సెప్టెంబ‌ర్‌లో థ‌ర్డ్ వేవ్ ప‌క్కా.. రోజుకు 5 లక్షల కేసులట‌.. నీతి ఆయోగ్ హెచ్చరిక..

థ‌ర్డ్ వేవ్ లేదు ఏమీ లేదు. జ‌నాలు చూడు ఎంత బిందాస్‌గా తిరుగుతున్నారో. కేసులు కూడా పెద్ద‌గా ఏమీ రావ‌ట్లేదు. ప్ర‌జ‌ల్లో సైతం క‌రోనా భ‌యం లేదు. సెకండ్ వేవ్ ముగిసింద‌ని తెలంగాణ‌ అధికారికంగానే ప్ర‌క‌టించింది. ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో బోనాల పండ‌గ జోరుగా జ‌రిపారు. అయినా, కేసులు అంతంతే ఉన్నాయి. ఏపీలో స్కూల్స్ కూడా తెరిచారు. ఇలా మొత్తం అన్‌లాక్ అవుతోంది. రాబోవు వినాయ‌క చ‌వితి సైతం పెద్ద ఎత్తున జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రాల తీరు ఇలా ఉంటే.. కేంద్రం మాత్రం క‌రోనా క‌ట్ట‌డిపై ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తోంది. మీరు చేస్తున్న‌ది త‌ప్పు.. ఇంకా కొవిడ్ ముప్పు పోలేదంటూ ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు చేస్తోంది. అయినా, రాష్ట్రాలు ప‌ట్టించుకుంటేగా. తాజాగా, నీతి ఆయోగ్ మ‌రో వైర‌స్ బాంబ్ వ‌దిలింది. క‌రోనా ఎక్క‌డికీ పోలేద‌ని.. థ‌ర్డ్ వేవ్‌కు రెడీ అవుతోంద‌ని.. మూడో ముప్పు మ‌రింత డేంజ‌ర‌స్‌గా ఉంటుంద‌ని గ‌ట్టి వార్నింగ్ ఇస్తోంది. సెప్టెంబ‌ర్‌లోనే ముహూర్తం అంటూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి మరోమారు వికృతరూపం చూపనుంది. లేటెస్ట్‌గా నీతి ఆయోగ్ కరోనా థర్డ్ వేవ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని అల‌ర్ట్ చేస్తోంది. కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయ‌ని అంచనా వేసింది. ఆ పరిస్థితులకు త‌గ్గ‌ట్టు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచింది.  2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. గ‌తంలొ సెకండ్ వేవ్ గురించి కూడా నీతి ఆయోగ్ క‌రెక్ట్‌గా అంచ‌నా వేసింది. ఇప్పుడు మూడో ముప్పు గురించి తెల‌ప‌డంతో ప్ర‌భుత్వం, అధికారులు అల‌ర్ట్ అవుతున్నారు.  ఆగ‌స్టులో కొవిడ్ కేసులు నియంత్ర‌ణ‌లోనే ఉన్నాయి. దేశంలో గత‌ 56 రోజులుగా 50 వేలకు దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 403 మంది చ‌నిపోయారు. 

హుజూరాబాద్ ఓటర్లు డిసైడై పోయారా? ఎవరేం చేసినా  ఫలితం అదేనా? 

హుజూరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క తప్పుతోందా?  అనుకున్నదొకటి, అయినది ఒకటి అన్నట్లుగా, ఏదో ఆశించి తీసుకుంటున్న నిర్ణయాలు బూమ్రాంగ్ అవుతున్నాయా? అందుకేనా, ఏమి చేయాలో పాలుపోకనే ముఖ్యమంత్రి రోజుకో సమీక్ష నిర్వహిస్తున్నారా? నియోజక వర్గం నాయకులను పిలిపించుకుని, అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? ఆళ్ళే మంటున్నరు, వీళ్ళేమంటున్నరు? అని ఆరాతీస్తోంది అందుకేనా, చివరకు అధికారులు వండి వడ్డించిన ‘వంటింటి’ సర్వేలు కూడా ఆయన ఆశలు మీద నీళ్ళు చల్లుతున్నారా?  అందుకేనా, ముఖ్యమంత్రి ఏమి చేద్దాం, ఎలా బయట పడదాం,అని మేథోమథనం సాగిస్తోంది అందుకేనా? అంటే,అంతర్గత వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి ఒక్క దళిత బంధుతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించవచ్చని, ముఖ్యమంత్రి లెక్కలేశారు. ఆ ఉద్దేశంతోనే పైలట్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ నియోజక వర్గాన్ని ఎంపిక చేశారు. నియోజక వర్గం పరిధిలోని దళిత కుటుంబాల లెక్కలు తీశారు. నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలున్నాయి. (హుజూరాబాద్ మండలంలో 5,323, కమలాపూర్ మండలంలో 4346, వీణవంక మండలంలో 3678, జమ్మికుంట మండలంలో 4996,ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలు). నియోజక వర్గంలోని అన్ని దలిత కుతుబాలకు ఒకేసారి పథకాన్ని వర్తింప చేయాలని, తద్వారా దళిత ఓట్లను గంపగుట్టగా తమ వైపుకు తిప్పుకుంటే, ఈటలను ఇట్టే సునాయాసంగా ఇంటికి పంపించవచ్చని ఆశించారు. ఇందుకోసంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్’ లో పథకం అమలుకు కేటాయించిన, రూ. 1200 కోట్లకు అదనంగా మరో రూ.2000 కోట్లు కేటాయించేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. అంటే, ఈ పథకం మీద ముఖ్యమంత్రి ఎంతగా ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చును. నిజానికి, ఆ నిజాన్ని అయన దాచుకోలేదు. హుజూరాబాద్’లో గెలిచేందుకే దళిత బంధు పథకం, అని బహిరంగంగా ప్రకటించారు.  కానీ, దళిత బంధు పథకం నుంచి ఆశించిన ఫలితాలు రాకపోగా వ్యతిరేక ఫలితాలు స్పష్టమవుతున్నాయని, కొంచెం ఆలస్యంగా అర్థమైందని సన్నిహత వర్గాల తాజా సమాచారం. అందుకే మళ్ళీ ఓల్డ్ ట్రిక్స్ ప్లే  చేస్తున్నారని అంటున్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కథ వినిపించడంతో పాటుగా ఈటల వెంట ఉన్న నాయకులను తమ వైపుకు తిప్పుకోవడంపై మరో మారు దృష్టిపెట్టాలని శుక్రవారం అర్థరాత్రి వరకు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించినట్లు, తెలుస్తోంది.  ఇందులో భాగంగానే, ఇప్పటకే సమాదానదండోపాయాలను ప్రయోగించి  ఈటల అనుచరులు చాలా వరకు తమవైపుకు తిప్పుకున్న అధికార పార్టీ, ఇప్పుడు మరో మారు, ఆయన  అనుచరులకు వల విసురుతోంది. అందులోనూ ముఖ్యంగా ఇంతవరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగని ఈటల సన్నిహిత అనుచరులను కారెక్కిచేందుకు,గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే, ఈటలకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటున్న పింగిలి ర‌మేష్‌, చుక్కా రంజిత్’లు తాజాగా కారెక్కి గులాబీ గూటికి చేరారు.  అయితే, గుర్రాన్ని బలవంతంగా రేవు వరకు తీసుకు పోవచ్చును, కానీ, నీళ్ళు తాగించడం సాధ్యం కాదు. అలాగే, అదిరించో బెదిరించో, ఈటల అనుచరులను తమ వైపుకు తిప్పుకోవచ్చును కానీ, మనసులను మార్చడం అయ్యే పని కాదని, అటు వెళ్ళిన వారే అంటున్నారు. నిజానికి, ఇప్పటికే, హుజూరాబాద్ ఓటర్లు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటు ఈటల అటు కేసీఆర్ ఏ ఒడ్డున నిలవాలో జనం డిసైడై పోయారని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

మెగాస్టార్ ప‌వ‌ర్‌స్టార్ అయ్యేనా? ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు?

హ్యాపీ బ‌ర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి. బ‌ర్త్‌డే విషెష్‌తో తెలుగురాష్ట్రాలు హోరెత్తిపోతోంది. ఆదివారం మొత్తం మెగా సంద‌డే. ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్‌, భోళాశంక‌ర్‌ల చ‌ర్చే. ప్ర‌ముఖులంతా చిరంజీవికి శుభాకాంక్ష‌లు చెప్పారు. ఫ్యాన్స్ అంతా పోస్టులు, స్టేట‌స్‌లు, పాట‌లతో త‌మ అభిమానం చాటుకున్నారు. సోష‌ల్ మీడియా మొత్తం మెగాస్టార్ మేనియానే. గ్రీన్ ఛాలెంజ్‌తో సోష‌ల్ కాజ్ సైతం పెద్ద ఎత్తున కొన‌సాగింది. అంతా బాగుంది.. మెగాస్టార్ పుట్టిన‌రోజు వేడుక‌లు బ్ర‌హ్మాండంగా సాగాయి. అంతేనా.. అస‌లైన ఫ్యాన్స్ ఇంతే కోరుకుంటున్నారా? ఆచార్యతో అడ్జ‌స్ట్ అయిపోతారా? గాడ్‌ఫాద‌ర్‌తో గ‌మ్మున ఉండిపోతారా? భోళాశంక‌ర్ భ‌జ‌న చేసుకుంటూ రిలాక్స్ అవుతారా? కానే కాదు.. సినీ ఫ్యాన్స్ అలా కాంప్ర‌మైజ్ అవుతారేమో కానీ.. పొలిటిక‌ల్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిని ఇంకెక్క‌డో చూడాల‌నుకుంటున్నారు.. అన్న‌య్య‌ను అంద‌నంత ఎత్తున ఊహించుకుంటున్నారు.. ఆయ‌న్ను ఎక్క‌డికో తీసుకెళ్లాల‌నుకుంటున్నారు కానీ.. మెగాస్టార్ మాత్రం అందుకు ఇప్పుడే సిద్ధంగా లేనంటున్నారు. సినిమాల‌తో య‌మా బిజీగా ఉంటున్నారు. మ‌రి, మెగాస్టార్ ప‌వ‌ర్ కేవ‌లం సినిమాల వ‌ర‌కేనా? పాలిటిక్స్‌లో మ‌ళ్లీ 'ప‌వ‌ర్‌' చూపించే రోజులు రావంటారా? కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌. కేంద్ర మాజీమంత్రి. టాలీవుడ్ బిగ్‌బాస్‌. తెలుగు రాష్ట్రాల‌లో ఫుల్ క్రేజ్‌. దేశంలోనూ మంచి పాపులారిటీ. అభిమాన‌గ‌ణం మెండు. రాజ‌కీయాల్లో రాణించ‌డానికి అన్ని అర్హ‌త‌లూ ఉన్నాయి. అయినా, ఏవో కార‌ణాలతో ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ క‌న్ఫ్యూజ‌న్‌గా మారింది. ప్ర‌జారాజ్యంతో ఉద‌యించే సూర్యుడిగా వెలుగొందుతార‌ని అనుకున్నారంతా. వైఎస్సార్ ఆప‌రేష‌న్‌కు కాంగ్రెస్‌లో క‌లిసిపోయి కేంద్ర మంత్రి అయ్యారు. క‌ట్‌చేస్తే.. రాష్ట్ర విభ‌జ‌న‌తో పాటూ ఆయ‌న రాజ‌కీయ ఉన్న‌తీ ముక్క‌లుచెక్క‌లైంది. ఆ త‌ర్వాత చిరంజీవి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో మెరిశారు. వ‌రుస హిట్‌ల‌తో మునుప‌టి చ‌రిష్మా సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న టెక్నిక‌ల్‌గా కాంగ్రెస్‌లోనే ఉన్నా.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.  చిరంజీవి పాలిటిక్స్‌లో యాక్టివ్ లేకున్నా.. సినీ పాలిటిక్స్‌లో మాత్రం అంద‌రిక‌న్నా ముందున్నారు. టాలీవుడ్ స‌మ‌స్య‌లపై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో సినీ కార్మికుల‌ను ఆదుకున్నారు. ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చొర‌వ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇటు తెలంగాణ స‌ర్కారు, అటు ఏపీ ప్ర‌భుత్వానికి అత్యంత స‌న్నిహితుడిగా మారారు. క‌ల్వ‌కుంట్ల‌-కొణిదెల ఫ్యామిలీల మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి-జ‌గ‌న్ క్లోజ్ రిలేష‌న్ మెయిన్‌టెన్ చేస్తున్నారు. అపాయింట్‌మెంట్ లేకుండానే ఇద్ద‌రు సీఎంల‌ను క‌లిసేంత సాన్నిహిత్యం ఏర్ప‌డింది. తెలంగాణ పాలిటిక్స్‌లోకి చిరంజీవి వ‌చ్చే అవ‌కాశం లేకున్నా.. ప‌రోక్షంగా కేసీఆర్‌కు స‌పోర్ట్‌గా ఉంటున్నారు. ఇక‌, ఏపీ రాజ‌కీయాల్లో మెగాస్టార్ రోల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్ప‌టికీ మెగాస్టార్.. ట్రంప్‌కార్డ్‌గానే ఉన్నారు. ఏపీ రాజ‌కీయాల‌ను శాసించ‌లేక‌పోయినా.. ప్ర‌భావితం మాత్రం చేయ‌గ‌ల‌రు. అందుకే, చిరంజీవిని ట్రాప్ చేసేలా జ‌గ‌న్ ఆయ‌న‌తో ఈమ‌ధ్య కాలంలో రాసుకుపూసుకు ఉంటున్నార‌ని అంటున్నారు.. త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాన్ జ‌న‌సేన పార్టీ నుంచి కాచుకోడానికి.. అన్న‌య్య చిరంజీవితో న‌రుక్కొస్తున్నార‌ని భావిస్తున్నారు. కావాల‌నే చిరంజీవిని ప‌లుమార్లు క‌లుస్తూ.. ఏపీ టాలీవుడ్‌పై చ‌ర్చిస్తూ.. చిరంజీవి-జ‌గ‌న్ మంచి ఫ్రెండ్స్ అనే మెసేజ్ ప‌బ్లిక్‌లోకి వెళ్లేలా చూసుకుంటున్నారు. ఇదంతా జ‌గ‌న్ ఆడుతున్న మైండ్‌గేమ్ అంటున్నారు. చిరంజీవిని వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు పంపుతార‌నే ప్ర‌చారానికీ తాడేప‌ల్లి వ‌ర్గాల లీకులే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. జ‌న‌సేన నుంచి ర‌క్ష‌ణ‌కే మెగాస్టార్‌ను సేఫ్‌గార్డ్‌గా ముందుంచుతున్నార‌ని విశ్లేషిస్తున్నారు.  ఇక ఈసారి ప్ర‌ధాని కావాల‌ని ఆశ‌ప‌డుతున్న రాహుల్‌గాంధీ సైతం ఏపీలో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ను మ‌ళ్లీ పట్టాలెక్కించాల‌ని భావిస్తున్నారు. అందుకోసం ఏపీ మొత్తం సెర్చ్ లైట్ పెట్టి వెతికితే.. ఒక్క చిరంజీవి మాత్ర‌మే వారికి ఆశాకిర‌ణంలా క‌నిపిస్తున్నారు. అందుకే, చిరంజీవిని మ‌ళ్లీ కాంగ్రెస్‌లో యాక్టివ్ చేసే బాధ్య‌త‌ను రాహుల్‌గాంధీ.. ఉమెన్‌చాందీకి అప్ప‌గించార‌ని చెబుతున్నారు. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి మాదిరిగా.. చిరంజీవిని ఏపీపీసీసీ చీఫ్ చేసి.. ప‌త్తా లేకుండా పోయిన కాంగ్రెస్‌కు ఓ రూపు తీసుకురావాల‌ని చూస్తున్నారు. అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌రెడ్డి జైలుక వెళితే.. వైసీపీలో ఉన్న‌వారంతా ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ వాదులే కాబ‌ట్టి.. వారిని మ‌ళ్లీ వెన‌క్కి లాగి.. చిరంజీవి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌కు మ‌ళ్లీ ప్రాణం పోయాల‌నేది రాహుల్ అండ్ టీమ్ ఐడియా. మ‌రి, అది సాధ్య‌మా? అంటే... అనుమాన‌మే. వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కూ సినిమా షెడ్యూళ్ల‌తో బిజీగా ఉన్నారు మెగాస్టార్‌. ప్ర‌స్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న ఆయ‌న‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్ లైట్‌లోకి వ‌స్తారా? ఏపీ పాలిటిక్స్‌లో ఫుల్ జోష్ మీద‌ త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉండ‌గా.. మ‌ళ్లీ ఈ అన్న‌య్య ఎంట్రీ అవ‌స‌ర‌మా? సినిమాల్లో మెగాస్టార్‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అయి 'ప‌వ‌ర్‌'స్టార్‌గా మారుతారా? ఏమో......  

కేటీఆర్ కు కవిత రాఖీ కట్టలేదా? ఇద్దరి మధ్య మాటల్లేవా? ప్రగతి భవన్ లో ఏంటీ పరేషాన్? 

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. దేశ వ్యాప్తంగా రాఖి పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కాచెల్లెళ్లు తమ అన్నా దమ్ముళ్లకు రాఖీలు కట్టి ప్రేమను చాటుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు  నివాసం, తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ సీఎం జగన్ కు మంత్రులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీడీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు.  తెలంగాణ సీఎం నివాసం ప్రగతి భవన్ లోని రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఆయ‌న సోద‌రీమ‌ణులు రాఖీ క‌ట్టారు. అక్కాచెల్లెళ్లు ల‌క్ష్మ‌మ్మ‌, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు నివాళి హార‌తి ప‌ట్టి, రాఖీలు క‌ట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వ‌దించారు. సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగినా.. ఒక వెలికి మాత్రం కనిపించింది. రాఖీ వేడుకల్లో ఎప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే సీఎం కేసీఆర్ కూతురు, మంత్రి కేటీఆర్ సోదరి.. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఈసారి ఎక్కడా కనిపించడకపోవడం అందరిని షాకింగ్ కు గురి చేసింది. ఎమ్మెల్సీ కవిత .. ఆయన సోదరుడు కేటీఆర్ కు ప్రతి ఏటా రాఖీ కడుతుంది. గత కొన్నేండ్లుగా ఎప్పుడు ఆమె ఈ ఈవెంట్ ను మిస్ చేయలేదు. గత ఏడేండ్లుగా ప్రగతి భవన్ లో రాఖీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కాని ఈసారి మాత్రం ప్రగతి భవన్ లో కవిత కనిపించకపోవడం చర్చగా మారింది.  సంతోష్ సోదరి,  మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, మేయర్ గద్వాల విజయలక్ష్మి  సహా చాలా మంది నేతలు కేటీఆర్ కు రాఖీ కట్టారు. ఆ ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అందులో ఎంపీ సంతోష్ సోదరి కేటీఆర్ రాఖీ కట్టిన ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూడగానే అందరికి ఎమ్మెల్సీ కవిత గుర్తుకు వస్తోంది. ఎందుకంటే గత కొన్నేండ్లుగా ఎంపీ సంతోష్ సోదరితో కలిసి కేటీఆర్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టేది కవిత. వాళ్లందరు కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. కాని ఈసారి ప్రగతి భవన్ లో ఆ సీన్ కనిపించలేదు. ఎంపీ సంతోష్ సోదరి ఒక్కతే కేటీఆర్ కు రాఖీ కట్టారు. ఆ ఫోటోనే కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ఫోటోను చూసిన వారంతా ఎమ్మెల్సీ కవిత ఎక్కడ? ,అన్న కేటీఆర్ కు సొదరి కవిత రాఖీ కట్టలేదా? కట్టకపోతే ఎందుకు కట్టలేదు? అని చర్చించుకుంటున్నారు.  ప్రతి ఏటా రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనే ఎమ్మెల్సీ కవిత.. ఈసారి ఎక్కడికి వెళ్లారన్నది ఎవరికి తెలియడం లేదు. ఆమె అసలు హైదరాబాద్ లో ఉన్నారా లేక బయటికి వెళ్లారా అన్న చర్చలు కూడా సాగుతున్నాయి. రాఖీ పౌర్ణమి రోజున  తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అలాంటిది కవిత ఎందుకు లేదన్నది ప్రశ్నగా మారింది. అందులోనూ రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనే కవిత.. ఈసారి ఫెస్టివల్ ను ఎందుకు మిస్ చేశారన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్ కు కవిత రాఖీ కట్టకపోవడం తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లోనూ తీవ్ర చర్చగా మారింది.  కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలున్నాయని గతంలో ప్రచారం జరిగింది. అన్న కేటీఆర్ తో కవితకు పడటం లేదనే  చర్చ కూడా ఉంది.  ముఖ్యమంత్రి మార్పు విషయంలో వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. తాజాగా రాఖీ వేడుకల్లో కవిత కనిపించకపోవడంతో వాళ్లిద్దరి మధ్య విభేదాలు నిజమేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాఖీ కట్టలేనంత గ్యాప్ ఇద్దరి మధ్య వచ్చిందా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. మొత్తంగా ప్రగతి భవన్ లో జరిగిన రాఖీ వేడుకల్లో కవిత కనిపించకపోవడం, అన్న కేటీఆర్ కు ఆమె రాఖీ కట్టకపోవడం తెలంగాణలో పెద్ద చర్చగానే మారిపోయింది.. 

కేసీఆర్ బాటలో యోగీ.. యూపీలో దళిత బంధుకు ప్లాన్

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం, దేశానికే ఆదర్శం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్,పలు సందర్భాలలో ప్రకటించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి అమలుచేస్తున్న రైతు బంధు, తదితర పథకాలు ఏ విధంగా అయితే, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శమయ్యాయో, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి ఆదర్శం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి అన్నట్లుగానే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం చర్చకు వచ్చింది. ఇందుకు సంబంధించి అధికార బీజేపీ  సభ్యుడు సురేష్ కుమార్ త్రిపాఠి లేవనెత్తిన ప్రశ్నకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనూ దళిత బంధు తరహ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి దళిత ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు ఇచ్చే ప్రస్తావన యోగీ చేయలేదు. ఆయన స్టైల్లో  ఆయన, యూపీ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల విలువైన  దళితుల భూములను అమ్మి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయిస్తే, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, రాష్ట్ర వ్యాప్తంగా భూ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో దళితులు, పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.  ఉత్తర ప్రదేశ్ లో  2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం భూకబ్జాలపై ప్రత్యేక దృష్టిని కేరీకరించింది. ముఖ్యంగా, గత ప్రభుత్వాల హయాంలో  రాజకీయ మాఫియా ముఠాలు కబ్జా చేసిన వేల ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ఇప్పటి వరకు 67,000 ఎకరాల రెవెన్యూ శాఖ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించిందని ముఖ్యమంత్రి యోగీ తెలిపారు. రాజకీయ, భూమాఫియా నుంచి, స్వాధీనం చేసుకున్న ఈ భూముల్లో దళితులు, పేదలకు ఇళ్లు నిర్మించడంతో పాటుగా, క్రీడా మైదానాలకూ ప్రాధాన్యత ఇస్తామని, యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.  అదలా ఉంటే కేవలుం ఒకే ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రకటించిన ఒక లక్షా 70 వేల  కోట్ల రూపాయల దళిత బందుకు, మరో ఆరేడు నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్ లో దళితులకు కేవలం ఇళ్లు మాత్రమే కట్టించే ఆ రాష్ట్ర దళిత బంధు పథకానికి పోలిక లేదని తెరాస నాయకులు అంటున్నారు. అయితే, భూములు అమ్మి పదిలక్షలు పంచడం, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఇళ్ళ నిర్మాణం చేపట్టడం ఒకటి కాదని బీజేపీ  నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. అంతే కాదు, కబ్జాలకు గురైన భూములను రక్షించలేక అమ్మేస్తున్నామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి , వేల ఎకరాల కబ్జా భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న యూపీ సర్కార్’కి పోలిక పొంతన లేదని బీజేపీ నాయకులు వ్యగ్య అస్త్రాలు సంధిస్తున్నారు. మరి, ప్రజలేమంటారో..

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్.. ఎలా వచ్చిందో తెలుసా? 

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు.  రాఖీ వెనక బలమైన చరిత్ర ఉండేది. పూర్వం యుద్ధాలకు వెళ్లినప్పుడు... ఆ యుద్ధంలో గెలవాలని అన్నలకు సోదరీమణులు... రాఖీలు కట్టేవాళ్లు. ఆ రాఖీలతో వెళ్లే సైనికులు... తమకు తమ సోదరి అండగా ఉన్నట్లు భావించేవారు. అదే ధైర్యంతో యుద్ధంలో పోరాడి గెలిచేవారు. యుద్ధం మధ్యలో రాఖీకి ఏదైనా అయితే... రెచ్చిపోయి... శత్రువుల్ని చీల్చి చెండాడేవాళ్లు. అలా రాఖీ వారిలో ఎక్కడ లేని ఉత్సాహాన్నీ, ధైర్యాన్నీ, తెగువనూ తెచ్చేది. పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.  యముడు సోదరి అయిన యుమన ప్రతి శ్రావణ పౌర్ణిమ రోజున ఆయనకు రాఖీ కట్టేది. దీనికి బదులుగా యమధర్మరాజు తన సోదరితో ఎవరైతో రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం కలుగుతుందని వరం ఇచ్చాడు.రాజపుత్ర వనిత, చిత్తోర్‌గఢ్ రాణి కర్ణావతి అప్పటి ఢిల్లీ చక్రవర్తి హుమయూన్‌కు రాఖీని పంపి గుజరాత్ పాలకుడు బహదూర్ షా దండయాత్రలను నుంచి తమ రాజ్యాన్ని రక్షించాల్సిందిగా కోరారని, అప్పటి నుంచే రక్షా బంధన్ లేదా రాఖీ ప్రారంభమైందని అంటారు. అయితే ఈ సంప్రదాయం కొన్న వేల ఏళ్ల కిందటే ఉన్నట్లు హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా వేదకాలంలో దీనికి విశేష ప్రాచుర్యం లభించింది. వేదకాలంలో ఈ పండుగను కేవలం సోదరి, సోదరుల బంధంగానే కాదు, భార్యాభర్తలకు సంబంధించింది కూడా అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పురాణంలో ఓ కథ ఉంది. రాక్షసులతో యుద్ధానికి బయలుదేరిన దేవలోకాధిపతి ఇంద్రుడికి భార్య సచీదేవి రక్షణగా రాఖీ కట్టింది. అయితే ప్రస్తుతం ఇది భార్యభర్తల నుంచి వైదొలగి కేవలం సోదరి-సోదరుల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఉత్సవంగా మారిపోయింది. అలాగే యమధర్మరాజు సోదరి యుమన ప్రతి శ్రావణ పౌర్ణిమకు యుముడికి రాఖీ కట్టేది. తన సోదరితో ఎవరైతో రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం సిద్ధిస్తుందని యుముడు ప్రకటించాడు. అప్పటి నుంచి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి చిరాయువుగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సోదరులు కూడా తమ సోదరికి అశీసులు అందించి ప్రేమను చాటుకుంటారు. వాస్తవానికి పసుపులో దారాన్ని ముంచి, దాన్ని మూడు పొరలుగా చేతికి కట్టిన రాఖీ రక్షణగా ఉంటుంది. రాణి కర్ణావతి హుమయూన్‌కు రాఖీ పంపిన రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో మేవార్‌లో రక్షా బంధన్ తొలిసారిగా ప్రారంభమై, తర్వాత రాజస్థాన్ అంతటా వ్యాపించింది. అక్కడ నుంచి దేశమంతటా జరుపుకుంటున్నారు. వేడుకల పరంగా రక్షాబంధన్ కాలంతోపాటు మారుతూ వస్తుంది. రాఖీని సోదరి తన సోదరుడు కుడిచేతికి కట్టాలి. రాఖీలో దారం బంధానికి చిహ్నం. అలాగే మంచి చెడులు, వైఫల్యాల నుంచి సోదరుని ఇది కాపాడుతుంది. ఎరుపు రంగు దారం అగ్నికి ప్రతీక... అంటే ఇది శక్తికి, రక్షణకు, భద్రతకు బలం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.  చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చఁపవద్దని రోకా్సనా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చఁపకుఁడా విడిచిపెడతాడు. మనదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో రాఖి జరుపుకుంటారు. ఒడిశాలో రాఖీ పండుగను 'గ్రహ్మ పూర్ణిమ' అని పిలుస్తారు. ఆ రోజున వారు దైవాల్లా భావించే ఆవులు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, అలంకరిస్తారు. 'పితా' అని పిలిచే మిఠాయిలు చేసి ఇరుగుపొరుగుకి పంచుతారు.మహారాష్ట్ర, గుజరాత్‌, గోవాలలో ఈ రోజును 'నారియల్‌ పూర్ణిమ' అంటారు. బాగా వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణుడు, సముద్రుణ్ని పూజిస్తారు. జాలరులు ఈ రోజు నుంచే చేపలు పట్టే కాలం ప్రారంభమైనట్టు భావిస్తారు.ఉత్తరాఖండ్‌లోని ప్రజలు 'జనోపున్యు' పేరుతో రాఖీ పండుగను చేసుకుంటారు. తమ పవిత్రమైన జంధ్యాన్ని మారుస్తారు. చంపావత్‌ అనే జిల్లాలో బగ్వాల్‌ పేరుతో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు.మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, బీహార్‌లలో 'కజరి పూర్ణిమ' అని పిలుస్తారు. ఇది రైతులకి, కొడుకులున్న తల్లులకి చాలా ముఖ్యమైన పండగ. గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో 'పవిత్రోపన' పేరుతో పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున శివుని గురించి ప్రజలందరూ పూజ చేస్తారు. 

 JNTU గెస్ట్ హౌస్ లో ఫస్ట్ నైట్! ఏపీలో మరో దారుణం..

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణ ఘటన జరిగింది. చదువుల తల్లి సరస్వతీ దేవి నిలయమైన విశ్వవిద్యాలయాన్ని అపవిత్రంగా మార్చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ JNTU యూనివర్శిటీ  గెస్ట్ హౌస్ ను ఓ ప్రొఫెసర్ హనీమూన్ సెంటర్ గా మార్చేశారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర కలకలం రేపుతోంది.  కాకినాడలోని JNTU గెస్ట్ హౌస్ లో నవ దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. మొత్తం మూడు గదులు బుక్ చేయగా.. ఒక గదిలో శోభనం ఏర్పాటు చేశారు. మిగిలిన రెండు గదుల్లో పెళ్లి వేడుకలు జరిపినట్లు సమాచారం. వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ పేరుతో గదులు బుక్ చేశారు. ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.స్వర్ణ కుమారి గెస్ట్ హౌస్ లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. అందులో 201 గదిలో ఆగస్టు 18వ తేదీ రాత్రి నవ దంపతులకు అట్టహాసంగా శోభనానికి ఏర్పాట్లు చేశారు.సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాలకు యూనివర్శిటీలో అనుమతి ఇవ్వరు. అయితే నిబంధనలకు అతిక్రమిస్తూ.. శోభనానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్ర సపరివార సమేతంగా హజరయ్యారు.  నిబంధనలకు విరుధ్దంగా యూనివర్సిటీ యాజమాన్యం గెస్ట్‌హౌస్‌లో శోభనానికి అనుతివ్వటంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రఖ్యాతిగాంచిన జె ఎన్ టి యు యూనివర్సిటీని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించడం పట్ల పలు ఉద్యోగ,విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నాయి.  

మిత్ర పక్షానికి మమత షాక్.. సోనియా ప్ర‌య‌త్నాలు ఫలించేనా? 

కాంగ్రెస్ పార్టీ తాత్కలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్షాల ఐక్యత కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రెండు రోజుల క్రితం, ఆగష్టు 19 న రాజీవ్ గాంధీ జయంతి రోజున, ఆమె 19 పార్టీల నాయకులతో ఐక్యత సమావేశం నిర్వహించారు.వర్చువల్’గా సమావేశంలో తృణమూల్ సహా 19 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆమె, మనందరి లక్ష్యం 2024 సార్వత్రిక ఎన్నికలే కావాలని పిలుపు నిచ్చారు. అందుకోసంగా ప్రణాళికగా బద్దంగా పని చేయాలని, అన్నారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్దవ్ థాకరే, స్టాలిన్, ఇంకా మరి కొందరు కీలక నేతలు కూడా  ఈ సమావేశంలో  పాల్గొన్నారు.అందరి లక్ష్యం ఒక్కటే, మోడీని ఓడించడమే కావాలని తీర్మానించారు.   అయితే, ఓవంక విపక్షాల ఐక్యతా ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనే, కూటమి నాయకత్వం కోసం, తృణమూల్ కాంగ్రెస్’ తో  పోటీ పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులు తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఒకరొకరు, పార్టీకి గుడ్ బై చెప్పి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం క్రితం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అంతకు కొద్దిరోజుల ముందు  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా కాంగ్రెస్’ను వదిలి మమతా దీదీ గూటికి చేరారు.తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,  త్రిపుర పీసీసీ అధ్యక్షుడు పీజూష్ కాంతి బిస్వాస్, పీసీసీ అధ్యక్ష పదవికి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన అదే ట్వీట్ ’లో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో సుస్మితా దేవ్’కు సన్నిహితంగా ఉండే పీజూష్, కూడా ఆమె బాటలోనే తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరతారని స్థానిక మీడియాలో వర్గాలు పేర్కొంటున్నాయి. పీజూష్ పార్టీని వదిలి పోవడంతో, ఈశాన్య రాష్టాలలో అసలే అంతంత మాత్రంగా ఉన్న హస్తం పార్టీ మరింతగా కుదేలవుతుందని, విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితం అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవ సారి ఓడి పోయింది. అలాగే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, లెఫ్ట్ ఫ్రంట్ ‘తో జట్టు కట్టినా ఫలితం లేక పోయింది. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమికి కనీసం ఒక్క సీటు  కూడా రాలేదు. నిజానికి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కూడా,ఈశాన్య రాష్ట్రాలలో కమల దళానికి ఉనికే లేదు.కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్, తృణమూల్  పార్టీలదే పై చేయిగా ఉంది. అయితే, కాంగ్రెస్ ను ఓడించి అస్సాంలో, సీపీఎం గద్దె దించి త్రిపురలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మెల్లమెల్లగా ఈశాన్య బారత దేశంలో గట్టిగానే జెండా పాటింది. అస్సాం, త్రిపురతో సహా వచ్చే సంవత్సరం (2022) ఎన్నికలు జరిగే మణిపూర్’లోనూ ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. మరో వంక, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉనికిని కోల్పోయిన్ నేపధ్యంలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి ప్రత్యాన్మాయ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ దూసుకోస్తోంది. అందుకే కాంగ్రెస్ నాయకులు ఒకరొకరు తృణమూల్ గూటికి చేరుతున్నారని రాజేకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులూ క్యూ కట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జాతీయ స్థాయిలో జరుగతున్న విపక్షాల ఐక్యతా యత్నాలఫై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది, ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీలో టీడీపీదే అధికారం.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై తేల్చేసిన మ‌రో సర్వే..

