విజయవాడలో సెంచరీ కొట్టిన పెట్రోల్.. 

కరోనా కల్లోలంతో జనాలు అల్లాడిపోతున్నారు... అటు చమురు కంపెనీలు మాత్రం బాదుడు ఆపడం లేదు. వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలను చమురు కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి పెట్రోల్ రేట్ సెంచరీ కొట్టింది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.100.11 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 94.43గా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.97.63, లీటర్‌ డీజిల్‌ రూ.92.54కు పెరిగింది.

పెరుగుతున్న ధరలతో గతంలోనే రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటగా.. కొత్తగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.93.94 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.84.89కి చేరింది.ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.19, డీజిల్ రూ.92.17కు పెరిగింది.చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.51 ఉండగా.. డీజిల్‌ రూ.89.65గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.97గా.. డీజిల్‌ ధర రూ.87.74 గా ఉంది.బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.07.. డీజిల్‌ రూ.89.99 గా ఉంది.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్‌ ధరలు నిలకడగా కొనసాగుతూ వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం చమురు కంపెనీలు మళ్లీ బాదుడు పెంచేశాయి. వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ధరలు పెరగ్గా.. శుక్రవారం విరామం తర్వాత శనివారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ఈ నెలలో చమురు ధరలు దాదాపు 15సార్లు పెరిగాయి. మే నెలలోనే లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెరగడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలే కరోనాతో విధించిన లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న తమపై భారం మోపడం ఏంటని మండిపడుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu