political-news-img

యనమలకు అస్వస్థత.. స్టంట్ వేసిన వైద్యులు

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. గుండెకు సంబంధించి సమస్యతో ఆయనను హఉటాహుటిన హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి గురువారం (ఏప్రిల్ 10) తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి, ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం యనమల రామకృష్ణుడుకు గుండెలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించిన ఉవైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, ఒక స్టెంట్‌ను అమర్చారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా తన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన అవసరం లేదనీ యనమల స్వయంగా ఒక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న తాను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి వస్తానని యనమల పేర్కొన్నారు. ఇలా ఉండగా వైద్యుల సమాచారం మేరకు యనమల కోలుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ తరువాతనే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు.

Publish Date: Apr 10, 2026 1:34PM

political-news-img

దాడుల దారి దాడులదే.. చర్చల దారి చర్చలదే.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు

మిడిల్ ఈస్ట్ లో శాంతి అవసరమే అంటున్న ఇజ్రాయెల్ లెబనాన్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించి ఒక అడుగు ముందుకు వేసింది. అయితే దాడుల దారి దాడులదే.. శాంతి చర్చల దారి శాంతి చర్చలదే అంటూ మెలికపెట్టింది. లెబనాన్ తో కాల్పుల విరమణ ఉండదు కానీ, అందు కోసం ఆ దేశంతో చర్చించడానికి రెడీ అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెన్యామిన్ నెతన్యాహు అంటున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే నెతన్యాహు ఒక అడుగు దిగి వచ్చారని అంటున్నారు. అదే సమయంలో పైచేయి మాదేనని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా దాడుల విరమణకు, శాంతి చర్చలకు నెతన్యాహు అంగీకరించారు. అయితే ఆ చర్చలు విజయవంతమయ్యే వరకూ లెబనాన్ పై దాడులను ఆపే ప్రశక్తే లేదన్న మెలిక పెట్టారు. అంటే లెబనాన్ తో చర్చలు ఫలవంతం అయిన తరువాతనే ఇజ్రాయెల్ దాడులను విరమిస్తుందని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ విధించిన ఈ షరతు లేదా నిబంధనకు లెబనాన్, హిజ్బుల్లా ఏ మేరకు అంగీకరిస్తాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో తీసుకు వచ్చిన ఒత్తిడి కారణంగానే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒకింత మెత్తబడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ ఒప్పందం సజావుగా సాగితే శాంతి నెలకొనే అవకాశాలున్నాయన్న ఆశాభావం వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద నెతన్యాహు ఒకింత వెనక్కు తగ్గడం మిడిల్ ఈస్ట్ లో శాంతి స్థాపనకు పడిన ఒక ముందడుగుగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో?

Publish Date: Apr 10, 2026 12:28PM

political-news-img

అగ్రరాజ్యం అధీనంలో ఇస్లామాబాద్.. ఏం జరుగుతోంది?

అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి.. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పే చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. ఈ చర్చలకు వేదిక అయిన ఇస్లామాబాద్ లో అమెరికా అసాధారణ భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ టీమ్ అమెరికాకు చేరుకుంది. శాంతి చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ ప్రతినిథుల బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. శాంతి చర్చలు శనివారం (ఏప్రిల్ 11) నుంచి మొదలు కానున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేందుకు ఈ చర్చలు అత్యంత కీలకమని భావిస్తున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ లో భద్రతా ఏర్పాట్ల వ్యవహారం అంతా అమెరికా చూస్తున్నది. ఇస్లామాబాద్ చేరుకోనున్న అమెరికా ప్రతినిథుల బృందం రక్షణకు సంబంధించి అమెరికా పూర్తి బాధ్యత తీసుకుంది. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు కీలక నేతలు ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. ఇక ఇరాన్ నుంచి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. శాంతి స్థాపన దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చలు అత్యంత కీలకమైన నేపథ్యంలో భద్రతా బాధ్యతలను అమెరికాకు అప్పగించిన పాకిస్థాన్.. తమ పోలీసులు, సైనిక దళాలు అమెరికా సెక్యూరిటీ బృందానికి పూర్తి సహకారం అందిస్తారని పేర్కొంది.

Publish Date: Apr 10, 2026 12:04PM

political-news-img

శాంతి యత్నాలకు మోకాలడ్డుతున్న పాకిస్ధాన్!?

మిడిల్ ఈస్ట్ లో శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు పాకిస్థాన్ మోకాలడ్డుతోందా? అంటే అంతర్జాతీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. మధ్య ప్రయత్నంలో శాంతి యత్నాలకు పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ వ్యాఖ్యలు గొడ్డలి పెట్టులా మారాయంటున్నారు. పాక్ రక్షణ మంత్రి తాజాగా ఇజ్రాయెల్ దేశంపై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. ఆ దేశాన్ని మానవాళికి శాపంగా మారిన దేశంగా అభివర్ణించారు. ఇప్పుడు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ పెను దుమారం రేపుతున్నాయి. ఇవిఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.. ఇరాన్, అమెరికా మధ్య శాంతి కోసం పాకిస్థాన్ మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తూనే ఇజ్రాయెల్ పాక్ నమ్మదగిన దేశం కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ పై తన దాడులను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలవి. దీనిపై పాక్ రక్షణ మంత్రి ఒకింత అతిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ తో పోల్చారు. పాలస్తీనా గడ్డపై ఈ దేశాన్ని సృష్టించిన వారు నరకయాతన అనుభవించాలని శాపనార్ధాలు పెట్టారు. గాజా, ఇరాన్ తర్వాత ఇప్పుడు లెబనాన్‌లో ఇజ్రాయెల్ రక్తపాతం సృష్టిస్తోందని, జాతి నిర్మూలనకు పాల్పడు తోందంటూ వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ఇజ్రాయెల్ ప్రభుత్వం పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. ఇజ్రాయెల్ వినాశనాన్ని కోరుకునేలా పాకిస్థాన్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇటువంటి వ్యాఖ్యలను తాము సహించబోమనీ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఘాటుగా స్పందించింది. శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశం నుంచి ఇలాంటి ద్వేషపూరిత మాటలు దారుణమని పేర్కొంది. అదలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య కీలకమైన శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సిన తరుణంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆ దేశాన్ని దౌత్యపరంగా ఇబ్బందుల్లో పడేశాయి. దీనిని పాకిస్థాన్ ఎలా అధిగమిస్తుంది, తమ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటుందన్నది వేచి చూడాలి.

Publish Date: Apr 10, 2026 11:30AM

political-news-img

పాకిస్తాన్ వైఖరి.. ప్రాంతీయ ఉద్రిక్తతలు.. పెళుసైన కాల్పుల విరమణ

సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్‌కు సంబంధించిన వరుస పరిణామాలు ప్రాంతీయ భద్రతా వాతావరణం యొక్క సంక్లిష్టత పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. దౌత్యపరమైన ప్రయత్నాలు బలహీనంగా ఉండగా, మాటల యుద్ధం మరియు సైనిక చర్యలు తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై సందేహాలుకొనసాగుతున్న సంఘర్షణలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నం అంతర్జాతీయ పరిశీలకుల నుండి విమర్శనాత్మక వ్యాఖ్యలను ఎదుర్కొంది. అమెరికా యుద్ధ నిపుణుడు డగ్లస్ మాక్‌గ్రెగర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను "మంటల్లో కాలిపోతున్న భవనంలో ఉన్న వ్యక్తి మీకు ఖాళీ గదిని ఇస్తానని చెప్పడం"తో పోలుస్తూ వర్ణించారు. ఇది అత్యంత అస్థిరమైన వాతావరణంలో ఫలితాలను ప్రభావితం చేయడంలో దాని విశ్వసనీయత మరియు సామర్థ్యం పరిమితంగా ఉన్నాయని సూచిస్తుంది. పాకిస్తాన్ వ్యూహాత్మక సందేశం మరియు ప్రాంతీయ వైఖరి.. అదే సమయంలో, ఖవాజా ఆసిఫ్ బహిరంగ ప్రకటనలలో మరింత దృఢమైన వైఖరిని తీసుకున్నారు. విశాల ముస్లిం ప్రపంచం తమ భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోవాలని ఆయన కోరారు. భారత్, ఇజ్రాయెల్‌లను దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రత్యర్థులుగా గుర్తించారు. ముస్లిం ప్రపంచంలో నాయకత్వ పాత్ర పోషించడానికి పాకిస్తాన్ సుముఖతను సూచించారు. ఈ ప్రకటనలు పాకిస్తాన్ ప్రాంతీయ కథనాన్ని పునర్నిర్వచించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ, అవి పెరిగిన భౌగోళిక రాజకీయ ధ్రువీకరణకు కూడా దోహదపడవచ్చు. ఇజ్రాయెల్-లెబనాన్ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో పరిస్థితి మరింత దిగజారింది. తిరిగి చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్ లెబనాన్‌పై కొత్తగా వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో 180 మందికి పైగా మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి, ఇది ప్రాంతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశంపై ఆందోళనలను పెంచుతోంది. ఈ దాడుల వల్ల ఇప్పటికే ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాలపై గణనీయమైన ఒత్తిడి ఏర్పడింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై ఒత్తిడి.. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉన్న పెళుసైన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికే అస్థిరత సంకేతాలను చూపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనల ఉల్లంఘనలను పాకిస్తాన్ ప్రధానమంత్రి బహిరంగంగా ఎత్తి చూపారు. ఈ ఒప్పందం విఫలమవడానికి ఇజ్రాయెల్ చర్యలే కారణమని ఇరాన్ ఆరోపించడంతో, దౌత్య ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారాయి. పరిస్థితి వేగంగా క్షీణించడం అనేది కీలక భాగస్వాముల మధ్య నమ్మకం, సమన్వయం కొరవడటాన్ని స్పష్టం చేస్తోంది. విస్తృత, వ్యూహాత్మక పరిణామాలు.. ఈ పరిణామాలు సమిష్టిగా ఒక బహుముఖ ప్రాంతీయ సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ముస్లిం ప్రపంచంలో పరస్పర విరుద్ధమైన కథనాలు మరియు నాయకత్వ వాదనలు. బహుళ రంగాలలో తీవ్రమవుతున్న సైనిక ఘర్షణలు. నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న బలహీనమైన మరియు పెళుసైన దౌత్య చట్రాలు. పాకిస్తాన్ తన ప్రభావాన్ని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలు, మరియు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కలిసి, ప్రపంచవ్యాప్త పరిణామాలకు దారితీయగల అత్యంత ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ముగింపు.. ప్రస్తుత పరిణామాలు ఈ ప్రాంతం మరింత అస్థిరత వైపు పయనిస్తోందని, తక్షణ ఉద్రిక్తతల తగ్గింపునకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. సైనిక ఉద్రిక్తతలు, రాజకీయ వాక్చాతుర్యం, మరియు పెళుసైన దౌత్యం యొక్క పరస్పర చర్య ఈ సంఘర్షణ యొక్క తదుపరి దశను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Publish Date: Apr 10, 2026 11:07AM

political-news-img

ప్రపంచ వాణిజ్యానికి అమెరికా సెక్యూరిటీ కాదు.. హెర్మూజ్ రక్షణ నాటో దేశాలదేనన్న ట్రంప్

నాటో దేశాలపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో సారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హెర్మూజ్ జలసంధి రక్షణ విషయంలో నాటో దేశాల తీరును తప్పుబట్టారు. హెర్మూజ్ భద్రత కోసం అమెరికా భారీగా నిధులు వెచ్చిస్తోందనీ, అయితే.. ఆ జల సంధి వల్ల ప్రయోజనం పొందుతున్న నాటో దేశాలు మాత్రం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా అమెరికా బాధ్యత మోస్తోందన్న అమెరికా అధ్యక్షుడు.. నాటో దేశాల తీరు సరికాదని అన్నారు. ప్రపంచ చమురు రవాణాలో హెర్మూజ్‌ జలసంధి ద్వారా జరిగే వాణిజ్యంపై అనేక ఐరోపా దేశాలు మరియు ఆసియా దేశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే.. ఇక్కడ నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకు అమెరికా తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను మోహరించి భారీగా ఖర్చు చేస్తుంటే.. నాటో దేశాలు ఈ బాధ్యత పంచుకోవలసింది పోయి చోద్యం చూస్తున్నాయని ట్రంప్ రుసరుసలాడారు. గత కొంతకాలంగా ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధి భద్రత అంతర్జాతీయ సమస్యగా మారిందన్న ట్రంప్.. నాటో దేశాలు కేవలం ప్రేక్షక పాత్ర పోషించడం సరికాదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పని చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. హెర్మూజ్ భద్రత అమెరికా కు కాదనీ, నాటో దేశాలకే ఎక్కువ అవసరమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చైనా, జపాన్ వంటి ఆసియా దేశాలతో పాటు ఐరోపా దేశాలు తమ చమురు అవసరాల కోసం ఈ మార్గాన్ని వాడుకుంటున్నాయనీ.. కాబట్టి ఆయా దేశాలే తమ నౌకలకు రక్షణ కల్పించుకోవాలని అన్నారు. తమ సైన్యం ఉచితంగా ప్రపంచ వాణిజ్యానికి కాపలా కాయడం ఇంకానా ఇకపై ఉండదన్న సంకేతాన్ని ట్రంప్ ఇచ్చారు. ట్రంప్ మాటలను బట్టి ముందు ముందు హెర్మూజ్‌ జలసంధి రక్షణకు సంబంధించి అమెరికా తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ నాటో దేశాలు స్పందించకుండా హెర్మూజ్ ప్రాంతం నుంచి అమెరికా తన దళాలను ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

Publish Date: Apr 10, 2026 10:58AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img