Read more!

పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు!

పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు! పిల్ల‌ల ఎదుగుదలను చూసి సంతోషించని త‌ల్లిదండ్రులు ఉండ‌రు. అయితే ఈ క్ర‌మంలో తెలియ‌కుండానే వాళ్ల‌కి కొన్ని విష‌యాల‌లో అతిగా స్వేచ్ఛ‌ను ఇస్తుంటారు. మ‌రికొంత‌మంది .. పిల్ల‌ల‌కు అస్స‌లు స్వేచ్ఛ ఇవ్వ‌కుండా ప్ర‌తీ విష‌యంలో త‌ల్లిదండ్రులు చెప్పినట్లే చేయాల‌ని వాళ్ల మీద విప‌రీత‌మైన ఒత్త‌ిడి తెస్తారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పిల్ల‌లు మ‌న మాట లెక్క‌చేయ‌క‌పోవ‌డం లేదా అతి క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల‌న యాక్టివ్‌గా లేక‌పోవ‌డం వంటి దుష్ప్ర‌భ‌వాలు క‌లిగే అవ‌కాశం ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల వ‌ల‌న పిల్ల‌లు కొన్ని సంద‌ర్భాల్లో త‌ల్లిదండ్రుల మాట లెక్క‌చేయ‌డం మానేసి వారికి న‌చ్చిన‌రీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందుల‌ను కూడా మ‌న‌తో షేర్ చేసుకోవ‌డం త‌గ్గించి వారికి వారే సొంత నిర్ణ‌యాలు తీసుకొని పెడ‌దారిన ప‌డే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. అందుకే పిల్ల‌ల‌ను ఎలా పెంచాలో అనే విష‌యం గురించి తెలుసుకుందాం. 1. చ‌దువులో గాని, ఆట‌ల్లో గాని వారికి కావాల్సిన ప్రేర‌ణ‌ను మ‌నం అందించాలి. త‌ద్వారా వారిలో ఏదైనా సాధించ‌గ‌లం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ప్ర‌తీ విష‌యానికి వాళ్ల మీద చిరాకు ప‌డ‌డం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు దారి వైపు వెళ్లేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. 2. పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుండి స‌హాయ‌ప‌డే గుణాన్ని అల‌వాటు చేయాలి. చిన్న‌త‌నం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయ‌కూడ‌దు. ఇతరుల అవసరాలకి స్పందించేలా వారిని ప్రోత్స‌హించాలి. అందువ‌ల‌న వారు అంద‌రితో క‌లివిడిగా ఉంటూ స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణాన్ని అల‌వాటు చేసుకుంటారు. వారిలో ఏదో సాధించాల‌నే ఆశ‌యంతో పాటు ఇత‌రుల‌కు స‌హాయ‌ప‌డాల‌నే త‌ప‌న కూడా ఉండేలా వారిని ప్రోత్స‌హించాలి. 3. కొన్ని సంద‌ర్భాల్లో తెలియ‌కుండానే పిల్ల‌ల‌పై కోపాన్ని చూపిస్తాం . ఉదాహ‌ర‌ణ‌కు వారు మ‌న క‌ళ్ల ముందే ఏదైనా గోడ ఎక్క‌డం లేదా ప్ర‌మాద‌క‌ర వ‌స్తువుల‌తో ఆడుకోవ‌డం వంటివి చేసిన‌ప్పుడు ప‌ట్ట‌రాని కోపం వ‌స్తుంది. అయితే ఇలాంటి సంద‌ర్భాల‌లో మ‌నం కొంచెం నిగ్ర‌హంగా ఉంటూ వారిని ద‌గ్గ‌ర‌కు తీసుకొని అలా చేయ‌కూడ‌ద‌ని నెమ్మ‌దిగా చెప్పాలి. దాని వ‌ల‌న జ‌రిగే అన‌ర్ధాల‌ను వారికి వివ‌రించాలి. మ‌నం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా త‌యార‌య్యే ప్ర‌మాదం ఉంది. వారి అల‌వాటును మ‌నం వ్య‌తిరేకించ‌డం వారు స‌హించ‌లేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మ‌చ్చిక చేసుకోవాలి. 4. చాలా మంది తల్లితండ్రులు తమ బాగా చదువుకోవాలని అనుకుంటారు . అందువల్ల వారికి ఏ పని చెప్పకుండా ఎప్పుడూ చదువుకోమని చెప్తూ ఉంటారు .. అది చాలా తప్పు అలా చేయడం వల్ల పిల్లలు చాలా వత్తిడికి గురవుతారు . దానివలన లేనిపోని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది .. పిల్లలకి చదువు విలువ ఏంటో అర్దం అయ్యేలా చెప్పండి .. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి .. 5. అలాగే తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి .. చాలామంది పిల్లలకి స్కూల్ లో జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలవాటు . ఇంట్లో వారి మాటలు వినేవారు లేకపోతే వారు బయట స్నేహితులకి ఎక్కువ అలవాటు అయ్యే అవకాశం ఉంది . వారితో ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల వాళ్ళు కూడా ఏ విషయాలు దాచుకోకుండా అన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అది పిల్లల భవిష్యత్తు కి ఎంతో మేలు చేస్తుంది.  

బిడ్డలకు తల్లిపాలే అమృతమని ఇందుకే అన్నారు..

 బిడ్డలకు తల్లిపాలే అమృతమని ఇందుకే అన్నారు.. సరైన పోషకాహారం  పిల్లల మొత్తం ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. నవజాత శిశువుకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ పోషకాలన్నీ తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే బిడ్డకు తల్లిపాలు అమృతసమానమన్నారు పెద్దల నుండి వైద్యుల వరకు. ప్రసవం తర్వాత వచ్చే మొదటి చిక్కటి పసుపు పాలు పిల్లల ఆరోగ్యానికి అమృతంలానే పనిచేస్తాయి. వీటిని ముర్రుపాలు అని అంటారు. ప్రసవించిన తరువాత గంటలోపు పిల్లలకు ముర్రుపాలు పడితే అవి  పిల్లల శారీరక,  మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. కేవలం ముర్రుపాలు మాత్రమేకాదు. పిల్లలకు రోజువారీ తల్లిపాలు ఇవ్వడమే శ్రేష్టం.  తగినంత పరిమాణంలో తల్లిపాలు ఉండేలా చూసుకోవడం ప్రసవించిన ప్రతి మహిళకూ  అవసరమని  వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలివ్వడం గురించి పక్కన పెడితే బిడ్డను మోసి కనడంతో తమ అందం చెదిరిపోతుందనే అపోహలో చాలామంది మహిళలున్నారు. కానీ బిడ్డను మోసి కనడంలో ఉన్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ప్రసవం తరువాత కూడా తల్లి పాలివ్వడంలో ఆలోచించే మహిళలు చాలామంది ఉంటున్నారు. అందుకే తల్లిపాలివ్వడం  వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, బిడ్డలకు తల్లిపాలు ఇచ్చేలా  ప్రోత్సహించే   లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటారు. పుట్టిన ఆరు నెలల వరకు నవజాత శిశువుకు రోజూ తల్లిపాలు అందేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలలో ఉండే సూక్ష్మపోషకాలు నవజాత శిశువుల మెదడు అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు కూడా వెల్లడించాయి. శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలు.. శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలను అర్థం చేసుకోవడానికి  కొన్ని  పరిశోధనల్లో ప్రయత్నించారు. బాల్యంలో తల్లి పాలివ్వడం ద్వారా పొందిన సూక్ష్మపోషకాలు వృద్ధాప్యంతో మెదడు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది. క్రమం తప్పకుండా తల్లిపాలు తాగే పిల్లలు తల్లిపాలు లేని పిల్లల కంటే ఎక్కువ మేధో అభివృద్ధి,  పనితీరును కలిగి ఉంటారు. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో ప్రయోజనాలు.. పిల్లలకు తల్లిపాలివ్వడం  ప్రారంభించిన మొదటి  నెలలలో మైయో-ఇనోసిటాల్ అనే సూక్ష్మపోషకం తల్లిపాలలో ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న శిశువు మెదడుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది,  ఇది మెదడులోని న్యూరాన్ల మధ్య సినాప్సెస్ లేదా కనెక్షన్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా, భవిష్యత్తులో నరాల సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించడంలో  మెరుగ్గా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే.. మొదటి నెలల్లో పిల్లల  మెదడు ముఖ్యంగా ఆహార లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సూక్ష్మపోషకాలు మెదడుపై ఎలా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనేది విషయం పట్ల న్యూరో సైంటిస్ట్ లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లిపాలలో ఇంత గొప్ప పోషకాలు ఎలా ఉంటున్నాయనేదాని మీద కూడా వీరు ఏ నిర్ణయాన్నిస్పష్టంగా చెప్పలేకున్నారు. కానీ తల్లిపాలు బిడ్డ మెదడు అభివృద్ధిలో  వివిధ దశలకు కూడా సహాయం చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.   ఏది ఏమైనప్పటికీ 6నెలల లోపు పిల్లలకు తల్లిపాలకు మించిన గొప్పఆహారం దొరకదనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ప్రసవించిన స్త్రీకి సహజంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే పాలు బిడ్డల ఆరోగ్య భవిష్యత్తుకు వరం.                                                                       *నిశ్శబ్ద.  

చలికాలమని బెంగ ఎందుకు పిల్లల రక్షణ ఇలా సులువు!!

చలికాలమని బెంగ ఎందుకు పిల్లల రక్షణ ఇలా సులువు!! చలికాలం అంటే అందరికీ వణుకు పుడుతుంది. ఈ కాలంలో జబ్బుల సమస్యలు కూడా ఎక్కువే. కేవలం చలి మనల్ని వణికిస్తుందనే మాట అటుంచితే చలి వల్ల చర్మం దెబ్బతింటుంది, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి, దానికి అనుబంధంగా వచ్చే సమస్యలు బోలెడు. పెద్దవాళ్లే ఈ సమస్యకు కుదేలైపోతారు. అలాంటిది ఎంతో సున్నితమైన చర్మం, మరెంతో తక్కువ ఇమ్యూనిటీ కలిగిన చిన్న పిల్లల మాటేమిటి?? వారికి స్వేట్టర్లు వేసి రక్షణ ఇవ్వడం నుండి తినడానికి ఇచ్చే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ సవాల్ విసిరేదిగా ఉంటాయి.  అయితే చలికాలంలో చిన్నపిల్లల సంరక్షణ పెద్ద సమస్య కాదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలంతే అంటున్నారు పిల్లల వైద్యులు. పిల్లల కోసం పెద్దలకు కొన్ని చిట్కాలు.. పైన చెప్పుకున్నట్టు పెద్దల కంటే పిల్లల చర్మం సున్నితత్వం ఎక్కువ. కాబట్టి కాస్త చలిగాలి సోకినా చాలా తొందరగా ప్రభావం అవుతుంది. అంతేనా చర్మం పగుళ్లు వచ్చి మంట పుడుతుంది. వాటికి ఏమి చేయాలో తెలియని పసితనం పిల్లలది. చలికి దురద పెడితే బాగా గోకేస్తుంటారు. ఆ తరువాత అది కాస్తా మంట పుట్టి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. అందుకే పిల్లలకు రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ రాయాలి. చర్మం ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే పిల్లలు రాత్రి సమయంలో నిద్రపోతారు కాబట్టి చర్మం కొలుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. అలాగని ఉదయం రాయకూడదని కాదు. రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ ప్రభావవంతంగా పని చేస్తుంది. పిల్లల కోసం ఎంచుకునే మాశ్చరైజర్ క్రీములు ఎప్పుడూ సహజత్వంతో నిండినవై ఉండాలి. ఎక్కువ ఘూఢత ఉన్నవి, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసినవి, కృత్రిమ రంగులతో నిండినవి అసలు ఎంచుకోకూడదు. ఇక పిల్లలకు తరచుగా ఎక్కువ ఎదురయ్యే సమస్య పెదవులు పగలడం, అలాగే పెదవుల మూలల్లో చీలడం. ఇది ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టమవుతుంది. ఏమైనా తినడానికి పెదవులు తెరచినప్పుడు మూలలు సాగి చీలిన ప్రాంతంలో రక్తస్రావం కావడం జరుగుతుంది. దీనికి చక్కని సొల్యూషన్ పెట్రోలియం జెల్లీ. వైట్ పెట్రోలియం జెల్లీలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్ ఇవ్వదు. కాబట్టి పెట్రోలియం జెల్లీని గంటకు ఒకమారు రాస్తూ ఉంటే ఒకరోజులోనే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక తరువాత ఈ సమస్య రాకూడదంటే డైలీ రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ అప్లై చేయాలి. పిల్లలకు సాధారణంగానే చిరాకు తెప్పించే విషయం డైపర్. పెద్దలకు సౌకర్యంగా ఉంటుందని, పిల్లలు బట్టలను పాడు చేయకుండా ఉంటారనే కారణంతో డైపర్లు వాడుతున్నారు ఈ కాలంలో. అయితే వాటిని అపుడపుడు చెక్ చేస్తుండాలి. లేకపోతే డైపర్ల వల్ల పిల్లలకు రాషెస్ వచ్చి చర్మం దెబ్బతింటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చల్ల నీళ్లు, చల్లని ఆహారం, ఐస్ క్రీమ్స్, కేక్స్ లాంటి ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టకూడదు. ఎక్కువ సమయం స్నానం చేయించడం,  స్నానం సమయంలో శరీరాన్ని పదే పదే రుద్దడం చేయకూడదు. అలాగే చలి కాలం కదా అని స్నానానికి మరీ వేడినీళ్లు ఉపయోగించకూడదు. స్నానం తరువాత పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి, తరువాత మాశ్చరైజర్ రాయాలి. వేసే దుస్తులు వెచ్చదనాన్ని ఇచ్చేలా కాస్త వదులుగా ఉండాలి. చలి అనే నెపంతో బిగుతు దుస్తులు వేయకూడదు. ఉన్ని దుస్తులు వేయడం మంచిది.  పిల్లలకు చర్మ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు కొబ్బరి నూనె లాంటి సహజ మార్గాలతో తగ్గకపోతే ఇతర సొంతవైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.                                        ◆నిశ్శబ్ద.

పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి!

పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి! చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది. మొదట్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఆ తరువాత పిల్లలు ప్రశ్నల పుట్టలు అవుతారు. వారు ఇంట్లో ఉంటే ప్రతి విషయం గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ఎలా ఉంది?? ఇది ఎలా ఉంది?? అదేంటి?? ఇది ఎందుకు ఇలా ఉంది?? వంటి ప్రశ్నలు పిల్లల నుండి వస్తూనే ఉంటాయి. చాలామంది ఇలా పిల్లలు ప్రశ్నిస్తున్నప్పుడు "పెద్ధయ్యే కొద్ది నీకు అర్థమవుతాయి లే" అని తోసిపుచ్చుతారు. కానీ వారు అడిగిన వెంటనే ఆ ప్రశ్నలను పరిష్కరిస్తే వారి మనసు, వారి ఆలోచన ఎంతో చురుగ్గా మారుతాయి. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడూ అనిచివేయకుడదు. పనులు అప్పగించాలి.. పిల్లలు చేయదగిన చిన్న చిన్న పనులు కొన్ని ఉంటాయి. మొక్కలకు నీరు పోయడం, మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు బయటకు తీయడం, వండుతున్న పదార్థానికి కావలసిన దినుసులు అందించమనడం. ఈ పనులు చేసేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండటం వల్ల పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏవైనా దెబ్బలు తగిలించుకుంటారేమో అనే భయం కూడా ఉండదు.  కొత్తగా ఉండాలి.. పిల్లలకు చేసిన పని మళ్లీ చేయాలంటే విసుగు వస్తుంది, వారు తొందరగా ఆసక్తిగా కోల్పోతారు. కాబట్టి వాళ్ళ మెదడు పదునెక్కాలంటే వాళ్లకు అప్పగించే పనులు  కొత్తగా ఉండాలి. పాత పని పిల్లలకు  నచ్చితే వాళ్ళే దానివైపు వెళతారు. భాగమవ్వాలి… పిల్లలతో తల్లిదండ్రులు భాగమైనప్పుడు పిల్లలు మరింత చురుగ్గా, ఆసక్తిగా పనులు చేస్తారు. వీలైనవరకు పెద్దలు పిల్లతో కలసి పనులు చేయాలి. ప్రకృతికి దగ్గరగా.. పిల్లలు ఇంట్లోనే ఉంటే వారి మెదడు అంతగా ఎదగదు. ప్రకృతికి దగ్గరగా ఉన్నపుడే వారి మెదడు ఉత్సాహంగా మారుతుంది. చెట్టు, చేమ, కొండలు, నీరు ఇవి మాత్రమే కాకుండా దేవాలయాలు, మ్యూజియం, పురాణ కథలు.. ఇలా ఎన్నో పిల్లల మెదళ్ళలో పాదరసంలా మారుతాయి.  కాబట్టి పిల్లలు చురుగ్గా . వారి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలంటే ఇవన్నీ ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకుని ఫాలో కావాలి.                                           *నిశ్శబ్ద.

పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు!

పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు! బరువు పెరగలన్నా, తగ్గాలన్నా, ఆహారాన్ని నియంత్రించుకోవలన్నా, రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవాలన్నా ప్రతిదానికి ఓ డైట్ ప్లాన్, ఓ సమయ పాలన ఉంటుంది. కానీ ఎత్తు పెరగడమనే విషయంలోకి  వస్తే.. అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎత్తు పెరగడం అనేది చిన్నతనం నుండి ఓ దశలోకి వచ్చి ఆగిపోతుంది. ఓ దశాబ్ద కాలాన్ని సరిగ్గా గమనిస్తే పిల్లలు తగినంత ఎత్తు పెరగడం లేదనే వాస్తవం అర్థం అవుతుంది. పిల్లలు పెరగాల్సిన వయసులో  వారు ఎత్తు పెరగడానికి తగిన వాతావరణం, తగిన ఆహారం లభించకపోవడమే పిల్లల్లో ఎదుగుదల లేకపోవడానికి కారణం అవుతుంది. పిల్లల ఎత్తును పెంచడానికి ఉత్తమ మార్గం తెలుసుకుంటే ప్రతి తల్లి తమ పిల్లల విషయంలో దాన్ని చక్కగా ఫాలో అవ్వచ్చు...  సాధారణంగా పిల్లలఎత్తు ప్రధానంగా జన్యువులతో నిర్ణయించబడుతుంది. అయితే, జీవనశైలి సరైన జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడంలో చాలా వరకు సహాయం చేస్తుంది. ఆటలు ముఖ్యం.. పిల్లల్ని స్కూళ్ళు, ట్యూషన్లతో ఎప్పుడూ కట్టేసినట్టు ఉంచకండి. రోజులో కొంతసేపు కింది ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటలు, ఈత, బాస్కెట్‌బాల్ వంటివి పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి.  ఆహారంలో తగినంత ప్రోటీన్ చేర్చడం మరీ ముఖ్యం.  సరైన స్థాయిలో కాల్షియం, విటమిన్ డి పిల్లలకు అందించడం మరెంతో ముఖ్యం.  పొడవాటి ఎముకలలోని ఎపిఫైసెస్ (గ్రోత్ ప్లేట్లు) ఫ్యూజన్ కౌమారదశలో వస్తాయి. ఈ గ్రోత్ ప్లేట్లు ఫ్యూజ్ అయిన తర్వాత, నిలువు ఎముక పెరుగుదల ఆగిపోతుంది. అంటే తరువాత ఎత్తు పెరగదు. అబ్బాయిలకు సగటున 16-18 ఏళ్లు, బాలికలకు 14-15 ఏళ్లు సమయం ఎత్తు పెరుగుదలకు చివరి దశ.  ఈ సమయంలో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి మందగించి ఎపిఫైసెస్ ఫ్యూజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహజమైన మార్గాలు ఉన్నాయి, ఇవి సరైన ఎత్తుకు చేరుకోవడంలో సహాయపడతాయి. వీటిలో పైన చెప్పుకున్నట్టు  ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి బాగా అందేలా చూసుకోవాలి. ఆటలు ఆడటం  తప్పనిసరి. ముఖ్యంగా బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ వంటి ఎముకల పొడవును ప్రేరేపించే ఆటలు ఆడించాలి.  పొడవు పెరగాల్సిన దశ దాటిపోయాక ఎన్ని ప్రయోగాలు చేసినా పొడవు ఒరేగడం కుదరదు. ఈ విషయన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.  ముఖ్యంగా పిల్లలజీవనశైలిలో ఆహారంలో తెలియని మార్పులు చేసే ముందు ప్రతి తల్లి వైద్యులను సంప్రదించిన తరువాతే వాటిని పాటించాలి.                              ◆నిశ్శబ్ద.  

పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు!

పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు! వేసవి సెలవులు ప్రారంభమయ్యాక పిల్లలను కంట్రోల్ చెయ్యడం పెద్దలకు కాస్త కష్టమే. మండిపోతున్న ఎండల్లో పిల్లలను బయటకు పంపాలంటే భయం. అలాగై వాళ్ళు ఇంట్లో ఉండాలంటే చాలా చిరాకు పడతారు. ఈ కారణంగా పిల్లలకు టీవీ, మొబైల్, వీడియో గేమ్  వంటివి చేతిలో పెట్టి వారిని  కంట్రోల్ చేస్తుంటారు. దీనికి తోడు ఫుడ్ విషయంలో కూడా బోలెడు రకాలు చేయించుకుని తింటూ, ఆయిల్ ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ కారణాల వల్ల పిల్లల్లో బద్దకం, బరువు పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి ఆక్టివ్ గా చేయడానికి కొన్ని యోగాసనాలు రోజూ ప్రాక్టీస్ చేయించడం మంచిది. దీనివల్ల పిల్లల శరీరం దృఢంగా మరడమే కాదు, చాలా చురుగ్గా ఆలోచనా తీరులో మరింత ముందుంటారు. ఆ ఆసనాలు ఏమిటంటే. తాడాసనం.. పిల్లల ఏకాగ్రతను పెంచడానికి, వారు క్రమం తప్పకుండా తాడాసనం సాధన చేయాలి. తాడాసన సాధనతో పిల్లల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు. వృక్షాసనం.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేనప్పుడు రోజంతా ఇంట్లోనే కంప్యూటర్, మొబైల్, టీవీ చూస్తూ గడిపేస్తే బాడీ పెయిన్ పోగొట్టుకోవడానికి వృక్షాసనం మంచి ఎంపిక. రోజంతా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల వారి శరీరం నొప్పులు మొదలవుతాయి. ఇది కాకుండా, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో వృక్షాసనాన్ని అభ్యసించే అలవాటును పెంచాలి. వృక్షాసన అభ్యాసం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్ను, మెడ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ధనురాసనం.. పిల్లల శరీరం దృఢంగా మారడానికి, కండరాల బలం కోసం ధనురాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం పిల్లల వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. వెన్ను, చేయి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక శ్రమను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది.                                         ◆నిశ్శబ్ద.

పిల్లలు అలగడం నేర్చుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా!

పిల్లలు అలగడం నేర్చుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా! మీ ఇంట్లో పిల్లలు ప్రతివిషయానికీ అలుగుతున్నారా? తిండి మానేసి మరీ తమ అలకను ప్రదర్శిస్తున్నారా? అలక పోగొట్టడానికి మీరు చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదా? అయితే ఇది చదవడానికి సరైన వ్యక్తి మీరే! 'అసలు 'అలుక' అనే మాట అతి పురాతనమైంది. పురాణకాలం నుంచి వినిపిస్తోంది. సత్యభామ అలిగినప్పుడు శ్రీకృష్ణుడు బుజ్జగించిన విధం పురాణ గాథల్లో చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రామాయణ, భారత, భాగవతాల్లో దేవతలు అలిగిన సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి. ఆ తర్వాత కాలంలో అలక ప్రదర్శించే వారికి ప్రత్యేక అలక పాన్పులు ఏర్పాటు చేయడం కూడా మనం విన్నాం. అంతేనా!.... పదవులు రాకపోతే రాజకీయ నాయకులు , అత్తగారు కోర్కెలు తీర్చలేదని అల్లుళ్ళు, అవసరాలు తీరకపోతే భార్య, భర్త మీద..  ఇలా అలకలు చాలానే ఉన్నాయి. అసలెవరైనా ఎందుకు అలుగుతారు? అని ఆలోచిస్తే వారి అలక తీరాలంటే వారు కోరే గొంతెమ్మ కోర్కెలు తీరడమే మార్గమా అన్న ఆలోచన కూడా రాకమానదు. తమకు ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పడానికే మాటలు లేకుండానే 'అలక'ను వ్యక్తీకరిస్తారు. వీరు అలిగారు అని ఎవరైనా గుర్తించేలా ఉంటుంది వారి ప్రవర్తన. ఈ ప్రవర్తన ద్వారా అవతలి వారు, అసంకల్పితంగానే అలిగిన వారికి అనుగుణంగా నడుచుకోవాలన్నది అలిగిన వారి ప్రధాన ఉద్దేశం. నిజం చెప్పాలంటే ఈ అలుకకు వయస్సు, స్థాయి, స్థానం, కులం, మతాలతో సంబంధమే లేదు. సమయాన్ని, సందర్భాన్ని, అనుకూలతను బట్టి ఎవరైనా అలగవచ్చు. మన జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎదుటి వారి దృష్టిని ఆకర్షించడానికి 'అలకనే ఎందుకు ఆయుధంగా ఉపయోగించుకుంటారన్నది బోధపడుతుంది. కైకేయి అలకే శ్రీరాముణ్ణి నిర్దాక్షిణ్యంగా అడవులకు పంపేలా దశరథుణ్ణి ప్రోత్సహించింది. దక్షయజ్ఞంలో పార్వతి తన తండ్రిపై అలిగి వెళ్ళిన తరువాత జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే. తమ పిల్లలు, ఇంకా పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఏదైనా విషయానికి అలిగితే ప్రతి తల్లీ నంబరపడి, మురిసిపోతుంది. "అబ్బో వేలెడంత లేదు ఇప్పుడే అలక చూశారా!.. చూశారా! ఎంత చక్కగా అలుగుతున్నాడో” అని ముద్దు చేస్తుంది. కోరింది ఇస్తుంది. అంతే అది చాలు తమకేం కావాలన్నా ఎలా సాధించాలో తెలుసుకోవడానికి కాస్త పెద్దవగానే అలిగి అన్నం మానేస్తారు. అంతే తల్లి మనసు గిలగిల్లాడుతుంది. ఓ పదిసార్లు అలక గురించి వాకబు చేస్తుంది. అన్నం మీద అలగొద్దు. నీకేం కావాలో అదిస్తానే... అని బుజ్జగిస్తుంది. పిల్లవానికి కావాల్సింది అందుతుంది. అప్పటి నుంచి అది జీవితంలో నిరూపించబడిన సత్యంలా గోచరించి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలగొచ్చు అన్న సిద్ధాంతాన్ని పాటించడం మొదలెడతారు. ఈ అలక కూడా వారితో పాటు పెరిగి పెద్దదై కేవలం ఇంట్లో వాళ్లతోనే కాకుండా ఆఫీసులో, అత్తవారింట్లో, స్నేహితుల వద్ద, దగ్గరివాళ్ల వద్ద ఇలా తమ అలకను ప్రదర్శిస్తుంటారు. ఈ అలక వల్ల కొంత వరకూ తమ కోరికలు నెరవేరినా, కాస్త చులకన అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రతీ విషయానికీ అలిగే వారి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. ఆత్మ విశ్వాసం తక్కువ ఉంటుంది. ఇతరులపై ఆధారపడే మనస్తత్త్వం. తమ నైపుణ్యంతో కాకుండా, ఇతర మార్గాల ద్వారా ఎదుటి వారి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం. అనువుగాని చోట అధికులుగా గుర్తింపబడాలనే తపన.  ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించగలిగే పరిజ్ఞానం లేకపోవడం. స్వయం శక్తి మీద అపనమ్మకం. జరుగుబాటు లేకపోతే అసంతృప్తితో జీవించడం. మార్పును ఆహ్వానించే హృదయం లేకపోవడం. తన మాట, ప్రవర్తనే సరైనదన్న మొండి నమ్మకం. ప్రతి విషయానికీ అలిగే వారు 'తుమ్మితే - ఊడిపోయే...! ముక్కు చందాన ఎదుటివాళ్ళను భయపెట్టే అలవాటు కూడా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు అలిగితే మురిసిపోకుండా వారి ప్రవర్తన తప్పుదారిలో వెళ్లకుండా తల్లిదండ్రులే జాగ్రత్త పడాలి.                                  ◆నిశ్శబ్ద.

పిల్లలకు వాంతులు అవుతుంటే ఏమి చెయ్యాలి?

పిల్లలకు వాంతులు అవుతుంటే ఏమి చెయ్యాలి? చాలా మంది తల్లులు పిల్లలకు వాంతులు అవుతున్నాయని చెప్పడం వింటూ ఉంటాం. అయితే..  ఎక్కువసార్లు, వెంటవెంటనే వాంతులు అయితే బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టుగా గ్రహించాలి. బిడ్డకు వాంతులు అరికట్టే ప్రయత్నంలో సొంతవైద్యం చేయడం మరింత ప్రమాదకరం. బిడ్డ వాంతులు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బిడ్డ జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఏర్పడి వాంతులు అవుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ విషయంలో ఆలస్యం చేయడం  ప్రమాదకరం. కొందరు పిల్లలు అసాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు వాంతి చేసుకుంటారు. మరికొందరు పిల్లలు పాలు తాగిన తరువాత కొద్ది పాలు వాంతి చేసుకుంటారు. ఇది పాలు తాగిన ప్రతిసారీ కావచ్చు. లేదా రోజులోనో, వారంలోనో ఒకసారి కావచ్చు. ఈ తరహా వాంతుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్నప్పుడు  ఒక్కసారి ఎక్కువ మోతాదులో వాంతి చేసుకొన్నా దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే పరిస్థితి 5,6 సార్లు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బిడ్డ వాంతి చేసుకున్న వెంటనే ఏం చేయాలి ?  బిడ్డ వాంతి చేసుకోగానే తల్లి చాలా కంగారు పడుతుంది. అయితే ఆందొళనపడకుండా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుండాలి. సంవత్సరం లోపు బిడ్డ అయితే వడపోసిన గోరువెచ్చటి మంచినీటిని తాగించాలి. 'వెంటనే' పాలు ఇవ్వకూడదు. కడుపులో ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కొందరు పిల్లలు వాంతి చేసుకుంటారు. అందువల్ల వారికి వెంటనే పాలు ఇవ్వడం సరికాదు. 2,3 నిమిషాలు వేచి చూడాలి. బిడ్డ కడుపు ఖాళీ అయివుంటే, వెంటనే ఏడ్వడం ప్రారంభం అవుతుంది. ఆ సమయం పాలు ఇవ్వడానికి అనువైనది. బిడ్డ సాధారణ స్థాయిలో పాలుతాగుతూ ఉన్నప్పుడు, బిడ్డ శరీర ఉష్ణోగ్రత సరిగా ఉన్నప్పుడు వాంతి చేసుకున్నా ఫరవాలేదు. కానీ పాలుతాగడం మానేసి వాంతి చేసుకుని, శరీరం ఉష్ణోగ్రత తగ్గితే మాత్రం తక్షణం డాక్టర్ను సంప్రదించాల్సిందే. బిడ్డ జబ్బు పడ్డాడు అనడానికి ఇవన్నీ లక్షణాలుగా గుర్తించాలి. అయితే కొన్ని సార్లు బిడ్డ కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయి. అవి తాగిన పాలతో కలవడం వల్ల కూడా బిడ్డ వాంతి చేసుకునే అవకాశం ఉంది. మరికొన్ని సార్లు తాగిన పాలు, తీసుకున్న ఆహారం సాఫీగా వెళ్ళడంలో కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో తీసుకున్న మొత్తం ఆహారం, పాలు వాంతి అవుతాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారిజరిగితే ఫరవాలేదు. అది కూడా వాంతి వల్ల బిడ్డ ఏ విధమైన నీరసానికి లోను కానంత వరకు తల్లులు కంగారు పడనవసరం లేదు. గమనిక: వైద్యులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారమే ఈ సమాచారం రాయడబడింది. పిల్లల విషయంలో వైద్యుల సలహాలు చాలా ముఖ్యం.                                    ◆నిశ్శబ్ద.

మీ ఇంట్లోనే సమ్మర్ క్యాంప్

  మీ ఇంట్లోనే సమ్మర్ క్యాంప్ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది అమ్మలకి పెద్ద ఛాలెంజ్. ఎండలు మండిపోతుంటే బయటకి వెళ్ళి ఆడతాం అంటారు.  లేదా అస్తమానం టీవీ చూస్తామంటారు... అంటూ కంప్లయింట్ చేసే అమ్మకి మంచి ఆప్షన్స్ తెలిస్తే బావుంటుంది కదా. మా అపార్ట్‌మెంట్‌లో 10 ఫ్లాట్స్ వున్నాయి. సో, సమ్మర్ రాగానే అన్ని ఫ్లాట్స్‌లోని పిల్లల్ని ఓచోట చేర్చి, వాల్ళని ఎలా ఎంగేజ్ చేయాలి? ఏమేమి నేర్పించాలి అన్నది ముందే నిర్ణయించేస్తారు. సో ఇక హాలిడేస్ మొదలవగానే మా అపార్ట్‌మెంట్‌లో హడావిడి మొదలవుతుంది. మా పై ఫ్లోర్లో అరుణ దగ్గర పిల్లల బుక్స్ మంచి కలెక్షన్ వుంది. సో, తను వాళ్ళ పిల్లల రూమ్‌లో రెండు రాక్‌లు పెట్టి దానినిండా ఆ పుస్తకాలు సర్దిపెడుతుంది. ఓ లైబ్రరీలా చేసి, పిల్లలు అక్కడకి వచ్చి రీడింగ్ టైమ్‌ని స్పెండ్ చేసేలా చూస్తారు అరుణ. అలాగే పిల్లలు కొన్ని బుక్స్ ఇళ్ళకి తీసుకెళ్ళవచ్చు. అలాగే అక్కడే స్టోరీ అవర్ అని పిల్లలు ఒక్కొక్కరు తాము చదివిన పుస్తకాల్లోని కథలని మిగతా పిల్లలకి చెప్పాలి. దాని వలన పిల్లలు తాము తెలుసుకున్న విషయాలని అంతే చక్కగా అందరితో చెప్పడం ఎలాగో నేర్చుకుంటారు. అలాగే పిల్లలందరూ కలసి ఓచోట చేరి ఆ పుస్తకాలలోని విషయాలపై చర్చించుకుంటారు. అలాగే వాళ్ళని స్వంతగా కథలు రాసేలా ప్రోత్సహిస్తారు. ఇక పిల్లలకి కొత్తకొత్త ప్రాంతాలు, సంస్కృతి సంప్రదాయాలని పరిచయం చేయడం మా థర్డ్ ఫ్లోర్‌లో శారద డ్యూటీ. ఆమె ఈ నెలరోజుల్లో పిల్లలతో రకరకాల  సంప్రదాయాలని ప్రతిబింబించేలా డ్రస్సు చేయించడం, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు ఇవన్నీ మా శారదగారు ఎంతో ఇష్టంగా చేస్తారు. ఎవరికి వారు వాళ్ళవాళ్ళ పిల్లల్ని ఒక్కరినే హ్యాండిల్ చేయడానికి ఎంత సమయం, సహనం కావాలో మరికొంతమంది పిల్లల్ని కూడా కలిపి వాళ్ళందరినీ చూడటానికి అంతే  సమయం పడుతుంది. పైగా పిల్లలందరూ ఓచోట చేరితో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. మా ఫస్ట్ ఫ్లోర్లో వుండే అనిత పిల్లలందరికీ డ్రాయింగ్, కుట్లు, అల్లికలు నేర్పిస్తారు. వాళ్ళ అత్తగారు సాయంత్రం అవగానే పిల్లలందర్నీ ఓచోట చేర్చి వాళ్ళకి తెలుగు పద్యాలు, పాటలు, స్తోత్రాల వంటివి నేర్పిస్తారు. ఇక ఈ హాలిడేస్‌లో పిల్లలకి ప్రతిరోజూ ఓ పిక్నిక్కే. ఎందుకంటే ప్రతీరోజు మధ్యాహ్నం లంచ్ ఎవరో ఒకరింట్లో వుంటుంది. పిల్లలకి నచ్చిన ఐటమ్స్ చేసి అందరినీ కలిపి బఫే పెడితే కబుర్లు, ఆటపాటలతో హాయిగా బొజ్జనిండా తింటారు పిల్లలు. ఇక పిల్లల్ని బయటకి తీసుకువెళ్ళడం గురించి చెప్పాలంటే సాయంత్రం అవగానే పిల్లల్ని వాళ్ళ ఫాదర్స్ ఆఫీసు నుంచి రాగానే దగ్గర్లోని పార్క్‌కి తీసుకువెళతారు.  అలాగే ఆదవారాలలలో దగ్గర్లోని ప్లేసెస్‌కి పిక్నిక్- ఇలా ఈ నెలరోజులు ప్రతి పిల్లాడూ అపార్ట్‌మెంట్‌లోని మిగతా పిల్లలతోపాటు పెద్దవాళ్ళతో కూడా కలవటం, మాట్లాడటం చేస్తాడు. సో, సోషలైజేషన్ అలవాటయిపోతుంది వీళ్ళకి. అందరూ కలసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ముఖ్యంగా 24 గంటలూ పిల్లల్ని ఎంగేజ్ చేయాలన్న భయం వుండదు. ఎందుకంటే ఒకోరోజు ఒకరు. అలాగే రోజు మొత్తంలో ఒకో సమయంలో ఒకోరు పిల్లల బాధ్యత తీసుకుంటారు కాబట్టి మిగతావాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. పిల్లలకి ఈ హాలిడేస్ జాలీడేస్‌లా అనిపించాలన్నా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలన్నా, ఎన్నో లైఫ్ స్కిల్స్‌ని నేర్చుకోవాలన్నా ఇలా ఓ గ్రూప్‌గా చేరడం ఎంతో ముఖ్యం. సో, మీ ఇంట్లో పిల్లలకి మీరే ఓ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవచ్చు.. ఆలోచించండి.. -రమ

తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటి?

తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటి? "చిన్నపిల్లల ప్రపంచం చాలా చిన్నది. వాళ్ళ చిన్న ప్రపంచం వారికి ఎంతో ఆనందమైనది, అద్భుతమైంది. తల్లితండ్రులు పిల్లల ప్రపంచంలో అడుగు పెట్టి వారి అనుభూతులను పంచుకొని వారిలో ఒకరిలా కలిసిపోవాలి. అలా పిల్లలను మెల్లమెల్లగా వారి చిన్న ప్రపంచం నుండి మన ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి" అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్.  ప్రతీ తల్లితండ్రి తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశించడం సహజం. కానీ పిల్లల శక్తి సామర్థ్యాలను అంచనా వేయకుండా ఆశల ఒరవడిలో కొట్టుకుపోయి వారిని ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదు. సాధారణంగా తల్లితండ్రుల్లో మూడు రకాల మనస్తత్వాలవారు ఉంటారు. మొదటి కోవకు చెందినవారు - మనం ఎలాగూ కష్టపడ్డాం కదా! పిల్లలైనా సుఖంగా ఉండాలని వారు అడిగినవన్నీ సమకూర్చే తల్లితండ్రులు. రెండవ కోవకు చెందినవారు తాము ఎంతో క్రమశిక్షణతో పెరిగామని భావించి, పిల్లల పట్ల క్రమశిక్షణ పేరుతో కఠినమైన ఆంక్షల్ని విధించే తల్లితండ్రులు. ఇలా ఒకరు 'అతివృష్టి'కి మరొకరు 'అనావృష్టికి' తార్కాణాలుగా నిలిచే రెండు రకాల మనస్తత్వాలు గల తల్లితండ్రులు. ఇక మూడవ కోవకు చెందిన తల్లితండ్రులు - తమ పిల్లలు వారిలాగే మూస పోసినట్లుగా ఉండాలని ఆశించే తల్లితండ్రులు. ఈ కోవకు చెందినవారు చాలా ప్రమాదకరమైనవారు,  అత్యాశాపరులు అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ తెలివైన విద్యార్థి గణితంలో ఎప్పుడూ 90 మార్కులకు పైనే సాధించేవాడు. కానీ హఠాత్తుగా ఆ విద్యార్థికి గణితంలో 0 మార్కులు వచ్చాయి. అందుకు కారణం విచారించగా ఆ విద్యార్థి తల్లి 'నీకు గణితంలో నూటికి నూరు మార్కులు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను' అని బెదిరించిందని తెలిసింది. దానితో ఒత్తిడికి గురైన ఆ విద్యార్థి పరీక్షలు రాయలేకపోయాడు. ఆ విద్యార్థి తల్లి గణిత శాస్త్రంలో స్వర్ణపతకం సాధించిన మేధావి. తనలాగే తన కుమారుడు కూడా గణితంలో స్వర్ణపతకం సాధించాలనే ఆమె అత్యాశ ఆ విద్యార్థి మతిస్థిమితం కోల్పోయే స్థితికి దిగజార్చింది. తల్లితండ్రులు అతివృష్టి, అనావృష్టి, అత్యాశ - ఈ 'అ'త్రయం బారిన పడకుండా పరిపక్వతతో వ్యవహరించాలి. అందుకు ఈ సూచనలను పాటించండి. 1. పిల్లలను ఇతరులతో పోల్చకుండా ఉండడం. 2. పిల్లల తెలివితేటలను అంచనావేయడం. 3. పిల్లల అభిరుచులను అవగాహన చేసుకోవడం. 4. ఇంట్లో చదువుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం. 5. పిల్లలతో సన్నిహితంగా స్నేహితునిలా మెలగడం. 6. పిల్లల్లో ఒత్తిడి పారద్రోలే ఓదార్పును ఇవ్వడం. 7. అసహనాన్ని చూపకుండా వారు చెప్పిన విషయాన్ని వినడం. 8. పిల్లలను అవమానించకుండా వారిని అభినందించడం. 9. పిల్లల్లో అభద్రతాభావం కలగకుండా శ్రద్ధ వహించడం. 10. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే సంఘటనలను వివరించడం.  మూడు స్థాయిల్లో ఉన్న విద్యార్థులకు మనం అందించాల్సిన విషయాలు వేరుగా ఉంటాయి. విద్యార్థుల స్థాయిని బట్టి కొన్ని అవసరం, మరికొన్ని అనవసరం అవుతాయి..  తెలివైన విద్యార్థి కి మార్గదర్శకత్వం అందిస్తే చాలు.. సాధారణ విద్యార్థి కి మార్గదర్శకత్వంతో పాటు  ఆప్యాయత కూడా అవసరం అవుతుంది. అతిసాధారణ విద్యార్థి: మార్గదర్శకత్వం, ఆప్యాయతతో పాటు నువ్వు సాధించగలవు అనే ఆత్మవిశ్వాసం అందించాలి.  ఈ సూచనల్ని పాటించిననాడు 'I have found the hap- piness of parenthood greater than any other that I have experienced. - పిల్లల పెంపకంలో ఉన్న మాధుర్యం కన్నా మించినది మరొకటి లేదు' అన్న బెర్ట్రాండ్ రస్సెల్ అనుభవం నిజమవుతుంది. ఆ ఆనందానుభూతితో పిల్లల్ని ఆదరించి, వారి శక్తిసామర్థ్యాలను అర్థం చేసుకున్ననాడు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు.   ◆నిశ్శబ్ద.

ఇన్ఫ్లుఎంజా వైరస్ నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?

ఇన్ఫ్లుఎంజా వైరస్ నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి? ప్రస్తుత కాలంలో ఇన్ఫ్లుఎంజా-ఎ వైరస్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా  మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లోనో,  రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ఇన్ఫ్లుఎంజా రూపాంతరం తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది, సోకిన వారిలో కొందరు ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం. ఆరోగ్య నిపుణులు కూడా దీనిని తీవ్రమైన వ్యాధిగా..  ప్రాణాంతకమైన సమస్యగా పరిగణిస్తున్నారు. పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవలి నివేదికలలో, ఆరోగ్య నిపుణులు H3N2 ప్రభావం గరిష్టంగా పిల్లలలో కనిపిస్తోందని చెప్పారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా తీవ్రమైన వ్యాధితో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. విచారించాల్సిన విషయమేమిటంటే..  H3N2తో పాటు, అనేక రాష్ట్రాలలో H1N1 కేసుల పెరుగుదల కొనసాగడం. దేశంలో పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి ఆరోగ్య నిపుణులు పిల్లల కోసం ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.  ఇదెప్పుడు తగ్గుతుంది? హెచ్‌3ఎన్‌2తో సహా సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా ద్వారా వచ్చే వ్యాధులు మార్చి నెలాఖరు నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. అయితే అప్పటి వరకు దీనిని నివారించేందుకు ప్రజలంతా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం, దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు కూడా నమోదవుతున్నాయి, వీటిలో చాలా లక్షణాలు H3N2 మాదిరిగానే ఉండటం కాస్త గందరగోళ పరిచే విషయం. H3N2 ప్రభావం పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన పిల్లలలో అధిక జ్వరంతో పాటు ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కూడా తీవ్రమైన లక్షణాలు కనిపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో ICUలో ఉంచాల్సి రావచ్చు.  యాంటీ బయటిక్స్ వాడొచ్చా? సాధారణ మందులు వాడటం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా చాలా ఇన్ఫ్లుఎంజా కేసులు నయమవుతాయి, అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ మందులు తీసుకోవడం మంచిది. H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ పని చేయనప్పటికీ, చాలా మంది తమంతట తాముగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమస్య వచ్చిన పిల్లలకు సొంతంగా యాంటీబయాటిక్స్ ఇవ్వవద్దని వైద్యులు తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు. మీకు ఈ వైరస్ సోకిన లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించి, వారు సూచించిన మందులను మాత్రమే వాడాలి. వైద్యులు H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు  సూచించారు, వీటిని అనుసరించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోటిని కర్చీఫ్ అడ్డుగా ఉంచుకోవాలి.. క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి.   కరోనా సమయంలో ఎలాగైతే ఫేస్ మాస్క్ ధరించారో.. అలాగే ఇప్పుడూ జాగ్రత్తగా ఫేస్ మాస్క్ మైంటైన్ చెయ్యాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం ఉత్తమం. చేతులతో ముక్కును నోటిని పడే పడే తాకడం మానుకోవాలి.   శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి, ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి. జ్వరం, ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటే.. పారాసెటమాల్ తీసుకోవచ్చు. ఇవి తప్ప సొంతంగా ఎలాంటి మందులూ వాడకపోవడం ఉత్తమం. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి ఢోకా ఉండదు.                                    ◆నిశ్శబ్ద.

పిల్లలు దుడుకుతనంగా తయారవ్వకూడదంటే...

