Top Stories

dummy

political-news-img

చీలిక అంచున వైసీపీ.. అమరావతిపై జగన్ వైఖరే కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం అమరావతి. ఈ విషయంలో వైఎసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ వైఖరి మారకపోవడం వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు వైసీపీ నేతలు వాపోతున్నారట. అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీయులలో వ్యక్తం అవుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వచ్చే నెల మొదటి తేదీనే లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీయులు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ వైసీపీయులు అయితే.. ఈ అంశంలో జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని చెబుతున్నారు.

Publish Date: Mar 31, 2026 4:40PM

political-news-img

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు రూ. లక్ష కోట్ల పైనే.. కేంద్ర జలశక్తి మంత్రి

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని విస్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరంలో జరిగిన అక్రమాల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయల పైమాటేనని సంచలన ప్రకటన చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభ వేదికగా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులోని తన కార్యాలయంలో బీజేపీ సభ్యులతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అవినీతి, అక్రమాలకు తోడు సాంకేతిక కారణాలను కూడా ప్రాజెక్టు వైఫల్యానికి కారణాలని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, లోపభూయిష్టమైన నిర్మాణ ప్రక్రియ కారణంగానే ఆ ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరిందని కేంద్ర మంత్రి కుండబద్దలు కొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు జీవనాడిగా అభివర్ణించారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం, లీకేజీలు బయటపడటంతో దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ప్రాజెక్టు వైఫల్యం కూడా గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. అది వేరే సంగతి. ఇక ఇప్పుడు తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ధృవీకరించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలను ప్రస్తావిస్తూ ప్రజాధనాన్ని ఈ రీతిన అడ్డగోలుగా దుర్వినియోగించడం ప్రజా ద్రోహమనీ, క్షమించరాని నేరమనీ కూడా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. అదలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే సుదీర్ఘ విచారణ జరిపి, బాధ్యులైన వారిపై నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖను నిర్వహించిన కీలక నేతలను కూడా ఈ కమిషన్ విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నేరుగా లక్ష కోట్ల అవినీతి అని పేర్కొనడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో కాళేశ్వరం అక్రమాలపై కేంద్రం చర్యలకు ఉపక్రమిస్తున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Publish Date: Mar 31, 2026 4:18PM

political-news-img

ఇరాన్ తో రణం.. అమెరికాకు గెలుపు అందని యుద్ధం!

అగ్రరాజ్యం జోక్యంతో పశ్చిమాసియాలో దశాబ్దాలుగా సాగుతున్న ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ఇరాన్ ను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసి నిర్వీర్యం చేయాలన్న వ్యూహంతో అమెరికా వ్యూహాత్మకంగా చేపట్టిన దాడులు.. ఆ దేశాన్ని యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనక తప్పని స్థితికి తీసుకువెళ్లాయి. సరే అది పక్కన పెడితే ఇరాన్ ను ఏకాకిని చేసి ఆ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తూ చక్రం తిప్పాలన్న అమెరికా ఆశలు అడియాశలుగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యక్షంగా యుద్ధానికి దిగిన అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యలా మారింది. ఇక ఇది అగ్రరాజ్యానికి గెలుపు అందని యుద్ధంగా పరిణమిస్తోంది. సుదీర్ఘ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం కలిగిన ఇరాన్, అమెరికా ఒత్తిడికి ఇసుమంతైనా చలించడం లేదు. తలొగ్గడం లేదు. అమెరికాకు ఇరాన్‌తో యుద్ధం తన అగ్రరాజ్యహోదాకే ముప్పు తెచ్చిపెట్టేదిగా తయారైంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాతఇరాన్ ను అమెరికా, ఇజ్రాయెల్‌లు బద్ధశత్రువుగా భావిస్తున్నారు. అప్పటి నుంచి టెహ్రాన్‌పై అగ్రరాజ్యం అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది అయితే ఆ దేశం వాటన్నిటినీ తట్టుకుని, తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది. రష్యా, చైనా వంటి దేశాలతో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడిని దీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో నాటో దేశాల మద్దతునూ క్రమంగా కోల్పోయే పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నట్లైంది. అసలు ఇరాన్ విషయంలో అమెరికా నిఘా వర్గాల అంచనాలు ఘోరంగా విపలమయ్యాయి. కేవలం నాయకత్వం మారితే ఇరాన్ వ్యవస్థ కుప్పకూలుతుందన్న అమెరికా అంచనాలు తప్పాయి. ఎనిమిదేళ్ల పాటు ఇరాక్ వంటి దేశాలతో యుద్ధం చేసిన అనుభవం, క్లిష్ట పరిస్థితుల్లోనూ చమురు ఉత్పత్తిని కొనసాగించగల సామర్థ్యం ఇరాన్ కు రక్షణ కవచాలుగా మారాయి. ఇక ఇప్పుడు అమెరికా ఇరాన్ పై చేస్తున్న దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాక్, లిబియాల్లో అమెరికా చేసిన ప్రయోగాలు విఫలమై ఆ దేశాలు అస్థిరతకు గురైన విషయాన్ని మరువలేము. ఇరాన్ విషయంలోనూ అగ్రరాజ్యం అదే బాటలో పయనిస్తే, అది ఆదేశానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Publish Date: Mar 31, 2026 3:56PM

political-news-img

సెహ్వాగ్ సెటైర్.. అశ్విన్ కౌంటర్.. నవ్వులు పూయించిన మాజీ క్రికెటర్లు

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. అత్యంత ఆదరణతో సాగుతున్న ఈ లీగ్ ఇప్పటికే 18 సీజన్ లు పూర్తి చేసుకుని 19వ సీజన్ లోకి ప్రవేశించింది. సీజన్ సీజన్ కూ ఐపీఎల్ కు ఆదరణ పెరుగుతోనే ఉంది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే కాదు.. మైక్ పట్టుకుని ఆటకు కామెంటరీ చెప్పే కామెంటేటర్ల జోవియల్ టెండెన్సీ కూడా క్రికెట్ అభిమానులకు కావలసినంత ఆనందాన్ని, ఎంటర్ టైన్ మెంట్ నూ అందిస్తోంది. తాజాగా ఈ 19వ సీజన్ లో భాగంగాతొలి మ్యాచ్ (మార్చి 28) బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ కామెంటేటర్ గా తన కొత్త ఇన్నింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో అశ్విన్‌ను పలకరిస్తూ ఈ రోజు మనం లాజిక్‌లు, లెక్కలతో సంబంధం లేకుండా కేవలం మనసుతో మాట్లాడదాం అంటూ వ్యాఖ్యానించాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలకు అశ్విన్ తనదైన శైలిలో దీటైన బదులిచ్చాడు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని, విజ్ఞతతో మెలగాలని మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. కానీ మీరు మాత్రం దానికి భిన్నంగా ఆలోచించకుండా మాట్లాడమంటున్నారేమిటి? అంటూ కౌంటర్ ఇచ్చారు. అశ్విన్ ఇచ్చిన ఈ స్మార్ట్ రిప్లై విన్న సెహ్వాగ్, అశ్విన్‌కు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా అతిగా ఆలోచించి మాట్లాడతారని, ఒకవేళ ఏదైనా ప్లేయర్ గురించి ప్రతికూలంగా మాట్లాడితే తమ ఫాలోవర్లు తగ్గిపోతారనే భయం ఉంటుందని సెటైర్ వేశాడు. ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ చమత్కారంగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇలా కామేంటేటర్ల సమయస్ఫూర్తి, సెటైర్లు, చమత్కార సంభాషణలు కూడా ఐపీఎల్ ను రక్తకట్టిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Publish Date: Mar 31, 2026 3:34PM

political-news-img

అడ్డంగా దొరికిపోయిన సర్పరాజ్!

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సర్పరాజ్ రాజస్థాన్ తో మ్యాచ్ లో అంపైర్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో సర్పరాజ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తన ప్రస్తానాన్ని ప్రారంభించాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే సర్పరాజ్ నిబంధనలను ఉల్లంఘించి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చిన సర్పరాజ్ బ్యాట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అంపైర్లు ఆ బ్యాట్ తో ఆడడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. బ్యాట్ కొలతలు, వెడల్పు, మందంపై ఐసీసీ స్పష్టమైన నిబంధనలు విధించింది. సర్పరాజ్ తీసుకువచ్చిన బ్యాట్ ఆ నిబంధనలకు అనుగుణంగా లేదు. దీంతో అతను క్రీజులోకి రాగానే అంపైర్లు అడ్డుకుని ఆ బ్యాట్ తో ఆడడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్పరాజ్ డ్రెస్సింగ్ రూం నుంచి మరో బ్యాట్ తెప్పించుకుని ఆట కొనసాగించాడు. ఆ బ్యాట్ ను కూడా తనిఖీ చేసిన తరువాతే సర్పరాజ్ ను ఆడేందకు అనుమతించారు అంపైర్లు. ఈ సంఘటన సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.

Publish Date: Mar 31, 2026 3:13PM

political-news-img

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరి అరెస్టు

డ్రగ్స్ స్మగ్లింగ్ కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అడ్డాగా మారిందా అంటే ఔననాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విమానాశ్రయంలో తరచూ గంజాయి సహా మాదక ద్రవ్యాలు తరచూ పట్టుబడటంతో సర్వత్రా ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు పాతిక కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో వారు డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు వెలుగులోనికి వచ్చింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు పాతిక కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఆ ఇద్దరినీ అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.

Publish Date: Mar 31, 2026 1:59PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img