తెలుగు సినిమాను వదలని పైరసీ భూతం

తెలుగు సినీమాను పైరసీ భూతం వదల నంటోంది. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్టు చేసి.. అతడికి సంబంధించిన పైరసీ సైట్లను మూసేసిన సంగతి తెలిసిందే. అయితే అంతలోనే మీవీరూల్జ్ వైబ్ సైట్ పైరసీ సినిమాలతో రెచ్చిపోయింది.  మూడు కొత్త సినిమాలు ప్రేమంటే, 12ఏ రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాయి గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు ఇలా విడుదలయ్యాయో లేదో, అలా గంటల వ్యవధిలో ఈ మూడు సినిమాల పైరసీలు మూవీరూల్జ్ లో ప్రత్యక్షమయ్యాయి.   ఒ క్కరోజులోనే, సినిమాలు విడుదలైన గంటల వ్యవధిలోనూ ఆ సినిమాల ప్రింట్లు అప్ లోడ్ కావడం సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా, తీవ్ర ఆందోళనకు లోను చేసింది.   థియేటర్లలో ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే క్యాం కార్డర్‌తో రహస్యంగా రికార్డ్ చేసిన వీడియోలని మూవీరూల్జ్ వెబ్ సైట్ అప్ లోడ్ చేసినట్లు గుర్తించారు.  ఈ కమ్‌కామ్ ప్రింట్లు బయటకు రావడమే కాకుండా వేల సంఖ్యలో డౌన్‌లోడ్ అవు తుండటం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. పైరసీ కేసుల్లో కీలక పాత్రధారిగా ఉన్న ఐబొమ్మ రవి కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతున్న ఈ సమయంలో  మూవీరూల్జ్ పైరసీ సినిమాలను ప్రసాదం చేసి సవాల్ విసరడం గమనార్హం.   టాలీవుడ్ సినిమాలు పైరసీ చేసి సినీ పరిశ్రమనే గడగడలాడించిన ఐబొమ్మ రవికి జనంలో హీరో రేంజ్ గుర్తింపు వచ్చంది.   రవిని సామాన్య జనం, కొందరు సినీ జనం కూడా  రాబిన్‌హుడ్‌తో పోలుస్తుండటం వెనుక సినీమా టికెట్ల ధరలు సామాన్యులు ధియోటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే భయపడే రేంజ్ లో ఉండటమే కారణమంటున్నారు.   ఒకవైపు రవిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తుండగా మరోవైపు కొత్తగా మరో వెబ్ సైట్ మూవీరూల్జ్  విడుదలైన మూడు సినిమాలు గంటల వ్యవధిలోనూ ప్రసారం చేయడం గమనార్హం.  

భారత్ లో ఏఐ సమ్మిట్.. ఎప్పుడో తెలుసా?

భారత్ ఏఐ సమ్మిట్ కు ఆతిథ్యం వహించనుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు.   దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోడీ  కీలక ప్రసంగం చేయడంతో పాటు, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని సనే టకాయిచిలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.  అందరికీ న్యాయమైన,  నాణ్యమైన భవిష్యత్ అనే అంశంపై ప్రసంగించిన మోడీ,  టెక్నాలజీ వినియోగం ఆర్థిక కేంద్రంగా కాకుండా మానవ కేంద్రంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయన  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో  సర్వజనం హితాయ, సర్వజనం సుఖాయ అనే నినాదంతో భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించారు. ఆ సదస్సుకు   జీ20 దేశాలను ఆహ్వానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో పారదర్శకత, మానవ పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి సూత్రాలతో ప్రపంచ ఒప్పందం అవసరమని మోడీ అన్నారు.  ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోడీ  దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో  ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో  వాణిజ్యం, పెట్టుబడులు, ఏఐ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్యా సహకారంపై చర్చించారు.  అలాగే ఇటలీ, కెనడా, జపాన్ ప్రధానులతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు.  

