జాతీయం నాటకం.. థర్డ్ ఫ్రంట్ బూటకం
Publish Date:Jun 15, 2022
Advertisement
ఎన్నికలు అన్నాక ఎన్నో ఉంటాయి. అందులోనూ ఎన్నికలు ఎప్పుడో తెలియకుండానే రాష్ట్ర రాజకీయం వేడెక్కిన నేపధ్యంలో తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తులు పై ఎత్తులకు పదును పెడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రస్తుతానికి అయితే మూడు పార్టీల నడుమ ముక్కోణపు పోటీ అనివార్యంగానే కనిపిస్తోంది. ఓ వంక అధికార తెరాస ముచ్చటగా మూడవ సారి గెలిచి హట్రిక్ సాధించాలనే పట్టుదలతో పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎదురు దెబ్బలు తగులుతున్నా, తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతున్నారు. నిజానికి, ఎన్నికల వ్యూహరచనలో కేసీఆర్ మహా దిట్ట. ఆయనకు మరొకరు సాటి రారు. అంతే కాకుండా, రాష్ట్ర విభజన అనంతరం, నిన్న మొన్నటి వరకు కూడా తెలంగాణలో ఆయనే టాలెస్ట్ లీడర్. ఇతర పార్టీలలో జానారెడ్డి వంటి కొందరు సీనియర్ నాయకులు ఉన్నా తెలంగాణ ఉద్యమ సారధి కిరీటం ఆయన ఎత్తును పెంచింది. నిజం అయినా కాకపోయినా, ప్రజలు తెలంగాణ సాధించిన నేతగా ఆయనకే బ్రహ్మరథం పట్టారు. రెండు సార్లు తెరాసను గెలిపించారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదని వేరే చెప్పనక్కరలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను అరువు తెచ్చుకోవడంలోనే, కేసీఆర్ పరువు పలచనైంది. ఆయన డొల్లతనం బయట పడింది. ఇప్పుడు ఏకంగా పొరుగు రాష్ట్రం నుంచి, కరుడు కట్టిన సమైక్యవాది,సమాఖ్య వాదానికి, తెలంగాణ వ్యతిరేకతకు మానవ రూపం అనదగిన, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, సేవలు వినియోగించుకునే స్థితికి వచ్చారంటే, కేసీఆర్ ఆత్మవిశ్వాసం ఎంతగా దిగజారిందో వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. కేసీఆర్ పైకి ఎన్ని బింకాలు పోయినా, జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ ఏర్పాటు వంటి ఎన్ని, మాటలు చెప్పినా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ ప్రధాన లక్ష్య సాధన కోసమే కేసీఆర్ టక్కు టమార గజకర్ణ విద్యలను ప్రదర్శిస్తున్నారు, అనేది.. నిన్నటిదాకా అనుమానం అయినా, రాష్ట్రపతి ఎన్నికలలలో అటూ ఇటూ కానీ, తటస్థ వైఖరి తీసుకోవడంతో ఆయనకు, రాష్ట్రపతి ఎన్నిక ముఖ్యం కాదు. జాతీయ రాజకీయాలు కీలకం కాదు. రాష్ట్రంలో అధికారాన్ని నిలుపు కునేందుకే కేసీఆర్, శ్రమిస్తున్నారు అనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే అటు బీజేపీ అభ్యర్థి లేదా ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో కిందా మీద అవుతున్నారనే మాట రాజకీయ చర్చల్లో ప్రముఖంగా వినవస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినా.. లేక ఓటింగ్కు దూరంగా ఉన్నా.. బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసమే కేసీఆర్ అండ్ టీమ్ ఈ రకమైన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించే అవకాశం లేకపోలేదు. అందుకే రాష్ట్ర రాజకీయాలలో పట్టు నిలుపుకుని మూడవ సారి అధికరంలోకి వచ్చేందుకే, కేసీఆర్ జాతీయ రాజకీయలకు సంబంధించి అత్యంత కీలకమైన రాష్ట్రపతి ఎన్నికలలో అటూ, ఇటూ కానీ, వైఖరి అవలంబిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే, రాష్ట్రంలో అధికారం చేజారకుండా కాపాడుకునేందుకే కేసేఅర్ జాతీయ రాజకీయ డ్రామా నడుపుతున్నరని విశ్లేషకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-national-party-and-third-front-are-political-dramas-25-137731.html





