మైనింగ్ డాన్ ఎఫెక్ట్.. విచారణ నుంచి తప్పుకున్న ముగ్గురు జడ్జీలు
posted on May 29, 2025 2:11PM

మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధనరెడ్డి ఎఫెక్ట్ న్యాయవ్యవస్థపై తీవ్ర స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఒకే కేసుకు సంబంధించి ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్నారు. తెలంగాణ హైకోర్టు చరిత్రలో అలా జరగడం ఇదే మొదటిసారి. దాంతో గాలి అండ్ కో బ్యాచ్ కేసుల విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం సహజమే. ఆ కేసులో గతంలో హాజరైనా... వ్యక్తిగత కారణం ఉన్నా తప్పుకుంటుంటారు. అయితే ఒకే కేసులో ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్న అరుదైన సంఘటనకు తెలంగాణ హైకోర్టు వేదిక అయింది.
ఇలా ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం ఇదే మొదటిసారి. ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.శరత్, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ నగేశ్ భీమపాకలు విచారణ నుంచి తప్పుకొన్నారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ దోషులు బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజ్అలీఖాన్, వి.డి.రాజగోపాల్లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. దోషులందరూ శిక్షను సస్పెండ్ చేసి బెయిలు మంజూరు చేయాలని కోరగా, గాలి జనార్దన్రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీలు దాఖలు చేశారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మే 6న వెలువరించిన తీర్పుపై గత వారం దోషులు అప్పీలు దాఖలు చేశారు.
ఈ నెల 21న అప్పీళ్లపై జస్టిస్ నందికొండ నర్సింగ్రావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఏడేళ్ల లోపు శిక్ష పడి, గతంలో బెయిలు పొందినట్లయితే తక్షణం శిక్ష అమలును నిలిపివేసి బెయిలు మంజూరు చేసే సంప్రదాయం ఉందన్నారు. అందులోనూ మూడున్నరేళ్లకుపైగా జైలు జీవితం గడిపారని, అందువల్ల బెయిలు మంజూరు చేయాలని కోరారు. న్యాయమూర్తి నిరాకరిస్తూ సీబీఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణను ఈ వారానికి వాయిదా వేశారు. ఇందులో భాగంగా దోషులు దాఖలు చేసిన 5 పిటిషన్లు బుధవారం జస్టిస్ కె.శరత్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చాయి. ఉదయం కోర్టు ప్రారంభ సమయంలోనే ఈ కేసులను మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.
తర్వాత అవి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందుకు విచారణకు వచ్చాయి. సాయంత్రం 7 గంటల సమయంలో అవి విచారణకు రాగా మరో న్యాయమూర్తి ముందుంచాలంటూ తప్పుకున్నారు. దీంతో న్యాయవాదులు.. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకొన్నారని, వీటిపై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. దీంతో జస్టిస్ నగేశ్ భీమపాక.. పిటిషన్లకు చెందిన ఫైళ్లను తెప్పించి పరిశీలించి ఇది ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు అని.. తాను కూడా తప్పుకుంటున్నానని తెలిపారు. దీంతో బెయిలు పిటిషన్ల విచారణకు గాలితో సహా దోషులు మరోవారం వేచి ఉండాల్నిన పరిస్థితి ఎదురైంది.