తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం (జులై 23)  ఉదయం శ్రీవారి  దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ నారాయణ గిరి షెడ్ల వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (జులై 22)  శ్రీవారిని మొత్తం 79 వేల 467 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 642 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 42 లక్షల రూపాయలు వచ్చింది.  

ఇలా ఉండగా శ్రీవాణి భక్తులకు శ్రీవారి దర్శన టికెట్లు జారీ చేయడానికి వీలుగా తిరుమలలో కొత్తగా దర్శనం టికెట్ల కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది.  శ్రీవాణి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను జారీ చేయడానికి  టీటీడీ పాలక మండలి గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు.  తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా ఈ  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు దీనిని మంగళవారం (జులై 22)  లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం (జులై 23) నుంచి ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ  ప్రారంభం అవుతుంది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu