టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులు
posted on Nov 16, 2025 7:05AM
విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో నాలుగువేల 380 కోట్ల రూపాయలకు ఏడు ఎంవోయులు కుదిరాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు. విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి.అలాగే చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది.
ఇక శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అదే విధంగా గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ వందమందికి ఉపాధి కల్పించనుంది.
ఇక సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. టెక్స్టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్ కు తొలిసారి తీసుకు రానుంది.విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి .సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.