అమెరికాలో తల్లీ కొడుకుల హత్య.. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత హంతకుడి గుర్తింపు

అమెరికాలో ఎనిమిదిన్నరేళ్ల కిందట జరిగిన తల్లీ కొడుకుల హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు కనిపెట్టారు. తొలుత ఈ కేసులో హతురాలి భర్తే నిందితుడిగా అనుమానించారు. హతురాలి తల్లిదండ్రులు సైతం అతడిపైనా ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేశారు. అయితే భర్తే హత్య చేశాడన్న ఆధారాలేవీ దొరకలేదు.   చివరికి హత్య జరిగిన ఎనిమిదిన్నరేళ్ల తరువాత అసలు నిందితుడిని కనిపెట్టారు. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత నిందితుడ్ని కనిపెట్టారు.   వివరాల్లోకి వెడితే..  అమెరికా న్యూజెర్సీలోని మెపుల్ షేడ్‌లోని ఫాక్స్ మెడో అపార్ట్‌మెంట్‌లో  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ  శశికళ నర్రా , ఆమె కుమారుడు  హత్యకు గురయ్యారు. అప్పట్లో అందరూ శశికళ భర్త నర్రా హనుంతరావే హంతకుడని అనుమానించారు.  ఎనిమిన్నరేళ్ల విచారణ తర్వాత అమెరికా పోలీసులు అసలు నిందితుడిని కనిపెట్టారు. హంతకుడిని  నజీర్ హమీద్ గా గుర్తించారు. నజీర్ కూడా ఇండియనే.  శశిఖళ భర్త హనుమంత్ రావు నర్రా మాజీ సహోద్యోగి. వృత్తిపరమైన వివాదాల కారణంగా  వ్యక్తిగత ప్రతీకారేచ్ఛతో  అతడే ఈ హత్యలకు పాల్పడ్డాడని అమెరికా పోలీసులు తెలిపారు. కాగా శశికళ, ఆమె కుమారుడిని హత్య చేసిన తరువాత నజీర్ అహ్మద్ ఇండియా వచ్చేశాడు.  ఇప్పుడు అతడిని తమకు అప్పగించాలంటూ  అమెరికా ఇండియన్ గవర్నమెంట్ తో సంప్రదింపులు చేస్తున్నది.  ఇంతకీ నజీర్ అహ్మద్ హంతకుడని ఎలా కనిపెట్టగలిగారంటే.. అతడు గతంలో పని చేసిన కంపెనీలో ఉపయోగించిన లాప్ టాప్ ద్వారా డీఎన్ ఏను సేకరించి.. క్రైమ్ ప్రదేశంతో ఉన్న రక్తపు మరకలతో సరిపోల్చడం ద్వారా నజీరే హంతకుడని గుర్తించారు.     

ఫార్ములా ఈ రేస్.. కేటీఆర్ కు బిగ్ షాక్!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బిగ్ షాక్ తగిలింది. ఈయన ఏ1 నిందితుడుగా ఉన్న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీకి తెలంగాణ గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే  ఈ కేసులో ఏ1 కేటీఆర్ ను ఏసీబీ నాలుగు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ ను ఐదుసార్లు విచారించింది. ఈ కేసుకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలెక్ట్రానిక్ ,ఇతర సాక్ష్యాలను ఏసీబీ సేకరించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో  తొమ్మిది నెలల పాటు అన్ని కోణాల నుంచీ పకడ్బందీగా  విచారణ జరిపిన ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి  రెడీ అవుతోంది.  కాగా ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన ఎమ్మెల్యే కనుక గవర్నర్ అనుమతి అవసరం. దీంతో ఏసీబీ కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ గత సెప్టెంబర్ 9న లేఖ రాసింది.  అలా లేఖ రాసిన పది వారాల తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు  గవర్నర్ నుంచి అనుమతి లభించింది.  అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీవోపీటీ అనుమతి కోరిన ఏసీబీ.. ఆ అనుమతి కూడా రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, అలాగే బీఎల్ఎన్ రెడ్డిలపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. 

