political-news-img

మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలు మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే ఏడాదికి లక్ష్యాలు, సంక్షేమ పథకాల దిశానిర్దేశం వంటి అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ప్రజా సమస్యలు సభలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. మార్చి 20న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉద్యోగాలు, మహిళా సంక్షేమం వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్త పథకాలు, పన్నుల మార్పులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు బడ్జెట్‌లో ముఖ్యాంశాలుగా ఉండనున్నాయి.మార్చి 30 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో బడ్జెట్‌పై విస్తృత చర్చలు జరిగి, అనంతరం ఆమోద ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది

Publish Date: Feb 23, 2026 9:40PM

political-news-img

సృష్టి కేసులో డాక్టర్ నమ్రతకు ఈడీ కస్టడీ

సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన డాక్టర్ నమ్రత కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెను రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరినప్ప టికీ, కోర్టు రేపు మరియు ఎల్లుండి మాత్రమే కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రెండు రోజులలో డాక్టర్ నమ్రతను మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీలు, విదేశీ ఖాతాలకు నిధుల మళ్లింపు వంటి అంశాలపై ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించనున్నారు. సరోగసీ ప్రక్రియను ముసుగుగా చేసుకుని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, వాటిని అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఆమెకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, అనుబంధ సంస్థల వివరాలు ఈడీ సేకరించినట్లు సమాచారం. సేకరించిన డబ్బును షెల్ కంపెనీలు, మధ్యవర్తుల ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు, విదేశీ లింకులపై అధికారులు ఫోకస్ పెట్టారు.ఈ వ్యవహారంలో డాక్టర్ నమ్రతతో కలిసి పనిచేసిన వ్యక్తులు, మధ్యవర్తులు, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించిన కీలక వ్యక్తుల పాత్రపై కూడా ఈడీ విచారణ జరపనుంది. సరోగసీ పేరుతో డబ్బు వసూలు చేసిన విధానం, లబ్ధిదారుల వివరాలు, అక్రమంగా నిర్వహించిన ఒప్పందాలపై ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అంశాలు దృష్ట్యా మరికొంతమంది పాత్ర బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డబ్బు మళ్లింపుకు ఉపయోగించిన ఖాతాలు, విదేశీ కనెక్షన్లు, ఆస్తుల కొనుగోళ్లపై కూడా ఈడీ దర్యాప్తు విస్తరించే అవకాశముంది. రెండు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం డాక్టర్ నమ్రతను తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలు సృష్టి సరోగసీ కేసులో మరిన్ని సంచలనాలను రాబట్టే అవకాశం ఉందని న్యాయవర్గాలు, దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.

Publish Date: Feb 23, 2026 9:23PM

political-news-img

హైదరాబాద్ మెట్రో స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం

తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు స్వాధీనంపై ఇదివరకే ప్రభుత్వం ప్రకటన చేసింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావులతో ఈ ఉపసంఘాన్ని నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోని నిర్వహిస్తున్న ఎల్అండ్‌టీ నుంచి పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి తీసుకునేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్రల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం మార్చి 31వ తేదీలోపు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ టేకోవర్ మొత్తం విలువ సుమారు రూ.15,000 కోట్లుగా అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్పులు రూ.13,000 కోట్లు కాగా, ఎల్ అండ్‌టీ సంస్థ ఈక్విటీ వాటా రూ.2,000 కోట్లుగా ఉంది. రెండో దశ మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.

Publish Date: Feb 23, 2026 9:02PM

political-news-img

వైద్య విధాన పరిషత్ పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా పేరు మారుస్తు డెసిషన్ తీసుకున్నారు. దీంతో ఇక నుంచి టీవీవీపీ ఉద్యోగులంతా ప్రభుత్వ పరిధిలోకి రాబోతున్నారు. హైదరాబాద్ మెట్రోను ఎల్ & టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం అర్బన్ లో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాల్లో భూ కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియోపోలీస్ లో నీటి సరఫరాకు HMWS బడ్జెట్ కేటాయింపు..JNTU కాలేజి నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో 70 ఎకరాల కేటాయింపుకు పచ్చజెండా ఊపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తెలిపారు.

Publish Date: Feb 23, 2026 8:40PM

political-news-img

అసెంబ్లీకి రమ్మని బొట్టు పెట్టి పిలవరు... లోకేష్ చురకలు

అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు. వైసీపీ నేతలు దేవుణ్నే రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు. తిరుమలో కొలువుదీరిన దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగా బయటపెడతామని లోకేశ్ వెల్లడించారు. శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నీ మంగళవారం (24-2-26న)అసెంబ్లీలో పెడతామని తెలిపారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం అభ్యంతరకరమని లోకేశ్ వ్యాఖ్యానించారు.

Publish Date: Feb 23, 2026 7:21PM

political-news-img

డ్రగ్స్ డాన్ ఎల్ మెంచో చరిత్ర సమాప్తం

ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో కథ ముగిసింది. ఆదివారం మెక్సికో సైన్యం నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్‌లో అతడిని మట్టుబెట్టారు. ఈ వార్త తెలియగానే మెక్సికో వ్యాప్తంగా మాఫియా ముఠాలు విధ్వంసానికి దిగడంతో ఆ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఈక్రంమలోనే భారత విదేశాంగ శాఖ.. అక్కడి భారత పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. 59 ఏళ్ల ఎల్ మెంచో ఆచూకీపై అమెరికా నిఘా సంస్థల నుంచి అందిన పక్కా సమాచారంతో మెక్సికో సైన్యం జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణాన్ని చుట్టుముట్టింది. అతడు నక్కిన స్థావరాన్ని సైనికులు ముట్టడించగా.. మెంచో అనుచరులు యధేచ్ఛగా కాల్పులకు దిగారు. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బంధించి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆపరేషన్‌లో మెంచోతో పాటు మరో ఆరుగురు కీలక గ్యాంగ్‌స్టర్లు కూడా హత మయ్యారు. 2009లో జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్‌ను ప్రారంభించిన ఎల్ మెంచో.. కేవలం దశాబ్ద కాలంలోనే దానిని మెక్సికోలో అత్యంత శక్తివంతమైన నేర సిండికేట్‌గా తీర్చిదిద్దాడు. అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తూ.. అగ్రరాజ్యానికి ప్రధాన ముప్పుగా మారాడు. అందుకే అమెరికా ప్రభుత్వం ఇతడి ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, అతడిని పట్టించిన వారికి 15 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.125 కోట్ల రివార్డు ప్రకటించింది. మెక్సికోలో మాఫియా ముఠాల అల్లర్ల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. భారత పౌరులంతా ప్రస్తుత పరిస్థితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాలకే పరిమితం కావాలని సూచించింది. ఏదైనా సమస్య తలెత్తితే మెక్సికోలోని భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే సంప్రదించాలని ఆదేశించింది. ప్రస్తుతం మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ మోహరించింది. మాఫియా డాన్ మృతితో మరిన్ని ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Publish Date: Feb 23, 2026 7:12PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img