తెలంగాణకు ఓజీ కేసీఆరే.. పవన్ కల్యాణ్ కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Publish Date:Jun 3, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయవాదం, హక్కుల పోరాటంపై దుమారం రేగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడున్న నాలుగున్నర కోట్ల మంది భూమి పుత్రుల జాగీరని ఆయన స్పష్టం చేశారు. ఈ గడ్డపై ప్రతి అంగుళం ఇక్కడి ప్రజల స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి ప్రతీక అన్న కేటీఆర్.. తెలంగాణకు ఎవరైనా రావచ్చు కానీ ఇక్కడి ప్రజల సార్వభౌమత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇటీవల పవన్ కల్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కేటీఆర్.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ నడిబొడ్డున పవన్ కల్యాణ్ సభ పెట్టాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, ఇక్కడి పరిపాలనకు ఎప్పటికీ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణకు ఇంకెవ్వరి పెత్తనమూ అవసరం లేదనీ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనదిగా పవన్ కల్యాణ్ అభివర్ణించడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం నుండి ఆంధ్రుల హక్కుల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాటం కూడా ప్రాంతీయవాదమే అవుతుందా అని ప్రశ్నించారు. ప్రాంతీయ హక్కుల కోసం పోరాడటం ఉగ్రవాదమా అని నిలదీశారు. జాతీయవాదం ముసుగు వేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రావలసిన ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలను, ప్రాజెక్టులను తన స్వరాష్ట్రమైన గుజరాత్కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని 'ఆర్థిక ప్రాంతీయవాదం' అనరా అని కేటీఆర్ నిలదీశారు. దేశంలో ఎవరికైనా, ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందన్న కేటీఆర్.. జనసేన పార్టీ తెలంగాణలో కొత్తగా పోటీ చేసేదేమీ లేదనీ.. గతంలో జరిగిన 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేశారనీ గుర్తు చేశారుర. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్కు గౌరవం ఇస్తామనీ, ఒక కళాకారుడిగా, సినీ నటుడిగా ఆయనకు ఉన్న అభిమానులను తాము గౌరవిస్తామనీ, అయితే.. హైదరాబాద్లోని తెలంగాణ సెక్రటేరియట్లోకి వచ్చి ఇక్కడి పాలనపై పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం ఇక్కడి నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఊరుకోరని కేటీఆర్ హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/kcr-only-og-of-telangana-25-221643.html





