సల్మాన్ ఖాన్ కోరుండి ఆ తప్పు చేయలేదు: చిరంజీవి

  ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ని ‘హిట్-అండ్-రన్’ కేసులో ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించి, ఐదేళ్ళు జైలు శిక్ష విధించడంపై బాలీవుడ్ లో చాలా మంది విచారం వ్యక్తం చేసారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి అందరి కంటే ముందుగా కాంగ్రెస్ యంపీ చిరంజీవి స్పందించారు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ కి జైలు శిక్ష పడటం తనకు చాలా విచారం కలిగిస్తోందని అన్నారు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదానికి, ఉద్దేశ పూర్వకంగా చేసిన దానికి తేడా చూడాలని ఆయన అన్నారు. సెషన్స్ కోర్టులో శిక్ష పడినప్పటికీ హైకోర్టులో అప్పులు చేసుకొని బెయిలు పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.   సాటి నటుడిగా చిరంజీవి ఆవిధంగా మాట్లాడటం సహజమే అయినా కోర్టు దోషిగా నిర్ధారించిన సల్మాన్ ఖాన్ నేరం చేయలేదన్నట్లు మాట్లాడటం చాలా పొరపాటేనని చెప్పక తప్పదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తప్పత్రాగి కారు నడిపినప్పుడు అది అదుపు తప్పి ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తుల మీద నుండి వెళ్ళడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆయన కారు ఆపకుండా వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టుకి రప్పించినప్పుడు కూడా తను నిర్దోషినని వాదించారు. తనకున్న అర్ధబలంతో గత 13ఏళ్లుగా కేసును సాగదీసుకొంటూ ఇంతకాలం శిక్ష పడకుండా తప్పించుకొన్నారు. అంతే కాదు ఆయన చివరికి కోర్టును కూడా త్రప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తన కారును తన డ్రైవరు నడుపుతున్నాడని బుకాయించే ప్రయత్నం చేసారు.   అంటే మొదట ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకొందామని ప్రయత్నించిన సల్మాన్ ఖాన్ అది సాధ్యం కాకపోవడంతో ఆ ప్రమాదం తన కారు వలననే జరిగిందని అంగీకరించినట్లయింది. కోర్టును త్రప్పు ద్రోవ పట్టించే ప్రయత్నంలో సల్మాన్ ఖాన్ అన్యాయంగా తన డ్రైవరును తన కేసులో ఇరికించే ప్రయత్నం కూడా చేసి మరో నేరానికి పాల్పడ్డారు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో అతనే తప్ప త్రాగి కారు నడుపుతూ ఒకరి మరణానికీ, నలుగురు గాయపడటానికి కారకుడయ్యాడని కోర్టు ద్రువీకరించినప్పుడు, తను చేసిన సమాజసేవలను దృష్టిలో పెట్టుకొని శిక్షను తగ్గించమని కోరడం గమనిస్తే ‘దొరికితే దొంగలు దొరకకపోతే దొరలూ’ అన్నట్లు ఇంతకాలం ఆయన వ్యవహరించినట్లు అర్ధమవుతోంది.   ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఈ ప్రమాదం చేసి ఉండకపోవచ్చును. కానీ ఆ తరువాత శిక్షను తప్పించు కోవడానికిగాను వరుసగా తప్పు మీద తప్పు చేసుకొంటూ వెళ్ళారు తప్ప ఏనాడు నిజాయితీగా కోర్టులో తన నేరాన్ని అంగీకరించలేదు. కనుక ఏనాడూ తనను క్షమించి విడిచిపెట్టమని ఆయన కోర్టుని ప్రాదేయపడలేదు. కానీ ఇప్పుడు కోర్టు శిక్ష ఖరారు చేయబోతుంటే ఆయన తను చేసిన తప్పుకి క్షమించమని అడుగుతున్నారు అటువంటి వ్యక్తిని చిరంజీవి వెనకేసుకు వస్తున్నారు. ఆ ప్రమాదం తరువాత సల్మాన్ ఖాన్ అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేసి ఉండవచ్చును. కానీ అంతమాత్రాన్న ఆయన చేసిన ఈ నేరం నేరం కాకుండాపోదు. ఒకవేళ అటువంటి సమాజాసేవా కార్యక్రమాలు చేసినందుకు దోషులకు కోర్టులు శిక్షలు వేయకుండా వదిలిపెట్టడం మొదలుపెట్టినట్లయితే చాలా మంది అటువంటి మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులతో మంచి స్నేహసంబందాలున్నవారు వారిని అభిమానించేవారు సానుభూతి వ్యక్తం చేయడంలో అసహజమేమీ లేదు. కానీ వారిని వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో కోర్టు తీర్పును తప్పుపట్టినట్లు మాట్లాడటమే పెద్ద తప్పు. రాజకీయాలలో ఉన్న చిరంజీవికి ఈ విషయం తెలిసే ఉంటుందని అందరూ అనుకొన్నారు. కానీ...

ఇంతకీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడో? ప్రశ్నిస్తున్న వైకాపా

  ప్రశ్నించడానికే తను పుట్టుకొచ్చానని చెప్పుకొన్న పెద్దమనిషి పత్తా లేకుండా పోవడంతో ఆలోటును వైకాపా భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఎప్పుడు జరుపుకోవాలని మంచి ప్రశ్నే వేసింది. ఎందుకంటే ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జూన్ 2ని నవ నిర్మాణ దినంగా పాటించాలని ఆరోజు నుండి వారం రోజులపాటు నవ నిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి ప్రజలను పునరంకితం అయ్యేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించింది. జూన్ 2న నవ నిర్మాణ దినంగా పాటించడం ద్వారా రాష్ట్ర విభజన జరిగిన తీరు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచించింది...తదనంతర సమస్యలు, సవాళ్లు, పరిణామాలను అన్నిటినీ ప్రజలు సదా గుర్తుకు చేసుకొంటూ రాష్ట్రాభివృద్ధికి కసిగా పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే జూన్ 2న నవ నిర్మాణ దినంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సార్లు అన్నారు.   జూన్ 2న నవ నిర్మాణ దినంగా పాటించే మాటయితే మరి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడు నిర్వహించుకోవాలని వైకాపా ప్రశ్నిస్తోంది. లేకపోతే ఆంద్రప్రదేశ్ అవతరణ దినానికే తెదేపా ప్రభుత్వం నవ నిర్మాణ దినమనే కొత్త పేరు పెట్టిందా? అని ప్రశ్నిస్తోంది.   క్రిందటి ఏడాది జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన జూన్ 2నే రాష్ట్ర అవతరణ దినంగా పాటిద్దామని చేసిన ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండటం చేత సాధారణంగా ప్రతీ ఏట నవంబర్ ఒకటిన జరుపుకొనే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం వేడుకలను జరుపుకోలేదు. తెదేపా జూన్ 9న రాష్ట్రంలో అధికారం చేప్పట్టడం చేత, రాష్ట్ర విభజన తరువాత వచ్చిన మొట్టమొదటి రాష్ట్ర అవతరణ దినం జూన్ 2న ఎటువంటి వేడుకలు జరుగలేదు. కనుక ఈసారి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న అట్టహాసంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని ప్రజలు భావించడం చాలా సహజం. కానీ ఆరోజును నవ నిర్మాణ దినంగా జరుపుకొంటూ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించుకొందామని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుందా లేదా? రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో ఆరోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలా వద్దా? అని వైకాపా ధర్మసందేహం వ్యక్తం చేసింది.

క్లాసు తీసుకునే వరకూ మారరా?

తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సరిగా పనిచేయని వారికి క్లాసు తీసుకున్నారని, నవ్వుతూనే హెచ్చరించారని వచ్చిన వార్తలు చూసి నవ్వుకోని వారు వుండరు. ఎందుకంటే, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తూ, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయనతోపాటు ఉత్సాహంగా పనిచేయాలి. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ ఇంకా నేర్చుకునే స్థితిలోనే, ముఖ్యమంత్రి చేత వార్నింగులు ఇప్పించుకునే స్థితిలోనే ఏపీ మంత్రులు వున్నారంటే వారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ ఎన్నోసార్లు పలువురు మంత్రుల్ని పని సరిగా చేయడం లేదంటూ హెచ్చరించారు. తాజాగా నవ్వుతూనే క్లాస్ తీసుకున్నారు. మంత్రులందరూ బాగానే చదువుతున్నారు. కానీ ఎంత బాగా చదివినా చివరకు పరీక్షల్లో పాసవ్వాలి. పాసవ్వకుండా ఎంత చదివినా ఏం లాభం అని ముఖ్యమంత్రి మంత్రులతో అన్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ముఖ్యమంత్రి ఇంత మాట అనేంత వరకూ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడితో సమానంగా పనిచేసే మంత్రులు ఏపీ మంత్రివర్గంలో  లేరు అని చెప్పుకోవడానికి ఎంతమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. నష్టాల్లో వున్న రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిలో యాభై శాతం కృషి చేయగలిగినా ముఖ్యమంత్రిగా చేదోడుగా వున్నట్టు వుంటుంది. శ్రమించడానికి ఎవర్నో ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికంటే పెద్ద ఉదాహరణగా ముఖ్యమంత్రి చంద్రబాబే కనిపిస్తున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పనిచేస్తూ కూడా ఆయన్ని ఫాలో అవకుండా వున్న మంత్రులను ఏమనాలి? మంత్రివర్గం ఏర్పాటులో వివిధ సమీకరణాల కారణంగా కొంతమంది ప్యాసింజర్ రైళ్ళకు కూడా మంత్రి పదవులు దక్కాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాంటి ముఖ్యమంత్రి పనితీరును వీళ్ళు అందుకోలేకపోతున్నారు. వారికి ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా వేగాన్ని పెంచుకోలేకపోతున్నారు. అలాంటి మంత్రుల తీరు ఇలాగే కొనసాగితే ఆ ప్యాసింజర్ రైళ్ళను చంద్రబాబు పట్టాలు తప్పించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సరైన పనితీరు ప్రదర్శించని మంత్రులు తమ వర్కింగ్ స్టైల్‌ని మెరుగు పరుచుకుని ముఖ్యమంత్రికి తగ్గ మంత్రులుగా ప్రశంసలు పొందితే అందరికీ ఆనందమే.

ఏపీలో బీజేపీకి దూకుడు అవసరమా?

భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పుణ్యమా అని రాకరాక కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పుణ్యమా అని ఆంధ్రపదేశ్‌లో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకుంది. అయితే అన్నప్రాశన రోజునే ఆవకాయ తినేయాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేయాలని కలలు కంటున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికారం కోసం ఇప్పటి నుంచే విత్తనాలు వేస్తున్నారు. ఏపీకి చెందిన కొంతమంది బీజేపీ నాయకులు అప్పుడప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్లు, ఏపీలో రాజకీయ నిరుద్యోగంలో వున్న అనేకమందిని పార్టీలో చేర్చుకోవడం దీనినే సూచిస్తున్నాయి. అవసరమైతే వైసీపీతో దోస్తీ చేయాలని కూడా కొంతమంది బీజేపీ నాయకుల బుర్రలో ఆలోచనలు పుడుతున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయాలను ప్రదర్శించడం మొదలుపెడితే 2019 ఎన్నికల నాటికి ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకోవచ్చన్నది అలాంటి నాయకుల ఆలోచన. అయితే ఏపీలో ఇంత దూకుడుగా వ్యవహరించడం బీజేపీకి అవసరమా అని ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సి వుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపం బీజేపీ ఖాతాలో కూడా వుంది. అయితే, తెలుగుదేశం పార్టీతో స్నేహం చేసిన పుణ్యమా అని ఏపీ ప్రజలు బీజేపీని క్షమించారు. కొన్ని స్థానాల్లో గెలిపించారు. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేలా చేశారు. అయితే ఇదంగా తన బలం కాదయా... టీడీపీతో స్నేహం వల్ల వచ్చిన బలమేనయా అనే విషయాన్ని మాత్రం కొంతమంది బీజేపీ నాయకులు మరచిపోయి వ్యవహరిస్తున్నారు. బీజేపీ మీద మొన్నటి వరకూ ఏపీలో కొంత సానుకూల అభిప్రాయమే వుండేది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మాట తప్పడం, ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళని శత్రువులను చూసినట్టుగా చూడటం, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన పాపానికి బీజేపీలోనే వున్న నటుడు శివాజీ గురించి చులకనగా మాట్లాడ్డం... ఇవన్నీ ప్రజలు గమనిస్తు్న్నారు. ఇవే కాకుండా ఏరకంగా చూసినా ఏపీలో బీజేపీ ప్రధాన పార్టీగా నిలబడే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అంచేత బీజేపీ నాయకులు 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చే పగటి కలలను కనడం, దానికోసం రాజకీయాలు ప్రదర్శించడం మానుకుని తెలుగుదేశం ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా వుంటూ అభివృద్ధిలో భాగస్వామిగా కొనసాగితే అందరికీ మంచిది.

లక్కు అంటే కేసీఆర్ సార్‌దే!

నిజంగా లక్కు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారిదే. చకచకా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసేశారు... అలా సోనియా గాంధీ చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టేసి ఇలా తెలంగాణ సాధించేశారు. ఎలక్షన్లలో మాంఛి మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఎన్నికల ముందు తాను ఇచ్చిన వాగ్దానాలకు భంగం కలిగినా వాటి గురించి ప్రశ్నించిన వాళ్ళను విజయవంతంగా నోళ్ళు మూయించగలుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీడియాతో సహా ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇలాంటి గొప్ప అవకాశం గతంలో ఏ ముఖ్యమంత్రికైనా వచ్చిందా... కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మాత్రమే దక్కింది. అందుకే లక్కు అంటే కేసీఆర్‌దేనని చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా అనేక విషయాలలో ఆయనకు లక్కు లక్కలా అతుక్కుపోయింది. అలాంటి  రెండు విషయాలను ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేసీఆర్ మదిలోకి ప్రవేశించిన రెండు విషయాలు... అసాధ్యమైనా అమలు చేయాలని అనిపించిన అనేక విషయాల్లో రెండు ముఖ్యమైన విషయాలు... ఒకటి హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి మంచినీటి సరస్సుగా మార్చడం. రెండోది సచివాలయాన్ని ఉన్నచోట నుంచి తరలించి ఎర్రగడ్డకి తరలించడం. ఈ రెండు విషయాలనూ ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎంత వ్యతిరేకించినా కేసీఆర్ ఎంతమాత్రం వెనకడుగు వేయలేదు. ఒక దశలో ఈ రెండు పనులనూ చేసి తీరతానని ఆయన మొండి పట్టుదలతో వ్యవహరించారు. ఆ పట్టుదల ఎంతవరకూ వెళ్ళిందంటే, ఈ రెండు అంశాలూ అసాధ్యాలని ఆయనకే అర్థమైపోయినా వెనకడుగు వేయలేనంత పట్టుదలను ప్రదర్శించారు. అయితే, ఈ రెండు విషయాల్లో ఆయన వెనకడుగు వేసినట్టు కాకుండా, చట్టం ఒప్పుకోలేదు అందుకే ఈ రెండు పనులనూ చేయలేకపోయానని ఆయన చెప్పుకోవడానికి వీలుగా ఆయనకు గోల్డెన్ ఛాన్స్‌లు వచ్చాయి. ఎర్రగడ్డలో సచివాలయాన్ని నిర్మించడానికి పౌర విమాన యాన శాఖ అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. అందువల్ల సికింద్రాబాద్‌లో మిలటరీ ఆధ్వర్యంలో వున్న జింఖానా, పరేడ్ మైదానాల్లోకి సచివాలయాన్ని తరలించాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కేసీఆర్ ఆలోచనలకు మిలటరీవాళ్ళు ఎలాగూ ఒప్పుకోరు. కాబట్టి సచివాలయాన్ని తాను అనుకున్నట్టుగా తరలించలేకపోయానని కేసీఆర్ చెప్పుకోవచ్చు. అలాగే హుస్సేన్ సాగర్ ఖాళీ చేసే పనులు మొన్నీమధ్యే ప్రారంభమయ్యాయి. ఈ ఎండాకాలం లోపు హుస్సేన్ సాగర్ ఖాళీ చేయడం అనేది దేవుడు దిగి వచ్చినా అయ్యే పని కాదు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయించలేకపోయాడనే విమర్శలు రాకుండా ఆయన్ని చట్టం కాపాడుతోంది. చెన్నైలోని సదరన్ గ్రీన్ ట్రిబ్యూనల్ హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయడం తక్షణం ఆపేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ తమకు అడ్డు పడిందని కేసీఆర్ తప్పించుకోవచ్చు. లక్కు అంటే ఇలా వుండాలి.