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కిడ్నాప్, దాడి

యువతలో రీల్స్, కామెంట్లు, లైకుల పిచ్చి వెర్రితలలు వేస్తున్నది. సోషల్ మీడియాలో తాము పోస్టు చేసిన రీల్స్ కు మామెంట్లు, లైకుల కోసం ఎంతకైనా తెగిస్తోంది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమే కాకుండా, తెలియని వారిపై దాడులు, కడ్నాప్ లకు పాల్పడడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్ లో ఇద్దరు బాలికలు, ఓ యువతి సోషల్ మీడియాలో లైకుల కోసం ఓ గ్యాంగ్‌గా ఏర్పడి,  యువతులను కిడ్నాప్ చేసి దారుణంగా కొడుతూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటన జబల్ పూర్ లో వెలుగు చూసింది.     ఓ యువతిని ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసి,  ఆమె జుత్తు పట్టుకుని విచక్షణారహితంగా కొడుతూ, కాళ్లతో తన్నుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. బాధితురాలి ఫిర్యాదులో రంగంలోని దిగిన పోలీసులు ఆ గ్యాంగ్ ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ లో 17 ఏళ్ల బాలికలు ఇద్దరు, ఓ యువతి ఉన్నారు. సామాజిక మాధ్యమంలో సెలిబ్రిటీలుగా మారాలన్న ఉద్దేశంతోనే వారీ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరు ఇంతకు ముందు కూడా ఇదే తరహాలో మరికొందరు యువతులపై దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

ప్రతి 20 రోజులకూ ఓ సారి విదేశీ ప్రయాణం.. ఐబొమ్మ రవి విచారణలో వెలుగులోకి కీలక అంశాలు

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి సినీ ప్రముఖులను గజగజ వణికించాడు.... పోలీసుల చేతికి చిక్కకుండా చుక్కలు చూపిస్తూ పోలీసులకే సవాళ్లు విసిరాడు. ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడైన సరే ఏదో ఓ రోజు పోలీసుల చేతికి చిట్కాల్సిందే... అలాంటిది పోలీసులకే సవాలు విసిరిన వాడిని వదిలేస్తారా... లేదు కదా... తగ్గేదేలే అనే టైపులో పోలీసులు కూడా విశ్వప్రయత్నం చేసి ఎట్టకేలకు ఐ బొమ్మ రవిని అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలోకి తీసుకొని కూడా విచారణ చేస్తున్నారు. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టైన రవి కస్టడీ మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో విచారణ తీవ్రత పెరిగింది.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ సజ్జనార్  సైబర్ క్రైమ్ కార్యాలయానికి చేరుకుని రవిని స్వయంగా విచారించారు. ప్రశ్నించారు. అనంతరం పోలీసులు రవిని బషీర్ బాగ్ లోని సీపీ ఛాంబర్‌కు తీసుకెళ్లి మరీ విచారించారు. ఈ సందర్భంగా  హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాస్   విచారణకు రవి సహకరించడం లేదనీ,  పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడని చెప్పారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారం రాబడుతున్నట్లు వెల్లడించారు.    సర్వర్ ఐపీలు నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ, ఎథికల్ హాకర్ల సహాయంతో వీటిని  గుర్తించే  ప్రక్రియ సాగుతోందన్నారు. త్వరలో అంతర్జాతీయ ఏజెన్సీలతో కలిసి సర్వర్ డేటా ఎక్స్‌ట్రాక్షన్ చేపట్టనున్నట్లు చెప్పారు. విచారణలో రవి ఆర్థిక వ్యవహారాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రతి 20 రోజులకు ఒకసారి రవి విదేశీ ప్రయాణాలు చేసినట్లు రికార్డులు లభ్యమయ్యాయన్నారు.   పైరసీ ద్వారా వచ్చిన డబ్బులను   క్రిప్టో ద్వారా స్వీకరించి వెంటనే ఖర్చు చేయడం రవి అలవాటని గుర్తించారు. రవి పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్లు, విదేశీ ఖర్చులపై   దర్యాప్తు జరుగుతోంది. ఐబొమ్మ రవికి సహాయం చేసిన వ్యక్తులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. రవి స్నేహితుడు నిఖిల్ వెబ్‌సైట్‌లో ఉపయోగించిన పోస్టర్లు, ప్రమోషనల్ మెటీరియల్ డిజైన్ చేసినట్లు గుర్తించారు.అదే విధంగా నిఖిల్, రవి వాళ్ల  చెల్లెలి ఖాతాకు పలుసార్లు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లు లావాదేవీల్లో బయటపడింది. ఈ ట్రాన్సాక్షన్ల నేపథ్యం ఏంటన్నదానిపైకూడా విచారణ జరుగుతోంది. అంతర్జాతీయ సర్వర్లు, విదేశీ లావాదేవీలు, క్రిప్టో ఫ్లోలు సహా అన్ని అంశాలపై సంయుక్తంగా సాగుతున్న  ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. ఐబొమ్మ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను త్వరలోనే బట్టబయలు చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.   

