మోడీ గారికి ఏపీ ప్రజల లేఖ

  భారత ప్రధాని నరేంద్రమోడీకి బాగా విసిగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసుకుంటున్న లేఖ. ఏపీ ప్రజలు రాసిన లేఖ అనగానే ఏ ప్రత్యేక హోదా కోసమో రాసిన లేఖ అనో, కష్టాల్లో వున్నాం ఆర్థికంగా ఆదుకోండి మహాప్రభో అని మొరపెట్టుకునే లేఖో అనుకున్ని  ఎప్పట్లాగే చెత్తబుట్టలో విసిరేయకండి. ఇది అలాంటి లేఖ కాదు.. మీకు అలాంటి లేఖలు ఎన్ని రాసినా ఉపయోగం వుండదని మాకు అర్థమైపోయింది. కాబట్టి మీకు అలాంటి లేఖలు రాయబోం. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అర్జెంటుగా మీ పార్టీలో విలీనం చేసుకోండని విజ్ఞప్తి చేసే లేఖ. పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయి వున్న వైసీపీ నాయకుడు జగన్ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ పంచన వున్నారు. ఇప్పుడు మీ పంచన చేరాలని తహతహలాడుతున్నాడు. ఆయన పార్టీని మీ పార్టీలో విలీనం చేసేసి తన కేసుల నుంచి పూర్తిగా తప్పించుకునే ప్లాన్‌లో వున్నాడు.  బీజేపీ నాయకుడిగా మారిపోయి ఏపీలో హడావిడి చేసి, టీడీపీకి, బీజేపీకి మధ్య చిచ్చు పెట్టి తాను లాభం పొందాలని అనుకుంటున్నాడు. ఆయన మొన్నటి వరకు టీడీపీ - బీజేపీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడు కట్టయిపోతుందా, నా పార్టీ టీడీపీ ప్లేసులోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. అందుకు తెరవెనుక  ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అది వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు పార్టీని విలీనం చేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు. సొంత పార్టీ ద్వారా ఎలాగూ సీఎం కాలేకపోయాను... బీజేపీలో చేరితే అయినా సీఎం అయిపోతానని కలలు కంటున్నారు. మీ పార్టీ కూడా ఏపీలో పాతుకుపోవాలని, వచ్చే ఎన్నికలలో అధికారం సంపాదించాలని కలలుకంటోంది. మీ రెండు పార్టీల మనసులలో కలసిపోవాలని కలలున్నప్పటికీ, ఆ కలలకు టీడీపీకి - బీజేపీకి మధ్య వున్న దోస్తీ అడ్డం వస్తోంది. అయితే టీడీపీ - బీజేపీ దోస్తీ వల్ల ఏపీకి ఎలాంటి లాభం లేదని అందరికీ అర్థమైపోయింది. అంచేత ఈ ముసుగులో గుద్దులాటలు మానేసి వైసీపీని మీ పార్టీలో కలిపేసుకోండి. అప్పుడు ఆటోమేటిగ్గా టీడీపీతో మీ దోస్తీ కట్ అయిపోతుంది. ఇప్పటి వరకూ మీతో మిత్రధర్మం పాటిస్తూ వస్తున్న టీడీపీ అప్పటి నుంచయినా యాక్టివ్ అయిపోయి ఏపీ హక్కుల సాధనలో కేంద్రంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగలుగుతుంది. అంచేత అందరికీ ఆనందాన్నిచ్చే బీజేపీలో వైసీపీ విలీనం సాధ్యమైనంత త్వరగా జరిగిపోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. తమరు ఈ విషయాన్ని పరిశీలించల్సిందిగా విజ్ఞప్తి.

సమ్మెలను తట్టుకునే శక్తి కావాలి

కార్మికుల హక్కుల గురించి నినదించడానికి, సమస్యల గురించి నిరసన వ్యక్తం చేయడానికి ప్రారంభమైన ‘సమ్మె’ అనే ఆయుధం ఇప్పుడు మారణాయుధంగా మారింది. స్వార్థమే పరమావధిగా, ప్రభుత్వాలకు వున్న సమస్యల గురించి మాకెలాంటి సంబంధం లేదన్నట్టుగా, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడితే మాకేంటి అన్నట్టుగా ‘సమ్మె’ ఎదిగింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెని మాత్రమే దృష్టి పెట్టుకుని చెబుతున్న మాటలు కావు ఇవి. అనేక ప్రభుత్వ సంస్థలు కావచ్చు... ప్రైవేటు కంపెనీలు కావచ్చు... ఎక్కడైనా సమ్మె అనేది వికృతరూపం దాల్చింది. అమలుకు సాధ్యం కాని కోరికలు కోరడం... వాటికి యాజమాన్యాలు అంగీకరించకపోతే సమ్మెకు దిగిపోవడం. తమ సమ్మె విజయవంతం అయింది అనిపించుకోవడం కోసం ధర్నాలు, ప్రదర్శనలు జరపడం, పోలీసులు లాఠీ ఛార్చ్ చేసే వరకూ పరిస్థితిని తీసుకురావడం. ఎవరైనా గాయపడితే పెద్ద ఇష్యూ చేయడం. వీరు సమ్మె చేస్తున్నారు కదా అని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే భౌతిక దాడులకు దిగడం... ఇదీ ఇప్పుడు సమ్మె అనే వ్యవస్థ చేరుకున్న స్థితి. సమ్మె కారణంగా కోట్లాదిమంది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎంతమాత్రం పట్టించుకోకుండా వుండే కఠినత్వానికి సమ్మెలు చేస్తు్న్నవారు చేరుతున్నారు. సరే, నేటి మన వ్యవస్థలో ఎవరూ ఎవరినీ అదుపు చేసే స్థితిలో లేరు. ఎవరు ఎవరికి నీతులు చెప్పినా వినే పరిస్థితి అంతకన్నా లేదు. సమ్మెల విషయంలో కూడా ఇదే సూత్రం. మా సమ్మె మా ఇష్టం... మధ్యలో అడగటానికి నువ్వెవరివని సామన్య ప్రజలను ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. అందుకే ఇప్పుడు అలాంటి సామాన్యులందరి తరఫున ఆ భగవంతుడు అనేవాడు ఒకడు వుంటే ఆయన్ని కోరుకునేది ఒక్కటే... స్వామి... ఎవరి సమ్మెలను వారిని చేసుకోనివ్వు.. కానీ ఆ సమ్మెలను తట్టుకునే శక్తిని మాకు ఇవ్వు. ఏ వ్యవస్థ సమ్మెలోకి దిగినా ఆ వ్యవస్థ లేకుండానే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుని జీవన మార్గంలో ప్రయాణించే అవకాశమివ్వు. ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీ సమ్మెని ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగించేలా చేయి. ఎంత సుదీర్ఘ కాలం అంటే... ఆర్టీసీ బస్సులు ఎక్కకపోయినా జనజీవనం మామూలుగానే గడిచిపోయేంత అలవాటైపోయే వరకూ. ప్రజలకు ఆర్టీసీ అనే వ్యవస్థతో అవసరం లేని మానసిక స్థితి వచ్చినప్పుడు, సమ్మె జరిగితే ఏంటంట... బస్సులు తిరిగితే ఏంటంట అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమ్మెలు జనజీవనాన్ని ఎంతమాత్రం ప్రభావితం చేయలేవు. అయితే ఇది అత్యాశ అని తెలుసు... కానీ దురాశ మాత్రం కాదు... ఎవరు లేకపోయినా ప్రకృతి తన పని తాను చేసుకుని పోతున్నట్టుగా ఏ వ్యవస్థ లేకపోయినా ప్రజల జీవనంలో ఎలాంటి ఒడిదుడుకులు రాని రోజు రావాలి.

