Top Stories

dummy

political-news-img

గణపతీ లొంగిపోండి.. మావోయిస్టు అగ్రనేతకు డీజీపీ పిలుపు

తెలంగాణలో అజ్ఞాతంలో కొనసాగుతున్న మావోయిస్టు అగ్రనేతలకు రాష్ట్ర పోలీస్ శాఖ కీలక అల్టిమేటమ్ జారీ చేసింది. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వెంటనే లొంగిపో వాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల లొంగిపోయిన ఓమావోయిస్టు ద్వారా గణపతి ఆరోగ్యం సరిగా లేదన్న సమాచారం అందిందన్న డీజీపీ, వయస్సు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అజ్ఞాత జీవితం కొనసాగించడం కష్టమవు తుందన్నారు. గణపతి లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామన్నారు. కేంద్రం మావోయిస్టుల లొంగుబాటుకు ఇచ్చిన గడువు మంగళవారం (మార్చి 31)తో ముగియనున్న నేపథ్యంలో.. అజ్ఞాతంలో ఉన్న నాయకులు వెంటనే లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన వారికి భద్రత, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ఇంకా లొంగిపోని తెలంగాణకు చెందిన మావోయిస్టులు పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, వరు శేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రతా బాయి అలియాస్ సుజాత, నక్క సుశీల్ అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి ఉన్నారన్నారు. అడవుల్లో గడుపుతున్న జీవితాన్ని ముగించి వీరంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ మరోసారి పిలుపునిచ్చారు.

Publish Date: Mar 30, 2026 6:19PM

political-news-img

పేదల సొంతింటి కల సాకారం దిశగా మరో ముందడుగు.. ఒకే రోజు రెండున్నర లక్షల మందికి గృహాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మందితో సోమవారం (మార్చి 30)సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. కచ్చితంగా చెప్పాలంటే.. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులు ఈ రోజు నూతన గృహాలలోకి అడుగు పెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత ఇంతటి భారీ స్థాయిలో ప్రభుత్వం పేదలకు గృహాలు అందించడం ఇది రెండో సారి. సోమవారం (మార్చి 30) జరిగిన గృహాల పంపిణీలో భాగంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 1,00,875 టిడ్కో, 1,50,018 సాధారణ గృహాలను లబ్ధిదారులకు అందజేసింది. గత ఏడాది నవంబర్ లో 3 లక్షల మందికి ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడతలో 2,50,893 మందికి గృహాలను అందించింది. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు గత జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.గత ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన రూ.174 కోట్ల సొమ్మును దారి మళ్లించిందని, ఆ మొత్తాన్ని తిరిగి 82 వేల కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా ప్రతి ఇంటికీ సి.ఎన్.జి గ్యాస్ కనెక్షన్ తో పాటు కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.

Publish Date: Mar 30, 2026 5:59PM

political-news-img

వెంకయ్య జోక్యంతో వేగం పుంజుకున్న అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు. అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు. హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు. అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.

Publish Date: Mar 30, 2026 5:13PM

political-news-img

పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం.. పీపుల్స్ పల్స్ సర్వే!

పుదుచ్చేరిలో వచ్చే నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఔననే అంటోంది. 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది. 9నుంచి 11స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5 నుంచి 7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3నుంచి 5, డీఎంకే 6 నుంచి 8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34 నుంచి 36 శాతం, ఎస్పీఏ 30- నుంచి 32 శాతం, టీవీకే 16నుంచి 18 శాతం ఒట్లు, ఎన్టీకే 4నుంచి 6 శాతం, వీసీకే 1నుంచి 3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి 2 నుంచి 5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీలుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా ఎనాలిసిస్ ను, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది. ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి. ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Publish Date: Mar 30, 2026 4:30PM

political-news-img

ఇరాన్ యురేనియం.. ట్రంప్ స్కెచ్.. హైరిస్క్!

ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధం అయ్యారు. అయితే, అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ఏమంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇరాన్ నాయకులు బాహాటంగానే అమెరికా 15 సూత్రాల శాంతి ప్రతిపాదనను ఎద్దేవా చేశారు. అయినా కూడా అంతర్జాతీయ చమురు ఓడల రవాణాకు ఇరాన్ హర్మూజ్ సలసంధిని ఓపెన్ చేయడాన్ని అగ్రరాజ్యాధినేత ఇరాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇరాన్ చాలా గొప్ప దేశం అంటూ కితాబిచ్చారు. అదే సమయంలో ట్రంప్ ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్‌లు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న దాదాపు 970 పౌండ్లు అంటే 400కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా తన తాజా కథనంలో పేర్కొంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉండకూడదని భావిస్తున్న ట్రంప్ చర్చల పేరుతో ఆ యురేనియంను అధినంలో కి తీసుకోవాలన్నది ట్రంప్ వ్యూహంగా పేర్కొంది. ఇరాన్‌తో చర్చలు జరిపి యురేనియాన్ని తీసుకోవాలని చూస్తున్నారనీ, సపోజ్ ఫర్ సపోజ్ ఇరాన్ తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే.. బలవంతంగానైనా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా దేశాల మధ్య రాజీ కుదుర్చేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతోంది. ఆ చర్చలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్థాన్, ఈజిప్ట్, తుర్కియే దేశాలు ఇరాన్, అమెరికాల మధ్య రాజీకి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాయి. రాజీ చర్చలు ఫలితాలను ఇవ్వకపోతే ట్రంప్ తన ప్లాన్‌ను అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచన అత్యంత ప్రమాదకరమైనదని అగ్రరాజ్యానికి చెందిన మాజీ సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అమెరికా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళితే ఇరాన్ నుంచి మరింత ఉధృతంగా దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చర్యల వల్ల యుద్ధం మరిన్ని రోజులు కొనసాగడం వినా మరో ప్రయోజనం ఉందని కుంబడద్దలు కొడుతున్నారు. యూరేనియం స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్లాన్ చాలా రిస్క్‌తో కూడుకున్నదని, దానికి రోజులు, వారాల సమయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Publish Date: Mar 30, 2026 4:18PM

political-news-img

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు.. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు కొట్టివేత

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను ఇరుకున పెట్టే ఉద్దేశంతో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, ఆ మూడింటినీ కొట్టిసింది. ఆళ్ల దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లకు కనీస విచారణార్హత లేదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. కాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ లో అక్రమాలు జరిగాయనీ, కాబట్టి ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసుల నుండి సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల ఒక పిటిషన్ వేశారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు గతంలో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్, ఏసీబీ కోర్టులో ప్రస్తుతం జరుగుతున్న ఈ కేసు విచారణను ప్రజాప్రతినిథుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మూడో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసుకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లు కూడా చట్టపరంగా నిలబడవని, వీటికి విచారణార్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లుగా వీటిని అభివర్ణించింది. గత ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులతో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూసిందంటున్న తెలుగుదేశం వాదనకు ఈ తీర్పు బలం ఇచ్చినట్లైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈ అంశంపై కొత్తగా తలెత్తిన న్యాయపరమైన సవాళ్లకు తెరపడింది. తన పిటిషన్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనీ, చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలనీ, అలాగే ఈ కేసును ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదలీ చేయాలనీ కోరారు. కొందరికి వ్యక్తిగతంగా లాభం చేకూర్చేందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మార్చారని గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లకు విచారణార్హత లేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాటిని కొట్టివేసింది. ఈ తీర్పు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే న్యాయపరంగా, అటు రాజకీయంగా చంద్రబాబుకు ఈ పరిణామం మరింత బలాన్ని చేకూర్చిందంటున్నారు పరిశీలకులు.

Publish Date: Mar 30, 2026 4:00PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img