ఇమ్మడి రవి మామూలోడు కాదు.. సజ్జనార్ నోట సంచలన విషయాలు!

ఇమ్మడి రవి.. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు మార్మోగుతోంది. రిలీజ్ అయిన సినిమాను రిలీజైనట్లుగానే నెట్ లో పెట్టేసి కోట్లు దండుకున్న ప్రముఖ పైరసీకారుడు. అతడి నేరం పైరసీ ఒక్కటే అనుకున్నారింత కాలమూ. అయితే ఆయన నేరాల చిట్టా చాల పెద్దదే ఉందంటున్నారు. బెట్టింగ్ యాప్ ల నుంచి మారుపేరుతో డ్రైవంగ్ లైసెన్సు, పాన్ కార్డులు పొందడం నుంచీ వేల సంఖ్యలో సబ్ స్క్రైబర్ల డేటా చోరీ చేయడం వరకూ ఐబొమ్మ రవి నేరాల చిట్టా చాలా పెద్దేదే ఉంది. ఈ వివరాలన్నీ హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరానికి చెందిన రవి.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అంతే కాదు అతడి పాన్ కార్డు కూడా ప్రహ్లాద్ అనే పేరుమీదే ఉంది. తొలి నుంచీ కూడా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఐబొమ్మ రవి, ఎంతో ముందు చూపుతో కరేబియన్ ఐలాండ్ పౌరసత్వం కూడా తీసుకున్నాడు.   ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు. తన పైరసీ నెట్ వర్క్ ను విస్తరించుకున్నాడు. అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లు పెట్టి.. టెలిగ్రామ్ యాప్ లో కూడా పైరసీ సినీమాలను అప్ లోడ్ చేశారు. ఈ పైరసీ ముసుగులో అన్లైన్ బెట్టింగ్ నూ ప్రమోట్ చేశాడు.   అదెలా అంటే.. ఐ బొమ్మ సైట్ ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు. అంతే కాదు.. ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చి పోలీసులు అతగాడి కోసం గాలింపు చేపడితే..  దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ చాలెంజ్ చేశాడు.  అయితే పోలీసులు వదలలేదు.. నెలల పాటు శ్రమించి, అతడి ఆచూకీ శోధించి ఎట్టకేలకు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు.  ఇక ఐబొమ్మను ఎంకరేజ్ చేసి ఫ్రీగా సినిమాలు చూసిన వారి డేటా మొత్తం చోరీ చేశాడు.  ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మ ను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీ కి గురైంది. ఈ వివరాలన్నీ సజ్జనార్ వెల్లడించిన తరువాత ఇంత కాలం ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసిన వారిలో ఆందోళన మొదలైంది. సినీ ప్రముఖులు చిరంజీవి సహా అందరూ ఐబొమ్మ రవి అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లేలా చేసిన ఐబొమ్మ రవి అరెస్టు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. పోలీసు శాఖకు కృతజ్ణతలు చెబుతున్నారు. అంత వరకూ బానే ఉంది. కానీ ఐబొమ్మ సబ్ స్క్రైబర్ల డేటా చోరీ ద్వారా ఇటు జనాలనూ దగా చేశాడు రవి.  సబ్ స్క్రైబర్ల డేటా అమ్ముకోవడం ద్వారా సంపాదించిన సొమ్ముతోనే  పెద్ద పెద్ద సర్వర్లను మెయిన్ టైన్ చేశాడు రవి. ఆ రకంగా చూస్తే సినిమా వాళ్ల కంటే జనమే ఎక్కువ నష్టపోయారని సజ్జనార్ చెబుతున్నారు. 

ఐ బొమ్మ ర‌వికి భార్యే బొమ్మాళి?