శబరిమల ప్రవేశానికి వర్చువల్ క్యూపాస్

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ రోజు రోజుకూ అధికమౌతున్న నేపథ్యంలో   కేరళ ప్రభుత్వం   కీలక నిర్ణయం తీసుకుంది.  కేరళ హైకోర్టు సూచనల మేరకు కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది.  భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిబంధనలు ఈ నెల 24 వరకూ కచ్చితంగా అమలు చేయనున్నట్లు కేరళ సర్కార్ ప్రకటించింది.   శబరిమలకు ఒకేసారి అధిక సంఖ్యలో యాత్రికులు చేరకుండా నియంత్రించేందుకు రోజువారీ అనుమతులకు పరిమితి విధించింది.అలాగే వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70,000మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అదనంగా స్పాట్ బుకింగ్ ద్వారా మరో ఐదు వేల మందికి ప్రవేశం కల్పిస్తారు.   కోటా పూర్తయిన వెంటనే స్పాట్ బుకింగ్ నిలిపి వేస్తారు.  జరుగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి  వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి చేసింది. దీంతో ఈ పాస్ లేకుండా నీలక్కల్ చెక్‌పాయింట్ నుంచి శబరిమలకు ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.  భక్తుల  స్పాట్ బుకింగ్ కోసం నీలక్కల్, వండిపెరియార్ సత్రం, ఎరుమెలి,  చెంగన్నూర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీలక్కల్ వద్ద కోటా చాలా వేగంగా ముగిసే అవకాశం ఉన్నందున, యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచించారు.యాత్ర ప్రారంభించే ముందు పాస్ తమ వద్ద ఉన్నదని భక్తులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే నీలక్కల్, పంపా,  సన్నిధానం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలకు యాత్రి కులు  సహకరించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తుల కోసం 04735-14432 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశారు.  బరిమల యాత్రను మరింత క్రమబద్ధంగా, భద్రతగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ భూమిపై నడయాడిన దైవ స్వరూపం పుట్టపర్తి సాయిబాబా.. చంద్రబాబు

ఈ భూమిపై మనం చేసిన, మనకు తెలిసిన   దైవ స్వరూపం     సత్యసాయి బాబా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  ప్రేమ, సేవ, శాంతిలకు బాబా నిలువెత్తు నిదర్శనమన్నారు. పుట్టపర్తిలో  జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పాల్గొని ప్రసంగించారు.   ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం   సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని, ఆయన స్ఫూర్తిని, చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని రూ.100 విలువైన స్మారక నాణేన్ని, స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు.

చంద్రబాబు ఓ అద్భుతం.. ఆనంద్ మహేంద్ర

మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్ మహీంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను ఒక అద్భుతంగా అభివర్ణించారు. చంద్రబాబు పని తీరు, అభివృద్ధి కాముకత, దార్శనికత మాత్రమే కాకుండా ఆయన రూపొందించే విధానాలు కూడా గొప్పగా ఉంటాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా చంద్రబాబును ప్రశంసించడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా పలు సందర్భాలలో ఆయన నారా చంద్రబాబుపై పొగడ్తలు కురిపించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు.  చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే  ఈ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించిన  ఎస్క్రో వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అలాగే రాష్ట్రానికి ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న చంద్రబాబు దార్శనికతను అభినందించారు.  దీర్ఘకాలంగా ఆయన నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిత్సున్న తీరు పట్ల తాను ముగ్థుడైనట్లు పేర్కొన్నారు. కాగా ఆనంద్ మహేంద్ర ట్వీట్ పై స్పందించిన చంద్రబాబు ఆయనకు కృతజ్ణతలు తెలిపారు.  ఆయనను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.   

ఇది కదా విజ్ణత!

రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. మిగిలిన సమయంలో రాజకీయ విభేదాలు మరిచి రాష్ట్ర ప్రగతి గురించే ఆలోచించాలి. ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెప్పే మాట. ఇప్పుడు ఆయన, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అదే దారిలో నడుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన స్వల్ప వ్యవధిలోనే పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దార్శనికత, మంత్రి నారా లోకేష్ చొరవ, కృష్టి, పట్టుదల కారణమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం ఈ మొత్తం ఘనతను తమ ఖాతాలో వేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పుడు ఇలా పెట్టుబడులు వెల్లువెత్తడానికి తమ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలే కారణమని చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.  విశాఖ పెట్టుబడుల సదస్సు విషయంలో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఘనతా తమదేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.  అభివృద్ధి అన్నది సమష్టిగానే సాధించగలమని ఎప్పుడూ చెబుతూ ఉండే మంత్రి నారా లోకేష్ వైసీపీ క్లెయిములపై స్పందించిన విధానం ఆయనలో పరిణితికి అద్దంపట్టింది.  వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వం  కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను సమర్పిస్తే వాటిని అమలులోకి తీసుకురావడానికి, ఆ ఒప్పందాల క్రెడిట్ వైసీపీకే ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతంలోనే చెప్పిన లోకేష్ ఇప్పుడు తాజాగా మరో ముందడుగు వేసి.. గతంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతో సంప్రదింపులకు  ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.   గత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న పెట్టుబడిదారులతో ఇప్పటికే సంప్రదించామని చెప్పిన లోకేష్ వారికి అనుకూలమైన, విశ్వసనీయ వాతావరణాన్ని అందించేందుకు ప్రయత్ని స్తున్నామని చెప్పారు.  ఈ ఒక్కమాటతో రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము రాజకీయ తారతమ్యాలు చూపబోమని చాటారు.  ఇది కదా విజ్ణత అంటే అంటూ  నెటిజనులు పెద్ద ఎత్తున లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తూ, వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఏపీకి పెట్టుబడుల వరద లోకేష్ చలవే.. పొగడ్తలు కురిపించిన రాయిటర్స్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. ఈ కథనంలో యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టిన 16 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం వెనుక  లోకేష్ శ్రమ, సమర్థతను ప్రస్తావిస్తూ రాయిటర్స్ తన ప్రత్యేక కథనంలో.. 42 ఏళ్ల యువకుడు కీలకమని పేర్కొంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చేసిన 42 ఏళ్ల యువకుడు నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక శక్తిగా నిలిచారనీ, నిలుస్తున్నారనీ ఆ వ్యాసంలో పేర్కొంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉండటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన తండ్రి కావడం కలిసివచ్చిన అంశాలే అయినా లోకేష్ తన ప్రతిభ, సమర్థత, వేగం, చొరవతో ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చగలు గుతున్నారని పేర్కొంది.  భారత్‌లో డేటా సెంటర్ కోసం గూగుల్ స్థలాన్ని అన్వేషిస్తోందని తెలియగానే లోకేశ్ బృందం రంగంలోకి దిగి,  పన్ను విధానాలు, డేటా భద్రత వంటి అంశాలపై గూగుల్ లేవనెత్తిన సందేహాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి నివృత్తి చేయడమే కాకుండా స్పష్టమైన హామీలు ఇవ్వడం ద్వారా  నెలల వ్యవధిలోనే గూగుల్ తో  ఒప్పందం ఖరారైంది. అదేవిధంగా, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం అనుమతులు కూడా ఆఘమేఘాల మీద లభించేలా లోకేష్ చొరవ చూపారని ఆ ప్రత్యేక వ్యాసంలో రాయిటర్స్ పేర్కొంది.  లోకేష్ చెబుతున్న  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం నినాదం కాదనీ.. అది ఆచరణలో కనిపిస్తోందని ప్రశంసించింది.    రాయిటర్స్ రాష్ట్రప్రభుత్వ విజయాలు, అందులో తన పాత్రపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.  వ్యాపార నిర్వహణలో వేగం, పారదర్శకత, సాహసోపేతమైన సంస్కరణల పై తమ ప్రభుత్వం  దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.  

గుజరాత్ జైల్లో టెర్రరిస్టుపై ఖైదీల దాడి

గుజరాత్ జైల్లో ఉన్న టెర్రరిస్టు అహ్మద్ మొహియిద్దీన్  సయ్యద్ పై ఖైదీలు దాడి చేశారు. హైదరాబాద్ కు చెందిన ఆహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి విదితమే.  ఐఎస్‌కేపీ  ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలన్న కుట్రను ఛేదించిన ఏటీఎస్ పోలీసులు ఆ కుట్రలో కీలకంగా ఉన్న  ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతడిపై   జైలులో ఖైదీలు కొందరు   దాడి చేశారు.  అతడిని హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ.. అకస్మాత్తుగా వచ్చిన ఖైదీలు అహ్మద్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారని అధికారులు తెలిపారు.  దీని గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది.  దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు చేపట్టింది.   ఈ నెల 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ( ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్  కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్‌కు చెందిన ఓ డిపార్ట్‌మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్‌ అనే వ్యక్తితో టచ్‌లో  ఉండి,  అతడి ఆదేశాల మేరకు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ చదవిని మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ వీరిని విచారిస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

చెవిరెడ్డికి షాక్.. ఆస్తుల అటాచ్ కు సిట్ కు అనుమతి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ ప్రక్రియ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి  పలు చోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా మామెరపల్లె, మాచ్ పల్లి గ్రామాల పరిధిలో 27.06 ఎకరాలు, అలాగే తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరిట 3.14 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ ఆధారాలతో సహా కనుగోంది. ఆ ఆస్తుల అటాచ్ మెంట్ కోరుతూ సిట్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం అనుమతించిన మీదట.. ఆస్తుల అటాచ్ మెంట్ కోసం విజయవాడ ఎసీబీ కోర్టును సిట్ ఆశ్రయించింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో వాటిని అటాచ్ చేసింది.   ఇక ఇప్పడు తాజాగా ఈ కేసులో  కీలక నిందితుడైన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం  అక్రమంగా భారీగా విలువైన అస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది.  మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్ లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారణకు వచ్చిన సిట్.. ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.   చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,  కెవీఎస్ ఇన్ ఫ్రా ఎండీ గా ఉన్న భాస్కరరెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి, సీఎంఆర్ ఇన్ ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్ మెంట్ కు సిట్ అనుమతి కోరింది.   మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం  63. 72 కోట్ల పైగా ఆస్తులు కూడబెట్టిందనీ,  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను తగ్గించి,  లెక్కల్లో చూపకుండా  54.87 కోట్ల పైగా  మొత్తాన్ని  బ్లాక్ మనీగా మలిచారనీ సిట్ నివేదికలో పేర్కొంది.  ఈ నేపథ్యంలోనే నెల్లూరుజిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద  రిజిస్ట్రరైన ఆస్తుల ఆటాచ్ మెంట్  సిట్  ప్రభుత్వ అనుమతి కోరింది.  అలాగే చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిందితుడు చెవిరెడ్డి కుటుంబం భారీగా మోసపూరిత భూ లావాదేవీలకు పాల్పడిందని సిట్ పేర్కొంది.  వెండోడులోని అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్‌ఫ్రా ద్వారా  263.28 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకం, లో మోసం జరిగినట్లు నిర్దరించింది. తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి  నల్లధనాన్ని తెల్లగా మార్చారని  సిట్ తన నివేదిక పేర్కొంది.  మద్యం కుంభకోణం నుండి కమిషన్లు, కిక్ బ్యాక్ లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర, చర ఆస్తులు కూడబెట్టిందనీ,   అవినీతి నిరోధక చట్టం, , క్రిమినల్ లా లోని పలు సెక్షన్ల ప్రకారం ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని  సిట్ ప్రబుత్వాన్ని కోరింది. ఇందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల అటాచ్ మెంట్ కు వియవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు సిట్ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్  ఉత్తర్వులు జారీ చేశారు. 

హిడ్మా అనుచరుడు రావులపాలెంలో అరెస్ట్

కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలో వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు.. వాటికి సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మావోయిస్టుల అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, కాకినాడ, అమలాపురంలలో జరిపిన సోదాలలో మంగళవారం (నవంబర్ 18) ఏకంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు, బుధవారం ఉదయం అమలాపురం కు సమీపంలో ఉండే రావులపాలెంటో హిడ్మా అనుచరుడి మధవిహండా సరోజ్ ను అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన సరోజ్ రావులపాలెంలో ఏం చేస్తున్నాడన్న కోణంలో అతడిని విచారిస్తున్నారు.  ఆపరేషన్ కగార్ తో వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాటులతో ఉక్కిరిబిక్కిరి అయిన మావోయిస్టులు షెల్టర్ కోసం ఏపీని ఎంచుకున్నారా? ప్రణాళిక మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తలదాచుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నాంపల్లి కోర్టు నుంచి జగన్ ఎక్కడకు వెడతారో తెలుసా?!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం (నవంబర్ 20) తన అక్రమాస్తుల కేసు విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆయన తాడేపల్లి నుంచి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి  ప్రత్యేక విమానంలో బేంగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. ఆయన కోర్టులో గంట సేపు ఉంటారు. ఈ మేరకు జగన్ వ్యక్తిగత సిబ్బంది జగన్ నాంపల్లి కోర్టు హాజరుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. నాంపల్లి కోర్టు నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు విశ్రాంతి తీసుకుని అక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెడతారు.  

