విషమంగానే మాగంటి ఆరోగ్యం...పరామర్శించిన కేటీఆర్‌

 

తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  పరామర్శించారు. శనివారం ఉదయం అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న కేటీఆర్‌. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి పొందుతున్న ఎమ్మెల్యే మాగంటిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కాగా, గత గురువారం సాయంత్రం మాగంటి గోపీనాథ్‌ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నారు. 

కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. మాగంటి గోపీనాథ్ గతంలో కూడా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి చికిత్స తీసుకున్నారు. గత ఐదు నెలలుగా ఆయన పలు అవయవాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా అనారోగ్యం ఆయన పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.