చనిపోతున్నాననుకుని సిడ్నీ హీరో ఆఖరి సందేశం
posted on Dec 15, 2025 @ 4:53PM
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో తండ్రీకొడుకులైన ఉగ్రవాదుల దాడిలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సిరియా వలసదారు అహ్మద్ అల్ అహ్మద్ ఇప్పుడు రియల్ హీరోగా నిలిచారు. పండ్ల దుకాణం నడుపుకునే సాధారణ వ్యక్తి అయిన అహ్మద్.. తుపాకీ కాల్పుల మధ్య ఉగ్రవాదిని ధైర్యంగా అడ్డుకుని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ పోరాటం మధ్యలో ఆయన తన బంధువుతో.. "నేను చనిపోతున్నా. నాకేదైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు" అని పంపిన చివరి సందేశం యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది.
ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అహ్మద్ను ప్రశంసించారు. ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. తండ్రీకొడుకులైన ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న అహ్మద్ అల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రదాడి జరుగుతున్న సమయంలోనే అతడు.. ఈ పోరాటంలో నేను మరణిస్తాననిపిస్తోందని, ఈ విషయాన్ని తన కుటుంబానికి తెలియజేయాలని పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. ఆయన చేసిన ఈ చివరి మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి.
సిరియా దేశానికి చెందిన అహ్మద్ అల్ అహ్మద్.. నిత్యం అంతర్యుద్ధాలతో నలిగిపోయే తన దేశాన్ని వీడి మెరుగైన భవిష్యత్తు కోసం దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. దక్షిణ సిడ్నీలోని సదర్లాండ్ షైర్లో భార్యాపిల్లలతో (ఇద్దరు చిన్న పిల్లలు) కొత్త జీవితాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఒక పండ్ల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అహ్మద్.. తన సాధారణ జీవితంలో ఊహించని హీరోగా మారారు. ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన ఆదివారం ఉదయంబోండి బీచ్లో తన బంధువు జోజీ అల్కాంజ్తో కలిసి అహ్మద్ కాఫీ షాప్లో ఉన్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే వారు భయపడిపోయారు. అయితే వెంటనే తేరుకున్న అహ్మద్.. ఉగ్రవాదులను చూసి వారిని ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు.
అక్కడ ఏం జరగబోతోందో తెలిసిన ఆయన.. తన బంధువు అల్కాంజ్తో ఇలా అన్నారు: "నేను చనిపోబోతున్నా. నా కుటుంబాన్ని చూసుకో. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు" అని తన చివరి సందేశాన్ని ఇచ్చారు. ఈ హృదయ విదారక విషయాన్ని అల్కాంజ్ మీడియాకు వెల్లడించారు.ఈ ఘటన సమయంలో కాల్పులు జరుపుతున్న దుండగుల్లో ఒకడిని అహ్మద్ అడ్డుకున్నారు. వెనుక నుంచి వెళ్లి ధైర్యంగా ఆ దుండగుడి చేతిలోని తుపాకీని లాక్కున్నారు.
దీంతో ఆ ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. ఈ పోరాటానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఉగ్రవాదిని అడ్డుకునే ప్రయత్నంలో అహ్మద్ గాయపడగా.. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అహ్మద్ను ప్రశంసించారు. అహ్మద్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బోండి బీచ్ ఉత్సవంలో జరిగిన ఈ కాల్పుల దుర్ఘటనలో 16 మంది మరణించారు. కాల్పులు జరిపినవారు పాకిస్థాన్ నుంచి వచ్చిన తండ్రీకొడుకులని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోంది.