అమరావతికి కులం లింకా? 'రెడ్డి' పాలన చేస్తూ నీతి వాక్యాలా?
Publish Date:Dec 26, 2020

Advertisement
నలుగురు నవ్వుపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు. స్థలాల పంపిణి సభలో రాజధాని అమరావతికి కులం లింకుతో ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో రెడ్డి పాలన చేస్తూ కులాల గురించి నీతి వాక్యాలు చెబుతున్న జగన్ ను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అమరావతికి కులం కంపు కలుపుతూ జగన్మోహన్ రెడ్డి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. కులాల ప్రస్తావన తెస్తూ ఆ పదవికే జగన్ రెడ్డి కళంకం తెచ్చారని ఆరోపిస్తున్నారు. గత 18 నెలలుగా ఏపీలో సాగుతున్న పాలన, పదవుల పంపకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఇలా అన్నింటా ఒకే వర్గానికి పెద్దపీట వేసిన ఘటనలను ప్రస్తావిస్తూ జగన్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మేధావులు, విద్యావంతులు. జగన్ రెడ్డి తీరుపై విపక్షాలు, ప్రజా సంఘాలు విరుచుకుపడుతున్నాయి.
కులం పట్టి పోస్టింగులు.. రెడ్డి అధికారులకు రెడ్ కార్పెట్.. ఇతర వర్గాల వారికి డిమోషన్.. కమ్మ కులం ఆఫీసరైతే వెయిటింగ్.. తన కులానికే నామినేటెడ్ పదవులు.. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పాలనా పరిస్థితి. వైఎస్ జగన్ పాలనలో రెడ్డి సామజిక వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని సర్కార్ లెక్కలు చూస్తేనే అర్దమై పోతోంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో సామాజిక న్యాయం అడ్రసే లేకుండా పోయింది. ఇప్పటివరకు నియమించిన నామినేటెడ్ పదవుల్లో అంతటా రెడ్డి వర్గ ఆధిపత్యమే. అధికారం, నిధులు ఉన్న పదవులన్ని వాళ్ల సొంతమే. ఏపీలో మొత్తం నామినేటెడ్ పదవులు 712 ఉండగా.. వీటిలో దాదాపు 90 శాతం రెడ్లకే దక్కాయి. వీసీల్లో 83 శాతం, ప్రభుత్వ సలహదారుల్లో 71 శాతం పదవులు ఆ సామాజిక వర్గానికే ఇచ్చారు. ఏపీలో అతి ముఖ్యమైన టీటీడీలో మొత్తం 36 మంది సభ్యులుంటే అందులో 11 మంది రెడ్లే, 12 మంది వైస్ ఛాన్స్ లర్లలో 10 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రభుత్వ న్యాయవాదులు 30 మంది ఉంటే.. 16 మంది సీఎం రెడ్లే. యూనివర్సిటీ సెర్చ్ కమిటీల్లో 12 మంది ఉంటే 9 మంది రెడ్లనే నియమించారు.
ఆంధ్రప్రదేశ్ లో కిలకమైన టీటీడీ, తుడా, ఏపీఐఐసీ పదవులన్ని రెడ్లతోనే నింపేశారు. టీటీడీ చైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి, ఈవోగా జవహర్ రెడ్డి, ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డిని నియమించారు జగన్ రెడ్డి. తుడా చైర్మెన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మెన్ రోజారెడ్డికి పగ్గాలు అప్పగించారు. జగన్ ప్రభుత్వ సలహాదారులుగా మొత్తం ఆయన రెడ్డి వర్గానికే చెందిన వారినే నియమించుకున్నారు. రాజధాని అమరావతిపై వేసిన మంత్రివర్గ ఉపసంఘంలోనూ అంతా ఒక రెడ్డి నేతలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కీలక శాఖలన్ని రెడ్డి అధికారులకే కట్టబెట్టారు. ఇతర వర్గాల అధికారులకు అనామక పోస్టింగులు ఇస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లలోనూ ఆ వర్గానికే అందలం. కమ్మ కులం అధికారులుంటే.. వారికే లూప్ లైన్ లో పోస్టింగ్.. లేదంటే సస్పెన్షన్ విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతలా ఏపీలో రెడ్డి పాలన చేస్తూ అమరావతి విషయంలో సీఎ జగన్ కుల ప్రస్తాలన తెవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ దిగజారిపోయి మాట్లాడుతూ.. ఆ పదవికే మచ్చ తెచ్చారనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.
నిజానికి హైకోర్టులో అమరావతి రైతులు వేసిన పిటిషన్ లో ఎక్కడా కుల ప్రస్తావన లేదు. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని అటు రైతులు గానీ, హైకోర్టు గానీ తప్పు పట్టలేదు. రాజధాని ప్రాంతంలో స్థానికులకు కాకుండా బయటి వారికి ఇవ్వడాన్ని తప్పు పడుతూ కోర్టును ఆశ్రయించారు అమరావతి రైతులు. అమరావతికి కులం కంపు కలుపుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్థాయిలో ఆయన హైకోర్టు తీర్పును వక్రీకరించి, అవస్తవాలు చెప్పడం సరికాదంటున్నారు. రాజధాని కోసం రైతులను ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం, మాస్టర్ ప్లాన్లోని జోన్లను మార్చడంపైనే కోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. పిటిషన్లలో ఎక్కడా కుల ప్రస్తావన లేదని తెలిపారు.
రాజధానిలో పేదలు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే 5వేల ఎకరాలు కేటాయించామన్నారు తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. టీడీపీ ప్రభుత్వం 8 వేల మందికి ఇళ్లు కేటాయించిందని, 5024 ఇళ్లు కట్టించి సిద్ధం చేసిందని తెలిపారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో తమ ప్రభుత్వం కట్టించిన ఈ ఇళ్లను జగన్ సర్కారు లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుబెట్టడంపై కూడా తాను కోర్టును ఆశ్రయించాను చెప్పారు. అమరావతిలో అన్ని కులాలు, మతాలు, సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తున్నా, కళ్లుండి సీఎం జగన్ చూడలేకపోతున్నారని రాజధాని పరిరక్ష ణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు. స్థలాల పంపిణీ సభలో సీఎం జగన్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. అమరావతిలో కేవలం ఒకే సామాజికవర్గం కనపడడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని శ్రీనివాసరావు మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/ys-jagan-targets-kamma-caste-39-108145.html












