అటు లోక్ సభలో వాకౌట్.. ఇటు తాడేపల్లిలో విమర్శల బ్లో ఔట్.. అమరావతిపై వైసీపీ సెల్ఫ్ గోల్
Publish Date:Apr 1, 2026
Advertisement
అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 1) లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించింది. ఈ బిల్లు గురువారం (ఏప్రిల్ 2) రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ కూడా ఆమోదించగానే రాష్ట్రపతి సంతకంతో చట్ట రూరం దాలుస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఇక లాంఛనమే. అయితే లోక్ సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే అంశంపై తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడారు. ఇదే సమయంలో అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు. పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఎక్కువగా ఉండే నౌపాడలో వ్యూహాత్మకంగా వైసీపీ సభ నిర్వహించింది. ఆ వేదిక నుంచి అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రైతుల భూములు గుంజుకొని వారికి అన్యాయం చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలువిమర్శలు గుప్పించారు. నిధులన్నీ అమరావతికే ఇచ్చేస్తే ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమిటని ధర్మాన వంటి నేతలు విమర్శలు గుప్పించారు. లోక్ సభలో బిల్లు వల్ల ఒరిగేదేం లేదంటూ బొత్స సన్నాయినొక్కలు నొక్కారు. వాటికి కొనసాగింపు అన్నట్లుగా జగన్ బుధవారం (ఏప్రిల్ 1) తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధానిగా స్థిరీకరిస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదాన్ని ఖండించారు. అసలు రాష్ట్రానికి రాజధాని ఎందుకు అన్నట్లుగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలపై జగన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండేది వారానికి రెండురోజులేననీ, ఇక ఉప ముఖ్యమంత్రి అమరావతిలో ఎప్పుడు ఉంటారన్నది ఎవరికీ తెలియదనీ సెటైర్లు గుప్పించారు. అదే సమయంలో తాను వారంలో రెండు రోజులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు చుట్టపు చూపుగా వచ్చి మిగతా సమయమంతా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమౌతున్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. మొత్తం మీద జగన్ వ్యూహాత్మకంగా లోక్ సభలో అమరావతికి రాజధానిగా చట్టబద్ధత బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా మీట్ పెట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించారు. అయితే ఆ సందర్భంగా జగన్ అమరావతికి వ్యతిరేకంగా ఎంత గట్టిగా గళం విప్పితే రాజకీయంగా అంత భారీగా నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించడం లేదంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికలలో జగన్ కు ఘోర పరాజయం ఎదురుకావడానికి ప్రధాన కారణాలలో అమరావతిని నిర్లక్ష్యం చేయడం ఒకటన్న విషయాన్ని వైసీపీ నేతలే అంగీకరిస్తుండగా, జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో విపక్ష నేతగా జగన్ అమరావతిని అంగీకరించి, ఆమోదించిన విషయాన్ని కూడా ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. చంద్రబాబు వారంలో రెండు రోజులు హైదరాబాద్ వెడుతూ షటిల్ సర్వీస్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్న జగన్.. తాను వారంలో ఐదు రోజులు బెంగళూరులోనే కాపురం ఉంటున్న విషయాన్ని మాత్రం చెప్పుకోవడం లేదు. ఇక వ్యూహాత్మకం అని భ్రమిస్తూ రెండు రోజుల కిందట అమరావతికి వ్యతిరేకంగా తన పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతల చేత ప్రకటనలు చేయించిన జగన్.. గత ఎన్నికలలో ఉత్తరాంధ్ర కూడా అమరావతికి ఓటెత్తిన విషయాన్ని ఎలా మరచిపోయారని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో రెండు రోజుల కిందట ధర్మాన అమరావతికి కొత్త భాష్యం చెప్పారు. రాజధానుల మార్పు అనేది ప్రజల చేతుల్లో ఉండాలని.. గతంలో మద్రాస్ నుంచి కర్నూలు.. కర్నూలు నుంచి హైదరాబాద్ రాజధానుల మార్పును గుర్తు చేశారు. ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండడానికే జగన్ మూడు రాజధానులు అన్నారంటూ సమర్ధించారు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన మరచిపోయినదేంటంటే.. నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని ఎంపిక చేసి అభివృద్ధి చేశారన్న విషయాన్ని కన్వీనియెంట్ గా మర్చిపొతున్నారు. అంతే కాకుండా అమరావతికి వైసీపీ విపక్షంలో ఉండగా సంపూర్ణ మద్దతు ఇచ్చిందనీ, ఈ మద్దతును సాక్షాత్తూ పార్టీ అధినేత జగనే అసెంబ్లీ వేదికగా ప్రకటించారనీ విస్మరిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకే చెందిన మరో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అయితే రెండాకులు ఎక్కువే చదివారు. రాష్ట్ర సంపదను అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్న వారిని కాల్చేయాలని పిలుపిచ్చారు. ఇక సీనియర్ మోస్ట్ నాయకుడు, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే పార్లమెంటు ఆమోదం పొందినా అమరావతికి చట్టబద్ధత రాదని చెబుతున్నారు. గతంలో అమరావతిని స్మశానంతో పోల్చిన బొత్స.. ఇప్పుడు చట్టబద్ధత సైతం చెల్లదని చెప్పడం ద్వారా తన అమరావతి వ్యతిరేకతను మరో సారి చాటుకున్నారు. ఉత్తరాంధ్ర నేతల ద్వారా అమరావతి వ్యతిరేక గళం వినిపించడం అన్న జగన్ వ్యూహం వికటించకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. విశాఖ పాలనా రాజధాని అంటూ తన హయాంలో హడావుడి చేసిన జగన్ ఆ దిశగా కనీసం ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అదీ కాక విశాఖ పాలనా రాజధాని అన్న జగన్ మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదు. స్వాగతించలేదు. గత ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా తేటతెల్లం చేశాయి. ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు అమరావతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వల్ల వైసీపీకి మరింత డ్యామేజీ రావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలు చేయడం కాదనీ, ప్రగతిని నలు చెరగులా వ్యాపింప చేయడమనీ, చంద్రబాబు ప్రభుత్వం అదే చేస్తున్నదనీ పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/walkout-in-the-lok-sabha-on-one-side-45-216529.html





