పిల్లల డైట్ ఎలా ఉండాలి..వాళ్లకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి.! 

పిల్లల సరైన ఎదుగుదలకు, శారీరక , మానసిక వికాసానికి సమతుల్యమైన ఆహారం చాలా అవసరం. చిన్నతనంలో మనం అందించే ఆహారపు అలవాట్లే వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. పిల్లలకు పెద్దల్లాగా తినడానికి ఎక్కువ ఛాయిస్ లు ఉండవు కాబట్టి ఏదో ఒకటి సమయానికి సాలిడ్ గా పెట్టేస్తే చాలని కొందరు తల్లులు అనుకుంటారు. కానీ నిజానికి పిల్లల ఆహారం ఎంత బలవర్థకంగా ఐతే.. వారి ఎదుగుదల అంత బలంగా ఉంటుంది. కాబట్టి పిల్లల రోజువారీ ఆహారం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల డైట్ ఎలా ఉండాలి, వారికి ఎలాంటి పోషకాలు అందించాలనేది ప్రతీ తల్లిదండ్రులూ తెలుసుకోవాలి. పిల్లలకు అందించాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థాలు.. ధాన్యాలు , పప్పుధాన్యాలు పిల్లల శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు వంటి ధాన్యాలు సహాయపడతాయి. ముఖ్యంగా రాగుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు వంటి పప్పుధాన్యాల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. ఇవి కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. తాజా కూరగాయలు , ఆకుకూరలు..  కూరగాయల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు , పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు రక్తహీనతను నివారిస్తాయి. క్యారెట్, బీట్‌రూట్, టమాటో వంటి వివిధ రకాల రంగురంగుల కూరగాయలను పిల్లల ఆహారంలో భాగం చేయడం వల్ల వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తాజా పండ్లు.. పిల్లల రోజువారీ ఆహారంలో కనీసం ఒక పండు ఉండేలా చూడాలి. అరటిపండు, యాపిల్, జామ, బొప్పాయి, నారింజ వంటి పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్ సి , ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. వీటిని జ్యూస్‌ల రూపంలో కాకుండా నేరుగా పండ్లుగా తినిపించడం వల్ల పీచు పదార్థం కూడా పూర్తిగా అందుతుంది. పాలు , పాల ఉత్పత్తులు..  పిల్లల ఎముకలు , పళ్ళు దృఢంగా మారడానికి క్యాల్షియం చాలా అవసరం. దీనికోసం ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాలు తాగించాలి. పాలతో పాటు పెరుగు, మజ్జిగ, పన్నీర్ వంటివి అందించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుడ్లు , మాంసాహారం.. శాఖాహారంతో పాటు గుడ్లు, చేపలు, చికెన్ వంటివి తినిపించడం వల్ల నాణ్యమైన ప్రొటీన్ , ఐరన్ అందుతాయి. వారానికి కొన్ని రోజులు ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండు ఫలాలు , విత్తనాలు..  బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా వంటి ఎండు ఫలాలలో మంచి కొవ్వులు , విటమిన్లు ఉంటాయి. ఇవి పిల్లల మేధస్సును, జ్ఞాపకశక్తిని పెంచడానికి తోడ్పడతాయి. స్నాక్స్ సమయంలో జంక్ ఫుడ్ కి బదులుగా వీటిని అందించవచ్చు. పిల్లల డైట్ విషయంలో జాగ్రత్తలు.. జంక్ ఫుడ్ , ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, బేకరీ తిండికి పిల్లలను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి... ఆహారం సిద్ధం చేసేటప్పుడు పరిశుభ్రత చాలా ముఖ్యం. అలాగే పిల్లలు రోజూ తగినంత నీరు తాగేలా చూడాలి. పిల్లలకు ఒకే రకమైన ఆహారం ఇవ్వకుండా, ప్రతిరోజూ వేర్వేరు రుచులు , రంగులు ఉన్న పదార్థాలను విభిన్నంగా వండి పెడితే వారు ఉత్సాహంగా తింటారు. సరైన సమయంలో, సమతుల్యమైన పోషకాహారాన్ని అందించడం ద్వారా పిల్లలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచవచ్చు.                          *రూపశ్రీ.  

చిన్న పిల్లలు గురక పెట్టడం సహజమేనా..ఏ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.!

చిన్న పిల్లలు నిద్రలో అప్పుడప్పుడు గురక పెట్టడం సాధారణంగానే కనిపించవచ్చు. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ లేదా అలర్జీ కారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు తాత్కాలికంగా గురక రావచ్చు. అయితే ప్రతిరోజూ లేదా తరచుగా గురక పెట్టడం మాత్రం  మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఇది పిల్లల శ్వాసకు సంబంధించిన సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  పిల్లలు గురక ఎందుకు పెడతారు? నిద్రలో శ్వాస వెళ్లే మార్గం కొద్దిగా ఇరుకుగా మారినప్పుడు గాలి కదలిక వల్ల గొంతులోని కణజాలాలు కంపించి గురక శబ్దం వస్తుంది. పిల్లల్లో దీనికి అనేక కారణాలు ఉండే అవకాశం ఉంది. జలుబు, ముక్కు దిబ్బడ.. జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ సమయంలో ముక్కు మూసుకుపోవడం వల్ల పిల్లలు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. దీంతో నిద్రలో గురక రావచ్చు. జలుబు తగ్గిన తర్వాత గురక కూడా తగ్గిపోతే సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ పెద్దగా ఉండటం.. పిల్లల్లో తరచుగా కనిపించే ముఖ్యమైన కారణాల్లో టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ పెరగడం ఒకటి. ఇవి గొంతు లేదా ముక్కు వెనుక భాగంలో ఉండే కణజాలాలు. ఇవి ఎక్కువగా పెరిగితే శ్వాస మార్గం ఇరుకుగా మారి గురక, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వంటి సమస్యలు రావచ్చు. అలర్జీలు.. దుమ్ము, ధూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటి వాటి వల్ల కొంతమంది పిల్లలకు అలర్జీ రావచ్చు. ముక్కు నిరంతరం మూసుకుపోవడం లేదా కారడం వల్ల రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గురక రావచ్చు.  నోటి ద్వారా శ్వాస తీసుకోవడం.. ముక్కు తరచుగా మూసుకుపోయే పిల్లలు నిద్రలో నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల నోరు తెరిచి నిద్రపోవడం, గురక పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. స్లీప్ అప్నియా.. కొంతమంది పిల్లల్లో Obstructive Sleep Apnea (OSA) అనే నిద్ర సంబంధిత శ్వాస సమస్య ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో నిద్రలో శ్వాస మార్గం కొంతసేపు మూసుకుపోయి, శ్వాస ఆగినట్లు అనిపించి మళ్లీ ప్రారంభమవుతుంది. ఇది సాధారణ గురక కాదు.. దీన్ని కాస్త సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది.   పిల్లల గురకతో పాటు కింది లక్షణాలు కనిపిస్తే పిల్లల గురకను నిర్లక్ష్యం చేయకుండా పిల్లల వైద్యుడిని సంప్రదించడం మంచిది..  ప్రతిరోజూ లేదా వారంలో ఎక్కువ రాత్రులు గురక పెట్టడం,  నిద్రలో శ్వాస ఆగినట్లు కనిపించడం,  నిద్రలో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం,   నిద్రలో ఉలిక్కిపడటం లేదా తరచుగా మేల్కొనడం. నోరు తెరిచి నిద్రపోవడం,   ఉదయం లేవగానే నోరు పొడిగా ఉండటం,  పగటిపూట ఎక్కువగా నిద్రమత్తుగా ఉండటం,   పిల్లల్లో ఏకాగ్రత లేదా ప్రవర్తనలో మార్పులు కనిపించడం, ఉదయం తలనొప్పి రావడం,  ఎదుగుదల లేదా బరువు పెరుగుదల సరిగా లేకపోవడం.  ఇవన్నీ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి గురకకు చికిత్స అవసరమా? సాధారణ గురకకు చికిత్స అవసరం లేదు. జలుబు లేదా తాత్కాలిక ముక్కు దిబ్బడ వల్ల వచ్చే గురక సాధారణంగా సమస్య తగ్గిన తర్వాత తగ్గిపోతుంది. అయితే గురక తరచుగా వస్తుంటే, చాలా బిగ్గరగా ఉంటే లేదా నిద్రలో శ్వాసకు అంతరాయం కలిగిస్తే..  కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. వైద్యుడు పిల్లల ముక్కు, గొంతు, టాన్సిల్స్, అడినాయిడ్స్ తదితరాలను పరిశీలించి అవసరమైతే మరిన్ని పరీక్షలు సూచించవచ్చు.                                                                                                                                                   *రూపశ్రీ.

పిల్లలకు టీ, కాఫీ ఇస్తున్నారా..ఈ ప్రమాదాలుంటాయని తెలుసా.!

టీ, కాఫీలు భారతీయులకు చాలా ఎమోషనల్ డ్రింక్స్.. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయాన్నే కాఫీ లేదా టీ కచ్చితంగా సిద్దమవ్వాల్సిందే..  పెద్దలు కాఫీ, టీలు తాగుతుంటే.. పిల్లలు పాలు తాగడం జరుగుతుంది. కానీ కొన్ని ఇళ్లలో పిల్లలు కూడా కాఫీ, టీ చాలా ఇష్టంగా తాగుతుంటారు. పిల్లలు ఇలా కాఫీ, టీ తాగడం పెద్దగా సమస్య లేదని, ఇదేమంత ఇష్యూ కాదని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ చిన్న వయసులోనే పిలలలకు కాఫీ, టీ లు ఇవ్వడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులో పిల్లలు కాఫీ, టీ తాగడానికి అలవాటు పడితే కలిగే నష్టాల గురించి పిల్లల ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలకు కాఫీ, టీ ఎందుకు ఇవ్వకూడదు?  పిల్లలు టీ లేదా కాఫీ తాగుతున్నట్లయితే, ఆ  అలవాటును వెంటనే మాన్పించాలని చిన్న పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీ , కాఫీ అస్సలు ఇవ్వకూడదు. అలాగే  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉంచాలట. హార్మోన్స్ ప్రభావం.. పిల్లలకు తగినంత నిద్ర లేకపోతే , వారి శరీరంలో పెరుగుదల హార్మోన్ ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. ఇది వారి పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా, క్రమం తప్పకుండా టీ, కాఫీ తాగడం పిల్లలలో కెఫిన్ వ్యసనానికి దారితీయవచ్చు. టీ, కాఫీ లు తాగే పిల్లలు నిద్రలేమి సమస్యతో బాధపడటం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం.. టీ , కాఫీ తాగడం వల్ల  పిల్లల ఆరోగ్యంపై  చాలా ప్రభావం పడుతుంది. ఇది వారి ఆకలిని తగ్గించి, చిరాకు, అశాంతి , ఆందోళనను పెంచుతుంది. అంతేకాకుండా, ఇది పిల్లల నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది.  రాత్రిపూట తరచుగా నిద్రకు అంతరాయం కలగడం, ఉదయాన్నే త్వరగా మేల్కొకోపవోడం..  మొత్తంమీద వారి నిద్ర సమయం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చక్కెర శాతం.. టీ, కాఫీలలో చక్కెర వాడకం తప్పనిసరి. చిన్న పిల్లలకు శరీరానికి అవసరమైనంత గ్లూకోజ్ వారి ఆహారంలోనే లభిస్తుంది.  పిల్లలు తీసుకునే ఇతర ఆహారాలలో కూడా గ్లూకోజ్,  చక్కెరలు ఉంటాయి.  అవి కాకుండా మళ్లీ కాఫీ, టీ లు తీసుకుంటే వాటిలో ఉండే చక్కెర కారణంగా చిన్నతనంలోనే డయాబెటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.                                           *రూపశ్రీ  

ప్రపంచ తల్లిపాల వారోత్సవం.. బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యం.!

పుట్టిన వెంటనే ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది.  ముఖ్యంగా భారతదేశంలో తల్లిపాల గురించి చాలా సెంటిమెంట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటారు. తల్లిపాలు వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం. దీనికోసం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ను కూడా ఎంచుకుంటారు.  "జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు: పనిచేసే వాటిని బలోపేతం చేయండి ". అనే థీమ్ ను 2026 సంవత్సరానికి ఎంచుకున్నారు.  తల్లిపాలు పట్టడాన్ని పెంచడంలో ఇప్పటికే విజయవంతమైన పద్ధతులను మరింత మెరుగుపరచడమే దీని లక్ష్యంగా చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. తల్లిపాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలల పాటు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ సమయంలో శిశువుకు నీరు, తేనె, ఆవు పాలు లేదా మరే ఇతర పదార్థాలు అవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలు మాత్రమే శిశువుకు కావలసిన అన్ని అవసరాలను తీరుస్తాయి. పుట్టిన వెంటనే విడుదలయ్యే చిక్కటి, పసుపు రంగు పాలను కొలోస్ట్రమ్ అంటారు, ఇది శిశువుకు చాలా ముఖ్యం. ఇందులో నవజాత శిశువును ఇన్ఫెక్షన్లు , వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. అందుకే, పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు పట్టడం చాలా అవసరమని వైద్యులు ఎల్లప్పుడూ చెబుతారు. తల్లిపాలలో  పోషక విలువలు.. శిశువుకు సుమారు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరేమీ తినిపించకూడదని చెబుతారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహార వనరు. ఒక నివేదిక ప్రకారం, శిశువు శారీరక, మానసిక వికాసానికి అవసరమైన ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు సరైన మోతాదులో తల్లిపాలలోనే  ఉంటాయి. తల్లిపాలలో ఉండే కొవ్వు శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడగా, ప్రోటీన్ శరీర కణాల నిర్మాణానికి తోడ్పడుతుంది. ఇందులో లాక్టోస్ అనే చక్కెర కూడా ఉంటుంది, ఇది శక్తిని అందిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా.. తల్లిపాలలో ఉండే యాంటీబాడీలు , తెల్ల రక్త కణాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. అందుకే తల్లిపాలు తాగే పిల్లలకు విరేచనాలు, న్యుమోనియా, చెవి ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) , యూనిసెఫ్ సిఫార్సుల ప్రకారం, 6 నెలల తర్వాత అనుబంధ ఆహారాలు ప్రవేశపెట్టినప్పటికీ, పిల్లలకు కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు తల్లిపాలు పట్టాలని చెబుతున్నారు.                                  *రూపశ్రీ.  

చిన్నపిల్లలకు జ్యూస్ లు, చక్కెక పానీయాలు ఇవ్వడం సరైనదేనా? వైద్యులు ఏం చెప్తున్నారంటే..!

  పిల్లలకు పండ్ల రసాలు, చక్కెర పానీయాలు, కోల్డ్ డ్రింక్స్ వంటివి తరచుగా తల్లిదండ్రులు ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా పిల్లలకు ఫ్రూట్ జ్యూస్ లు కొనివ్వడం వెనుక ఎలాంటి సమస్య ఉండదని కూడా అనుకుంటారు.   ఆరోగ్యకరమైనవని నమ్మి తరచుగా ఇస్తుంటారు. కోల్డ్ డ్రింక్స్ కంటే పండ్ల రసాలు ఇవ్వడమే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ తాజాగా జరిగిన ఒక పరిశోధనలో  షాకింగ్ నిజాలు బయట పడ్డాయి.  పిల్లల ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. పరిశోధనల ప్రకారం.. వారానికి మూడు సార్ల కంటే తక్కువగా చక్కెర కలిపిన పానీయాలను తీసుకునే వారితో పోలిస్తే, రోజూ రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు తాగే పిల్లలు , కౌమారదశలో ఉన్నవారికి, పెద్దయ్యాక అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 52 శాతం ఎక్కువగా ఉంటుందట.రోజూ ఒకటిన్నర లేదా అంతకంటే ఎక్కువ సేర్విన్స్ పండ్ల రసం తాగే పిల్లలకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 35 శాతం ఎక్కువగా ఉంటుందట. పండ్లు తినడం హానికరం అని దీని అర్థం కాదు..  చక్కెర ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేదే కాదు.. దాన్ని ఏ రూపంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమని ఆహార నిపుణులు అంటున్నారు. పండులోని సహజ చక్కెర, జ్యూస్ లోని చక్కెర శరీరంపై వేర్వేరు ప్రభావాలను చూపుతాయి. చక్కెర పానీయానికి బదులుగా ప్రతిరోజూ ఒక పండును తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని 22 శాతం తగ్గించవచ్చని కూడా  పరిశోధనలో తేలింది. పండ్ల రసానికి బదులుగా పండును తినడం ఎంతో ఉత్తమం. పండును పూర్తిగా తింటే అందులో ఫైబర్ ఉంటుంది, ఇది శరీరం చక్కెరను నెమ్మదిగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నివారించవచ్చు. అయితే, జ్యూస్ చేయడం వల్ల చాలా వరకు పీచుపదార్థం తొలగిపోతుంది, ఫలితంగా చక్కెరలు వేగంగా శోషించబడతాయి. దీనిని పదేపదే తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, రక్తపోటును నియంత్రించే శరీర ప్రక్రియలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఫ్రక్టోజ్ తీసుకున్నప్పుడు..  ముఖ్యంగా చక్కెర పానీయాల ద్వారా తీసుకున్నప్పుడు, మొదట కాలేయానికి చేరుతుంది. ఇది శరీరంలో కొవ్వు ఏర్పడే ప్రక్రియను పెంచి, ఫ్యాటీ లివర్, ట్రైగ్లిజరైడ్స్ , పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో వాపు కారకాలను ప్రేరేపించి, రక్తనాళాల సాధారణ పనితీరును ప్రభావితం చేస్తుంది.  రక్తపోటు పెరగడానికి కూడా దీంతో సంబంధం ఉందని చెబుతారు. పండులో పీచుపదార్థం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు , పాలీఫెనాల్లు ఉంటాయి. ఈ మూలకాలన్నీ శరీరానికి మేలు చేస్తాయి.  పొటాషియం శరీరం నుండి అదనపు సోడియంను తొలగించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలీఫెనాల్లు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడానికి కూడా దోహదపడతాయి. అందువల్ల తీపి పానీయాలు లేదా జ్యూస్లు తాగడం వల్ల కలిగే ప్రమాదాలు పండును పూర్తిగా తినడం వల్ల కలగవు. ప్యాక్ చేసిన పండ్ల రసాలు, చక్కెర కలిపిన పాల పానీయాలు , స్పోర్ట్స్ డ్రింక్స్  మొదలైన వాటిని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కోల్డ్ డ్రింక్స్ కంటే ఇవి చాలా బెస్ట్ అని కూడా అనుకుంటారు. అయితే 100% పండ్ల రసంలో కూడా అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది అంతేకాకుండా పండులో ఉండే పీచుపదార్థం ఇందులో ఉండదు. అందువల్ల ఫ్రూట్ జ్యూస్ లను రోజువారీ హెల్తీ డ్రింక్స్ లో భాగంగా కాకుండా చాలా పరమితంగా తీసుకోవాలి. ఈ జ్యూస్ ల కంటే..  పిల్లలకు నీరు , పాలు మంచి ఛాయిస్ లు గా  పరిగణించబడతాయి, అయితే పండును పిల్లలకు స్నాక్గా ఇవ్వడం  మంచిది.                               *రూపశ్రీ.  

పసిపిల్లల విసుగు పుట్టించే ప్రవర్తనతో విసిగిపోతున్నారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

పసిపిల్లల విసుగు పుట్టించే ప్రవర్తనతో విసిగిపోతున్నారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా! పిల్లలను పెంచడం ఎంత ఛాలెంజెస్ తో  కూడుకున్నదో, అంతే అందమైనది కూడా. ముఖ్యంగా ఇంట్లో పసిపిల్లలు, అంటే 1 నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉన్నప్పుడు, వారి కొన్ని అలవాట్ల వల్ల తల్లిదండ్రులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ప్రతిదానికీ 'వద్దు' అని చెప్పడం, చిన్న విషయాలకే ఏడవడం లేదా కోపగించుకోవడం, ఆహారాన్ని పారేయడం వంటి పనులు చేస్తుంటారు. తమ పిల్లలు ఇలా ఎందుకు చేస్తున్నారని తల్లిదండ్రులను ఆలోచించేలా చేస్తాయి. కానీ చిన్న పిల్లల వైద్య  నిపుణులు ఈ ప్రవర్తన చాలా వరకు సాధారణమైనవేనని, ఇవి పిల్లల ఎదుగుదలలో ఒక సహజమైన భాగమని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిల్లలు అన్నింటికి వద్దని చెబుతుంటే.. పిల్లలు ప్రతిదానికీ 'కాదు' అని చెబితే, అది మొండితనం  లేదా పెద్దల మాట వినడం లేదని అనుకోవడం కాదని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు.  నిజానికి అది  పిల్లలు తమకంటూ ఒక స్వతంత్ర గుర్తింపును ఏర్పరచుకోవడం నేర్చుకుంటున్నారనడానికి ఒక సంకేతమట. ఈ వయస్సులో, పిల్లలు తమకు తమ సొంత ఇష్టాలు, అభిప్రాయాలు ఉండవచ్చని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారట. 'కాదు' అని చెప్పడమనేది వారు తమ నిర్ణయాలను వ్యక్తపరిచే ఒక మార్గంగా మారుతుందట. ఆహారాన్ని పారవేసే అలవాటు.. భోజనం చేసేటప్పుడు పిల్లలు ఆహారాన్ని విసిరేయడం చాలా మంది తల్లిదండ్రులకు ఒక పెద్ద ఆందోళన కలిగించే విషయం. ఈ అలవాటు వల్ల కచ్చితంగా  పిల్లల చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చిందరవందర అవుతుంది, అయితే  ఇది పిల్లలు నేర్చుకునే దశ..   పిల్లలు ఈ విధంగా కారణం-ఫలితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని పిల్లల వైద్యులు చెబుతున్నారు. కొన్ని సార్లు పిల్లలు ఇలా చేయడం  వారి కడుపు నిండిపోయిందని, ఇంకా తినడానికి ఇష్టపడటం లేదని సూచించే ఒక సంకేతం కావచ్చని అంటున్నారు. ఏడుపు, కోపం.. పిల్లలు చిన్న చిన్న విషయాలకే గట్టిగా ఏడవడం లేదా కోపగించుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు, వారికి ఇష్టమైనది ఏదైనా దొరక్కపోయినా లేదా ఒక చిన్న మార్పు జరిగినా వారి మూడ్ పాడవుతుంది. ఈ వయస్సులో పిల్లల మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం పూర్తిగా అభివృద్ధి చెందదని చిన్న పిల్లల వైద్యులు వివరిస్తున్నారు. అందువల్ల, పెద్దలకు చిన్నవిగా అనిపించే విషయాలు పిల్లలకు చాలా ముఖ్యమైనవిగా ఉండవచ్చట. చాలామంది పసిపిల్లలు ఒకే కథను పదే పదే వినాలని, ఒకే పాటను వినాలని, లేదా ప్రతిరోజూ ఒకే దినచర్యను అనుసరించాలని కోరుకుంటారు. తల్లిదండ్రులకు ఈ అలవాటు విసుగుగా అనిపించవచ్చు, కానీ పునరావృతం పిల్లలకు భద్రతా భావాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. సుపరిచితమైన విషయాలు వారికి సౌకర్యవంతంగా అనిపించేలా చేసి, అభ్యసన ప్రక్రియను బలపరుస్తాయి. బొమ్మలు షేర్ చేసుకోవడం.. ఈ వయస్సు పిల్లలలో బొమ్మలు లేదా వస్తువులను పంచుకోవడానికి అస్సలు  ఒప్పుకోరు.  గొడవ చేయడం  కూడా సర్వసాధారణం. పసిపిల్లలు సహజంగానే స్వార్థపరులుగా ఉంటారని, పంచుకోవడం గురించిన నిజమైన అవగాహన సాధారణంగా మూడు నుండి నాలుగు సంవత్సరాల వయస్సులో అభివృద్ధి చెందుతుందిని, అందువల్ల పిల్లవాడు తన బొమ్మలు, వస్తువులు  పంచుకోవడానికి ఇష్టపడకపోతే, దానిని తప్పు ప్రవర్తనగా కాకుండా వారి వయస్సుకు తగినదిగా పరిగణించాలని పిల్లల వైద్యులు చెబుతున్నారు. కాబట్టి  ఎవరైనా సరే.. పిల్లల ప్రవర్తన పైన చెప్పుకున్న విధంగా ఉంటే.. తమ పిల్లలు దురుసు ప్రవర్తనతో ఉన్నారని, వారు తప్పు చేస్తున్నారని అనుకోకుండా.. పిల్లల కోణం నుండి ఆలోచించి, అది వారి అభివృద్దికి మంచిదే అని అర్థం చేసుకోవాలి.                             *రూపశ్రీ.

జాగ్రత్త.. ఈ ఆహారపు అలవాట్లు పిల్లలలో తొందరగా డయాబెటిస్ కు కారణం అవుతాయ్!

జాగ్రత్త.. ఈ ఆహారపు అలవాట్లు పిల్లలలో తొందరగా డయాబెటిస్ కు కారణం అవుతాయ్! మారుతున్న జీవనశైలి కేవలం పెద్దవారిని, వయోవృద్ధులను మాత్రమే కాకుండా, పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ రోజుల్లో పిల్లలలో ఊబకాయం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం కేవలం బయటి ఆహారం లేదా జంక్ ఫుడ్ మాత్రమే కాదు, ఇంట్లో అలవడిన కొన్ని ఆహారపు అలవాట్లు కూడా క్రమంగా పిల్లల బరువును పెంచుతాయి. పిల్లల ప్రతి అవసరాన్ని తీర్చడం తల్లిదండ్రులుగా తమ బాధ్యత అని, తాము అనుభవించని సుఖమయమైన జీవితాన్ని తమ పిల్లలకు ఇవ్వాలని తల్లిదండ్రులు అనుకుంటారు.  కానీ తెలియకుండానే తల్లిదండ్రులు చేసే కొన్ని  అలవాట్లే భవిష్యత్తులో పిల్లలలో ఊబకాయానికి కారణమవుతాయి. వీటి పట్ల ముందుగానే శ్రద్ధ తీసుకోకపోతే  పిల్లలు చిన్న వయసులోనే ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. పిల్లల ఊబకాయానికి దారితీసే కారణాలు ఏమిటో, ఆహారపు అలవాట్లు, ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే.. ఆహారం ఇచ్చే సమయం..  పిల్లలకు ఏదో పెట్టాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అయితే  ఆకలిగా ఉన్నారని చెప్పిన ప్రతిసారీ వారికి వెంటనే ఏదైనా తినడానికి ఇవ్వడం మొదటి అలవాటు. కొన్నిసార్లు, పిల్లలకు నిజంగా ఆకలిగా ఉండదు, కానీ విసుగు, అలవాటు లేదా తినాలనే కోరికతో ఆహారం అడుగుతారు. అటువంటి పరిస్థితిలో వారికి ప్రతిసారీ ఏదో ఒకటి ఇవ్వడం అతిగా తినడానికి దారితీస్తుంది. దీనిని నివారించడానికి, పిల్లలకు భోజనం , స్నాక్స్ కోసం టైం సెట్ చేసుకోవడం మంచిది. స్నాక్స్.. ఇంట్లో ఎప్పుడూ స్నాక్స్ స్టాక్ ఉంచడం,  తినాలని అనిపించినప్పుడు లేదా తీరిక దొరికినప్పుడు టైం పాస్ కోసం  ఏదో ఒకటి తినడానికి ఇవ్వడం కొందరు తల్లులు చేసే అలవాటు.  జర్నీలో ఉన్నా, పిల్లలు  స్కూల్ కు వెళ్తున్నా, స్కూల్ బ్యాగ్ లో అయినా లేదా బయటకు వెళ్లేటప్పుడు పిల్లల కోసం హ్యాండ్ బ్యాగ్ లో అయినా ఏదో ఒకటి తినడానికి పెట్టడం తల్లుల అలవాటు.   కానీ ఇలా స్నాక్స్ తినడం వల్ల పిల్లలు నిజమైన ఆకలిని అర్థం చేసుకోలేరు. ఇది పిల్లలు అధిక కేలరీలు తీసుకోవడానికి దారి తీస్తుంది. ప్రతిసారీ  పిల్లలకు చిప్స్, కుకీలు లేదా స్వీట్లు ఇవ్వడానికి బదులుగా పండ్లు, కూరగాయలు లేదా తేలికపాటి, ఆరోగ్యకరమైన స్నాక్స్  ఇవ్వడం మంచిది. స్పెషల్ ఐటమ్స్ వండటం..  పిల్లల కోసం ఏదైనా స్పెషల్ గా వండటం చాలామంది తల్లులు చేస్తుంటారు.  చాలా ఇళ్లలో పిల్లలు రోజూ ఇంట్లో చేసిన లంచ్ లేదా డిన్నర్ వంటివి  తినకపోతే, వారికి మ్యాగీ, ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్స్ లేదా ఇతర ఇష్టమైనవి చేసి ఇస్తుంటారు. పిల్లలు ఏదో ఒకటి కడుపు నిండా తింటే చాలని అనుకుంటూ ఉంటారు.  దీనివల్ల పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తినడం మానుకుని, తమకు ఇష్టమైనవే  కావాలని మొండి చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనిని అవాయిడ్ చేయడానికి ఇంట్లోని మిగతా అందరిలాగే  పిల్లలు కూడా సమతుల్యమైన భోజనం తినేలా  అలవాటు చేయడం ముఖ్యం. అన్నింటికంటే ప్రమాదకరమైన అలవాటు..  పిల్లలకు దాహం వేసినప్పుడు నీటికి బదులుగా,  అలాగే ప్రతి రోజూ పాలకు బదులుగా తీపి పానీయాలు ఇవ్వడం. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఫ్లేవర్డ్ డ్రింక్స్ లేదా స్వీట్  సిరప్‌లు పిల్లల శరీరానికి త్వరగా అధిక చక్కెరను అందిస్తాయి. ఈ చక్కెర భవిష్యత్తులో బరువు పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, పిల్లలలో నీరు త్రాగే అలవాటును పెంచాలి.  తీపి పానీయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ పొరపాట్లను చేయకండి.. అన్నింటికన్నా ముఖ్యమైనది, పిల్లల బరువును తరచుగా నెగిటివ్ గా చూస్తారు లేదా దాని గురించి అస్సలు పట్టించుకోరు. ఈ రెండు పద్ధతులూ తప్పు. పిల్లలను అవమానించే బదులు, కుటుంబాలు ఆరోగ్యకరమైన ఆహారం , చురుకైన జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఐదు ఆహారపు అలవాట్లను చిన్న వయస్సులోనే మెరుగుపరిస్తే, పిల్లలను ఊబకాయం నుండి చాలా వరకు కాపాడవచ్చు.                                   *రూపశ్రీ.

పిల్లలు ఎత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!

పిల్లలు ఎత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా, బలంగా , పొడవుగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల ఎత్తు అనేది వంశపారంపర్యత, పోషణ, శారీరక శ్రమ , జీవనశైలి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎత్తు పెరుగుదలలో జన్యువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం , ఆరోగ్యకరమైన అలవాట్లు పిల్లల ఎత్తును  మెరుగుపరచడంలో సహాయపడతాయి.  తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు పొడవు పెరగడం లేదని  ఆందోళన చెందుతూ, రకరకాల పరిష్కారాల కోసం చూస్తుంటారు. కొన్ని ఇంటి చిట్కాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం పిల్లల శారీరక అభివృద్ధికి తోడ్పడుతుంది.  పిల్లల ఎత్తు మెరుగ్గా ఉండటానికి సహాయపడే చిట్కాలేంటో తెలుసుకుంటే.. పాలు, పాల ఉత్పత్తులు.. పాలు, పెరుగు, జున్ను , ఇతర పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్ , విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను బలపరచడానికి , శరీర పెరుగుదలకు సహాయపడతాయి.  పిల్లల ఆహారంలో క్రమం తప్పకుండా పాలు చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్.. శరీర కణాలు , కండరాల అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం.  పిల్లలకు పప్పులు, గుడ్లు, సోయాబీన్, జున్ను, పాలు , డ్రై ఫ్రూట్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. వ్యాయామం, క్రీడలు.. శారీరక కార్యకలాపాలు పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. తాడుతో గెంతులు వేయడం, సైక్లింగ్, ఈత , ఇంటి బయట ఆడుకునే  ఆటలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.  ఇవి ఎముకలు,  కండరాల అభివృద్ధికి సహాయపడతాయి. నిద్ర.. గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో పెరుగుదల హార్మోన్ అధికంగా స్రవిస్తుంది. పిల్లలు వారి వయసుకు తగినట్లుగా తగినంత, నాణ్యమైన నిద్ర పొందడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్  వద్దు.. అధికంగా జంక్ ఫుడ్ , చక్కెర పానీయాలు తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెరుగైన ఎదుగుదల కోసం, సమతుల,  పోషకమైన ఆహారంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం.                                      *రూపశ్రీ.

పిల్లలకు ఫార్ములా పాలు ఇచ్చేవారు చేసే అతిపెద్ద మిస్టేక్..!

  పిల్లలకు ఫార్ములా పాలు ఇచ్చేవారు చేసే అతిపెద్ద మిస్టేక్..!   తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని అంటారు. కానీ కొన్నిసార్లు పుట్టిన పిల్లలకు తల్లి పాలు సరిపడక లేక తల్లి ఆరోగ్యం సరిగా లేక.. వేరే ఇతర కారణాల వల్ల తల్లిపాలు ఇచ్చే వెసులుబాటు ఉండదు. అలాంటప్పుడు పిల్లలకు ఫార్ములా పాలు ఇవ్వమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఫార్ములా పాలను తయారు చేయడంలో, వాటిని నిల్వ చేయడంలో చాలా తప్పులు చేస్తుంటారు.  దీని వల్ల ఆ పాలలో  పోషకాలు సున్నా అవుతాయి. అంటే పోషకాలు నాశనం అవుతాయి. ఇలాంటి పాలు ఇచ్చినా పిల్లలకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది కానీ.. పోషకాలు మాత్రం లభించవు. ఇది పిల్లలకు నష్టం చేకూర్చడమే కాకుండా తల్లిదండ్రుల జేబులకు కూడా చెల్లు పెడుతుంది. అందుకే ఫార్ములా పాలు తయారు చేసే విధానం ఏమిటి? పిల్లలకు ఇవ్వడానికి సరైన మార్గం ఏమిటి? తెలుసుకుంటే.. సమయం.. ఫార్ములా పాలను ముందుగానే తయారుచేసుకుంటే , దానిని 24 గంటలు ఫ్రిజ్‌లో ఉంచవచ్చని పిల్లల వైద్య నిపుణులు  చెబుతున్నారు . కానీ ఆ పాలను  ఫ్రిజ్‌లోంచి తీసి వేడి చేసి ఉంటే  ఆ పాలను  1 గంటలోపు ఉపయోగించాలట. ఫార్ములా పాలను తయారు చేసి బిడ్డ ఆ పాలను తాగడం ప్రారంభించిన తర్వాత ఆ పాలను 1 గంటలోపు ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. అయితే బిడ్డ త్రాగడం ప్రారంభించకపోతే  గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల పాటు ఉపయోగించవచ్చట. ఫ్రిజ్ నుండి తీసిన పాలను ఒక గంట తర్వాత తిరిగి ఉపయోగించకూడదు లేదా తిరిగి వేడి చేయకూడదట.  అలాగ  తల్లి పాల లాగా ఫార్ములా పాలను ఫ్రీజ్ చేయలేరట. లేకుంటే దాని పోషకాలు,  పాల టెక్చర్ విచ్ఛిన్నమవుతుందట. పాల పౌడర్ బాక్స్  తెరిచిన తర్వాత దాని గడువు తేదీ చూసుకుని అలాగే ఎన్నాళ్లైనా వాడవచ్చు అనుకుంటే పొరపాటు. పాల పౌడర్ ప్యాకెట్ తెరవనంతవరకు అది గడువు తేదీ వరకు వాడుకునే అవకాశం కలిగి ఉంటుంది. కానీ.. పాల పౌడర్ ఓపెన్ చేసిన తరువాత   3 నుండి 4 వారాల వరకు మాత్రమే ఉపయోగించవచ్చు.                          *రూపశ్రీ.

పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు!

పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు!   పిల్ల‌ల ఎదుగుదలను చూసి సంతోషించని త‌ల్లిదండ్రులు ఉండ‌రు. అయితే ఈ క్ర‌మంలో తెలియ‌కుండానే వాళ్ల‌కి కొన్ని విష‌యాల‌లో అతిగా స్వేచ్ఛ‌ను ఇస్తుంటారు. మ‌రికొంత‌మంది .. పిల్ల‌ల‌కు అస్స‌లు స్వేచ్ఛ ఇవ్వ‌కుండా ప్ర‌తీ విష‌యంలో త‌ల్లిదండ్రులు చెప్పినట్లే చేయాల‌ని వాళ్ల మీద విప‌రీత‌మైన ఒత్త‌ిడి తెస్తారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పిల్ల‌లు మ‌న మాట లెక్క‌చేయ‌క‌పోవ‌డం లేదా అతి క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల‌న యాక్టివ్‌గా లేక‌పోవ‌డం వంటి దుష్ప్ర‌భ‌వాలు క‌లిగే అవ‌కాశం ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల వ‌ల‌న పిల్ల‌లు కొన్ని సంద‌ర్భాల్లో త‌ల్లిదండ్రుల మాట లెక్క‌చేయ‌డం మానేసి వారికి న‌చ్చిన‌రీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందుల‌ను కూడా మ‌న‌తో షేర్ చేసుకోవ‌డం త‌గ్గించి వారికి వారే సొంత నిర్ణ‌యాలు తీసుకొని పెడ‌దారిన ప‌డే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. అందుకే పిల్ల‌ల‌ను ఎలా పెంచాలో అనే విష‌యం గురించి తెలుసుకుందాం. 1. చ‌దువులో గాని, ఆట‌ల్లో గాని వారికి కావాల్సిన ప్రేర‌ణ‌ను మ‌నం అందించాలి. త‌ద్వారా వారిలో ఏదైనా సాధించ‌గ‌లం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ప్ర‌తీ విష‌యానికి వాళ్ల మీద చిరాకు ప‌డ‌డం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు దారి వైపు వెళ్లేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. 2. పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుండి స‌హాయ‌ప‌డే గుణాన్ని అల‌వాటు చేయాలి. చిన్న‌త‌నం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయ‌కూడ‌దు. ఇతరుల అవసరాలకి స్పందించేలా వారిని ప్రోత్స‌హించాలి. అందువ‌ల‌న వారు అంద‌రితో క‌లివిడిగా ఉంటూ స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణాన్ని అల‌వాటు చేసుకుంటారు. వారిలో ఏదో సాధించాల‌నే ఆశ‌యంతో పాటు ఇత‌రుల‌కు స‌హాయ‌ప‌డాల‌నే త‌ప‌న కూడా ఉండేలా వారిని ప్రోత్స‌హించాలి. 3. కొన్ని సంద‌ర్భాల్లో తెలియ‌కుండానే పిల్ల‌ల‌పై కోపాన్ని చూపిస్తాం . ఉదాహ‌ర‌ణ‌కు వారు మ‌న క‌ళ్ల ముందే ఏదైనా గోడ ఎక్క‌డం లేదా ప్ర‌మాద‌క‌ర వ‌స్తువుల‌తో ఆడుకోవ‌డం వంటివి చేసిన‌ప్పుడు ప‌ట్ట‌రాని కోపం వ‌స్తుంది. అయితే ఇలాంటి సంద‌ర్భాల‌లో మ‌నం కొంచెం నిగ్ర‌హంగా ఉంటూ వారిని ద‌గ్గ‌ర‌కు తీసుకొని అలా చేయ‌కూడ‌ద‌ని నెమ్మ‌దిగా చెప్పాలి. దాని వ‌ల‌న జ‌రిగే అన‌ర్ధాల‌ను వారికి వివ‌రించాలి. మ‌నం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా త‌యార‌య్యే ప్ర‌మాదం ఉంది. వారి అల‌వాటును మ‌నం వ్య‌తిరేకించ‌డం వారు స‌హించ‌లేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మ‌చ్చిక చేసుకోవాలి. 4. చాలా మంది తల్లితండ్రులు తమ బాగా చదువుకోవాలని అనుకుంటారు . అందువల్ల వారికి ఏ పని చెప్పకుండా ఎప్పుడూ చదువుకోమని చెప్తూ ఉంటారు .. అది చాలా తప్పు అలా చేయడం వల్ల పిల్లలు చాలా వత్తిడికి గురవుతారు . దానివలన లేనిపోని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది .. పిల్లలకి చదువు విలువ ఏంటో అర్దం అయ్యేలా చెప్పండి .. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి .. 5. అలాగే తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి .. చాలామంది పిల్లలకి స్కూల్ లో జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలవాటు . ఇంట్లో వారి మాటలు వినేవారు లేకపోతే వారు బయట స్నేహితులకి ఎక్కువ అలవాటు అయ్యే అవకాశం ఉంది . వారితో ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల వాళ్ళు కూడా ఏ విషయాలు దాచుకోకుండా అన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అది పిల్లల భవిష్యత్తు కి ఎంతో మేలు చేస్తుంది.  

పిల్లలతో మాట్లాడటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా పెరుగుతుంది!

పిల్లలతో మాట్లాడటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా పెరుగుతుంది! మీ బిడ్డ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే: చైల్డ్ డెవలప్మెంట్ మరియు ఆటిజంపై పూర్తి అవగాహన పరిచయం (Introduction) ప్రతి తల్లిదండ్రుల కల తమ పిల్లలు ఆరోగ్యంగా, తెలివైన వారుగా ఎదగాలని. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, మనం వారికి ఇచ్చే సమయం కంటే వారు చూసే 'స్క్రీన్' సమయమే ఎక్కువైపోతోంది. పిల్లల మెదడు అభివృద్ధి అనేది కేవలం వారు తినే ఆహారం మీద మాత్రమే కాదు, మనం వారితో గడిపే సమయం మరియు చేసే సంభాషణల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మొదటి కొన్నేళ్లు వారి జీవితానికి పునాది వంటివి. ఈ రోజు మనం పిల్లల ఎదుగుదల, ఆటిజం లక్షణాలు మరియు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ VIDEO లో వివరంగా తెలుసుకుందాం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) పిల్లల ఎదుగుదలలో మొదటి 1000 రోజులు (తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి రెండేళ్ల వరకు) అత్యంత కీలకమైనవి. జీవితకాల ప్రభావం: మొదటి ఆరేళ్లలో పిల్లలకు మనం అందించే భద్రత, ప్రేమ మరియు సంరక్షణ వారి జీవితకాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. డబ్బు కంటే సమయం మిన్న: మీరు సంపాదించే ఆస్తి కంటే, పిల్లలకు మీరు ఇచ్చే 'సమయం' వారి ఎదుగుదలకు ఎంతో అవసరం. దీనికి ఏదీ సాటి రాదు. మెదడు వికాసం: పిల్లలతో మాట్లాడటం, వారి కళ్ళలోకి చూసి నవ్వడం వల్ల వారి మెదడులోని నాడులు చురుగ్గా మారుతాయి. ఏమి చేయకూడదు? (What Not to Do) అధిక స్క్రీన్ టైం: పిల్లలకు ఫోన్లు లేదా టీవీలు అలవాటు చేయకండి. ఇది వారి గణిత మరియు భాషా సామర్థ్యాలను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మానవ సంబంధాలను విస్మరించడం: స్క్రీన్ ద్వారా నేర్చుకునే దానికంటే, మనుషులతో మాట్లాడటం ద్వారా పిల్లలు వేగంగా నేర్చుకుంటారు. కేవలం గ్యాడ్జెట్స్‌పై ఆధారపడటం వల్ల వారి సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటాయి. సైగలను గుర్తించకపోవడం: పిల్లాడు నవ్వకపోయినా లేదా మీ వైపు చూడకపోయినా "పిల్లలే కదా" అని నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి భవిష్యత్తులో వచ్చే సమస్యలకు సంకేతాలు కావచ్చు. మనం ఏమి చేయాలి? (How to Guide) సోషల్ స్మైల్ (Social Smile): మూడు నెలల వయస్సు నుండి పిల్లలు ఇతరులను చూసి నవ్వడం మొదలుపెడతారు. వారు నవ్వినప్పుడు మీరు కూడా తిరిగి నవ్వి వారిని ప్రోత్సహించాలి. పరస్పర సంభాషణ: పిల్లాడు మీ వైపు చూస్తున్నాడా? మీరు మాట్లాడితే స్పందిస్తున్నాడా? అనేది గమనించండి. వారు కేవలం బొమ్మల వైపు కాకుండా మనుషుల వైపు చూసేలా ఇంటరాక్ట్ అవ్వండి. ఆటిజం లక్షణాలను గమనించండి: కళ్లలోకి చూసి మాట్లాడకపోవడం (No eye contact). ఒకే పనిని పదే పదే చేయడం (Repetitive activities). చుట్టూ ఉన్న మనుషులు ఏడుస్తున్నా లేదా నవ్వుతున్నా ఎటువంటి స్పందన లేకపోవడం. పిలిచినా పలకకపోవడం లేదా సామాజిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించకపోవడం ప్రశ్నోత్తరాలు (Q&A) 1. పిల్లలకు స్క్రీన్ అస్సలు ఇవ్వకూడదా? స్క్రీన్ అనేది నేడు మన జీవితంలో భాగమైపోయింది. అయితే, స్క్రీన్ కంటే హ్యూమన్ ఇంటరాక్షన్ (మనుషులతో మాట్లాడటం) అనేది చాలా ముఖ్యం. చిన్న వయస్సులో అధిక స్క్రీన్ టైం పిల్లల నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. 2. ఆటిజం అంటే ఏమిటి? ఇది ఎప్పుడు బయటపడుతుంది? ఆటిజం అనేది ఒక రకమైన ఎదుగుదల లోపం. ఇందులో ముఖ్యంగా సామాజిక సంబంధాలు, కమ్యూనికేషన్ మరియు భాషా సమస్యలు ఉంటాయి. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో లేదా పుట్టిన తర్వాత కూడా గుర్తించవచ్చు. 6 నెలల నుండి కొన్ని సూక్ష్మమైన లక్షణాలు కనిపిస్తాయి. 3. మా పిల్లాడు బొమ్మలతో బాగా ఆడుకుంటాడు, కానీ మనుషులతో కలవడు. ఇది సమస్యేనా? అవును, పిల్లలు కేవలం బొమ్మలు లేదా నిర్జీవ వస్తువుల మీద మాత్రమే ఆసక్తి చూపిస్తూ, మనుషులను పట్టించుకోకపోవడం ఆటిజం యొక్క ఒక లక్షణం కావచ్చు. నిపుణులను సంప్రదించి అసెస్‌మెంట్ చేయించడం మంచిది. పిల్లల ఎదుగుదల అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. మనం ఇచ్చే చిన్నపాటి సమయం, చూపే ప్రేమ వారి భవిష్యత్తును మార్చగలవు. మీ బిడ్డ ప్రవర్తనలో ఏవైనా మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. అప్రమత్తతే మీ బిడ్డకు శ్రీరామరక్ష. పిల్లల ఆరోగ్యం, పెంపకం మరియు మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)

బేబీలో ఆటిజం Signs ఎన్ని నెలలకి కనిపిస్తాయి!

బేబీలో ఆటిజం Signs ఎన్ని నెలలకి కనిపిస్తాయి! మీ చిన్నారి భవిష్యత్తు మరియు ఆరోగ్యం పట్ల మీకు ఉన్న ఆందోళనను మేము అర్థం చేసుకోగలము. ఈ రోజుల్లో ఆటిజం (Autism) అనే పదం వినగానే చాలా మంది తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలతో మన బిడ్డలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. అపోలో హాస్పిటల్స్ పీడియాట్రిక్స్ హెడ్ డాక్టర్ షర్మిల గారు అందించిన విలువైన సమాచారంతో రూపొందించిన ఈ ప్రత్యేక కథనం మీ కోసమే. ఆటిజం అంటే ఏమిటి? మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (Why Should We Care?) ఆటిజం అనేది కేవలం జన్యుపరమైన సమస్య మాత్రమే కాదు; దీనికి పర్యావరణ కారణాలు కూడా తోడవుతాయి. మారుతున్న జీవనశైలి: పూర్వం కంటే ఇప్పుడు ఆటిజం కేసులు భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లోనే ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు మన దేశం కూడా ఆ స్థాయికి చేరుకుంటోంది.భవిష్యత్తు తరాల కోసం: ఒక దేశాభివృద్ధికి ఆరోగ్యకరమైన యువత అవసరం. జపాన్, చైనా వంటి దేశాల్లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. మన దేశంలో ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడం చాలా ముఖ్యం. ముందస్తు గుర్తింపు: పిల్లల్లో ఆటిజం లక్షణాలను 7 నుండి 8 నెలల వయస్సులోనే గుర్తించవచ్చు. త్వరగా గుర్తిస్తే, సరైన జాగ్రత్తలతో వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తల్లిదండ్రులు ఏం చేయకూడదు? (What Not To Do?) పిల్లల పెంపకంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద సమస్యలకు దారితీస్తాయి: స్క్రీన్ టైమ్ వద్దు: చిన్న పిల్లలకు (ముఖ్యంగా 2 ఏళ్ల లోపు) ఫోన్లు లేదా టీవీలు చూపించడం అస్సలు చేయకూడదు. ఇది వారి మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిర్లక్ష్యం వద్దు: పాలు ఇచ్చేటప్పుడు లేదా అన్నం పెట్టేటప్పుడు ఫోన్లు చూస్తూ, లాప్‌టాప్‌లో పని చేస్తూ పిల్లలను గమనించకపోవడం చాలా ప్రమాదకరం. ఆరోగ్యంపై అశ్రద్ధ: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే తల్లిదండ్రులు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకూడదు. మెటర్నల్ మరియు పెటర్నల్ హెల్త్ రెండూ ముఖ్యమే. పిల్లల ఎదుగుదలకు ఏం చేయాలి? (How to Guide) ఐ కాంటాక్ట్ (Eye Contact): పిల్లలకు ఆహారం అందించేటప్పుడు వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. వారిలో సామాజిక స్పృహ పెరగడానికి ఇది మొదటి మెట్టు. పేరు పెట్టి పిలవండి: 8 నెలల వయస్సు వచ్చేసరికి పిల్లలు తమ పేరు పిలిస్తే స్పందించాలి. అలా స్పందించడం లేదంటే వారిపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేషన్: పిల్లలతో ఎక్కువగా సమయం గడపండి, వారితో మాట్లాడండి, ఆటలు ఆడించండి. కేవలం బొమ్మలతో వదిలేయకుండా వారితో ఇంటరాక్ట్ అవ్వండి. ముందస్తు ప్లానింగ్: ప్రెగ్నెన్సీ అనేది కేవలం ఒక శారీరక ప్రక్రియ మాత్రమే కాదు. ఒక కొత్త ప్రాణాన్ని భూమిపైకి తెస్తున్నప్పుడు శారీరక మరియు మానసిక ఆరోగ్యంతో సిద్ధంగా ఉండాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఆటిజం లక్షణాలను ఎంత త్వరగా గుర్తించవచ్చు?  జ: సుమారు 6 నుండి 8 నెలల వయస్సులోనే పిల్లల ఇంటరాక్షన్ ఆధారంగా ఆటిజం ఫీచర్లను గుర్తించవచ్చు. ఉదాహరణకు, మనుషులు కనిపిస్తే ఉత్సాహంగా మీదకు రాకపోవడం లేదా పేరు పిలిస్తే పలకకపోవడం వంటివి గమనించాలి. ప్ర: ఆటిజం పూర్తిగా నయమవుతుందా?  జ: అవును, 8 నెలల వయస్సులో లక్షణాలు ఉన్న పిల్లలకు కూడా స్క్రీన్ టైమ్ పూర్తిగా ఆపేసి, తల్లిదండ్రులు ఎక్కువ సమయం కేటాయించి స్టిమ్యులేషన్ ఇస్తే, 15-16 నెలల కల్లా వారు సాధారణ పిల్లల కంటే మెరుగ్గా మాట్లాడే అవకాశం ఉంది. ప్ర: ఆటిజానికి కేవలం జన్యువులే కారణమా?   జ: కాదు. మనలో ఉండే కొన్ని బ్యాడ్ జీన్స్ (Bad Genes) పర్యావరణ ప్రభావాల వల్ల (ఉదాహరణకు అధిక స్క్రీన్ టైమ్ లేదా కాలుష్యం) బయటపడతాయి. మంచి వాతావరణం కల్పిస్తే చాలా వరకు సమస్యలను నివారించవచ్చు. పిల్లలు మన భవిష్యత్తు. వారి ఎదుగుదలలో మనం ఇచ్చే సమయం మరియు ప్రేమ కంటే విలువైనది ఏదీ లేదు. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీకి దూరంగా ఉండి, మన సంప్రదాయ విలువలైన "సంభాషణ మరియు స్పర్శ" ద్వారా పిల్లలను ఆరోగ్యంగా పెంచుకుందాం. మరిన్ని ఆరోగ్య సమాచారాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health ను సందర్శించండి.  సబ్‌స్క్రైబ్ చేసుకోండి!

వేసవిలో పిల్లలకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే చాలా ప్రమాదం!

