మాజీ మంత్రి అనిల్ కుమార్.. అడ్డంగా బుక్కయ్యారుగా?

ఐదేళ్ల వైసీపీ హయాంలో  ఓళ్లూపై తెలియకుండా మాట్లాడిన వాళ్లు, అడ్డగోలుగా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాళ్లు ఒక్కొక్కరుగా ఇప్పుడు చట్టం ముందు నిందితులు నిలబడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారం అండతో చెలరేగి ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరికీ ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది.  తాజాగా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అక్రమ మైనింగ్ ఉచ్చు గట్టిగా బిగుసుకుంది.  నెల్లూరు జిల్లా సుదుం మండలంలో క్వార్ట్జ్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డ కేసును విచారిస్తున్న అధికారులు.. ఈ కేసులో ఇప్పటికే    మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ గ గుర్తింపు పొందిన  అనిల్ కుమార్ వంతు వచ్చింది. 

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. క్వార్ట్జ్ గనుల లీజు ముగిసిన తర్వాత కూడా తవ్వకాలు జరిపినట్టు శ్రీకాంత్ రెడ్డి తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు ముట్టినది  టన్నుకు వెయ్యి రూపాయలు మాత్రమేనని వెల్లడించాడు.  క్వర్ట్జ్ అక్రమ మైనింగ్ లో తాను అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకే పని చేశానని కూడా వెల్లడించాడు. దీంతో ఈ కేసులో  మాజీ మంత్రి అనిల్ పాత్ర నిర్ధారణ అయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక శ్రీకాంత్ రెడ్డి  వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి అనిల్‌  కుమార్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక పోలీసులు కూడా త్వరలో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తమౌతున్నారు.  

అదలా ఉంటే అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో ఈ కేసులో  200 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు దర్యాప్తులో తేలిందని దర్యాప్తు అధికారలు చెబుతున్నారు. ఈ కేసులో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్,  అనిల్‌ కుమార్ ల ప్రమేయం నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ మాత్రమే ఉన్నారని భావించినా, శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలంతో అనిల్ కుమార్ పాత్ర కూడా తేటతెల్లమైందనీ, త్వరలో కేసు నమోదు చేస్తామనీ, నోటీసులు ఇచ్చి విచారించి అరెస్టు చేయడానికి కూడా వెనుకాడమోమనీ అంటున్నారు.  

అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం అక్రమార్జనలోనే కాదు.. అనుచిత భాషా ప్రయోగంలో కూడా ఇష్టారీతిగా రెచ్చిపోయారు. వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు పొందారు. గట్టిగా మాట్లాడడమంటే ప్రత్యర్థులపై అనుచిత భాషతో చెలరేగిపోవడం అని తెలిసిందే.  గతంలో అనిల్ కుమార్ యాదవ్   చంద్రబాబుపైనా, లోకేష్, పవన్ కల్యాణ్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొడగొట్టి, మీసం మెలేసి మరీ  సవాళ్లు విసిరారు.  అయితే వైసీపీ పరాజయం తరువాత.. అనిల్ కుమార్ యాదవ్ దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇటీవలే తెరపైకి వచ్చి మాట్లాడటం ప్రారంభించారు. అంతలోనే గతంలో తాను చేసిన అక్రమాలకు చెందిన కేసులో ఇరుక్కున్నారు. త్వరలో కటకటాల వెనక్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu