మావోయిస్టు ఉద్యమం రూపు మార్చుకుంటుందా? ఉనికి మాత్రంగా మిగిలిపోతుందా?
Publish Date:Feb 27, 2026
Advertisement
మావోయిస్టు పార్టీ నక్సల్ బరీలో పుట్టి శ్రీకాకుళంలో పెరిగింది. తర్వాత తెలంగాణకు వచ్చి విస్తరించింది. ఇక్కడ నుంచి దండకారణ్యం వెళ్లి అక్కడ నుంచి దేశ వ్యాప్తంగా విస్తరించింది. అదలా విస్తరిస్తూ వెళ్తోందే కానీ అంతరించి పోవడం అనేది కల్ల. అది సాధ్యం కాని పని అంటారు ప్రొఫెసర్ ఖాశీం వంటి వారు. ఇంతకీ మావోయిస్టు పార్టీ పుట్టుక ఎప్పుడు? తర్వాత దాని విస్తరణా క్రమం ఎలాంటిదని చూస్తే.. 1967లో తొలిగా పశ్చిమ బెంగాల్ నక్సల్ బరీ గ్రామంలో ఒక రైతు పోరాటంగా మొదలైంది నక్సలైట్ ఉద్యమం. దీనికి చారుమజుందార్, కానూ సన్యాల్ నాయకత్వం వహించారు. దీని నుంచే సీపీఐ ఎంఎల్ ఆవిర్భవించింది. ఇక నాటి ఉమ్మడి ఆంధ్రలో 1980లో మావోయిస్టు పార్టీకి బలమైన పునాది వేసింది కొండపల్లి సీతారామయ్య. ఈయన 1980, ఏప్రిల్ 22న సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ స్థాపించారు. ఇది దశాబ్దాల పాటు అత్యంత శక్తిమంతమైన సాయుధ శక్తిగా ఎదిగింది. ప్రస్తుత మావోయిస్టు పార్టీ ఏర్పాటు జరిగిన సంవత్సరం.. 2004, సెప్టెంబర్ 21న. ప్రస్తుతం మనం చూస్తున్న సి.పి.ఐ- మావోయిస్ట్ పార్టీ రెండు ప్రధాన విప్లవ వర్గాల విలీనం ద్వారా ఏర్పడింది. అవేంటో చూస్తే.. దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్న పీపుల్స్ వార్ గ్రూప్, ఉత్తర భారతదేశంలోని.. బీహార్, జార్ఖండ్ లో బలంగా ఉన్న మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా కలవడంతో ఈ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. వీరి భావజాలం ప్రకారం సాయుధ పోరాటం ద్వారా అధికారం చేజిక్కించుకోవడం. మావోయిస్టు పార్టీ తొలి ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉండేవారు. ఇప్పుడు ఆయనే అడవిని వీడి.. పట్టణ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటున్నట్టు ఎస్ఐబీ గుర్తించింది. 2004లో విలీనం తర్వాత ఈ పార్టీని భారత ప్రభుత్వం తీవ్రవాద సంస్థ గా ప్రకటించి నిషేధించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అగ్రనేతల లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల కారణంగా ఈ ఉద్యమం క్షీణదశకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీ చెబుతున్న ఆ పదకొండు మంది.. మావోయిస్టులు కూడా 2004 నాటి నుంచి పార్టీలో కొనసాగతున్న పాత తరం నాయకులే. మరి కొత్త తరం ఎందుకు పుట్టుకురాలేదు? అసలు నేటి యువతలో ఈ పార్టీ విధి విధానాల పట్ల ఎందుకని పెద్ద ఆసక్తి లేదని అంటే. ఇక్కడ పార్టీ రెండు ముఖ్యమైన విషయాలను మరచి పోయిందని అంటారు కొందరు సానుభూతి పరులు. వాటిలో మొదటిది ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ కార్మికులుంటారు. వారికంటూ కొన్ని సమస్యలుంటాయి. ఆయా సమస్యల పరిష్కారానికి గతంలో మావోయిస్టు పార్టీ ఎంతో శ్రమించింది. ఉదాహరణకు 8 గంటల డ్యూటీ టైంని ఎంతో కష్టపడి కమ్యూనిస్టులంతా కలసి సాధిస్తే.. దాన్ని నేటి యువత లక్షా, రెండు లక్షల జీతాల కోసం కాల రాసింది. దీంతో కమ్యూనిస్టులతో ప్రత్యేకించి పని లేకుండా పోయింది. వారే కోరి కోరి నిబంధనలకు విరుద్ధమైన కెరీర్ ని ఎంపిక చేసుకుంటుండటంతో.. కమ్యూనిస్టులకంటూ ఒక పోరాట పంథా కొరవడింది. దీంతో మావోయిస్టులంతా కలసి అడవి బాట పట్టారు. అక్కడి ఆదివాసీలను రిక్రూట్ చేసుకున్నారు. ఆపై వారిలోంచే హిడ్మా వంటి వారిని తయారు చేశారు. ఈ కారణంగా మావోయిస్టు ఉద్యమం గతంలో వలె కాకుండా ఈ సొసైటీతో ఒక డిటాచ్మెంట్ కి గురైంది. ఆ తర్వాత తన శక్తి, భావజాలం బలహీనపడుతూ రావడంతో సాయుధ పోరాట శక్తి ప్రస్తుత భారత భద్రతా దళాల ముందు సరిపోని పరిస్థితి ఎదురైంది. దీంతోనే ఈ లొంగుబాటు వ్యవహారం. అంటే మారిన కాలమాన పరిస్థితులకు తగినట్టుగా మావోయిస్టులు తమ ఉద్యమాన్ని మలుచుకోలేక పోవడం.. ఆపై భారత భద్రతా వ్యవస్థకు దీటుగా సాయుధ సంపత్తిని, రిక్రూట్ మెంట్ ని పెంపొందించుకోలేక పోవడంతోనే ప్రస్తుతం మావోయిస్టు ఉనికి మాత్రంగా మిగిలింది. ఈ విషయంలో తెలంగాణ డీజీపీ ఇదివరకటిలా నక్సలైట్ మూమెంట్ అలియాస్ మావోయిస్టు ఉద్యమం తిరిగి కోలుకోవడం అసాధ్యమంటారు తెలంగాణ డీజీపీ ఏ సమస్యల కోసం అయితే ఈ ఉద్యమం పుట్టిందో ఆ సమస్య పరిష్కారానికి నోచుకోనంత వరకూ మావోయిస్టు ఉద్యమం ఉంటుంది, దాని రూపం మార్చుకుంటుంది అంతే అంటారు ఫ్రొఫెసర్ ఖాసిం. ఆదివాసీల్లోంచి కూడా ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర విద్యావంతులు, వ్యాపారవేత్తలు పుట్టుకురావాలని.. అప్పుడే ఈ ఉద్యమం అంతమవుతుందని అంటారు నక్సల్ సానుభూతి పరులు. మరి ఏం జరుగుతుంది? వీరంతా అంటున్నట్టు మావోయిస్టు పార్టీ రూపు మార్చుకుంటుందా? లేక మనుగడే ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుందా.. తేలాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/will-the-maoist-movement-change-shape-36-214771.html





