కల్వకుంట్ల కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం
posted on Jan 7, 2026 9:23AM
.webp)
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి మంగళవారం (జనవరి 6) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత, పార్టీ అగ్రనేతలతో విభేదాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఆమెను గత సెప్టెంబర్ లో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ, బీఆర్ఎస్ ద్వారా తనకు లభించిన శాసనమండలి సభ్యత్వానికి కూడా అప్పుడే రాజీనామా చేశారు. ఆ రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పుడు ఆమోదించారు.
ఆమె రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం లభించడంతో బీఆర్ఎస్తో ఆమెకు ఉన్న అనుబంధం ముగిసిపోయింది. ఇలా ఉండగా కల్వకుంట్ల కవిత జాగృతి కార్యవర్గంతో మంగళవారం (జనవరి 6) రాత్రి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, బడ్జెట్, ఉపాధి, వైద్యం, మహిళా సాధికారత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం వంటి విభిన్న రంగాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించారు.ఆ కమిటీల అధ్యయన నివేదికలను పరిశీలించేందుకు ఎల్.రూప్సింగ్ అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా అధ్యయన కమిటీలు ఈనెల 17 న తమ నివేదికలను అందజేయాలని, ఆ తర్వాతే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.