2019లో ఏపీలో వార్ వ‌న్‌సైడ్‌. టీడీపీకి దిమ్మ‌తిరిగేలా 151 స్థానాల‌తో ఘ‌న విజ‌యం సాధించింది వైసీపీ. ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జ‌గ‌న‌న్న‌ను న‌మ్మి జ‌నం గెలిపించారు. ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. కొత్త మురిపం పోయింది. మ‌రి, జ‌గ‌న‌న్న‌కు సెకండ్ ఛాన్స్ ఇస్తారా? జ‌గ‌న్ పాల‌న‌పై జ‌నం సంతృప్తిగా ఉన్నారా? మ‌రోసారి గెలిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇలా ఆస‌క్తిక‌ర స‌ర్వే ఒక‌టి జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన ఇండియా టుడే-- మూడ్ ఆఫ్ ది నేష‌న్ పోల్‌లో సీఎం జ‌గ‌న్ ర్యాంక్ 11కి ప‌డిపోగా.. కేవ‌లం 6 అంటే 6 శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అన్నారంటే ఆయ‌న గ్రాఫ్ ఏ రేంజ్‌లో ప‌త‌న‌మైందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ క‌ల‌వ‌రింత నుంచి కోలుకోక‌ముందే.. లోక‌ల్ యాప్ స‌ర్వే మ‌రింత షాకింగ్ రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించింది. ఆ స‌ర్వేలో జ‌గ‌న‌న్న గెలుపు అంచున వేలాడి.. ఓట‌మి వైపు జారిపోయారు. వైసీపీతో టీడీపీ హోరాహోరీ పోరాడి.. ఒక్క‌టంటే ఒక్క శాతం ఓటింగ్‌తో విజ‌యం కైవ‌సం చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆనాడు జ‌గ‌న్ ఒక్క ఛాన్స్‌తో గ‌ట్టెక్కితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవుతార‌ని లోక‌ల్ స‌ర్వే తేల్చి చెప్పింది.  రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు టీడీపీకే ఎక్కువ ఓట్లు వేశారు ఏపీ జనాలు. టీడీపీ అధికారంలోకి వస్తుందని 44 శాతం మంది చెప్పగా..  వైసీపీ అధికారంలోకి వస్తుందని 43 శాతం మంది భావించారు లోక‌ల్ యాప్ యూజ‌ర్లు. ఇక‌, బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తుందని 13.05 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 51 శాతానికి పైగా ఓట్లు రాగా టీడీపీ 37 శాతం ఓట్లు వచ్చాయి. అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి 14 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అయితే రెండేళ్లలోనే సీన్ మారిపోయింది. 14 శాతం ఓట్లతో వెనకబడిన టీడీపీకి.. తాజా సర్వేలో లీడ్ రావడం షాకింగ్ గా మారింది. రానున్న రోజుల్లో వైసీపీ ఓట్ల శాతం  మరింతగా తగ్గవచ్చని సర్వే నిర్వహించిన ప్రతినిధులు అంచనా వేశారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నది లోకల్ యాప్ సర్వే ద్వారా స్పష్టమవుతోంది. ఇటీవ‌లి ఇండియా టుడే స‌ర్వేలో సైతం కేవ‌లం 6శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అని చెప్ప‌డం.. ప్ర‌జ‌ల్లో దారుణంగా ప‌డిపోయిన జ‌గ‌న్ ప‌ర‌ప‌తికి నిద‌ర్శ‌నం.  ఏపీలో ఏ ఒక్క‌రిని క‌దిలించినా అప్పుల‌పైనే చ‌ర్చ‌. మ‌ద్య‌పాన నిషేధం ఏమైంద‌ని ప్ర‌శ్న‌. ఉచిత ఇసుక ఎక్క‌డికి పోయిందంటూ నిల‌దీత‌. క‌రోనా క‌ట్ట‌డిలో ఎందుకు విఫ‌ల‌మ‌య్యార‌ని మండిపాటు. ఒక‌టో తారీఖు జీతాలు ఏవంటూ ఉద్యోగుల క‌డుపుమంట‌. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ఆల‌యాలు, ద‌ళితులు, మ‌హిళ‌ల‌పై దాడులేంటంటూ ఆగ్ర‌హం. తిట్లు, కేసులు, అరెస్టుల‌పై అస‌హ్యం. కొవిడ్ టైమ్‌లో ప‌రీక్ష‌లు, పాఠ‌శాల‌లపై ఆక్రోషం. ఇలా, సీఎం జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌పై ఏ ఒక్క వ‌ర్గం కూడా సంతృప్తిగా లేద‌రే విష‌యం ఇండియా టుడే, లోక‌ల్ యాప్ స‌ర్వేల‌తో తేలిపోయింది. వ‌చ్చే అసెంబ్లీలో జ‌గ‌న్‌కు గ‌ట్టి బుద్ధి చెప్ప‌నున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఒక్క ఛాన్స్ అంటే అమ‌రావ‌తిని న‌ట్టేట ముంచి.. ప్ర‌జ‌ల‌ను ఆగ‌మాగం చేస్తున్న జ‌గ‌న్ పాల‌న‌పై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ వ్య‌తిరేక‌తే ఇలా స‌ర్వేల రూపంలో బ‌య‌టికొస్తోంది.  అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు పాల‌న‌ను, జ‌గ‌న్ ఆగ‌డాల‌ను పోల్చి చూసుకుంటున్నారు ప్ర‌జ‌లు. చంద్ర‌బాబు హ‌యాంలో అంత‌ర్జాతీయ కంపెనీలు ఏపీకి క్యూ క‌డితే.. జ‌గ‌న్ ఏలుబ‌డిలో కొత్త ప‌రిశ్ర‌మ‌లు కాదుక‌దా, ఉన్న ప‌రిశ్ర‌మ‌లే పారిపోయే ప‌రిస్థితి దాపురించింద‌ని మండిప‌డుతున్నారు. జాబ్ లెస్ క్యాలెండ‌ర్‌పైనా నిరుద్యోగులు క‌డుపుమంట‌తో ర‌గిలిపోతున్నారు. సంక్షేమం పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని సంక్షోభంలోకి నెట్టేసిన జ‌గ‌న్ పాల‌న‌పై పెద‌వి విరుస్తున్నారు. అందుకే, మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తే.. టీడీపీకే ఓటు వేస్తామ‌ని.. చంద్ర‌బాబునే సీఎం చేస్తామ‌ని.. స‌ర్వేల్లో తేల్చి చెబుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు. జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ మాత్ర‌మే ఇచ్చామ‌ని.. మ‌రో ఛాన్స్ ఇచ్చే స‌మ‌స్యే లేద‌ని స‌ర్వేలతో స్ప‌ష్టం చేస్తున్నారు. ఇండియా టుడే.. లోక‌ల్ యాప్‌.. వ‌రుస‌ స‌ర్వేల‌ ఫ‌లితాలు టీడీపీలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. తెలుగు త‌మ్ముళ్ల‌లో స‌రికొత్త‌ జోష్ క‌న‌బ‌డుతోంది. అదే స‌మ‌యంలో వైసీపీలో ఆందోళ‌న‌, తాడేప‌ల్లి ప్యాలెస్‌లో క‌ల‌క‌లం చెల‌రేగుతోంది.

కొంప ముంచిన బుల్లెట్ సాంగ్.. ఉద్యోగం ఊస్టింగ్? 

బుల్లెట్ బండెక్కి వచ్చేస్తప.. అందాల దునియానే చూపిస్తపా..  ఈ సాంగ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మంచిర్యాలకు చెందిన పెళ్లికూతూరు చేసిన ఈ డ్యాన్స్ వైరల్ గా మారింది. మంచిర్యాల జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి అనే నవవధువు పెళ్లి అనంతరం భర్తను సర్‌ప్రైజ్ చేసేందుకు బరాత్‌లో ‘బుల్లెట్టు బండి’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారడం.. సాయి దంపతులకు ఫుల్‌ క్రేజ్‌ రావడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. ఇంతటి క్రేజ్‌ సొంతం చేసుకున్న ‘బుల్లెట్టు బండి’ పాట ఇప్పుడు మరొకరి కొంప ముంచింది. ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పి హెచ్ సి లో బుల్లెట్ బండి పాట పై ఆస్పత్రి ప్రాంగణం లో ఓ నర్సు నృత్యం చేసింది. నవ వధులు చేసినట్లుగానే పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసింది. హాస్పిటల్ లోని మిగితా సిబ్బంది అంతా కూర్చుని ఉండగా.. వాళ్ల మధ్యలో నర్సు బుల్లెట్ బండి సాంగ్ కు స్టెప్పులు వేసింది. ఆమె డ్యాన్స్ చేస్తుండగా మిగితా సిబ్బంది అంతా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. నర్సు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీలోనే నర్సు నృత్యాలు చేయడం వివాదంగా మారింది నర్సు డాన్స్ కు నెటిజన్లు ప్రశంసలు ఇవ్వగా.. మరికొందరు ఆస్పత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శలు చేశారు. దీంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్  సీరియస్ గా స్పందించారు. విచారణకు ఆదేశించారు.కలెక్టర్ ఆదేశాలతో డ్యాన్సు చేసిన నర్సుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేశారు. ఆస్పత్రికి వెళ్లి ఆయన విచారణ జరిపారు. విచారణ తర్వాత చర్యలు ఉంటాయని తెలిపారు. దీంతో ఆ నర్సు కొలువుకు గండం వచ్చిందనే అనుకుంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాను షేక్ చేసిన బుల్లెడ్ బండి సాంగ్ క్రేజీ ఓ ఉద్యోగి పొట్ట కొట్టేదిగా మారిందనే చర్చ సాగుతోంది. 

5 లక్షలు కాదు కోటి రూపాయలు ఇవ్వాలి! వివేకా కేసులో జగన్ కు రఘురామ ట్విస్ట్.. 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా దూకుడు పెంచిన సీబీఐ అధికారులు.. అనుమానితులందరిని ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను పలుమార్లు ప్రశ్నించారు.  తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ప్రకటన చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చేసిన ప్రకటనపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో సీబీఐ ప్రకటన ఇచ్చిందని, నిజాలు తెలిపిన వారికి రూ.5 లక్షలు అంటున్నారని చెప్పారు, ఆ లెక్కన సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి సీఎం జగన్ కోటి రూపాయల బహుమానం ఇవ్వాలని అన్నారు. "ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే వెంటనే పట్టుకుంటున్నారు. మరి వివేకా హత్యకేసులో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు?" అని రఘురామ ప్రశ్నించారు. ఈ కేసులో ఉన్న శ్రీనివాసరెడ్డి గతంలోనే హత్యకు గురయ్యాడని వెల్లడించారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని తెలిపారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నట్టు రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరుతూ సీబీఐ  శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు  డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

జగన్ బాటలో కేసీఆర్.. మద్యం తాగించి ఖజానా నింపేలా స్కెచ్..

ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కొన్ని విషయాల్లో  విబేధాలుంటే ఉండవచ్చును, కానీ, ఆ ఇద్దరి మధ్య చాలా విషయాల్లో సారూప్యాలున్నాయి. కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ రెడ్డి ఫాలో అయితే మరికొన్ని విషయాల్లో జగన్ రెడ్డిని కేసీఅర్ ఫాలో అవుతారు. ఇప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మద్యం ఆదాయం పెంచుకునే విషయంలో ఏపీ సీఎంతో  పోటీకి సిద్ధమవుతున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వం మద్యం విధానాన్ని సమూలంగా మార్చేసింది. ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగిపోయింది. ముఖ్యమంత్రి  రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. ఓ వంక అంచెలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెపుతున్న ప్రభుత్వం, మద్యం మీద వచ్చే ఆదాయంపై అప్పులు తెచ్చుకుంకుంటోంది. అంటే అప్పులు తీరాలంటే జనం చచ్చినట్లు తాగి తీరాలనే విధంగా వ్యవహరిస్తోంది. మరో వంక  ఈ అప్పులు తీరటానికి మరో 25ఏ ళ్ళు పడుతుందని అంటున్నారు. అంటే 25ఏళ్ల వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ఆయన చేసిన అప్పు ఉంటుంది. అలాగే, సంపూర్ణ మద్యం పాలసీ కొనసాగుతుంది.  తెలంగాణ ప్రభుత్వం జగన్ రెడ్డి అంత దుస్సాహసం అయితే చేయడంలేదు కానీ, ప్రజల సంక్షేమం కోసం, లిక్కర్ ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేదుకు, రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తోందని ఆబ్కారీ మాటగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటుకు, మంచి గిరాకీ ఉన్న ప్రాంతాలను గుర్తుంచాలని అబ్కారీ శాఖను ఆదేశించింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మండలాలలో ప్రతి కొత్త మండలంలో కనీసం ఒకటి వంతున, వీలైతే రెండు, మూడు షాపులను ఏర్పాటు చేయాలని, మొత్తంగా కనీసం 150 షాపులు అయినా కొత్తగా తెరిచేలా జాబితా తయారు చేయాలని, అబ్కారీ శాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.  ప్రస్తుతం, తెలంగాణ రాష్ట్రంలో 2,216 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల లైసెన్స్ గడువు, అక్టోబర్‌‌‌‌ 31తో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో నూతన పాలసీ తీసుకు రావాలని రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, షాపుల సంఖ్యను, అదే చేత్తో లైసెన్స్ ఫీజును పెంచే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త షాపులకు వేలం పాట ద్వారా లైసెన్స్ మంజూరు చేస్తారు. తద్వారా ప్రభుత్వాని మాంచి కిక్కిచ్చే రేంజిలో ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో 459 మండలాలున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్తగా 133 మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో  మొత్తం మండలాల సంఖ్య 592కు చేరింది. కొత్తగా ఏర్పడిన మండలాల ప్రజలకు మందు అందుబాటులో లేదనే మాట రాకుండా ప్రభుత్వం ఇటీవల కొత్తగా 159 బార్లకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది . ఇప్పుడు అదే  క్రమంలో  మద్యం షాపుల విషయంలోనూ జనం ఇబ్బందులు పడకూడని షాపుల సంక్ష్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వైన్  షాపుల లైసెన్స్‌‌‌‌ ఫీజుతోనే ప్రభుత్వానికి  976 కోట్ల రూపాయల  ఆదాయం వచ్చింది. ఇక ఇప్పుడు కొత్తగా 150 మద్యం  షాపులకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు అప్లికేషను, లైసెన్స్‌‌‌‌ ఫీజు సవరణలతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, అధికారులు అంటున్నారు.  మద్యం అమ్మకాల్లో ఉత్పత్తి, విక్రయదారులకు కలిపి 40 శాతం పోగా మిగిలిన 60 శాతం వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ కింద రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఆవిధంగా ఒక్కజూలై నెలలో ప్రభుత్వ ఖజానాకు చేరిన మద్యం ఆదాయం, ఇంచుమించుగా రూ 1,600 కోట్లకుపైగా ఉంటుందని అధికార లెక్కలు సూచిస్తున్నాయి. ఇక ముందు, అది ఎన్నివేల కోట్లకు చేరుతుందో, ఏమో ..సంక్షేమ పథకాలు కావాలంటే, తప్పదు మరి. ఒకటి కావాలంటే ఒకటి వాడుకోక తప్పదు..

కొండాకే టికెట్ క‌న్ఫామ్‌.. కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఖాయం?

హుజురాబాద్ పోరులో కాంగ్రెస్‌కు కొండంత బ‌లం వ‌చ్చింది. పోటీకి కొండా సురేఖ పేరు దాదాపు క‌న్ఫామ్ అయింది. నేడోరేపో అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది. దామోద‌ర రాజ‌న‌ర్సింహ నేతృత్వంలోని క‌మిటీ కొండా పేరును అధిష్టానానికి పంపించింది. అక్క‌డ గ్రీన్‌సిగ్న‌ల్ ప‌డిన‌ట్టే తెలుస్తోంది. ఇక హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కొండా సురేఖ‌ పేరు వెల్ల‌డించ‌డ‌మే త‌రువాయి. అదే జ‌రిగితే.. ఇటు టీఆర్ఎస్‌.. అటు బీజేపీకి.. ద‌బిడి దిబిడే. హుజురాబాద్ పోరులో ఇప్పుడు కాంగ్రెస్‌కే అధిక ఆధిక్యం క‌నిపిస్తోంది. హుజురాబాద్ టీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. కొంద‌రు కారులోనే ఉండిపోగా.. మ‌రికొంద‌రు ఈట‌ల వెంట బీజేపీలో చేరిపోయారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అంతే బ‌లంగా ఉంది. కౌశిక్‌రెడ్డి వెంట వెళ్లింది అతి త‌క్కువ మందే. కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఇప్ప‌టికీ అంతే ప‌దిలంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో హ‌స్తం గుర్తుకు 60వేల‌కు పైగా ఓట్లు ప‌డ్డాయి. ఈట‌ల‌కు ల‌క్ష పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. ఆ లెక్క‌న‌.. ఈట‌ల‌కు వ‌చ్చిన ఆ ల‌క్ష ఓట్లనే ఇప్పుడు టీఆర్ఎస్‌, బీజేపీ పంచుకోవాల్సి ఉంటుంది. అంటే.. గ‌త ఓట్ల శాతం ప్ర‌కారం హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌-బీజేపీ-కాంగ్రెస్‌.. మూడు పార్టీల‌కు సుమారు 50వేల ఓట్లు చొప్పున‌ దాదాపు స‌మాన బ‌లం ఉన్న‌ట్టు తెలుతోంది. ఇప్పుడు హుజురాబాద్ బైపోల్‌లో ఆ ఓట్ల త‌రాజు ఏ పార్టీ వైపు మొగ్గుతుందో వారిదో విజ‌యం.  కాంగ్రెస్ రేసులోకి రావ‌డంతో.. ఇప్పుడు పార్టీల కంటే అభ్య‌ర్థులే కీల‌కంగా మారారు. మూడు పార్టీల నుంచి ముగ్గురు హేమాహేమీలు రంగంలో ఉన్నారు. ముగ్గురిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థే కాస్త బ‌ల‌హీనం. గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు విద్యార్థి నాయ‌కుడిగా మంచి ఇమేజ్ ఉన్నా.. హుజురాబాద్‌లో ఆయ‌న వెనుక ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేని దుస్థితి. గెల్లు బ‌రిలో ఉన్నా.. కేసీఆరే పోటీలో ఉన్న‌ట్టు ప్ర‌చారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కారు గుర్తును చూసి ఓటు వేయ‌మంటూ వేడుకుంటోంది. అటు, ఈట‌ల‌+బీజేపీ మాత్రం మాంచి జోరు మీదుంది. ఆ జోరుకు ద‌ళిత బంధుతో బ్రేకులు వేయాల‌నేది కేసీఆర్ ఎత్తుగ‌డ‌. అయితే, అది ఆయ‌న‌కే బూమ‌రాంగ్‌గా మారి మిగ‌తా వ‌ర్గాల‌ను దూరం చేసే ప్ర‌మాదం ఏర్ప‌డింది. హుజురాబాద్‌లో ఇంత రాజ‌కీయ డ్రామా న‌డుస్తుండ‌గా.. కాంగ్రెస్‌+రేవంత్‌రెడ్డి+కొండా టీమ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో పొలిటిక‌ల్ ఈక్వేష‌న్స్ అమాంతం మారిపోతున్నాయి.  హుజురాబాద్‌లో బ‌ల‌మైన ఓటు బ్యాంకున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి అంద‌రికీ షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇమేజ్ ఆ పార్టీకి బాగా అడ్వాంటేజ్‌. రేవంత్‌రెడ్డిని చూసి ఓట్లేసే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇక‌, తాజాగా హ‌స్తం పార్టీ అభ్య‌ర్థిగా కొండా సురేఖ పేరు ఖ‌రారు కావ‌డం.. కాంగ్రెస్‌కు మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్టైంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో కొండా దంప‌తులు ఫుల్‌స్ట్రాంగ్‌. ఎవ‌రిని ఎలా డీల్ చేయాలో.. కొండా ముర‌ళీకి తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలీద‌నే టాక్ ఉంది. న‌యానో, భ‌యానో.. అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో కొండా ముర‌ళీ త‌ర్వాతే ఎవ‌రైనా అని అంటారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల్లో కొండా ఆధిప‌త్యం ఉంది. ఇటు రేవంత్‌రెడ్డి ఇమేజ్‌.. అటు కొండా ప‌వ‌ర్ తోడైతే.. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు కొండంత బ‌లం ప‌క్కా.  ఇక‌, కొండా సురేఖ అభ్య‌ర్థిత్వంతో సోష‌ల్ ఇంజ‌నీరింగ్ సైతం అద్భుతంగా ప‌ని చేస్తుంద‌ని అంటున్నారు. హుజురాబాద్‌లో బీసీల సంఖ్యే అధికం. కొండా సురేఖ ప‌ద్మ‌శాలి.. కొండా ముర‌ళీ మున్నూరుకాపు.. ఆ రెండు వ‌ర్గాల ఓట్లు 70వేలకు పైనే ఉన్నాయి. ఆ సంఖ్య ద‌ళిత ఓటు బ్యాంకుకంటే ఎక్కువే. అందుకే ద‌ళిత‌బంధుతో అసూయ‌గా ఉన్న బీసీ వ‌ర్గాలు టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవ‌కాశం లేక‌పోలేదంటున్నారు. ఈట‌ల‌కు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా ప్ర‌య‌త్నిస్తుండ‌టం.. కారు పార్టీని దెబ్బ‌కొట్టేలా బీజేపీ+ఈట‌ల కాలు దువ్వుతుండ‌టం.. పిల్లి పోరు పిల్లి పోరు మ‌ధ్య‌లో న‌క్క లాభ‌ప‌డిన‌ట్టు.. హుజురాబాద్ గెలుపును కాంగ్రెస్ ఎగ‌రేసుకుపోయినా ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేదంటున్నారు. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డితో హ‌స్తం శ్రేణులు ఉత్సాహంగా ఉండగా.. ఇప్పుడిక కొండా సురేఖ అభ్య‌ర్థిత్వంతో కాంగ్రెస్ జోష్ రెట్టింపు అవుతోంది. ఇక కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని రెండేళ్లుగా ర‌గిలిపోతున్న కొండా దంప‌తులు ఈ ఎన్నిక‌ల్లో త‌మ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డి పోరాడ‌టం ఖాయం. కొండాకు రేవంత్‌రెడ్డి అండాదండా తోడై.. టీఆర్ఎస్‌, బీజేపీల‌కు చుక్కులు చూపించ‌డం కూడా ఖాయం..అంటున్నారు. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కారు గ‌ల్లంతేనా? టీఆర్ఎస్ మూడోస్థానానికే ప‌రిమిత‌మా?

ఇండియా టుడే స‌ర్వేలో సీఎం కేసీఆర్ ర్యాంక్ ఎంత‌? ట‌క్కున చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎక్క‌డో చివ‌రాఖ‌రికి ప‌డిపోయింది కేసీఆర్ ప‌ర‌ప‌తి. అది జాతీయ స‌ర్వే అనుకున్నా.. తాజాగా లోక‌ల్ సంస్థ లోక‌ల్ యాప్ సైతం ఓ స‌ర్వే చేప‌ట్టింది. అందులో మ‌రింత షాకింగ్ రిజ‌ల్ట్స్‌. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ అధికారంలోకి రావ‌డం ప‌క్క‌న‌పెడితే.. క‌నీసం సెకండ్ ప్లేస్‌లో కూడా లేర‌ట‌. ఏకంగా మూడోస్థానానికి ప‌రిమిత‌మ‌యింద‌ట గులాబీ పార్టీ. మ‌రి, ఫ‌స్ట్‌.. సెకండ్ ఎవ‌ర‌నేగా మీ క్వ‌శ్చ‌న్‌. ఇంకెవ‌రు.. వ‌చ్చే ఎల‌క్ష‌న్‌లో కాంగ్రెస్‌దే విజ‌య‌మ‌ని తేల్చింది లోక‌ల్ యాప్ స‌ర్వే. అనూహ్యంగా బీజేపీ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ముచ్చ‌ట్లు మాత్ర‌మే చెప్పే కేసీఆర్‌.. ముచ్చ‌ట‌గా మూడో స్థానంలో వెన‌క‌బ‌డింది కారు పార్టీ. లోక‌ల్ యాప్ లేటెస్ట్‌ స‌ర్వే.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  లోక‌ల్ యాప్ నిర్వ‌హించిన స‌ర్వేలో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపు 40 శాతం మంది ఓటేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని 34 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారు. ఇక అధికార టీఆర్ఎస్‌కు కేవలం 26 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇదే ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. కారు పార్టీకి మూడో స్థానం రావడం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. కొంత‌కాలంగా కేసీఆర్ పాలనపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అప్పుడూ అదే కేసీఆర్‌.. ఇప్పుడూ అదే కేసీఆర్‌.. అప్పుడూ అవే ప‌థ‌కాలు.. ఇప్పుడూ అవే ప‌థ‌కాలు.. అప్పుడూ వాళ్లే ఎమ్మెల్యేలు ఇప్పుడూ వాళ్లే  మంత్రులు.. కేసీఆర్‌లో కానీ, ప్ర‌భుత్వంలో కానీ, కేబినెట్‌లో కానీ.. ఎలాంటి మార్పు లేదు.. కానీ, జనం మారిపోయారు.. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు. చెప్పిందే చెప్పి.. ఇచ్చిన హామీలే ఇచ్చి.. జ‌నాల‌ను ఎంతో కాలం మ‌భ్య‌పెట్ట‌లేరు. క‌రెంటు, కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ప్ర‌తీసారీ ఓట్లు ప‌డ‌వు. జ‌నం ఇంకా ఏదో కోరుకుంటున్నారు. త‌మ గోడు వినే నాయ‌కుడికి కోసం ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్నారు. గ‌జ్వేల్‌, సిరిసిల్లా, సిద్ధిపేట‌ల‌కే కాదు.. త‌మ‌కూ డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కావాల‌ని నిల‌దీస్తున్నారు. కొత్త పింఛ‌న్లు, కొత్త రేష‌న్‌కార్డుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇలా జ‌నం కోరిక‌లు వేరు.. కేసీఆర్ ఆశ చూపిస్తున్న‌ది వేరు.. ద‌ళిత బంధుతో కుటుంబానికి 10 ల‌క్ష‌లు పంచుతున్నా.. ద‌ళిత ముఖ్య‌మంత్రి, మూడెక‌రాల గాయం ఇంకా మాన‌నేలేదు. ద‌ళితబంధును చూసి.. గిరిజ‌ర‌, బీసీ, మైనార్టీ బంధుల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ ప్ర‌భావం కేసీఆర్‌పై ఆక్రోషంగా మారుతోంది. అందుకే, పులిమీద స్వారీ చేస్తూ.. ఆ పులికే బ‌ల‌య్యేలా ఉంది టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప‌రిస్థితి.  ఇన్నాళ్లూ కేసీఆర్‌కు స‌రైన అల్ట‌ర్‌నేట్ లేకుండే. ఇప్పుడ‌లా కాదు.. రేవంత్‌రెడ్డి రూపంలో జ‌నానికో స‌మ‌ర్థుడైన‌ నాయ‌కుడు దొరికాడు. ప్ర‌జ‌ల్లో రేవంత్ క్రేజ్ ఎలా ఉందంటే.. భారీ వ‌ర్షంలోనూ క‌ద‌ల‌కుండా రేవంత్ ప్ర‌సంగాన్ని ఆస‌క్తిగా వినేంత అభిమానం ఆయ‌న‌పై. అందుకే, రేవంత్ స‌భ పెడితే.. ల‌క్ష‌కు త‌గ్గ‌ట్లేదు జ‌నం. కాంగ్రెస్‌లో మున‌ప‌టి ఉత్తేజం.. కేడ‌ర్‌లో రెట్టించిన ఉత్సాహం.. లోక‌ల్ స‌ర్వేలోనూ అదే స్ప‌ష్ట‌మైంది. కాంగ్రెస్‌కే  విజ‌యావ‌కాశాల‌ని తేల్చేసింది.  కాంగ్రెస్ కాక‌పోతే బీజేపీ. టీఆర్ఎస్ మాత్రం వ‌ద్దే వ‌ద్దు.  అన్న‌ట్టు ఉంది ప‌రిస్థితి. బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో క‌మ‌ల‌ద‌ళం దూసుకుపోతోంది. కిష‌న్‌రెడ్డి కేంద్ర‌మంత్రి అయ్యాక కేడ‌ర్‌లో జోష్ పెరిగింది.  దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీలో క‌మ‌ల ప్ర‌భంజ‌నం క‌నిపించింది. ఈట‌ల రాజేంద‌ర్  చేరిక‌తో ఉరిమే ఉత్సాహం నెల‌కొంది. ఇలా కేసీఆర్‌కు అల్ట‌ర్‌నేట్‌గా కాంగ్రెస్‌నో, బీజేపీనో ఎంచుకుంటున్నారు ప్ర‌జ‌లు. అంతేగానీ, గులాబీ పాల‌న త‌మ‌కు వ‌ద్దంటూ స‌ర్వేల్లో తేల్చిచెబుతున్నారు. అందుకే, లోక‌ల్ యాప్ స‌ర్వేలో కారు పార్టీ ఏకంగా మూడోస్థానానికి ప‌డిపోవ‌డం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది.   

షరియా చట్టం అంత భయంకరమా? ఆప్ఘన్లపై ఇక అరాచకలేనా? 

ఒక్క ఆఫ్ఘనిస్థాన్ ప్రజలనే కాదు, ప్రపంచ దేశాలను కూడా తాలిబాన్లు ఎంతగా ఆందోళనకు  గురిచేస్తోందో చూస్తూనే ఉన్నాం. నిజమే, ప్రపంచాన్ని భయపెడుతోంది, తాలిబాన్లు, వారి అరాచక కృత్యాలే అయినా, తాలిబాన్లను నడిపిస్తోంది, శాసిస్తోంది మాత్రం షరియా చట్టం. తాలిబాన్లు ఎంతగా శాంతివచనాలు వల్లించిన, ఆఫ్ఘన్ ప్రజలు ముఖ్యంగా మహిళలు వారి పేరు వింటేనే గజగజ వణికి పోతున్నారంటే, అందుకూ కారణం కూడా, తాలిబాన్లు కాదు, వారు అమలు చేసే షరియా చట్టమే. అందుకే ఆఫ్ఘన్ మహిళలను షరియా చట్టం చావును మించిన భయానికి గురిచేస్తోంది. తాలిబాన్లు ఓ వంక ఆఫ్ఘన్ మహిళలకు పనిచేసే హక్కు, ఓ  స్థాయి వరకు విద్యా చదువుకునే హక్కు ఉంటుందని అంటూనే, మహిళల హక్కులకు. స్వేచ్చకు కూడా  షరియా చట్టం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ఈ షరియా అనే పదం చెవిన పడగానే, 20 ఏళ్ల క్రితం నాటి  భయానక అనుభవాలను గుర్తు తెచ్చుకుని మహిళలు భయంతో వణికి పోతున్నారు.  అయితే, ఆఫ్ఘన్ ప్రజలను మరీ ముఖ్యంగా మహిళలను ఇంతలా భయానికి గురిచేస్తున్న షరియా చట్టం, అంటే ఏంటి? మన దేశంలోనూ కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదనను వ్యతిరేకించే లౌకిక వాదులు సమర్ధించే షరియా చట్టం ఏమి చెపుతోంది, అసలేంటి ?  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా షరియా చట్టం అంటే ఏమిటని చూస్తే, ఇది ఇస్లామిక్‌ న్యాయ వ్యవస్థ. ఇందులో ముస్లిం పవిత్ర గంథ్రమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు చేసిన ఫత్వాల ఆధారంగా దీన్ని రూపొందించారు. ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరూ, ఈ చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలనేది చట్టం సారాంశం. నిజంగా షరియా అంతటి దుర్మార్గ చట్టమా, ముస్లింలు అందరూ ఆచరించి తీరవలసిన చట్టమా, అంటే అవునని,కాదనే రెండు వాదనలు ఉన్నాయి. షరియా చట్టంలో అంతా చెడే కాదు, మంచి కూడా ఉందని, ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు సహా ముస్లింలందరూ పాటించాల్సిన జీవన నియమావళిగా షరియా నిర్దేశిస్తుందని, ఇస్లాం మత పెద్దలు చెపుతారు. షరియా దేవుని కోరికల ప్రకారం ముస్లింలు తమ జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా నడిపించాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుందని, ఉత్తమ జీవ మార్గాన్ని చూపుతుందని అంటారు. అయితే తాలుబాన్లు, అనిసరించే షరియాలో మాత్రం మంచి మచ్చుకు అయినా కనిపించదు. తాలిబాన్ల షరియా చీకటి దారుల్లోకి తీసుకుపోతుందని కొందరు వాదిస్తారు. షరియా తాలిబాన్ల వెర్షన్, అందులో శిక్షలే కాదు, శిక్షలను బహిరంగా అమలు చేసే పద్దతి కూడా అంతే అమానుషంగా ఉంటుంది.  తాలిబాన్ షరియా ప్రకారం సంగీతం వింటే తప్పు, వీడియోలు చూస్తే పాపం, రోజు ఐదు సార్లు నమాజు చేయక పొతే నేరం, పురుషులు గడ్డం మీద కత్తి పడితే, ఏకంగా పీకే తెగిపోతుంది. మహిళలైతే బుర్జా, హిజాబ్‌ వంటి దుస్తులు ధరించాలి. వీరు ఈ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే, చిన్నా పెద్ద తేడా లేకుండా బహిరంగంగా కాల్చి/కొట్టి  చంపుతారు. అందుకే ఆఫ్ఘన్ మహిళలు షరియా అంటే చావు కేక విన్నతగా భయపడుతున్నారు.   మరోవైపు పైకి శాంతి వచనాలు పలుకుతున్న తాలిబాన్లు, ఇప్పటికే మహిళల పట్ల తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబూల్‌లోని పలు వ్యాపార సముదాయాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీల్లో మహిళల చిత్రాలను తాలిబన్లు చింపేశారు. మహిళల బొమ్మలు, విగ్రహాలను ధ్వంసం చేశారు. మహిళలు ఉన్న పోస్టర్లపై నల్లటి సిరాను పూశారు. మరికొన్ని కనిపించకుండా పరదాలు కప్పారు. దేశీయ టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లలో మహిళలు పనిచేయకూడదని నిషేధం విధించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ స్త్రీ అయినా బురఖా ధరించాల్సి ఉంటుంది. వారు తమ ఇంటిని విడిచి వెళ్లాలనుకుంటే మగ బంధువుతో పాటుగా తీసుకురావాలి.స్త్రీ అడుగుజాడలను ఏ పురుషుడు వినకూడదు కాబట్టి మహిళలకు హైహీల్డ్ బూట్లు అనుమతించారు. బహిరంగంగా బిగ్గరగా మాట్లాడేటప్పుడు ఒక మహిళ వాయిస్ అపరిచితుడికి వినిపించకూడదు.  వార్తాపత్రికలు, పుస్తకాలు, దుకాణాలు లేదా ఇంటిలో ఆడవారి ఫోటోలు తీయడం, చిత్రీకరించడం లేదా ప్రదర్శించడం అనుమతించరు. మహిళలు తమ బాల్కనీలలో కనిపించడానికి అనుమతించరు.ఇలా అడుగడుగునా ఆంక్షలు, గీతదాటితే, షరియా చట్ట పరిధిలో అమానుష శిక్షలు ..షరియా చట్టం ప్రకారం నేరాలను హద్ నేరాలు (కఠినమైన శిక్షలుండే తీవ్రమైన నేరాలు) , తాజిర్ నేరాలు  (న్యాయాధిపతి నిర్ణయం మేరకు విధించే శిక్ష) రెండు రకాలుగా వర్గీకరిస్తుంది. దొంగతనం, వ్యభిచారం హద్ నేరాల జాబితాలోకి వస్తాయి. దీనికి చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలుంటాయని చెబుతారు.ఇవనే కాదు, నేరం ఏదైనా శిక్షలు మాత్రం ఆలాగే, ఉంటాయి. అందుకే తాలిబాన్లు అన్నా, వారు  అమలు  చేసే షరియా అన్నా ఆఫ్ఘన్ మహిళలు భయంతో వణికిపోతున్నారు.

