ముంబై విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. వివిధ విమానాల ద్వారా బ్యాంకాక్‌ నుండి  ముంబైకి చేరుకున్న స్మగ్లర్ల నుంచి   26 కోట్లు విలువ చేసే 26 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. వేరువేరు విమానాల ద్వారా బ్యాంకాక్ నుంచి ముంబై చేరుకున్న వీరు.. లగేజ్ బ్యాగులు, డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లు, వ్యక్తిగత వస్తువులలో దాచి అక్రమంగా తీసుకువచ్చిన విదేశీ గంజాయి అధికారుల తనిఖీల్లో బయటపడింది.  దీంతో  ఈ 9 మందినీ అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి స్మగ్లింగ్ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్నారు.  
Publish Date: Dec 5, 2025 9:43AM

శంషాబాద్ విమానా శ్రయంలో అయ్యప్పల ఆందోళన

హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన ఇండిగో విమానం 12 గంటలకు పైగా ఆలస్యం కావడంతో ఆ విమానంలో ప్రయాణించాల్సిన ఉన్న అయ్యప్ప భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు.  గురువారం (డిసెంబర్ 4)  సాయంత్రం బయలు దేరాల్సిన ఈ విమానం శనివారం (డిసెంబర్ 5) ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విమానం జాప్యంపై ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో అయ్యప్ప స్వాములు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు.    ఈ క్రమంలోనే స్వాములు  బోర్డింగ్ గేటు ముందు  బైఠాయించి నిరసన తెలియజేశారు.  తమ ప్రయాణానికి వెంటనే ప్రత్యామ్నాయ   ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  గంటల తరబడి వేచిచూడాల్సి రావడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, అలాగే భోజనం–వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
Publish Date: Dec 5, 2025 9:33AM

కిడ్నీ రాకెట్ కేసు.. ఏ2 డాక్టర్ పార్థసారథి లొంగుబాటు

మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో  కీలక పరిణామం చోటు  చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న డాక్టర్ పార్థసారథి రెడ్డి గురువారం మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి రెడ్డి కోసం గత కొంత కాలంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సంగతి తలిసిందే. కాగా లొంగిపోయిన డాక్టర్ పార్థసారథి రెడ్డికి న్యామూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు.    కిడ్నీ విక్రయం కోసం గత నెల 9న విశాఖకు చెందిన యమున  అనే యువతికి ఆపరేషన్ చేస్తుండగా ఆమె మరణించడంతో ఈ కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది.    విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలేనికి చెందిన సూరిబాబు భార్య యమున   కిడ్నీని గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.  విశాఖపట్నం వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు రూ.8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ క్రమంలో యమునకు శస్త్రచికిత్స చేస్తుండగా ఆమె మరణించారు. వెంటనే ఆమె   మృతదేహాన్ని అంబులెన్స్‌లో రహస్య ప్రాంతానికి తరలించారు. యమున భర్త ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.   ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  A1 డాక్టర్ ఆంజనేయులు, మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  మదనపల్లె ఎస్బిఐ కాలనీ కేంద్రంగా సాగిన గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో ఏ 2 నిందితుడు, బెంగుళూరు కి చెందిన డాక్టర్ పార్థసారధి రెడ్డి ఇప్పుడు పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లైంది.  
Publish Date: Dec 5, 2025 9:24AM

అఖండ2 సినిమా టికెట్@ రూ.5లక్షలు.. కొన్నదెవరో తెలుసా?

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అఖండ-2 సినిమా మానియా జోరుగా ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా అఖండ తాండవం చూడటం కోసం అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. అయితే.. ఈ రోజు విడుదల కావలసిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది.  అది పక్కన పెడితే బాలకృష్ణ నటించిన ఈ సినిమా టికెట్ ఐదు లక్షల రూపాయలకు ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేయడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.  అలా కొనుగోలు చేసింది మరెవరో  కాదు..  ఎమ్మెల్యే జగన్ మోహన్.  ఈ సందర్భంగా ఆయన ఓ అభిమానిగా ఈ సినిమా  విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిత్తూరుఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు.   బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు నగరంలో బాలకృష్ణ పేరుతో బస్సు షెల్టర్ నిర్మాణం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  
Publish Date: Dec 5, 2025 9:06AM

