విపక్షాల ఐక్యత సాధ్యమేనా?

విషయం ఏదైనా, వివాదం ఏదైనా  దేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్నాయి. ఇదే ఆఖరి అవకాశం.. ఇప్పడు కాకపోతే, ఇంకెప్పుడూ కాదు.. సమీప భవిష్యత్ లో బీజేపీని దెబ్బతీయడం అయ్యేపని కాదు అని కృత నిశ్చయానికి వచ్చేశాయి. అందుకే ఎలగైనా 2024 ఎన్నికల్లో  మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసి కదులుదామని అన్ని పార్టీల నాయకులు, ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. 

కొద్ది రోజుల కిందట అంటే  మార్చి 17న  సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో  భేటీ అయ్యారు.  రెండు గంటలకు పైగానే ఈ ఇరువురూ సమావేశమయ్యారు.

అయితే అఖిలేష్, మమతా బెనర్జీతో ఎందుకు సమావేశమయ్యారు, అంతసేపు ఆ ఇద్దరు ఏం చర్చించారు అన్నది పక్కన పెడితే.. వాస్తవానికి ఆ ఇద్దరే కాదు.. ఏ ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు, ఎక్కడ కలిసినా ఒకటే విషయం చర్చకు వస్తున్నది.    2024 ఎన్నికల్లో బీజేపీ ని ఓడించడం ఎలా? మోదీని గద్దె దించడం ఎలా? అన్నదే ఆ చర్చ. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మొదలు ఒకటి రెండు ఎంపీ సీట్లకు పరిమితమైన సిపిఐ, సిపిఎం వంటి  జాతీయ పార్టీల వరకూ,  జాతీయ రాజకీయాల్లో జెండా ఎగరేసేందుకు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నతృణమూల్, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ,ఉప ప్రాంతీయ పార్టీల వరకూ ఏ రెండు పార్టీలు. ఏ  ఇద్దరు నాయకులు కలిసినా బీజేపీని ఓడించడం ఎలా, మోడీని గద్దె దించడం ఎలా? అనే ఏక సూత్ర ప్రణాళిక పైనే చర్చిస్తున్నారు. 
వాస్తవానికి 2019 ఎన్నికలలో బీజేపీ వరసగా రెండవసారి  ముందుకు మించిన సొంత బలం (303) తో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతిపక్ష పార్టీలలో  గుబులు మొదలైంది. 2024 పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వెంటాడి వేధిస్తోంది.

ముచ్చటగా మూడవ సారి బీజేపీ గెలిస్తే  మోడీ మళ్ళీ ప్రధాని అయితే, తమ పరిస్థితి ఏమిటనే భయం మొదలైంది.  అందుకే  అప్పటి నుంచే బీజేపీని ఓడించడం ఎలా? మోడీని గద్దె దించడం ఎలా? అనే రెండు అంశాల చుట్టూనే ప్రతిపక్ష పార్టీల ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నాయి. అందరూ అదే మాట్లాడుతున్నారు. అన్నీ పార్టీలూ అందుకే ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఒకరి ఆలోచనకు, ఇంకొకరి ఆలోచనకు, ఒకరి మాటకు ఇంకొకరి మాటకు పొంతన ఉండడంలేదు, పోలిక కుదరడం లేదు. అందుకే  ప్రతిపక్షాల  ఐక్యత   ఇప్పటి వరకూ ఎండమావిలా మిగిలి పోయిందని పరిశీలకులు  అంటున్నారు. 

కోల్‌కతాలో మమతా బెనర్జీ, అఖిలేష యాదవ్ కూడా  అదే విషయం చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్  అదే విషయం స్పష్టం చేశారు.  మీరు ఫ్రంట్ అంటారా, పొత్తంటారా ఘటబంధన్  అంటారా అది మీ ఇష్టం.. కానీ, కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల కొత్త కూటమి త్వరలో ఏర్పడబోతోంది  అని ప్రకటించారు. అదే విషయం మమతా దీదీతో చర్చించానని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్  పార్టీ  ప్రాంతీయ పార్టీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎక్కడుండాలో అక్కడుంటే  మంచిదని హస్తం పార్టీకి ఓ చురక కూడా అంటించారు.

అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ భట్టాచార్య, మరో అడుగు ముందుకేసి, కాంగ్రెస్ పార్టీ  ప్రతిపక్ష పార్టీల  పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటే కుదరదని  కురువృద్ద కాంగ్రెస్ పార్టీ ఆ భావన నుంచి బయటకు రావాలని, ‘మా తాతలు నేతులు తాగారు’ అంటే కుదరదని కుండబద్దలు కొట్టారు.  ప్రస్తుతం కాంగ్రస్ పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ గా మాత్రమే మిగిలిందనే నిజాన్ని మరిచి పోరాదని గుర్తు చేశారు.  తృణమూల్  ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలకు సమ దూరం పాటిస్తుందనీ అన్నారు. అయితే అదే సమయంలో ఆయన, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, త్వరలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నాయకులను కలుస్తారని అంటున్నారు. ఎందుకు, ఏమిటీ అనే వివరణ లేదు. అందుకే రాజకీయ విశ్లేషకులు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కోల్ కతా వేదికగా జరిపిన తాజా చర్చలు  ప్రతిపక్ష పార్టీల అయోమయ స్థితికి, అధ్వాన పరిస్థితికి అద్దం పడుతున్నాయని అంటున్నారు.  

2019 నుంచీ బీజేపీ ప్రత్యర్ధి పార్టీల ఐక్యత కోసం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. 2024 వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగినా ఆశ్చర్య పోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.