తెలంగాణలో చంద్రబాబుకు పాలాభిషేకం...కేసీఆర్ జీ చూస్తున్నారా...!

  ఒకటిగా ఉన్న రాష్ట్రం విడిపోయింది. ఏపీ, తెలంగాణ అంటూ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఇక ఎవరి రాజకీయాలు వారివి.. ఒకరి రాష్ట్రంలో మరొకరు వేలు పెట్టే అవకాశం లేదు. నిజం చెప్పాలంటే అసలు రాజకీయాల కోసమే ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెలంగాణలో అభిషేకం చేశారు. విచిత్రంగా ఉంది కదా.. నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.... ఇది నిజమే. అసలు తెలంగాణలో చంద్రబాబు ఫొటోకి ఎందుకు పాలాభిషేకం చేశారో.. ఎవరు పాలాభిషేకం చేశారో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.   చంద్రబాబు ఏపీలో డీఎస్సీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేశారు.  కేవ‌లం 13 జిల్లాల‌కు క‌లుపుకుని ఏకంగా 12370 ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. అంటే ఏపీలోని 13 జిల్లాల‌కు చూస్తే ఒక్కో జిల్లాకు స‌గ‌టున 1000 వ‌ర‌కు ఉపాధ్యాయ పోస్టులు భ‌ర్తీ కానున్నాయి. చంద్ర‌బాబు ఇక్క‌డ సీఎం అయ్యాక ఇది రెండో డీఎస్సీ నోటిఫికేష‌న్ కావ‌డం విశేషం. దీనికి కాను.. మహబూబ్‌నగర్‌లో డీఎస్సీ నిరుద్యోగులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దీనికి కారణం లేకపోలేదు. నిజానికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పార‌ని ఎప్పుడో చెప్పారు. కానీ దానికి సంబంధించిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో ఇప్పుడు ఇక్క‌డ రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతోంద‌ని అక్క‌డ నిరుద్యోగులు ఆవేద‌న‌తో ఉన్నారు. పొరుగు తెలుగు రాష్ట్రంలో రెండో నోటిఫికేష‌న్ వ‌చ్చినా ఇక్క‌డ తొలి నోటిఫికేష‌నే పూర్తి కాలేద‌న్న అసంతృప్తి తెలంగాణ నిరుద్యోగుల్లో ఎక్కువైంది. ఇక త‌మ‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌కుండా టీఎస్‌పీఎస్సీకి మాత్రం మూడు రెట్లు జీతాలు పెంచార‌టూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థుల ఉద్యమాలతో గద్దెపై కూర్చున్న దొంగలు ఇప్పటికైనా మారాలని తెలంగాణ విద్యార్థులు డిమాండ్ చేశారు. దీనికి భారీ ఎత్తున స్పంద‌న రావ‌డం చూస్తుంటే తెలంగాణ విద్యార్థుల్లో నిరుద్యోగ స‌మ‌స్య‌పై తీవ్ర అసంతృప్తి ఉంద‌ని తెలుస్తోంది.   మరి కేసీఆర్ గారు ఇప్పటికైనా పరిస్థితిని గమనించుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే... ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలానికే.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు అండగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులే ఆయనకు వ్యతిరేకం అయ్యారు. ఇప్పుడు అదే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. కోదండరామ్ కూడా కేసీఆర్ కు వ్యతిరేకం అయ్యారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా వ్యతిరేకం అయ్యారు. అంతేకాదు ఒక మెట్టు ఎక్కి ఏకంగా చంద్రబాబు ఫొటోకే పాలాభిషేకం చేసి కేసీఆర్ కు షాకిచ్చారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది మరీ. ఏమైనా చంద్రబాబుకు పొరుగురాష్ట్రంలో పాలాభిషేకం అంటే గొప్ప విషయమే..

పవన్ మాటల వెనుక మర్మం అదేనా..!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ మాట్లాడని విధంగా అందరిపై కామెంట్స్ చేసి ఒక్కసారిగా అందరికీ షాకిచ్చాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం పైన ఏంటీ.. ప్రతిపక్షం పైనా అందరిపై కామెంట్లు చేసి అసలు పవన్ కళ్యాణ్ ఏనా మాట్లాడేది అనేలా చేశాడు. అంతేనా ప్రజారాజ్యం పార్టీపైనా.. తన అన్న చిరంజీవిని మోసం చేసిన వారిపైనా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.   దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. ఆయన గతంలో ఎప్పుడూ చిరంజీవి గురించి కానీ.. ప్రజారాజ్యం గురించి కానీ పబ్లిక్ మీటింగ్ లో స్పందించలేదు. కానీ ఇప్పుడు చిరింజీవిని తెరపైకి తీసుకురావడం.. ఆయన గురించి.. ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తన అన్నయ్య చిరంజీవికి కూడా ఉందంటూ... కానీ కొంతమంది ఆయనను మోసం చేశారని బహిరంగంగానే కొన్ని పేర్లు కూడా బయటపెట్టాడు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. పవన్ ఇలా మాట్లాడుతుంటేనే ఎక్కడా లేని డౌట్లు వస్తున్నాయి. అవేంటంటే... భవిష్యత్తులో ‘జనసేన’ బాధ్యతలను నెమ్మదిగా చిరు నెత్తిన పెట్టేలా చేయబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అందుకే గత రెండు రోజులుగా ‘ప్రజారాజ్యం’ పల్లవిని కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. అందుకే చిరంజీవిని మోశాడా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   ఇదిలా ఉండగా.. చిరు అంటే పవన్ ఎప్పుడూ అభిమానమే అన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా పరంగా అయితే నెంబర్ వన్ కానీ... రాజకీయాల్లో మాత్రం ఆయన కాస్త వెనుకబడే ఉన్నారన్నది వాదన. దీంతో... చిరంజీవిని తెరపైకి తెచ్చి  పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేసుకుంటారా అని అనుకుంటున్నారు.  ఎందుకంటే… పవన్ గానీ, మెగా ఫ్యాన్స్ గానీ ఒప్పుకున్నా, లేకున్నా… ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా చిరంజీవి షో ‘అట్టర్ ఫ్లాప్’ అని చెప్పకతప్పదు. అందుకే పవన్ ఇవన్నీ గమనించుకోవాలని అని అనుకుంటున్నారు. మరి పవన్ అన్నయ్యను మోసం చేసినందుకు తట్టుకోలేక అలా మాట్లాడాడా.. లేక రాజకీయ ఆలోచన ఏదైనా ఉందా.. చూద్దాం ఏం జరుగుతుందో..