కోహ్లీ మానియాతో ఊగిపోతున్న విశాఖ

విశాఖపట్నం మొత్తం కోహ్లీ మానియాతో ఊగిపోతున్నది. విశాఖ వేదికగా  దక్షిణాఫ్రికాతో శనివారం (డిసెంబర్ 6) జరగనున్న మూడో వన్డే సందర్భంగా ఈ పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ విశాఖ వాసులు ఈ వన్డేపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎప్పుడైతే కోహ్లీ రాంచీ, రాయ్ పూర్ లలో జరిగిన తొలి వన్డేలలోనూ శతకాలు బాది.. తాను మళ్లీ పూర్వపు కోహ్లీ మాదిరిగా పరుగుల వేట ఆరంభించానని చాటోడో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.   విశాఖ వన్డే మ్యాచ్ వీక్షించాలన్న ఆసక్తి ఒక్క విశాఖ వాసుల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా వివరీతంగా పెరిగిపోయింది. ఇటువంటి స్పందన నభూతో అని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం  తొలి దశ టికెట్ల అమ్మకాలు గత నెల 28న  ప్రారంభమయ్యాయి. అయితే అప్పుడు టికెట్ల కోసం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆఫ్ లైన్ లో కౌంటర్లు ఏర్పాటు చేయక తప్పదేమోనని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ భావించింది. అయితే ఎప్పుడైతే రాంచీ, రాయ్ పూర్ లలో కోహ్లీ సెంచరీ చేశాడో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  రెండో, మూడో దశ టికెట్లు నిమిషాల వ్యవధిలో అయిపోయాయి. కోహ్లీ ఫామ్ లో ఉండటం, విశాఖ మైదానంలో కోహ్లీకి అద్భుత ట్రాక్ రికార్డు ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. విశాఖలో కోహ్లీ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడాడు. ఈ ఏడు మ్యాచ్ లలో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు ఎక్కువ అని ఆలోచించకుండా అభిమానులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కొనేశారు. అంతేనా గురువారం భారత జట్టు విశాఖ చేరుకుంది. ఈ జట్టు రాకకోసం అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుని గంటల తరబడి వేచి చూశారు.   
Publish Date: Dec 5, 2025 8:51AM

శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

  తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.  ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి,  టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు  పనబాక లక్ష్మి,  జానకి దేవి,  భాను ప్రకాష్ రెడ్డి,  నరేష్, అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ  లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.  
Publish Date: Dec 4, 2025 8:50PM

భారత్‌కు చేరుకున్న పుతిన్...అపూర్వ స్వాగతం పలికిన మోదీ

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నేడు ఢిల్లీ చేరుకున్నారు. పాలం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు ప్రధాని మోదీ  సాదరంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధాని ప్రోటోకాల్‌ను ప్రక్కకు పెట్టి పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు దేశాధినేతలు సమావేశం కానున్నారు.  ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పుతిన్‌ గౌరవార్థం రాత్రి ప్రధాని ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలకనున్నారు. అలాగే, 23వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌‌తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. మొత్తం 8 మంది మంత్రుల బృందంతో పుతిన్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ట్వీట్ చేసింది. అత్యంత పటిష్ఠ భద్రత మధ్య పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది.
Publish Date: Dec 4, 2025 8:37PM

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం : డిప్యూటీ సీఎం పవన్

  “వర్షించని మేఘం... శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే. అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలనే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని, ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని 10 వేల మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించగలిగామని అన్నారు.  ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి ఎంత కీలకమో తెలుసు కాబట్టే... ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హతే ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించామన్నారు. గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మీ అందరి మద్దతు. మీరు ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైంది.   • మన ఐక్యతే రాష్ట్రానికి బలం   కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా... మనందరం “రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదు " అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డాం. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజం. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయి. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారింది. ఈ రోజు ఇంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామంటే కారణం మనందరి ఐక్యతే. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది.    •   కష్టపడితేనే... ప్రతిఫలం   నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏనాడు కూడా గుర్తింపు కోరుకోలేదు. సమాజంలో నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలబడడమే నాయకుడి లక్షణం. నిస్వార్థంగా మన పని మనం చేసుకుపోతే గుర్తింపు, పదవి వాటికవే వస్తాయి. అంతే తప్ప పదవే పరామావధిగా భావించి పని చేస్తే అందలం ఎక్కడం కష్టం. ఏ వ్యక్తికి అయినా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదు.  మన జిల్లాకే తలమానికం అయిన శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటి వరకు దొరికిన సంపద కేవలం 10 శాతం మాత్రమే... దొరికిన పది శాతం విలువే వేలకోట్లలో ఉంటే... ఇప్పటి వరకు దొరకని సంపద విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందో  మనం అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను మనం నిలువరించాలి. అవినీతిని అరికట్టి బలహీనుల  గొంతుగా మారాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన  చంద్రబాబునే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వం అని గత పాలకులు మాట్లాడారు.  గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి భయపెట్టాలని చూడటం మనం చూశాం. అయినా జనసేన ఎక్కడా తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. జనసేన పార్టీ ముఖ్య లక్ష్యం  సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడం. ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని మరి గుర్తింపు ఇస్తాం. గ్రామ స్థాయి నుంచి లోక్ సభ నియోజక వర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం” అన్నారు.  స్వచ్ఛరథాలు పరిశీలన  స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లె ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. తిరుచానూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛ రథాల దగ్గరకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. పొడి చెత్త, పనికిరాని వస్తువులు తీసుకొస్తే ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు.  ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గురజాల జగన్మోహన్,  అరణి శ్రీనివాసులు,  కె. మురళీమోహన్,  అరవ శ్రీధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్,  శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  
Publish Date: Dec 4, 2025 7:15PM