బాబూ రాహుల్... జర భద్రం

రాహుల్ గాంధీ ఈమధ్య భారీ స్థాయిలో రిస్కులు చేస్తున్నారు. తాను జనాల్లో కలిసిపోయే నాయకుడిని అని నిరూపించుకోవడానికి ఆయన పదే పదే ప్రయత్నిస్తున్నారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ఏ విధంగా సెక్యూరిటీ నిబంధనలను అధిగమించి జనాల్లోకి వెళ్ళేవారో అందరూ చూశారు. చివరికి ఆ జనాల్లో కలసిపోయే తత్వం శ్రీ పెరంబదూరులో ఎలా వికటించిందో కూడా అందరూ చూశారు. అయితే తన తండ్రి అనుభావాల నుంచి పాఠాలను నేర్చుకోని రాహుల్ గాంధీ తన తండ్రిలాగానే జనాల్లో కలసిపోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ జరిగితే సడెన్‌గా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. యుపీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఓసారి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌కి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చి బిర్యానీ తిని వెళ్ళారు. అది ఆయనకు బాగానే వుండొచ్చుగానీ, ఆయన సెక్యూరిటీ బాధ్యతలు చూసేవారికి మాత్రం చెమటలు పడుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత మొన్నీమధ్యే ఎవరికీ చెప్పాపెట్టకుండా, ఎక్కడకి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా నెలలకు నెలలు గాయబ్ అయిపోయారు. ఇప్పుడు చేస్తున్న పాదయాత్రల సంగతి సరేసరి. ఇలాంటి రిస్కులు చేయడం అలవాటు అయిపోయిన ఆయన ఇప్పుడు మరో రిస్కు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రిస్కు... ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో సమావేశం కావడం. రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో చచ్చిపోయింది. తెలంగాణలో చిక్కి శల్యమై చావడానికి సిద్ధంగా వుంది. అలాంటి పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారట. ఈ సందర్భంగా మా యూనివర్సిటీకి కూడా రండి సర్ అని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఆహ్వానించారట. అంచేత ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యార్థులను కలిసే ఆలోచనలో వున్నారట. అయితే,  ఉస్మానియాలో చాలా విద్యార్థి సంఘాలు వున్నాయి. కొన్ని సంఘాలు పిలిచాయని వెళ్తే, మిగతా సంఘాలు ఏమంటాయో ఊహించడం చాలా కష్టం. ప్రస్తుతం ఉస్మానియా విద్యార్థులు ఉద్యోగాలు దొరకవన్న నిస్పృహలో వున్నారు. అసలే విద్యార్థులు సున్నిత హృదయం వున్నవారు. రాహుల్ గాంధీ వచ్చి నాలుగు మంచి మాటలు చెబితే చప్పట్లు కొట్టే స్థితిలో ఎంతమాత్రం లేరు. వారివి కల్లాకపటం ఎరుగని మనసులు కాబట్టి ఎలాగైనా రియాక్ట్ అవుతారు. గతంలో అనేకమంది ప్రముఖ నాయకులకు వాళ్ళు దేహశుద్ధి చేస్తే, దేహశుద్ది చేయించుకున్నవాళ్ళు కూడా ఉస్మానియా విద్యార్థుల ఆవేదనను సానుభూతితో అర్థం చేసుకోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నటి వరకూ వారి దృష్టిలో ఒక హీరో. అలాంటి హీరోనే ఇంతవరకు ఉస్మానియా  క్యాంపస్‌లోకి వెళ్ళే సాహసం చేయలేదు. మరి ఆ సాహసం రాహుల్ గాంధీకి ఎందుకట?

ఆకాష్ అదరహో

భారత శాస్త్రవేత్తలు రూపొందించిన సరికొత్త క్షిపణి ‘ఆకాష్’. ఆకాష్... పేరు మూడు అక్షరాలు. పేరుకు తగ్గట్టు శత్రు దేశాల వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించగల సత్తా వున్న అస్త్రం. శత్రుదేశాలకు చెందిన విమానాల అతి సూక్ష్మమైన లక్ష్యాలను ఛేదించగలదు. 25 కిలోమీటర్ల దూరంలో వున్న లక్ష్యాన్ని 35 క్షణాల్లో పేల్చేయగలదు. ఒకేసారి నాలుగు లక్ష్యాల మీద ఎనిమిది క్షిపణులను ప్రయోగించవచ్చు. లాంచింగ్ ప్యాడ్ ద్వారా ప్రయోగించడానికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించడానికి అనువుగా వుంటే క్షిపణి.  రాడార్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఇన్ని ప్లస్ పాయింట్లు వున్న క్షిపణి మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలకు కూడా లేదు. అంటే ఇప్పుడు మన అమ్ములపొదిలో ఆకాష్ చేరింది కాబట్టి ఈ రెండు దేశాలు అదిరిపోవడం ఖాయం. అయితే మన దేశం ఆత్మ రక్షణ కోసం మాత్రమే ఈ క్షిపణిని తయారు చేసింది కాబట్టి ఆ దేశాలు భయపడాల్సిన అవసరం లేదు.. మనతో జాగ్రత్తగా వుంటే చాలు. ‘ఆకాష్’ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆయుధం. 600 కోట్ల వ్యయంతో, 18 ఏళ్ళ పరిశోధనతో ఈ ఆయుధం రూపకల్పన జరిగింది. దేశంలోని దాదాపు రెండు వందల సంస్థలు ఈ క్షిపణుల తయారీలో భాగస్వాములు అయ్యాయి. దాదాపు 5,500 మంది శాస్త్రవేత్తలు ఆకాష్ క్షిపణిని తయారు చేయడానికి శ్రమించారు. ఇప్పటికి ఎన్నోసార్లు ఈ క్షిపణిని పరీక్షించారు. అన్నిసార్లూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆకాష్ ఛేదించగలిగింది. మంగళవారం నాడు ఈ క్షిపణిని ఆర్మీకి అందజేసింది. ఆకాష్ లాంటి క్షిపణి మన ఆర్మీ చేతికి చేరింది. ఇక మనం ఎప్పటిలాగే గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు.