అంబర్ పేటలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య

ఓ  కుటుంబం మొత్తం ఆత్మహ్యకు పాల్పడిన విషాదఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటు చేసుకుంది.   బాగ్ అంబర్ పేటలోని మల్లికార్జున్ నగర్‎లో శ్రీనివాస్,  విజయలక్ష్మి దంపతులు వారి కుమార్తె శ్రావ్య నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.    శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా ఇటీవలే వారి పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుని మరణించింది. అంత వరకూ రామ్ నగర్ లో నివాసం ఉండే వీరు పెద్ద కుమార్తె మరణం తరువాత అక్కడ నుంచి అంబర్ పేటకు మారారు.  సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి..? ఏమైనా వివాదాలు ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. స్థానికుల సమాచారం మేరకు పెద్ద కుమార్తె మరణం తరువాత నుంచీ శ్రీనివాస్ కుటుంబం డిప్రషన్ లో ఉంది. తమను దేవుడు పిలుస్తున్నాడు, మేం కూడా మా పెద్ద కుమార్తె దగ్గరకు వెళ్లిపోతామని తరచూ చెబుతుండేవారు. దీంతో శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యకు మూఢ నమ్మకాలే కారణమని పోలీసులు పోలీసులు అనుమానిస్తున్నారు.  మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూఢ నమ్మకాలతోనే చనిపోయారా..? మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో పోలీ సులు ఆరా తీస్తున్నారు.  

కుప్పంలో డ్వాక్రా మహిళల ఛాయ్ రాస్తా అవుట్ లెట్.. ప్రారంభించిన నారా భువనేశ్వరి

ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపార వేత్త రావాలని, అందులోనూ మహిళలు ఎంటర్ పెన్యూర్ లుగా ఎదగాలన్న చంద్రబాబు సంకల్పం సాకారం అయ్యే దిశగా కుప్పంలో అడుగుపడింది.  కుప్పంలో డ్రాక్రా మహిళల నెలకొల్పిన చాయ్‌ రాస్తా అవుట్‌లెట్‌ శనివారం ఆరంభమైంది. ఈ రాస్తా చాయ్ ఔట్ లెట్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు.  .ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్‌ రాస్తా  రూపొందిందన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోందనీ,  దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.   కుప్పం డెవలప్‌మెంట్ ఆధారిటీ (కడా) మద్దతుతో   కుప్పంలో ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్ ప్రారంభం కావడం శుభపరిణామంగా అభివర్ణించిన భువనేశ్వరి, మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అధునాతన వ్యాపారాలు ఎంతో దోహపదపడతాయన్నారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటైన ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌ను ప్రారంభించిన భువనేశ్వరి మొదటి ఛాయ్‌ని కోనుగోలు చేసి తాగారు.  చాయ్ రాస్తా అవుట్‌లెట్‌లో రుచి, శుచి చక్కగా ఉన్నాయని  ప్రశంసించారు.  ఐఐఎం, ఐఐటి గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యంతో రూపొందిం చిన చాయ్ రాస్తా  చాలా సరికొత్తగా ఉందని  ఆమె అభినందించారు. 