పెళ్లాం చెబితే వినాలి అంటారు. ఐ బొమ్మ నిర్వాహ‌కుడు ఇమ్మ‌డి  ర‌వి పెళ్లాం చెప్పింది విన‌క పోవ‌డం వ‌ల్లే  అడ్డంగా బుక్ ఐపోయాడా? అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఇమ్మ‌డి ర‌వి ఫ్రాన్స్ లో ఉంటాడు. అత‌డి భార్య తో అత‌డికి విబేధాలున్నాయి. దీంతో అత‌డు న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో ప‌డ్డాడు. ఎలాగైనా స‌రే వాటి నుంచి బ‌య‌ట ప‌డ్డానికి ప్ర‌త‌య‌త్నం చేసిన అత‌డు ఇండియా వ‌చ్చాడు. ఇలాంటి అనైతిక‌ప‌రులు కూడా న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల నుంచి బ‌య‌ట  ప‌డాల‌నుకుంటారా? అన్న మాట అటుంచితే.. ఈ విష‌యం గుర్తించిన ర‌వి భార్య‌, అత‌డి జాడ పోలీసుల‌కు చూపించేసింది. దీంతో అత‌డ్ని అరెస్టు చేసి రిమాండ్ కి త‌ర‌లించారు పోలీసులు. ఇక్క‌డ  అంద‌రూ అంటోన్న మాట ఏంటంటే ఎంత వాళ్ల‌యినా స‌రే పెళ్లాం చెబితే వినాలి. భార్య‌ని కాద‌ని బ‌తికి బాగు ప‌డ్డ వారు చ‌రిత్ర‌లో లేరు అన్న కామెంట్లు చేస్తున్నారు. క‌నీసం భార్య‌తో సెటిల్మెంట్ చేసుకుని ఉన్నా స‌రిపోయేది త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు ఉన్నా  సెటిల్ చేసుకోకుండా ఇక్క‌డి పోలీసుల‌తో ఎదురు తిరిగిన‌ట్టు భార్య‌తోనూ ఎదురు తిర‌గాల‌ని ట్రై చేసిన ర‌వి తాను తీసిన గోతిలో తాను ప‌డడం  చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అప్ప‌టికీ ర‌వి అకౌంట్లో కోట్లాది రూపాయ‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందులో కొంత భాగ‌మైన భార్య‌కు ఇచ్చి వ్య‌వ‌హారం చ‌క్క పెట్టుకోకుండా ఇలా బుక్ అయిపోయాడేంట‌ని జ‌నం ఒక‌టే గుస గుస‌. ర‌వి ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఇప్ప‌ట్లో ఇత‌డు చిక్క‌డ‌న్న నిర్దార‌ణ‌కొచ్చారు సామాన్య జ‌నం. కానీ ఇక్క‌డే అత‌డి త‌ల‌రాత తిర‌గ‌బ‌డింది. బలవంతమైన సర్పం చ‌లి చీమ‌ల చేత చిక్కి చస్తుందని సమతీశతకంలో చెప్పినట్లుగా ఎంత తెలివిగ‌ల‌వాడైనా స‌రే ఒక్కోసారి త‌మ‌కు అత్యంత ద‌గ్గ‌ర్లో ఉండే భార్య‌ల ముందు బొక్క‌బోర్లా  ప‌డుతుంటాడ‌న‌డానికి ఐబొమ్మ రవి అరెస్టు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని అంటున్నారు చాలా మంది.

రజనీ, బాలయ్యలకు ఇఫీ సన్మానం ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

ప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలను ఇఫీ సన్మానించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలో  గోవా వేదికగా జరగనున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ వేడులలలో వీరిని సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన  ఈ ఇరువురీ చలనచిత్ర పరిశ్రమలో అర్ధశతాబ్ధ ప్రయాణం పూర్తి చేసుకున్నారన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీరిని సన్మానించనున్నట్లు తెలిపారు.  రజనీకాంత్, బాలకృష్ణ  50 ఏళ్ల సినీ ప్రస్థానం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైలు రాయిగా పేర్కొన్న ఆయన..  వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నట్లు తెలిపారు.  ప్రతిష్ఠాత్మక ఇఫి వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి.

ఐబొమ్మ రవి అరెస్టు.. సజ్జనార్ కు చిరంజీవి సహా సినీ ప్రముఖుల ధ్యాంక్స్

తెలుగు సినీ పరిశ్రమ ఉనికికే ముప్పుగా ఐబొమ్మ వెబ్ సైట్ పరిణమించిన సంగతి తెలిసిందే. అటువంటి ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేయడంతో టాలీవుడ్ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఐబొమ్మ రవిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు నేడు అతడిని పోలీసు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ  నేపథ్యంలో ఐబొమ్మ రవిని  అరెస్టు చేసినందుకు సినీ ప్రముఖులు సీపీ సజ్జనార్ ను కలిసి థ్యాంక్స్ చెప్పారు.  మెగా స్టార్ చిరంజీవి,  నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు సోమవారం (నవంబర్ 17)న సీపీ సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు పోలీసుల పనితీరును ఈ  ప్రశంసించారు. కాగా ఆ తరువాత సీజీ సజ్జనార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా వీరు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జనార్ రవిని అరెస్టు చేసిన సమయంలో ఆయన వద్ద నుంచి మూడు కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. అయితే సినిమాల పైరసీ ద్వారా ఐబొమ్మ రవి 20 కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు తమ  వద్ద సమాచారం  ఉందని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మరింత లోతైన దర్యాప్తు జరుపుతామన్నారు. రవి అరెస్టు సందర్భంగా అతడి నుంచి కొన్ని హార్డ్ డిస్క్ లు, లాప్ టాప్ సీజ్ చేశామన్నారు. రవి వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లలో దాదాపు 21 వేల సినిమాలు ఉన్నాయన్నారు. అలాగే దాదాపు 50 వేల మంది సబ్ స్క్రైబర్ల డేటా కూడా ఉందని చెప్పిన సజ్జనార్.. ఇది చాలా ప్రమాదకరమన్నారు.  కాగా సినిమాల పైరసీ మాత్రమే కా కుండా.. రవి భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ న కూడా ప్రమోట్ చేసినట్లు సజ్జనార్ తెలిపారు. రవికి సంబంధించి ఎవరివద్దనైనా ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. 

ఆంధ్రా కాశ్మీర్ ఎక్కడుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ కూ ఒక కాశ్మీర్ ఉంది తెలుసా? ఏటా పెద్ద సంఖ్యలో పర్యటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. ఆంధ్రాకాశ్మీర్ కు పర్యాటకులు వెల్లువెత్తేందుకు ఒక సీజన్ ఉంది. ఔను శీతాకాలంలో ఆంధ్రాకాశ్మీర్ ను వెతుక్కుంటూ పర్యాటకులు తరలివస్తారు.  చల్లటి వాతావరణం లో మరింత చలి ప్రదేశాలను సందర్శించాలని పర్యాటకులు భావిస్తుంటారు. ఇంతకీ ఆ ఆంధ్రాకాశ్మీర్ ఏదంటే.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత చలి ప్రాంతంగా ప్రాచుర్యం పొందిన లంబసింగి. ఔను ఉమ్మడి విశాఖ జిల్లాలోని లంబసింగిని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. శీతాకాలంలో ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. చలితిరగడంతో ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది.    ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న లంబసింగిలో   250 కుటుంబాలు నివసిస్తున్నాయి. అటువంటి చిన్న గ్రామమైన లంబసింగికి ఏటా   పది పదిహేను లక్షల మంది పర్యాటకులు  వస్తుంటారు.  శీతాకాలంలో సగటున రోజుకు పది నుంచి 20వేల మంది ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాక చలి తీవ్రత అధికంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి జనవరి మధ్య శీతాకాలంలో ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించడానికే పర్యాటకులు పోటెత్తుతుంటారు.  అసలు ఇక్కడ ఎందుకు ఇంత చలి ఉంటుందీ అంటే.. పలు కారణాలు చెబుతుంటారు.  ఈ గ్రామం రెండు కొండల మధ్య ఉండటం,  సహజంగా ఏటవాలుగా ఈ గ్రామంలోకి చలిగాలి రావడం మేఘాలు లోపలకు చొచ్చుకు వచ్చే  అవకాశం లేకపోవడంతో వాతావరణం చల్లగా ఉంటుంది.  దీంతో సహజంగా శీతాకాలంలో కనిపించే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు అవుతుంటాయి అయితే ఈ గ్రామానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయి.  లంబసింగి గ్రామంలో  శీతాకాలం నాలుగు నెలల పాటు చలి తీవ్రత  అధికంగా ఉంటుంది.  ఇక్కడ  మైనస్  డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం కద్దు. సీతాకాంలో సాధారణంగా  ఉదయం 10 గంటల వరకు సూర్యుడు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడు.  దీంతో చలి తీవ్రతతో పాటు చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు సుతిమెత్తగా తాకే  దృశ్యం ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3280 అడుగుల ఎత్తులో ఉంటుంది.   ఈ ప్రాంతంలో పర్యాటన శాఖతో పాటు   ప్రైవేట్ రంగంలో కూడా రిసార్ట్లు హోటల్స్ రావడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది.   నవదంపతులు లంబసింగిని హనీమూన్ స్పాట్ గా భావిస్తున్నారు.  ఇటీవలీ కాలంలో ఒడిస్సా ఛతిస్గడ్ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర నుంచి నూతన జంటలు పెద్ద సంఖ్యలో లంబసింగికి వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.  లంబసింగి విశాఖ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖ నుంచి నర్సీపట్నం వరకు 100 కిలోమీటర్లు మైదాన ప్రాంతంలో ప్రయాణం చేస్తే మిగిలిన 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది.    వెండి మబ్బుల పాల సంద్రం..  చెరువుల వెనం ఇక లంబసింగి పరిసరాల్లో కూడా బోలెడన్ని సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో  ఇండియా స్విట్జర్లాండ్ గా చెప్పుకునే చెరువుల వెనం గ్రామం ఒకటి.  లంబసింగికి  కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కొండ ఎగువనున్న ఈ గ్రామంలో ఉదయం 10 గంటల వరకు మంచు మేఘాలు, పాలసముద్రంలా కనిపిస్తాయి.  దీంతో చాలామంది పర్యాటకులు తెల్లవారుజామున లంబసింగి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆనందపరవశులౌైతారు.  ఇటీవలే ఏపీ టూరిజం అక్కడకు స్థానిక గిరిజనుల ద్వారా నేరుగా వాహనాలను నడుపుతోంది దీంతో వయసు పైబడిన వారు కూడా ఈ ప్రకృతి అందాలను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.   అలాగే లంబసింగికి సమీపంలో  ఉన్న తాసంగి రిజర్వాయర్ కూడా తప్పనిసరిగా వీక్షించాల్సిన దర్శనీయ స్థలం. ఇక్కడ రిజర్వాయర్ దాటుతూ జిప్ లైన్ ఏర్పాటు చేశారు.  రిజర్వాయర్ పైనుంచి జిప్ లైన్ లో  వెళ్లడం ఒక ప్రత్యేక అనుభూతిగా పర్యాటకులు చెబుతారు.  ఇక ఈ ప్రాంతంలోని చారిత్రాత్మక అవశేషాలు కూడా పర్యాటకులకు ఆసక్తికలిగిస్తాయి.  స్వతంత్ర పోరాట సమయంలో అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్టు ఆనవాళ్లు ఉన్నాయి ఇక్కడకు సమీపంలో రూథర్ఫర్డ్ అనే బ్రిటిష్ మేజర్ నివాసం ఉందనీ, అక్కడే  అల్లూరి సీతారామరాజును మట్టుపెట్టినట్టు చరిత్ర చెబుతోంది దీనికి తగ్గట్టు ఇప్పటికీ రూథర్ఫర్డ్ నివాసం ఉన్న గెస్ట్ హౌస్, శిబిరాలు కనిపిస్తాయి. ఇక మహాభారత కాలంలో పాండవులు కూడా ఇక్కడ సంచరించినట్టు స్థానికులు చెప్తుంటారు ఇక్కడ గిరిజన ప్రజల సంప్రదాయాలు నివాస వ్యవహారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి స్థానికుల థింసా  డాన్స్ మరొక ప్రత్యేక ఆకర్షణ.  స్థానిక గిరిజనులతో పాటు పర్యాటకులు థిసా డాన్స్ చేస్తూ ఆనందపరవశులు కావడం కద్దు. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఏపీ టూరిజం ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేసింది.  ఇతర హోటల్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి.  ఒకప్పుడు పరిమితంగా వచ్చే పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి.  చల్లని వాతావరణంలో వేడి వేడి టీ... టిఫిన్ లాంటి వంటకాలతో పాటు బెంబు చికెన్ ఇక్కడ పర్యాటకులు అత్యంత ఇష్టపడే వంటకం.  గిరిజనుల ఇళ్లల్లో కూడా నివాసం ఉండే రీతిన హోం స్టే లను   పర్యాటకశాఖ ఏర్పాటు చేసింది. ఇవి అదనపు ఆకర్షణగా మారాయి. 

