భార్య ఆరోగ్యంపై బిగ్ బాస్ కౌశల్ ఎమోష‌న‌ల్‌ పోస్ట్.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. రెండో సీజన్ విన్నర్ గా కంటే పలు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచేవాడు. పీఎం ఆఫీస్ నుండి కాల్ వచ్చిందని, గిన్నిస్ రికార్డ్ కోసం అడిగారని ఇలా గొప్పలు చెప్పుకోవడంతో అతడి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇది కాకుండా.. కౌశల్ ఆర్మీలో కొందరు సభ్యులు అతడికి వ్యతిరేకంగా మారడంతో వ్యవహారం బాగా ముదిరిపోయింది.  కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులు వృధా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. చెప్పినట్లుగా కౌశల్ డబ్బులను ఫౌండేషన్ కు ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వార్తలతో అతడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేవాడు. కౌశల్ తో పాటు అతడి భార్య నీలిమపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. మొన్నామధ్య నీలిమ ఆరోగ్యం గురించి కౌశల్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తన భార్యకు ఆరోగ్యం బాలేదని మీడియా ముందు చెప్పాడు కౌశల్.  నీలిమకు గతంలో ఓ సర్జరీ కూడా జరిగింది. అయితే తాజాగా కౌశల్ తన భార్యను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''ఏదో సాధించేందుకు వెళ్లావ్.. దాని కోసం నువ్ నీ జీవితంతో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో నువ్ అనుకున్నది సాధిస్తావ్ అని నాకు తెలుసు.. త్వరగా కోలుకొని రా.. నువ్ కన్న కలల కోసం పోరాడు.. లవ్యూ.. మిస్ యూ'' అంటూ కౌశల్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన కౌశల్ అభిమానులు.. వదినకు ఏమైందంటూ కౌశల్ ని ప్రశ్నిస్తున్నారు. 

కెవ్వు కార్తీక్‌ రెమ్యునరేషన్ మామూలుగా లేదుగా!!

  బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ షో చాలా మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇందులో కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్నారు. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో కెవ్వు కార్తీక్ ఒకడు. టీమ్ మెంబర్ గా ఎంట్రీ ఇచ్చిన కెవ్వు కార్తీక్ టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు.  రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కార్తీక్.. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. అవినాష్ తో కలిసి స్కిట్ లు చేసిన కెవ్వు కార్తీక్ కు స్క్రిప్ట్ రాసే టాలెంట్ కూడా ఉండడంతో అతడికి త్వరగానే మంచి గుర్తింపు లభించింది. తాను మొదట్లో 200 రూపాయలకు మిమిక్రీ చేసేవాడినని, ఇంజనీరింగ్ చదివిన తరువాత ఈవెంట్లు చేయడం మొదలుపెట్టాన‌ని కార్తీక్ చెప్పుకొచ్చాడు.  వరంగల్ లో చేసిన ఓ ఈవెంట్ వలన తనకు క్రేజ్ పెరిగి అవకాశాలు రావడం మొదలయ్యాయని.. అలానే 'జబర్దస్త్' షోలో ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్న తరువాత తన రెమ్యునరేషన్ లక్షల్లోకి చేరిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే విషయం మాత్రం చెప్పలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. కార్తీక్ రెమ్యునరేషన్ ఒక ఎపిసోడ్‌కు రూ.2 లక్షలకు అటు ఇటుగా ఉంటుందని టాక్. 

రోజా మాకొద్దంటున్న నెటిజన్లు!

  'జబర్దస్త్' షో బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోని విమర్శించే వారు ఉన్నప్పటికీ.. టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ షోకి పోటీగా ఎన్ని షోలు వచ్చినప్పటికీ నిలవలేకపోతున్నాయి. ఇదిలా ఉండగా.. జడ్జి ప్లేస్ లో పర్మనెంట్‌గా కూర్చున్న రోజా.. ఇటీవల అనారోగ్య కారణాల వలన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె స్థానంలోకి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వచ్చి చేరింది.  త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న‌ ఇంద్రజ జడ్జి రోల్‌కి పూర్తి న్యాయం చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా చిన్న చిన్న పంచ్ లతో మనో, ఇంద్రజ కాంబినేషన్ ఆకట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ జడ్జి ప్లేస్ లోకి రోజా వచ్చి చేరింది. కొన్నిరోజుల క్రితం దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ప్రోమో ఎంటర్టైనింగ్ గానే ఉన్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.  చాలా మంది నెటిజన్లు రోజాను ఉద్దేశిస్తూ.. రోజా మాకొద్దు బాబోయ్.. ఇంద్రజనే కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. రోజా కాస్త ఓవరాక్షన్ చేస్తుందని.. కానీ ఇంద్రజ అలా కాకుండా చాలా జెన్యూన్ గా రెస్పాండ్ అవుతుందంటూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. కానీ 'జబర్దస్త్' షో నుండి రోజాని తప్పించే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ కామెంట్స్ ను చూసి చూడనట్లుగా ఉంటూ రోజానే కంటిన్యూ చేస్తారు నిర్వాహ‌కులు.  

లవ్ మ్యారేజ్‌పై అరియనా ఫీలింగ్స్‌! నెటిజ‌న్స్ నుంచి వ‌రుస ప్ర‌పోజ‌ల్స్‌!!

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్యులకు, సెలబ్రిటీలకు దూరం తగ్గింది. తారలు నేరుగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా తన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ సెషన్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె ప్రేమ, పెళ్లి, క్రష్ ఇలా చాలా విషయాలపై స్పందించింది. పేరున్న యాంకర్ కానప్పటికీ ఆర్జీవీ ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయింది అరియనా.  ఆ ఇంటర్వ్యూతోనే బిగ్ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసింది. ఇక హౌస్ లో ఆమె ఆట తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. కొందరు సెలబ్రిటీలు సైతం అరియనా యాటిట్యూడ్ ను మెచ్చుకున్నారు. ఇక తాజా సెషన్ లో అరియనా అబ్బాయిలపై తన ఫీలింగ్స్ బయటపెట్టి షాకిచ్చింది. "పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా..? ప్రేమ వివాహం చేసుకుంటావా..?" అని ఓ నెటిజన్ అడగ్గా.. "లవ్ మ్యారేజ్ చేసుకుంటా" అనే హింట్ ఇస్తూనే ఏ పెళ్లైనా కాంప్లికేషన్స్ తప్పవని బదులిచ్చింది. తనకు చాలా మందిపై క్రష్ ఉందని.. అయితే బయటకు చెప్పనని తెలిపింది.  అప్పుడప్పుడు కొంతమంది అబ్బాయిలను చూస్తే 'భలే ఉన్నాడే' అనే ఫీలింగ్ కలుగుతుందని.. మళ్లీ ఎందుకు లేనిపోని ఇబ్బందులు అని ఆలోచించి వెంటనే మర్చిపోతానని ఓపెన్ గా కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో అరియనాకు నెటిజన్ల నుండి వరుస ప్రపోజల్స్ రావడంతో ఉక్కిరిబిక్కిరైంది. కొందరు వాట్సాల్ప్ డీపీ, ఫోన్ వాల్ పేపర్ చూపించమని అడగ్గా.. వాటిని సైతం స్క్రీన్ షాట్స్ తీసి షేర్ చేసింది. తన ఫోటోలనే వాల్ పేపర్ గా, డీపీగా పెట్టుకుంది అరియనా.  

పార్టీలో అసభ్యంగా తాకాడు.. అసలు విషయం చెప్పిన నవ్య!

  టీవీ నటి నవ్యస్వామికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ లో నటించే ఈ బ్యూటీ తన అందంతో చాలా మందిని ఆకట్టుకుంది. ఇక నటుడు రవికృష్ణతో ఆమె ప్రేమలో ఉందనే విషయం గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇలా ఏదొక విషయంలో ఆమె ట్రెండ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా నవ్యస్వామి అలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చింది. గత వారం రిలీజ్ చేసిన ప్రోమోలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చెప్పింది.  ఈవెంట్ మేనేజర్ ను కొట్టానని..ఇప్పుడు బ్రతికి ఉన్నాడో, చచ్చాడో కూడా తెలియదంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆ విషయంపై వివరణ ఇచ్చింది. అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. స్నేహితులందరితో కలిసి పార్టీకు వెళ్లానని.. అందరం కలిసి డాన్స్ లు చేస్తూ పార్టీ చేసుకుంటున్నామని చెప్పింది. అలాంటి సమయంలో ఈవెంట్ మేనేజర్ వచ్చి తనను వెనుక నుండి అసభ్యంగా తాకాడని.. దాంతో వెంటనే వెనక్కి తిరిగి వాడిని తోసేసి చితక్కొట్టేశానని తెలిపింది.  వాడిని కొట్టిన కొట్టుడుకి తన చేతి వేళ్లు వాచిపోయాయని.. ఇక ఆ ఘటనతో తనకు ఎంతో భయం వేసిందని.. ఇంటికి వెళ్లి ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. ఎవరో వచ్చి మనల్ని అసభ్యంగా తాకితే ఎలా ఉంటుందని నవ్యస్వామి అసలు విషయం చెప్పుకొచ్చింది. ఇక చాలా కాలంగా సినిమాల్లో కనిపించాలని ఉందని.. కానీ ఇప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని.. కానీ దానికి ఇంకా సమయం ఉందని తెలిపింది. 