వేసవిలో పిల్లలకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే చాలా ప్రమాదం! పిల్లల ఆరోగ్యం మరియు పెంపకం: నేటి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయాలు ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు పర్యావరణ మార్పుల వల్ల పిల్లలు తరచుగా వివిధ ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ ఆర్టికల్‌లో మనం సీజనల్ వ్యాధుల నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి మరియు వారిని సరైన మార్గంలో ఎలా పెంచాలో Dr Rajesh Kanna వివరంగా ఈ వీడియోలో వివరించారు. మారుతున్న కాలం - పొంచి ఉన్న అనారోగ్యాలు ప్రతి సీజన్‌లో పిల్లలు వేర్వేరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు: వర్షాకాలం: నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. చలికాలం: చల్లని గాలి వల్ల శ్వాసకోస సంబంధిత సమస్యలు (Respiratory infections) అంటే వీజింగ్, అడినో వైరస్ మరియు ఇన్ఫ్లుయెన్జా వంటివి అటాక్ చేస్తాయి. చర్మం పొడిబారి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వేసవి కాలం: బయట దొరికే కలుషితమైన ఆహారం, నీరు లేదా చెరుకు రసం వంటివి తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు (Gastroenteritis) వంటి సమస్యలు వస్తాయి. స్విమ్మింగ్ పూల్స్ వల్ల చెవి ఇన్ఫెక్షన్లు, అరుదుగా మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. మనం ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?) పిల్లల రోగనిరోధక శక్తి పెద్దల కంటే తక్కువగా ఉంటుంది. నేటి కాలంలో పిల్లలు అవుట్‌డోర్ గేమ్స్ కంటే ఎక్కువగా ఇండోర్ ప్లే ఏరియాలకే పరిమితమవుతున్నారు. సరైన పోషకాహారం అందకపోతే వారి ఎదుగుదల పారామీటర్లు (Growth parameters) దెబ్బతింటాయి. అందుకే, ఒక కలెక్టివ్ ఎఫర్ట్‌గా తల్లిదండ్రులు, టీచర్లు అందరూ బాధ్యత వహించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏం చేయకూడదు? (What Not To Do - Common Mistakes) స్క్రీన్ టైమ్: పిల్లలు అల్లరి చేస్తున్నారని లేదా మీరు బిజీగా ఉన్నారని వారికి మొబైల్స్, ఐప్యాడ్స్ ఇవ్వకండి. ఇది వారి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ను దెబ్బతీసి, ఆటిజం వంటి సమస్యలకు దారితీస్తుంది. చాక్లెట్లను రివార్డ్‌గా ఇవ్వడం: పిల్లలు మాట వినాలని లేదా అన్నం తినాలని చాక్లెట్లు ఆశ చూపకండి. చాక్లెట్లలోని షుగర్ వల్ల వారికి ఒక రకమైన అడిక్షన్ (మత్తు పదార్థాల లాంటి అలవాటు) ఏర్పడుతుంది. ముందు మీరు మారండి: పిల్లల ముందు తల్లిదండ్రులు ఫోన్లు చూడటం లేదా జంక్ ఫుడ్ తినడం చేయకూడదు. పిల్లలు మిమ్మల్ని చూసే కాపీ కొడతారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (How To - Best Practices) ఆహారపు అలవాట్లు: బిస్కెట్లు, చాక్లెట్లు, పేస్ట్రీలకు బదులుగా ఇంట్లో చేసిన నువ్వుల లడ్డు, రాగి లడ్డు, బొబ్బట్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ అలవాటు చేయండి. శుభ్రత: బయట నుండి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడాలి. సమయం కేటాయించండి: పిల్లలతో కలిసి ఆడుకోవడం, వారితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఇది వారి బిహేవియరల్ డిజార్డర్స్‌ను తగ్గిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండండి: ఎవరైనా బయటి వ్యక్తులు చాక్లెట్లు ఇస్తే 'వద్దు' అని చెప్పే ధైర్యాన్ని, క్రమశిక్షణను పిల్లలకు నేర్పండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న 1: చాక్లెట్లు తింటే పిల్లలకు ఏమవుతుంది?  జవాబు: చాక్లెట్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్‌గా మారుతారు. ఇది వారి పళ్ళు పుచ్చిపోవడానికి (Caries), మలబద్ధకం మరియు ఆకలి తగ్గడానికి కారణమవుతుంది. ప్రశ్న 2: వర్షాకాలంలో దోమల నుండి ఎలా కాపాడుకోవాలి?  జవాబు: ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు వైరస్లను మోసుకెళ్లే వెక్టర్స్ లాగా పనిచేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్న 3: స్కూల్ టీచర్లు చాక్లెట్లు ఇస్తుంటే ఏం చేయాలి?  జవాబు: ఇది తల్లిదండ్రులు మరియు టీచర్లు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం. స్కూల్స్ లో కూడా హెల్దీ స్నాక్స్ పంపిణీ చేసేలా ప్రోత్సహించాలి.  పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యత. వారి ఆరోగ్యం విషయంలో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే వారిని పెద్ద ప్రమాదాల నుండి కాపాడతాయి. మీరు మీ పిల్లల కోసం ఒక రోల్ మోడల్‌గా ఉండండి. మరిన్ని ఆరోగ్య చిట్కాలు మరియు పిల్లల సంరక్షణ గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)

చిన్నపిల్లల కళ్లకు కాటుక పెట్టడం మంచిదేనా!

చిన్నపిల్లల కళ్లకు కాటుక పెట్టడం మంచిదేనా! భారతీయ కుటుంబాలలో వారసత్వం అనేది పిల్లల ద్వారానే ముందుకు వెళుతుంది.  వివాహం తర్వాత ప్రతి జంట తమకు ఒక పాప లేదా బాబు కావాలని ఎంతో తహతహలాడతారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల విషయంలో చాలా సందేహాలు,  జాగ్రత్తలు తల్లిదండ్రులను తొలిచేస్తూ ఉంటాయి. పిల్లలకు స్నానం చేయించగానే వారిని అందంగా ముస్తాబు చేయడం చాలా సహజం. ఇందులో భాగంగా పిల్లలకు కాటుక కూడా పెడుతూ ఉంటారు. అయితే.. ఇలా పిల్లలకు కాటుక పెట్టడం మంచిదేనా అనేది ఇప్పుడు చాలామందిలో ఎదురవుతున్న ప్రశ్న.  దీనికి వైద్యులు ఏ సమాధానం ఇస్తున్నారో తెలుసుకుంటే.. పిల్లల కళ్లకు కాటుక.. పిల్లలకు స్నానం చేయించి ముస్తాబు చేసేటప్పుడు కళ్లకు కాటుక పెడతారు. అయితే ఇలా కళ్లకు కాటుక పెట్టడం అనేది,  పిల్లలకు దిష్టి తగలకుండా నివారించడం మాత్రమే కాకుండా.. కళ్లను కూడా శుభ్రంగా ఉంచుతుందని నమ్ముతారు. అయితే.. నేటికాలంలో పిల్లల కళ్లకు కాటుక పెట్టడం గురించి వైద్యులు చాలా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాటుక పెట్టుకునే  సంప్రదాయం చాలా ప్రాచీనమైనది.  ఇది బారతీయ పద్దతులలో భాగంగా ఉంది.  అందంగా అలంకరించుకునే క్రమంలో కళ్లకు కాటుక పెట్టడం ఖచ్చితంగా ఉంటుంది. కానీ వైద్యులు మాత్రం పిల్లల కళ్లకు కాటుక పెట్టడం అవసరం లేదు అంటున్నారు. ప్రాచీన కాలంలో కాటుకను ఇళ్లలోనే తయారు చేసుకునే వారు. ఇందుకోసం స్వచ్చమైన ఆవు నెయ్యి, స్వచ్చమైన పత్తి లేదా కాటన్ వస్త్రం,  ఇతర ఔషద  దినుసుల సహాయంతో తయారు చేసేవారు.  ఇది కళ్ళకు అందాన్నే కాకుండా.. కంటి సమస్యలను కూడా నివారిస్తుంది.  కంటి చూపును సంరక్షిస్తుంది. పైగా ప్రాచీన కాలంలో కాటుకను పిల్లల కోసం ప్రత్యేకంగా, పెద్దల కోసం ప్రత్యేకంగా తయారు చేసేవారు. కానీ నేటికాలంలో అదంచా కనుమరుగైంది.  కేవలంమార్కెట్లో లభించే కాటుకను ఉపయోగించాలి.  మార్కెట్లో లభించే కాటుకలో రసాయనాలు లేదా సీసం ఉండే అవకాశం ఉంది.  ఇధి కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం చాలా ఉంటుంది. నవజాత శిశువుల కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి.  అలాంటి పిల్లలకు రసాయనాలతో కూడిన  కాటుక పెట్టడం వల్ల వారి కళ్లు, కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కంటిలో చికాకు, కంటి అలర్జీలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.  రసాయనాలు ఉన్న కాటుకను వాడితే.. కొన్నిసార్లు కంటి నాళాన్ని మూసివేసే ప్రమాదం కూడా ఉంటుందట.  అందువల్ల వైద్యులు.. చిన్న పిల్లలకు కాటుక పెట్టకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు.                          *రూపశ్రీ.

దంతాలు వచ్చేటప్పుడు పిల్లలకు నొప్పి, చిరాకు తగ్గించాలంటే.. ఈ టిప్స్ పాటించండి..!

దంతాలు వచ్చేటప్పుడు పిల్లలకు నొప్పి,  చిరాకు తగ్గించాలంటే.. ఈ టిప్స్ పాటించండి..! పిల్లలు పుట్టడం ఒక అద్బుతం.. పిల్లలను దేవుడు ఇచ్చిన వరం అని భావిస్తారు తల్లిదండ్రులు. పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్లు చేసే ప్రతి చర్య తల్లిదండ్రులకు,  కుటుంబానికి ఎంతో సంతోషాన్ని నింపుతాయి.  వారు బోర్లాపడితే ఒక సంబరం,  దొగ్గాడితే ఒక సంబరం,  ముద్దు మాటలు మాట్లాడితే ఒక సంబరం.. ఇలా పిల్లల జీవితంలో ప్రతిదీ కుటుంబానికి, తల్లిదండ్రులకు చాలా తీపి జ్ఞాపకాలను పోగేస్తాయి.  అయితే పిల్లలకు దంతాలు రావడం అనేది వారి జీవితంలో ఒక దశను సూచిస్తుంది.  దంతాలు వచ్చేటప్పుడు పిల్లలు ఏదో ఒకటి కొరకడం,  ఏడవడం వంటివి చేస్తుంటారు.   పిల్లలకు సుమారు 6 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య, చిగుళ్ళ నుండి 20 పాలపళ్ళు వస్తాయి. ఒక్కో పన్ను రావడానికి సుమారు వారంన్నర సమయం పట్టవచ్చు.  ఈ ప్రక్రియ వల్ల పిల్లలు చిరాకు పడుతూ, నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు.  పళ్లు రావడం అనే ప్రక్రియను ఎవరూ ఆపలేరు.. కానీ దీని వల్ల పిల్లలకు కలిగే ఇబ్బందిని మాత్రం తగ్గించవచ్చు. అసలు పళ్లు వచ్చేటప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? పిల్లల అసౌకర్యం తగ్గించడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే..   పళ్లు వచ్చేటప్పుడు కనిపించే లక్షణాలు.. పళ్ళు వచ్చేటప్పుడు కనిపించే సాధారణ లక్షణాలలో చిగుళ్ళు వాపు, తరచుగా ఏడవడం, చిరాకు, ప్రతిదాన్నీ నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించడం, అధికంగా లాలాజలం కారడం, ముఖంపై దద్దుర్లు, నిద్ర విధానంలో మార్పులు , ఆకలి మందగించడం వంటివి ఉంటాయి. తేలికపాటి జ్వరం రావచ్చు, కానీ అధిక జ్వరం పళ్ళు రావడానికి సంకేతం కాదు. ఒకవేళ రోజుకు మూడు నుండి నాలుగు సార్లు నీళ్ళ విరేచనాలు అవుతుంటే, అది తరచుగా నోట్లో ఏవైనా పెట్టుకోవడం  వల్ల కలిగే ఇన్ఫెక్షన్ కారణంగా జరిగే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి? పిల్లలకు దంతాలు వచ్చే సమయంలో ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు,  ఇబ్బంది పడుతూ ఉంటారు,  నొప్పికి చిరాకు, అసహనం కూడా ఫీలవుతుంటారు. అలాంటి సమయంలో బిడ్డకు నమలడానికి చల్లని,  సురక్షితమైన వస్తువులను ఇవ్వాలి. పిల్లలు నోట్లో పెట్టుకోవడానికి, దాని వల్ల వారికి ఎలాంటి ప్రమాదం ఉండకుండా ఉండేలా ఏదైనా వస్తువు వంటిది ఇవ్వాలి. ఇది కూడా ఫ్రిజ్ లో ఉంచి కాస్త చల్లగా ఉన్నప్పుడు ఇస్తే వారి చిగుళ్లకు ఉపశమనం ఉంటుందట. పిల్లలకు తినడానికి పండ్లు ఇవ్వడం,  ఇంట్లో తయారు చేసిన తేలిక పాటి ఆహారాలు,  వారు నమిలే విధంగా ఉండే ఆహారాలు ఇవ్వాలి.  అలాగే వేలికి శుభ్రమైన చల్లని, తడి గుడ్డను చుట్టి బిడ్డను నమలనివ్వాలి, ప్రతి వస్తువును పూర్తిగా శుభ్రం చేసి, క్రిమిరహితం చేయడం ముఖ్యం. భోజన సమయంలో, చల్లని పెరుగు,  అన్నం, మెత్తటి పండ్లు లేదా బిడ్డ మెల్లగా నమలగలిగే ఆహార పదార్థాలను ఇవ్వాలి. ఈ సమయంలో ఆకలి మందగించడం సాధారణం, కాబట్టి బలవంతంగా ఏదీ తినిపించకూడదు. రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఆకలి మందగించడం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించాలి. వయస్సుకు తగిన భోజనాన్ని టైమింగ్ ప్రకారం  ఇస్తుండాలి. తల్లి పాలు మాత్రమే కాకుండా అదనపు పాలు,  ద్రవ పదార్థాలు వంటివి కూడా ఇస్తుండాలి.                                      *రూపశ్రీ.

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ముఖ్యమైన పోషకాలు ఇవీ..!

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ముఖ్యమైన పోషకాలు ఇవీ..! పిల్లలు శారీరక పెరుగుదల పరంగా,  మెదడు అభివృద్ధి పరంగా కీలక దశలో ఉంటారు. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే వారికి సమతుల్య పోషణ చాలా అవసరం. ఇది నేర్చుకునే సామర్థ్యం, రోగనిరోధక శక్తి, శరీర  శక్తి స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్లు,  ఖనిజాలు వంటి అవసరమైన సూక్ష్మపోషకాలతో పాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి స్థూలపోషకాలతో కూడిన చక్కటి ప్లానింగ్ తో కూడిన ఆహారం పిల్లలకు ఎంతో అవసరం.  పిల్లల మెదడు అభివృద్దికి  7 పోషకాలు చాలా అవసరం. ఆ పోషకాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రోటీన్.. కణజాలాల నిర్మాణం, కణజాల  మరమ్మత్తుకు,  కండరాల పెరుగుదలకు తోడ్పడటంలో ప్రోటీన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  రోజువారీ ఆహారంలో గుడ్లు, పాల ఉత్పత్తులు,  పప్పుధాన్యాలు చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా గింజలు, విత్తనాలు,  చేపలలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తికి,  ఏకాగ్రతను మెరుగుపరచడానికి చాలా కీలకమైనవి. ఐరన్.. పిల్లల మేధో వికాసానికి ఐరన్ ఒక కీలకమైన పోషకం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడటంతో పాటు, మెదడుకు తగినంత ఆక్సిజన్ సరఫరాను  అందించడంలో సహాయపడుతుంది. ఐరన్  లోపం వల్ల అలసట, ఏకాగ్రత లోపం,  చదువులో చురుగుదనం తగ్గడం వంటివి ఎదురవుతాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పోషక విలువలున్న ధాన్యాలు వంటి ఆహారాలు శరీరంలో  ఐరన్  స్థాయిలు సమతుల్యంగా  ఉండటంలో సహాయపడతాయి. కాల్షియం, విటమిన్-డి.. బలమైన ఎముకలు,  దంతాలకు కాల్షియం,  విటమిన్ డి చాలా అవసరం. పిల్లలకు పాలు, పెరుగు,  జున్ను ఇవ్వాలి.  బి విటమిన్లు శక్తి జీవక్రియకు, శరీరం చురుగ్గా ఉండటానికి సోపోర్ట్ ఇస్తాయి. తద్వారా పిల్లలు రోజంతా చురుకుగా,  ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడతాయి. కార్బోహైడ్రేట్లు.. గోధుమ, ఓట్స్, మిల్లెట్,  బ్రౌన్ రైస్ వంటి సంపూర్ణ ధాన్యాలు రోజంతా శక్తిని అందిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి,   పాఠశాల సమయంలో అలసటను నివారిస్తాయి. దీనితో పాటు, పప్పులు, పనీర్, గుడ్లు,  సోయా ఉత్పత్తుల వంటి వనరుల నుండి లభించే ప్రోటీన్లు మెదడు అభివృద్ధికి, ఏకాగ్రత,  చురుకుదనాన్ని కాపాడుకోవడానికి చాలా కీలకమైనవి. సూక్ష్మ పోషకాలు.. జింక్,  విటమిన్ సి వంటి సూక్ష్మపోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి, ఇవి పిల్లల చదువుకు ఆటంకం కలిగించే సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. నిమ్మజాతి పండ్లు, గింజలు, విత్తనాలు,  పప్పుధాన్యాలు  ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచివి. అయోడిన్..  థైరాయిడ్ సరిగ్గా  పనిచేయడానికి,  మెదడు అభివృద్ధికి అత్యవసరమైన పోషకం అయోడిన్.  చాలామంది అయోడిన్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.   వంటలో అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం ద్వారా అయోడిన్ లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అదనంగా విటమిన్ ఎ కంటిచూపుకు,  రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు.. గింజలు,  విత్తనాలు నాడీ వ్యవస్థ అభివృద్ధికి,  గ్రహణశక్తి పనితీరుకు తోడ్పడతాయి. వాటిని చిరుతిళ్లలో చేర్చుకోవడం చాలా మంచిది. పండ్లు,  గింజల వంటి ఆరోగ్యకరమైన చిరుతిళ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో శక్తి లేకపోవడం అనే సమస్యను అధిగమించవచ్చు.  అలాగే.. ఏకాగ్రతను మెరుగుపరచుకోవచ్చు.                             *రూపశ్రీ

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే బోలెడంత సంతోషం అంటారు అంతా.. సంతోషం ఉండే విషయం నిజమే అయినా.. ఆ సంతోషం కంటే ఎక్కువగా పిల్లల తల్లిదండ్రులకు పిల్లల గురించి భాద్యతే ఎక్కువగా అనుభవంలోకి వస్తుంది. ముఖ్యంగా మొదటిసారి  తల్లిదండ్రులైన వారికి తమ పిల్లలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలంటే  వారిని సరిగ్గా ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొద్దిపాటి జాగ్రత్త,  సరైన అవగాహన ఉంటే  పిల్లలు అటు ఆరోగ్య పరంగానూ, ఇటు ఎదుగుదల పరంగానూ బాగా పెరుగుతారు.  ఇంట్లో చిన్న పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పరిశుభ్రత.. చిన్న పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, కాబట్టి వారి చుట్టూ పరిశుభ్రత ఉండాలి. పిల్లలను ఎత్తుకునే ముందు, వారిని ముట్టుకునే ముందు చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం.  అలాగే  బట్టలు,  పరుపులను శుభ్రంగా ఉంచాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పోషణ.. నవజాత శిశువుకు తల్లిపాలు చాలా అవసరం. ప్రతి 2-3 గంటలకు పాలు ఇస్తుండాలి. వైద్యుడిని సంప్రదించకుండా కొత్తగా ఏమీ ఇవ్వకూడదు. శిశువు ఎదుగుదలకు సరైన పోషణ చాలా అవసరం. నిద్ర.. చిన్న పిల్లలు రోజుకు 14-16 గంటలు నిద్రపోతారు. ప్రశాంతమైన, సౌకర్యవంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.   పెద్ద శబ్దాలు, తీవ్రమైన కాంతి పిల్లలను చేరకుండా చూడాలి.  మంచి నిద్ర మీ పిల్లల మానసిక, శారీరక వికాసానికి సహాయపడుతుంది. జాగ్రత్తలు.. విద్యుత్ సాకెట్లను మూసి ఉంచాలి. చిన్న వస్తువులను పిల్లలకు అందకుండా ఉంచాలి. ఫర్నిచర్ మూలలను మూసి ఉంచాలి. ఇది ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. వైద్య పరీక్షలు.. క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.  పిల్లల ఎదుగుదలను గమనిస్తూ ఉండాలి. ఏవైనా సమస్యలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది బిడ్డ ఆరోగ్యానికి చాలా కీలకం. ప్రేమ, శ్రద్ద..  పిల్లలతో సమయం గడపాలి. వారితో మాట్లాడాలి ఆడుకోవాలి. వారికి భద్రతా భావాన్ని కలిగించాలి. పిల్లల మానసిక వికాసానికి భావోద్వేగ అనుబంధం చాలా అవసరం. సీజనల్ ప్రొటెక్షన్.. సీజన్ ను బట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో, బిడ్డకు తగినంత నీరు అందేలా చూసుకోవాలి,  శీతాకాలంలో వెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  సీజన్ కు తగ్గట్టు  దుస్తులు వేయడం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.  

పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచే అద్బుతమైన మార్గాలు!

పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచే అద్బుతమైన మార్గాలు! ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికి చాలా ముఖ్యం. చిన్న పిల్లలు అయినా, పెద్ద వారు అయినా ఆత్మవిశ్వాసం లేకపోతే ఏదీ సాధించలేరు.  చేతకాని వాళ్లలా మిగిలిపోతారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు చిన్నతనం నుండే ఆత్మవిశ్వాసం నూరిపోయాలి.  తద్వారా వారు జీవితంలోని సమస్యలను  పరిష్కరించుకోవడంలో,  తమ ప్రతిభను తాము మెరుగుపరుచుకోవడంలో,  ఏదైనా నేర్చుకోవడంలో ఇలా చాలా రకాలుగా మెరుగ్గా ఉంటారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఆత్మవిశ్వాసంగా ఉండాలని కోరుకుంటారు.  అన్ని విషయాల్లో పిల్లలు ధైర్యంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఆత్మవిశ్వాసం అనేది తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చేది కాదు. అది చిన్నతనం నుండి తల్లిదండ్రులు పిల్లలలో పెంపొందించాలి.  పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే.. పిల్లలో ఆత్మవిశ్వాసం ఎలా పెంచాలంటే.. సరైన మార్గదర్శకత్వం,  వాతావరణం ఉంటే, పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు సవాళ్లను బాగా ఎదుర్కుంటారు, తమ మనసులో ఉన్న విషయాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. ప్రయత్నాలు,  అభినందనలు.. తరచుగా పిల్లలు పరీక్షలలో లేదా ఆటలలో  ముందు వచ్చినప్పుడు లేదా ట్రోఫీ గెలిచినప్పుడు మాత్రమే తల్లిదండ్రులు పిల్లలను అభినందిస్తూ ఉంటారు. కానీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి  పునాది ప్రయత్నంలోనే ఉంటుంది. పిల్లలు దేనికోసం అయినా ప్రయత్నం చేసి విఫలం అయితే.. వారి ప్రయత్నాన్నే మెచ్చుకోవాలి. ఇది వారిలో భయాన్ని, నిరాశను, ఆత్మన్యూనతా భావాన్ని తగ్గిస్తుంది. సొంత నిర్ణయాలు..  పిల్లలు తమ కోసం చిన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వారు తమ సామర్థ్యాలను నమ్ముతారు. ఈ చిన్న ప్రారంభం భవిష్యత్తులో పెద్ద,  కష్టతరమైన నిర్ణయాలకు వారిని సిద్ధం చేస్తుంది. వారికి నచ్చింది తినడం,  వారికి నచ్చిన బట్టలు వేసుకోవడం, వారికి ఆసక్తి ఉన్న పనులు చేయడం వంటివి వారితో చేయనిస్తే వారిలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. తప్పులు, పాఠాలు.. కొన్నిసార్లు పిల్లలు తిట్లకు  భయపడి తప్పులను దాచిపెడుతూ ఉంటారు. కానీ తప్పులు చేయడం సహజం. తప్పులే పాఠాలు అవుతాయని, అవే  విజయానికి సోపానాలు అని తల్లిదండ్రులే  వారికి నేర్పించాలి. పిల్లలు  పోటీలో విఫలమైనా, ఏదైనా సాధించలేకపోయినా అరవడానికి బదులుగా, వారితో మాట్లాడాలి.  ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలి, వారి అర్థమయ్యేలా చెప్పాలి.  అప్పుడు తప్పులను దాయరు,  అలా అని తప్పులు చేస్తూనే ఉండరు.  నేర్చుకుంటూ ఉంటారు. నైపుణ్యాలు.. పిల్లవాడు సైకిల్ తొక్కడం, పెయింటింగ్ వేయడం లేదా చిన్న ఇంటి పనులు చేయడం వంటివి ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు, వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారికి ఆసక్తి ఉన్న కొత్త విషయాలను నేర్చుకోవడానికి . వారు ఒక పనిలో ఎంకరేజ్ చేయాలి. వారు నేర్చుకునే పనిలో నైపుణ్యం సాధిస్తే వారి సామర్త్యం గురించి వారికి మంచి అవగాహన పెరుగుతుంది. చిన్న లక్ష్యాలు సాధించడం కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. రోల్ మోడల్.. పిల్లలు మనం నేర్పేది నేర్చుకోరు, మనం చేసేదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు సవాళ్లకు భయపడితే లేదా తమను తాము  విమర్శించుకుంటే,  పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.  తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు  తప్పులను అంగీకరించి  సరిదిద్దుకోవాలి. పిల్లలు అదే నేర్చుకుంటారు.  ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.                               *రూపశ్రీ.