అరవింద్ నన్ను అలా చూశారు... పరకాల ఇప్పుడేమైంది...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమైందో ఏమో తెలియదు కానీ.. అందరికీ ఒక్కసారిగా క్లాస్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపడానికి వచ్చిన పవన్ మూడు రోజులు అక్కడే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన అధికార పార్టీపైనా... ప్రతిపక్ష పార్టీ నేత జగన్ పైనా, ఇంకా బీజేపీ పైనా అందరినీ తన మాటలతో ఏకిపారేశాడు. తను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో... ఎలా వచ్చానో... తన అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీ గురించి... తన అన్నను మోసం చేశారని... ఇలా ఒకటేమిటి చాలా విషయాలపైనే పవన్ మాట్లాడాడు.   ఇక ఈరోజు రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ మళ్లీ అదే రేంజ్ లో రెచ్చిపోయాడు. విపక్షం అంటే ఎలా ఉండాలి, రాజకీయం అంటే ఏమిటి అని మరోసారి చెప్పాడు. మనం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పనులు చేయించవచ్చు.. ముఖ్యమంత్రి కావడమే రాజకీయ లక్ష్యం కాదు.. సామాజిక మార్పు తేవడమే అసలైన రాజకీయం అని చెప్పారు. అసెంబ్లీలో అధికారపార్టీని నిలదీసి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చునని, ఊపిరి ఆడకుండా చేయవచ్చునని చెప్పారు. ప్రభుత్వంతో పని చేయించడమే అసలు రాజకీయం అన్నారు.   ఇంకా పీఆర్పీ గురించి మాట్లాడుతూ... పీఆర్పీలో నిస్వార్థపరులు ఉంటే చిరంజీవి సీఎంగా ఉండేవారన్నారు. తన సోదరుడు చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ నేను మాత్రం చిరంజీవిలా మంచి వ్యక్తిని కాదని.. చిరంజీవిలో ఉన్నట్లు సహనం, మంచితనం నాలో లేవని చెప్పారు. ప్రజారాజ్యం నుంచి నేర్చుకున్న పాఠాలతో జనసేన నిర్మించానని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో తాను నిస్సహాయుడిని.. ఆ సమయంలో అల్లు అరవింద్ తనను ఓ నటుడిలా చూశారని చెప్పారు. రామ్ చరణ్ తేజ్, బన్నీ లా తనను కూడా ఓ నటుడిలాగే చూశారని చెప్పారు. అందుకే తాను ఏం చేయలేని పరిస్థితి అన్నారు.   అంతేకాదు పనిలో పనిగా పరకాలపై కూడా మండిపడ్డారు. పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్‌లు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చిరంజీవి నోరు లేని వ్యక్తి కాబట్టే పరకాల తిట్టేసి వెళ్లిపోయారని.. ఆ సమయంలో తాను ఉండి ఉంటే సందర్భం మరోలా ఉండేదన్నారు. పరకాల వంటి నిబద్దత లేని వ్యక్తులు జనసేనకు అవసరం లేదన్నారు. నాడు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని పరకాల తిట్టారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని  నిలదీశారు. తన సతీమణిని మాత్రం కేంద్ర కేబినెట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. మొత్తానికి పవన్ విశాఖ పర్యటనలో తనను విమర్సించిన వాళ్లందరికీ గట్టిగానే సమాధానం చెబుతున్నట్టు కనిపిస్తోంది. మరి చూద్దాం.. పవన్ ఇంకెర్ని టార్గెట్ చేస్తాడో..

ఇంతలోనే ఎంత మార్పు మోడీజీ... చుక్కలు చూపిస్తున్నారుగా..!

  ఒకసారి.. ఓ నాలుగేళ్లు వెనక్కి వెళదాం. బీజీపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్నో ఏళ్ల నుండి యూపీఏ పాలనతో విసుగెత్తిపోయిన జనాలు కూడా బీజేపీని ఆహ్వానించారు. ఇక అప్పటి వరకూ చేతులు ముడుచుకొని నాయకులకు కూడా రెక్కలు వచ్చినట్టుయింది. ఇక మోడీ లాంటి వ్యక్తి ప్రధాని అయ్యే సరికి..దేశం స్థితిగతులు మారిపోతాయి. దేశానికి మంచి రోజులు వచ్చాయి అనుకున్నారు. అనుకున్నట్టే  మొదట అంతా బాగానే ఉంది.  మోడీ తీసుకున్న నిర్ణయాలు అందరికీ బాగానే నచ్చాయి. దీంతో ఎక్కడ చూసినా నమో.. నమో అంటూ మోడీ జపం చేశారు. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా బీజేపీకే పట్టం గట్టారు. ఓ రకంగా ఉత్తరాదిన మొత్తం బీజేపీదే హవా అని చెప్పొచ్చు. అయితే మొదట అంతా బాగానే ఉన్నా... ఆతరువాతే అసలు కథ మొదలైంది.   ఎందుకంటే.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ ఎన్నో కథనాలు వచ్చాయి. దానికి తోడు.. దళితులపై దాడులు.. అమానుషంగా కొట్టి చంపడం.. ఇవన్నీ బీజేపీ వల్లే జరుగుతున్నాయన్న ఆరోపణలు. దానికి కారణం. బీజేపీ హిందుత్వ పార్టీ కావడమే. ఈ క్రమంలోనే నోట్ల రద్దు... జీఎస్టీ వంటి చట్టాలు ముందుకు తెచ్చి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం. వెరసి బీజేపీపై ప్రజల్లో ఓ వ్యతిరేక భావం ఏర్పడింది . బీజేపీపై ఏర్పడింది అంటే మోడీపై కూడా ఏర్పడినట్టే లేక్క కదా. ఇప్పుడు ఈ ప్రభావాలే గుజరాత్ ఎన్నికలపై కూడా పడ్డాయి. మనకేముందిలే ఇప్పటివరకూ అన్ని ఎన్నికల్లో గెలిచాం.. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం అని అనుకున్న బీజేపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, హార్దిక్ పటేల్.   ఒకప్పుడు వీరిద్దరినీ బీజేపీ కౌంట్ కూడా చేసుకునేది కాదు. ముఖ్యంగా రాహుల్ గాంధీని అయితే పిచ్చ లైట్ తీసుకునేవారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఈ మధ్య రాహుల్ కూడా మాటలు నేర్చుకున్నాడు. తన పంథా మార్చుకున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు.. వారి మీద వీరి మీద కాకుండా.. ఏకంగా మోడీపైనే తన మాటల తూటాలు పేల్చాడు. మోడీనే టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా.. గట్టిగానే ఎన్నో ట్వీట్లు చేశాడు. నిన్న మొన్నటివరకూ రాహుల్ ను పప్పు అని చెప్పుకున్నవాళ్లే ఇప్పుడు మోడీ కి చెమటలు పట్టిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక హార్దిక్ పటేల్ విషయానికొస్తే..  మోడీ ముందు పిల్లకాకి అని చెప్పుకోవడం కూడా ఎక్కువే. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్ కు ప్రజల మద్దతు చాలా పెరిగింది. ఇటీవల పీఎం, సీఎం పాల్గొన్న సభకు జనాన్ని తోలడానికి బీజేపీ బాగా కష్టపడింది.  కానీ అంతకు ముందు వారం హార్దిక్ పటేల్ సభకు సొంతంగా తరలివచ్చిన జనమే ఎక్కువ. ఇక మోడీ అమోద్ సభలో కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తే సూరత్ లో 25 కిలోమీటర్ల రోడ్ షో తర్వాత కూడా హార్దిక్ పటేల్ బహిరంగసభకు జనం పోటెత్తారు. దీంతో ఇప్పుడు బీజేపీ గెలుపుపై వారికే అనుమానం మొదలైంది. తాను రాజకీయంగా బలపడి.. గుజరాత్ అంటే మోడీనే అన్న పేరున్న మోడీకి కూడా ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందంటున్నారు. మొత్తానికి పిల్ల కాకులే కదా అని అనుకొని లైట్ తీసుకున్నారు..  ఇప్పుడు ఆ పిల్ల కాకులే మోడీకి చుక్కలు చూపిస్తున్నారు. మరి చూద్దాం ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో..