11 స‌ర్జ‌రీలు.. చావు బ్రతుకుల మధ్య టీవీ నటి!

  బుల్లితెరపై 'స్వాతి' అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శరణ్య శశి. ఈ సీరియల్ లో తన అందంతో పాటు అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా గడిపింది. అక్కడ కూడా ఈమెకి మంచి పేరే దక్కింది. మలయాళంలో ఈమె నటించిన ఓ సీరియల్ కు ఉత్తమ నటి కేటగిరీలో అవార్డుని కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ నటి చావు బ్రతుకుల మధ్య అల్లాడుతోందని సమాచారం.  ఈ విషయాన్ని శరణ్య స్నేహితురాలు, తోటి నటి సీమా నాయర్ వెల్లడించింది. శరణ్య మంచి నటిగా రాణిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని.. అప్పటినుండి ఆమె మంచానికే పరిమితమైందని.. ట్రీట్మెంట్ అందిస్తున్నా కోలుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు శరణ్యకు 11 సర్జరీలు జరిగాయట. అయినప్పటికీ ఆమె కోలుకోలేదని.. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని సీమా నాయర్ తెలిపింది.  ఓ వ్యాధి ఆమె వెన్నెముక నుండి శరీరమంతా పాకుతున్నట్లు వైద్యులు తెలిపారని సీమా చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే ఆమె ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతుంద‌ని.. అలాంటి సమయంలో శరణ్య తల్లి, సోదరుడికి కరోనా సోకడంతో హాస్పిటల్ పాలయ్యారని.. దీంతో శరణ్య ఆరోగ్యం మరింత దారుణంగా త‌యార‌వుతోందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సీమా నాయర్. 

ముందు ఆయ‌న ప్రేమించారు.. ఆ త‌ర్వాత నేను ప్రేమించాల్సి వ‌చ్చింది!

  నటి హరితేజ గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో బుల్లితెరపై సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ లో నటించిన ఆమె ఆ తరువాత బిగ్ బాస్ షోలో తన కామెడీతో అందరినీ నవ్వించింది. బిగ్ బాస్ షో కార‌ణంగా హరితేజకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ షో తరువాత ఆమెకి అవకాశాలు కూడా బాగా పెరిగాయి. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది హరితేజ.  తరచూ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతూ పలు రకాల కామెంట్స్ చేస్తుంటుంది. అలాంటి హరితేజ కొన్నాళ్లుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. ఆమె ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడు కూడా పలు ఫోటో షూట్లు, డాన్స్ లు షేర్ చేస్తూ రచ్చ చేసింది. బిడ్డ పుట్టిన తరువాత హరితేజ సోషల్ మీడియాలో కాస్త దూరమైంది. అయితే రీసెంట్ గా లైవ్ చాట్ ద్వారా తన ఫాలోవర్లను పలకరించింది. ఈ క్రమంలో నెటిజన్లు పలు రకాల ప్రశ్నలతో ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేశారు.  హరితేజది ప్రేమ వివాహమనే సంగతి కొంతమంది మాత్రమే తెలుసు. ఇదే విషయాన్ని తాజాగా ఓ నెటిజన్ అడిగాడు. "మీది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన వివాహమా..?" అని ప్రశ్నించాడు. దీనికి హరితేజ 'మన్మథుడు' సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు.. ''ముందు ఆయన ప్రేమించారు.. ఆ తరువాత నేను ప్రేమించాల్సి వచ్చింది.. ఇంకా ఇంట్లో వాళ్లకి ఆప్షన్ ఏముంది'' అంటూ ఫన్నీగా బదులిచ్చింది. 

బిగ్ బాస్ 5లోకి 'జబర్దస్త్' భామ!

  బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. గతేడాది కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటూ షోని పూర్తి చేయగలిగారు. అయితే ఈ ఏడాది పరిస్థితులు దారుణంగా మారడంతో నిర్వాహకులు కాస్త జంకుతున్నారు. మరోపక్క కరోనా రూల్స్ ను అతిక్రమించారని.. మలయాళ బిగ్ బాస్ సెట్ ను పోలీసులు సీజ్ చేసి, షో షూటింగ్‌ను ఆపేశారు.  దీంతో తెలుగు షో మరింత ఆలస్యం చేయాలని చూస్తున్నారట. ఇదంతా పక్కన పెడితే షోలో ఎవరిని కంటెస్టెంట్ లుగా తీసుకోవాలనే చర్చ ఇంకా జరుగుతోందని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే వీలైనంత త్వరగా షోని మొదలుపెట్టాలి కాబట్టి కంటెస్టెంట్ల లిస్ట్ రెడీ చేసుకొని వారితో డీల్ కుదుర్చుకొని సిద్ధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'జబర్దస్త్' బ్యూటీ వర్షను సంప్రదించారని సమాచారం.  సోషల్ మీడియాలో వర్షకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈమెని టీవీ కోటా కింద బిగ్ బాస్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఆమెని తీసుకురావడం ద్వారా షోకి గ్లామర్ యాడ్ చేయాల‌నుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఆర్టిఫిషియల్‌ ఎఫైర్ పెట్టుకోవడానికి కూడా ఆమె ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జబర్దస్త్ షోలో ఇమ్మాన్యుయేల్ తో అలాంటి ట్రాక్ ఒకటి నడిపిస్తోంది కాబట్టి వర్షని తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు!

'కార్తీకదీపం' చిన్నారులు శౌర్య‌, హిమ నెల సంపాద‌న ఇంతా?!

  బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని సీరియల్స్ పోటీ పడుతున్నా.. 'కార్తీకదీపం'ను బీట్ చేయలేకపోతున్నారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సాధారణంగా సీరియల్స్ అంటే ఎక్కువగా గృహిణులు మాత్రమే చూస్తుంటారనే అపోహ ఉండేది కానీ ఈ సీరియల్ ను పురుషులు స‌హా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేస్తున్నారు.  ఇక ఈ సీరియల్ లో నటించే వారందరికీ పాపులారిటీ పెరిగింది. డాక్టర్ గా బాబుగా చేస్తున్న నిరుపమ్ కి, వంటలక్కగా నటిస్తోన్న ప్రేమి విశ్వనాథ్ లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక వీరి పిల్లలుగా నటిస్తోన్న హిమ (సహృద), శౌర్య (కృతిక)లకు కూడా సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. అయితే ఈ సీరియల్ కు సంబంధించి ఈ పిల్లలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది. సాధారణంగా లీడ్ యాక్టర్స్ కు ఎపిసోడ్ లెక్కన రెమ్యునరేషన్ ఇస్తుంటారు.  సైడ్ క్యారెక్టర్ లకు, అలానే చిన్న పిల్లలకు రోజు వారీ లెక్కన పారితోషికం చెల్లిస్తారట. ఈ క్రమంలో బేబీ కృతిక‌, బేబీ సహృదలకు రోజువారీ కాల్షీట్ చొప్పున‌ చెల్లిస్తారట. ఆ లెక్కన చూసుకుంటే ఈ పిల్లలకు రోజుకి రూ.20 వేల నుండి రూ.30 వేల వరకు చెల్లిస్తున్నారట. అంటే నెలలో ప‌ది రోజులు షూటింగ్ జ‌రిగినా వీళ్ల సంపాదన లక్షల్లో ఉంటుందన్నమాట!

దమ్ము కొడుతూ లుంగీతో వంటలక్క!.. నిజ‌మేనా?!

  'కార్తీకదీపం' హీరోయిన్ ప్రేమి విశ్వనాధ్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటుంది. రీసెంట్ గా తన సొంత రాష్ట్రం కేరళకు చెక్కేసిన ప్రేమి.. ఇంట్లో పలు రకాల వంటకాలను ప్రిపేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.   ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఎరుపు రంగు లుంగీ, పసుపు రంగు చొక్కా, తలపాగా, ఒక చేతిలో కోడిని మరో చేత్తో కత్తిని పట్టుకొని.. నోట్లో సిగరెట్ పెట్టుకొని.. పొగ వదులుతూ 'సిత్తరాల సిరపడు' అంటూ 'అల.. వైకుంఠపురములో' అల్లు అర్జున్ మాదిరిగా ఊరమాస్ గెటప్ లో కనిపించి సర్ప్రైజ్ చేసింది.  ఈ వీడియోను షేర్ చేస్తూ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. మేకోవర్ వీడియో త్వరలో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వంటలక్క దమ్ము కొడుతూ ఉన్న మాస్ అవతారాన్ని చూసి అభిమానులు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. నీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా.. వంటలక్కా..? అంటూ ఆశ్చర్యపడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బన్నీతో ప్రేమలో పడిపోయా!

  బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. ఇటు టీవీ షోలు, అటు సినిమాలతో బిజీ అయిపొయింది. మరోపక్క సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమాలో నటిస్తోంది.  తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన అనసూయ.. బన్నీ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. తను 'పుష్ప' షూటింగ్ లో నాలుగు రోజులే పాల్గొందట. ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఆ నాలుగు రోజుల్లోనే అల్లు అర్జున్ డెడికేషన్ చూసి ఫిదా అయ్యానంటూ బన్నీ అభిమానులను ఎట్రాక్ట్ చేసే కామెంట్స్ చేసింది.  కేవలం నాలుగు రోజుల్లోనే అల్లు అర్జున్ తో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చిన అనసూయ.. బన్నీ మల్టీటాలెంటెడ్ అంటూ తెగ పొగిడేసింది. ఆయనకు మంచి పేరు, క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ తన మొదటి సినిమా కోసం ఎంత కష్టపడ్డారో 'పుష్ప' సినిమా కోసం కూడా అంతే కష్టపడుతున్నారని చెప్పింది. అల్లు అర్జున్ పాత్రతో ప్రేక్షకులు ఎగ్జైట్ అవ్వడం పక్కా అని చెప్పుకొచ్చింది అన‌సూయ‌. 

'ఫినాలే'లో ఊహించ‌ని గిఫ్ట్‌! దుఃఖాన్ని ఆపుకోలేక‌పోయిన మోనాల్‌!

  గతేడాది బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత ఆ షోకి బదులుగా ఓంకార్ 'డాన్స్ ప్లస్' షోను మొదలుపెట్టాడు. ఆరుగురు జడ్జిలతో సరికొత్తగా ఈ షోను డిజైన్ చేశారు. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ను తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. కొరియోగ్రాఫర్లను తీసుకోవాల్సిన స్థానంలో ఆమెని ఎలా తీసుకుంటారనే విమర్శలు వినిపించాయి. కేవలం గ్లామర్ షో కోసం ఆమెని తీసుకొని ఉంటారనే కామెంట్స్ చేశారు.  ఏదైతేనేం మోనాల్ గ్లామర్, ఆమె ఎమోషన్ షోకి బాగానే కలిసొచ్చింది. ఫైనల్ గా ఈ షో ముగిసిపోయింది. అందరూ భావించినట్లుగానే సంకేత్ సహదేవ్ విజేతగా నిలిచాడు. శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు. అయితే ఈ షోను మోనాల్ ఇంట్లో చిల్ అవుతూ చూసింది. ఫినాలే ఆదివారం నాడు మొదలైనప్పటికీ షూటింగ్ ముందే పూర్తయి ఉంటుంది. అలా మోనాల్ తన ఇంట్లో కూర్చొని బీర్ తాగుతూ షోని వీక్షించింది. మోనాల్ వ్యక్తిగత జీవితం గురించి అందరినీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో చాలా సార్లు తన ఫ్యామిలీ విషయాలు చెప్పింది. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడం గురించి మోనాల్ ఇదివరకు చాలా సార్లు చెప్పింది. ఈ ఫినాలే ఎపిసోడ్ లో మోనాల్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు ఓంకార్. తండ్రి త‌న భుజంపై చేయివేసి నిల్చున్న‌ట్లుగా వేసిన పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో మోనాల్ ఎమోషనల్ అయింది. వ‌స్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది.

"సుధీర్ నా బావ".. శ్రీముఖి రచ్చ మాములుగా లేదు!

  సుడిగాలి సుధీర్ ఎంట్రీతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కామెడీ షోకి మంచి హైప్ వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్ తో పాటు 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ కంటెస్టెంట్లు' రంగంలోకి దిగడంతో షోకి ఆదరణ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ షోకి గ్లామర్ అద్దడం కోసం బుల్లితెర రాములమ్మ శ్రీముఖిని రంగంలోకి దించేశారు. ఆమె స్టేజ్ పై ఎంటర్ అవ్వగానే సుడిగాలి సుధీర్ ని "బావా" అని వరస కలిపి పిలవడం మొదలుపెట్టింది.  ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రసారం అవుతున్న‌ ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు సుధీర్, శ్రీముఖి. తాజా ప్రోమోలో సుధీర్ తనదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. "ఏదైనా ప్రోగ్రాం తెచ్చావా..?" అని ఇమ్మాన్యుయేల్ అడగగా.. "ప్రోగ్రాం కోసం వెళ్లి తలుపులు కొడుతుంటే.. అందరూ నన్ను కొడుతున్నారు సర్" అంటూ పంచ్ వేశాడు. "తలుపు ఎవరు కొట్టమన్నారయ్యా.. బెల్ కొట్టొచ్చు కదా" అంటే.. "బాత్ రూమ్ లకు బెల్ ఉంటుందా..?" అని కౌంటర్ ఇచ్చాడు.  ఆ తరువాత 'ఓ రాములమ్మా.. రాములమ్మా' అనే పాటకు డాన్స్ చేస్తూ ఫ్యాక్షనిస్ట్ లతో ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. ఫ్యాక్షనిస్ట్ ల ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలా తన పంచ్ లతో రెచ్చిపోయింది. సుధీర్ ని చూపిస్తూ "ఇప్పటినుండి అతను మీకు బావ" అంటూ తెగ సిగ్గు పడిపోయింది. ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. 

వంట‌ల‌క్క చ‌చ్చిపోతే.. మిమ్మ‌ల్ని ఊరికే వ‌ద‌లం!

  చాలా కాలంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న‌ 'కార్తీకదీపం' సీరియల్. గత కొన్నిరోజులుగా ఈ సీరియల్ ఎంతో ఎమోషనల్ గా సాగుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య వస్తోన్న ఎమోషనల్, సెంటిమెంట్ సీన్లు ఓ రేంజ్ లో పండుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'కార్తీకదీపం' యూనిట్ కు బెదిరింపులు మొదలయ్యాయి.  దానికి కారణం ఏంటంటే.. కొద్దిరోజులుగా ఈ సీరియల్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీరియల్ లో వంటలక్క క్యారెక్టర్ ను చంపేస్తున్నారని.. ఇకపై ఆమె సీరియల్ లో కనిపించదనే మాటలు వినిపించాయి. దానికి తగ్గట్లే రీసెంట్ ఎపిసోడ్స్ లో వంటలక్క ఆరోగ్యం దెబ్బ తినడం, హాస్పిటల్ జాయిన్ చేయడం వంటి సన్నివేశాలను టెలికాస్ట్ చేయడంతో జనాలంతా ఇక హీరోయిన్ ను చంపేస్తారనే అభిప్రాయానికి వచ్చేశారు.  దీంతో స్టార్ మా యాజమాన్యాన్ని, 'కార్తీకదీపం' టీమ్ కి వార్నింగ్ లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే 'కార్తీకదీపం' హీరోయిన్ ప్రేమి విశ్వనాధ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ ని షేర్ చేసింది. అందులో ఓ నెటిజన్ 'వంటలక్క చచ్చిపోతే రెండు రాష్ట్రాలు తగలబడిపోతాయ్' అంటూ బెదిరించినట్లుగా మీమ్‌ పోస్ట్ పెట్టాడు. అలానే వంటలక్క క్యారెక్టర్ ను చంపేస్తే స్టార్ మా ఛానెల్ ని ఊరికే వదలం అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

"అందం పోతుంద‌ని డ‌బ్బా పాలు పడుతున్నారా?".. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు హ‌రితేజ ఆన్స‌ర్ ఇదే!

  బుల్లితెరపై సీరియల్స్ లో నటించి, ఆ తరువాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కనిపించింది హరితేజ. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని తనదైన ఆటతో జనాలను ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ పెరిగింది. ఇండస్ట్రీలో ఆమెకి అవకాశాలు కూడా పెరిగాయి. రీసెంట్ గా హరితేజ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో తాను పడ్డ కష్టాల గురించి ఇటీవల చెప్పుకొచ్చింది.  తనకు కొవిడ్ పాజిటివ్ రావడంతో ఆపరేషన్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని.. కానీ ఫైనల్ గా అంతా బాగానే జరిగిందని.. తమ పాప ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చింది. తాజాగా హరితేజ త‌న‌ ఫాలోవర్లతో ముచ్చట పెట్టింది. చాలా రోజుల తరువాత ఆన్లైన్ లోకి వచ్చినా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. చాలా మంది పాప యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు.  "అందం పోతుందని డబ్బా పాలు పడుతున్నారా..? లేక మీరే ఇస్తున్నారా..?" అని ప్రశ్నించాడు ఒక‌త‌ను. ఇది చూసిన హరితేజ.. ఒకింత వ్యంగ్యంగా నవ్వుతూ.. "ఏమిటో మీ అనుమానాలు?" అంటూ కౌంటర్ ఇచ్చింది. "వ్యాక్సిన్ వేసుకున్నారా..?" అని మరో నెటిజన్ అడగగా.. పాపకు పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్ వేసుకోవాలో లేదో అనే విషయంలో తనకు కన్ఫ్యూజన్ ఉందని అసలు విషయం చెప్పింది.  

