కోనసీమ కొలిమి.. బ్లో ఔట్.. మంటల నియంత్రణకు మరో వారం!
posted on Jan 7, 2026 9:03AM
.webp)
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో బ్లో అవుట్ మంటలను ఆర్పే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లో అవుట్ ని అదుపు చేయడానికి మంగళవారం (జనవరి 6) ఉదయం నుంచీ నిరంతరాయంగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లో అవుట్ వేడి తగ్గించేందుకు నీరు పిచికారీ చేస్తున్నారు. మంగళవారం (జనవరి 6) నుంచి అర్ధరాత్రి వరకూ ఈ నీటి పంపింగ్ నిరంతరాయంగా జరిగింది. బ్లో ఔట్ కారణంగా ఎగజిమ్ముతున్న మంటలను ఒకే సారి నియంత్రిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, అందుకే దశలవారీగా మంటల అదుపునకు ప్రయత్నాలు చేస్తున్నామనీ ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.
ఒక బ్లో ఔట్ ప్రదేశానికి భారీ వాహనాలు, మడ్ ఫిల్లింగ్ యంత్రాలను తీసుకువచ్చేందుకు పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ తాత్కాలిక రోడ్ల ద్వారా.. భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని తీసుకు వస్తామని చెప్పారు. మొత్తంగా వారం రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనికి వచ్చిన తరువాత పునరావాస కేంద్రంలో ఉంటున్న వారిని వారివారి ఇళ్లకు పంపేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఇలా ఉండగా ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం చేరుకున్నాయి. ఈ బృందాలు బ్లో అవుట్ సైట్ ని పరిశీలించాయి. మంటల అదుపునకు పలు సూచనలు చేశాయి. ఓన్జీసీ టెక్నాలజీ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ సక్సేనా, ప్రాంతీయ విపత్తు నిర్వహణ ఇంఛార్జ్ శ్రీహరి సైతం సైట్ విజిట్ చేసిన వారిలో ఉన్నారు.