కేసీఆర్ ఏం చేయబోతున్నారో తెలుగువన్ ముందే చెప్పింది!
Publish Date:Jun 15, 2022
Advertisement
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేయబోతున్నారన్న సంగతి తెలుగువన్ ముందే అంచనా వేసింది. రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొడతారన్న విషయాన్ని తెలుగువన్ ముందుగానే చెప్పింది. తొలుత కేసీఆర్ ప్రతినిథిగా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే.కేను పంపుతారన్న చర్చ జరిగినా చివరికి అది కూడా జరగలేదు. మొత్తంగా టీఆర్ఎస్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలకు జాతీయ స్థాయిలో ఏ పార్టీ నుంచీ సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ముందుగానే వెల్లడించిన తెలుగువన్ మమతా బెనర్జీ ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నించే అవకాశాలేలేవని కుండబద్దలు కొట్టేసింది. తెలుగువన్ ముందుగా చెప్పినట్లుగానే కేసీఆర్ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన భేటీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. భేటీకి మమతా బెనర్జీ 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానం పంపితే వచ్చిన వారు మాత్రం తక్కువ మందే. ఈ భేటీ కోసం మమతా బెనర్జీ ఆహ్వానం పంపిన నేతలలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే వారిలో ఒక్కరు కూడా ఈ భేటీకి హాజరు కాలేదు. కాంగ్రెస్ తరఫున మల్లిఖార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా హాజరు కాగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఈ భేటీకి హాజరయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ యాదవ్ పేరును మమతా బెనర్జీ ఈ సమావేశంలో ప్రకటించినప్పటికీ తాను పోటీకి సిద్ధంగా లేనంటూ శరద్ పవార్ స్పష్టం చేయడంతో మరో అభ్యర్థిని ఖరారు చేసేందుకు మరోమారు భేటీ కావాలని సమావేశం నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/kcr-did-not-attend-mamatas-meeting-telugu-one-said-it-earlier-25-137733.html