మావోలూ లొంగిపోండి.. మల్లోజుల పిలుపు

ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించడం పట్ల మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ బుధవారం (నవంబర్ 19) విడుదల చేసిన ఓ వీడియోలో.. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయనీ, దేశం కూడా ముందుకు సాగుతోందనీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మరణించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఆయుధాలు వీడి లొంగిపోవడమే మేలని ఆయన మావోయిస్టులకు హితవు పలికారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాల్సిందిగా పేర్కొంటూ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ వీడియోను గడ్చిరోలి పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.  

టెక్‌ శంకర్ సహా ఏడుగురు మావోయిస్టులు హతం

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో  బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు.  మంగళవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించగా మిగిలిన వారు అడవుల్లో దాక్కుని ఉన్నారనే సమాచారంతో  గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు చేపట్టిన సంయుక్త  కూంబింగ్ లో గుత్తులూరు హిల్ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి పోలీసులపై కాల్పులు జరిపారనీ, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారనీ లడ్డా వివరించారు.  మృతులలో మావోయిస్టుల ఐఈడీ నిపుణుడు మెట్టూరు జోగారావు అలియాస్‌  టెక్‌ శంకర్  కూడా ఉన్నట్లు తెలిపారు.  ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో  ముగ్గురు మహిళా మావోయిస్టులు  ఉన్నారన్నారు.    మావోయిస్టు టెక్‌ శంకర్‌   పేలుడు పరికరాల తయారీలో కీలక పాత్ర పోషించిచాడనీ,  గత కొన్నేళ్లుగా మావోయిస్టులు అమర్చిన అనేక లాండ్ మైన్ లరూపకల్పనలో కూడా  టెక్ శంకర్ దే కీలక పాత్ర అని లడ్డా చెప్పారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మిగతా సభ్యులను జ్యోతి అలియాస్ సరిత, సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మిలుగా గుర్తించారు.  

20న నాంపల్లి కోర్టుకు జగన్

భారీ జనసమీకరణకు వైసీపీ ప్రణాళిక లీక్ వైసీపీ అధినేత వెళ్లేది విచారణా? యుద్ధానికా అంటూ నెటిజనుల సెటైర్లు దాదాపు పుష్కరకాలం కిందట జగన్ పై   సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో చాలా వరకూ దీర్ఘకాలంగా స్దబ్దుగా ఉన్నాయి. ఆ కేసులలో ఎటువంటి కదలికా లేదు. అన్నిటికీ మించి ఆయా కేసుల విచారణకు జగన్ సీబీఐ కోర్టుకు హాజరై కూడా ఏళ్లు గడిచిపోయింది.  అయితే ఇప్పుడు ఆయన అనివార్యంగా సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.   ఇటీవల జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే బెయిలుపై ఉన్న జగన్ దేశం విడిచి వెళ్లాలంటే.. కోర్టు అనుమతి తప్పని సరి. అందుకే అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు అందుకు అనుమతి మంజూరు చేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ అలా అనుమతి మంజూరు చేస్తూ.. లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత సీబీఐ కోర్టుకు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని పేర్కొంది. అందుకు అంగీకరించిన జగన్.. లండన్ నుంచి వచ్చిన తరువాత మాత్రం.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు దానిని కొట్టివేయడంతో ఆయన కోర్టుకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీంతో గురువారం (నవంబర్ 20) ఆయన నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు.  గురువారం (నవంబర్ 20) ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆయన  నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.  అయితే ఆయన హాజరు ఒక నిందితుడు విచారణ కోసం కోర్టుకు హాజరు అవుతున్నట్లుగా కాకుండా, ఏదో కోర్టు మీదకు దండయాత్రకు వెళుతున్నారా అన్నట్లుగా భారీ జనసమీకరణకు పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ ప్రణాళిక లీక్ అయ్యింది. దీంతో పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు. నెటిజనులైతే జగన్ వెళ్లేది విచారణా, యుద్ధానికా అంటూ సెటైర్లు వేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా కోర్టు విచారణకు వెళ్లే సమయంలో సైలెంట్ గా వెళ్లి కోర్టులో హాజరయ్యామా? అన్నట్లు ఉండాలి కానీ, ఇలా పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి ఏదో యుద్ధానికి వెడుతున్నట్లుగా వెళ్లడం జగన్ కు మాత్రమే చెల్లిందంటున్నారు. ఇలా భారీ జనసమీరణతో వెళ్లడం ద్వారా ట్రాఫిక్ చిక్కులు ఏర్పడతాయనీ, దీంతో ఇక తదుపరి విచారణలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందవచ్చు అన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే కోర్టుల ముందు ఇలాంటి పప్పులుడకవు అంటున్నారు. దీనివల్ల ఆయన కోర్టు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఒక వేళ జగన్ బల ప్రదర్శన వికటిస్తే బెయిలు రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.  

మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఎన్ కౌంటర్ లో హతం?

ఛత్తీస్ గఢ్ వంతు అయిపోయింది.. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం వంతా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిన్నమొన్నటి వరకూ ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఎన్ కౌంటర్ల మోత వినిపించేది. నక్సల్ విముక్త భారత్ అంటూ చేపట్టినఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు వరుస ఎన్ కౌంటర్లతో మావోల ఏరివేత చర్యలు చేపట్టారు. దీంతో మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో ఇక్కడ పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో  అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంగళవారం (నవంబర్ 18)న మారేడుమిల్లి అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఆ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. తాజాగా బుధవారం ఉదయం ఇదే ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్‌ ఉందన్న ఆయన మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారం మేరకు మంగళవారం జరిపిన కూబింగ్ లో  మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు.  ఉండటంతో మంగళవారం ఆపరేషన్‌ చేశామని, మంగళవారం ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో  మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మావోయిస్టు షెల్టర్‌ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయని, 50 మంది మావోయిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక బుధవారం ఉదయం కూడా  ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారని తెలిపారు.  మరణించిన ఏడుగురు మావోయిస్టులలో మోస్ట్ వాంటెడ్ దేవ్ జీ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. 

చలికి తోడు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను కోల్డ్ వేవ్ వణికించేస్తున్నది. ఇప్పుడు చలికి తోడు భారీ వర్షాలు కూడా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేయనున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో  రానున్న రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కారణంగా రానున్న రోజులలో  ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని, దీంతో చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇవి మరింత పతనమయ్యే చాన్స్ ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తున్నది. వర్షాలు, చలిగాలులు ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇలా ఉండగా మంగళవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉదయం పది గంటలకు కూడా జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక అరకులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్టు

ఆపరేషన్‌ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాటులో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌ వైపు వచ్చారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఏపీలో 5 జిల్లాలో మకాం వేసిన మావోయిస్టుల కోసం ఇంటెలిజెన్స్, ఆక్టోపస్‌ బృందాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.  ఈ క్రమంలో ఏపీ నడిబొడ్డున పెద్ద సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. విజయవాడలో  28 మంది నక్సల్స్, కాకినాడలో ఇద్దరు, ఏలూరులో 15 మంది, కోనసీమ జిల్లాలో ఒక నక్సలైట్ ను పోలీసులు మంగళవారం (నవంబర్ 18)అరెస్టు చేశారు. మొత్తంగా ఏపీలో  మంగళవారం (నవంబర్ 18) ఒక్క రోజే 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ బుధవారం (నవంబర్ 19) కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  విజయవాడలో అరెస్టు చేసిన  వారిలో మావోయిస్టు అగ్ర నేత, మంగళవారం (నవంబర్ 18) ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గెరిల్లా టీమ్ కు చెందిన19 మంది, అలాగే ఇప్పటికీ అజ్ణాతంలో ఉన్న మరో మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ భద్రతా సిబ్బంది 9 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.   ఇక ఏలూరు గ్రీన్ సిటిలో కూడా  15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కాకినాడలో ఇద్దరిని, కోనసీమ జిల్లా అమలాపురంలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.  ఇలా అరెస్టైన 50 మందీ కూడా ఛత్తీస్‌గఢ్‌ వాసులేనని పోలీసులు తెలిపారు.  

ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ

ఐ బొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది.  ఐ బొమ్మ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున క్రిప్టో ‌తో పాటు హవాలా పద్ధతిలో కూడా సాగినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు.   మనీ మనీలాండరింగ్  తో పాటు విదేశీ మారకద్రవ్యం రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. దీంతో  కేసు దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది.  ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరింది. ఆ వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఈడీ ప్రకటించింది.. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈడి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాసి, కేసుకు సంబంధించిన సంపూర్ణ వివరాలు పంపించాలని కోరింది. పోలీసులు ఇప్పటికే నిందితుడు ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని, అతని ఖాతా నుండి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. అదే విధంగా విదేశీ బ్యాంక్ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు రవి ఖాతాలకు చేరినట్టు పోలీసులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ఛానళ్ల ద్వారా నెలకు  15 లక్షల వరకు రవికి చెందిన ఎన్ఆర్ఈ అకౌంట్‌కి బదిలీ అయినట్టు పోలీసు దర్యాప్తులో చేరింది.  ఈ నిధుల మార్గాలు, మూలాలు తదితర అంశాలపైఈడి దర్యాప్తు చేయనుంది. ఐబొమ్మ పైరసీ కేసు సైబర్ క్రైమ్ పరిమితులను దాటినందున,  మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది.  రానున్న రోజుల్లో ఈ  కేసులో మరిన్ని సంచలన విషయాలువెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

వెబ్ సైట్ యూజర్లను బెట్టింగ్ యాప్ లకు మళ్లించాడు!

ఐబొమ్మ, బప్పం   వెబ్ సైట్లతో సినిమాలను పైరసీ చేసిన  రవి.. ఆ వెబ్ సైట్ ల యూజర్లను బెట్టింగ్ యాప్ లకు   మళ్లించాడు.  బెట్టింగ్ యాప్​లను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా రెండు డొమైన్లను క్రియేట్ చేశాడు. వాటిలో ఒకటి హైదరాబాద్ అమీర్ పేట్ లో, మరోటి అమెరికాలోనూ రిజిస్టర్ అయి ఉన్నాయి.  రవి Tradersin.com, Makeindiashop.shop  అనే డొమైన్లు వాడి 1win, 1xbet వంటి బెట్టింగ్​యాప్స్​ప్రమోట్​చేశాడు. ఈ సంచలన విషయాలన్నీ ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.  ఈ రెండు డొమైన్ల ద్వారా ఆన్​లైన్​ బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి అతడికి డబ్బు వచ్చిందనీ,  ఆ డబ్బు నేరుగా ఇమ్మడి రవి పేరుతో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్​ఫర్​అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.  ఒక్కోసారి లక్షలు, మరోసారి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్​సైతం జరిగినట్టు  రవి అ  రిమాండ్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నారు.   ఐబొమ్మ నుంచి బెట్టింగ్ సైట్లకు వెళ్లేందుకు మధ్యలో ట్రాఫిక్ డైవర్షన్ డొమైన్లను రవి స్వయంగా ఏర్పాటు చేశాడనీ, యూజర్ ఐబొమ్మలో మూవీ చూస్తూ ఉంటే.. పక్కనే పాప్ -అప్ వచ్చి బెట్టింగ్ యాప్స్ లింకులు కనిపించేవని, ఆ లింక్ ను యూజర్లు క్లిక్ చేసిన ప్రతిసారీ రవికి   కమీషన్ వచ్చేదని తెలిపారు.  అయితే.. ఈ ట్రాఫిక్ డొమైన్లే చివరికి రవిని పట్టించాయని చెప్తున్నారు. పోలీసులు ఈ డొమైన్ల ట్రాఫిక్​ను ట్రాక్ చేసి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్​తో రవిని పట్టుకున్నారు.  రవిని అరెస్టు చేయకపోతే ఇలాంటి వెబ్​సైట్స్​మళ్లీ మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడనీ,  ఇది ఆగాలంటే రవిని రిమాండ్​కు తీసుకోవడం అవసరమనీ  పోలీసులు పేర్కొన్నారు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో ఈ డొమైన్లన్నీ ఒకే ఐపీ, ఒకే ఈ–మెయిల్, ఒకే మొబైల్ నంబర్​కు లింక్ అయినట్టుగా గుర్తించారు. సర్వర్లు ఎక్కడ పెట్టాలి, డొమైన్లు ఎలా మార్చాలి, బ్లాక్ అయిన సైట్స్​ను ఎలా మళ్లీ లైవ్ చేయాలి అన్నది రవి స్వయంగా చూసుకునేవాడని పేర్కొన్నారు.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను తో పాటుగా ఓటిటి వచ్చే కంటెంట్ మొత్తాన్ని కూడా పైరసీ చేసి తన వెబ్సైట్లో పెట్టినట్లు రవి అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  రవిని గుర్తించడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ కీలక పాత్ర పోషించినట్టు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.   విదేశీ పౌరసత్వం పొందడమే అతని క్రిమినల్ ఉద్దేశ్యాన్ని సూచిస్తోందని, దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు తీవ్ర ప్రమాదమని పోలీసులు ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.