భారత్ లో పుట్టిన టీకాలేని మహమ్మారి.. ఏంటో తెలుసా? 

కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా మహమ్మారితో వైరస్ పేరు ప్రస్తుతం పాపులర్ అయింది. చైనా వైరస్ అంటూ కరోనాను పిలుస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా వైరస్ తో పోల్చుతూ మాట్లాడుతున్నారు. తాజాగా ప్రముఖ భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చేసిన ట్విట్టర్ పోస్టు వైరల్ గా మారింది. భారత్ లో పుట్టిన టీకాలేని మహమ్మారి అంటూ ఆయన పెట్టిన పోస్టుకు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. 

ట్విట్టర్ కు కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఎంపికయ్యారు. ట్విట్టర్ కొత్త సీఈవోగా భారతీయుడు ఎంపికవడంపై ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు
అది టీకాలేని ఇండియన్ వైరస్ అంటూ చలోక్తి విసిరారు. ‘‘ఇది భారత్ లో పుట్టిన మహమ్మారి. ఆ విషయం చెప్పేందుకు ఎంతో గర్విస్తున్నా. ఆ వైరస్ పేరు ‘ఇండియన్ సీఈవో వైరస్’. దానికి టీకా కూడా లేదు’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. 

స్ట్రైప్ అనే కంపెనీ సీఈవో పెట్టిన పోస్టుకు మహీంద్రా ఈ విధంగా బదులిచ్చారు. ‘‘గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబి, ఐబీఎం, పాలో ఆల్టో నెట్ వర్క్స్.. ఇప్పుడు ట్విట్టర్ సీఈవోలంతా భారతీయులే. టెక్నాలజీ ప్రపంచంలో భారతీయుల ఇంతటి విజయాన్ని చూడడం అద్భుతంగా ఉంది. అంతేగాకుండా వలసవచ్చేవారికి అమెరికా ఎన్ని అవకాశాలిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది’’ అంటూ ప్యాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. దానికి బదులుగానే ఇది ఇండియన్ సీఈవో వైరస్ అంటూ ఆనంద్ మహీంద్ర రిప్లై ఇచ్చారు.