ఆటోలో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లిన జనం
Publish Date:Apr 14, 2026
Advertisement
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. సరఫరా ఆలస్యం, స్టాక్ లోపం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్యాస్ బుక్ చేసినప్పటికీ సమయానికి సిలిండర్లు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్రామానికి డొమెస్టిక్ సిలిండర్లతో ఒక ఆటో చేరుకుంది. దాన్ని గమనించిన గ్రామస్థులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. డెలివరీ బాయ్ సిలిండర్లను క్రమంగా పంపిణీ చేస్తానని చెప్పినా వినకుండా, కొందరు వినియోగదారులు బలవంతంగా ఆటోపైకి ఎక్కి సిలిండర్లను తీసుకెళ్లారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఖాళీ సిలిండర్లు తిరిగి ఇవ్వకుండా, ఆటోలో ఉన్న సుమారు 40 సిలిండర్లను తీసుకెళ్లడంతో డెలివరీ బాయ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూర్ గ్రామంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కోసం గ్రామస్తులు గ్యాస్ ఏజెన్సీ వద్ద కిలోమీటరు పొడవున క్యూ కట్టారు. స్టాక్ వస్తుందనే సమాచారంతో తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రజలు ఏజెన్సీ ఎదుట వేచి ఉన్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్లు అందకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా లోపాలు ప్రజల రోజువారీ జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుండగా, తక్షణమే సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/shortage-of-cooking-gas-36-217329.html