ఇలాంటి విమర్శలు తగునా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కి చెందిన మీడియా తెలంగాణకు చెందిన మీడియాలా కాకుండా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సొంత మీడియాలా వ్యవహరిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ సొంత మీడియా విషయంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అయినా సదరు మీడియా, ఆ మీడియాకి నాయకత్వం వహిస్తున్నవారు తమ వైఖరిని మార్చుకుంటే బాగుండేది. తెలంగాణ అభివృద్ధి కోసం అన్నట్టు కాకుండా టీఆర్ఎస్ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నట్టుగా వుందన్న విమర్శలు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా సదరు మీడియాలో వచ్చిన ఒక విమర్శ లాంటి వార్త రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి విమర్శలు తగునా అని అందరూ ముక్కు వేలేసుకునేలా సదరు కథనాలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే హామీ విభజన బిల్లు ఆమోదం సమయంలో లభించింది. అయితే ఆ హామీ ఇప్పుడు నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రధానికి ఒక విజ్ఞాపన పంపించారు. దానిమీద తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, పలువురు నాయకులు సంతకాలు చేశారు. ఇలా తెలంగాణకు చెందిన ఎంపీ, నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానిని కోరడం అన్యాయం, దారుణం, తెలంగాణకు ద్రోహం చేయడం అన్నట్టుగా కథనాలు సదరు మీడియాలో రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ సంతకాలు చేసిన నాయకుల ఔదార్యం చాలా గొప్పది. ఈ విషయం నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న కోణంలో కథనాలు రాయడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా్యి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తే తెలంగాణకు వచ్చే నష్టమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరూ లేరు. ఇప్పటికే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అంతరం బాగా పెరిగింది. అది తీవ్రమైన విద్వేషంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది. రెండు రాష్ట్రాలూ బాగుండాలి. సదరు మీడియా ఈ విషయాన్ని గ్రహిస్తే అందరికీ మంచింది.

మోడీని బాగానే దువ్వుతున్నారు

ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ తల చాలా నీట్‌గా కనిపిస్తోంది. ఆయన తన తలను బాగా దువ్వుకుంటూ వుండొచ్చు. ఒకవేళ మోడీ దువ్వుకోకపోయినా, ఆయనను దువ్వేవారు చాలా ఎక్కువైపోయారు. మోడీని దువ్వడానికి రాజకీయ నాయకులు క్యూలు కడుతున్నారు. ఎదుకంటే ప్రస్తుతం ఆయన హవా నడుస్తోంది. ఇంకా నాలుగేళ్ళపాటు ఆయన హవా ఇలాగే ఖాయంగా నడుస్తుంది. ఆయన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో చాలామంది ఆయన్ని బాగా దువ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ గారిని దువ్వేపనిలో నిమగ్నమై వుంటారు. ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడి పరిస్థితి అలాంటిది. విభజన కారణంగా దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని గట్టెక్కించాలంటే మోడీని దువ్వాలి... కేంద్రంలో అధికారం చెలాయించే ఎవర్నయినా దువ్వాలి. ఇప్పుడు ఈ దువ్వే విషయంలో చంద్రబాబుతో పోటీ పడేవారు ఇప్పుడు కొత్తగా మరికొందరు బయల్దేరారు. వారెవరో కాదు. తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ నాయకులు. మొన్నటి వరకు మోడీ, గీడీ అని పుల్లను తీసి పారేసినట్టు నిర్లక్ష్యంగా మాట్లాడిన  తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అప్పట్లో మోడీ బ్రెయిన్ ఛైల్డ్ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని కూడా ఎంతమాత్రం పట్టించుకోలేదు. అయితే మెల్లమెల్లగా ఆయనకు అసలు విషయం బోధపడింది. ప్రధాని మోడీతో మంచిగా వుండకపోతే సీన్ సీతారైపోతుందని అర్థమైంది. దాంతో అప్పటి నుంచి మోడీతో రాసుకు పూసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ప్రధానితో ముఖ్యమంత్రుల మీటింగ్‌కి వెళ్ళి గ్రూఫ్ ఫొటోలో మోడీ పక్కనే నిల్చుని ఫొటో దిగి తాను మోడీకి చాలా క్లోజ్ అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. లేటెస్ట్‌గా స్వచ్ఛ భారత్ అడుగు జాడల్లో నడుస్తూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేశారు. తండ్రి కేసీఆర్ మోడీ పక్కన నిల్చుని ఫొటో దిగి మురిసిపోతే ఆయన కుమార్తె, ఎంపీ కవిత గారు మాత్రం మోడీతో కలసి సెల్ఫీ దిగే ముచ్చటని తీర్చుకున్నారు. ఇవన్నీ మోడీని దువ్వే ప్రయత్నాల్లో భాగమేనని ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం వున్నవారికైనా తెలిసే విషయాలు. అయితే అవసరం తీరిన తర్వాత మోడీని బోడి అనకుండా వుండే విజ్ఞత వుందని ఆశించడం దురాశేనేమో.

