హాస్టల్లో కోతుల బెడద…రక్షణ కల్పించాలని తల్లిదండ్రుల నిరసన
Publish Date:Dec 13, 2025
Advertisement
అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో గిరిజన విద్యార్థులు కోతుల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మెరుగైన విద్య కోసం రావికమతం, మాడుగుల మండలాల పరిధిలోని ఆవురువాడ, చీమలపాడు పంచాయతీ పరిధిలో రాయపాడు, పెదగరువు, జోగంపేట, అజయ్పురం, కళ్యాణ్ లావా, చీమలపాడు, తోపాటు గొరిగడ్డ గ్రామాలకు చెందిన మొత్తం 96 మంది ఆదివాసి గిరిజన విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. గత నెల రోజులుగా హాస్టల్ ప్రాంగణంలో కోతులు స్వైర విహారం చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులపై కోతులు దాడి చేయడంతో, వారిని హాస్టల్ సంక్షేమ అధికారి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనపై పత్రికల్లో వార్తలు రావడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకుని నిరసన చేపట్టారు. తమ పిల్లలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, జిల్లా ఉన్నతాధికారులు ఒక రాత్రైనా హాస్టల్లో బస చేసి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కోరారు. అదే విధంగా హాస్టల్లో కిటికీలు సక్రమంగా లేకపోవడం, చుట్టూ భారీ చెట్లు ఉండటం వల్ల కోతుల బెడద పెరిగిందని వారు తెలిపారు. వెంటనే చెట్ల తొలగింపు, కిటికీల మరమ్మతులు చేపట్టి, గిరిజన విద్యార్థులకు భద్రత కల్పించాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/anakapalli-36-210949.html