అవంతి, అంబ‌టివి రాస‌లీల‌లేనా? మిమిక్రీ కుట్ర‌లా? ఏది నిజం?

ట్రింగ్‌..ట్రింగ్‌.. వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది. ఇటునుంచి కాల్ లిఫ్ట్ చేస్తే.. అటునుంచి మంత్రి గారు వాయిస్ వినిపిస్తుంది. తెలిసిన గొంతే కావ‌డంతో.. చాలా క్యాజువ‌ల్‌గా డిష్క‌స‌న్ సాగుతుంది. బాగున్నావా.. ఎక్క‌డున్నావ్ నుంచి మొద‌లై.. వెంట‌నే అస‌లు మేట‌ర్‌లోకి వ‌చ్చేస్తారు మినిస్ట‌ర్ గారు. క‌ట్ చేస్తే.. మంత్రి గారి ఆడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతుంది. మంత్రి అనే కాదు ఇటీవ‌లే ఎమ్మెల్యే విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ఆ ఇద్ద‌రు వైసీపీ నేత‌లు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్‌గా మారారు. అందులో ఒక‌రు ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అయితే.. మ‌రొక‌రు మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఆడియో వైర‌ల్ కాగానే.. ఇక సినిమాటిక్ స్టైల్‌లో డ్రామా మొద‌లైపోతుంది. త‌న వాయిస్ త‌న‌ది కాద‌ని.. ఎవ‌రో మిమిక్రీ చేశార‌ని.. వారిపై కేసులు పెడుతున్నాన‌ని.. క్వైట్ కామ‌న్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఇందులో మరింత‌ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. త‌న‌పై గిట్ట‌నివారి కుట్ర అంటే.. మంత్రి అవంతి శ్రీనివాస్ విష‌యంలో మాత్రం వైసీపీ వాళ్లే ఇలా ట్రాప్ చేశార‌నే ఆరోప‌ణ వ‌స్తుండ‌టం ఆస‌క్తిక‌రం.  అంబ‌టి రాంబాబు విష‌యంలో ఆడియోకు సంబంధించిన వీడియో లీక్ అయింది. కాల్ రికార్డ్ చేయ‌కుండా వాట్సాప్ కాల్ చేసిన‌ట్టున్నారు. ఆ వాట్సాప్‌ కాల్ స్పీక‌ర్ ఆన్ చేసి.. వేరే మొబైల్‌తో కాల్ మొత్తం రికార్డు చేశారు. అందులో అంబ‌టి వాయిస్‌.. ఆ మ‌హిళ‌ను మ‌సాజ్‌కు ర‌మ్మ‌న‌టం.. ఆమె వేరే అమ్మాయిని పంపిస్తానన‌టం.. బాగుంటుందా.. అన్నీ చేస్తుందా.. ఇలా ర‌స‌వ‌త్త‌రంగా న‌డిచింది ఆ సంభాష‌ణ‌. మిమిక్రీనే నిజ‌మైతే.. ఇంత నాచుర‌ల్‌గా భ‌లే చేశారు ఎవ‌రో. మిమిక్రీ కాక‌పోతే.. మ‌నోడు మాంచి క‌ళాకారుడే అన్నట్టు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌న్నారు ఎమ్మెల్యే అంబ‌టి. చేశారో లేదో క్లారిటీ లేదుగానీ.. చేసుంటే వారం గ‌డుస్తున్నా ఇంకా ఆ మిమిక్రీ ఆర్టిస్టును ఎందుకు ప‌ట్టుకోలేక‌పోతున్నారో మ‌రి? ఆ వీడియోలో.. అంబ‌టి ఫోటోతో వాట్సాప్ కాల్ నెంబ‌ర్ చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసుకోవ‌డం పోలీసుల‌కు పెద్ద క‌ష్ట‌మేమీ కాక‌పోవ‌చ్చు. మ‌రి ఇంత ఆల‌స్యం ఎందుకు అవుతుందో.. అంబ‌టికే తెలియాలి అంటున్నారు.  ఇక అంబ‌టి ఎపిసోడ్ జ‌రిగిన వారం వ్య‌వ‌ధిలోనే మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు సైతం అలాంటి ఇష్యూలోనే బ‌య‌ట‌కు రావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. అర‌గంట‌లో పంపించేస్తా.. రా.. అంటూ వాయిస్ ఓ ఉమెన్‌ను ట్రాప్ చేయ‌డం.. ఆమె నేనురానంటూ గ‌తంలో బాగా అల‌వాటు ఉన్న‌ట్టే చొర‌వ‌గా నో చెప్ప‌డం..  చాలా నాచుర‌ల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉందా ఫోన్ సంభాష‌ణ‌. మంత్రి అవంతి చెప్పిన‌ట్టు అది కుట్రే అయితే.. ఆ కుట్ర చేసిన డ‌బ్బింగ్ ఆర్టిస్టులకు అభినందించాల్సిందే అంటున్నారు. అంబ‌టి లానే అవంతి సైతం వెంట‌నే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇదంతా గిట్ట‌నివారి కుట్ర అని తేల్చేశారు. అయితే, అవంతి శ్రీనివాస్‌కు విశాఖ వైసీపీ నేత‌ల‌తో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయ‌ని.. సొంత‌పార్టీలోనే ఎవ‌రో ఈ కుట్ర చేసి ఉంటార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, అవంతి ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. మంత్రి త‌లుచుకుంటే.. ఆ ఆడియో మిమిక్రీ అయితే.. వారిని ప‌ట్టుకోవ‌డం ఎంత సేపు చెప్పండి. నైజీరియా కేటుగాళ్ల‌నే ప‌ట్టుకుంటున్న పోలీసులు.. ఆఫ్ట్రాల్ ఫేక్ కాల్ క్రిమిన‌ల్స్‌ను ప‌ట్టుకోలేరా? ప‌ట్టుకోలేక పోతున్నారంటే..... అది ఫేక్ కాద‌నా...? ఇలా అనేక అనుమానాలు.  గ‌తంలో ఎస్వీబీసీ ఛైర్మ‌న్ పృథ్వీ ఆడియో కూడా ఇలానే వైర‌ల్ అయింది. వెన‌క‌నుంచి ప‌ట్టుకుంటా.. అంటూ తెగ ఫేమ‌స్ అయ్యారు. అప్ప‌ట్లో ఆయ‌న సైతం ఆ వాయిస్ త‌న‌ది కాద‌న్నారు. అయినా, ఆయ‌న ప‌ద‌వి పీకేశారు. ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అలానే జ‌రిగింది. మ‌రి, అంబ‌టి, అవంతిల‌పై కూడా వేటు వేస్తారా? ఇలాంటి మిమిక్రీ వ్య‌వ‌హారాలు ఇలానే కొన‌సాగితే.. అది ఎందాకైనా దారి తీయొచ్చు. ఎంపీ ర‌ఘురామ అన్న‌ట్టు.. ముందుముందు ర‌ఘురామ వాయిస్‌, సీఎం జ‌గ‌న్ వాయిస్‌ను సైతం ఇమిటేట్ చేస్తూ ఇలాంటి ఆడియోలు రావొచ్చు. అందుకే, మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుల వాయిస్‌తో మిమిక్రీ చేస్తూ.. అస‌భ్య వాయిస్ కాల్స్ చేసిన దుర్మార్గుల‌ను వెంట‌నే ప‌ట్టుకొని క‌ఠినంగా శిక్షించాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వ‌మే వారి చేతిలో ఉంది ఓ మిమిక్రీ ఆర్టిస్ట్‌ను ప‌ట్టుకోలేరా? ప‌ట్టుకోలేదంటే.. ఆ ఆడియో వాయిస్‌లు నిజ‌మేనా..? అవంతి, అంబ‌టిలు ఆ టైపేనా..? అనే అనుమానం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు.  ఏపీలో ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. నెల క్రితం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ కేసులో ఇంకా కొందరు నిందుతులు దొరకలేదు. తాజాగా గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై దళిత విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమించలేదనే కోపంతో ఓ కిరాతకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇలా మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతుండగానే.. ఏకంగా మంత్రి, ఎమ్మెల్యేల రాసలీలల ఆడియో, వీడియోలు బయటికి రావడం సంచలనంగా మారింది. ప్రజా ప్రతినిధులు ఇలా ఉంటే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. సీఎం జగన్ అసమర్ధత వల్లే ఆ పార్టీ నేతలు దిగజారిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన నేతలపై దర్యాప్తు జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది.  

గెలుపే లక్ష్యంగా  రేవంత్ సోషల్ ఇంజనీరింగ్.. సక్సెస్ అవుతారా?   

“తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఒంటరిగా దూసుకు పోతారే కానీ, నలుగురినీ కలుపుకు పోరు. అందుకే అయన అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో చిక్కుకు పోతారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు దూరంగా ఉండడానికి కూడా ఈ దూకుడు స్వభావమే కారణం” రేవంత్ పోకడలపై కాంగ్రెస్ వర్గాల్లో వినవస్తున్న తాజా విశ్లేషణ ఇది.  అయితే ఇది నిజమేనా అంటే, కొంతవరకు నిజం. కొంత కాదు. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శించడం నిజం. ఒక విధంగా చూస్తే, ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి దూకుడు అవసరం. రేవంత్ రెడ్డి దూకుడు చూపుతున్నారు కాబట్టే, రాష్ట్ర రాజకీయాల్లో ‘రైట్ ఆఫ్’  స్టేజికి చేరుకున్న  హస్తం పార్టీ మళ్ళీ లేచికూర్చుంది. గుర్తింపు తెచ్చుకుంది. రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు కాబట్టే, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు, ఒక్కటి తగ్గకుండా లక్ష మందిని సమీకరించగలిగారు. అఫ్కోర్స్ జన సమీకరణలో సీతక్క పేరు చెప్పకపోతే అది అన్యాయమే అవుతుంది, అనుకోండి అది వేరే విషయం.కానీ, దండోరా సభ సక్సెస్’కు మొదటి అడుగు ఆయన దూకుడులోనే ఉంది. అంత భారీ సభ నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేని స్థితి నుంచి, సభను సక్సెస్ స్థితికి తీసుకుపోయారంటే , ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా,  అది రేవంత్ వల్లనే సాధ్యమైంది. చివరకు, అధికార పార్టీలోనూ దడ పుట్టించింది.   దండోరా సభ దడ పుట్టించింది కాబట్టే, ముఖ్యమంత్రి కేసీఆర్, హుజూరాబాద్ లో దళితబంధు ప్రారంభ సభకు, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయించారు. రాష్ట్రం నాలుగు మూలల నుంచి ఎమ్మెల్యేలకు కోటా ఫిక్స్ చేసి,ఏసీ బస్సులు పెట్టి, జన సమీకరణ చేశారు. అయినా, ఇంద్రవెల్లి సభ ముందు హుజూరాబాద్ సభ వెలవెల పోయిందనే చెప్పాలి. నిజమే,జనం వచ్చారు, కానీ, ఇంద్రవెల్లిలో కనిపించిన జోష్ హుజూరాబాద్’ లో కనిపించలేదు. అంతే, కాదు హుజూరాబాద్ సభకు వచ్చిన వారు వెళ్ళేటప్పుడు నిరాశగా వేణి దిరిగారు. కొంతమంది అయితే అధికార పార్టీని తిట్టుకుంటూ వెళ్ళడం కూడా కనిపించింది.   సరే అదలా ఉంటే రేవంత్ రెడ్డికి దూకుడే గానీ, ఆలోచన లేదు అనే వాదనలోనూ పస లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఒక పథకం ప్రకారం సోషల్ ఇంగినీరింగ్’ కు శ్రీకారం చుట్టారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం రావిర్యాలలో నిర్వహించిన గర్జన సభలో తమ దూకుడు  ప్రసంగంలోనూ, ఇటీవల ఐపీఎస్ కొలువు వదులుకుని,బీఎస్పీలో చేరిన  ప్రవీణ్ కుమార పేరు తీసుకున్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రవీణ్ కుమార్ మరో ఆరేళ్ల సర్వీస్’తో పాటు  డీజీపీ స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నా, ఉన్న అవకాశాలను వదులుకుని దళితుల మేలు కోసం రాజకీయాలలోకి వచ్చారని అన్నారు. అలాగే, ఉద్యోగంలో కొనసాగుతూ, తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాలు, వివక్షను భరించలేక, దళిత బిడ్డగా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కొలివుకు రాజీనామా చేశారని చెప్పారు.ఇలా ప్రవీణ్ కుమార్’ను ఆకాశానికి ఎత్తేయడం, రేవంత్ రెడ్డి రాజకీయ విజ్ఞత, ముందు చూపుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్;లో బీఎస్పీపీ కలిసి సాగేందుకు, రేవంత్ ముందుగానే కర్చీఫ్ వేశారనీ అంటున్నారు.ఇలా కర్చీఫ్ వేయడం ద్వారా రేవంత్ రెడ్డి, కొత్త సోషల్ ఇంజనీరింగ్’కు శ్రీకారం చుట్టారనిఅనే మాట కూడా వినవస్తోంది.  అలాగే ఇటీవల పీసీసీ, మైనారిటీ సెల్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు కార్యక్రమలో మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి, “కాంగ్రెస్ పార్టీ మీదే, ముస్లిం మైనారిటీలదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే”  అంటూ మైనారిటీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో బీజేపీ ముస్లిం మైనారిటీలను మోసం చేస్తున్నాయని ధ్వజ మెత్తారు.త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని, గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్’ కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, మైనార్టీ బంధు ఇవ్వాలంటూ తెరాస ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. కానీ, తెరాస మిత్ర పక్షం ఎంఐఎం పేరు కూడా ప్రస్తావించలేదు.  ఇలా అటు దళితులను,ఇటు ముస్లిం మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయన వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రేవంత్ దూకుడులోనూ ఒక ఆలోచన, సోషల్ ఇంగినీరింగ్ వ్యూహం  ఉన్నాయని నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంతటి దౌర్భాగ్య స్థితికి చేరటానికి, పార్టీ ప్రధాన ఓటు బ్యాంక్ దళితులు, మైనారిటీలు, అలాగే, బడుగు బలహీన వర్గాలు పార్టీకి దూరం కావడమే అనేది ఒక చారిత్రక సత్యం. రేవంత్ ప్రస్తుత ప్రయత్నాలను జాగ్రత్తగ గమనిస్తే, ఎక్కడ పారేసుకున్నమో అక్కడే వెతుక్కోవాలనే రాజకీయ విజ్ఞతను చూపుతున్నారనిపిస్తుంది. దూరమైనా ఒక్కొక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుని ‘సోషల్ ఇంగినీరింగ్’ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం  భావిస్తున్నారు. అయితే, సోషల్ ఇంగినీరింగ్ ప్రయత్నాలలో అయన సక్సెస్ అవుతారా, అంటే అది వేరే విషయం, వేరే చర్చ అంటున్నారు విశ్లేషకులు. 

వైఎస్ వివేకా హంతకులెవరు? ఆచూకీ చెబితే 5 లక్షల నజరానా..

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. రెండున్నర నెలలుగా కడపలోనే మకాం వేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను విచారిస్తున్న సీబీఐ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది.సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు  డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది. మరోవైపు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు  శుక్రవారం ఒకరిని విచారించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పటికే ఇతడిని పలుమార్లు విచారించారు. శనివారం కూడా మరికొందరిని విచారణకు పిలిచారు.  వైఎస్సార్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సీసీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని మొదటిసారిగా విచారణకు పిలిపించారు. మరోవైపు వైఎస్ వివేకా కుమార్తె సునీత సీబీఐ అధికారుల్ని కలిశారు.. దాదాపు 4 గంటలకుపైగా వారితో భేటీ అయ్యారు. 2019 మార్చి 15 అర్థరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ కేసులో ఏపీ పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేపట్టింది. వివేకా కుమార్తే అభ్యర్థనతో హైకోర్టు ఉత్తర్వులతో ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయింది. 2020 జూన్ 9న ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కరోనా కారణంగా కొన్నాళ్లు ఏపీకి నేరుగా వచ్చి విచారణ చేపట్టలేదు. ఇటీవల ఏపీకి వచ్చి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సునీల్ కుమార్ యాదవ్ అనే పేరు మాత్రమే ఈ కేసులో ప్రముఖంగా వినిపించింది. అతడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం గాలించారు. 

ఓణం పండుగ విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి? 

ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ. మలయళీ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు – సెప్టెంబర్) వస్తుంది. మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రవణా నక్షత్రమును మలయాళమున "తిరువోణము" అంటారు. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొందురు. ఓణం ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది.  ఇది కేరళ యొక్క ఆచారములు , సంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు , భోజనం , సర్పాకారపు పడవ పందెములు , కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజు , ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు.  మగవారు ఒక చొక్కా , ముండు అని పిలవబడే లుంగీ వంటి క్రింది ఆచ్చాదనను , స్త్రీలు ముండు , నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ , రవికె ధరిస్తారు.  ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ , వర్షపు పువ్వుల పండుగ , పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది.  చరిత్ర ప్రకారం , మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా , సిరిసంపదలతో ఉన్నారు , ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితో పాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ , మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి , తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు. మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు.  ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు , తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు  కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో , ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది , ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు.   ఓణంలో ఆకట్టుకునే మరోక ముఖ్య విశేషం  వల్లంకలి  అనబడే సర్పాకారపు పడవల పందెము , ఇది పంపానదిలో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ , అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది.  ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది , ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య), కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు , కయ్యంకలి , అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో , పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. కైకొట్టికలి , తుంబి తుల్లాల్ అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. కుమ్మట్టికలి , పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి. ఓనక్కోడిగా పిలవబడే ఆ రోజున ధరించే కొత్త దుస్తులు , ఓణం సద్య , అని పిలవబడే విస్తారమైన విందు ఓణం ప్రత్యేకతలు. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపైన అన్నముతో పాటు కనీసం నాలుగు రకముల పదార్ధములు వడ్డించబడతాయి. సాంప్రదాయక ఊరగాయలు , అప్పడములు కూడా వడ్డిస్తారు. పాలు , చక్కెరతో చేసిన 'పాయసం' సాధారణంగా వడ్డించబడుతుంది. దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా ఉంటాయి. ఓణం సమయంలో , ప్రజలు వారి ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులతో రంగవల్లులు అలంకరిస్తారు , దీనిని పూక్కలం అంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు పువ్వులను సేకరించి వాటిని పెద్ద పెద్ద ఆకృతులలో అలంకరించే పని అప్పగించబడుతుంది. ఈ పూల ఆకృతులను తయారుచేయటానికి ఓణం రోజు పోటీలు జరుగుతాయి. ఇది సాధారణంగా 1.5 మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటాయి. ఈ ఆకృతిలో భాగంగా సాధారణంగా ఒక దీపం ఉంచుతారు. ఇటీవలి కాలంలో , ఈ పువ్వుల ఆకృతులు సాంప్రదాయక వృత్తాకారముల నుండి కేరళ ప్రజల జీవితాల యొక్క సాంస్కృతిక , సామాజిక విషయములను ప్రతిబింబిస్తూ విలక్షణమైన ఆకృతులుగా పరిణామం చెందాయి. వల్లంకలి (సర్పాకార పడవ పందెము) ఓణం సమయంలో జరిగే మరియొక ముఖ్యమైన కార్యక్రమం. వీటిలో అరంముల బోటు రేసు , నెహ్రూ ట్రోఫీ బోటు రేసు ప్రముఖమైనవి. దాదాపు 100 మంది పడవవాండ్లు అతి పెద్దవి , అందమైన సర్పాకార పడవలు నడుపుతూ ఉంటారు , ఆ నీటిపైన పయనించే సర్పాకార పడవలను వీక్షించటానికి సమీప ప్రాంతముల నుండి , దూర ప్రాంతముల నుండి స్త్రీలు , పురుషులు వస్తారు. వినాయక చవితి పండుగ సమయంలో హిందువులు గణేశుని బొమ్మలను ప్రతిష్ఠించినట్లుగా ఓణం సమయంలో , కేరళలోని హిందువులు త్రిక్కకర అప్పన్ (వామనుని రూపంలో ఉన్న విష్ణువు) మూర్తిని తమ ఇళ్ళలో ప్రతిష్ఠిస్తారు.  కేరళలో ఉన్న అన్ని వర్గముల వారు ఈ పండుగ జరుపుకోవటంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఓణం పండుగ హిందూమతం నుండి ఉద్భవించి దానితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ , ఈనాడు ఈ పండుగను హిందువులు , ముస్లిములు , క్రైస్తవులు సమానమైన ఉత్సాహముతో జరుపుకుంటున్నారు. ఈ వేడుక సమయంలో కేరళలోని హిందూ దేవాలయములలో అనేక దీపములు వెలిగించబడతాయి. దేవాలయముల ఎదుట ఒక తాటి చెట్టును నిలబెట్టి దాని చుట్టూ కొయ్య దుంగలను నిలబెట్టి ఎండు తాటి ఆకులతో కప్పుతారు. త్యాగము చేసి మహాబలి నరకమునకు వెళ్ళిన దానికి గుర్తుగా ఒక కాగడాతో దీనిని వెలిగించి బూడిద చేస్తారు.