కారుతో నక్కని తొక్కించి వుంటాడు

  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తప్పతాగి డ్రైవ్ చేసి ఒక నిండు ప్రాణం పోవడంతోపాటు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటానికి కారణమయ్యాడు. 2002లో జరిగిన ఈ కేసుకు సంబంధించి పదమూడేళ్ళ తర్వాత తీర్పు వెలువడింది. సల్మాన్ ఖాన్ తప్పతాగి డ్రైవ్ చేశాడని, అందువల్ల అతనికి ఐదేళ్ళ కారాగార శిక్ష విధిస్తున్నానని సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సల్మాన్‌కి కోర్టు ఇలా శిక్ష విధించిందో లేదో అలా నెత్తిన నీటి కుండలు పెట్టుకున్నట్టుగా కన్నీరు కార్చేవారు, సానుభూతితో ముక్కులు చీదేవారు ఎక్కువైపోయారు. బోలెడంత మంది బాలీవుడ్ నటీనటులు, దారినపోయే దానయ్యలు... వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా సల్మాన్‌కి శిక్ష పడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ధోరణి చూస్తే సల్మాన్ ఇంకో పదిమంది మీదకి కారు ఎక్కించి చంపేసినా క్షమించేయాల్సిందేనని, ఆయన మానవాతీతుడని అన్నట్టుగా వుంది. ఇలాంటి సానుభూతిపరుల ముక్కు చీదుళ్ళు, మూతి విరుపులు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనుకుంటున్న సమయంలో ముంబై హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. సల్మాన్ కేసును సెషన్స్ కోర్టు సరిగా విచారించలేదని, ఈ కేసును సరిగా విచారించాల్సి వుందని చెప్పింది. సల్మాన్‌కి సాధారణ బెయిల్ కూడా మంజూరు చేసింది. తద్వారా ఈ కేసును మళ్ళీ విచారించాలని చెప్పేసింది. సెషన్స్ కోర్టు పదమూడేళ్ళపాటు విచారణ జరిపి సల్మాన్ ఖాన్ దోషి అని ఖరారు చేసి శిక్ష విధించింది. అయితే గౌరవనీయమైన ముంబై హైకోర్టు మాత్రం ఒకే ఒక్కరోజులో ఈ కేసు విచారణ సరిగా జరగలేదని డిసైడ్ చేసేసింది. ఇంత గొప్పగా అసలు వాస్తవాన్ని కనుక్కొన్న ముంబై హైకోర్టుకు హేట్సాఫ్ చెప్పడం ప్రతి భారతీయ పౌరుడి కర్తవ్యం. ఇంత గొప్పగా, ఇంత త్వరగా న్యాయాన్ని, అన్యాయాన్ని గ్రహించగలిగే గొప్ప న్యాయ వ్యవస్థ మనకు వున్నందుకు మనందరం గర్వపడాలి. అయితే కేసు విచారణ మళ్ళీ మొదలైతే, ఈ కేసులో కీలక సాక్షిగా వున్న రవీంద్ర పాటిల్‌ ఇప్పటికే చనిపోయారు. గతంలో ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటారో లేదో. మరి పరిగణనలోకి తీసుకోకపోతే ఆయన ఇప్పుడు మళ్ళీ సాక్ష్యం ఇచ్చే అవకాశం లేదు కదా.. అయినా ఇవన్నీ ఘనత వహించిన చట్టాలు, న్యాయాలు, కోర్టులు తేల్చాల్సిన విషయం. మనలాంటి సామాన్య పౌరులకు అర్థమయ్యే విషయం కాదు. అన్నట్టు సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఒకసారి తన కారుతో ఏ నక్కనో తొక్కి వుంటాడు. అందుకే లక్కు ఇలా దరిద్రం పట్టినట్టు పట్టింది.

జంపింగ్ సీన్ రివర్స్ అవుతోంది

రాజకీయాలలో ఒక్కోసారి ఒక్కోరకం సీజను నడుస్తూ వుంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే మొన్నటి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఎంతో ఉత్సాహం చూపించేవారు. టీఆర్ఎస్ ప్రయోగిస్తున్న ‘ఆకర్ష’ పథకం పుణ్యమా అని తెలంగాణలో ఇప్పటికే అనేకమంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుల సంగతి సరేసరి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కిటకిటలాడిపోతోంది. ఎంతమంది ఎక్కినా ఒక్కరికి స్థానం వుండే మాయా తివాచీ తరహాలో టీఆర్ఎస్ అనునిత్యం ‘ఆకర్ష’ పథకాన్ని అమలు చేస్తోంది. ఎవరు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసినా, అందరి నోట ఒకటే మాట.. టీఆర్ఎస్ అద్భుత పరిపాలన చూసి పార్టీ మారాను. నా నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలు బతికి బట్టకట్టడం కష్టమేమో అనే అనుమానాలు ఇప్పుడిప్పుడే కలుగుతున్న తరుణంలో లేటెస్ట్‌గా సీన్ రివర్స్ అయింది. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు సొంత జిల్లా అయిన మెదక్ జిల్లా నుంచి. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు శనివారం నాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనను భరించలేకే టీడీపీలో చేరామని వారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి కొంతమంది టీడీపీలో చేరడం అనేది వింతల్లోకెల్లా వింత అనే చెప్పాలి. అలాగే ఈ చేరికలను మారుతున్న పరిస్థితులకు సంకేతంగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ పరిపాలన మీద ప్రతిపక్షాలతోపాటు అనేక వర్గాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో జరిగిన ఈ చిన్న ఘటన భవిష్యత్తులో భారీ పరిణామాలకు నాందిగా భావించవచ్చని కూడా వారు అంటున్నారు.

ఆర్టీసీ చర్చలు విఫలం అవడానికి ఎవరు కారణం?

  ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాకపోవడంతో రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ సంస్థకు సాంభశివరావు మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన నిన్న ఆంధ్రా, తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించి, “ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వగలమని కానీ తెలంగాణా ఉద్యోగులకు ఎంత ఇచ్చేది ఇప్పుడే చెప్పలేమని ఎందుకంటే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ విషయంలో స్పందించిందని తెలంగాణా ప్రభుత్వం ఇంకా ఈ విషయంపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని” చెప్పడంతో అటువంటప్పుడు తమను ఎందుకు చర్చలకు పిలిచారంటూ తెలంగాణాకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు అశ్వత్థామ, కె. పద్మాకర్‌, పలిశెట్టి దామోదరరావు, కొమిరెల్లి రాజిరెడ్డి తదితరులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అది వారి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో ఆయన ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్చల మధ్యలోనే బయటకి వెళ్ళిపోయారు. ఆయన చాల నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ఆంధ్రాకు చెందిన ఆయనతో తాము ఇకపై చర్చలకు కూర్చోబోమని తెలంగాణాకు చెప్పడంతో ఆయన కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందించారు.   ఆయన తక్షణమే ఆర్టీసీ బస్ భవన్ లో ఆంధ్రాకు కేటాయించిన ‘ఏ’ బ్లాకులోకి తన చాంబర్ ని మార్పించుకొన్నారు. అంతే కాదు ఇకపై తెలంగాణాకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు జేఎండీ రమణారావుతోనే చర్చించుకోవాలని, తను ఇకపై తెలంగాణా ఆర్టీసీ వ్యవహారాలలో కలుగజేసుకోనని ప్రకటించారు. ఈనెల 14 నుండి ఆంధ్రా, తెలంగాణా ఆర్టీసీలు బస్ భవన్ లో ‘ఏ’ ‘బి’ బ్లాకుల నుండి వేర్వేరుగా నిర్వహించుకొనేందుకు నిర్ణయించుకొన్నాయి. కానీ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున ఆంధ్ర, తెలంగాణా ఆర్టీసీ సంస్థలు రెండింటికీ ఆయనే మేనేజింగ్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు.   నిన్న జరిగిన పరిణామాలతో కలత చెందిన ఆయన స్వచ్చందంగా తెలంగాణా బాధ్యతల నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యకర పరిణామమేనని చెప్పక తప్పదు. ఉద్యోగులు వేతనాల పెంపు గురించి మొదలయిన చర్చలు ఈవిధంగా ప్రాంతీయ బేధాలకు దారి తీయడం ఆశ్చర్యమే కానీ అది అనివార్యమవుతుందని ఊహించడం పెద్ద కష్టం కాదు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల పెంపుగురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకొంటునప్పుడు ఉద్యోగ సంఘాల నేతలతో వేర్వేరుగా చర్చలు జరుపకుండా అందరితో ఒక్కసారే మాట్లడాలనుకోవడం ఆర్టీసీ యాజమాన్యం చేసిన తప్పయితే, వేతన సవరణ గురించి చర్చించడానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు ఆ విషయం గురించి మాట్లాడకుండా వేరే విషయాల గురించి మాట్లాడటం కూడా అంతే తప్పు. ఈ సమస్య మరిన్ని చిక్కు ముడులు పడకూదనుకొంటే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల ఆర్టీసీ విభజన ఎలాగూ జరుగుతోంది కనుక సంబంధిత అధికారులు, మంత్రులే తమ తమ రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కొనసాగిస్తే మంచిది.