భవిష్యత్ లో జ్ణానపీఠ్, పులిట్జర్ స్థాయికి రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు.. చంద్రబాబు

రామోజీరావును ఎక్స్ లెన్స్ కు ప్రతిరూపంగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. రామోజీ జయంతి సందర్భంగా ఆదివారం (నవంబర్ 16) రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ప్రసంగిస్తూ.. రామోజీరావు స్ఫూర్తితో తెలుగుభాష పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. రామోజీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు.  రామోజీ జయంతి సందర్భంగా ఆ అక్షరయోధుడికి ఘన నివాళులర్పిస్తున్నానన్న చంద్రబాబు  రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.   రామోజీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధం అన్న చంద్రబాబు  ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు.  ఆయన జీవితంలో ఏ వ్యక్తిని చిన్న ఫేవర్ అడగిన సందర్భం లేదన్నారు. జనహితం కోసం ఏ పార్టీ నాయకులతోనైనా నిర్మొహమాటంగా మాట్లాడేవారనీ, నిఖార్సయిన జర్నలిజంతో తెలుగుభాషకు ఆయన చేసిన చేవలు చిరస్మరణీయమనీ చంద్రబాబు చెప్పారు.  ప్రతిపక్షం బలహీనంగా ఉంటే తానే అపోజిషన్ గా ప్రజల తరఫున పనిచేస్తానని రామోజీరావు చెబుతుండేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.   ఐదు దశాబ్దాలుగా విశేష ప్రజాదరణతో ఈనాడు నడుస్తోందంటే అందుకు రామోజీరావు సంకల్పమే కారణమన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా విలువల విషయంలో రామోజీ ఎన్నడూ రాజీ పడలేదనీ, ప్రజాహితం కోసం ప్రభుత్వాలతో పోరాడారనీ చంద్రబాబు అన్నారు.  50 ఏళ్ల తర్వాత ఏం చేయాలో ఆయన ఇవాళే ఆలోచించే దార్శనికత రామోజీ సొంతమన్న చంద్రబాబు.. ఆయన దూరదృష్టికి  రామోజీ ఫిల్మ్ సిటీ నిదర్శనమన్నారు.  జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సేవారంగం, కళలు, సంస్కృతి, యువ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారతలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డులు ఇవ్వడం స్పూర్తిదాయకమన్న చంద్రబాబు . ఈ రామోజీ  ఎక్సలెన్స్ అవార్డు భవిష్యత్తులో జ్ఞానపీఠ్, పులిట్జర్ స్థాయికి చేరుకోవాలని  చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలం గాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

భక్త జనసంద్రంగా మారిన శ్రీశైలం

అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం కార్తీక మాసం నాల్గవ సోమవారం (నవంబర్ 17) మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు.  శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి  4 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.  కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో  ఆలయ అధికారులు భక్తులకు   పాలు, ప్రసాదాలు అందచేస్తున్నారు. ఆలయ పురవీధులన్నీ భక్తులతో సందడిగా మారిపోయాయి. ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోవడంతో భక్తులు మల్లన్న దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి  అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేసింది.   రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.  ఇలా ఉండగా సోమవారం (నవంబర్ 17) సాయంత్రం జరగాల్సిన తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో  తెప్పోత్సవాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. . కార్తీక నాల్గవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

సీవీ ఆనంద్ వివరణ.. ఎమోజీ వివాదానికి తెర!

సోషల్‌ మీడియా వేదికగా నెలకొన్న అపోహలపై హోం శాఖ స్పెషల్‌ సీఎస్‌ సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. గత రెండు నెలలుగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు సీవీ ఆనంద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సీవీ ఆనంద్ పోస్టు చేసిన ఒక ఎమోజీయే. దీనిపై వివరణ ఇచ్చిన సీవీ ఆనంద్.. దాదాపు రెండు నెలల క్రితం తన పోస్టు కారణం గా బాలకృష్ణ అభిమా నులు–విమర్శకుల మధ్య చర్చలు, వాగ్వాదాలు జరిగాయనీ, తనపై కూడా విమర్శలు వచ్చాయనీ పేర్కొన్న ఆయన నగర పోలీసు వ్యవహారాలు, కేసులు, వివిధ ఘటనలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేందుకు తన కార్యాలయంలో పని చేస్తున్న ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్  చేసిన పొరపాటు అది అని వివరణ ఇచ్చారు.  సెప్టెంబర్‌ 29న జరిగిన ప్రెస్ మీట్ అనంతరం బాలకృష్ణపై వచ్చిన ఒక పోస్టుకు అతడు ఇచ్చిన ఎమోజీ రిప్లై పూర్తిగా అనవసరమైనదనీ, అది తనకు తెలియకుండానే జరిగిందని సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదం గురించి తనకు తెలిసిన వెంటనే ఆ పోస్టును తొలగించడమే కాకుండా.. వ్యక్తిగతంగా బాలకృష్ణకు ఒక సందేశం ద్వారా క్షమాపణ తెలిపానని ఆనంద్ పేర్కొన్నారు.  బాలయ్య, చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున  సినిమాలు చూసి పెరిగానన్న ఆయన  వారందరిపట్ల తనకు గౌరవం, అనుబంధం ఉందన్నారు. ఆ ఎమోజీ పోస్టు చేసిన తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ను తొలగించినట్లు తెలిపారు.  దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ఆయన బాలయ్య అభిమానులు, నెటిజన్లను కోరారు.  

మదీనాలో ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

మృతులంతా ఇండియన్సే అత్యధికులు హైదరాబాదీయులే  సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనమయ్యారు. మృతులంతా భారతీయులే. మరణించిన వారిలో అత్యధికులు హైదరాబాద్ వాసులని తెలుస్తోంది. మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులతో వెడుతున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.   మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో వారు గాఢ నిద్రలో ఉన్నారు. మక్కా నుండి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తుండగా బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. మృతులలో 11 మహిళలు, 10 మంది పిల్లలూ ఉన్నారని తెలుస్తోంది.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది.   సీఎం రేవంత్ దిగ్భ్రాంతి సౌదీ అరేబియాలో  భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురై పలువురు మరణించడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతులలో అత్యధికులు హైదరాబాద్ వాసులు ఉండటంతో వెంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలని డీజీపీని ఆదేశించారు.  కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ  అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.   సీఎం అదేశాలతో  సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో  తెలంగాణకు  చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.  కాగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 

తిరుమల దర్శనాలు.. ఫిబ్రవరి కోటా విడుదల వివరాలు!

తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాలు, గదుల కోటాకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి.   శ్రీ‌వారి ఆర్జిత సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మంగళవారం (నవంబర్ 18)  ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20 దయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చుని పేర్కొంది.  ఈ సేవా టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. వారికి టికెట్లు మంజూరవుతాయని తెలిపింది. ఇక  ఆర్జిత సేవా టికెట్లు నవంబర్ 21న విడుదల చేయనున్నట్లుతెలిపింది.  కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను నవంబర్  21 ఉదయం 10 గంటలకు  ఆన్ లైన్ లో విడుదల చేయ‌నున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక వర్చువల్ సేవ టికెట్ల కోటా కూడా 21నే విడుదల చేయనున్నట్లు  పేర్కొన్న టీటీడీ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు తెలిపింది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను నవంబర్ 24న  శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అదే నెల24న  విడుదల చేయనున్నట్లు పేర్కొంది.వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను కూడా నవంబర్ 24నే విడుదల చేయనుంది.  ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అదే నెల 25న  తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను నవంబర్ 25న  ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది.  టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీ‌వారి మాత్రమే ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులకు సూచించింది. 

విశాఖలో సన్ ఇంటర్నేషనల్ రూ.150 కోట్ల ఇన్వెస్ట్ మెంట్

విశాఖ వేదికగా జరిగిన భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది. అందులో భాగంగానే సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం మేరకు సన్ ఇన్ టర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ 150 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖలో తమ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు సన్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ ఏపీ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ పై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు 150 కోట్ల రూపాయల ఇన్ వెస్ట్ మెంట్ తో తమ సంస్థ ఏర్పాటు చేయనున్న మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ ద్వారా దాదాపు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.  ఈ ఒప్పందం మేరకు సన్ ఇన్ టర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ విశాఖలో హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు శాఖల నుంచి హోటల్స్ రంగంలో అవసరమైన అనుమతులు, ఆమోదాలు, క్లయరెన్స్ ల విషయంలో సహకారం అందిస్తుంది. అలాగే హోటల్ రంగం అభివృద్ధి నిర్దిష్ట కాలవ్యవధిలో ఎలాంటి ఆటంకాలూ సజావుగా సాదేందుకు దోహదం చేస్తుంది. 

వంగవీటి రంగా కుమర్తె పొలిటికల్ ఎంట్రీ

వంగవీటి రంగా కుమార్తె వ ఆశాకిరణ్ తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం(నవంబర్ 16) ఉదయం ఆమె వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించారు.  రాధా రంగా మిత్రా మండలి ఆధ్వర్యంలో తన తండ్రి రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు.  ఇక నుంచీ తాను పూర్తిగా ప్రజలతో మమేకమౌతాననీ, .ప్రజలకు ఏ కష్టం వచ్చినా  అండగా ఉంటాననీ ఆశాకిరణ్ ఈ సందర్భంగా చెప్పారు.  కులం,మతం బేధం లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తివంగవీటి మోహన రంగా అన్న ఆమె, ఆయన  రాజకీయ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు పేర్కొన్నారు.    కాగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  ఇప్పటి వరకు వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో వంగవీటి రాధా కూడా శాసన సభ్యుడిగా విజయం సాధించారు. ఆ తరువాత   ఆయన వరుసగా రెండు సార్లు ఓడిపోయారు.   ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పుడు వంగవీటి ఆశాకిరణ్ తన రాజకీయ ప్రవేశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. 

రోడ్డు ప్రమాదంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మృతి

విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ క్రీడాకారిణి దుర్మరణం పాలైంది. రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న సత్యజ్యోతి విజయనగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లిమర మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన శివజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారణి. కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు కోసం తన సోదరి గాయత్రితో కలిసి స్కూటీపై బయలుదేరారు . విజయనగరం సమీపంలోని వైఎస్‌ఆర్ నగర్ దాటిన తర్వాత, ఎదురుగా వేగంగా వస్తున్న ఓ లారీ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె సోదరి గాయత్రి గాయపడ్డారు. ప్రతిభామంతురాలైన క్రీడాకారిణి సత్యజ్యోతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడంతో  ఆమె స్వగ్రామం కొండవెలగాడలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. సత్యజ్యోతి మృతి పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులు

విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో నాలుగువేల 380 కోట్ల రూపాయలకు ఏడు ఎంవోయులు కుదిరాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్‌టైల్స్,   రీసైక్లింగ్,  గార్మెంట్స్,   సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు.  విశాఖపట్నం,  చిత్తూరు,  గుంటూరు,  శ్రీ సత్యసాయి,  అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో   మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి.అలాగే చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏర్పాటుతో  ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది.  ఇక శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా   రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  అదే విధంగా గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి.  విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900  మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ వందమందికి ఉపాధి కల్పించనుంది.  ఇక సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు  ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.  టెక్స్‌టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్‌ కు తొలిసారి తీసుకు రానుంది.విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి  .సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 

తెలుగు.. తేనెలొలుకు.. జపాన్ నోట తెలుగు మాట

విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. మన తెలుగు భాష పట్ల కూడా విదేశీ ప్రతినిథులు, రాయబారుల ఆసక్తిని, అనురక్తిని పెంచింది. తెలుగు పలుకుబడి, నుడికారం పట్ల మమకారం పెంచింది.  జపాన్‌  రాయబారి ఓనో కెయిచ్చి ఏకంగా తన తెలుగులోనే ప్రసంగాన్ని  ప్రారంభించి అందరినీ విశ్మయపరిచారు. జపాన్‌ దేశంతో వాణిజ్య సంబంధాలపైన ఆయన ప్రసంగించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నందుకు తాను చాలా గౌరవంగా, గర్వంగా భావిస్తున్నానన్నారు. ఈ సదస్సు ద్వారా జపాన్‌, భారత్‌ కంపెనీలు పరస్పర సహకారం అందిపుచ్చుకోవడంపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాలన్నింటినీ ఆయన తెలుగులోనే చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు  తెలుగు భాష పట్ల  తనకున్న అభిమానాన్ని ఆయన భావోద్వేగభరితంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు.  తనను ఆహ్వానించినందుకు కృతజ్ణతలు అని పేర్కొన్న ఆయన..  తెలుగులో ఇదే తన మొదటి ప్రసంగం అన్నారు.  జపాన్‌,ఆంధ్రప్రదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలు ఈ సదస్సు ద్వారా మరింత బలోపేతమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  స్టీల్‌, ఫార్మా, రిన్యూవబుల్‌ ఎనర్జీ రంగాల్లో, శ్రీసిటీ, టయోమా ప్రీఫెక్చూర్‌ సంస్థలతో వాణిజ్య సహకారం కొనసాగిస్తున్నామన్నారు.

విజన్, ఇన్నోవేషన్, జీల్, యాస్పిరేషన్, గ్రోత్.. వైజాగ్ కు చంద్రబాబు కొత్త భాష్యం

విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.  సాగర తీరనగరంలో జరిగిన ఈ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. శుక్ర, శనివారాలలో (నవంబర్ 14, 15) రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో  .లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్వలతో పాటుగా పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ సదస్సు సందర్భంగా విశాఖకు చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు.  వి అంటే విజన్‌, ఐ అంటే ఇన్నోవేషన్‌, జడ్‌‌కి జీల్‌ అంటే ఉత్సాహం, ఏ అంటే యాస్పిరేషన్‌, జీ అంటే  గ్రోత్‌  అని అభివర్ణించారు. విశాఖకు చంద్రబాబు చెప్పిన కొత్త భాష్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఇక దీనిపై  తెలుగు దేశం పార్టీ   చంద్రబాబు, లోకేష్  కలిసి వైజాగ్ నగరానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో అది మరింత స్పష్టమైంది. ఈ మధ్యనే వైజాగ్ అంటే గూగుల్ అని చెప్పుకున్న జనం ఇప్పుడు వైజాగ్ అంటే .. ఒక విజన్ తో వినూత్నంగా, ఉత్సాహంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి చేయబడుతున్న నగరం" అని చెప్పుకుంటున్నారంటూ సామాజిక మాధ్యమ వేదికలో ఎక్స్ లో పోస్టు చేసింది. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు గిరిజన సంప్రదాయాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సు విశాఖ నగరాన్ని సందడిగా మార్చింది. సదస్సు ప్రాంగణంలో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రముఖులు సదస్సు బోర్డుల వద్ద ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఏపీ పెవిలియన్‌లోకి అడుగుపెట్టగానే, అది ఒక ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించిందని పలువురు ప్రతనిథులు పేర్కొన్నారు.   

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. సిట్ విచారణకు రానా దగ్గుబాటి, విష్ణు ప్రియ

తెలంగాణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఈ కేసులో  ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియలు శనివారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.  విష్ణు ప్రియ   మూడు బెట్టింగ్ యాప్ లను   ప్రమోట్ చేసినట్లుగా సిట్ గుర్తించింది.ఈ నేపథ్యంలోనే   ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.  విచారణ సందర్భంగా విష్ణుప్రియ తన బ్యాంక్ అక్కౌంట్ వివరాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లను సిట్ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. అలాగే బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కోసం ఆమె కుదుర్చుకున్న ఒప్పందాలపై సిట్ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ ద్వారా విష్ణుప్రియకు చెల్లింపులు ఎలా, ఎవరి ద్వారా అందాయి అన్న విషయాలపై సిట్ ఈ విచారణలో ఆరా తీసినట్లు తెలిపింది.  కాగా  ప్రముఖ హీరో దగ్గుబాటి రానా కూడా శనివారం ఈ కేసులో విచారణకు సిట్ ఎదుట హాజరయ్యారు. రానా కూడా తన బ్యాంక్ స్టేట్ మెంట్లు సిట్ కు సమర్పించారు. తాను ప్రమోట్ చేసింది స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ మాత్రమే ననీ, అది చట్టవిరుద్ధం కాదని రానా తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది.న 

ఏపీలో రేమాండ్స్ ఇన్వెస్ట్ మెంట్

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతి మరో లెవెల్ కు చేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న  సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా  రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీకి అదనంగా 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శ్రీసిటీని రాష్ట్ర అభివృద్ధికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్న ఆయన  సదస్సు వేదికపై నుంచే  రేమాండ్స్ గ్రూప్‌కు చెందిన 3 ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీసిటీలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన 5 కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు. శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవగాహన ఒప్పందాలు  కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు   దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక టౌన్‌షిప్‌ అయిన శ్రీసిటీ  నుంచే  డైకెన్, ఇసుజు, క్యాడ్బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు  తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు శ్రీసిటీకి రావాలన్నారు. ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ పరికరాల కంపెనీల నుంచి రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.  గత రెండు రోజులుగా జరిగిన సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, మొత్తంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో   22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని చంద్రబాబు వివరించారు.  త్వరలోనే శ్రీసిటీకి మరో 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో 50కి పైగా దేశాలకు చెందిన కంపెనీలు శ్రీసిటీ నుంచి పనిచేస్తాయనీ,  తద్వారా లక్షన్నర మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.  రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు 2014-19 మధ్య కాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని సీమకు తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నామనీ,  ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా రాబోతున్నాయి తెలిపారు. అనంతపురం జిల్లాకు రేమాండ్స్ సంస్థ రావడం శుభపరిణామమన్న ఆయన,  కియా సమీపంలోనే రేమాండ్స్ ఆటో కాంపోనెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.   

విశాఖ భాగస్వామ్య సదస్సులో లోకేష్ పై పారిశ్రామిక వేత్తల ప్రశంసలు

విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐసీసీ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులకు గేట్ వేగా మారింది.  ఈ సదస్సు ఇంత విజయవంతంగా జరగడానికి, ఈ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తడానికి వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ నారా లోకేష్ అంటున్నారు. ఈ మాట తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు కాదు.. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న, కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులూ చెబుతున్నారు.  రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో ఒప్పందాలను ఖరారు  కావడం, వారితో సమన్వయం చేయడంలోనూ లోకేష్ కీలక పాత్రపోషించారు. అందులో సందేహం లేదు. విశాఖలో భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడానికి చంద్రబాబు ట్రాక్ రికార్డ్, విజన్ రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో తరలిరావడానికి ఒక కారణమైతే.. లోకేష్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చూపిన నిబద్ధత, అందుకోసం చేసిన కృషి మరో ప్రధానకారణమంటున్నారు.    ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సహా సీనియర్ కేంద్ర మంత్రులూ గుర్తించారు. అందుకే రాష్ట్ర ప్రగతి విషయంలో వారు చంద్రబాబు విజన్ ను ఎఫిషియెన్సీనే కాకుండా.. లోకేష్ ప్రతిభనూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆయన చూపిన చొరవనూ ప్రశంసలతో ముంచెత్తారు.   ఆదానీ గ్రూప్ ఏపీలో నలభైవేల కోట్ల రూపయాలు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, ముందు ముందు మరింత ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించడం వెనుక లోకేష్ చోరవ, ఆయన కనబరిచన శ్రద్ధ, అందించిన మద్దతు కారణమని ఆ సంస్థ ప్రతినిథులే పేర్కొన్నారు.   ఎస్ వైఆర్ఎమ్ఏ ఎస్జీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ ఎస్ గుజ్రాల్ లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తమ కంపెనీకి ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు, క్లియరెన్సులు కేవలం పధ్నాలుగు రోజుల్లోనే వచ్చాయనీ, దీని వెనుక ఉన్న చురుకైన పాత్ర లోకేష్ దేనని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి అపూర్వమైన చురుకైన చర్యలు తీసుకువచ్చినందుకు ఆయన లోకేష్‌ను ప్రశంసించారు.