ఇంట్లో తయారు చేసిన బేబీ ఫుడ్ లేదా మార్కెట్‌లో లభించే బేబీ ఫుడ్.. పిల్లలకు ఏది మంచిదంటే!

ఇంట్లో తయారు చేసిన బేబీ ఫుడ్ లేదా మార్కెట్‌లో లభించే బేబీ ఫుడ్.. పిల్లలకు ఏది మంచిదంటే..! పుట్టిన తర్వాత చిన్న పిల్లలకు తల్లిపాలే ఆహారం అవుతాయి. దాదాపు 6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలే ఆహారంగా ఇస్తారు.  అయితే 6 నెలలు దాటిన తర్వాత పిల్లలు సాలిడ్ ఫుడ్ ఇవ్వడం మొదలుపెడతారు. పిల్లల మానసిక,  శారీరక ఎదుగుదలకు ఏ ఆహారాలు బాగుంటాయో అవి ఇవ్వాలని తల్లిదండ్రులు అనుకుంటారు.  30,40 దశాబ్దాల క్రితం చిన్న పిల్లలకు ఇచ్చే బేబీ ఫుడ్ మార్కెట్లో చాలా తక్కువగా లభించేవి. పిల్లలకు బేబీ ఫుడ్ ను పెద్దలు ఇంట్లోనే తయారు చేసేవారు. కానీ నేటి కాలంలో చిన్న పిల్లలకు బేబీ ఫుడ్ చాలా విరివిగా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని కొనుగోలు చేసి వాడటం వల్ల తల్లులకు చాలా వరకు పని తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.  పిల్లల ఆరోగ్యం కోసం ఇంట్లో తయారు చేసిన బేబీ ఫుడ్ మంచిదా?  మార్కెట్లో లభించే బేబీ ఫుడ్ మంచిదా?  తెలుసుకుంటే.. పిల్లలకు బేబీ ఫుడ్ ఎలా ఉపయోగపడుతుంది.. ఆరు నెలల తర్వాత, శిశువులకు శారీరక,  మానసిక అభివృద్ధి కోసం తల్లి పాలతో పాటు పోషకమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరమని పిల్లల వైద్యులు చెబుతారు.  అందుకే పాలతో పాటు బేబీ ఫుడ్ కూడా ఇవ్వడం మొదలుపెడతారు. ఇంట్లో తయారు చేసిన బేబీ ఫుడ్ ప్రయోజనాలు.. ఇంట్లో తయారుచేసిన బేబీ ఫుడ్ పౌడర్‌ను తాజా, సహజ పదార్థాలతో తయారు చేస్తారు. ఇందులో ప్రిజర్వేటివ్‌లు, అదనపు చక్కెర లేదా ఉప్పు ఉండవు. తల్లిదండ్రులకు పదార్థాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది.  పరిశుభ్రతతో  బాగా వేయించడం లేదా ఉడికించడం,  గ్రైండ్ చేయడం వంటి పద్దతులలో తయారు చేస్తారు.   ప్రోటీన్, కాల్షియం మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు  బేబీ ఫుడ్ లో ఉన్నాయా లేదా అనేది గమనించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మార్కెట్లో లభించే బేబీ ఫుడ్ ప్రయోజనాలు.. వాణిజ్యపరంగా లభించే బేబీ ఫుడ్ పౌడర్లు సాధారణంగా ఫార్ములాతో రూపొందించబడతాయి,  బిడ్డకు అవసరమైన బలవర్థకమైన పోషకాలతో తయారు చేయబడాయి. వీటిని ఉపయోగించడం కూడా సులువే.. పైగా సేప్టీ టెస్ట్,  క్వాలిటీ టెస్ట్ కూడా చేయబడతాయి.  అయితే వాణిజ్యపరంగా లభించే కొన్ని ఉత్పత్తులలో అదనపు చక్కెరలు లేదా రుచులు ఉండవచ్చు.  కాబట్టి వాటిని కొనుగోలు చేసేముందు వాటి లేబుల్ గమనించడం చాలా ముఖ్యం. ఏది మేలు? ఆరు నెలల వయస్సు ఉన్న శిశువులకు తల్లిపాలు చాలా ముఖ్యమైనవని,  అవే  సరిపోతాయని పిల్లల వైద్యులు చెబుతున్నారు. ఆరు నెలల తర్వాత  ఘన పదార్థాలు ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు ఆహారంలో , తాజా, సమతుల్యంగా ఉంటూ ఇంట్లో తయారు చేసిన ఆహారం సురక్షితమైనది. అయితే పిల్లలకు ఇచ్చే ఆహారంలో పోషకాల నుండి వాటిని తయారు చేయడం వరకు అన్నీ జాగ్రత్తలు తీసుకుని వాటిని సురక్షితంగా తయారు చేసి పిల్లలకు ఇవ్వగలిగితే అది చాలా మంచిది.  పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. తల్లిదండ్రులకు సమయం లేకపోవడం,  పిల్లలకు ఇచ్చే ఆహారం గురించి అవగాహన తక్కువ ఉండటం వంటి సమస్యలు ఉన్నప్పుడు మార్కెట్లో దొరికే బేబీ ఫుడ్ పౌడర్లు ఉపయోగించడం తప్పనిసరి అవుతుంది. అయితే మార్కెట్లో చాలా రకాల బేబీ ఫుడ్ లు అందుబాటులో ఉంటాయి కాబట్టి,  పిల్లలకు మంచి నాణ్యమైన బేబీ ఫుడ్ ఎంచుకోవాలి.                                      *రూపశ్రీ.

పిల్లల మనసుని మార్చే రంగులు!

పిల్లల మనసుని మార్చే రంగులు! రంగుల ప్రభావం మన మనసుపై పడుతుందంటే నమ్మసక్యంగా లేదు కదూ, కాని ఇది అక్షరాల నిజమని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మనం పిల్లల గదికి వేసే రంగుల ప్రభావం వారి మీద చాలా ఉంటుందిట. ముభావంగా ఉండే పిల్లల్లో హుషారుని నింపాలన్నా, హైపెరాక్టివ్ పిల్లల్ని కుదురుగా కూర్చోబెట్టాలన్నా ప్రత్యేకమైన రంగులు ఉపయోగిస్తే చాలట. వారి ప్రవర్తనా విధానంలో మెల్లిగా మార్పులు చేసుకుంటాయట. ఇది వింటే కాస్త కొత్తగా అనిపిస్తున్నా దీనికి సంబంధించి పిల్లలపై చేసిన పరిశోధనలు మంచి ఫలితాలని ఇచ్చాయని నొక్కి చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మరి మీ పిల్లల మనస్తత్వానికి ఎలాంటి రంగు ఎక్కువగా వాడాలో ఎంచుకోండి. ఇంటిలో వాళ్ళ రూమ్ కి వేసే కలర్, వాళ్ళ స్కూల్ బ్యాగ్ కలర్, వాళ్ళు వేసుకునే బట్టల కలర్ ఇలాంటి వాటికి ఏ సమయంలో ఎలాంటివి ఎంచుకోవాలో ఒక నిర్ణయానికి రావచ్చు. * రెడ్ కలర్ - ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకుండా నలుగురిలో కలవటానికి ఇబ్బంది పడే పిల్లల రూం కి ఎరుపు రంగు వేస్తె వాళ్ళల్లో హుషారు పెరుగుతుందట ఎందుకంటే ఎరుపు మనిషి మెదడులో రక్త ప్రసరణ త్వరగా జరిగేలా చేస్తుందిట. అదే హైపెరాక్టివ్ పిల్లల రూంలో ఎరుపు రంగు వేస్తే  గనక ఇక వాళ్ళని ఆపటం ఎవరితరము కాదు. వాళ్ళ హుషారు రెండింతలు పెరిగి చదువు మీద ధ్యాస తగ్గి ప్రవర్తనలో విపరీతధోరణులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్తంత జాగ్రత్త సుమా. * ఆరంజ్ కలర్ - పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచగల శక్తి ఈ నారింజ రంగుకి ఉందట. ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించటానికి దోహదపడుతుందట. అన్నివిషయాలలో పిల్లలు  మీ మీద ఆధారపడుతుంటే మీరు ఈ రంగుని ఎంచుకోవచ్చు. * గ్రీన్ కలర్ - పిల్లల్లో కాన్సంట్రేషన్ పెరగడానికి ఈ రంగు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వారిలో చదువుపట్ల ఆసక్తిని కూడా పెంపొందిస్తుందట. వాళ్ళల్లో ఉన్న యంగ్జైటి తగ్గి వాళ్ళని ఎప్పుడూ కూల్ గా ఉంచుతుంది కూడా. * బ్లూ కలర్ - ఎరుపు రంగుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఈ నీలం రంగు. అది మెదడులోని రక్త ప్రసరణని రెట్టింపు చేసి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తే ఈ నీలం రంగు పిల్లల మెదడు చాలా ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని.నిద్రకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా అవి కూడా దూరమయ్యి హాయిగా నిద్రపడుతుందట కూడా. హైపేరాక్టివ్నెస్ ఎక్కువగా ఉండే పిల్లల కోసం ఎక్కువగా ఈ రంగుని ఎంచుకున్నట్లయితే వారిలో దూకుడు స్వభావం తగ్గుతుందని చెప్తున్నారు. *  ఎల్లో కలర్ - పిల్లల్లో ఏకాగ్రత పెరగటానికి పసుపు రంగు ఉపయోగపడుతుందట. వారు స్థిరంగా కూర్చుని చదవాలన్నా లేడిన ఏదైనా పని కుదురుగా చేయాలన్నా ఈ రంగుని ఎంచుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు నిపుణులు.   ఇలా రంగులు మనిషి పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయని ఎన్నో అధ్యయనాలు రుజువు చేసాయి. రంగుల పట్ల కాస్తంత అవగాహన ఉంటే చాలు మన పిల్లల మనసుని మనం సునాయాసంగా మార్చుకుని హ్యాపీ గా ఉండచ్చు. కేవలం గదికి వేసే రంగులే కాదు వారి కోసం వాడే ప్రతి వస్తువుని సరిపడే రంగులలో మనం ఎంచుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడరు మనని ఇబ్బంది పెట్టరు.  - కళ్యాణి