సంధ్య థియేటర్ శ్రీ తేజ ఘటనపై దిల్ రాజు స్పందన

  ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్యా థియేటర్లో పుష్ప2 సినిమా చూడడానికి చూడడానికి వచ్చిన ఓ కుటుంబ సభ్యుల్లో శ్రీ తేజ తల్లి  మరణించగా... శ్రీ తేజ తీవ్రస్థాయిలో గాయపడ్డాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే ఇప్పుడు ఈ ఘటనపై దిల్ రాజ్ స్పందిస్తూ శ్రీ తేజ తండ్రిని కలిసి మాట్లాడారు. సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో, నిర్మాత దిల్ రాజు ఆయన కుటుంబానికి అందిస్తున్న సహాయంపై వివరాలు వెల్లడించారు. శ్రీ తేజ భవిష్యత్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ఆయన మీడియాతో పంచుకున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ... సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ మరియు అరవింద్ ఇద్దరు స్పందించడమే కాకుండా శ్రీ తేజ పేరుతో రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించానని చెప్పారు.  అయితే ఆ రెండు కోట్ల రూపాయలతో వచ్చే వడ్డీని ప్రతి నెల శ్రీ తేజ తండ్రికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఘటన అనంతరం ఆస్పత్రిలో జరిగిన చికిత్స కోసం అల్లు అర్జున్ మరియు అతని తండ్రి అరవింద్ దాదాపు రూ. 70 లక్షల వరకు చెల్లించినట్లు కూడా ఆయన వెల్లడించారు. అదే సమయంలో, శ్రీ తేజ పునరావాసానికి అవసరమైన రిహాబిలిటేషన్ ఖర్చులను పూర్తిగా అల్లు అర్జున్ భరిస్తున్నారని దిల్ రాజు తెలిపారు. అల్లు అర్జున్ టీం ఘటన జరిగిన మొదటి రోజు నుంచే సమగ్రంగా స్పందించారని, అవసరమైన అన్ని సహాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం శ్రీ తేజ తండ్రి మాట్లాడుతూప్రమాదం జరిగిన తర్వాత నుంచి చిత్రపరిశ్రమ అనేక విధాలుగా తమకు అండగా నిలుస్తోందని,అల్లు అర్జున్ టీం నుంచి వచ్చిన సహాయం ముఖ్య భరోసాగా మారిందని తెలిపారు.ఇంకా కొంత ఆర్థిక సహాయం అవసరమున్న నేపథ్యంలో దిల్ రాజుతో మాట్లాడగా, ఆయన అన్ని విధాల సహాయానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.శ్రీ తేజ ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో, కుటుంబ సభ్యులు, పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Publish Date: Dec 4, 2025 6:01PM