లోక్ సభలో అల్లరి చేస్తే హైకోర్టు విభజన జరుగుతుందా?

  ఉమ్మడి హైకోర్టును విభజనకు కేంద్రమే చొరవ చూపి తక్షణమే విభజించాలని లోక్ సభలో తెరాస యంపీలు ఈరోజు గట్టిగా వాదించారు. నినాదాలతో సభను హోరెత్తించారు. అంతకు ముందు పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద బైటాయించి నిరసన ప్రదర్శన కూడా చేసారు. అయితే వారందరికీ కూడా కేంద్రం కూడా హైకోర్టు విభజనకు సుముఖంగానే ఉందని కానీ హైకోర్టులో దాఖలయిన ఒక పిటిషన్ కారణంగానే ఆలస్యం అవుతోందని తెలుసు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ కూడా వారికి అదే విషయం చెప్పి హైకోర్టు విభజనకు మరికొంత సమయం పడుతుందని చెప్పినప్పటికీ వారు తమ ఆందోళనను విరమించలేదు.   ఇంతకు ముందు హైకోర్టు విభజనపై దాఖలయిన ఒక పిటిషనుపై విచారణ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఉమ్మడి హైకోర్టుని విభజించి తెలంగాణా రాష్ట్ర హైకోర్టుని వేరేచోటికి తరలించాలంటే విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం కుండబ్రద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. కొద్ది రోజుల క్రితమే ఆ పిటిషనుపై హైకోర్టు ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. అందులో రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే హైకోర్టు ఏర్పాటు చేయవలసి ఉంటుంది తప్ప తెలంగాణా రాష్ట్రానికి కాదణి విస్పష్టంగా పేర్కొనబడి ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతున్నప్పటికీ అది తెలంగాణకే చెందుతుంది. కనుక హైదరాబాద్ లో వేరేచోట తెలంగాణా హైకోర్టుని తరలించడం లేదా తెలంగాణా గడ్డ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయడం రెండూ కూడా విభజన చట్ట ప్రకారం వీలుపడదు. కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు భవనాలు నిర్మించుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడికి తరలించేవరకు కూడా ఉమ్మడి హైకోర్టు కొనసాగవలసిందేనని,” స్పష్టంగా పేర్కొంది.   కనుక ఒకవేళ తెరాస యంపీలకు నిజంగా హైకోర్టు విభజన జరగాలని కోరుకొంటున్నట్లయితే వారు ముందుగా విభజన చట్ట సవరణకు పట్టుబట్టాలి. కానీ వారు ఆపని చేయకుండా సభలో రాద్ధాంతం చేస్తున్నారు.మరి కొద్ది రోజులలో పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతాయి. కనుక ఈలోగానే వారు చట్ట సవరణకు కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుంది.

టీడీపీ: త్యాగాలకు సరైన గుర్తింపు లభించాలి

త్వరలో హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ పదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తున్న సందర్భంగా జరిగే ఈ మహానాడును చాలా కీలకమైన మహానాడుగా భావించాల్సి వుంటుంది. ఈ మహానాడు జరిగేలోపలే ఇప్పటి వరకు పెండింగ్‌లో వున్న నామినేషన్ పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయాలని తెలుగుదేశం నాయకత్వం భావిస్తూ వుండటం తెలుగుదేశం నాయకులలో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. పదేళ్ళుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ జెండాను భుజాన మోయడంతోపాటు ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు, నాయకులకు మహానాడు లోపు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోలెడన్ని నామినేషన్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని తెలుగుదేశం క్యాడర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి నియామకం ఈ పోస్టుల భర్తీకి శుభారంభం అని కేడర్ భావిస్తోంది. అలాగే రాష్ట్రంలోని అనేక దేవాలయాలకు ఛైర్మన్లు, పాలక మండలి సభ్యులను త్వరలో నియమించబోతున్నారు. రాష్ట్రంలోని 109 మార్కెట్ కమిటీల్లో ఇప్పటి వరకు 51 కమిటీలకు మాత్రమే నియామకాలు జరిగాయి. మిగతా కమిటీలకు కూడా నియామకాలు పూర్తి చేయనున్నారు. పార్టీ కార్యక్రమాల కమిటీలు, గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు, అనేక కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయబోతున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకులు ఎంతోమంది వున్నారు. వారు పార్టీకోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాలకు సరైన గుర్తింపు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా లభించాలని వారు కోరుకుంటున్నారు. గత ఎన్నికలలో పలు నియోజకవర్గాల్లో గెలిచే సామర్థ్యం, స్థానికంగా ప్రజాబలం ఉన్న కొంతమంది నాయకులు పార్టీ నుంచి టిక్కెట్ ఆశించారు. అయితే వివిధ రాజకీయ సమీకరణాల కారణంగా వాళ్ళు పోటీ నుంచి తప్పుకుని, పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసం చిత్తశుద్ధిగా కృషి చేశారు. ఆ సమయంలో వారు చేసిన త్యాగం కారణంగానే పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు గెలవగలిగారు. ఆ నాయకులు చేసిన త్యాగాలే పదేళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికి సరైన ప్రాధాన్యం, సముచిత స్థానం ఇవ్వాలన్న అభిప్రాయాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం శ్రమించిన వారికి సరైన గౌరవం ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీకి మరింత మంచి పేరు తెస్తారని కార్యకర్తలు అంటున్నారు. అయితే, ఇప్పటి వరకు పార్టీ కొన్ని పదవుల కోసం కొంతమందిని ఎంపిక చేసిన తీరు విషయంలో కార్యకర్తలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీటీడీ బోర్డు ఛైర్మన్ పోస్టును తెలంగాణకు చెందిన దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఇస్తే బావుండేదని భావిస్తున్నారు. దళితులకు దేవాలయ ప్రవేశం అనేది ఇప్పటికీ కొన్నిచోట్ల దురాచారంగా అమల్లో వుంది. అలాంటి పరిస్థితుల్లో దేశంలోనే ప్రముఖ దేవాలయం బోర్డు ఛైర్మన్‌గా ఒక దళితుడిని నియమిస్తే దాని ప్రభావం ఈ సమాజం మీద ఎంతో వుండేదని, దళితులకు ఒక మనోధైర్యం ఇచ్చినట్టు వుండేదన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. అలాగే పార్టీకి ఎలాంటి సంబంధం లేని పరకాల ప్రభాకర్‌ని పార్టీ మీడియా సలహాదారుడిగా నియమించడం, ఎన్నారై కూచిభొట్ల ఆనంద్‌ని కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడిగా ఎంపిక చేయడం, వేరే పార్టీ నుంచి వచ్చిన తిప్పేస్వామిని ఎమ్మెల్సీ చేయడం, గుడివాడలో పార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోయిన పిన్నమనేని వెంకటేశ్వరరావుకు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం... ఇలాంటి వాటిని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా దొర్లిన ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా పార్టీకోసం శ్రమించిన వారికి న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుకుంటున్నారు.

వైసీపీ కష్టాలు ఇన్నిన్ని కావయా...

జగన్ గారి వైసీపీ అసలే కష్టాల కడలిలో కొట్టుకుపోతోంది. పార్టీ నాయకుడు జగన్ ఎప్పుడు అరెస్టు అవుతాడో అనే భయం అందరి గుండెల్ని గుబగుబలాడిస్తోంది. దీనికితోడు జగన్ గారి ఆస్తులన్నీ వరుసగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఇరుక్కుపోతున్నాయి. అలాగే పార్టీ ఎమ్మెల్యేలలో చాలామంది ఎప్పుడెప్పుడు వైసీపీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నామధ్య జగన్ ప్రాజెక్టుల యాత్ర చేసిన సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు జగన్‌కి జలక్ ఇవ్వబోయారు. చివరికి జగన్ వాళ్ళని గడ్డం పట్టుకుని బతిమాలడంతో శాంతించారు. అయితే పేలడానికి సిద్ధంగా వున్న అగ్నిపర్వతం తాత్కాలికంగా శాంతించినా, ఏదో ఒకరోజు భళ్ళున బద్దలవక మానదు. ఈ 40 మంది ఎమ్మెల్యేల విషయంలో జగన్‌కి ఆ భయం తప్పదు. ఈ కష్టాలు చాలవన్నట్టుగా వైసీపీకి మరో కొత్త కష్టం వచ్చిపడింది... అది.. ఎర్రచందనం దొంగలతో వైసీపీ ఎమ్మెల్యేలకు లింకులు వున్నట్టు ఆధారాలు లభించడమే. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్‌వలీ కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనగారు లేటెస్ట్‌గా పోలీసులకు దొరికిపోయారు. ఒక సినిమా కూడా తీసిన అతగాడు ఆ సినిమా హీరోయిన్‌ని మూడోపెళ్ళి చేసుకున్నాడు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో మస్తాన్ వలీ పాత్ర మాత్రమే కాకుండా స్థానికంగా వుండే ఛోటామోటా వైసీపీ నాయకుల హస్తం కూడా వున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎర్రచందనం బిగ్‌బాస్ గంగిరెడ్డికి, వైసీపీకి వున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఇలా వుంటే, మస్తాన్ వలీ మూడో భార్య, హీరోయిన్ నీతూ అగర్వాల్ పోలీసులకు దొరికిపోయే ముందు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిందని, ఆమె పోలీసులకు లొంగిపోతానని అంటే వైసీపీ ఎమ్మెల్యేలు వద్దని వారించారని వచ్చిన వార్తలు పార్టీ గుండెలో రాయి పడేలా చేశాయి. అయితే పోలీసు వర్గాలు మాత్రం అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టలేదు. పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం సదరు ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. మరి వైసీపీ నాయకత్వం ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

టీ సర్కారు మెడలో ‘ఒప్పంద’ పాము

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరికోరి మెడలో వేసుకున్న ‘ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ’ పాము ఇప్పుడు ఆయనకే పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన అనేక హామీలు, వాగ్దానాల్లో ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ కూడా ఒకటి. తెలంగాణ ఏర్పడటం ఆలస్యం రాష్ట్రంలో వున్న ఒప్పంద కార్మికులందర్నీ క్రమబద్ధీకరించేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. దాంతో ఒప్పంద ఉద్యోగులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బోలెడన్ని ఉద్యోగాలు ఖాళీ అయిపోతాయని, ఆంధ్రావాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు అందరి మీద బాగా పనిచేశాయి. ముఖ్యంగా అప్పటికే ఒప్పంద ఉద్యోగుల హోదాలో వున్నవాళ్ళ మీద బాగా పనిచేశాయి. ఖాళీ అయిన ఉద్యోగాల్లో తమనే తీసుకుంటారని వారు భావించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హామీ ఇచ్చినంత వేగంగా పని జరగలేదు. దీనికితోడు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఉద్యమం చేసింది తామయితే, తమకు ఉద్యోగాలు రాకుండా ఒప్పంద ఉద్యోగులు చేస్తున్నారంటూ విద్యార్థులు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకించారు. ఒకవైపు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు... మరోవైపు ఒప్పంద ఉద్యోగులు తమను క్రమబద్ధీకరించాల్సిందేనని పట్టుదలతో వున్నారు. దాంతో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం పరిస్థితి తయారైంది. దీనికితోడు తాజాగా విద్యుత్  శాఖలో వున్న వేలాది మంది ఒప్పంద ఉద్యోగులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని అంటూ ఆందోళన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వున్న వేలాది మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు... అలాగని ఇచ్చిన హామీ నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితీ లేదు. ఒకవేళ ఇచ్చిన మాట మీద నిలబడితే విద్యా్ర్థులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. దీనికితోడు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అధికారులు ఏమంటారో, ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుందో లేదో... మరి ముఖ్యమంత్రి గారు తన మెడకు చుట్టుకుని వున్న ఈ పామును చాకచక్యంగా వదిలించుకుంటారో... మరి ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.

రాహుల్‌గాంధీ నిర్ణయం కరెక్ట్!

భారత రాజకీయాలలో రాహుల్ గాంధీకి వున్న ‘విలువ’ ఏమిటో అందరికీ తెలిసిందే. గతించిన నాయకులను వదిలేస్తే, సోనియాగాంధీ ముద్దుల కొడుకు కావడం మినహా ఆయనకు వున్న ప్రత్యేకత ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో తలపండిన నాయకులెందరో వున్నారు. వారెవరితోనూ పోల్చగలిగే స్థాయి ఆయనకు లేదని అంటాను. తలపండిన నాయకుల సంగతి అలా వుంచితే, కాంగ్రెస్ పార్టీలోని సామాన్య కార్యకర్తకు వున్నంత రాజకీయ పరిజ్ఞానం కూడా రాహుల్ గాంధీకి లేదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుంటాయి. అలాంటి రాహుల్ గాంధీ అనేకసార్లు తన రాజకీయ అపరిపక్వతను నిరూపించుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఆయన్ని ప్రజల ముందు ఒక ‘మొద్దబ్బాయి’గా ప్రొజెక్ట్ చేసి సక్సెస్ అయింది. తన మీద ఇలాంటి ముద్ర వుందని తెలిసినప్పటికీ రాహుల్ గాంధీ దానిని తొలగించుకునే ప్రయత్నం చేయకపోగా, తన మాటలు, చేతలతో ఆ ‘ముద్ర’ మరింత బలపడేలా చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే ఆయన ఈమధ్య పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా ‘సెలవు’ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడకి వెళ్ళారో తెలియదు, ఎందుకు వెళ్ళారో తెలియదు. బహుశా ఆయన ఏ దేశంలోనో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి వుంటారని అందరూ భావించారు. ఇతర రాజకీయ పార్టీలన్నీ ‘రాహుల్ గాంధీ కనిపించడం లేదు’ అని కామెడీ చేసే పరిస్థితి వచ్చింది. యుపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టినెన్స్‌ని చించిపారేయడంతోపాటు అనేక విషయాలలో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇన్నాళ్ళ తర్వాత రాహుల్ గాంధీ ఒక కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. అదే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలనే నిర్ణయం. ఈ సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్ణయం చాలా సమంజసమైన నిర్ణయం. ఎందుకంటే, ఆయన చాలాకాలంపాటు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల ఆయన కాస్త లావై వుంటారు. ఇప్పుడు పాదయాత్రలు చేయడం వల్ల విశ్రాంతి తాలూకు ఫ్యాట్ మొత్తం కరిగిపోయే అవకాశం వుంటుంది. తద్వారా ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భారీ విశ్రాంతి తర్వాత బాగా వాకింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ అభినందనీయుడు.

శివాజీకి రాజకీయ పాఠాలు

సినీ నటుడు, బీజేపీ నాయకుడు (ఆయన బీజేపీ నాయకుడు కాదని బీజేపీ వాళ్ళు అంటున్నారు అది వేరే సంగతి) శివాజీ ఇప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చినవాళ్ళు కొంతకాలం ఏ పార్టీలో అయినా చేరి కార్యకర్తగా పనిచేస్తారు. దాదాపు అన్ని పార్టీలూ తమ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ ఇస్తూ వుంటాయి. ఇలా సొంత అనుభవాలు, పొందిన శిక్షణ, నేర్చుకున్న గుణపాఠాలతో ఎవరైనా రాజకీయ నాయకుడిగా రాటుతేలుతూ వుంటారు. అయితే నటుడు శివాజీకి రాజకీయాల్లో అనుభవం తక్కువ. నరసరావుపేట నుంచి టీవీ రంగానికి, టీవీ రంగం నుంచి సినిమా రంగానికి, ఆ తర్వాత సినిమాల నుంచి డైరెక్టుగా రాజకీయ రంగానికి వచ్చారాయన. దాంతో ఆయనకు రాజకీయాలంటే ఏమిటి, రాజకీయ నాయకులంటే ఎలా వుంటారు... ఎలా వుండాలి అనే అవగాహన సహజంగానే తక్కువ. అయితే ఆయన విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ‘రాజకీయాలు’ ఆయనకు రాజకీయ పాఠాల్లా ఉపయోగపడుతున్నాయి. రాటు తేలేలా చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికలలో శివాజీ బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు మంత్రిగా వున్న బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న రోజునే శివాజీ కూడా ఆయనతోపాటుగా బీజేపీలో చేరారట. ఆ విషయం శివాజీనే చెప్పారు. వీర్రాజు అనే బీజేపీ నాయకుడు అసలు శివాజీ బీజేపీకి చెందిన నాయకుడే కాదని అన్నప్పుడు శివాజీ ఈ వివరణ ఇచ్చారు. తాను బీజేపీ నాయకుడిని కాకపోతే, మంత్రిగా వున్న కామినేని శ్రీనివాస్ కూడా బీజేపీ నాయకుడు కాదని శివాజీ చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే, మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా శివాజీ ఏ పార్టీలో వున్నాడో తనకు తెలియదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రిణి పురందేశ్వరి కూడా శివాజీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. ఇలా బీజేపీలోని నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీలో శివాజీకి అస్తిత్వమే లేదని ప్రకటిస్తూ వుండటం శివాజీకి అసలు ‘రాజకీయాలు’ అంటే ఏమిటో అర్థమయ్యేలా చేస్తున్నాయి. శివాజీ బీజేపీ నాయకుడు అవునా, కాదా అనే సందేహం మొన్నటి వరకూ బీజేపీ నాయకులు ఎవరికీ కలగలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని జలదీక్ష, నిరసన దీక్షలు చేస్తూ వుండే సరికి ఆయన బీజేపీ నాయకుడు కానేకాదని చెబుతున్నారు. శివాజీ గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేస్తే చిన్నా చితకా సంఘాల నాయకులే తప్ప ప్రధాన పార్టీల నాయకులెవరూ పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అందరూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అంటారు. అదే డిమాండ్‌తో శివాజీ దీక్ష చేస్తే మాత్రం ఎంతమాత్రం పట్టించుకోరు. దీన్నే రాజకీయం అంటారు. జరుగుతున్న పరిణామాలన్నీ శివాజీకి రాజకీయ పాఠాలుగా ఉపయోగపడుతూ వుండవచ్చు.

ఈ ‘రవాణా’ కాష్ఠం చల్లారదా?

కరెక్టుగానే చదివారు.. రావణ కాష్ఠం కాదు..  రవాణా కాష్ఠం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు రవాణా కాష్ఠం అంటుకుంది. అది రావణ కాష్ఠంలా మండుతోంది. అది ఎప్పుడు చల్లారుతుందో, అసలు చల్లారుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. తమ రాష్ట్రంలో ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ వాహనలు పన్ను చెల్లించాలని అంటూ ఈ కాష్ఠాన్ని మొదట తెలంగాణ ప్రభుత్వమే రగిలించింది. తెలంగాణ ప్రభుత్వం రవాణా పన్ను వసూలు చేస్తున్నప్పుడు మేం మాత్రం ఎందుకు ఊరుకోవాలని అంటూ ఏపీ ప్రభుత్వం కూడా తమ సరిహద్దుల దగ్గర రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. దాంతో రెండు రాష్ట్రాల ప్రజలకు బాదుడు తప్పడం లేదు. ప్రజల సంగతి ఎలా వున్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఆదాయం సమకూరుతోంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య అర్ధ శతాబ్దానికి పైగా జరిగిన సంసారబంధం కారణంగా ఒక ప్రాంతం మరో ప్రాంతం మీద ఆధారపడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రాష్ట్రానికి పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుంటుంది కాబట్టి తమ రాజధానికి వెళ్ళడానికి తాము రవాణా పన్ను చెల్లించాల్సి రావడమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో వుంది. రాజధానికి వెళ్ళడానికి రవాణా పన్ను చెల్లించడం అనేది ఎంతవరకు సమంజసమో గౌరవనీయ న్యాయస్థానం చెప్పాల్సి వుంది. మరి న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించేలోపు పన్ను వసూళ్ళు అయితే యథావిధిగా జరుగుతూనే వున్నాయి. ఈ రవాణా పన్ను కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. రవాణా పన్ను సాకు చెప్పి వ్యాపారులు అన్ని వస్తువుల ధరలనూ పెంచే ప్రమాదం వుందని అనుమానిస్తున్నారు. రవాణా పన్ను అనేది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇచ్చే మార్గంగా వుండొచ్చేమోగానీ, రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ విధానం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ రవాణా కాష్ఠం సాధ్యమైనంత త్వరగా చల్లారితే బావుండని కోరుకుంటున్నారు.

మీడియాని నియంత్రించాల్సింది ఇలా...

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మీడియాని నియంత్రించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే తరాల రాజకీయ నాయకులకు ఎన్నో మార్గాలు చూపించారు. కేసీఆర్ మీడియాని నియంత్రించిన తీరు చూసి ఆయన రాజకీయ శత్రువులు కూడా ఆశ్చర్యంతో నోళ్ళు నొక్కుకున్నారు. కర్ర విరగకుండా పాము చచ్చిన చందాన ప్రభుత్వం మీద నేరుగా వేలెత్తి చూపించడానికి అవకాశం లేని విధంగా ఆయన మీడియాని నియంత్రించిన తీరు అమోఘం. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మీడియాని నియంత్రించాలని చూశారుగానీ, ఆ ప్రయత్నాలు ఫలించక చేతులు ఎత్తేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యావత్ మీడియా ప్రభుత్వాన్ని చూసి భయపడుతోంది. కేసీఆర్‌కి, ఆయన ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఒక వార్త రాయాలన్నా, ఒక కథనం ప్రసారం చేయాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితికి మీడియా చేరుకుంది. అధికారం చేపట్టిన వెంటనే రెండు ఛానళ్ళకు తన చేతికి మట్టి అంటకుండా చుక్కలు చూపించిన కేసీఆర్ చతురత సామాన్యమైనది. వాటిలో ఒక ఛానల్ గండం నుంచి గట్టెక్కి బతుకు జీవుడా అనుకుంటూ వుంటే, మరో ఛానెల్ ఎన్నాళ్ళీ సంకెళ్ళు అని ఆవేదనగా ప్రశ్నిస్తోంది. సచివాలయంలోకి మీడియా ప్రతినిధుల ప్రవేశానికి చెక్ పెట్టే ప్రయత్నం కూడా కేసీఆర్‌ మీడియా విషయంలో అనుసరిస్తున్న దృఢ వైఖరికి అద్దం పట్టింది. అయితే మీడియాని నియంత్రించడం అనేది బయటి మీడియా విషయంలో మాత్రమే కాకుండా సొంత మీడియా విషయంలో కూడా అమలు చేస్తే బాగుండేదేమో. టీఆర్ఎస్ సొంత మీడియాలో ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా కథనాలు రావడం, ఇతర పార్టీలకు, సీమాంధ్రులకు వ్యతిరేకంగా మాత్రమే వస్తున్న కథనాలను చూసి మీడియాను ఈ రకంగా కూడా నడిపించవచ్చా అనే పాఠాలు నేర్పిస్తున్నాయి. ఆ మీడియాకి చెందిన ప్రతినిధులు చేస్తున్న నిర్వాకాలు తెలంగాణ ప్రజలు గతుక్కుమనేలా చేస్తున్నాయి. వెలుగులోకి రాని అంశాల గురించి అలా వుంచితే, ఇటీవల జరిగిన ఒక ఘటన సొంత మీడియాని కూడా కేసీఆర్ అదుపులో పెట్టాలన్న హెచ్చరికగా మిగిలింది. టీఆర్ఎస్‌కి చెందిన మీడియా ప్రతినిధి ఒకరు మరో మీడియా ప్రతినిధితో కలసి ఒక వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తూ, పది లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో దిక్కు తోచని వ్యాపారి ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావుబతుకుల్లో వున్నాడు. ఈ లెక్కన సర్కారు వారి మీడియా ప్రతినిధులు రాష్ట్రంలో ఏరకంగా రెచ్చిపోతున్నారనడానికి ఈ  శాంపిల్ ఘటన చాలు. ఇప్పటికై ఘనత వహించిన ముఖ్యమంత్రి గారు తన సొంత మీడియాను కూడా నియంత్రించే విషయాన్ని ఆలోచిస్తే అందరికీ బావుంటుంది.

శభాష్ ఇండియా

ఇండియా... అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా శభాష్ అనిపించుకుంటున్న దేశం. ఒక పక్క పాకిస్థాన్, మరోపక్క చైనా, అన్నిటికీ మించి అమెరికా దేశాలు ఇండియా సహనానికి ఎన్ని పరీక్షలు పెడుతున్నప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళ్తోంది. ప్రపంచ దేశాలతో స్నేహం చేసే విషయంలో, మిత్రధర్మం పాటించే విషయంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో, ఆపత్కాలంలో ఆదుకునే విషయంలో ఇండియా అనేక దేశాల కంటే ముందు వుంటోంది. ఇటీవల పొరుగు దేశమైన నేపాల్‌లో అత్యంత భయంకరమైన భూకంపం సంభవించినప్పుడు భారతదేశం చూపించిన చొరవ, చేసిన సాయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నేపాల్‌లో భూకంపం  సంభవించగానే మొట్టమొదట స్పందించి, ఎవరూ అడగకుండానే సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన దేశం ఇండియా. భూకంపం సంభవించిన సమయంలో తక్షణం అందాల్సిన సాయం శిథిలాల నుంచి క్షతగాత్రులను రక్షించడం, ఆ తర్వాత వారందరికీ ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందించడం, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించడం... ఈ పనులన్నీ భారత సైనిక దళాలు విజయవంతంగా నిర్వహించాయి. నేపాల్ వాసులను ఆదుకోవడం మాత్రమే కాకుండా, నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడంలో కూడా భారత సహాయక బృందాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాయి. నేపాల్ భూకంపం సమయంలో భారత దేశం వ్యవహరించిన తీరుకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తు్న్నాయి. ఇండియాకు ఆగర్భ శత్రు దేశమైన పాకిస్థాన్ నుంచి కూడా ప్రశంసలు అందాయి. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ మన ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా ఫోన్ చేసి కొనియాడారంటే ఈ విషయంలో భారతదేశం వేసిన ముందడుగును అర్థం చేసుకోవచ్చు. నేపాల్‌కి అటువైపు సరిహద్దులో వున్న చైనా మొన్నటి వరకూ నేపాల్ మీద లేనిపోని ప్రేమ ప్రదర్శిస్తూ వుంటుంది. నేపాల్‌లో వున్న హిమాలయాను తొలచి నేపాల్‌కి - చైనాకు మధ్య భూగర్బ రైల్వే మార్గాన్ని నిర్మించాలని, తద్వారా ఇండియా మీద దాడి చేసే సులభ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అలాంటి చైనా కూడా భూకంప సమయంలో నేపాల్‌ని ఆదుకున్నది శూన్యం. ఆదుకునే విషయాన్ని అలా వుంచి, నేపాల్‌లో చిక్కుకుపోయిన తన దేశస్థులను తరలించుకునే కార్యక్రమం కూడా చేయలేక చేతులెత్తేసింది.

బొత్స... ఉండాల్సినోడే!

బొత్స సత్యనారాయణ ఒకప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా తనహవా నడిపించిన వ్యక్తి. ఉత్తరాంధ్ర రాజకీయాలన్నీ ఆరోజుల్లో ఆయన కనుసన్నల్లో నడిచేవి. ఆయన మాట వేదంలా చెలామణీ అయ్యేది. అయితే చేసిన తప్పులు ఆయన పీకకు చుట్టుకున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన పొరపాట్లు ప్రజల శాపాల రూపంలో ఆయనకు తగిలాయి. చివరికి ఆయనతో సహా ఆయన ఫ్యామిలీ, సన్నిహితులు అందరూ ఎన్నికలలో తుక్కు తుక్కుగా ఓడిపోయారు.చీపురుపల్లి ప్రజలయితే ఆయన్ని చీపురుతో ఊడ్చేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఇంత దారుణమైన స్థితికి పడిపోయిన్పటికీ, బొత్స సత్య నారాయణ తన ధోరణిని మార్చుకోలేదు. రాజకీయాల్లో తాను అనుసరిస్తున్న పాత తరహా ధోరణిలోనే వెళ్తున్నారు. ఈ మహానుభావుడు రాజకీయాల్లో ఉండాల్సినోడే అనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోగానే బొత్స చూపు తెలుగుదేశం పార్టీ మీద పడింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఆయన్ని పట్టించుకున్నవారు, పిలిచినవారు లేకపోవడంతో కొంతకాలం ఎదురుచూసిన ఆయన ఆ తర్వాత బీజేపీ తలుపులు తట్టారు. ఏపీలో కాస్తంత పేరున్న నాయకుడు ఎవరు తలుపు తట్టినా బార్లా తెరిచేయాలని అనుకున్న బీజేపీ తలుపులు తీయబోయింది. అయితే ఏపీలోని బీజేపీ నాయకుడు బొత్సను పార్టీలో చేర్చుకుంటే హైటెన్షన్ కరెంట్ తీగను పట్టుకున్నట్టేనని భయపెట్టడంతో బీజేపీ బొత్సకు తలుపులు తెరవకుండా గడియ మరింత గట్టిగా వేసేసింది. దాంతో బొత్స తాను అంతకుముందు వరకూ నోటికొచ్చినట్టు తిట్టిపోసిన జగన్ పార్టీలోకి జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ నాయకుడు జగన్ బొత్స పార్టీ ప్రవేశానికి అనుకూలంగా వున్నారన్న వార్తలు రాగానే ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాల్లో కలవరం, కలకలం రేగి ఎమ్మెల్యేల రాజీనామా వరకు పరిస్థితి వెళ్ళింది. ప్రస్తుతం జగన్ తన పార్టీ నాయకులకు సర్దిచెప్పి, బొత్సని ఆహ్వానించాలనే ఆలోచనలో వున్నారు. రేపో మాపో బొత్స వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఈ స్టేజ్‌లో బొత్స బుద్ధిగా ఇంటిపట్టున కూర్చోకుండా, కాంగ్రెస్ పార్టీ గుంటూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి కేంద్రం అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులంతా కలసి చేసిన దీక్ష అది. ఆ దీక్షలో పాల్గొన్న బొత్స ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ విమర్శలన్నీ చంద్రబాబు నాయుడిని నేను ఇంత ఘాటుగా విమర్శించగలను అని జగన్‌కి తెలియచెప్పడం కోసమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన విమర్శల ఘాటును విని జగన్ తనను అర్జెంటుగా పార్టీలోకి తీసుకుంటాడనేదే బొత్స ప్రణాళిక అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో చేరడం కోసం కాంగ్రెస్ పార్టీ వేదికను విజయవంతంగా వినియోగించుకున్న బొత్స తెలివితేటలే తెలివితేటలని పరిశీలకులు అంటున్నారు.