పవన్ తో పొత్తు.. వాట్ ఏ కామెడీ జగనా..

ఈ మధ్య జగన్ బలే కామెడీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పాదయాత్ర చేస్తూ.. అప్పుడప్పుడు కామెడీ చేస్తున్న జగన్ మరోసారి తన మీడియా సాక్షిగా కామెడీ చేశారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అదేనండీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. సాధారణంగా రాజకీయాల్లో పార్టీల పొత్తులు సహజమే. ఏపీలో బీజేబీ-టీడీపీ ఇప్పటికీ మిత్రపక్షంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీల కు పోటీగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా దిగింది. ఇక పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ నేపథ్యంలో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి పార్టీలు సిద్దంగా ఉన్నాయి. వైసీపీ కూడా ఇందుకు అతీతమేం కాదు. వైసీపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది. ఇదే విషయంపై మాట్లాడిన జగన్.. అదేం లేదన్నట్టు... మాకు అంత అవసరం లేదు అన్నట్టు మాట్లాడి కామెడీ చేశారు.   ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర మధ్య కాస్త గ్యాప్ లో జగన్ తన మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో జగన్ ని కొమ్మినేని .. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటారా అని అడిగారు. దానికి జగన్...  “పవన్ తో నాకు పరిచయం లేదు . అయినా ఆయన ముందు చంద్రబాబు ప్రభావం నుంచి బయటకు రావాలి “ అని కలరింగ్ ఇచ్చాడు. కొమ్మినేని ప్రశ్న పెద్ద కామెడీ అనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన జగన్ అంతకన్నా పెద్ద కామెడీ చేశారు. అసలు ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలను ప్రాతిపదిక చేసుకుని కలిసి పని చేద్దామని జనసేనకు వైసీపీ నేతలు ఎన్నో సందర్భాల్లో పిలుపు ఇచ్చారు. ఓ వైపు పవన్ ని చంద్రబాబు సన్నిహితుడుగా ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఇంకో వైపు ఆయన్ని వైసీపీ కి దగ్గర చూసేందుకు ట్రై చేశారు. ఇలా ప్రయత్నించిన వైసీపీ నేతల్లో జగన్ కి అతి సన్నిహితుడు అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఒకరు. మరి ఇవేం తెలియనట్టు... తాను ఇందుకు అతీతం అంటున్నట్టు మాట్లాడుతున్నాడు.   ఇవన్నీ ఒక ఎత్తైతే..అసలు పవన్ కళ్యాణ్ జగన్ తో పొత్తు పెట్టుకోవాలి కదా. నిన్న జరిగిన సమావేశంలో పవన్ జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. జగన్ తో పొత్తు పెట్టుకోవడం అసాధ్యం అని తేలిపోయింది. తండ్రి చనిపోయిన వెంటనే పదవులు కోసం వెంపర్లాడిన జగన్ కి సీఎం కుర్చీలో ఎక్కే అనుభవం ఎక్కడ ఉందని పవన్ పరోక్షంగా జగన్ ని టార్గెట్ చేశారు. అయితే పవన్ జగన్ ను టార్గెట్ చేసి మాట్లాడినా కూడా.. ఆయన ముందు చంద్రబాబు ప్రభావం నుంచి బయటకు రావాలి అని అన్నాడంటే....తాను ఓ రకంగా పొత్తు రెడీ అని చెప్పకనే చెప్పాడు. మరి జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటే.. పొత్తు పెట్టుకోవడానికి ఎవరైనా రావడానికి ఆస్కారం ఉంటుంది.. లేదు.. నేను ఇలానే ఉంటా.. ఇలానే చేస్తా అంటే... అది తనకే నష్టం..

సోనియాగాంధీతో అందుకే చెడింది...

  దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత... సోనియాకు.. జగన్మోహన్ రెడ్డికి మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఇక ఆ తరువాత రాష్ట్రం విడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ మరుగున పడింది. ఇక ఇప్పట్లో పార్టీ పుంజుకుంటుదన్న హోప్స్ కూడా లేవు. అయితే ఇప్పుడు తనకు, సోనియాకు మధ్య వచ్చిన విబేధాలు గురించి మాట్లాడాడు.   ప్రజాసంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆయన పాదయాత్ర మొదలుపెట్టి నెలరోజులు గడిచిన సందర్భంలో...ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన.. తన తండ్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిస్థితులను వివరించారు. సోనియాగాంధీతో ఏర్పడిన వివాదానికి గల కారణాలను బయటపెట్టారు. సోనియా తన ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదన్నారు. ఆమెకు తన గురించి లేనిపోనివి చెప్పారో, లేక ఆమె మైండ్‌సెట్ మారిందో తెలియదు కానీ ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఇవ్వలేదని చెప్పారు. యాత్రకు ఉన్న సెంటిమెంటును, దానితో తనకు ఉన్న ఎమోషనల్ కనెక్ట్‌ను ఆమె అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. తాను, అమ్మ, పాప ముగ్గురం కలిసి చివరిగా ఆమెను రిక్వెస్ట్ చేసి ఒప్పించాలని వెళ్లామని, అయితే ఎంత చెప్పినా సోనియా వినలేదని వివరించారు.  అందరినీ ఒకే చోటకు పిలిపించి ఓదార్చండి అన్నారని జగన్ గుర్తు చేశారు.సోనియా కనుక ఆరోజు ఒప్పుకుని ఉంటే సమస్య ఇంతదూరం వచ్చి ఉండేది కాదని అన్నారు. అసలు ఓదార్పు యాత్రకు ఆమె పర్మిషన్ ఎందుకు తీసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చేందుకు ఇంకొకరి అనుమతి కావాలనుకోవడమే బిగ్గెస్ట్ ఆశ్చర్యం అని జగన్ అన్నారు.   కానీ తనకు పదవి ఇవ్వలేదన్న కోపంతో జగన్ పార్టీ నుండి బయటకు వచ్చి.. కొత్త పార్టీ పెట్టాడన్న వార్తలు గతంలో వచ్చాయి. మరి నిజంగా పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదనే జగన్ పార్టీ నుండి బయటకు వచ్చాడా...? లేక పదవి ఇవ్వలేదని పార్టీ నుండి బయటకు వచ్చాడా.. ? అది జగన్ కే తెలియాలి.

దేవుడి దగ్గర కూడా ఇంత రచ్చ అవసరమా...

వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా మారదు. మారదు కాక మారదు... అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే తన నోటిదూలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నంద్యాల ఉపఎన్నికల్లో జరిగింది చాలదు అన్నట్టు ఇప్పుడు తాజాగా మరోసారి రోజా ప్రభుత్వంపై విరుచుకుపడింది. కనీసం తాను ఎక్కడ ఉందో కూడా చూసుకోకుండా నానా యాగి చేసింది.  రోజా రాజ‌కీయాలు అసెంబ్లీలోను, మీడియాలోనే కాకుండా చివ‌ర‌కు ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన దేవాల‌యాల్లోను ఆగ‌డం లేదు.   రోజా ఇటీవల నగరి నుండి తిరుమల వరకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగా ఆమె తిరుమ‌లలో ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోసం కావాల్సిన ఎల్‌-1 టిక్కెట్ల విష‌యంలో నానా ర‌చ్చ ర‌చ్చ చేశారు. వీఐపీల‌కు ఇచ్చే ఎల్‌-1 ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ను కేవ‌లం 10కి మాత్ర‌మే పరిమితం చేశారు. అయితే రోజా త‌న‌తో పాటు పాద‌యాత్ర చేసిన 40మందికి పైగా ఎల్ -1 టిక్కెట్లు కావాల‌ని నానా హంగామా చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా ప్ర‌భుత్వంతో పాటు అధికారుల‌పై నోటికొచ్చిన‌ట్టు విరుచుకుప‌డ్డారు. తాను ఉన్న‌ది పవిత్ర‌మైన దేవాల‌యం అన్న సంగ‌తి కూడా రోజా మ‌ర్చిపోయి వ్య‌వ‌హ‌రించారు. దీంతో రోజా తీరుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అంతేకాదు రోజా చేసిన రచ్చపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా అతి చేస్తున్నారని, ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని ఆయన హెచ్చరించారు. తిరుమలకు అనుచరులతో వచ్చి ఎల్ -1 టిక్కెట్లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారని, దేవుడి ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. మొత్తానికి రోజా.. ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ అన్న అందరూ అనుకుంటున్నారు అంటే ఇందుకే మరి. వారి మాటలను రోజా సార్ధకత చేస్తుంది. మరి ఎప్పుడు మారుతుందో.. ఏమో రోజా..

వాళ్లు గుమాస్తాలైతే మీరు.. జనం పిచ్చోళ్లా...

  పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇంకా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా కష్టపడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రాష్ట్ర ప్రభుత్వం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి పనులు చేయాల్సిన నేపథ్యంలో టెండర్లకు పిలుపు నివ్వగా... కేంద్ర ప్రభుత్వం ఆ టెండర్లు కాస్త ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ అద్యయనం చేసేవరకు పనులను నిలుపుదల చేయాలని కేంద్రం చెప్పింది. దీంతో చేసేది లేక రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ప్రక్రియ నిలిపేసింది. ఇక కేంద్రం చేసిన ఈ పనికి చంద్రబాబుకు కూడా కోపం వచ్చి కేంద్రం పై బాగానే సీరియస్ అయ్యారు. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామనే.. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని ఓపెన్ గానే సీరియస్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని.. "పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేమీ కావాలని తీసుకోలేదు" అని చంద్రబాబు చెప్పారు.   ఒక్క చంద్రబాబుకే కాదు పోలవరం విషయంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. ఏదో పీకేద్దామనుకున్న బీజేపీకి తెలుగు ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో కాంగ్రెస్ విషయంలో చూసింది కాబట్టి ఇప్పుడు సొల్లు కబుర్లు చెపుతుంది. బాబు గట్టిగా మాట్లాడటం... జనాల్లో వస్తున్న కోపం చూసి బీజేపీ నేతలు ప్లేట్ ఫిరాయించారు. సోము వీర్రాజు అయితే తన వల్లే పోలవరం ప్రాజెక్టు వచ్చింది అన్న రేంజ్ లో మాట్లాడాడు. ఇప్పుడు ఆయనకు తోడు మరో బీజేపీ నేత బయలుదేరాడు. ఏపీ లో ఐదు లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు ఈ పోలవరం వివాదంపై మాట్లాడుతూ.. ఇదంతా కేంద్రజలవనరుల శాఖ అధికారుల మీదకు తోసేస్తూ చంద్రబాబుని కూల్ చేసే పని మొదలెట్టారు. పోలవరం విషయంలో... గుమాస్తాలు మాటలు పట్టించుకుంటారా అని అంటున్నాడు. పాపం బాబుగారు ఏదో కవర్ చేద్దామనుకున్నారు కానీ.. ఇక్కడే అధికారులను గుమస్తాలతో పోల్చి బుక్కయ్యారు. ఓ జాతీయ సంస్థ కి నాయకత్వం వహిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ని గుమస్తాగా జమకట్టడంతోనే బీజేపీ నాయకులకు అధికారం ఏ స్థాయిలో తలకు ఎక్కిందో అర్ధం అవుతుంది అని అనుకుంటున్నారు.   అంతేకాదు.. గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తుచేసుకుంటున్నారు. ఆ అధికారి ఇలా వ్యవహరిస్తున్నాడని ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. చివరకు కేంద్రమంత్రి ఉమా భారతి ముందే చంద్రబాబుని ఆ అధికారి తక్కువ చేసి మాట్లాడిన రోజున చంకలు గుద్దుకుని సంతోషపడ్డ బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం ప్రజల కోపాన్ని చూసి ప్లేట్ మారిస్తే సరిపోతుందా అని మండిపడుతున్నారు. ఏదో అయ్యా బాబు అని చంద్రబాబు పోలవరం కోసం పాట్లు పడుతుంటే.. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్న చిన్న చితకా.. కనీసం ఒక్క ఓటు కూడా లేని నాయకులు ఇప్పుడు మైకుల ముందుకు వచ్చి.. బాబు పై కామెంట్లు చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తూ ప్రజలు ఊరుకుంటారా.. వాళ్లేం పిచ్చోళ్లు కాదు కదా.. అన్నీ గమనిస్తూనే ఉంటారు. అందుకే పోలవరం విషయంలో చంద్రబాబుకు మద్దతుగా.. బీజేపీ చేసిన పనికి మండిపడుతున్నారు. అధికారం ఉంది కదా అని ఏం మాట్లాడినా సరిపోతుంది అని అనుకుంటే అది అమాకత్వమే అవుతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వారే బుద్ది చెబుతారు.

విశాల్ వెనుక శశికళ.. వారే టార్గెట్..!

  రోజు రోజుకు తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎప్పుడైతే మరణించారో అప్పటినుండి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ పోయి ఏడాది అయినా.. ఇంకా అక్కడ సరైన ప్రభుత్వం ఏర్పడలేదు అంటేనే తెలుస్తోంది రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది అక్కడ.   జయలలిత మరణానంతరం... ఆమె నియోజక వర్గమైన ఆర్కే నగర్ ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటికే ఈ స్థానం పలువురు పోటీ చేస్తున్నారు. ప్రతిపక్షాల సంగతేమో కానీ... సొంత పార్టీ నుండే ఈ స్థానానికి పోటీ నెలకొంది. దీంతో ఉపఎన్నిక వార్ చాలా రసవత్తరంగా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పోటీ బరిలో మరో వ్యక్తి కూడా నామినేషన్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. అతనెవరో కాదు.. హీరో విశాల్. ఎలాంటి సమాచారం లేకుండా.. చాప కింద నీరులా వచ్చి... ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో విశాల్ పోటీకి దిగాడు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... విశాల్ సడెన్ పోటీకి దిగడంపైనే పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విశాల్ పోటీ వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నారు అంటున్నారు.   ఇంతకీ ఆ వ్యక్తి ఎవరునుకుంటున్నారా..? ఎవరో కాదు... అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ. విశాల్ పోటీ వెనుక శశికళ ఉందన్నది టాక్. విశాల్ పోటీకి, శశికళకు సంబంధం ఏంటా అని పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర వాదనలు, విషయాలు బయటకు వచ్చాయి. అవేంటంటే... ఆర్కే నగర్ లో తమిళనాట సెటిల్ అయిన తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో వున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది తెలుగు ప్రజలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. వీరిని ఆకట్టుకోడానికే అన్నాడీఎంకే తరపున తెలుగు మూలాలు వున్న మధుసూదన్ ని సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం రంగంలోకి దించారు. మధుసూదన్ స్థానికుడు కావడంతో పాటు తెలుగు మూలాలు ఉండటమే ఆయనకు ప్లస్ పాయింట్ గా ఆ నేతలు భావించారు. దీనికి కౌంటర్ గా నిజాయితీ గల వాడన్న ఇమేజ్ కలిగిన విశాల్ ని రంగంలోకి దించాలని శశికళ బ్యాచ్ తెర వెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపించింది. అంతేకాదు అతని ఆర్ధిక కష్టాలు తీర్చి ఆర్కే నగర్ ఎన్నికల్లో పాల్గొనేలా ఒప్పించినట్టు తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే విశాల్ అభిమానులు, సన్నిహితులు, అనుచరులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. మరి నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఏమో.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

జగన్, అవ్వ ముచ్చట...ఎర్రోడిని చేసిందిగా...

  ప్రజాసంకల్పం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. చాలా కష్టాలు పడుతూ.. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ... ఏదో లాక్కొస్తున్నాడు. అయితే ఈ పాదయాత్రలో ఓ అవ్వ జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చినట్టు తెలుస్తోంది. ఇక అవ్వ ఇచ్చిన షాక్ కు జగన్ ఎర్రిమొహం పెట్టుకోవాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ అవ్వ ఇచ్చిన షాకేంటంటారా.. ఆ షాక్ ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. పాదయాత్రలో భాగంగా జగన్ కర్నూలు జిల్లా ఎర్రగుడి చేరుకున్నారు. ఇక ఆ ఊరి చివరికి వెళ్లిన జగన్ ఓ అవ్వ కనిపించింది. జగన్ ఆ అవ్వ దగ్గరికి వెళ్లాడు. ఇక ఎప్పటిలాగే జగన్ తన మేనరిజాన్ని చూపించబోయాడు. అదేనండి.. తలపై ముద్దు పెట్టుకోబోయాడు. కానీ అవ్వ పక్కకు జరిగి....తన సంచిలో ఉన్న వేరు శనగకాయలు ఇచ్చింది. ఆ తరువాత స్టోరీ చూడండి.   జగన్.. ఆ శనగకాయలు తింటూ జగన్ ఏంటి అవ్వా శనగకాయలు కొన్నావా అని అడిగాడు. అవ్వ.. కాదయ్యా.. అవి మా చేలోవే అంది. జగన్.. బాగా పండిందా మీ చేను అని అడిగాడు అవ్వ.. అవునయ్యా.. బాగా పండింది. ఈ యేడు పుట్లు పుట్లు పండాయి జగన్.. వానల్లేవుగా.. ఇంత బాగా ఎలా పండింది అవ్వ.. వానెందుకయ్యా పట్టిసీమ నీళ్లొస్తే.. కాలువ నిండా నీళ్లుంటే.. జగన్.. ఏందవ్వా.. నేనేమైనా పిచ్చోడ్నా.. యాడ పట్టిసీమ..? యాడ ఎర్రగుడిపాడు.. ఎలా వస్తాయమ్మా పట్టిసీమ నీళ్లు అవ్వ.. దానికి అవ్వ.. ఓరి పిచ్చినాయనా..? పట్టిసీమ ఎక్కడుందో నీకు తెలవకపోవచ్చు.. కానీ రాయలసీమ మొత్తానికీ.. ప్రతి బిడ్డకీ తెలుసు.. సీమకు నీళ్లు ఎలా వచ్చాయో? కాలువలు ఎలా పారుతున్నాయో..? కాస్త తెలివి తెచ్చుకో నాయనా.. ఇంకో ఊళ్లో ఎక్కడా ఇలా అడగమాకు.. జనం తిరగబడతారు. ఇక జాల్లో నడూ నడూ అని చెప్పిందట.   దీంతో అవ్వ చెప్పిన సమాధానానికి జగన్ నోటి మాట రాలేదట. చంద్రబాబు నిర్మించిన పట్టిసీమపై జగన్ ఎప్పటినుండో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాగే అవ్వ ముందు కూడా అలానే అన్నాడు బుక్ అయ్యాడు. నిజానికి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకే నీళ్లు వస్తాయి. అయితే కృష్ణా డెల్టాకు కృష్ణా నది నుండి వచ్చే వాటా నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలిస్తున్నారు. పోతిరెడ్డి ద్వారా రాయలసీమకు గతంలో ఎప్పుడు లేని విధంగా నీరు అందుతుంది. దీనిపై గతంలో వారి పేపర్ ద్వారా స్టోరీలు కూడా రాశారు. మరి ఇంత చేసీ కూడా జగన్ ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయాడో ఏంటో. కనీసం అవ్వకు తెలిసినంత కూడా తెలియడం లేదు. జగన్ ది  తెలియనితనమా? లేక అమాయకత్వమా? అని అనుకోవాలో కూడా అర్ధంకావట్లేదు. ఏంటీ జగన్ ఇది.. దిస్ ఈజ్ టూ మచ్..

మోడీ కుదరదని ముందే చెబుతున్నారా..!

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే కదా. కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఇక ఏలాగూ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కాబట్టి బిల్లు ఆమోదం జరిగిపోయింది. ప్రతిపక్షం ఉన్నా బిల్లుకు ఓకే చెప్పకతప్పదు. ఎందుకంటే.. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటినుండో జగన్ కూడా పట్టుబడుతున్నాడు కాబట్టి. చంద్రబాబు బిల్లును ప్రవేశపెట్టడం... ఆమోదం పొందడం.. అన్నీ జరిగిపోయాయి. దీంతో చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వమే.   కానీ ఇప్పుడు మోడీ చెబుతున్న మాటలు వింటుంటే.. అది జరగడం కాస్త కష్టమే అనిపిస్తోంది. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఈ ఎన్నికల్లో భాగంగా మోడీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ.. గత కొద్ది రోజులుగా  జరుగుతున్న గుజరాత్ రిజర్వేషన్లపై వ్యాఖ్యానించారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సంస్థ తమకు రిజర్వేషన్లు కావాలంటూ గతంలో పెద్దఎత్తున పోరాటం చేశారు అయితే అప్పట్లో రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలిస్తామన్న బీజేపీ దానిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ వారికి రిజర్వేషన్ల హామీని ఇచ్చింది. దీంతో ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. దీంతో 'యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీయే అవుతుంద'ని అన్నారు. అంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని దాటడం వీలుపడదని స్పష్టం చేశారు.   దీంతో ఇప్పుడు కాపు రిజర్వేషన్లపై అనుమానం కలుగుతోంది. చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంతో అది కాస్తా 55 కు చేరింది. ఇప్పటికే బీసీలో ఉన్న A,B,C,D గ్రూపులకు 25 శాతం రిజర్వేషన్లు, బీసీ E కేటగిరీలో ఉన్న మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే అన్నీ కలిపి 55 శాతం అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఇదే విషయం మోడీ చెప్పింది. ఒక్క ఏపీనే కాదు.. తెలంగాణలో కేసీఆర్ కూడా..  ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. దీంతో రెండు రాష్ట్రాలు 55 శాతాన్ని దాటాయి. ఇక ఇప్పుడు మోడీ చేసిన ఈ వ్యాఖ్యలవల్ల... ఇద్దరు చంద్రులు పరిస్థితి అయోమయంలో పడింది. మరి మోడీ చెబుతున్న మాటలు వింటుంటే... ఈ రిజర్వేషన్లకు పార్లమెంట్లో ఆమోదం లభించడం కష్టమే అనిపిస్తోంది. దీంతో మోడీ ఇద్దరికీ ఓ క్లూ ఇచ్చినట్టైంది. మరి ఈ బిల్లులు ఎంత వరకూ కార్యరూపం దాల్చుతాయో.. చూద్దాం...

అప్పుడే ఏడాది.. తమిళనాడుకు తీరని లోటు..

  డిసెంబర్ 5 ఈరోజు ఏంటో తెలియకపోవచ్చు కానీ.. కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకు మాత్రం అర్దమవుతుంది. ఈరోజే... తమిళనాడు రాజకీయాల్లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని.. తన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని నిరూపించిన.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. తమిళుల ఆరాధ్య దైవం జయలలిత మరణించిన రోజు. గత ఏడాది ఈరోజు.. తమిళనాడు శోక సంద్రంలో మునిగిపోయింది. తమిళ ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించిన రోజు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన రోజు. సంవత్సరం గడుస్తున్నా రాష్ట్రంలో ‘అమ్మ’ లేని లోటు అలాగే ఉంది. ఆమె మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి చోటుచేసుకుంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.   అమ్మ మరణానంతరం శశికళ తనలోని మరో రూపాన్ని చూపించింది. జయ ఉన్నంత కాలం సైలెంట్ గా ఉన్న ఆమె.. పదవి చేపట్టాలని బాగానే ప్రయత్నించారు. పార్టీపై పట్టు బిగించేందుకు ప్రయత్నించారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఇక సీఎం పగ్గాలు కూడా చేపడదామనుకున్న ఆమెకు..జయలలిత నమ్మినబంటు అయిన పన్నీర్ సెల్వం అడ్డుతగిలాడు. ఇక అప్పటినుండి.. అన్నాడీఎంకేలో అధికార పోరు జరుగుతూనే ఉంది. ముందు పన్నీర్ సెల్వం వర్గం... శశికళ వర్గం ఉండేది. ఆ తరువాత.. శశికళ సీఎంగా నియమించిన పళనిస్వామి కూడా ఎప్పుడైతే అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ జైలుకు వెళ్లిందో.. తనకు వ్యతిరేకంగా మారాడు. ఇక దాని తరువాత పన్నీర్ సెల్వం.. పళనివర్గాలు కలిసిపోయాయి. ఇక జైల్లో ఉండే... తన మేనల్లుడు దినకరన్ తో చక్రం తిప్పుదామని చూసింది. అది కూడా బిస్కట్ అయింది. పార్టీ గుర్తు వార్ లో దినకరన్ లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఆ తరువాత ఆమెకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు ఇదే అదనుగా చూస్తున్న బీజేపీ, డీఎంకేలు తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు  పావులు కదుపుతున్నాయి.   ఇంకా ఎన్నో మార్పులు వచ్చాయి జయ మరణానంతరం... జయ సీఎంగా ఉన్నన్నాళ్లూ ఉన్నామా, లేమా అన్నట్టుగా ఉన్న ఐటీ శాఖ ఒక్కసారిగా జూలు విదిల్చింది. వీఐపీలు సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసంలోనే సోదాలు చేపట్టింది. తమిళనాడు రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఐటీ శాఖ సచివాలయంలో దాడులు నిర్వహించడం అదే తొలిసారి. అంతేనా.. జయలలిత బతికి ఉండగా తాము జయలలిత వారసులమని ఒక్కరు కూడా బయటకు రాని వారు ఆమె మరణంతో కలుగులోని ఎలుకల్లా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఆమెకు అసలైన వారసులం తామేనని ప్రకటించి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇప్పుడు బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల తాను జయ కుమార్తెనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం సూచన మేరకు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.   ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నది మాత్ర నిజం. తాను చనిపోయిన ఏడాది గడుస్తున్న తమిళనాడు రాజకీయాల్లో ఇంకా స్తబ్దత.. అయోమయం ఉన్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఆ స్థాయి నేత కరువయ్యారు. ఇప్పుడు ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్పినా.. ఆమెలాగా చెరగని ముద్ర వేయడం చాలా కష్టం. తమిళనాడు ఆమె ఒక తీరని లోటు..

చంద్రబాబు అన్నలాంటోడు... కాకా పడుతున్న ఎంపీగారు...

  మొన్నటి వరకూ చిందులు వేసిన టీడీపీ ఎంపీ శివప్రసాద్ టోన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చంద్రబాబును కాకా పట్టే పనిలో పడినట్టు తెలుస్తోంది. కానీ ఎంపీగారు పప్పులు చంద్రబాబు దగ్గర ఉడకడం లేదు. దీనికి కారణం ఆయన చేసిన ఓవరాక్షనే కారణం. చంద్రబాబు, శివప్రసాద్ ఇద్దరూ సన్నిహితులు. దాంతోనే శివప్రసాద్ కు చంద్రబాబు ముందు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ తరువాత ఏకంగా...  ఎంపీ గా చేశారు. అయితే ఆ తరువాతే ఎంపీగారు కాస్త ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. వ్యక్తిగత డిమాండ్స్ తీరలేదన్న కోపంతో పార్టీ ని ఇబ్బంది పెట్టే చర్యలకు దిగారు. కొన్ని సభలు , వేదికల మీదే సొంత పార్టీపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీనే ఇరకాటంలో పెట్టారు. ఆయన్ను బుజ్జగించడానికి ప్రయత్నించిన నేతల మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయం బాబు చెవిన పడడంతో ఆయన కూడా శివ ప్రసాద్ తో మాట్లాడినా ఎంపీ గారి ధోరణి మారలేదు సరికదా వైసీపీ కి వెళుతున్నట్టు పార్టీని బెదిరించే సంకేతాలు ఇచ్చారు.   కానీ ఇప్పుడు ఏమైంది.... వైసీపీ పరిస్థితి ఏంటో బాగ అర్ధమైనట్టుంది. ఇప్పుడు రూట్ మార్చారు. చంద్రబాబు నాకు అన్నలాంటి వాడు అని పెద్ద డైలాగ్సే వాడుతున్నాడు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన... చంద్రబాబు, తాను ఆరోతరగతి నుంచి 11వ తరగతి వరకు కలిసి చదువుకున్నామని..అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఆయనను సొంత అన్నలా భావిస్తానని ఆయన చెప్పారు.తమ మధ్య గ్యాప్ అన్న ప్రశ్నే లేదని ఆయన తెలిపారు. తాను అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వకపోవడం అన్నది ఇంతవరకు జరగలేదని, అయితే ఒకసారి మూడు గంటలు ఆలస్యమైందని ఆయన చెప్పారు. తాను ఫోన్ చేశానని చెబితే అటునుంచి అరగంటలోపు ఫోన్ వస్తుందని ఆయన తెలిపారు. అలాంటి తమ మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తరువాత బోలెడు సమీకరణాలు ఉంటాయని, ఆయనపై చాలా బాధ్యతలు ఉంటాయని అన్నారు. వాటికి అనుగుణంగా ఆయన పని చేస్తుంటారని చెప్పారు. మొత్తానికి శివప్రసాద్ గారికి తెలిసొచ్చినట్టు ఉంది. ఎక్కువ ఎగిరితే..తనకు నష్టం జరగొచ్చు అన్న అనుమానం వచ్చిందేమో..అందుకే చంద్రబాబును ఏకంగా అన్నా అని కాకా పడుతున్నాడు. మరి ఎంపీగారి మాటలకు చంద్రబాబు మెత్త బడతారా.. లేదా..? చూద్దాం....

అటు మోడీకి.. ఇటు జగన్ కు చెక్...

  పాపం ముద్రగడ పాదయాత్రలు, నిరసనలు, దీక్షలు చేయకుండానే పని చాలా సులువుగా అయిపోయింది. ఏపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేసిన సంగతి తెలిసిందే కదా. బీసీ ఎఫ్ కేటగిరిలో కాపులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే చంద్రబాబు మరోసారి రాజకీయాల్లో తనకు ఎవరూ సాటిరారు అని నిరూపించారు. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్లు కల్పించి అటు జగన్ కు.. ఇటు కేంద్రానికి చెక్ పెట్టాడు. అదేలా అంటారా.. అక్కడే ఉంది మరి అసలు ట్విస్ట్..   కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని.. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీని ముద్రగడ సీరియస్ గా తీసుకొని దీక్షలు కూడా చేపట్టారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్లు చేశారు. అయితే అది కష్టమైన పని అని చంద్రబాబుకు తెలిసినా.. దానికి ఓ కమిటీ వేసి ఎలాగోలా 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటూ.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. దానికి ఆమోదముద్ర వేయించారు. ఇక అసెంబ్లీలో జగన్ అండ్ కో బ్యాచ్ ఎలాగూ లేదు.. ఒకవేళ ఉన్నా.. జగన్ ఎప్పటినుండో ఈ డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి.. నోరు మొదిపే అవకాశం లేదు. దీంతో చంద్రబాబు తన వంతుగా తన పని పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఈ బిల్లు పని కేంద్రం చేతిలో పడింది. కానీ.. అసలు విషయమంతా ఇక్కడే ఉంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఇప్పుడు కాపుల కోసం బీసీల్లో F కేటగిరీని సృష్టించి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే.. ఇప్పటికే బీసీలో ఉన్న A,B,C,D గ్రూపులకు 25 శాతం రిజర్వేషన్లు, బీసీ E కేటగిరీలో ఉన్న మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే అన్నీ కలిపి 55 శాతం అవుతున్నాయి.   కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంతో అది కాస్తా 55 కు చేరింది. కాబట్టి ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి విరుద్ధం. మరోవైపు ఈ రిజర్వేషన్ అమలు కావాలంటే తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలి. తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలంటే దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం. అప్పుడు గానీ కేంద్రం రౌండ్ సీల్ వేసే పరిస్థితి ఉండదు. కానీ త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్రం ఈ పని చేసి ఇరకాటంలో పడే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏపీలో కాపులకు రిజర్వేషన్ ఇస్తే.. ఇలాంటి డిమాండ్లే మిగిలిన రాష్ట్రాల్లో రాకమానవు. అదే జరిగితే సర్కారుకు తడిసి మోపెడవుతుంది. కాబట్టి దీనిపై కేంద్రం ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. సో చంద్రబాబుకు ఇది కలిసొస్తుంది. ఎన్నికల ప్రచారంలో..  రిజర్వేషన్ కల్పించాలని.. కేంద్రం నిర్ణయం తీసుకోవాలని.. చెప్పుకోవచ్చు. దీంతో అటు కాపు ఓట్లు కోసం ఎక్కడికిపోయే పరిస్థితి ఉండదు. మరోవైపు బీసీల నుండి కాస్త వ్యతిరేకత వస్తున్నా.. కాపులకు ఇచ్చే రిజర్వేషన్లలతో వారికి ఎలాంటి నష్టం లేదని చెబితే ఈ వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ఇదో వంకగా అసెంబ్లీలో రచ్చ చేసిన జగన్ కు పాపం..ఇక దేనిపై రచ్చ చేస్తాడో చూడాలి. మొత్తానికి చంద్రబాబు రాజకీయ చాణక్యుడని మరోసారి రుజువు చేశాడు. మరి కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది... ఎన్నికల లోపు బిల్లు పాస్ అవుతుందా.. చూద్దాం ఏం జరుగుతుందో..

కొత్త ట్విస్ట్.. జయలలిత కూతురే... శోభన్ బాబు చెప్పాడు...