పిల్లలు దుడుకుతనంగా తయారవ్వకూడదంటే... పిల్లలలో దుడుకుతనం సహజమేకాక, స్వాభావికం కూడా. తన భద్రతకు, తన సంతోషానికి, తన వ్యక్తిత్వానికి ముప్పు వాటిల్లుతోందని అనిపించినప్పుడు పిల్లలు దుడుకుతనాన్ని ఆశ్రయిస్తుంటారు. కారణాలు పిల్లలు దుడుకుతనాన్ని ప్రదర్శించడానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు రకరకాల కారణాల్ని వివరిస్తుంటారు. ప్రతి మనిషిలోనూ స్వతహాగా పోరాడేతత్వం వుంటుందనీ అది బాల్యంలో దుడుకుతనం ద్వారా ప్రదర్శితమవుతుంటుందనీ అంటారు కొందరు. తల్లిదండ్రులు, సహోదరులు, సాటి పిల్లల నుంచి దుడుకుతనపు అలవాట్లు పిల్లలకు వంటపడతాయని అంటారు మరికొందరు. అలాగే పిల్లవాడు దుడుకుతనాన్ని ప్రదర్శించినప్పుడు పెద్దవాళ్లు మెచ్చుకోలు ద్వారా ప్రోత్సహాన్ని అందించుతోంటే కూడా అతనిలో ఆ స్వభావం జీర్ణించుకుపోతుంది. దుడుకు చేష్టలపట్ల సమాజపు దృక్పథం కూడా మనుషుల్లో దుడుకు స్వభావాల్ని ప్రవేశపెడుతుంది. ఈ రోజుల్లో వెలువడుతున్న పాపులర్ సినిమాలు, నవలల్లో వయొలెన్స్ చూపించడం జరుగుతోంది. ఇలాంటి వాటివల్ల ఇతరులతో  దెబ్బలాడడం దుడుకు చేష్టలకు దారి చూపుతుంది.  ఈ పై చెప్పిన కారణాలలో ఒక్కోటి ఒక్కో పిల్లాడిమీద తన ప్రభావాన్ని చూపి అతడిలో దుడుకు స్వభావానికి మూలకంగా పనిచేస్తుంది. పిల్లల్ని అతి గారాబంగా పెంచడం, అతి క్రమశిక్షణలో పెంచడం లాంటివి కూడా వాళ్లలో దుడుకు స్వభావానికి పునాదుల్ని వేస్తాయి. అతి గారాబం మంచిది కాదు పిల్లలు దుడుకుగా తయారుకావడానికి ఒక ముఖ్య కారణం అతి గారాబపు పెంపకం. మరీ గారాబంగా పెంచడంవల్ల పిల్లలకు రెండు రకాల నష్టం జరిగే అవకాశం వుంది. పిల్లవాడు పనికిమాలినవాడుగా, పిరికి వాడుగా తయారుకావచ్చు. పిల్లల్ని ఎంత గారాబంగా పెంచినా అవసరమైన సందర్భాలలో వాళ్లపట్ల ఖచ్చితంగానూ, కఠినంగానూ వ్యవహరిస్తుండాలి. కొన్ని రకాల దుడుకు పనుల్ని అనుమతించేది లేదని పిల్లవాడికి స్పష్టంగా తెలియజెప్పాలి. తోటి పిల్లల్ని చావగొట్టడం, బనాయిస్తూ ఏడిపించడం లాంటి పనులు చేయనివ్వకూడదు.  మరీ భయభక్తులూ ఉండకూడదు పిల్లలను మరీ భయభక్తులతో పెంచడం వల్ల కూడా దుడుకుతనం ఏర్పడడానికి ఆస్కారం వుంటుంది. మరీ భయభక్తులతో పెంచడం వల్ల పిల్లలు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో పడిపోయి తల్లిదండ్రులమీద కలిగే తిరుగుబాటు భావాల్ని, కోపాల్ని ఇంట్లో ప్రదర్శించలేక బయటి సాటి పిల్లలమీద ప్రదర్శిస్తూ అగ్రెసివ్గా తయారవుతారు. ఇలాంటి పిల్లలలో ఎక్కువగా బాధ్యతారాహిత్యం తొంగిచూస్తుంటుంది. సమర్ధించనివ్వకూడదు.  అగ్రెసివ్ వుండే పిల్లలు బయట పిల్లలతో దెబ్బలాడి వచ్చినప్పుడు తమను తాము సమర్ధించుకోడానికి ప్రయత్నిస్తారు. అలా సమర్ధించుకోవడాన్ని తల్లిదండ్రులు అనుమతించకూడదు. ఖండించడానికి ప్రయత్నించాలి. మూలకారణాన్ని వెతకాలి పిల్లవాడు దుడుకు స్వభావాన్ని ప్రదర్శిస్తూ అగ్రెసివ్ ప్రవర్తిస్తున్నప్పుడు తల్లిదండ్రులు అందుకు మూలకారణం  ఏమై వుంటుంది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అతడిని తాము విమర్శిస్తున్నారా ? అతడికి అవసరమైన ప్రోత్సాహం, మెచ్చుకోలులు లభించడంలేదా? శారీరకంగా ఏదన్నా అంగవైకల్యం వుంటే తోటిపిల్లలు అతణ్ణి గేలి చేస్తున్నారా ? లాంటివి తెలుసుకోవాలి. కొందరు పిల్లలు ఇంట్లో తాము కోరుకునే ప్రేమానురాగాలు లభించకపోతే అగ్రసేవ్ ధోరణిలో ప్రతిస్పందిస్తుంటారు. కాబట్టి పిల్లాలు దుడుకుగా ఉండకూదంటే.. పైన చెప్పుకున్న విషయాలను పాటించాలి.                                        ◆నిశ్శబ్ద.

పిల్లల పేచీ శాస్త్రం

పిల్లల పేచీ శాస్త్రం ఒకోసారి పిల్లలు పెట్టే పేచీలు అర్థం కావు. ఎందుకు ఇంత చిన్న విషయానికి  పేచీ పెడుతున్నారు అనుకుంటాం.  మొండిగా, ఎదురు సమాధానం చెప్పగానే మనకి కోపం వస్తుంది. కానీ పిల్లలలోని ఇలాంటి పేచీలకి, మొండితనానికి మూలాలు తెలుసుకోకుండా ఆ నిమిషానికి  ఏదో ఒకటి సర్దిచెప్పటమో, లేదా గట్టిగా అరచి ఉరుకోబెట్టటంతోనో  ఎలాంటి లాభం ఉండదు అంటున్నారు నిపుణులు. పదే పదే పిల్లలు పేచీ పెడుతుంటే ఒక్కసారి వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు అని ఆలోచించాలి. కొంతమంది పిల్లలకి అమ్మ వాళ్ళతో సరిగ్గా సమయం గడపకపోతే కోపం, ఉక్రోషం వస్తాయి. అది ఎలా వ్యక్తం చేయాలో తెలియక అమ్మతో ఏదో ఒకరకంగా గొడవకి దిగుతారు.   ఎదురు చెబుతారు. ఏడుస్తారు.  అలాంటప్పుడు అమ్మ వాళ్ళతో ఆడుకోవటం, దగ్గర కూర్చుని చదివించటం, కథలు చెప్పటం వంటివి చేస్తే పిల్లలు ఉషారుగా వుంటారు.  అమ్మ చెప్పినట్టు వినటానికి ప్రయత్నిస్తారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడతారు. కానీ పదే పదే అమ్మ, నాన్న వాళ్ళని ఇలా వుండు, అలా వుండు అని చెబుతుంటే నచ్చక  ఆ చికాకుని  పేచీలుగా బయట పెడతారు. ఒకటి రెండుసార్లు పిల్లలు నాకు తెలుసు అనటం విన్నాక అర్థం చేసుకుని వాళ్ళని డిమాండ్ చేయకుండా, నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడితే పిల్లలు కూడా పంతానికి పోకుండా వుంటారు. అంతే కాకుండా పిల్లలు ఎదురు చెప్పగానే మనం కూడా వెంటనే రియాక్ట్  అవకుండా, చూసి చూడనట్టు వదిలేయాలి. అలా అని వాళ్ళకి మంచి, చెడు చెప్పద్దని కాదు. కానీ పిల్లలకు అర్థం అయ్యేలా ఏదన్నా చెప్పాలంటే దానికి ఎమోషన్స్‌ని చేర్చకూడదు. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మూడ్ చూసి నువ్వు నిన్న చేసింది కరక్టేనా? అలా చేయకూడదు కదా? అని నెమ్మదిగా చెబితే వాళ్ళు ఆలోచనలో పడతారు. ఇంకోసారి వాళ్ళ చికాకుని మీకు ఎలా చెప్పాలో నేర్చుకుంటారు. పిల్లల పేచీలని గమనిస్తూ , వాటికి శాశ్వత పరిష్కారం వెతకటం ఎలా అంటే పిల్లల మానసిక నిపుణులు చెప్పే సమాధానం ఒక్కటే... చిన్నప్పటి ఆ పేచీలే పెరిగి పెద్ద అవుతున్న కొద్ది వారి వ్యక్తిత్వంలో భాగంగా మారి, మాటవినని దశకి తీసుకువస్తాయి. అందుకే చిన్నగా ఉన్నప్పుడే సమస్య ములాలని గుర్తించి, పిల్లలతో మాట్లాడితే వాళ్ళు క్రమంగా నేర్చుకుంటారు. నచ్చలేదు అన్న విషయాన్నిఎలా చెప్పాలి... మనసులో వున్న బాధని, కోపాన్ని ఎలా ఎదుటివాళ్ళకి చేర్చాలి అన్నది పిల్లల ఎదుగుదలలో నేర్చుకోవలసిన ప్రథమ పాఠం.దానికి టీచర్లం మనమే. కొంచం ఓర్పు, మరికొంచం నేర్పుతోనే అది సాద్యం .

Dealing with Picky Eaters

Dealing with Picky Eaters   Getting kids to eat food is definitely not a joke!,,infact, getting them to try a new veggie or a new dish is so tough. They have issues with foods that look green, that taste sour, which have tomatoes....everything is a problem..i just dont understand why they refuse to try anything..i wonder if the older generations were like this, or is it because i had a picky eater i feel this is the only tough generation ?! They ask for something to eat and by the time we prepare it, they dont want it anymore...ufff, thats it ! We have to do something about changing this frustrating pattern. Lets get started ... To deal with picky eaters, we have to start with very small portions. Use positive words such as 'This is a very small bowl of boiled green peas, it is so easy to eat', instead of threatening the child using words such as 'if you dont finish it faster, i am going to take away your toys'. Once the child finishes the offered peas, give him/her a favorite food. Appreciate even if they try just once or two pieces of a new food or vegetable, though it is frustrating and disappointing that you made it spending your time and they try only a bit. Offer new foods during snack time, incase they dont like it, their mood or after-taste will not spoil their interest to eat a meal. Keep offering a certain new item again and again, instead of asking once and stopping to offer again if they refuse the first time. Offering kids treats and drinks more than healthy foods such as fresh fruits, dairy and vegetables tends to decreas their interest to try the latter ones, as they know they have an alternate choice. You offer only healthier food, they will have no choice but to accept to try it. Spacing snack time and meals is also important..appropriately spaced snack time and meals do more good to them, compared to the too closely spaced schedules that force them to not feel hungry and end up not eating properly and leaving them disinterested to eat well. Making friends with healthy eaters is a smarter option, as kids learn silently and tend to mimic friends most of the time. I understand that a bad company spoils everything, friends of your kids may be good eaters but if their parents dont follow healthy rules, their kids end up eating more of unhealthy foods and then you child goes their for playdates and learns the same stuff...who will you explain ? Will you teach their kids to eat healthy, or will you explain their parents the harm unhealthy foods do to anyone..would they even listen, forget about following you ?! Hence, it is so good important to teach about nutrition and food values to our own children. Parents should be the examples for everything good...you eat fruits and veggies and they will follow...even if you dont like a certain food, kindly dont annouce your disinterest aloud. Also observe if your child has any food allergy or any irritation and if that be the reason he/she is refusing to try a certain food the second time. Go slow and steady with introducing new food. Follow a Step by step speed. Introduce another new food only after the child likes a particular new item she/he has tried and liked and eaten thrice. Eating together at a dining table, as a family brings alot of better change...right from the day of the child's first solid food, if they sit with the family for meals, they observe everyone having the family meals and register that they eat what the family eats. Meal time should be the best family time of the day, every day. Handling picky eaters is easier when we keep our cool, with no frustrations amd jitters. Pediatricians say that most children pass through this stage during their 3-4yrs age. Keep this in mind and dont worry...once this phase fades outs, you will naturally see your child trying new foods and asking for new tastes....very soon your picky eater will be a healthy eater. - Prathyusha

పిల్లల ఆహారం విషయంలో అందరూ చేస్తున్న పొరపాట్లు!

పిల్లల ఆహారం విషయంలో అందరూ చేస్తున్న పొరపాట్లు! ప్రసవం అయిన తరువాత పిల్లల ప్రపంచంలో తల్లిదండ్రులకు రోజులు ఇట్టే గడిచిపోతాయి. అయితే తల్లులకు మాత్రం పిల్లల విషయంలో ప్రతి రోజూ యుద్దంలానే సాగుతుంది. పిల్లల జాగ్రత్త నుండి తాము జాగ్రత్తగా ఉండటం వరకు రెండు పడవల మీద ప్రయణంలా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు తల్లిపాలు స్థానంలో ఇచ్చే పోషకాహారం, తల్లిపాలతో జతగా అందించే ఆహారం  గురించి చాలామందిలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.  ఏ వయస్సులో పిల్లలకు అనుబంధాహారాన్ని ప్రారంభించాలి అనే విషయం చెప్పడంకన్నా, ఏ వయస్సులో ప్రారంభించకూడదు చెప్పడం సులభమని చాలామంది చెబుతారు. అనుబంధాహారాన్నివ్వడం కొందరు ఆలస్యం చేస్తూ ఉంటే ఇంకొందరు డాక్టర్లు, ఆరోగ్యకర్తల సలహాపై 2, 3 నెలలకే ప్రారంభిస్తున్నారు. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు. సామాజిక మాద్యమలలో ప్రస్తుతం విపరీతమైన యాడ్స్ వస్తూ పిల్లల అనుబందాహారం గురించి లెక్కలేనన్ని ప్రొడక్ట్ లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇవన్నీ డాక్టర్ల సిఫారసు అనే స్టాంప్ ను ఒకదాన్ని తగిలించుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయి.  పిల్లలకు పెట్టదగినదే అయినా ఇలాంటి ఆహారం డాక్టరు సలహాపై తప్ప పిల్లలకు 4 నెలలు నిండకనే పెట్టకూడదు. అనుబంధాహారం పిల్లలకు పెట్టె విషయంలో చెప్పుకోవాల్సిన కొన్ని శాస్త్రీయమైన కారణాల గురించి చెప్పుకుంటే…  అనుబంధాహారం త్వరగా ప్రారంభిస్తే పిల్లలు బాగా నిద్రపోతయారు. సరిపోయేన్ని పాలు త్రాగిన పిల్లలకన్నా ఇలాంటి ఆహారం తినేవారు బాగా నిద్రపోతారనుకోవడం అపోహ. నిజానికి వారు ఘనపదార్థాలను సరిగా జీర్ణించుకోలేకపోవడంవల్ల రాత్రి సమయాల్లో పదే పదే లేస్తూ ఎక్కువగా ఏడుస్తుంటారు.  ఇలాంటి ఆహారాన్ని పిల్లలకు ఇస్తుంటే  శిశువులు లావుగా అవుతారని అనుకుంటారు. అయితే ఇది చాలా తప్పు. పిల్లల లావు, తీసుకొనే ఆహారం పైనే కాకుండా వంశపారంపర్య లక్షణాలపై కూడా ఆధారపడి వుంటుంది. తల్లిపాలు త్రాగే పిల్లలు వారికి పాలు సరిపోగానే త్రాగడం మాని రొమ్ము వదిలేస్తారు. నాలుగు నెలలకు ముందే అనుబంధాహారం తినిపిస్తే వారికి ఎప్పుడు సరిపోయింది మనకు తెలియజేయలేరు. అదే 5 వ నెలలో ప్రారంభిస్తే ఆకలైనప్పుడు, నోరు తెరవడం, ఆహారం నోటిదగ్గరికి తేగానే ముందుకు వంగి సరిపోయేంత తీసుకున్నాక తలతిప్పివేస్తారు. అంటే 5వ నెలకన్నా ముందు ఆహారం తినిపించడమంటే బలవంతంగా ఆహారాన్ని నోట్లో కుక్కడమన్నమాటే. అనుబంధాహారం త్వరగా తినడం ప్రారంభించిన శిశువులు లావుగా ఉండటానికి మరొక కారణం దాంట్లో ఎక్కువ మొత్తంలో ఉండే లవణాలు. ఆహారం తీసుకోగానే దాహం వేయడంవల్ల శిశువు ఏడ్పు ప్రారంభిస్తుంది. దీనిని ఆకలనుకొని మరింత ఆహారాన్నివ్వడం జరుగుతుంది. అది శరీరంలో క్రొవ్వురూపంలో నిలువజేయబడడంతో పిల్లలు లావెక్కుతారు. చిన్నవయస్సులో లావుగా ఉన్నవారు పెద్దవారైన తరువాత కూడా లావుగా ఉండే అవకాశం ఎక్కువ. వారు రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం వ్యాధులకు తరచుగా గురవుతూ ఉంటారు. తల్లిపాలు మాత్రమే త్రాగడం వల్ల పిల్లలు మొదటి 3-4 నెలలు శిశువు బరువు పెరగనట్లైతే వారు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో లేదో డాక్టరును సంప్రదించి తేల్చుకోవాలి. శిశువు బరువు మొదటి 4 నెలలలో సరాసరి రోజుకు 20 గ్రాములు పెరుగుతుంది. ఇది కొందరి విషయంలో కొంచెం ఎక్కువ, తక్కువలు ఉండవచ్చు. బరువు పెరగనట్లైతే అనేక ఇతర కారణాలతో పాటు తల్లిపాలు సరిపోకపోవడం కూడా ఒకటి. పాలు సరిపోనప్పుడు పాల ఉత్పత్తిని పెంచే మార్గాలన్నీ ఆలోచించిన తరువాతే డాక్టరు సలహాపై అనుబంధాహారం గురించి ఆలోచించాలి. బరువు పెరగడం లేదన్న విషయం కూడా బరువు క్రమం తప్పకుండా నమోదు చేసిన తరువాతే నిర్ణయించగలము. పిల్లలు ఏడ్చిన ప్రతిసారి ఆకలితో ఏడుస్తున్నారని అనుకోవడం  పొరపాటు. శిశువుకు ఆ వయస్సులో తెలిసిన ఒకే ఒక భాష ఏడ్పు. మూత్రం పోసేముందు, విరేచనం చేసేముందు, బట్టలు బిగుతుగా ఉన్నా, చలివేసినా, ఉక్కపోసినా ఇలా ఇంకా అనేకానేక కారణాలవల్ల కూడా శిశువు ఏడుస్తుంది. కాని శిశువు ఏ కారణంవల్ల ఏడ్చినప్పటికీ నోట్లో ఏదైనా ఆహారముంచినట్లైతే మ్రింగడానికి నోరు మూయాల్సి వస్తుంది. కాబట్టి ఏడ్పు ఆగిపోతుంది. దీనిని ఆకలి అని నిర్ణయించడం తప్పు. కాబట్టి అనుబంధ ఆహారం విషయంలో తల్లులు, ఇతరులు తమకు తాము సిద్ధాంతాలు అన్వయించుకుని అవే నిజమని ఇతరులకూ చెప్పి పిల్లల విషయంలో పొరపాట్లు చేయకుండా ఉండాలి. అనుబంధ ఆహారం గురించి వైద్యుల సలహతోనే దాన్ని మొదలుపెట్టాలి.                                     ◆నిశ్శబ్ద.

Nutrition Supplements for Children

Nutrition Supplements for Children     Food quality has improved or reduced, is one thing we cannot comment about, these days but food manipulation has increased and ones appetite for nutritious food has definitely reduced. However, awareness for Organic farming and choosing Organic food has increased...if the items cultivated are truly organic or not is another big question...with all these things confusing our brains, should we offer nutrition supplements to children or not is something we cannot keep postponing to find an answer for and delay if they are necessary. This is the time that parents need to be smart and calculate the number of fresh fruit, dairy and veggie servings children consume per day and realise if there be a need to offer supplements to cover for any deficient nutrition. For Children who are seriously picky eaters, they tend to lack necessary iron and calcium firstly, followed by other important vitamins such as vitamin A, B etc.   Assuming that all children these days have vitamin and mineral deficiencies is not the right thing...Parents need not follow the common trendy 'picking on the kids' pattern and behaviour..instead, they have to observe the meal and snack schedule of every child and assess their nutrient intake...if they feel the child is looking healthy enough and eating and drinking normally then there is usually no worry. For the same reason, it is important to visit a pediatrition atleast once every year, the best practice being 'a markup visit every year after the child's birthday', making sure the Doctor checks the weight, height, hearing ability and eye-sight, iron and calcium levels of the child's body, and confirms that the child is growing up healthy and normal. Consulting the Doctor about offering supplements to the child is a smart thing to do before considering to start a regime on your own. The child may have allergic reactions to certain ingredients, or those multivitamins might clash with some other medications the child is already taking and such. Keeping these concerns aside, if you decide to give supplements and find the right kind, there are quite good number of options for every child, the most famous gummy treats kind, tonics, calcium-tablets kind and milk powders too, come along in multiple flavors and colors. Considering a family that has atleast one parent who is health conscious and takes care of others in the family, there may not be any deficiencies atall, in that case, supplementing may cause over dose of vitamins and minerals as certain breakfast cereals and store-bought milk are sold with added vitamins and iron. Also, doing a thorough research on the ingredients of every nutrition supplement brand product is important..you dont want to end up buying a product that is famous, yet includes harmful and artificial chemicals that do no good to your child either. Be smart and choose foods and supplements correctly ! ..Prathyusha

మీ పిల్లల్ని పేలు వేధిస్తున్నాయా ?

