ప్రభుత్వ విధానం భేష్.. సీఎం, డీజీపీకి కృతజ్ఞతలు..దేవ్ జీ
Publish Date:Feb 27, 2026
Advertisement
మావోయిస్టుల లొంగుబాట్లపై రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ విధానం సానుకూల ఫలితాలు ఇస్తోందని, జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్టపరిధిలో ఎవరికైనా కొత్త జీవితాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి, భద్రతల పరిరక్షణతో పాటు తప్పుదోవ పట్టిన యువతకు పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ విధానం పై దేవ్జీ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, ఐజీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సానుకూల ఫలి తాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణతో పాటు ప్రధాన ప్రవాహంలోకి రావాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సరెండర్ పాలసీ మంచి నిర్ణయమని దేవ్జీ పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలిసి సరెండర్ మార్గం గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని దేవ్జీ పేర్కొన్నారు. తుపాకీ సిద్ధాంతం ప్రజలకు ఉపయోగం చేయదని, హింస ద్వారా సమస్యలకు పరిష్కారం రాదని వివరించేందుకు ప్రజలకు బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందరం కలిసి శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని దేవ్జీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, సామాజిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రంలో శాంతి వాతావరణం మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సరెండర్ అయ్యే వారికి ప్రకటిస్తున్న రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని తాము ప్రభుత్వాన్ని కోరినట్లు దేవ్జీ వెల్లడించారు. అయితే 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న డిమాండ్ సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్లు చెప్పారు. భూమి కేటాయింపు విషయంలో పరిమితులు ఉన్నప్పటికీ, ఇల్లు, ఉద్యోగం, జీవన భృతి వంటి అంశాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
http://www.teluguone.com/news/content/surrendered-maoist-leader-praises-government-36-214778.html





