తిరుమల దర్శనాలు.. ఫిబ్రవరి కోటా విడుదల వివరాలు!
posted on Nov 17, 2025 8:27AM
తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాలు, గదుల కోటాకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి. శ్రీవారి ఆర్జిత సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మంగళవారం (నవంబర్ 18) ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20 దయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చుని పేర్కొంది.
ఈ సేవా టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. వారికి టికెట్లు మంజూరవుతాయని తెలిపింది. ఇక ఆర్జిత సేవా టికెట్లు నవంబర్ 21న విడుదల చేయనున్నట్లుతెలిపింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను నవంబర్ 21 ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
ఇక వర్చువల్ సేవ టికెట్ల కోటా కూడా 21నే విడుదల చేయనున్నట్లు పేర్కొన్న టీటీడీ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను నవంబర్ 24న శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అదే నెల24న విడుదల చేయనున్నట్లు పేర్కొంది.వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా నవంబర్ 24నే విడుదల చేయనుంది.
ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అదే నెల 25న తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను నవంబర్ 25న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి మాత్రమే ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది.