ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు : సీఎం చంద్రబాబు
Publish Date:May 11, 2026
Advertisement
ఉత్తమ పాలసీల రూపకల్పనతోనే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అనే విధానంలో ఏపీకి ఒక్కసారి వచ్చి చూసి అప్పుడు పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలస్ లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి హాజరై కీలక ప్రసంగం చేశారు. దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఏపీ 25 శాతం మేర పెట్టుబడులను ఆకర్షించగలిగిందని ఆయన వివరించారు. గడచిన 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని.. తద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి సంస్థలతో కలిసి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. త్వరలో క్వాంటం కంప్యూటర్ కు అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ప్రారంభించామని పారిశ్రామిక వేత్తలకు తెలియచేశారు. పారిశ్రామిక రంగానికి అనుకూలమైన రాష్ట్రంగా ఏపీలో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. ఏపీ ప్రజలు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయటంలో ఎప్పుడూ ముందు ఉంటారని అందుకే వారికి ఆంధ్రాప్రెన్యూర్స్ అనే పేరు వచ్చిందని అన్నారు. సీఐఐ సంస్థ అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావటం సంతోషదాయకమన్నారు. ఏపీలో క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ , డ్రోన్స్ ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల పరిశ్రమల్ని పెట్టుబడుల్ని ఆకర్షించేలా వివిధ పాలసీలను అమలులోకి తెచ్చామని.. ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని సీఎం పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మిషన్ ను ముందుకు తీసుకెళ్దాం దేశంలో అమలు చేసిన ఆర్ధిక సంస్కరణలు మనకు అవకాశాలు తెచ్చిపెట్టాయని సీఎం వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలే తన అజెండా అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వివిధ రంగాల్లోని గ్లోబల్ ట్యాలెంట్ దేశ లక్ష్యాలు సాధించటంలో కీలకంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వచ్చాయని.. గతంలో ఆ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేదని గత కొంతకాలంగా ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఆలోచనలే లేకుండా పోయాయన్నారు. సంస్కరణల వాది అయిన ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. 8 అంశాలతో కూడిన నేషనల్ మిషన్ ను ప్రధాని మోదీ ప్రకటించారని దానిని అనుసరించి ముందుకు వెళ్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బంగారం కొనుగోలును వాయిదా వేయటం, ఇంధనాన్ని పొదుపు చేయటం, ప్రతీ ఇల్లు, పరిశ్రమ, పొలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చటం, ప్రజా రవాణా వినియోగం లాంటి అంశాలను పాటించి వనరుల్ని సద్వినియోగం చేద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. యుద్ధానంతర పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు చూశామని ఇలాంటి వాటిని సమర్ధంగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న నినాదాన్ని కూడా ప్రధాని ఇచ్చారని దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మనకు ఉన్నాయన్నారు. స్వయం సమృద్ధి అనే అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారని ప్రకృతి సేద్యం ద్వారా ఎరువుల దిగుమతి తగ్గిద్దామని అన్నారు. ఏపీలో 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యంలో ఉన్నాయని తద్వారా భూసారం పెంచటంతో పాటు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీని సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామన అన్నారు. ఈ జాతీయ టాస్క్ ను మనం అంతా కలిసి సాధించాలన్నారు. ప్రతీ సవాలూ ఓ అవకాశాన్ని సృష్టిస్తుందని భారత్ ఇక అన్ స్టాపబుల్ అని.. గ్లోబల్ జెయింట్ గా ఇండియా మారుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ బయో గ్యాస్, ఇథనాల్, ఈవీ, వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు ఇప్పుడు మనకు కావాలని అన్నారు. ఏపీలో ప్రోజ్యూమర్ అనే విధానాన్ని ఇప్పటికే పాటిస్తున్నామని.. సోలార్ రూఫ్ టాప్ ద్వారా దీనిని సాధించనున్నట్టు వివరించారు. మైక్రో గ్రిడ్ వ్యవస్థ ద్వారా ట్రాన్స్ మిషన్ నష్టాలను కూడా ఎదుర్కోనేలా ఏపీ సిద్ధమవుతోందన్నారు. ఉమ్మడిగా సాధిద్ధాం భవిష్యత్ పారిశ్రామిక అవసరాల కోసం విద్య సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం కలిసి ఉమ్మడిగా కృషి చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల్ని, ఆవిష్కరణల్ని విద్యా సంస్థలు తయారు చేయాల్సి ఉందని, ప్రభుత్వాలు పెట్టుబడులు తీసుకువస్తాయని ఈ మూడు కలిసి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి విశ్లేషించారు. గ్లోబల్ టెక్ రంగంలో భారత్ లీడర్ గా మారాలంటే అంతా కలిసి పనిచేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. పట్టభద్రులను నిపుణులుగా మార్చుకోడానికి పరిశ్రమలకు నెలల సమయం వృధా చేస్తే లక్ష్యాన్ని సాధించలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఎంప్లాయబిలిటీని జాతీయ మిషన్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశోధన, స్కిల్లింగ్, స్టార్టప్ , మాన్యుఫాక్చరింగ్, గవర్నెన్స్, ఇన్నోవేషన్ లాంటి సమీకృత విధానాలపైనే దేశ అభివృద్ధి అధారపడి ఉందని స్పష్టం చేశారు. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తయారు కావాలని ప్రణాళికలు చేసుకున్నామని అన్నారు. భారత 500 గిగావాట్ల ఇంధన ఉత్పత్తి లక్ష్యంలో ఏపీ 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపోందించినట్టు వివరించారు. సంస్కరణల వల్లే విశాఖకు దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చిందని.. గూగుల్ తో పాటు రిలయన్స్ కూడా ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఏపీలో మొదటి సారి విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని 30 పైసలకు తగ్గించామని త్వరలోనే దీనిని రూ.1.30 కి తగ్గించేలా లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు విధానాలతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ నగరంగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నట్టు సీఎం వివరించారు. సమాజానికి తిరిగి ఇవ్వడంతో పాటు పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ఏపీలో పీ4 కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఏజింగ్ సమస్యకు చెక్ పెట్టేలా పాపులేష్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువచ్చామన్నారు. సంపద వస్తేనే సంక్షేమం అని.. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ఏ రాజకీయనాయకుడూ సంక్షేమ పథకాలు ప్రకటించలేరన్నారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-naidu-36-219487.html





