వృక్షాసన భంగిమ లో మానవ హారం.. గోష్పాద క్షేత్రంలో యోగాంధ్ర

కొవ్వూరు గోష్పాద క్షేత్రం విఐపి ఘాట్ లో "యోగాంధ్ర" రాష్ట్రస్థాయి కార్యక్రమం శనివారం (జూన్ 14) విజయవంతంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో   ప్రజా ప్రతినిధులు, వేద పాఠశాల విద్యార్థులు, వయో వృద్ధులు, మహిళలు, యువత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తో "ఆర్ట్ ఆఫ్ లివింగ్" సంస్థకు చెందిన యోగ గురువు సరోజ యోగాసనాలు వేయించారు. అనంతరం బ్రహ్మకుమారి సోదరి రాజయోగ ధ్యానం చేయించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. అందులో భాగంగానే కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.  మంచి ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని సూచించారు. జూన్ 21 తేదీన మరింత మంది యోగా సాధన కార్యక్రమం లో పాల్గొనాలని  పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా యోగా వృక్షాసన భంగిమలో  మానవహారం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా పర్యాటక ప్రాధాన్యత దృష్ట్యా ఈ యోగా కార్యక్రమానికి గోష్పాద క్షేత్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందని వివరించారు.  

ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి ఖిల్లాపై 

ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా యోగాంధ్ర ను వినూత్నంగా నిర్వహిస్తున్నారు.  యోగాతో పాటు జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా ప్రణాళికా బద్ధంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కృష్ణా జిల్లా రాష్ట్రంలోని జిల్లాల కంటే ముందుంటోంది.  ఇటీవల కృష్ణా నదిలో బోట్లపైన యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ జిల్లా   శనివారం (జూన్ 14) ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కొండపల్లి ఖిల్లాపై యోగాసనాలు ప్రదర్శించి అందరినీ ఆకర్షించింది.

కొండపల్లి ఖిల్లాపై   యోగాసనాల ప్రదర్శనే కాకుండా పర్యాటకంగా కొండపల్లి ఖిల్లాకు ప్రాచుర్యం కల్పించేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించింది.    యోగాపై అందరిలోనూ అవగాహన ఏర్పడేందుకు ఎంతగానో దోహదపడేలా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.