విజన్, ఇన్నోవేషన్, జీల్, యాస్పిరేషన్, గ్రోత్.. వైజాగ్ కు చంద్రబాబు కొత్త భాష్యం
విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. సాగర తీరనగరంలో జరిగిన ఈ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. శుక్ర, శనివారాలలో (నవంబర్ 14, 15) రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో .లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్వలతో పాటుగా పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.
ఈ సదస్సు సందర్భంగా విశాఖకు చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. వి అంటే విజన్, ఐ అంటే ఇన్నోవేషన్, జడ్కి జీల్ అంటే ఉత్సాహం, ఏ అంటే యాస్పిరేషన్, జీ అంటే గ్రోత్ అని అభివర్ణించారు. విశాఖకు చంద్రబాబు చెప్పిన కొత్త భాష్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై తెలుగు దేశం పార్టీ చంద్రబాబు, లోకేష్ కలిసి వైజాగ్ నగరానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో అది మరింత స్పష్టమైంది. ఈ మధ్యనే వైజాగ్ అంటే గూగుల్ అని చెప్పుకున్న జనం ఇప్పుడు వైజాగ్ అంటే .. ఒక విజన్ తో వినూత్నంగా, ఉత్సాహంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి చేయబడుతున్న నగరం" అని చెప్పుకుంటున్నారంటూ సామాజిక మాధ్యమ వేదికలో ఎక్స్ లో పోస్టు చేసింది.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు గిరిజన సంప్రదాయాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సు విశాఖ నగరాన్ని సందడిగా మార్చింది. సదస్సు ప్రాంగణంలో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రముఖులు సదస్సు బోర్డుల వద్ద ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఏపీ పెవిలియన్లోకి అడుగుపెట్టగానే, అది ఒక ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించిందని పలువురు ప్రతనిథులు పేర్కొన్నారు.