తెలుగు వన్‌కు 12 మిలియన్ సబ్‌స్క్రైబర్లు...ఘనంగా సంబరాలు

  తెలుగు డిజిటల్‌ ప్రపంచంలో మరో గర్వకారణమైన మైలురాయిని తెలుగు వన్ ఛానల్ అందుకుంది. 12 మిలియన్ సబ్‌స్క్రైబర్లను చేరుకోవడంతో, హైదారాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఛానల్ ఎండీ రవిశంకర్ కంఠమనేని ప్రత్యేకంగా హాజరై సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రవిశంకర్ కేక్ కట్ చేసి అందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి టీమ్ మొత్తం పెట్టిన కృషి, నిబద్ధత కారణమని పేర్కొన్నారు. “ఈ రోజు మనం జరుపుకుంటున్నది కేవలం ఒక మైలురాయి కాదు… మనపై ప్రేక్షకులు ఉంచిన విశ్వాసానికి ప్రతీక” అని చెప్పారు. ఇటీవలి సిల్వర్ జూబ్లీ వేడుకలతో తెలుగు వన్ తాను సాగించిన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా గుర్తుచేసుకున్నామని, ఇప్పుడు ఈ కొత్త విజయంతో మరొక మెట్టు ఎక్కినట్టేనని అన్నారు. సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడే కంటెంట్ అందించడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “మన తదుపరి లక్ష్యం 20 మిలియన్లు కాదు… నేరుగా 34 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు. తెలుగు వన్‌కి దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నాం” అని రవిశంకర్ అన్నారు.సంస్థలో కష్టపడి పనిచేస్తే ఉద్యోగులకు మరింత మంచి భవిష్యత్తు సిద్ధంగా ఉంటుందని సిబ్బందిని ఉత్సాహపరిచారు. “25 ఏళ్ల క్రితం తెలుగు వన్‌కు వేసిన ఫౌండేషన్‌… ఇప్పుడు కోట్లాది మంది ప్రేమతో మహా వృక్షంగా మారింది. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుదాం” అని ఎండీ రవిశంకర్ తెలిపారు
Publish Date: Dec 4, 2025 5:42PM

రెండేళ్లుగా ఒక గంట కూడా రెస్ట్ తీసుకోలేదు : సీఎం రేవంత్‌

  గత రెండేళ్లుగా ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చూట్టారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఆతర్వాత అభివృద్ధే లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.  ప్రజలకు మంచి చేయాలని నిరంతరం పనిచేస్తున్నట్లు రేవంత్ అన్నారు. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రజలు బీఆర్‌ఎస్ పాలనకు చమర గీతం పాడారని సీఎం అన్నారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు కావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాతో అన్నారు.  ఇదే విషయం నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీతో మాట్లాడాను అని సీఎం అన్నారు. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని రేవంత్ అన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ప్రాంతంలో ఎయిర్ బస్సు తీసుకొచ్చి నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నా అని తెలిపారు.
Publish Date: Dec 4, 2025 4:09PM

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో కీరవాణి కచేరీ

  భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ ప్రతినిధులను మన భిన్న సాంస్కృతిక, కళారూపాలతో ఆహ్వానించనున్నారు. ఈవేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహిత కీరవాణి తన అద్బుతమైన సంగీత కచేరితో అతిథులను అలరించనున్నారు. కీరవాణి 90 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కచేరిని నిర్వహించనున్నారు. ప్రముఖ వీణా విద్యాంసురాలు పి.జయలక్ష్మీ వీణా కార్యక్రమం, కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సంప్రదాయ కళా రూపాలు సందడి చేయనున్నాయి.  తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబించేలా కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గు డోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13 తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజులు పాటు జరిగే కార్యక్రమాల్లో రోజంతా సాంస్కృతిక కళారూపాలతో మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు.
Publish Date: Dec 4, 2025 3:17PM

తెలంగాణలో స్తంభించిన రవాణా శాఖ సేవలు

  తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖకు సంబంధించిన వాహన్-సారధి సేవలు మళ్లీ మొరయిస్తున్నాయి. తెలంగాణలో వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, నేమ్ ట్రాన్స్‌ఫర్, ఫిట్‌నెస్ వంటి కీలక సేవల కోసం ఉపయోగించే వాహన్–సారథి సెంట్రల్ సర్వర్ మరోసారి పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి జంటనగరాలతో సహా అన్ని జిల్లాల్లోని ఆర్‌టిఓ కార్యాలయాలకు చేరుకున్న వాహనదారులు  క్యూ లైన్లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.  సెంట్రల్ సర్వర్ కనెక్టివిటీ సమస్యలతో ఏ పని ముందుకు సాగకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికా రులు కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారు. సెంట్రల్ సర్వర్ స్పందించడం లేదని అధికారులు స్పష్టం వ్యక్తం చేశారు మా చేతుల్లో లేదు ఢిల్లీ లెవెల్ లో సమస్య ఉంది.. దానిని ఢిల్లీ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందని మాత్రమే అధికారులు చెబుతున్నారు.  దీంతో కార్యాలయాల్లో వాహనదారులు, స్టాఫ్ అందరూ నిరాశతో గడిపే పరిస్థితి ఏర్పడింది.కాగా, వాహన్–సారథి వ్యవస్థలో ఇదే తరహా అంతరాయాలు గత కొంతకాలంగా పునరావృతం అవుతుండటం ప్రజా సేవలపై ప్రభావం చూపుతున్నట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని, సేవలను నిరాటంకంగా అందించేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. రవాణా శాఖ సారధిలో తలెత్తిన సాంకేతిక సమస్యలు త్వరలో పరిష్కరమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో సాంకేతిక సమస్యలపై మంత్రి అధికారులతో మాట్లాడారు. సాంకేతిక సమస్యలు 3 గంటల్లో పూర్తిగా పరిష్కరమవుతాయని పొన్నం తెలిపారు.  
Publish Date: Dec 4, 2025 2:44PM

అమ్మకానికి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్!

పాకిస్థాన్  ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరింది. ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఐఎంఎఫ్ ఆర్థిక సహాయం తప్పని సరి. అయితే పాకిస్థాన్ ఆర్థిక అరాచకత్వంపై ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేసిన ఐఎంఎఫ్ పాక్ ను ఆదుకోవడానికి విధిస్తున్న ప్రతి షరతుకూ పాకిస్థాన్ తలొగ్గక తప్పడం లేదు. ఆ క్రమంలోనే ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ) ఒత్తిడికి తలొగ్గి తన జాతీయ విమానయాన సంస్థను అంగడి సరుకుగా మార్చేసింది. ఔను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఇందు కోసం ఈ నెల 23న బిడ్డింగ్ నిర్వహించనుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలోని వాటాలను పూర్తిగా అమ్మేయడానికి ఈ బిడ్డింగ్ జరగనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించారు. అంతే కాదు ఈ బిడ్డంగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కూడా సెలవిచ్చారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలోని 51శాతం నుంచి వంద శాతం షేర్లు అమ్మేయడానికి ఈ బిడ్డింగ్ జరగనుంది. పాకిస్థాన్ కు 7 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ అందించడానికి ముందుకు వచ్చిన ఐఎంఎఫ్.. ఆ ప్యాకేజీ అందించాలంటే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలంటూ విధించిన షరతు మేరకే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అన్నిటి కంటే ఆశ్చర్యం ఏమిటంటే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ కోసం బిడ్డింగ్ కు అర్హత సాధించిన నాలుగు కంపెనీలలో ఒకటి పాకిస్థాన్ నియంత్రణలో ఉండే ఫౌజీ ఫౌండేషన్ కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి కావడమే. మొత్తంగా పాకిస్థాన్ ఆర్థిక సుడిగుండంలోంచి బయటపడేందుకు ప్రభుత్వ సంస్థలను అయిన కాడికి అమ్మేయాల్సిన దృస్థితికి దిగజారింది. 
Publish Date: Dec 4, 2025 2:18PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటి? : టీపీసీసీ చీఫ్

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ దేశ సంపద అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అని అన్నారు. అలాంటి ఎస్పీ బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడంలో తప్పేంటని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌తో  లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మరోవైపు  దేవుళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సామెతను రాజకీయం చేయడం తగదని అన్నారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నట్లున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్ నగరంలో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. నగరం కూడా కాలుష్యరహితంగా మారుతుందని మహేశ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం  ఏం చేసినా కేసీఆర్ కుటుంబానికి అవినీతి మాదిరిగా కనిపిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేయిల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Publish Date: Dec 4, 2025 2:17PM

హిడ్మాది ఎన్ కౌంటర్ కాదు ముమ్మాటికీ హత్యే.. మావోయిస్టుల లేఖ

మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మాది ఎన్ కౌంటర్ కాదనీ, అది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యేనని సంచలన ఆరోపణ చేసింది   ఈ మేరకు వికల్ప్ పేరుతో  విడుదల చేసిన లేఖలో హిడ్మాను విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఆ తరువాత హత్య చేశారని ఆరోపించింది. అనారోగ్యంతో చికిత్స కోసం నవంబర్ 15న విజయవాడ వచ్చిన హిడ్మాను  అదే రోజు పోలీసులు అదుపులోనికి తీసుకుని.. మూడు రోజుల తరువాత అంటే నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి  తీసుకెళ్లి హత్య చేశారని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపించింది.   హిడ్మా కదలికల సమాచారాన్ని లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని కమిటీ ఆరోపించింది. ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉందని పేర్కొంది.  హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను మావోయిస్టు పార్టీ దండకారణ్య జోనల్ కమిటీ ఖండించింది. మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమే ఆ ఆరోపణలు అని పేర్కొంది.  ఆపరేషన్ కగార్‌ ను వెంటనే నిలిపివేయాలని,హడ్మా హత్య సహా ఎన్ కౌంటర్ లపై  న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో డిమాండ్ చేసింది.  
Publish Date: Dec 4, 2025 11:59AM