స్వరాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు : సీఎం రేవంత్‌రెడ్డి

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లు అయిన ప్రజలు ఆకాంక్షలు నెరవేరలేదని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్ల అధిపత్యాన్ని తిరస్కరించి ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వేడుకల్లో జాతీయ పతాకన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి అన్నారు.  ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూలస్తంభాలు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలోపే రూ.2లక్షలలోపు రుణాలను మాఫీ చేశాం. ఆ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.26వేల కోట్లు జమ చేశాం. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నాం. రూ.200 కోట్లతో ఆయా చోట్ల భవన నిర్మాణాలు చేపట్టాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేశామని సీఎం పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తొమ్మిది మందికి రూ.కోటి నగదును ముఖ్యమంత్రి అందజేశారు. ఉద్యమ సమయంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు, కళాకారులు సాహితీవేత్తలకు నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎక్కా యాదగిరిరావు, అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ, జయరాజు, పాశం యాదగిరికి నగదు పురస్కారాన్ని అందించారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్‌, బండి యాదగిరి తరఫున వారి కుటుంబసభ్యులు అందుకున్నారు