ఎర్ర దొంగలకు అంతే లేదా?

ప్రతివాడికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేరగా దొరికినట్టున్నారు. అందుకే ఆంధ్రులతో ఆటలాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగల పరిస్థితి, తమిళనాడు రాజకీయ నాయకుల పరిస్థితి ఇలాగే తయారైంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు్గా వాళ్ళ తీరు వుంది. ఈ కంత్రీగాళ్ళ తీరు చూసి దేశమంతా పకపకా నవ్వుతున్నా ఆ ఎడ్డిగాళ్ళకి సిగ్గూ శరం రావడం లేదు. తమ దారుణమైన ప్రవర్తనతో రౌడీల్లాగా వ్యవహరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మీద పైచేయి సాధించాలని అనుకుటున్నారు. మొన్నామధ్య వరకూ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు కంటినిండా కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వెనుక వున్నది ఘనత వహించిన తమిళనాడు రాజకీయ నాయకులే అన్నది జగమెరిగిన సత్యం. అవసరం తీరిన తర్వాత అల్లుడు... అన్నట్టుగా వీరప్పన్‌తో అవసరం తీరిన తర్వాత అతన్ని చాకచక్యంగా మట్టుబెట్టేశారు. వీరప్పన్ వీరమరణంతో అనాథలైపోయిన అతగాడి అనుచర స్మగ్లర్ బ్యాచ్ అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్‌ అడవుల్లోని ఎర్రచందనం చెట్లమీద పడింది. గత పది సంవత్సరాలుగా లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారు. పనిలోపనిగా అడ్డు వచ్చిన అధికారులనూ నరికేస్తూ వచ్చారు. అలాంటి నరహంతక స్మగ్లర్లు 20 మందిని మొన్నామధ్య ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం వీళ్ళ ఉన్మదానికి ఆజ్యం పోసినట్టు అయింది. తమిళనాడులో వున్న ఆంధ్రప్రదేశ్ సంస్థలు, బస్సులపై దాడి చేయడం లాంటి హింసాత్మక ఘటనలతో తమ బుద్ధిని మరోసారి  బయటపెట్టుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగింది కదా అని ఎర్ర స్మగ్లర్లు ఆగారా... లేదు... ఎన్‌కౌంటర్ జరిగిన మూడోరోజే దాదాపు మూడు వందల మంది స్మగ్లర్లు చిత్తూరు జిల్లా అడవుల్లో దొరికిపోయారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎర్రదొంగలు ఇప్పుడున్న పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ చిత్తూరు జిల్లా అడవుల్లో ప్రతిరోజూ ఇద్దరుముగ్గురయినా ఎర్రచందనం దొంగలు దొరుకుతున్నారు. వాళ్ళ తెంపరి తనాన్ని అర్థం చేసుకోవడానికి దీనికి మించిన ఉదాహరణ వుంటుందా? వీళ్ళు చిత్తూరు జిల్లా అడవులను మంచి ఆదాయాన్నిచ్చే టూరిస్టు ప్లేస్‌లా భావిస్తున్నారు. ఈ ధోరణికి మరింత బలంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.

నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ ఆస్తులు జప్తు చేసిన బ్యాంక్

  పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీసే నిర్మాతలు, కేవలం అటువంటి సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించేందుకు ఆసక్తి చూపే దర్శకులు మన సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఆ సినిమాలు హిట్ట్ అయితే అందరి కంటే ముందు ఆ సినిమాలో నటించిన హీరో, ఆ తరువాత దాని దర్శకుడు, సంగీత దర్శకుడు ఆ క్రెడిట్ మొత్తం క్లైమ్ చేసుకొంటారు. వారి తరువాతే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత పేరు వినిపిస్తుంది. చివరికి అందరూ కలిసి పండగ చేసుకొంటారు. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం దానిని చేయడం కోసం కోట్లు పిండుకొన్న వారందరూ కూడా ఆ తప్పును ఎదుటవాడి మీదకి తోసేసి చల్లగా తప్పుకొని వెళ్ళిపోతే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత, (సదరు హీరో, దర్శకులపై అపార నమ్మకంతో) సినిమాను తీసుకొన్న డిస్ట్రిబ్యూటర్లే రోడ్డున పడతారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువయింది. మళ్ళీ తమిళ చిత్ర నిర్మాత ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ అధినేత వి. రవి చంద్రన్ మరోమారు మన కళ్ళ ముందు సజీవ ఉదాహరణగా నిలుస్తున్నారు.   కమల్ హాసన్ నటించిన దశావతారం, విక్రమ్ నటించిన అన్నియన్, ‘ఐ’ వంటి పలు భారీ చిత్రాలను నిర్మించిన ఆయన వాటి నిర్మాణం కోసం తన ఆస్తులను చెన్నైలో గల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కుదువ బెట్టి అప్పులు తీసుకొన్నారు. కానీ ఆయన తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో బ్యాంకులో తీసుకొన్న అప్పును తిరిగి తీర్చలేకపోయారు. ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.97 కోట్లకు చేరుకొంది. ఆ అప్పును తీర్చమని రవిచంద్రన్ కు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా ఆయన తీర్చలేకపోవడంతో ఆయన కుదువ బెట్టిన థియేటర్లను, భవనాలను, ఇళ్ళను, కార్యాలయాలను అన్నిటినీ బ్యాంక్ అధికారులు జప్తు చేసారు.   బ్యాంక్ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఆ అప్పులన్నీ తీర్చివేస్తామని, ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ ప్రతినిధులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు రూ.97 కోట్లు కాదు కదా కనీసం 9కోట్లు కూడా తీర్చలేని పరిస్థితిలో రవిచంద్రన్ ఉన్నట్లు తమిళ సినిమా పరిశ్రమలో చెప్పుకొంటున్నారు. ఆ సినిమాలు చేయడం కోసం కోట్లు పిండుకొన్న హీరోలు కానీ దర్శకులు కానీ కష్టకాలంలో నిర్మాతను ఆదుకొనేందుకు ముందుకు రాలేదు.   గత ఆరు దశాబ్దాలుగా సినిమాలలో కమర్షియల్ ఫార్ములా సినిమాలు విజయవంతంగా ఆడుతున్నట్లే, సినీ పరిశ్రమలో ఇటువంటి నిర్మాతల ట్రాజెడీ స్టోరీలు నిత్యం బయటపడుతూనే ఉంటాయి. అయినా ఎవరూ గుణపాఠం నేర్చుకోరు. కొత్త బకరాలు పుట్టుకొస్తునే ఉంటాయి. ఆ బకరాలు హీరోలను, వారి మనుమలు, వారి మునిమనుమలను పెంచి పోషిస్తూనే ఉంటాయి. ఇదొక అంతులేని వింత రంగుల కధ.