జనవరిలో తిరుపతి, నాగార్జున సాగర్ బైపోల్ షెడ్యూల్ !
Publish Date:Dec 26, 2020

Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్ సభ , అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి చివర లేదా మార్చి తొలి వారంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనాకు చికిత్స తీసుకుంటూ చెన్నై హాస్పిటల్ లో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సెప్టెంబర్ 16న చనిపోయారు. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం.. ఎవరైన ప్రజా ప్రతినిధి చనిపోతే ఏర్పడే ఖాళీని ఆరు నెలల్లోపు భర్తీ చేయాలి. ఈ లెక్కన తిరుపతి లోక్ సభకు మార్చి 16వ తేదీలోపు బైఎలక్షన్ జరగాల్సి ఉంది. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిసెంబర్ 1న చనిపోయారు. సాగర్ ఉప ఎన్నికకు జూన్ వరకు గడువున్నా.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ బై పోల్ ను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ జనవరి చివర లేదా ఫిబ్రవరి తొలి వారంలో విడుదలయ్యే చాన్స్ ఉందని సమాచారం.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కోసం పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించి ప్రచారం చేసేస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మినే మరోసారి బరిలోకి దింపుతోంది టీడీపీ. ఏపీలో ప్రస్తుతం జగన్ సర్కార్ పై ప్రజల్లో బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతిలో తమదే విజయమనే ధీమాలో ఉంది తెలుగు దేశం పార్టీ. తిరుపతిలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్నా.. ఆ రెండు పార్టీల మధ్య స్పష్టత రావడం లేదు. తామే పోటీ చేయబోతున్నామని జనసేన నేతలు ప్రకటిస్తుండగా.. తిరుపతిలో బీజేపీ అభ్యర్థే ఉంటారని సోము వీర్రాజు చెబుతున్నారు. తిరుపతిలో పోటీపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికే తిరుపతిలో ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ, జనసేనలో ఎవరూ తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఉంటారన్న దానిపై గందరగోళం నెలకొంది.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా తిరుపతి అభ్యర్థిని ఖరారు చేయలేదు. మొదట దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద రావు కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా... తర్వాత తెరపైకి జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరు వచ్చింది. గురుమూర్తే వైసీపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. జగన్, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు వాళ్ల వెంటే ఉన్నారు గురుమూర్తి. వాళ్లిద్దరకి సపర్యలు చేశారు. తమకు చేసిన సేవకు మెచ్చే గురుమూర్తిని జగన్ ఎంపీగా పోటీ చేయిస్తున్నారనే చర్చ వచ్చింది. అయితే గురుమూర్తి అభ్యర్థిత్వంపై విమర్శలు కూడా వస్తున్నాయి. తన కాళ్లకు కట్లు కట్టిన వ్యక్తికి జగన్ ఎంపీ టికెట్ ఇస్తున్నారని అంటూ.. తనకు సమయానికి ట్యాబ్లెట్లు ఇచ్చిన సంతోష్ కుమార్ ను కేసీఆర్ రాజ్యసభకు పంపడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ బాటలోనే జగన్ నడుస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీంతో గురుమూర్తినే వైసీపీ ఖరారు చేస్తుందా లేక మరొకరికి ఇస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది.
తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పార్టీలకు కీలకంగా మారింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోయిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. సాగర్ లో గెలిచి మళ్లీ పట్టు సాధించాలని భావిస్తోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీ... అదే ట్రెండ్ కొనసాగిస్తూ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఘోర పరాజయాలతో ఢీలా పడిన కేడర్ లో ఉత్సాహం నింపి పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే నాగార్జున సాగర్ లో గెలిచి తీరాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దీంతో సాగర్ సమరం అన్ని పార్టీలకు సవాల్ గా మారింది. నాగార్జున సాగర్ టికెట్ కోసం టీఆర్ఎస్ లో తీవ్రంగా పోటీ నెలకొంది. దివంగత ఎమ్మెల్యే నోముల భార్య లక్ష్మిగాని, కొడుకు భగత్ యాదవ్ గానీ పోటీకి రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, లోకల్ లీడర్ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ యాదవ్ కూడా టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దుబ్బాకలో సానుభూతి కలిసి రాకపోవడంతో నాగార్జున సాగర్ టికెట్ ను నోముల కుటుంబానికి ఇవ్వాలా, వద్దా? అన్న దానిపై టీఆర్ఎస్ హైకమాండ్ అలోచనలో పడిందని సమాచారం.
కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పోటీకి రెడీ అయినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా తన కొడుకు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపాలని ఆయన భావించారు. దీనిపై జానారెడ్డి లోకల్ లీడర్లతో ప్రత్యేకంగా ఓ మీటింగ్ నిర్వహించి, వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలిసింది. మెజార్టీ లీడర్లు జానారెడ్డినే పోటీ చేయాలని, ఒకవేళ రఘువీర్ పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని డైరెక్ట్గా చెప్పడంతో జానారెడ్డి బరిలోకి దిగేందుకు రెడీ అయినట్టు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. నాగార్జున సాగర్ లో బలమైన క్యాండిడేట్ కోసం సెర్చ్ చేస్తోంది బీజేపీ. టీఆర్ఎస్ బీసీలకు టికెటిస్తే బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్ని.. ఒకవేళ ఆ పార్టీ ఓసీ నేతను బరిలోకి దింపితే బీజేపీ నుంచి బీసీ క్యాండిడేట్ను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎలక్షన్లలో టీడీపీ నుంచి పోటీచేసి దాదాపు 22 వేల ఓట్లు సాధించిన కడారి అంజయ్య యాదవ్ ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ స్ట్రాంగ్ లీడర్లను చేర్చుకుని వారిలో ఒకరికి టికెట్ ఇచ్చే వ్యూహంలో బీజేపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/tirupathi-nagarjuna-sagar-bypoll-shedule-in-january-39-108142.html












