జగన్ పై కేసు..ధృవీకరించిన గుంటూరు ఎస్పీ
posted on Jun 23, 2025 8:57AM
.webp)
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ధృవీకరించారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జగన్ ఈ నెల 18న పర్యటించిన సమయంలో ఆయన అన్ని నిబంధనలనూ ఉల్లంఘించారని స్పష్టం చేశారు. జగన్ వాహనం ఢీ కొనడం వల్లనే సింగయ్య మరణించారని తేలిందన్నారు. తొలుత సింగయ్య ను ఢీ కొన్నది జగన్ కాన్వాయ్ వాహనం కాదనీ, ప్రైవేటు వాహనమనీ తమకు సమాచారం అందిందనీ, అయితే ఆ తరువాత పలువీడియోలను స్వాధీనంన చేసుకుని పరిశీలించి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడం వల్లే సింగయ్య మరణించినట్లు థృవీకరించుకున్నట్లు తెలిపారు.
సింగయ్యను ఢీ కొట్టిన తరువాత కూడా వాహనం ఆపకుండా కొంత దూరం ఈడ్చుకుపోయినట్లు కూడా తేలిందని చెప్పారు. వాస్తవానికి మాజీ సీఎం హోదాలో జగన్ పర్యటనకు 100 మంది అనుచరులు, కార్యకర్తలను, 14 వాహనాల కాన్వాయ్కి మాత్రమే అనుమతి ఇచ్చామనిఅయితే జగన్ మాత్రం తాడేపల్లి నుంచి 50 వాహనాలతో వచ్చారని.. దారి పొడవునా హంగామా చేశారని తెలిపారు. ఇవన్నీ.. పోలీసు యాక్టు 30/2 మేరకు ఉల్లంఘనలేన ని చెప్పారు. దీనిపైనా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అయితే.. సింగమయ్య మృతిపై ఆయన సతీమణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా మరో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కాన్వాయ్కు ఇచ్చిన అనుమతులు, పోలీసుల నిబంధనలు ఉల్లంఘించి జగన్ తప్పు చేశారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ సీఎం పీఎ నాగేశ్వరరెడ్డిలపై కేసులు నమోదు చేశామని, బీఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసులు పెట్టామని వివరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.