బొత్సతో వైసీపీ బేరం ఫిక్స్

పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బేరం ఫిక్స్ చేసుకుంది. ఈ బేరం సారాంశం ఏమిటంటే, బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి జెల్ల కొట్టి వైసీపీలోకి జంప్ అవుతారు. దానికి ప్రతిఫలంగా బొత్సకు వైసీపీ తరఫున ఏపీ శాసనమండలిలో స్థానం ఇస్తారు. ఈ మేరకు బొత్స, జగన్ మధ్య ఒప్పందం ఖరారు అయినట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో బొత్స వైసీపీలో చేరబోతున్నారు. జంప్ జిలానీ అయిన బొత్సకు ఎమ్మెల్సీ పదవిని జగన్ బంగారు పళ్ళెంలో పెట్టి అందించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవడానికి బొత్స సత్యనారాయణ కూడా ఒక కారణం. గత ఎన్నికలలో చీపురుపల్లి నుంచి ఓడిపోయిన తర్వాత బొత్సవారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలోంచి జంప్ అయిపోవాలా అని ఎదురుచూస్తున్నారు. బీజేపీతో బేరం విఫలమైన తర్వాత ఆయన చూపు వైసీపీ వైపు మళ్ళింది. ఇప్పటికే దుకాణం సర్దేసే స్థితిలో వున్న వైసీపీకి బొత్స రాక మేలు చేస్తుందని పార్టీ నాయకుడు జగన్ భావిస్తున్నారు. వైసీపీని బీజేపీలో విలీనం చేసేసి, కేసుల నుంచి తప్పించుకోవాలని, ఆ తర్వాత బీజేపీ నాయకుడిగా ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కాలన్నది జగన్ కంటున్న కల. అయితే ఈ కలను కార్యరూపంలో పెట్టాలంటే బీజేపీతో రాయబారాలు నడపగల ఒక మధ్యవర్తి అవసరం వుంది. కేంద్రంలోని సీనియర్ బీజేపీ నాయకులతో సత్సంబంధాలు వున్న బొత్స అయితే ఈ మధ్యవర్తి పదవికి న్యాయం చేయగలరన్న నమ్మకంతోనే ఆయనకు పార్టీ తీర్థంతోపాటు ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏ పనీలేకుండా ఖాళీగా వున్న బొత్స వైసీపీలో చేరిన తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి తనవంతు కృషి చేస్తారన్నమాట. ఏ పార్టీలో అయినా పార్టీకి ఎప్పటినుంచో సేవ చేసిన వారిని కాకుండా జంప్ జిలానీలను అందలం ఎక్కించడం అనేది సంప్రదాయంగా మారింది. వైసీపీ కూడా అదే బాటలో నడుస్తోంది. తప్పో ఒప్పో పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది వున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి జంప్ అయి వస్తున్న బొత్సకు ఎమ్మెల్సీ స్థానం రిజర్వ్ చేయడం పట్ల వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొత్స పార్టీలోకి రాబోతున్నారన్న విషయం తెలుసుకున్న ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో వున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యేగా వున్న వైసీపీ నాయకుడు రంగారావు బొత్సను పార్టీలోకి తీసుకుంటే తాను రాజీనామా చేస్తానని బెదిరించారని కూడా సమాచారం. అయితే ఎవరు ఎన్నిరకాలుగా బెదిరించినా, తన పార్టీని బీజేపీలో విలీనం చేసే కలను కంటున్న జగన్ ఆ కలను నిజం చేసే వ్యక్తి బొత్స వారేనని భావిస్తున్నారు. అందుకే ఆయనకు పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్నారు. మరి బొత్సగారు వైసీపీలో చేరిన తర్వాత జగన్ కల నిజమవుతుందో, లేక పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగి పరిస్థితి ఇప్పుడున్నదానికంటే ఇంకా దిగజారుతుందో కాలమే తేల్చాలి.

ఆర్టీసీ ఉద్యోగులకు రాక్షసత్వం తగదు

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. విధులకు హాజరు కావడం లేదు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థులయితే ఎంతో టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్ తమకూ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు పట్టుపడుతున్నారు. 27 శాతం వరకు ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించినప్పటికీ మెట్టు దిగని ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు చీటికి మాటికి సమ్మెకు దిగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు జరుపుతున్న సమ్మెలో భాగంగా కొంతమంది ఆర్టీసీ సిబ్బంది అదుపు తప్పి వ్యవహరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ యాజమాన్యం ఒప్పంద ఉద్యోగులతో బస్సులను నడిపే ప్రయత్నాలు చేస్తోంది. అయితే అలాంటి బస్సులను ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. ప్రజల సమస్యలు తమకు ఎంతమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అక్కడితే ఆగితే పర్లేదని అనుకోవచ్చు. బస్సులను నడపడానికి వచ్చిన ఒప్పంద ఉద్యోగుల మీద రాక్షసంగా దాడులు చేస్తున్నారు. నంద్యాలలో ఒక ఒప్పంద ఉద్యోగిని చావగొట్టారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఒప్పంద ఉద్యోగి నడుపుతున్న బస్సు మీద ఆర్టీసీ ఉద్యోగులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు ధ్వంసం కావడం మాత్రమే కాకుండా, బస్సు నడుపుతున్న ఒప్పంద ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ ఉద్యోగులు ఇలాంటి రాక్షసత్వాన్ని విడిచిపెట్టాలి.

‘ఎర్ర’ ముద్ర పోయేదెలా?

వైసీపీ మీద ఇప్పుడు ఎర్రటి ముద్ర పడింది. ఆ ముద్రను ఎలా వదిలించుకోవాలా అని ఆ పార్టీ ఇప్పుడు తంటాలు పడుతోంది. ఈ తాజా గండం నుంచి తప్పించుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే ఎంత ప్రయత్నించినా ఆ ‘ఎర్ర’ ముద్ర చెరిగిపోవడం లేదు... కాలం గడిచేకొద్దీ ఆ ముద్ర సైజు పెరిగిపోతూ వస్తోంది. ఇంతకీ ఆ ‘ఎర్ర’ ముద్ర ఏమిటంటే ఎర్రచందనం ముద్ర. ఎర్ర చందనం స్మగ్లర్ల కారణంగా వైసీపీ మీద పడిన ముద్ర. అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి, వైసీపీకి వున్న అనుబంధం చాలా దృఢమైనదన్నదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంటర్‌పోల్ చేతికి చిక్కిన ఈ స్మగ్లర్‌ని ఏపీకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంగిరెడ్డి ఏపీ పోలీసులకు చిక్కి, ‘సత్కారం’ లభిస్తే ఎవరి పేర్లు వెల్లడి అవుతాయో అన్న ఆందోళన సదరు పార్టీ వారికి వున్నాయి. అలాగే మొన్నీమధ్య దొరికిపోయిన స్మగ్లర్ మస్తాన్ వలీ కూడా వైసీపీ ముద్దుబిడ్డే. మస్తాన్ వలీ మూడో భార్య, హీరోయిన్ అయిన నీతూ అగర్వాల్ మీద పోలీసుల దృష్టి పడిన తర్వాత ఆమె పోలీసులకు లొంగిపోవాలని అనుకుంది. ఆ విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసింది. వాళ్ళు లొంగిపోతే మంచిది కాదని ఆమెకు సలహా కూడా ఇచ్చారు. సదరు  ఎమ్మెల్యేలు కూడా ఘనత వహించిన వైసీపీ ఎమ్మెల్యేలే అని సమాచారం అందుతోంది. ఇన్ని రకాలుగా ఎటు తిప్పినా ఎర్రచందనం స్మగ్లర్ల ఇష్యూ వైసీపీకి చుట్టుకుంటూ వుండటం ఆ పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.

పార్లమెంటు ముట్టడి ఎందుకట?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిస్సహాయతను ప్రదర్శించింది. ఏ విషయంలో అయితే బీజేపీ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం విషయంలో పట్టుబట్టిందో, ఇప్పుడు అదే బీజేపీ అదే విషయంలో వెనకడుగు వేసింది. ఇలా వెనకడుగు వేయడానికి అనేక కారణాలు వున్నాయి. రాజ్యాంగ పరమైన ఆ కారణాలన్నిటినీ అధిగమించే శక్తి లేకపోవడం వల్లే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతోంది. మరి భవిష్యత్తులో తనకు అవకాశం లభిస్తే తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందేమో! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తుందేమో. పార్లమెంటులో అన్ని పార్టీల సహకారం లభిస్తే ఏపీకి ప్రత్యేక హోదా దక్కే ఛాన్సుందేమో. ఇలాంటి ఎన్నో మార్గాలు, అవకాశాలు వుండగా పార్లమెంటును ముట్టడిచేసే కాలం చెల్లిన ఐడియాతో ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళని ఏమనాలి? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ ఏపీకి చెందిన కొంతమంది ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. అక్కడ నలుగురైదుగురు గుమిగూడి పార్లమెంటును ముట్టడి చేయడానికి వెళ్తున్నాం అని ప్రకటించి బయల్దేరారు. పోలీసులు సహజంగానే వాళ్ళని అరెస్టు చేసి, ఆ తర్వాత విడిచిపెట్టారు. సాయంత్రానికి పార్లమెంటును ముట్టడిస్తాం అని వెళ్ళినవారు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. పడుతూ లేస్తూ ఢిల్లీ వెళ్ళి వీళ్ళు సాధించిందేమిటి? ఫలానావాళ్ళు ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటును ముట్టడించారన్న వార్త మీడియాలో రావడం. ఇంతకంటే వీళ్ళు సాధించిందేమీ లేదు. ఆ.. మరోటి సాధించారు.. వాళ్ళ పేర్లు మీడియాలో కనిపించాయి, వినిపించాయి. ఈ ప్రయోజనం అయితే దక్కింది.  ప్రస్తుతం ఏపీ చాలా సమస్యలలో వుంది. ప్రత్యేక హోదా రాకపోవడం కూడా ఒక సమస్యే. ఆ సమస్యను పరిష్కరించుకునే మార్గం మాత్రం ఇదికాదు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కేంద్రాన్ని ఒక పద్ధతి ప్రకారం ఒప్పించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి పార్లమెంటును ముట్టడి చేస్తాం అంటూ హడావిడి చేస్తే దేశ రాజధానిలో పోయేది ఏపీ ప్రజల పరువే.

సల్మాన్ మీద సానుభూతి ఎందుకో?

తప్పతాగి కారు నడిపి ఒక వ్యక్తి మరణానికి, కొంతమంది గాయపడటానికి కారణమైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి కోర్టు ఐదేళ్ళ జైలుశిక్ష విధించింది. నేరం జరిగిన 13  సంవత్సరాల తర్వాత అయినా కోర్టు తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే సల్మాన్‌కి శిక్ష పడిందని తెలియగానే చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు చాలా ఫీలైపోతూ ప్రకటనలు చేయడమే మన దేశంలోని దౌర్భాగ్యానికి సంకేతంగా నిలుస్తోంది. సల్మాన్ ఖాన్ వల్ల ఉపయోగం పొందినవాళ్ళో, ఆయన సన్నిహితులో సానుభూతి వ్యక్తం చేస్తే దాన్ని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవి లాంటి  వ్యక్తులు కూడా బోలెడంత ఫీలైపోతూ సల్మాన్‌కి అనుకూలంగా ప్రకటన చేయడం వెగటుగా వుంది. అసలు సల్మాన్‌ఖాన్‌ మీద సానుభూతి ఎందుకు వ్యక్తం చేయాలి? అతను తప్పతాగి యాక్సిడెంట్ చేశాడని కోర్టు నిర్ధారించింది. శిక్ష వేసింది. అంటే సల్మాన్ నేరం చేశారని అందరూ అంగీకరించి తీరాలి. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చాలామంది బాధ్యతాయుతమైన వ్యక్తులు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడమేంటి? ఇంకొంతమంది వ్యవహారం చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థంకాని పరిస్థితి. సల్మాన్ ఖాన్ ఎన్నో మంచి పనులు, దాన ధర్మాలు చేశాడు కాబట్టి ఆయన్ని వదిలేయాలట. సల్మాన్ ఖాన్ కోర్టులో కన్నీరు పెట్టుకుని శిక్షను తగ్గించాలని కోరుకున్నాడు కాబట్టి శిక్షను తగ్గించేసేయాలట. సల్మాన్ ప్రముఖ హీరో కాబట్టి, ఆయన ఐదేళ్ళు జైల్లో వుంటే సినిమా పరిశ్రమ 250 కోట్లు నష్టపోతుంది కాబట్టి ఆయనకు శిక్ష విధించకుండా వదిలేయాట... ఏంటీ మినహాయింపులు? సల్మాన్ సినిమా స్టారో, దాన కర్ణుడో కాబట్టి ఆయనకు శిక్ష విధించకుండా వదిలేయాలా? ఇలా మినహాయింపులు కోరేవారికి అసలు మానవత్వం అనేది వుందా?  ప్రముఖులు నేరాలు చేసినా వదిలేస్తూ వుండాలా? సల్మాన్ మీద అంత ప్రేమ, అభిమానం వున్నవాళ్ళు ఆయన జైల్లోకి వెళ్ళే సమయంలో గేటు దగ్గర వీడ్కోలు పలకండి. సల్మాన్ జైల్లోంచి విడుదలయ్యే సమయంలో మళ్ళీ వెళ్ళి స్వాగతం పలకండి. అంతేగానీ, సల్మాన్‌కి శిక్ష పడటం దారుణం అన్నట్టుగా మాట్లాడకండి. వినడానికే అసహ్యంగా వుంది.

కేజీ బేసీన్లో మన వాటా పొందాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ నాయకుడు అయితే విభజన బిల్లు  రాజ్యసభలో ఆమోదం పొందిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారో, అదే నాయకుడు ఇప్పుడు ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయం విభజన బిల్లులో లేదు కాబట్టి తామేమీ చేయలేమని కూల్‌గా చెబుతున్నారు. ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనే అలా మాట్లాడుతున్నప్పుడు ఏపీ ప్రజలు, నాయకులు ఇక ఆ విషయం గురించి దేబిరించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ గుప్పిట్లో వున్న అంశాల నుంచి ఎలా ప్రయోజనాలు పొందాలో ఆలోచించాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా మరో అన్యాయం జరిగిందని అనుకుని, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఏపీలోనే వున్న బంగారు బాతు కేజీ బేసిన్ నుంచి ఎలా ఆదాయం పొందాలో ప్రణాళికలు రూపొందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసినందుకు అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్ నుంచి కేంద్రం బోలెడంత సహజవాయువును తరలించుకుని వెళ్తోంది. ప్రతి ఏడాది కేజీ బేసిన్ ద్వారా లక్షల కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఈ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కి వాటా ఎంతమాత్రం ఇవ్వడం లేదు. ఈ విషయంలో గతంలో నియమించిన కమిటీలు ఆంధ్రప్రదేశ్‌కి ఆదాయంలో వాటా ఇవ్వాలని చెప్పాయి. ఆయా కమిటీలు ఇచ్చిన రిపోర్టులు ఇంతవరకు ఆమోదాన్ని పొందలేదు. కేంద్ర ప్రభుత్వం వాటిని ఎప్పటి నుంచో పెండింగ్‌లో పెట్టింది. ఆ నివేదికలను ఆమోదించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడా 10 వేల కోట్ల రూపాయల  ఆదాయం లభించే అవకాశం వుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ నివేదికలను ఆమోదించి వెంటనే తమకు కేజీ బేసీన్‌ ఆదాయంలో వాటా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి దీనికి సానుకూల స్పందన రాకపోతే ఏపీ ఏ విధంగా మెలికలు పెట్టాలో ఆ విధంగా మెలికలు పెడితే సరిపోతుంది. ఏ రాష్ట్రం పరిధిలో వున్న వాటిమీద ఆ రాష్ట్రానికే హక్కులు వుంటాయని గౌరవనీయమైన కోర్టులు కూడా సెలవిస్తున్నాయి. మరి ఏపీ పరిధిలో వున్న కేజీ బేసిన్ ఆదాయం మీద ఏపీ హక్కులు పొందకపోతే కేంద్రం దృష్టిలో ఏపీ అంటే చులకన మరింత పెరిగిపోవడం ఖాయం.

లాలూ వెర్సెస్ నితీష్ కుమార్?

  ప్రతీ సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ‘మూడో ఫ్రంట్’ ముచ్చట్లు పెట్టుకోవడం ఎన్నికలయ్యేలోగానే దానిని పక్కనపడేసి ఎవరికీ వారు ఎన్నికలలో పోటీ చేయడం చాలా కాలంగా జరుగుతున్నదే. ఈ ఏడాది నవంబర్-డిశంబర్ నెలల మధ్యలో బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఈసారి ‘జనతా’ హెడ్డింగులు పెట్టుకొన్న ఆరు పార్టీలు విలీనమయ్యి ఒక్క పార్టీగా అవతరించబోతున్నట్లు క్రిందటి నెల ప్రకటించాయి. దానికి అధ్యక్షుడిగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ని ఎంచుకొన్నారు. పార్టీ పేరు, జెండా,ఎజెండాలను ఖరారు చేసేందుకు ఆరు పార్టీల ప్రతినిధులతో ఒక కమిటీ వేసుకొన్నారు.   ఇల్లలకగానే పండగ కాదన్నట్లు అందరూ కలిసి పెద్ద పొయ్యి వెలిగించుకొన్నారు గానీ నేటికీ ఎవరి పొయ్యిలు వారు చల్లారిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేద్దామని కలలుగన్న నితీష్ కుమార్ అది సాధ్యం కాదని తేలిపోవడంతో తమ జేడీ (యు) పార్టీకే చెందిన బీహార్ ముఖ్యమంత్రి జీతాన్ రాం మంజీ కుర్చీ క్రింద మంట పెట్టి ఆయనను దించేసి ఆ కుర్చీలో తను సెటిల్ అయిపోయేరు.   ఇప్పుడు తమ పార్టీని ఇంకా పేరు ఊరు లేని పార్టీలో విలీనం చేసేసారు కనుక ఆయనకు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పోటీగా తయారయ్యారు. అయితే గడ్డి కుంభకోణం కేసులో నాలుగేళ్ళు జైలు శిక్షపడినందున ఆయన ఎన్నికలలో పోటీ చేయలేరు. కనుక ముఖ్యమంత్రి కాలేరు. అయినప్పటికీ ఆయన ఇదివరకులాగే తన భార్య రబ్రీ దేవినో లేకపోతే మరొక డమ్మీనో అందులో కూర్చోబెట్టి తను రాజ్యం ఏలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది గమనించి నితీష్ కుమార్ కూడా అప్రమత్తమయ్యారు. ఆరు పార్టీలు కలిసి బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన పేరునే ప్రకటించాలని ఆయన కోరుతున్నారు.   కానీ ఎల్లప్పుడూ ప్రతిపక్షంలో కూర్చోవడం పాపం లాలూ ప్రసాద్ కయినా చాలా ఇబ్బంది కలిగించే విషయమే కనుక ఆయన కూడా వెనక్కి తగ్గడం లేదు. అందుకే వారిద్దరూ కలిసి తమ కొత్త పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ తో ఈ విషయం గురించి చర్చించడానికి మొన్న డిల్లీ బయలుదేరి వెళ్ళారు.   ముందు ఈవిషయం గురించి ఏదో ఒకటి తేల్చుకొన్న తరువాతే పార్టీ జెండా, అజెండాల గురించి మాట్లాడుకోవడం మంచిదణి వారిరువురూ భావిస్తున్నట్లు సమాచారం. వారిలో ఎవరికి ముఖ్యమంత్రి సీట్ కన్ఫర్మ్ చేసినా రెండవ వ్యక్తి మళ్ళీ తన పొయ్యి రాజేసుకోవడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తధ్యం. కనుక జెండా ఎగరవేయక ముందే జనతా పరివార్ కధ ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు.