మీ పిల్లల్ని పేలు వేధిస్తున్నాయా ?   చిన్నతనంలో చాలామందికి తలలో పేలు పడటం సాధారణ సమస్య. మనం శ్రద్ధ పెట్టి వదిలించినా, తోటి పిల్లల తలల్లో ఉంటే మళ్ళీ ఎక్కుతుంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే తప్పకుండా ఉంది. ముందుగా చిన్నారుల తల మాయకుండా శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడాలి. సర్వసామాన్యంగా మురికిలేని శుభ్రమైన తలలో పేలు ఎక్కినా నిలవ ఉండవు. వేడివేడి నీళ్ళతో తల అంటాలి. ఫోర్సుగా నీళ్ళు పోయాలి. ఇలా చేయడంవల్ల పేలు నీటి ధాటికి జారిపోతాయి. వేప గింజలను మెత్తగా నూరి, కొన్ని నీళ్ళు కలిపి పేస్టులా తయారుచేసి తలకు పట్టించి టవలు చుట్టి పడుకోబెట్టాలి. మర్నాడు తలస్నానం చేయిస్తే పేలు నశించడమే కాకుండా ఇంకోసారి ఈ సమస్యే తలెత్తదు. ఆవనూనెలో నూరిన వేప గింజల పొడి వేసి సన్న సెగపై మరిగించాలి. దించి, చల్లారిన తర్వాత వడపోసి ఆ నూనెను తలకు రాస్తూ వుంటే పేలు నశిస్తాయి. వారానికి రెండుసార్లు రాత్రి నిద్రపోయే ముందు వేప నూనెను గోరువెచ్చన చేసి, జుట్టు కుదుళ్ళకు పట్టించి బాగా మర్దనచేసి తలకు టవలు చుట్టి పడుకోబెట్టాలి. పొద్దున్నే కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తే పేలు హరిస్తాయ్.

అల్లరి పిల్లలకోసం ఫస్ట్ ఎయిడ్

అల్లరి పిల్లల కోసం ఫస్ట్ ఎయిడ్ పూర్వంతో పోలిస్తే ఈతరం పిల్లలు ఎంతో చురుగ్గా,ఉత్సాహంగా ఉంటున్నారు. ఇది కాలానుగుణంగా వచ్చే మార్పు. వాళ్ళ తెలివి, ఐ.క్యూ. చూసి ముచ్చట పడతాం. వాళ్ళ ఉల్లాసం, ఉత్సాహం చూసి మురిసిపోతాం. అంతా బాగానే ఉంది. అయితే ఈ చురుకైన చిచ్చర పిడుగులతో కొంచెం ప్రమాదమూ ఉంది. వాళ్ళ దుందుడుకు చేష్టలు ఒక్కోసారి భయాందోళనలకు గురిచేసే మాట నిజం. అవును, ఉత్సాహంగా పరుగులు పెట్టే బుడతలు ఒక్కోసారి కాలు జారి పడిపోతుంటారు. ఇంకోసారి ఏ బ్లేడుతోనో చేతులు తెగ్గోసుకుంటారు. మరోసారి కాలో, చేతులో కాల్చుకుంటారు. ఇంకోసారి ఇంకేదో ఆపదను కొనితెచ్చుకుంటారు. ఇలా మోచేతులు, మోకాళ్ళు గాయపడి రక్తం కారడం, మొనదేలిన వస్తువులతో ఆడటంవల్ల, కోసుకోవడం, వేడినీళ్ళు మీద పోసుకుని లేదా స్టవ్ అంటించుకుని శరీరం కాల్చుకోవడం లాంటివి పరిపాటి. అలాగే పిల్లలకు తరచూ ఏదో ఒక అనారోగ్యం కలగడమూ సహజమే. తిండిలో తేడా వచ్చినా, వాతావరణంలో మార్పు వచ్చినా పిల్లల్లో త్వరగా తేడా కనిపిస్తుంది. అందుకే చిన్నారులు ఉన్న ఇంట్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ ఉండితీరాలి. అకస్మాత్తుగా జరిగే ఇలాంటి అనర్ధాల నుండి రక్షించుకునేందుకు టింక్చర్ (tincture), దూది, పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్, బర్నాల్, బాండ్ ఎయిడ్ లాంటి అత్యవసర చికిత్సా సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. జలుబు, జ్వరము, కడుపునొప్పి, మోషన్సు లాంటి సాధారణ అనారోగ్యాలకు సంబంధించిన మెడిసిన్లను ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాలి. అవి ఎక్స్పైర్ అయితే పడేసి వేరేవి తెచ్చిపెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలతో బాటు పిల్లల వైద్యుడి ఫోన్ నంబర్ రెడీగా ఉంచుకోవాలి. 

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు?

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు? తల్లిదండ్రుల అవసరం లేకుండా పిల్లల్ని పెంచిన వారే ఉత్తమ తల్లిదండ్రులు. ప్రతి క్షణం పిల్లలకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే తల్లిదండ్రుల లక్షణం ఎలా ఉంటుందంటే…  మనం మొక్కలు పెంచేటప్పుడు ఆ చెట్టుకు కావలసిన నీరు, ఎరువులు సమకూరుస్తాం కానీ చెట్టుకు ఇలా ఎదుగు, అలా ఎదుగు అని ప్రతిక్షణం చెప్పం కదా! అలాగే పిల్లలకు ప్రేమ, స్వేచ్ఛను ఇవ్వాలే గానీ బందీలు చేయరాదు. తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన వాటిని పిల్లల నుండి సాధించుకోవాలనే ఆలోచన పెంచుకొని వారి మీద వత్తిడి పెంచుతున్నారు. అటువంటి వారు మంచి తల్లిదండ్రులు కాలేరు. పిల్లలు ఉత్తమంగా ఎదిగే వాతావరణం కల్పించేలా చేసే వారే మంచి తల్లిదండ్రులు. పిల్లల పెంపకం వ్యక్తిగతమైనదైనా తల్లిదండ్రులు ఆ పనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి సమాజానికి తమ సేవను సమర్ధవంతంగా నిర్వహించడానికి దీక్షతో కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో పెద్దవారు. వారు చేసే పనులు గమనిస్తూ అనుసరిస్తారు. దానిని బట్టే వారి నడవడిక, ప్రవర్తన ఆధారపడతాయి. ప్రపంచంలో సర్వదోషాలకు ఈర్ష్య, స్వార్థాలు కారణం. ఇవి పెద్దల వలన పిల్లలపై ప్రభావం చూపి చెడును ప్రేరేపిస్తాయి. పిల్లలను హద్దులో పెట్టి బాగు చేసే ప్రయత్నం కన్నా పెద్దలలో మంచి మార్పు తెచ్చుకొని బాగుచేయడం మంచిది. తల్లిదండ్రులు వారి పిల్లలను భావి పౌరులుగా ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తున్నారు. ఆ ఉత్పత్తి ప్రక్రియలో నాణ్యతా లోపం చోటు చేసుకుంటే ఆ నష్టాన్ని సమాజం 60-70 సంవత్సరాల పాటు భరించవలసి వస్తుంది.  పిల్లలను ఎలా పెంచాలి? ఐదు సంవత్సరాలు వచ్చే వరకూ పిల్లలను రాజకుమారుల్లా, అతి గారాభంగా పెంచాలి. ఆపై పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించాలి. పదహారు సంవత్సరాల తరువాత మిత్రునిలాగా భావించి పెంచాలి. అప్పుడే ప్రయోజకులవుతారు. పిల్లల్ని ప్రేమతో చూడడం వేరు, గారాబంగా పెంచడం వేరు. ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు. గారాబంగా పెంచితే మీకూ, దేశానికీ, కట్టుకున్న వారికీ సమస్య అవుతారు. చిన్నతనం నుంచీ మన తల్లి తండ్రి నుంచి మనం ఏమి కోల్పోయామో, ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికి వచ్చామో గమనించి ఆ తప్పులే మళ్ళి మనం చేయకూడదు. పిల్లలు పెరిగి ప్రయోజకులుగా మారి, మనల్ని ఉద్దరించే స్థితిలో ఉండాలి. కానీ మనమే వారిని చూసే స్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదని తెలుసుకోవాలి. చిరుప్రాయంలో తల్లి ఇచ్చే శిక్షణా విధానం పిల్లల భవిష్యత్ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయంపై కొన్నేళ్ళ క్రితం ఓ సర్వే జరిగింది. ఆ సర్వేలో వెళ్ళడైన విషయం ఇది. "ఓ తల్లి పిల్లవాడికి నడక నేర్పే ప్రయత్నంలో పిల్లవాడికి కొంత దూరంలో నిలబడి తన వైపు రమ్మని ప్రోత్సహిస్తుంది. అప్పుడు పిల్లవాడు తల్లిని చేరుకోవాలని ఆశతో ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో పిల్లవాడు అదుపుతప్పి పడిపోయి, ఏడవడం ప్రారంభించాడు. వెంటనే తల్లి పరుగున వెళ్ళి పిల్లవాణ్ణి ఓదారుస్తూ, చీ పాడునేల! నీవల్లే మా పిల్లాడికి దెబ్బలు తగిలాయంటూనే నేలను కొట్టింది. అప్పుడు పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. ఇదే విధంగా మరో తల్లి తన పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు, ఆ పిల్లవాడు తల్లి వైపు నడుస్తూ ఉండగా పడిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడి దగ్గరకు వెళ్ళకుండా దూరం నుండే 'లే నాయనా! లే లేచిరా!' అంటూ ఉత్సాహపరిచింది. ఆ పిల్లవాడు మెల్లగా లేచి నడుచుకుంటూ తల్లిని చేరుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళయిన తరువాత వారి స్వభావాన్ని పరిశీలిస్తే తేలిందేమిటి. మొదటి పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలకు, అపజయాలకు బయట పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులే కారణమని నిందించే స్వభావం కలిగిన వాడయ్యాడు. రెండవ పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలు, అపజయాలను ఎదుర్కోగల మనోబల సంపన్నుడయ్యాడు. ఆలోచనలు మనం చేసే పనుల యొక్క సున్నిత రూపాలు. అవి మెదడులో చిన్న విద్యుత్తరంగాలుగా జీవం పోసుకొని, చుట్టూ ఉండే గాలిలాగ, పీల్చుకొనే ఊపిరిలాగ మనకు తెలియకుండానే మన బాహ్యమనోపరికరాలను ప్రభావితం చేస్తాయి. అందుకే  ముఖ్యంగా పిల్లల పెంపక బాధ్యత స్త్రీల మీదే ఆధారపడి వుంటుంది.                                  ◆నిశ్శబ్ద.