నేను దేశానికి చేస్తున్న సేవ ఇదే.. మీరూ చేయండి!

  ప్రస్తుతం దేశంలో కరోనా ఎంతగా విజృభిస్తుందో తెలిసిందే. రోజుల్లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే రికవరీ రేటు బాగానే ఉండడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. మ‌రోవైపు వైద్యం సరిగ్గా అందక, ఆక్సిజన్, బెడ్ల‌ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొంతమంది ప్రభుత్వ తీరుని విమర్శిస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశం విఫలమైందని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా గెటప్ శ్రీను ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఆయన కొన్ని విషయాల గురించి మాట్లాడారు.  మన దేశ జనాభాను ప్రపంచంలోనే చిన్న చిన్న దేశాలతో పోల్చి చెప్పారు. అమెరికా, రష్యా, జర్మనీ, టర్కీ, యూకే అంటూ ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల జనాభా మొత్తం మన దేశ జనాభాకు సమానమని చెప్పారు. అలా ఇంత జనాభా ఉన్నప్పటికీ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక్క భారతదేశ జనాభా 139 కోట్లు అని చెప్పిన జబర్దస్త్ శ్రీను.. కొవిడ్ ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి ఎంత పని చేస్తున్నాయో అంత పని ఇండియా ఒక్కటే చేస్తోంద‌ని అన్నారు.  కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అనడం చాలా సులువు కానీ ప్రపంచదేశాలకు సాటిగా, ధీటుగా నిలబడడానికి నీ వంతు సహకారం అందించు అని ప్రజలను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. మీరు ఎలాంటి ఆర్ధిక సహాయం చేయక్క‌ర‌లేద‌నీ.. ఈ లాక్ డౌన్ ను విజయవంతం చేస్తే చాలనీ చెప్పుకొచ్చారు. "ఇంట్లోనే ఉంటూ.. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, ఇతరులను కాపాడండి.. ఇదే మీరు దేశానికి చేసే చిన్న సేవ." అంటూ గెటప్ శ్రీను ఓ పోస్ట్ పెట్టారు. 

నువ్వు వర్జినా..? నెటిజన్ ప్రశ్నకు దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన న‌టి కూతురు!

  టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విష‌యాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె. లాక్ డౌన్ కావడంతో వీరిద్దరూ చాలా వీడియోలను షేర్ చేస్తున్నారు. వరుసగా లైవ్ చాట్ లు పెడుతూ.. తమ‌ ఫాలోవర్లతో ముచ్చట పెడుతున్నారు.  నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా లైవ్ సెషన్ నిర్వహించిన సుప్రితకు నెటిజన్ల నుండి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా.. "ఏదైనా అడగండి, సమాధానాలు చెబుతా" అంటూ లైవ్ మొదలుపెట్టింది సుప్రిత. ఇందులో భాగంగా ఓ నెటిజన్ "నువ్ వర్జినా..?" అంటూ అడగకూడని ప్రశ్నను సంధించాడు.  ఇది చూసిన సుప్రిత అదిరిపోయే కౌంటర్ రిప్లై ఇచ్చింది. 'వకీల్ సాబ్' సినిమాలో కోర్ట్ సీన్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ తన సమాధానం చెప్పకనే చెప్పింది. సినిమాలో ప్రకాష్ రాజ్.. నివేదా థామస్ ను కోర్టులో ఇలాంటి ప్రశ్నే అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతాడు. ఆ సీన్ ను సుప్రిత షేర్ చేసింది. మొత్తానికి అమ్మడు రియాక్షన్ చూసిన వాళ్లు గట్టిగానే ఆన్స‌ర్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

డాన్స్ షోలో దీప్తి హాట్ పెర్ఫార్మన్స్.. షణ్ముఖ్ పై ట్రోల్స్!

  ఆదివారం జ‌రిగిన‌ 'డాన్స్ ప్ల‌స్' గ్రాండ్ ఫినాలేలో దీప్తి సున‌య‌న హాట్ ప‌ర్ఫార్మెన్స్‌, కో డాన్స‌ర్‌తో ఆమె ముద్దులు పెట్టించుకున్న వైనం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ విష‌యంలో ఆమెతో పాటు యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ కూడా ట్రోల‌ర్స్ బారిన‌ప‌డ్డాడు. సోషల్ మీడియాలో దీప్తి సునయన, షణ్ముఖ్ జంటకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతుంటాయి. ఈ జంట ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తమపై వచ్చే వార్తలను చూసీచూడనట్లు వదిలేస్తారు. ఏదైనా ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి అడిగితే మాత్రం "అందరికీ తెలిసిందే కదా" అని సమాధానం దాటవేస్తారు.  అలా దీప్తి సునయన, షణ్ముఖ్ వ్యవహారం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. దీప్తిపై ట్రోలింగ్ వచ్చిన ప్రతిసారీ షణ్ముఖ్ ను కూడా ఆడేసుకుంటారు. షణ్ముఖ్ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు దీప్తిని ఏడిపిస్తుంటారు. అలా ఇప్పుడు దీప్తి సునయన చేసిన పనికి షణ్ముఖ్ ను ఆటపట్టిస్తున్నారు. డాన్స్ ప్లస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో దీప్తి సునయన సెగలు పుట్టించేలా పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కో డాన్సర్ తో హాట్ మూవ్స్, ముద్దులు పెట్టించుకోవ‌డం వంటి విషయాలపై నెటిజన్లు మండిపడ్డారు.  దీప్తి ఆలా రెచ్చిపోవడంతో షణ్ముఖ్ పై మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేశారు. తాజాగా దీనిపై షణ్ముఖ్ స్పందించాడు. రీసెంట్ గా తన ఫాలోవర్లతో ముచ్చటించిన షణ్ముఖ్ కి ''డాన్స్ ప్లస్ షోలో దీప్తి పెర్ఫార్మన్స్ విషయంలో.. మీపై బాగా మీమ్స్ వ‌చ్చిన‌ట్లున్నాయిగా.. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?'' అంటూ ఒక‌త‌ను వెటకారంగా ప్రశ్నించాడు. దీనికి షణ్ముఖ్.. ''కొత్తగా ఏం అనిపించలేదు.. ఇంత కన్నా దారుణాలు తట్టుకున్న గుండె ఇది.. ఇవి అన్నీ ఎంత'' అంటూ తన స్టైల్ లో బదులిచ్చాడు. 

అది నా చాన‌ల్ కాదు.. నా పేరుతో మోసం చేస్తున్నారు!

  సినిమాల్లో హీరోయిన్‌గా రాని పేరును 'బిగ్ బాస్‌'లో కంటెస్టెంట్‌గా పాల్గొన‌డం ద్వారా సాధించింది మోనాల్ గ‌జ్జ‌ర్‌. దాంతో ఆమెకు ఐట‌మ్ సాంగ్స్ అవ‌కాశాల‌తో పాటు టీవీ షోల‌లో జ‌డ్జిగా, గెస్ట్‌గా పాల్గొనే అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. దీంతో ఆమె పేరును వాడుకుంటూ కొంత‌మంది మోసాల‌కు తెర‌తీశారు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'సుడిగాడు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో ఒకట్రెండు అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో మోనాల్ టాలీవుడ్ కు దూరం కావాల్సి వచ్చింది. అయితే బిగ్ బాస్ షో తరువాత మోనాల్ బిజీ అయింది. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది.  సోషల్ మీడియాలో కూడా ఆమెకి పాపులారిటీ పెరిగింది. కాగా మోనాల్ పేరును వాడుకుంటూ కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుతో 'మోనాల్ గజ్జర్ అఫీషియల్' అనే ఫేక్ యూట్యూబ్ ఛానెల్ ను క్రియేట్ చేశారు. అందులో మోనాల్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తున్నారు.  దీంతో ఇది మోనాల్ సొంత యూట్యూబ్ ఛానెల్ అని ఫ్యాన్స్ భావించారు. ఈ విషయం మోనాల్ దృష్టికి రావడంతో ఆమె స్పందించింది. సదరు ఛానెల్ తనకు సంబంధించినది కాదని తేల్చి చెప్పింది. ఆ ఛానెల్ ఫేక్ అని.. ఫ్యాన్స్ ను అలర్ట్ చేసింది. ఆ ఫేక్ యూట్యూబ్ ఛానెల్ గురించి రిపోర్ట్ చేయమని అభిమానులను కోరింది.