కవిత కు సుఖేశ్ ఫోబియా.. చాటింగ్ పై మౌనం

మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో చాటింగ్ చేశానంటూ వెల్లడించిన వివరాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ తో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదంటూ ఆమె స్పందించిన తీరును పలువురు తప్పుపడుతున్నారు.

సుఖేష్ చంద్రశేఖర్ న్యాయవాది అయితే కవిత స్పందన చిన్ని పిల్లల తీరులో ఉందని ఎద్దేవా చేశారు. సుఖేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొనడానికి కవిత భయపడుతున్నట్లుగా ఉందని అన్నారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఆరోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు ఆమె ముందుకు రావాలని, అందుకు భిన్నంగా విచారణను ఎదుర్కొనేందుకు జంకుతున్నారంటే తన క్లయంట్ ఆరోపణలు వాస్తవం కావడమే కారణమని పేర్కొన్నారు.

 సుఖేశ్  ఆరోపణలు ఆధారరహితమైనవయితే ఆ విషయం దర్యాప్తులోనే వెల్లడవుతుంది కదా అని ప్రశ్నించారు.  సుఖేష్ ఆరోపనలకు కవిత స్పందించిన తీరు  మీడియా, రాజకీయ పార్టీల మీదకు తప్పు తోసేయాలన్న ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు.   సుఖేశ్   ఆరోపణలను  నిబంధనల ప్రకారమే వెల్లడించారని తెలిపారు. ఎవిడెన్సు యాక్టులోని సెక్షన్ 65(బీ) ప్రకారం సర్టిఫై చేశారని, ఆయన తన ఆరోపణలను  అఫిడవిట్ రూపంలోనే అందజేశారని, అందువల్లనే డిజిటల్ ఎవిడెన్సుగా పనికొచ్చే స్క్రీన్ షాట్‌లను విడుదల చేశారని సుఖేష్ న్యాయవాది వివరించారు.

 సుఖేశ్ చేసిన ఆరోపణలన్నింటినీ రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థల పెద్దలను అడ్రస్ చేస్తూ రాసిన లేఖలో కూడా సమగ్రమైన దర్యాప్తును కోరారని ఆయన చెప్పారు.  దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకునేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా సుఖేష్ ఆరోపణలను ఆమె ఖండించిన తీరు ఉందని పేర్కొన్నారు.   మొత్తం మీద సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణల తరువాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉందన్న అనుమానాలు మరింత బలపడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.