార్‌తో పాటు 30 మంది ఎంపిటీసిలు, కౌన్సిలర్లు టిఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది.