తండ్రిని కోల్పోయిన వాడిని ఆ బాధేంటో నాకు తెలుసు : రామ్మోహన్ నాయుడు
posted on Jun 14, 2025 3:05PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి బాధను తాను అర్థం చేసుకోగలనని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. గతంలో తన తండ్రి ఎర్రన్నాయుడుని రోడ్డు ప్రమదంలో కోల్పోయిన వారి బాధను అర్ధం చేసుకోగలని కేంద్ర మంత్రి తెలిపారు. విమానయాన భద్రతపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే మంటలార్పి.. మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని ఆయన పేర్కొన్నారు.
దుర్ఘటనపై విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశాం. అవసరమైతే మరికొంత మంది సభ్యులనూ బృందంలో చేరుస్తాం. శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలిలో బ్లాక్స్బాక్స్ దొరికింది. దానిని విశ్లేషించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుంది. అందులో ఏముందో తెలుసుకునేందుకు మేమూ ఆతృతగా ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హోంశాఖ సెక్రెటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేక అధికారులతో, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశాం. సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ సభ్యులు దోహదపడతాయని కేంద్ర మంత్రి తెలిపారు.