అయినా.. రాహుల్ మారలేదు !

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ అనర్హత అంశంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను కొనసాగిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు చాలా వరకు రాహుల్ గాంధీ భుజం మీద తుపాకి పెట్టి  ప్రధాని మోడీపై తూటాలు పేలుస్తున్నాయి. ఒక విధంగా చూస్తే, పార్లమెంట్ లో అదానీ మాయాజాలం గురించి రాజకీయ రచ్చ జరుగతున్న సమయంలో ముఖ్యంగా  రాహుల్ గాంధీ  ప్రధాని మోడీ, ఆదానీల సంబంధాలను ప్రశ్నిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీని అనర్హునిగా  ప్రకటించడం  బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.

మోడీని నిజాయతీకి నిలువెత్తు రూపంగా భావించేవారు కూడా, దాల్ మే కుచ్ కాలా హై..  లేకుంటే పార్లమెంట్ లో రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది పోయి ఆయననే అనర్హునిగా ప్రకటించడం ఏమిటని అడుగుతున్నారు. 
అయితే  అదే సమయంలో స్వాతంత్ర సమరయోధుడు వీరా సావర్కర్ ను అవమానపరిచే విధంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష శిబిరంలో పెను దుమారమే రేపాయి.  నేను సవార్కర్ ను కాదు.  గాంధీని ..క్షమాపణ చెప్పను  అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్య కాంగ్రెస్ మిత్ర పక్షాలకే కాదు కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు. కాంగ్రెస్ మిత్ర పక్షం శివసేన (ఉద్దవ్ థాకరే) రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైరైంది. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన విందు సమావేశానికి ఉద్దవ్ థాకరే హాజరు కాలేదు. మరో వంక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సావర్కర్ విషయంలో ఎక్కువ చేస్తే మనకే ప్రమాదం.సావర్కర్ కు ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు. రాహుల్ గాంధీ సవార్కర్ విషయంలో సంయమనంతో మాట్లాడి ఉంటే బాగుండేది అని కాంగ్రెస్ పార్టీకి  పరోక్షంగా చురకలు అంటించారు. 

ఈ అన్నిటినీ మించి సావర్కార్ మనవడు రంజిత్ సవార్కర్  తనతాత (వీర సావర్కర్) బ్రిటిష్ వారికి ఎప్పుడు క్షమాపణలు చెప్పారో సాక్షాధారాలతో నిరూపించాలని లేదంటే  పరువు నష్టం దవాకు సిద్దం కావాలని హెచ్చరించారు.  దీంతో  ఖర్గే నివాసంలో జరిగిన విపక్ష పార్టీల సమావేశంలోనూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై  కాంగ్రేస్సేతర పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాహుల్ గాంధీ అపరిపక్వ వ్యాఖ్యలతో  ప్రతిపక్ష పార్టీలు ఐక్యత ప్రశ్నార్ధకం అవుతోందని  కాంగ్రెస్సేతర పార్టీల ముఖ్యనేతలు ఖర్గే , సోనియా గాంధీ దృష్టికి తీసుకువేల్లినట్లు తెలిసింది.

2019 ఎన్నికల సమయంలో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని మోడీ టార్గెట్ గా రాహుల్ గాంధీ  కోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా పేర్కొంటూ ‘చౌకీదార్ చోర్’ నినాదాన్ని కాయిన్  చేశారు. ఆ ఒక్క  ‘నినాదం చుట్టూనే ప్రచారం సాగించారు. అ ప్రచారమే కాంగ్రెస్ పార్టీతో పాటుగా మిత్ర పక్షాలను దెబ్బతీసిందని, బీహార్ కు చెందిన ముఖ్యనేత ఒకరు ఖర్గే దృష్టి తెచ్చారని తెలిసింది. అలాగే రాహుల్ గాంధీ తమ ధోరణి మార్చుకోని పక్షంలో తమదారి తాము చూసుకోవలసి వస్తుందని హెచ్చరించారని విశ్వసనీయ సమాచారంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపధ్యంలో ఖర్గే విందు సమావేశానికి హాజరైన 17 పార్టీలు సున్నిత విషయాలపై  అర్థరహిత వ్యాఖ్యలు చేయరాదని  ఒక వేళ పొరపాటున నోరు జారితే, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిర్ణయించినట్లు  తెలుస్తోంది. అయితే, రాహుల్ గాంధీని నియంత్రిచడం సోనియా, ఖర్గేలతో అవుతుందా? అనేది ఇప్పడు విపక్షాల  ముందున్న వెయ్యి డాలర్ల  ప్రశ్నగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.