37 మంది మావోయిస్టుల లొంగుబాటు

మవోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీశివధర్ రెడ్డి సమక్షంలో 27 మంది మావోయిస్టులు శనివారం (నవంబర్ 22) లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్రకమిటీ, ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మండుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు.  వీరు కాకుండా మరో 22 మంది దళ సభ్యులు కూడా లొంగిపోయారు.   కాగా లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, మావోయిస్టు సాంకేతిక విభాగం ఇన్ చార్జి అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ పరిణామం తెలంగాణలో శాంతి స్థాపనకు మరో ముందడుగుగా డీజీపీ అభివర్ణించారు.  లొంగిపోయిన 37 మందిలో ఆజాద్ గత 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ  ఏవోబీ ( ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.   పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మావోయిస్టులను లొంగిపోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మావోయిస్టులపై ప్రభావం చూపిందనీ, అందుకే నక్సలైట్లు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారనీ ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు.  లొంగుపోయిన నక్సలైట్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందనీ, సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.  లొంగిపోయిన మావోయిస్టులకు సంపూర్ణ రక్షణతో పాటు పునరావాసం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

పుట్టపర్తి సాయిబాబా స్ఫూర్తితో ముందుకు సాగాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సత్యం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.  సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందన్నారు.. పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. అంతకు ముందు పుట్టపర్తి  విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము  సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం  తన మహాద్భాగ్యంగా చెప్పారు.   సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రగణ్యుడన్న రాష్ట్రపతి  నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారన్నారు.  బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు లవ్ ఆల్..సర్వ్ ఆల్ అన్నది పుట్టపర్తి సాయిబాబా సిద్ధాంతమన్నారు.  సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలని పేర్కొన్నారు. వాటిని పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నారు.  సత్యసాయి బాబాతో  తనకు  మంచి అనుబంధం ఉందన్న ఆయన  తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారని చెప్పారు.  ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు... పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారన్నారు.   సత్యసాయి భక్తులు ఇప్పటికీ  అదే స్ఫూర్తిని కొనసాగించడం  సంతోషాన్నిస్తోందన్నారు చంద్రబాబు.   భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలని చంద్రబాబు అన్నారు.

సజ్జనార్ పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ బహిష్కృత నేత,  తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న  హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్లన్నారు. ఐబొమ్మ రవి అరెస్టుపై మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న సజ్జనార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి దమ్మున్నోడనీ, అందుకే ప్రజల మద్దతు చూరగొన్నాడనీ పేర్కొన్నాడు.  తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. ఇంతకీ సజ్జనార్ పై మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడానికి . ఆయన సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడమే కారణంగా కనిపిస్తోంది. ఐబొమ్మ రవి అరెస్టుకు కారణం అతడి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడమేనన్న తీన్మార్ మల్లన్న ఆమె సమాచారం ఇవ్వకుంటే రవిని పట్టుకోగలిగేవారా అని నిలదీశారు.  సినీమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచేయడం వల్లనే అంత ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూడలేని వారు ఐబొమ్మ రవికి మద్దతుగా నిలుస్తున్నారన్న  తీన్మార్ మల్లన్న వంద రూపాయల సినిమా టికెట్ ను వేలల్లో అమ్ముకునే నిర్మాతలతో కలిసి సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటుచేయడాన్ని తప్పుపట్టారు.  ఐబొమ్మ రవి అరెస్టు కాదు..  దమ్ముంటే దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు, కిడ్నాప్‌లు, ఆర్థిక నేరాలను ఆపి చూపించాలని సవాల్ చేశారు.  సీవీ ఆనంద్ కూడా   సైబర్ మోసాలు ఆగవని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 

డ్రోన్ల ద్వారా ఆయుధాల స్మగ్లింగ్!

ఢిల్లీ ఢిల్లీలో ఎర్రకోట వద్ద బాంబు పేలుడుపై దర్యాప్తు కొనసాగున్న సమయంలోనే మరో కుట్రను పోలీసులు భగ్నం చేశారు.  పాకిస్ఠాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారీగా ఆయుధాలను తరలిస్తున్న స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.   పాక్‌ ఐఎస్‌ఐతో నేరుగా సంబంధాలున్న ఈ ముఠా నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.    ఢిల్లీలో కొంతమంది భారీగా అక్రమ ఆయుధాలు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు డీసీపీ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని  పోలీసు  బృందం   పలు ప్రాంతాల్లో నిఘా ఉంచగా.. రోహిణిలో ఈ ఆయుధ మాడ్యూల్ గుట్టు బయటపడింది. నిందితులు డ్రోన్‌లను ఉపయోగించి పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పంజాబ్‌ సరిహద్దుల నుంచి తీసుకొచ్చిన ఈ ఆయుధాలను లారెన్స్‌ బిష్ణోయ్‌, బాంబిహా, గోగి వంటి గ్యాంగ్‌ సభ్యులకు అందజేయడానికి ఉద్దేశించినవిగా తేలింది.  నిందితుల నుంచి విదేశాల్లో తయారైన 10 అత్యాధునిక సెమీ ఆటోమెటిక్‌ పిస్టల్స్‌తో పాటు 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లభ్యమైన ఆయుధాలు టర్నీ, చైనాలో తయారైనవిగా తెలిపారు. ఈ ముఠాకు  చెందిన నలుగురిని అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆయుధాలను ఎవరికి విక్రయించారు, నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారనే వివరాలు రాబట్టేందుకు అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు.  నిందితులకు చెందిన మొబైల్‌ ఫోన్ డేటా, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

ఆరునెలలలోగా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం.. కేంద్రమంత్రి పెమ్మసాని

అమరావతి రైతుల సమస్యల పరిష్కారం విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే శనివారం (నవంబర్ 22) న త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సీఆర్డీయే కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో  గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ,  ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, రైతు జేఏసీ ప్రతినిధులు  పాల్గొన్నారు. భూముల రిజిస్ట్రేషన్, అభివృద్ధి పనులు వంటి వాటిపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు.  ఇటీవలే రైతు జేఏసీ ప్రతినిధులతో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమై రాజధాని రైతుల సమస్యలను సానుకూల దృక్ఫథంతో సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  రాజధానికి భూములిచ్చిన రైతులెవరికీ ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.  మొత్తం 69,421 మంది రైతులకు ఇప్పటి వరకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరు నెలలలోగా రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాస్పద భూముల్లో 20 ఎకరాలు కుటుంబపరమైనవి కాగా, మరో 45 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయన్నారు.  ఇప్పటికే రాజధాని పరిధిలో 90 శాతానికి పైగా కుటుంబాలకు ప్లాట్లను కేటాయించామని వెల్లడించారు. అన్ని సమస్యలనూ ఆరు నెలల్లోగా పూర్తి చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ఏ రైతుకూ అన్యాయం జరగకూడదన్నదే తమ లక్ష్యమని పెమ్మసాని స్పష్టం చేశారు. 

జైల్లో దస్తగిరికి బెదరింపుల కేసు.. అధికారులపై విచారణకు ఆదేశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన  దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి అప్పుడు కడప జైలు అధికారులుగా ఉన్న వారిపై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపై నాటి సూపరింటెండెంట్ ఐఎన్‌హెచ్ ప్రకాశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ కె.జవహర్‌బాబు, డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం (నవంబర్ 21) ఉత్తర్వులు  జారీ చేశారు.  విచారణాధికారిగా కోస్తాంధ్ర రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ   రవికిరణ్‌ను,  రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించారు. విచారణ పూర్తి చేసి మూడు నెలలలోగా  నివేదిక సమర్పించాలని వారిని ఆదేశించారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని, మరో కేసులో భాగంగా 2023 అక్టోబరు 31న కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబరు 28న జైలులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ముసుగులో వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిని జైల్లోకి అనుమతించారు. ఈ సమయంలోనే చైతన్యరెడ్డి  దస్తగిరిని బెదిరించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది.  ప్రస్తుతం ఐఎన్‌హెచ్ ప్రకాశ్ నెల్లూరులోని ఏపీ స్టార్స్‌లో, జవహర్‌బాబు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో, డాక్టర్ పుష్పలత కడప జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

గుడిలో దండల పెళ్లి.. యువ ఐఏఎస్ జంట ఆదర్శ వివాహం

కోట్లాది రూపాయల ఖర్చుతో ఆడంబరంగా, ఆర్భాటంగా వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో వాటన్నిటికీ దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు అత్యంత నిరాడంబరంగా వివాహబంధంతో ఒక్కటై ఆదర్శంగా నిలిచారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న టి.శ్రీ పూజ, మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆదిత్యవర్మల వివాహం శుక్రవారం (నవంబర్ 21) విశాఖలో జరిగింది. విశాఖ కైలాసగిరిపై  ఉన్న శివాలయంలో ఇరువురూ దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు.   ఈ వివాహ కార్యక్రమానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తరువాత వీరు నేరుగా విశాఖ వన్ టౌన్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలంలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు.  విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ  ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన ఈ ఇద్దరు అధికారులది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

విశాఖకు కాగ్నిజెంట్.. ఊహించిన దానికంటే ముందుగానే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్పీడ్  ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కృతిని పూర్తిగా వంటబట్టించుకుంది. అయితే  ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వాయువేగంతో ముందుకు సాగుతోందని మరోసారి నిర్ద్వంద్వంగా రుజువైంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు ఏదైనా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే.. వారి కంపెనీ కార్యకలాపలను వెంటనే ప్రారంభించేందుకు ప్రోత్సాహకాలు, అనుమతులు వంటివి అనూహ్య స్పీడ్ తో అందిస్తామని విస్పష్టంగా చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తున్నారు.   విశాఖలో భారీ పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాగ్నిజెంట్ ఊహించిన దాని కంటే చాలా ముందుగానే రాష్ట్రంలో తన కార్యకలాపాలు ప్రారంభించడం చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ అన్న మాటను చేతల్లో చూపిస్తున్నదని  స్పష్టంగా అవగతమౌతుంది   కాగ్నిజెంట్   విశాఖ సమీపంలోని కాపులుప్పాడలోని 21 ఎకరాల భూమిలో మెగా నిర్మాణాన్ని మొదట పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నందున, కాగ్నిజెంట్  వచ్చే ఏడాది  రెండవ త్రైమాసికం అంటే 2026 ఏప్రిల్ తురువాత వైజాగ్ లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా  వచ్చే ఏడాది జనవరి నాటితే తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందుకోసం తాత్కాలిక డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.   ప్రముఖ కంపెనీలను ఆహ్వానించడంలో ప్రభుత్వమే స్వయంగా ఇనీషియేటివ్ తీసుకుంటే..    పెట్టుబడిదారులు అంతకు మించి చొరవ, ఉత్సాహం చూపిస్తారు.  కాగ్నిజెంట్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.   కాగ్నిజెంట్  శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు వేచిచూడకుండా.. ముందుగా తాత్కాలిక భవనాల్లో కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఐటీ హిల్స్ లో   భవనాలను అద్దెకు తీసుకోడానికి రెడీ అయ్యింది. ఇందు కోసం తమకు అనువైన భవనాల ఎంపికకు కాగ్నిజెంట్ బృందం విశాఖకు చేరుకుంది కూడా. అంతే కాదు.. జనవరి  నుంచి 800 మందితో విశాఖలో ఆపరేషన్స్ కి కాగ్నిజెంట్ సమాయత్తం అవుతోంది. విశాఖలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న  వారు ముందుకు రావాలంటూ.. ఇప్పటికే తమ సిబ్బందికి సమాచారం ఇచ్చింది కూడా.   విశాఖలో  1,583 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తమ సంస్థ ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ప్రభుత్వానికి తెలిపింది.  దీంతో రాష్ట్రంలో యువతకు  ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడంతోపాటు పరోక్షంగా మరి వేల కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం కాగ్నిజెంట్ కు   భూములు కేటాయించింది. ఆ భూముల్లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. అయితే అంతకు ముందే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ ముందుకు రావడం చూస్తుంటే ఇన్వెస్టర్లకు రాష్ట్రప్రభుత్వంపై ఎంత విశ్వాసం ఉందో అర్థమౌతోంది. 

ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ విమానం

దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో  భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా..  దుబాయ్‌ ఎయిర్‌షోలో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్న వాయుసేన తేజస్ విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొంది.  ఇలా ఉండగా ఎయిర్ షోలో తేజస్ విమానం కూలిపోయి మంటలు చేలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

కుప్పంలో నారా భువనేశ్వరి ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సాధారణ ప్రయాణీకు రాలిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అందులోనూ రాష్ట్రంలో మహిళలకు ఉచిత  ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ స్త్రీ శక్తిపేర ప్రవేశ పెట్టిన పథకం కింద ఆమె ఆర్టీసీ బస్సులో తన ఆధార్ కార్డు చూపి ఉచితంగా ప్రయాణించారు. కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి  శాంతిపురం  నుంచి తుమ్మిసి గ్రామానికి వెళ్లేందుకు శుక్రవారం (నవంబర్ 21) ఆర్టీసీ బస్సు ఎక్కి మిగిలిన మహిళలతో పాటుగా తన ఆధార్ కార్డును  కండక్టర్ కు చూపి ఉచిత టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె  సహచర ప్రయాణీకులతో ముచ్చటించారు.  ఉచిత బస్సు పథకం ఎలా ఉందని ఆరా తీశారు.  ఈ పథకం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అదే సమయంలో వారు చెప్పిన విషయాలను ఎంతో శ్రద్ధగా ఆలకించారు.  జలహారతిలో  పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భువనేశ్వరి అభివర్ణించారు.  కుప్పం ప్రాంత ప్రజల దశాబ్దాల కలను చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. తాగు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎంతో శ్రమించి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చారన్నారు.   కేవలం నీటిపారుదలకే పరిమితం కాకుండా కుప్పం పారిశ్రామిక ప్రగతికి కూడా చంద్రబాబు బాటలు వేశారన్న భువనేశ్వరి,  ఈ ప్రాంతానికి  23,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలను తీసుకోచ్చారని వివరించారు.  పరిశ్రమలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుకు కుప్పం ప్రజల ఆశీస్సులు   ఎల్లప్పుడూ ఉండాలని   ఆకాంక్షించారు.

పాఠ్యాంశాలలో మళ్లీ నైతిక శాస్త్రం.. మంత్రి లోకేష్ ను ప్రశంసించిన నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం సంతోషంగా ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా సమగుట్ట పల్లిలోని విలువల బడిని ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆ పాఠశాల విద్యార్థులతో మమేకమయ్యారు.  ఈ సందర్భంగా విలువల బడి వ్యవస్థాపకుడు లెనిల్ ను అభినందించారు.  విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పించి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. తన చిన్నతనంలో  స్కూల్లో  నైతిక శాస్త్రం   ఒక పాఠ్యాంశంగా ఉండేదని గుర్తు చేసుకున్న ఆమె ఇప్పుడు రాష్ట్రపాఠశాలల్లో మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ను తీసుకువచ్చినందరకు లోకేష్ ను అభినందిస్తున్నాన్నారు.   రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డులు పెట్టడం చాలా సంతోషమన్న నారా భువనేశ్వరి నేటి సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. పిల్లలలో నైతిక విలువల పట్ల అవగాహన పెంపొందించే విషయంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలన్నారు.  తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తిని గమనించి  అందుకు అనుగుణంగా పిల్లల ఎదుగుదలకు దోహదపడాలన్నారు.