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జయ వారసులమంటూ పలువురు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. మొదట కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను జయలలిత-శోభన్ బాబుల వారసుడనని...ఆస్తి తనకే చెందాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. ఆ వ్యక్తి అందించిన పత్రాలు నకిలీవి అని తెలిపి నాలుగు తిట్లు తిట్టి అతగాడిని జైలుకి పంపించింది. ఇక ఆ స్టోరీ అయిపోయిందనుకుంటే ఇప్పుడు అమృత అనే యువతి తాను జయలలిత కూతురినని మరో ట్విస్ట్ ఇచ్చింది. అంతేకాదు.. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించాలని కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోగా.. సుప్రీంకోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదనుకోండి.   అయితే ఇప్పుడు జయలలిత పై మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అమృత జయకు, నటుడు శోభన్ బాబుకు పుట్టిన సంతానమేనని జయ స్నేహితురాలు గీత తెలుపుతున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని శోభన్ బాబే తనతో స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. 1999లో తానొకసారి శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు జయకు తనకు ఒక కుమార్తె ఉన్న విషయాన్ని శోభన్ బాబు తనతో ప్రస్తావించారని ఆమె అన్నారు. ఆమె పేరు అమృత అని కూడా చెప్పారన్నారు. 1996 నుంచి జయలలితతో అమృతకు సంబంధాలు ఉండేవని.. డీఎన్ఏ పరీక్షల్లోనే అసలు విషయం తేలుతుందని ఆమె అన్నారు. ఈ విషయం జయ ప్రియసఖి శశికళకు కూడా తెలుసని చెప్పారు. జయ కూడా శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, ఆయన వివాహితుడు కావడంతో పెళ్లి చేసుకోలేకపోతున్నానని అంగీకరించిందని తెలిపింది. దీనిపై ఆమె అప్పట్లో స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ కూడా రాశారట. ఇక ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.   మరోవైపు సుప్రీంకోర్టు సూచనతో అమృత కర్ణాటక కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఇక జరుగుతన్న పరిణామాలు చూస్తుంటే అమృత వాదనలు నిజమేనేమో అనిపిస్తుంది. అంత ధైర్యంగా డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించాలని కోరిందంటే... నిజంగా ఆమె జయలలిత కూతురా అని ఏంటీ అని ఆలోచనలో పడ్డారు. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయి.. నిజంగా అమృత జయ కూతురేనా తెలియాలంటే ఆ నిజం తెలిసే వరకూ ఆగాల్సిందే...

జగన్, రోజా పాదయాత్రలు... వింతలే వింతలు..

  వింతలు చూడలంటే మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వైసీపీ నేతలు చేస్తున్న పాదయాత్రలు చూస్తే చాలు. కావల్సినన్ని వింతలు, విశేషాలు కనిపిస్తాయి.. వినిపిస్తాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో.. ఒకపక్క పాదయాత్ర చేస్తుంటే.. మరోపక్క ఎమ్మెల్యే రోజా కూడా పాదయాత్ర మొదలుపెట్టింది. వీళ్ల పాదయాత్రల్లోనే అసలైన వింతలు కనిపిస్తున్నాయి. అవేంటనుకుంటున్నారా.. ?   జగన్ కోసం ఒకటి, రెండేళ్ళ పసి బాలుడు కూడా వేచిచూడడం… మూడు, నాలుగేళ్ల పాప నిరాహార దీక్ష చేయడం… 40 ఏళ్ళ మహిళ ముసలి అవ్వ అయిపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే ఓ మహాభారతమే అవుతుంది. తాజాగా మరో వింత బయటపడింది. అదేంటంటే.. పట్టుమని పది నిముషాలు కూడా నిలబడలేని వికలాంగుడు ఏకంగా 12 కిలోమీటర్లు జగన్ వెంట నడిచాడట. ఆశ్యర్యం ఏంటంటే..ఆ పెద్దాయన గత పదేళ్లుగా మంచానికి పరిమితం అయ్యాడట. కనీసం పది నిముషాలు కూడా సదరు వ్యక్తి నిలబడలేడట. అలాంటిది.. జగన్ పాదయాత్రలో ఏకంగా 12 కిలో మీటర్లు నడిచాడట. డాక్టర్లు, దేవుళ్ళు కూడా సాధించలేని ఇలాంటి వింతలకు నిలయంగా జగన్ “ప్రజా సంకల్పయాత్ర” లో మాత్రం సాధ్యమవుతుంది.   ఇక రోజా పాదయాత్ర విషయానికి వస్తే.. అదో విడ్డూరం. పాపం ఏసీ గదుల్లో నుండి బయటకు వచ్చారు కదా.. అందుకే ఇదో పెద్ద విషయం లాగ అనిపిస్తుంది. ఇలాంటివి సామాన్య ప్రజలకు సర్వ సాధారణం అని తెలియదు కాబోలు. ఒక విధంగా చెప్పాలంటే అసలు వీటిని లెక్కే చేయరు. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇదో పెద్ద విషయం. అందుకే రోజా పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుండి.. ఆమె కాళ్లను చూపించడమే ఎక్కువైంది. ఆమె కాళ్లకు బొబ్బలెక్కడం.. వాటికి చికిత్స చేయించుకుంటున్న ఫొటోలు వేస్తూ హంగామా చేస్తున్నారు. ఇంకా అద్భుతం ఏంటంటే... తన కాళ్ళు చూపించాలంటూ చేసిన సైగలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో  రోజా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్లయ్యింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వింతలే బయటపడతాయి. రోజా హంగామా  కొద్ది రోజులే అయినా.. జగన్ పాదయాత్రలో మాత్రం మరో నాలుగైదు నెలల పాటు ఈ వింతలు, విడ్డూరాలు చూడాల్సిందే.

కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుందా...!

  తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఎలాంటి ఢోకా లేదు అని చెప్పొచ్చు కూడా. తెలంగాణ ఉద్యమ పోరాటంలో పుట్టిన ఈ పార్టీ..ఆ బలంతోనే అధికారాన్ని చేపట్టింది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే. ప్రత్యేక రాష్ట్ర విభజనలో తెలంగాణ ఉద్యమంలో అందరూ ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఈ ఉద్యమంలో జేఏసీ ఛైర్మన్ కోదండరాం...కీలక పాత్ర పోషించారు. అలాంటి కోదండరాంకే ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకమైంది. ప్రభుత్వ విధానాలపై కోదండరాం కూడా వ్యతిరేకతతో ఉన్నారు. కోదండరాం మాత్రమే కాదు... తెలంగాణ రాష్ట్రం రావడానికి ఓ రకంగా కారణమైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దులు కూడా కొంతమంది కేసీఆర్ కు వ్యతిరేకం అయ్యారు.   ఇక దీనిలో భాగంగానే కోదండరామ్ కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో తాజా వార్త బయటకు వచ్చింది. అదేంటంటే... కోదండరాం, గద్దర్  కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించబోతున్నారన్న వార్త వినిపిస్తోంది.  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ రహస్యంగా భేటీ కావడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. టీ.జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా రహస్యంగా భేటీ అయ్యారు. సుమార్ రెండు గంటలకు పైగా వీరిమధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. నేరుగా ప్రజా సంఘాలు, జేఏసీ నేతలతోనే చర్చలు జరపాలన్న రాహుల్ విజ్ఞప్తితో దూతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే కోదండరాం... గద్దరు నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త బెటరే. ఇక కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ పైనే యుద్దంచేయడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు ఇక వీళ్ల మద్దతు కూడా లభిస్తే కాంగ్రెస్ పార్టీ కాస్త బలం పుంజుకున్నట్టే. అసలే ఈ మధ్య టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుంది. మరి కేసీఆర్ ఇప్పుడైనా కాస్త కళ్లు తెరిచి జాగ్రత్త పడకపోతే అసలుకే మోసం వస్తుంది మరి.