టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్
posted on Sep 8, 2025 4:32PM
.webp)
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదలీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఈవోగా ప్రస్తుతం ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం (సెప్టెంబర్ 8) ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, ఏపీ రెవెన్యూ, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్కుమార్ మీనా, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్గా శేషగిరిబాబు, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శిగా హరి జవహర్లాల్ను నియమించింది.