చంద్రబాబు ఓర్పుకు హేట్సాఫ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలోని రాజనీతిజ్ఞతను చూస్తుంటే ఆయన మీద గౌరవం పెరుగుతూ వుంటుంది. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక విజయాలు సాధించిన ముఖ్యమంత్రిగా,  తెలుగువారి జీవితాలను మేలు మలుపు తిప్పిన నాయకుడిగా ఆయన ఎలా ఎదగగలిగారో అర్థమవుతూ వుంటుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు... ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో బాగా తెలిసిన రాజకీయవేత్త ఆయన. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోనే గౌరవప్రదమైన రాజకీయ నాయకులలో ఒకరిగా పేరు తెచ్చుకోగలిగారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి గల ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విషయంలో చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ఓర్పు. ఆర్థికంగా ఎంతో క్రుంగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు తన మాటతో దేశ రాజకీయాలను శాశించిన ఆయన ఇప్పుడు కేంద్రం ముందు ఎంతో ఓర్పుతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ఎన్నో అంశాల విషయంలో కేంద్రం కొంత జాప్యం చేస్తున్నప్పటికీ, అది ఎంతోమందికి ఆవేశాన్ని కలిగిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఎంతమాత్రం ఓర్పును కోల్పోకుండా కేంద్రంతో సత్సంబంధాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్న స్థానంలో మరో వ్యక్తి ఉన్నటయితే కేంద్రం మీద నిప్పులు చెరిగి, విమర్శలు గుప్పించి పరిస్థితిని మరింత నాశనం చేసి వుండేవారు. అయితే చంద్రబాబు మాత్రం కేంద్రం మీద ఎలాంటి విమర్శలు చేయకుండా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావలసిన నిధులను, వరాలను సాధించేందుకు ప్రయత్నం చేస్తు్న్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడం ఆలస్యమైందని కేంద్రం మీద వాగ్బాణాలు సంధిస్తున్న కొంతమంది ఏపీ నాయకులు చంద్రబాబును చూసయినా పాఠాలు నేర్చుకోవాలి. ఆయన ఓర్పుకు హేట్సాప్ చెప్పాలి.

ఇకనైనా చదవండి

తెలంగాణ రాష్ట్రం సిద్ధించేసింది. త్వరలో బంగారు తెలంగాణ కూడా వచ్చేస్తుంది. వచ్చే నాలుగేళ్ళ లోపు బంగారు తెలంగాణను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రశంసనీయమైన కృషిని చూస్తునే వున్నాం. బంగారు తెలంగాణను సాధించే అంశాన్ని రాజకీయ నాయకులకు వదిలేసి ఇక తెలంగాణ విద్యార్థులు చదువు మీద దృష్టి పెడితే మంచింది. తెలంగాణ రాష్ట్రం ఏ విషయంలోనూ ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా వెనుకబడి వుండకూడదు. ముఖ్యంగా చదువు విషయంలో. అన్నిటికీ చదువే మూలం. చదువులో వెనకబడితే అన్నిట్లోనూ వెనకబడి పోవడం ఖాయం. మొన్నీమధ్య విడుదలైన ఇంటర్మీడియల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పొరుగు రాష్ట్రం కన్నా మన రాష్ట్రం వెనుకబడి వుంది. ఇక వచ్చే ఏడాది ఆ పరిస్థితి వుండకూడదు. అందువల్ల తెలంగాణ విద్యార్థి లోకం ఇక చదువు మీద దృష్టి పెట్టాలి. చదువు విషయం ఇంత గట్టిగా చెప్పడానికి గల ముఖ్య కారణం మరొకటి వుంది. మొన్నీమధ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజీవ్ విద్యా మిషన్ (రీమ్యాప్), తెలంగాణ నైపుణ్య సంస్థ (స్కి్ల్ మిషన్) తెలంగాణలోని పలువురు విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. తెలంగాణ విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలను చూసి ఆ రెండు సంస్థల ప్రతినిధులు నోళ్ళు తెరిచారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చదువుతున్న చదువు చాలదన్న విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అందువల్ల, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చూసుకుంటే చాలు. ఇప్పుడున్న విద్యా ప్రమాణాలతో మన తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయి కాంపిటీషన్‌కి ఎదుర్కోగలరా? ఇప్పుడున్న పద్ధతే కొనసాగితే జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగ అవకాశాలు మన చేజారిపోయే ప్రమాదం వుంది. అందువల్ల తెలంగాణ విద్యార్థిలోకం ఉద్యమాల బాటను విడిచిపెట్టి చదువుల బాట పట్టాలి.

దావూద్ ఫొటోని అయినా పట్టుకోండి

ముంబైలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినప్పుడు దావూద్ ఇబ్రహీంని ఎవరూ పట్టుకోలేదు. డి-కంపెనీని ధూమ్‌ధామ్‌గా నిర్వహించినప్పుడు అతని జోలికి ఎవరూ వెళ్ళలేదు.  ముంబైలో బాంబు పేలుళ్ళు జరగడానికి కారకుడైనప్పుడు ఎవరూ పట్టుకోలేదు. బాంబు పేలుళ్ళు జరిగిన తర్వాత ఎంచక్కా పాకిస్థాన్‌కి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరూ పట్టుకోలేదు. పాకిస్థాన్‌లో దావూద్ ఇబ్రహీం ఎంచక్కా హాయిగా జీవిస్తున్నాడు. ఆయన సోదరులు, బంధువులు ముంబైలోనే విలాస జీవితాన్ని గడుపుతున్నారు. దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి పాకిస్థాన్ క్రికెటర్ మియాందాద్ కొడుకుతో మొన్నామధ్య వైభవంగా జరిగింది. అప్పుడూ అతగాడిని ఎవరూ పట్టుకోలేదు. ఇండియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం‌ని ఇంతవరకు ఇండియా పోలీసులు, సీబీఐ, ఇతర సంస్థలు పట్టుకోలేకపోవడం  మనం సిగ్గుపడాల్సిన అంశం. ఇప్పటి వరకు పట్టుబడని దావూద్ ఇబ్రహీం‌ని భవిష్యత్తులో పట్టుకుంటామన్న నమ్మకం కూడా లేదు. దావూద్‌ని పట్టుకోవడం సంగతి అటు వుంచి, అతని లేటెస్ట్ ఫొటోని కూడా మనవాళ్ళు పట్టుకోలేకపోయారు. ఇక మనిషిని ఏం పట్టుకుంటారు. గూగుల్లో దావూద్ ఇబ్రహీం అని ఇమేజెస్ కోసం సెర్చ్ చేస్తే, ఎప్పుడో పాతికేళ్ళ వయసులో వున్న దావూద్ ఫొటో కనిపిస్తుందే తప్ప దాదాపు 60 ఏళ్ళ వయసు వచ్చిన అతని ఫొటో కనిపించదు. అసలు ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఎలా వున్నాడో. మన సీబీఐ చీఫ్‌కి ఇప్పుడు దావూద్ ఎదురుపడి టైమెంతైంది గురూ అని అడిగినా గుర్తుపట్టలేనట్టు వున్నాడేమో. అసలు దావూద్ ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయి ఇండియాలోనే హాయిగా బతికేస్తున్నాడేమో. ఈమధ్య మన దేశంలో దావూద్ గురించి దుమారం రేగుతోంది. దావూద్ లొంగిపోతానని అప్పట్లో అన్నాడని ఒక సీబీఐ పెద్దాయన చెప్పాడు. దావూద్ ఎక్కడున్నాడో తెలుసా అని పార్లమెంట్‌ సభ్యులు హోంశాఖ సహాయమంత్రిని ప్రశ్నిస్తే ఆయన కూడా తనకు తెలియదని సమాధానం ఇచ్చేశారు. మొత్తమ్మీద ఏమిటంటే, దావూద్‌ని పట్టుకోవడం మనవల్ల కాదుగానీ, ఆయన లేటెస్ట్ ఫొటోని అయినా మన దర్యాప్తు సంస్థలు సంపాదిస్తే అదే పదివేలు.

