యుద్ధం వేళ షాపింగ్ మాల్కు యూఏఈ ప్రెసిడెంట్.. ఎందుకో తెలుసా?
Publish Date:Mar 3, 2026
Advertisement
ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ సాహసోపేతమైన అడుగు వేశారు. యుధభయంతో వణికిపోతున్న ప్రజల్లో భయం పోగొట్టడానికి ఆయన సోమవారం (మార్చి 2)సాయంత్రం దుబాయ్లోని షాపింగ్ మాల్కు వెళ్లారు. ప్రజలలో భయం పోగొట్టి ధైర్యం నింపేందుకు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు 1,240పైగా స్థావరాలపై దాడులు చేశాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్తో పాటు యూఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అరబ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు పేలుళ్లతో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సైరన్ లేని సమయంలో కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ షాపింగ్ మాల్కు వెళ్లి జనంలో ధైర్యాన్ని నింపారు. ఆయనతో పాటు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా వెళ్లారు. షాపింగ్ మాల్లోని ప్రజలను పలకరించి, వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను దుబాయ్ మీడియా ఆఫీస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది.
http://www.teluguone.com/news/content/uae-president-visit-shoping-mall-36-214925.html