ఉద్యోగుల మధ్య భలే ఐకమత్యం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన సమయంలో రెండు ప్రాంతాలకు చెందిన ప్రభుత్వోద్యోగులు ఎంతలా తిట్టుకున్నారో, ఒకరి మీద మరొకరు ఎంతలా కయ్యానికి కాలు దువ్వుకున్నారో అందరికీ తెలిసిందే. ఇరువర్గాల వారు ప్రదర్శించిన ఆవేశ కావేషాలు చూసి బాబోయ్... భవిష్యత్తులో వీరు ఎప్పటికీ కలవలేరు... ఒక మాట మీద నిలబడలేదని అందరికీ అనిపించింది. ఉద్యోగుల మధ్య ఇంతలా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, మానసికంగా ఇద్దరూ విడిపోయిన  పరిస్థితుల్లో ఇక రాష్ట్రం విడిపోవడమే  మంచిదని అనిపించింది. అందరికీ అనిపించిందే జరిగింది. రాష్ట్రం విడిపోయింది. విడిపోయి కలిసుందామని ఏ మహానుభావుడి నోటి వెంట మొదటిసారి వచ్చిందోగానీ, ఆ మాట  రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, ప్రజల విషయంలో ఎలా వున్నా ఉద్యోగుల విషయంలో మాత్రం బాగా వర్కవుట్ అవుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు విడిపోయిన తర్వాత భలే కలసి వుంటున్నారు. ఎన్నటికీ కలవటం అసాధ్యం అనుకున్నవాళ్ళే ఇప్పుడు కలసి మెలసి వుంటున్నారు. ఇంతకీ రెండు రాష్ట్రాల ఉద్యోగులు కలసి మెలసి వుంటోంది ఏ విషయంలో అనుకుంటున్నారు... సమ్మెలు చేసే విషయంలో,  ప్రభుత్వాల ముందు డిమాండ్లు పెట్టి వాటిని సాధించుకునే విషయంలో. రెండు రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలో ఏ విభాగం ఉద్యోగులైనా ఒక డిమాండ్ పెట్టారంటే, రెండో రాష్ట్రంలోని అదే విభాగం ఉద్యోగులు సేమ్ డిమాండ్ తమ ప్రభుత్వం ముందు వుంచుతున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఏదైనా ఉపయోగపడే పనిచేస్తే, రెండో రాష్ట్రంలోని ఉద్యోగులు తమకు కూడా ఆ ప్రయోజనం కలిగించాల్సిందేనని తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా వున్న తెలంగాణ ప్రభుత్వం మొన్నామధ్య ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తే, ఆర్థికంగా ఆరిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు  తమకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. లేటెస్ట్‌గా ఆర్టీసీ సమ్మె కూడా కలసి మెలసి  చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ఉద్యోగులు ఏ డిమాండ్ అయినా కలసికట్టుగా చేస్తున్నారు. మరి  రెండు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగుల మధ్య బాగా బలపడిన ఈ ‘ఐకమత్యం’ రెండు రాష్ట్రాలను ఎక్కడకి తీసుకెళ్తుందో చూడాలి.

వాళ్ళందరి నోళ్ళు కేసీఆరే మూయించాలి

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఏం మాట్లాడినా దాన్ని కామెడీగా చూడటం, కామెంట్లు చేయడం చాలామందికి అలవాటైపోయింది. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు, ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒకపక్క కేసీఆర్ బంగారు తెలంగాణను సాధించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దీనికి అర్థం చేసుకోలేని చాలామంది ఆయన మాట్లాడిన మాటలకు పెడర్థాలు తీస్తూ ఆనందిస్తున్నారు. అలాంటి వారినోళ్ళు మూయించాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. ఆమధ్య కేసీఆర్ ఒక్క ఎకరం భూమిలో వ్యవసాయం చేసి కోటి రూపాయలు సంపాదించవచ్చని తన ఫామ్ హౌస్ సాక్షిగా చెప్పినా నమ్మకుండా ఎటకారంగా, ఏళాకోళంగా కామెంట్లు చేశారు. ఈ వేసవిలో హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయిస్తానని అంటే అది అయ్యేపని కాదని అన్నారు. సచివాలయాన్ని మారుస్తానంటే అర్థంలేని పని అన్నారు. అసలు ఇలాంటివాళ్ళ ఉద్దేశమేంటి? కేసీఆర్ ఏం మాట్లాడినా దాంట్లోంచి పెడర్థాలు తీయడమేనా? లేటెస్ట్‌గా కేసీఆర్ తాను 70 వేల నుంచి 80 వేల పుస్తకాలు చదివానని చెప్పగానే ఈ విమర్శకులు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కేసీఆర్ చెప్పిన ఈ మాటను పట్టుకుని ప్రతిపక్ష నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. పుట్టిన దగ్గర్నుంచి రోజుకో పుస్తకం చదివినా అన్ని పుస్తకాలు చదవడానికి వీలు కాదని అంటున్నారు. కేసీఆర్ చెప్పిన వందలాది అబద్ధాలలో మరో అబద్ధం చేరిందని విమర్శిస్తున్నారు. ఇలా విమర్శించడం అన్యాయం, దారుణం, ఘోరం. కేసీఆర్ని విమర్శించేవారు 70 నుంచి 80 వేల పుస్తకాలు చదవలేరేమోగానీ, కేసీఆర్ చదవగలరు. ఆయనకు ఆ శక్తి వుంది. ‘రోబో’ సినిమాలో రజనీకాంత్‌లా చదివే శక్తి ఆయనకు వుందేమో. ఆయన్ని విమర్శించేవాళ్ళకు ఈ విషయం తెలియకపోవచ్చు కదా. కేసీఆర్ నిజంగానే 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివే వుంటారు. నో డౌట్ ఎందుకంటే, ఆయన ప్రదర్శించే అపారమైన జ్ఞానం, చక్కని మాటతీరు, సంస్కారబద్ధంగా వుండే ప్రవర్తన, ఇతరులను గౌరవించే తీరు... ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి వుంటాయనుకుంటున్నారు? ఆయన చదివిన 70 నుంచి 80 వేల పుస్తకాల నుంచే వచ్చి వుంటాయి. అంచేత, కేసీఆర్ని విమర్శిస్తు్న్నవాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు  తెలుసుకోవాలి. కేసీఆర్ శక్తిని తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. కేసీఆర్ గారూ, మీరు విమర్శకులను ఎంతమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకిప్పుడు 65 సంవత్సరాలు. మీరు నిండు నూరేళ్ళు బతుకుతారు. బ్యాలన్స్ వున్న ఈ 35 ఏళ్ళలో మిగిలిన ఆ 20 నుంచి 30 వేల పుస్తకాలు కూడా చదివేసి, మొత్తం లక్ష పుస్తకాలు చదివిన ఘనతని సొంతం చేసుకోండి. విమర్శకుల నోళ్ళు మూయించండి.